విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నారు. గురువారం విమ్స్ ఆసుపత్రిలో ఆయన మొదటి డోస్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల మేరకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కోరనా వైరస్ ను పూర్తిగా నియంత్రించడానికి ప్రజలకు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. అదేవిధంగా వైద్యుల సూచనల మేరకు ప్రతీ ఒక్కరూ మాస్కు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారేంతవరకూ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వీడి అందరూ కరోనా వేక్సిన్ వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విమ్స్ సంచాలకులు సత్య వరప్రసాద్, తదితరులు ఉన్నారు.
శ్రీకాకుళం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి లో కలర్ డాప్లర్ మెషిన్ అందుబాటులోనికి వచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఏ.క్రిష్ణమూర్తి తెలియజేశారు. మంగళవారం ఆసుపత్రిలో ఆయన దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మెషిన్ ద్వారా శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ పరీక్షించుటకు ఉపయోగ పడుతుందన్నారు. శస్త్ర చికిత్సల నిపుణులు డా.అపరంజి దీనిని పర్యవేక్షణ చేస్తారని వివరించిన ఆయన సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి కొత్త ఆపరేషన్ థియేటర్ లో శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయన్నారు.ఈ యూనిట్ డాప్లర్ మెషిన్ వలన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిపుణులు, మత్తు వైద్య నిపుణులు డాప్లర్ మెషిన్ ఏర్పాటు పట్ల ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
కోవిడ్ వేక్సినేషన్ టీకాను వేసేందుకు జిల్లాలో 114 కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇందులో 105 ప్రభుత్వ ఆసుపత్రులు ( ప్రాథమిక, సామాజిక, పట్టణ, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు) తో పాటు 9 ఆరోగ్య శ్రీ అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులలో టీకాను పొందవచ్చని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టీకాను ఉచితంగా పొందవచ్చని, అదే ప్రైవేటు ఆసుపత్రులలో ఐతే రూ.250/-లు ఒక డోస్ నకు చెల్లించి ఈ వ్యాక్సినేషన్ పొందవచ్చని ఆయన స్పష్టం చేసారు. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45-59 మధ్య వయస్సు కలిగి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరూ కోవిడ్ వేక్సిన్ పొందేందుకు అర్హులని చెప్పారు. వ్యాక్సిన్ చేయించుకునేందుకు వచ్చేవారు ముందుగా వారి వివరాలను https://www.covin.gov.in ఆన్ లైన్ పోర్టల్ నందు నమోదు చేసుకొని తగిన గుర్తింపు వివరాలతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్ లతో వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి టీకాను పొందవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన అక్కులపేట, అక్కుపల్లి, అచ్యుతాపురం, బైదలాపురం, బత్తిలి, భామిని, బిట్టివాడ, బొద్దాం, బుడితి, బూరాడ, చొర్లంగి, దండుగోపాలపురం, దూసి, గంగువాడ, గోవిందపురం, గుప్పిటిపేట,కింతలి, కొత్తపల్లి, కురిగాం, నిమ్మాడ, పాతర్లపల్లి, రావాడ, రాజాపురం, రెంటికోట, సరుబుజ్జిలి, సిరిపురం, శ్రీకూర్మం, సైరిగాం, తాడివలస, తొగరాం, ఉర్లాం, వీరఘట్టం, వెంకటాపురం, అన్నవరం, బాలేరు, బాతువ, బట్టిగల్లూరు, బోరుభద్ర, బుడుంబోకాలనీ, చాపర, గుత్తావిల్లి, కరజాడ, కొలిగాం, కొర్లాం, కుసిమి, మాకివలస, యం.సింగుపురం, మండాకురిటి, మర్రిపాడు, యం.యస్.పల్లి, నౌపడ, బూర్జ, జి.సిగడాం, హిరమండలం, జలుమూరు, కంచిలి, కె.కొత్తూరు, యల్.యన్.