ఆంధ్రప్రదేశ్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసారి నిరుద్యోగ పట్టభద్రులే మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుగా ఒ వింత ప్రచారం ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతోంది. అంతేకాదు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపచేసేలా సామాజిక మాద్యమాల ఆ ప్రచారం తెగ వైరల్ అవుతోంది. అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చెబితే అది చేయాలి.. అదే అధికారాన్ని మన ద్వారా కట్టబెట్టే సమయం వచ్చినపుడు మనం ఏం చెబితే చట్టసభలకు వెళ్లేవారు అది చేసేలా చూసుకోవాలి.. ఇదే పట్టభద్రులు, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్న ప్రచారం. ఇంకా ఆ.. ప్రచారంలోనూ, ఓ నలుగురు పట్టభద్రులు కలిసినపుడు చర్చించుకునే మాటలేంటో ఒక్కసారి తెలుసుకుంటే.. ఏదైనా రాజకీయపార్టీ అధికారంలోకి రావడానికి అన్ని వర్గాల ప్రజలు కావాలి.. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం కొన్ని వర్గాలవారికే పనిచేయాలనే అధికార దాహం సూత్రాన్ని..ఈ సారి మనం కూడా అమలు చేయాలి.. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాలకు ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు కనిపించరు. కానీ ఏవైనా ఎన్నికలు వస్తే మాత్రం టక్కున వారంతా గుర్తుకొచ్చేసి వారికి తాయిలాలు ఏటిస్తే దారిలోకి వస్తారని ఆలోచిస్తారన్నట్టుగానే వ్యవహరిస్తున్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఆ తాజా సమాచారాన్ని, విషయాన్నే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ens live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా మీముందు ఉంచుతున్నాం.

ఒక్క అవకాశం కూడా తేడాగాళ్లకు ఇవ్వకూడదు.
ఏపీలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం కూడా తేడాగాళ్లకు ఇవ్వకూడదు. మన ఓట్లతో అధికారంలోకి వచ్చి ఓట్లు వేసిన మనల్నే అంటరానివారిలా చూస్తూ..కనీసం ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా ఏళ్లు గడిపేస్తున్న ప్రభుత్వానికి మనమేంటో, పట్టభద్ర నిరుద్యోగుల పవర్ ఏంటో చూపించాలనే మాట ఇపుడు ప్రతీ ఒక్కరి దగ్గర నుంచి బలంగా వినిపిస్తోంది. నేరుగా సామాజిక మాద్యమాల్లో ఇదే విషయమై ప్రత్యేకంగా చర్చలు కూడా పెడుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అధికారంలోకి రావడానికి మెజార్టీ రావడానికి యూత్ అవసరం కానీ..అదే యూత్ కి ఉపాది, ఉద్యోగాలు కల్పించాలంటే మాత్రం ఏళ్లకు ఏళ్లు సమయం కావాలా అని ప్రశ్నిస్తూ..ఇదే విషయంపై నిరుద్యోగులందరూ ఆలోచించే విధంగా వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు పట్టభద్ర నిరుద్యోగులు. దానిని పట్టభద్రుల తల్లిదండ్రులు కూడా సమర్ధిస్తూ వారు చేసే ప్రచారానికి తమవంతు సహాయం కూడా అందిస్తున్నారు. అంతేకాదు తాము చేసే అవగాహన ప్రచారంలో ఏమైనా తప్పుందా అంటూ కొందరు పెద్దల నుంచి సూచనలు సహాలు కూడా స్వీకరిస్తుండటం విశేషం.
భారీగా ఓటరు నమోదుకి ముందస్తు కార్యాచరణ..
త్వరలో జరగబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ సంఖ్యలో నిరుద్యోగ పట్టభద్రులు ఓటు నమోదు కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నట్టుగా తెలిసింది. దానికోసం డిగ్రీ పాసైన విద్యార్ధులు, నిరుద్యోగులు బ్యాచ్ లు వారీగా జిల్లాస్థాయి, నియోజకవర్గం, మండల, పంచాయతీ స్థాయిల్లో సామాజిక మాద్యమ గ్రూపులను ఏర్పాటు చేసి దాని ద్వారా సమాచారం సేకరించడంతోపాటు, ఓటు బ్యాంకుని భారీ మొత్తంలో సేకరించాలని చూస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. తద్వారా తమను మోసం చేసి పార్టీలకు, ప్రభుత్వాలకు ఈ సారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా సత్తాచూపించాలనే లక్ష్యంతో ముందుకి వెళుతున్నట్టుగా చెబుతున్నారు. విశేషం ఏంటంటే ఈ సారి ఎక్కడెక్కడో ఉన్న పట్టభద్రులను కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సొంత జిల్లాలకు రప్పించి మరీ ఓటర్లుగా నమోదు చేయించాలని నిరుద్యోగులు కంకణం కట్టుకున్నారంటే యువతలో వ్యతిరేక నినాదం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొందరు నేతలు, నాయకులైతే యూనివర్శిటీల్లో పీజీ చదివే ఓటరు పట్టభద్రుల జాబితాలు సేకరించే పనిలో పడ్డారు.