పేట, లావేరు, మందస, మెళియాపుట్టి, నందిగాం, పోలాకి, ఆమదాలవలస, సంతబొమ్మాళి, సంతకవిటి, సారవకోట, తిలారు, వజ్రపుకొత్తూరు, కళింగపట్నం, బోరివంక, దోన్ భాయి, వంగర, పొగిరి, పొన్నాడ, గార, మురపాక, ఎచ్చెర్ల, సింగుపురం, బెలగాంలలో ఉచితంగా టీకాను పొందవచ్చని చెప్పారు. వీటితో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అయిన హరిపురం, నరసన్నపేట, పొందూరు, రణస్థలం, సీతంపేట, కోటబొమ్మాళి, కొత్తూరు, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పాతపట్నం, పలాస, సోంపేట మరియు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెల్త్ సెంటర్లయిన ఇచ్ఛాపురం, పాలకొండ, టెక్కలి, ఐ.ఏ.నాయుడు కాలనీ, మెట్టకీవలస మరియు శ్రీకాకుళం, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాయిన పలాస, గుజరాతీపేట, ఆదివారం పేట, బర్మాకాలనీ, దమ్మలవీధి, ఏరియా ఆసుపత్రులయిన పాలకొండ,రాజాం కేంద్రాలలో కోవిడ్ వేక్సినేషన్ టీకాను ఉచితంగా పొందవచ్చని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. అలాగే ఆరోగ్యశ్రీ అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులయిన బగ్గు సరోజిని దేవి ఆసుపత్రి, సింధూర, కిమ్స్ సాయి శేషాద్రి, జి.ఎం.ఆర్.వరలక్ష్మీ, అమృత, జెమ్స్, డా.గొలివి, పి.వి.యస్.రామ్మోహన్ రావు, రిమ్స్ ఆసుపత్రిలోని నెఫ్రో ప్లస్ నందు రూ.250/-లు చెల్లించి వేక్సిన్ పొందవచ్చని, ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన జేమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ మరియు జిల్లాలో మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జెమ్స్ ఆసుపత్రి సహాయ ఆర్.ఎం.ఓ డా.ప్రవీణ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బార్దార్ ల సూచనల మేరకు వైద్య శిబిరాలను సోమ వారం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బందికి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని, ఆయా శాఖలలో పనిచేస్తున్న మహిళలతో పాటు వారి కుటుంబ సభ్యులు వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలీస్ సిబ్బందికి ఎచ్చర్ల పోలీస్ కమ్యూనిటీ హాల్ లో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో జిల్లాలోని మహిళా పోలీసులతో పాటు, హోంగార్డు కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు అన్నీ పూర్తిగా ఉచితమని తెలిపారు. 14వ తేదీ వరకు మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు : ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జేమ్స్ ఆసుపత్రిలో జిల్లాలోని మహిళలు అందరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రవీణ్ తెలిపారు. ఈ వైద్య శిబిరాల్లో జిల్లాలోని మహిళా ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
శ్రీకాకుళం జిల్లాలో పెద్దఎత్తున చేపడుతున్న కోవిడ్ వేక్సినేషన్ టీకాను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకొని, కరోనా వైరస్ నుండి విముక్తి పొందాలని శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సీనియర్ సిటిజన్స్ వేక్సినేషన్ లో భాగంగా శనివారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ( రిమ్స్ ) లో శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు దంపతులు కోవిడ్ వేక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు కూడా వేక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా రిమ్స్ కు వచ్చి వేక్సిన్ తీసుకోవడం జరిగిందని చెప్పారు. జిల్లాలో మార్చి 1 నుండి 60 ఏళ్లు దాటిన వారికి , 40 ఏళ్లు నిండి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా వేక్సిన్ వేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఇందుకు 105 ప్రభుత్వ ఆసుపత్రులు (పి.హెచ్.సిలు, సి.హెచ్.సిలు )లతో పాటు 9 ఆరోగ్య శ్రీ ట్రస్ట్ గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులు గుర్తించారని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులలో రూ.250/-లు రుసుము వసూలు చేస్తారని, 105 ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వేక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు జరిగాయని వివరించారు. ఇప్పటివరకు మొదటి డోస్ క్రింద ఫ్రంట్ లైన్ వారియర్లు అయిన 16,327 మందికి , రెండవ డోస్ క్రింద 10,687 మందికి వేక్సిన్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, ఇతరులకు మొదటి డోస్ క్రింద 18,370 మందికి రెండవ డోస్ లో 1,410 మందికి వేక్సిన్ వేయడం జరిగిందని శాసనసభ్యులు తెలిపారు. అదేవిధంగా పోలీసు శాఖలో పనిచేస్తూ రిస్క్ ఎక్కువ కలిగిన 2,269 మందికి వేక్సిన్ ఇవ్వడం జరిగిందని, అలాగే 60 ఏళ్లు దాటిన 3,126 మందికి, 40-55 ఏళ్లు నిండి వివిధ వ్యాధులతో బాధపడుతున్న 866 మందికి వేక్సినేషన్ చేయడం జరిగిందని తెలిపారు. దీనిపట్ల ఇప్పటికీ కొంతమందికి అపోహలు ఉన్నాయని, తెలిసీ తెలియని వారు అభిప్రాయాలు వ్యక్తం చేయడం, కొంతమందిలో కొన్ని అనుమానాలు, భయాలు ఉండటం వలన ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలను ఉపయోగించుకోలేని వారు ఉన్నారని అన్నారు. అటువంటి భయాలను ప్రారద్రోలేందుకే భారత ప్రధాని తొలి డోస్ తీసుకున్నారని, ఆ విషయాన్ని మనందరం తిలకించడం జరిగిందని గుర్తుచేసారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు , మంత్రులు, వైద్యులందరు తీసుకోవడం జరిగిందని, అయినప్పటికీ ఇంకా భయం ఎందుకని శాసనసభ్యులు ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక కార్యక్రమం ఇదని, మనదేశంలో కూడా 130 కోట్ల మందికి వేక్సినేషన్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని, ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చుచేసేందుకు సిద్ధమైందని చెప్పారు. తెలిసీ తెలియని అభిప్రాయాలను నమ్మి వేక్సినేషన్ తీసుకోకపోవడం అమాయకత్వం అవుతుందని తెలిపారు. మన జిల్లాలో ఇంత పెద్దఎత్తున చేపడుతున్న ఈ సౌకర్యాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇంకా టీకా వేసుకోని సీనియర్ సిటిజన్స్, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు గాని ఉంటే తక్షణమే వివరాలు నమోదుచేసుకొని టీకా తీసుకొని వైరస్ నుండి విముక్తి పొందాలని ఆయన సూచించారు. ఇదివరకే మొదటి డోస్ తీసుకున్న వారు 28 రోజుల తర్వాత రెండవ డోస్ తీసుకోవాలని, జిల్లా ప్రజలందరూ టీకాను ఉపయోగించుకోవాలని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో అదవపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాధరావు, రాష్ట్రీయ బాల స్వాస్త్వ ఆరోగ్య కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి డా. కె.అప్పారావు, డా. కె.కృష్ణమోహన్, ఆర్.ఎం.ఓ డా. అరవింద్, రిమ్స్ సూపరింటెండెంట్ రామకృష్ణ, వరుదు విజయకుమార్, సాధు వైకుంఠరావు, లుకలాపు గోవిందరావు , ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు తిరుమలలో విధులు నిర్వహించే టిటిడి ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయడం గురువారం ఉదయం అశ్విని ఆసుపత్రిలో టిటిడి ప్రారంభించింది. టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తిరుమల, తిరుపతిల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కోవిడ్ - 19 వ్యాక్సిన్ వేయడం ప్రారంభించారు. ఇందులో మొదటగా శ్రీవారి ఆలయం, రిసెప్షన్, వాటర్ వర్క్స్, ఆరోగ్య విభాగం, భద్రాత విభాగం సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. రెండవ విడతలో 45 సంవత్సరాలు పైబడి బి.పి., షుగర్ తదితర సమస్యలు ఉన్నవారికి ఇవ్వడం జరుగుతుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలనుకునేవారు టిటిడి ఉద్యోగులుముందుగా తమ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు చూపించి ఆసుపత్రి వద్ద పేర్లు నమోదు చేసుకొని, సమ్మతి పత్రంలో సంతకం చేసి సమర్పించవలసి ఉంటుంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తరువాత రెండవ డోస్ ఇస్తారు. జిల్లా ఆరోగ్య విభాగంవారు తిరుమలకు పంపిన కోవిడ్ - 19 వ్యాక్సిన్ 50 వైల్డ్స్ను 550 మందికి వేయనున్నారు. కాగా గురువారం ఉదయం అశ్విని ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, మీడియా ప్రతి నిధులకు వ్యాక్సిన్ వేశారు. అదేవిధంగా మార్చి 5వ తేదీ తిరుపతిలోని టిటిడి కేంద్రీయ వైద్యశాల నందు ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయనున్నట్లు టిటిడి యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ కుమారి, ఇతర డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో 60 ఏళ్లకు పైబడిన వారు, 45-59 ఏళ్ల మధ్యగల దీర్ఘకాలిక వ్యాధులు (కో-మార్బిడ్) ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్ పొందేందుకు కోవిన్-2.0 ఆన్లైన్ పోర్టల్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇన్ఛార్జ్ డీఎంహెచ్వో డా. ఎన్.ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ లబ్ధిదారులు తప్పనిసరిగా https://www.cowin.gov.in/ వెబ్సైట్లో నమోదు చేయించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి వ్యాధిని తెలియజేసే ధ్రువీకరణపత్రాన్నితీసుకోవాలన్నారు. జిల్లాలోని 65 ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.250 (డోసుకు రూ.150, సేవా రుసుం రూ.100) చెల్లించి వ్యాక్సిన్ పొందొచ్చన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కేంద్రంలో ఉచితంగా, ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రిలో రుసుం చెల్లించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని ప్రసన్నకుమార్ తెలిపారు.
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ అన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ ఏప్రోప్రియేట్ అథారిటీ సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రిజిస్టర్ అయిన కేంద్రాలు మాత్రమే వైద్య పరంగా అత్యవసర సమయాల్లో మాత్రమే ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. రిజిస్టర్ కానీ కేంద్రాలు వైద్య పరీక్షలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదని ఉద్బోధించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారికి మొదటి సారి 3 సంవత్సరాలు జైలు శిక్ష లేదా రూ.10 వేలు వరకు అపరాధ రుసుము లేదా రెండూ ఉంటాయని చెప్పారు. రెండవ సారి అయితే హెచ్చింపు శిక్ష ఉంటుందని తెలిపారు. ఎక్కడా బాలికల జనాభా తగ్గరాదనే ఉద్దేశ్యంతో చట్టం చేయడం జరిగిందని చెప్పారు. నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏ.ఎన్.ఎం, ఆశా కార్యకర్తల వద్ద గర్భిణీ మహిళల వివరాలు ఉండాలని తద్వారా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుటుంబ పరిస్థితులు, సమాజ పరిస్థితుల రీత్యా కొన్ని ప్రాంతాల్లో బాలిక భారం అనే భావంతో జరిగే అవకాశం ఉండవచ్చని, ప్రభుత్వం కల్పించే సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై అవగాహన కలిగించాలని సూచించారు. తద్వారా బాలిక భారం కాదని గుర్తించగలరని పేర్కొన్నారు. చట్టబద్ధమైనది, సమాజాహితమైనది చేయాలని సూచించారు. స్కానింగ్ కేంద్రాలలో పని చేసే ప్రతి ఒక్కరూ విశ్వసనీయత కలిగి ఉండాలని సూచించారు. ప్రజలకు న్యాయ సహాయానికి లీగల్ క్లినిక్ లను ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. అబ్బాయిలను నైతిక బాధ్యతతో ఉండేవిధంగా, సత్ప్రవర్తన కలిగి ఉండేవిధంగా సమాజంలో మార్పు రావాలని ఆయన అన్నారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదని స్పష్టం చేసారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమన్నారు. అన్ని స్కానింగ్ కేంద్రాలు విధిగా తనిఖీ చేయాలని అన్నారు. ప్రోగ్రాం అధికారులకు ఇచ్చిన లక్ష్యాల మేరకు విధిగా తనిఖీలు పూర్తి చేయాలని స్పష్టం చేసారు. నెలవారీ నివేదికను నిర్దేశించిన సమయంలో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. నివేదికలు సమర్పించని కేంద్రాల లైసెన్స్ లను రద్దు చేస్తామని హెచ్చరించారు. పురుష, మహిళా నిష్పత్తి ప్రమాదకర భవిష్యత్తును సూచిస్తున్నాయని పేర్కొన్నారు. వృత్తి పట్ల గౌరవ భావంతో ఉండాలని, వృత్తి ధర్మాన్ని పాటించాలని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వాటిపై చర్యలు కఠినంగా ఉంటాయని గుర్తించాలని హెచ్చరించారు.
పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ లింగ వివక్ష ఉండరాదని స్పష్టం చేసారు. లింగ పరంగా అసమతౌల్య పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. తద్వారా సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతాయని అన్నారు. ప్రకృతి సహజసిద్ధతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. వైద్య కేంద్రాలు సెంటర్స్ ఆఫ్ చేంజ్ గా మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. పారదర్శకంగా పనిచేసి సమాజంలో మంచి మార్పుకోసం మాత్రమే పనిచేయాలని సూచించారు. బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమని స్పష్టం చేసారు. లింగ నిర్ధారణ చేయడం వలన సమాజానికి చేటు చేస్తున్నారని గుర్తించాలని తెలిపారు. లింగ నిర్ధారణ చేసేవారికి కనీసం మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ సామూహిక బాధ్యతతో పనిచేయాలని కోరారు. ఆసుపత్రిలోనే లింగ నిర్ధారణపై అవగాహన ప్రారంభం కావాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాలు నివేదికలను సమర్పించాలన్నారు. అదనపు డిఎంహెచ్ఓ డా.బి.జగన్నాథ రావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో 95 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం పురుష, మహిళా జనాభా నిష్పత్తి 933 ఉండగా, చిన్న పిల్లల్లో 927 మాత్రమే ఉందని, 2011లో పెద్దవారి నిష్పత్తి 992 ఉండగా చిన్న పిల్లల్లో 946 మాత్రమే ఉందన్నారు. సీతంపేట, కొత్తూరు, బూర్జ, సారవకోట మండలాల్లో నిష్పత్తి ఆశాజనకంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డా.కె.సి.చంద్ర నాయక్, వైద్య శాఖ అధికారులు బి.సూర్యారావు, ఎల్.భారతీ కుమారీ దేవి, వీర్రాజు , వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
బాలలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం సౌభాగ్యంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అభిప్రాయ పడ్డారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డీ-వార్మింగ్ మాత్రల పంపిణీ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు డీ వార్మింగ్ మాత్రలు (ఆల్బెండ్ జోల్ 400 మి.గ్రా ) వేసి నమిలి తినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు 4 లక్షల 42 వేల 328 మంది ఉన్నారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 1 లక్ష 52 వేల 486 మంది పిల్లలు ఉన్నారని, బడికి వెళ్లని పిల్లలు 3 వేల 251 మంది వెరశి 5,98,065 మంది పిల్లలు ఉన్నారని కలెక్టర్ చెప్పారు. వీరందరికీ ఈ నెల 9 వరకు డీ-వార్మింగ్ మాత్రలను వేయించడం జరుగుతుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోని 1 నుండి 2 సం.ల పిల్లలకు సగం మాత్ర (200 మి.గ్రా ), 2 నుండి 5 ఏళ్లు వారికి 1 మాత్ర , 6 నుండి 19 ఏళ్ళు లోపు గల పాఠశాల, కళాశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా మాత్రలను వేయించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి పాఠశాలలో ఉదయం 08.00 గం.ల నుండి సాయంత్రం 05.00 గం.ల వరకు నిర్దేశించిన ప్రణాళిక పద్దతిలో కార్యక్రమం జరుగుతుందని అన్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత ప్రతి విద్యార్థికి 1 మాత్ర నమిలి తినిపించడం జరుగుతుందని తెలిపారు. ఈ మాత్రలు తీసుకోవడం వలన ఏ విధమైన దుష్పరిణామాలు ఉండవని , ఒకవేళ దుష్పరిణామాలు కనిపించినట్లయితే దగ్గరలోని పి.హెచ్.సి వైద్యాధికారిని సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖాధికారి డా.ఎం.సి.చంద్రనాయక్, అదనపు వైద్య శాఖాధికారి డా.బి.జగన్నాథరావు, రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి డా. కె.అప్పారావు, డా.కె.కృష్ణమోహన్, జిల్లా విద్యా శాఖాధికారి కె.చంద్రకళ, సమగ్ర శిక్ష ప్రోజెక్టు అధికారి పైడి వెంకట రమణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం.వాగ్దేవి, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్ వేక్సిన్ పట్ల అపోహలు విడనాడాలని, ప్రతీఒక్కరూ తప్పనిసరిగా వేక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. మూడోవిడత వేక్సినేషన్ ప్రక్రియను విజయనగరం పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో బుధవారం ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు ఎంతమందికి వేక్సిన్ వేయించినదీ, రిజిష్ట్రేషన్ ప్రక్రియపై ఆరా తీశారు. కోవిడ్-19 వేక్సిన్ రెండో డోసును వేయించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 60 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ మూడోదశలో కోవిడ్ వేక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బిపి, షుగర్ తదితర కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు నుంచి 60 ఏళ్లు లోపువారికి కూడా వేక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. వేక్సిన్ కావాల్సినవారు ముందుగానే ఆన్లైన్లో తమ పేర్లను రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. వేక్సిన్ వేసుకున్నందువల్ల ఎటువంటి దుష్ఫలితాలు కలగవని, కొద్దిమందికి మాత్రమే నీరసం, జ్వరం లాంటి కొద్దిపాటి లక్షణాలు కనిపించవచ్చని చెప్పారు. వైద్యులు సూచించిన వారు మినహా, మిగిలిన వారంతా వేక్సిన్ వేయించుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
జిల్లాలో వేక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటివిడత వైద్యారోగ్యశాఖ సిబ్బంది 17వేల మందికి వేక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు సుమారు 13 వేలమందికి వేయడం జరిగిందని చెప్పారు. రెండోవిడతలో రెవెన్యూ, పంచాయితీరాజ్, మున్సిపల్ తదితర ఫ్రంట్ లైన్ వర్కర్స్ సుమారు 25వేలమందికి వేక్సినేషన్ ప్రారంభించగా, ఇప్పటివరకూ పదివేల మందికి వేయడం జరిగిందన్నారు. తాజాగా సుమారు 3వేలమంది పోలీసులకు కూడా వేక్సినేషన్ ను ప్రారంభించామన్నారు. మూడోవిడత క్రింద మార్చి 1 నుంచి జిల్లా వ్యాప్తంగా వేక్సినేషన్ జరుగుతోందన్నారు. దీనికోసం 42 వేక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విజయనగరం పట్టణంలో 9 ప్రయివేటు ఆసుపత్రుల ద్వారా వేక్సిన్ వేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్.రామ్మోహన్ కూడా వేక్సిన్ రెండో డోసును వేయించుకున్నారు. డిప్యుటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ చామంతి, వైద్యాధికారి డాక్టర్ లావణ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
చిన్నారులలో నులిపురుగు నివారణకు డీవార్మింగు డేను బుధ వారం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డి.ఎం.హెచ్.ఓ) డా.కె.సి.చంద్ర నాయక్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో డి.ఎం.హెచ్.ఓ వివరాలు తెలిపారు. బాల స్వాస్త్య కార్యక్రమం క్రింద మార్చి 3 న డీ వార్మింగ్ డే కార్యక్రమంను నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా మార్చి 3న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్ధులకు డీ-వార్మింగ్ మాత్రలు (ఆల్బెండ్జోల్ -400 మి.గ్రా.) నమిలి తినిపించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం చేతులు శుభ్రపరచుకోవడం, పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత కోసం తెలియజేయడం జరుగుతుందని అన్నారు. నులిపురుగుల వలన ఏర్పడే సమస్యలను వివరించాలని ఆదేశించామని పేర్కొన్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం మాత్రలు నమిలి మింగించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులు, అంగన్వాడీ కేంద్రాలలో మొత్తం 5,98,065 మంది చిన్నారులకు డీ వార్మింగ్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏ ఒక్కరూ తప్పిపోరాదని తెలిపారు. కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ, ఐ.సి.డి.ఎస్, విద్యాశాఖలు సమన్వయంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలను మింగించడం జరుగుతుందని, గ్రామాలలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వఛ్ఛంద సేవా సంఘాలు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఈ మాత్రలు వేసుకోవడం వలన ఎటువంటి దుష్పరిణామాలు వుండవని తెలిపారు. అయితే కోవిడ్ వాక్సిన్ వేసుకోవలసిన 19 సంవత్సరాల వయస్సుగల పిల్లలు వాక్సిన్ వేసుకున్న తరువాత మాత్రలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎటువంటి ప్రభావం ఉండదని, అయినప్పటికి ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు.
అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.జగన్నాధం మాట్లాడుతూ చిన్నారులలో నులి పురుగులు ఉండటం వలన రక్త హీనత ఏర్పడుతుందన్నారు. తద్వారా ఎదుగుదల సమస్య వస్తుందని, రక్తహీనత కారణంగా వివిధ సమస్యలు ఏర్పడుతుందని చెప్పారు. నులిపురుగులను అరికట్టుటకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీ వార్మింగు డేను నిర్వహిస్తున్నామని తెలిపారు. బహిరంగ మలవిసర్జన కారణంగా నులిపురుగుల సమస్య ఎక్కువగా ప్రభలుటకు అవకాశం ఉంటుందన ఆయన వివరించారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ సమన్వయ అధికారి డా.కె.అప్పారావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతీ కుమారి దేవి, జిల్లా మలేరియా అధికారి వీర్రాజు, డిబిసిఎస్ ప్రాగ్రాం అధికారి డా.రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రక్రుతి మనకు సహజ సిద్ధంగా అందించిన వాటిలో వేపకు ప్రముఖ స్థానముంది. అలాంటి వేపతో కలిగే లాభాలు ఒక్కసారి తెలుసుకుంటే.. వేపపుల్ల దంత దావనం చేస్తే పళ్లు పదిలంటా పటిష్టంగా ఉంటాయ్. వేప చిగుళ్ల రసం చిన్నపిల్లలకు పసుపు కలిపి పట్టిస్తే నులిపురుగులు నశిస్తాయ్, పెద్దవారు వేప ఆకు కషాయం తాగితే చర్మరోగాలు నశిస్తాయ్. అమ్మవారు చేసినపుడు వేపఆకు, పసుపు రాస్తే శరీరంపై వచ్చిన పొక్కలు తగ్గుతాయ్. వేపనూనె తలకు రాసుకుంటే కుదుళ్లు గట్టిపడటంతోపాటు తలలో పేలు చచ్చిపోతాయ్. వేప చెట్టు బెరడు, ఆకులు, వేర్లు యాంటి ఫంగల్ గా పనిచేస్తాయ్. దురదలు, పుండ్లుపై వేపాకు నూరి కట్టు కడితే త్వరగా పుండుమానుతుంది. కాళ్ల పగుళ్లకు వేపాకు మరగబెట్టిన నీటితో కడితే ఫలితం వుంటుంది. వేళ్లు ఒరుపులు, అరికాలు దురదలు, చంకల్లో పట్టే చమట దురదలు తగ్గాలంటే వేపాకుని నూరి పాట్టిస్తే దుర్వాసన తగ్గుతుంది. వేపాకు ను వేడినీటిలో వేసి దాని ఆవిరి పీల్చితే ఆస్తమా నియంత్రణకు సహాయ పడుతుంది. వేపతో ప్రాధమిక దశలో ఉన్న కుష్టువ్యాధిని తగ్గించుకోవచ్చు. శరీరంలో రక్త సరఫరా సక్రమంగా జరగాలంటే వేపాకు కషాయం తరుచుగా తీసుకోవాలి అంటే ప్రతీ మూడు రోజులకు పావులీటరు చొప్పున తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. మలేరియా జ్వరాన్ని తగ్గించడంలోనూ వేపాకు కషాయం ఎంతగానో ఉపయోగ పడుతుంది. అత్యధికంగా వేధిస్తున్న చర్మవ్యాధి తామరను తరిమి కొట్టడంలో వేపాకు కషాయం ఎంతోబాగ పనిచేస్తుంది. మండలం పాటు వేపాకు కషాయం తాగితే మంచి ఫలితం వుంటుంది. అయితే అతిగా తాగినా శరీరాని వేడిచేస్తుంది అలా వేడిచేయకుండా మంచినీరు, మజ్జిగ తీసుకుంటూ దీనిని సేవించాలి. అంతేకాదు వేప సుమారు 70 రకాల రోగాలకు దివ్య ఔషదంగా పనిచేస్తుంది.