పార్టీలకు అతీతం నిలబడేవారికే పట్టం
ఈ సారి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు అతీతంగా అన్ని రంగాల సమస్యలపైనా నిరుద్యోగుల వాణి చట్టసభల్లో గట్టిగా వినిపించేవారికే ఓటు వేసి గెలిపించడం ద్వారా రాజకీయపార్టీలకు యువత బలం చాటి చెప్పడంతోపాటు, రానున్న ఎన్నికలు ఏ స్థాయిలో జరగబోతున్నాయో కూడా రుచి చూపించాలని యోచించే ఈ కార్యాచరణ మొత్తం చేస్తున్నట్టు తెలిసింది. పార్టీల పేరుతో నిలబడి గెలిచేవారంతా మళ్లీ పార్టీ చెప్పినట్టే వింటూ నిరుద్యోగ పట్టభద్రులను నట్టేట ముంచుతున్నారని విషయాన్ని బాగా గుర్తించిన వారంతా ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి గ్రౌండ్ లెవల్ లోనే పెద్ద నెట్వర్క్ నడుపుతున్నారనే విషయం బహిరంగ రహస్యం అయిపోయింది. ఒకప్పుడు నాయకుల వెంట తిరుగుతూ వారంతా ఏం చెబితే అది చేసే యువత సామాజిక మాద్యమాల పుణ్యమాని అన్ని విషయాలను నేరుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. దీనితో యువత ఎవరి వలన ఏం కోల్పోతున్నారో, ఏం పొందుతున్నారో కూడా ఎవరికి వారే తెలుసుకొని చైతన్యం పొందుతున్నారు.
తాయిలాలు, హామీల పప్పులు ఇకపై ఉడకవా..?
గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇపుడు జరగబోయే ఎన్నికలకు చాలా వ్యత్యాసమే కనిపిస్తున్నది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులు నిరుద్యోగులకు తాయిలాలు, పార్టీలు, హామీలు ఇస్తే గతంలో నేతలు అనుకున్న పనులు జరిగేవి. 2019 ఎన్నికల తరువాత సాధారణ ప్రజల నుంచి పట్టభద్రుల వరకూ అందరూ ప్రభుత్వం చేసే పనులను లోతుగా అధ్యయనం చేయడం మొదలు పెట్టడంతో తమకేమి కావాలో..ఎవరేమి చేస్తారనే కోణం లో ఆలోచించడం మొదలు పెడుతున్నారు. దీనితో ఈ సారి తాయిలాలు, హామీల పప్పులు ఉడికే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పైగా చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనలు, ఉపాది అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకే పీఆర్సీ సమయంలో రివర్స్ పీఆర్సీ ఇవ్వడంతోపాటు, హెచ్ఆర్ఏ, డీఏలు కుదించేసి కొత్త పేస్కేలు ఇచ్చినట్టుగా రికార్డుల్లో చూపడాన్ని కూడా నిరుద్యోగులు ఉద్యోగుల ప్రచారం ద్వారా తెలుసుకోవడం విశేషం.
ప్రభుత్వం నిరుద్యోగులు, పట్టభద్రుల విషయంలో అసలు ఏమీ పట్టనట్టుగా వుంటుందనే నిర్ణయానికి వీరంతా వచ్చేశారు. ఈ తరుణంలో పార్టీలు నిలబెట్టే అభ్యర్ధులు కాకుండా..మంచి వ్యక్తులను నిజంగా నిరుద్యోగుల కోసం పనిచేసి, కష్టపడే వారిని చట్టసభల్లోకి పంపాలని నిరుద్యోగులు గట్టిగా పనిచేస్తున్నారనే సంకేతాన్ని కూడా సామాజిక మాద్యమాల ద్వారా పంపుతుండం అటు రాజకీయపార్టీలకు, ఇటు ప్రభుత్వంలోని సలహాదారులకి, పరిశీలకులకు సైతం అంతుచిక్కడం లేదు. నిరుద్యోగుల మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందనేది ఈసారి జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలే తేల్చనున్నాయని అంటున్నారు.
ముఖ్యగమనిక..
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రచారాల విషయాలను, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యవహారాలను మాత్రమే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ప్రత్యేక కథనాలను అందిస్తున్నాం. ఈ విషయంలో సంస్థ యొక్క ఉద్దేశ్యం ఎంతమాత్రం లేదు. కాకపోతే ఏ ఎన్నికలు వచ్చినా వాటిలో ఓటింగ్ శాతం పెంచేందుకు సామాజిక భాద్యతగా మాత్రం ప్రజలు, పాఠకుల్లో మాత్రం చైతన్యం తీసుకువస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న తేడా, నిజమైన ప్రచారాలకు మీ మా మీడియా సంస్థకు ఎలాంటి సంబంధం లేదు పాఠకులు గమనించాలి.