శ్రీకాకుళం జిల్లాలో 60 ఏళ్ళు దాటిన వారందరికీ నేటి నుండి కోవిడ్ వాక్సిన్ వేయడం జరుగు తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు సంయుక్త కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కోవిడ్ వాక్సిన్ మూడవ దశలో భాగంగా సోమవారం నుండి అందుబాటులోకి వచ్చిందని, దీనిని సంబంధిత వయస్సు ప్రజలందరూ తప్పనిసరిగా వినియోగించు కోవాలని జె.సి కోరారు. జిల్లాలో 60 ఏళ్ళు దాటిన వారితో పాటు 45 - 50 సం.లు కలిగి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా కోవిడ్ టీకా వేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో గల 105 ప్రభుత్వ ఆసుపత్రులైన ప్రాధమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ , ఏరియా మరియు జిల్లా ఆసుపత్రులలో టీకా ఉచితముగా ఇచ్చేందుకు ఏర్పాటు చేయటం జరిగగిందని జె.సి వివరించారు. వీటితో పాటు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులయిన జెమ్స్ఆసుపత్రి-రాగోలు, గొలివి ఆనుపత్రి, శ్రీకాకుళం బగ్గు సరోజినీదేవి ఆసుపత్రి- శ్రీకాకుళం, కిమ్స్ సాయి శేషాద్రి ఆసుపత్రి-శ్రీకాకుళం, పి.వి.యస్ రామ్మోహన్- పొందూరు, సిందూర ఆసుపత్రి శ్రీకాకుళం, జి.ఎమ్ఆర్ వరలక్ష్మి కేర్- రాజాం, అమృత ఆసుపత్రి-రాజాం, నెఫ్రోప్లస్
(రిమ్స్) ఆసుపత్రి - శ్రీకాకుళంలో టీకా వేయడం జరుగుతుందని తెలిపారు. అయితే డోసు ఒక్కింటికి రూ.250/-లు సాధారణ రుసుము చెల్లించి కోవిడ్ వాక్సిన్ ను పొందవలసి ఉంటుందని చెప్పారు. కోవిడ్ టీకా కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కోవిన్- 2.0 యాప్ నందు సోమవారం నుండి నమోదు చేసుకునేందుకు అవకాశము కల్పించబడిందని తెలిపారు. యాప్ లో పైన పేర్కొన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వివరాలు ఉంచబడ్డాయని, అంతే కాకుండా ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా నమోదు చేసుకొనే అవకాశాన్ని కల్పించబడినట్లు జె.సి స్పష్టం చేశారు. యాప్ లో సదరు ఆసుపత్రుల వివరములతో పాటు సమయాన్ని అనుసరించి టీకా పొందేందుకు వీలుగా నమోదు చేసుకోవచ్చని, ఈ వివరాలు నమోదు జరిగిన వెంటనే సమయాన్ని కేటాయిస్తూ ఫోన్ కు సంక్షిప్త సమాచారం వస్తుందని జె.సి వివరించారు. కోవిన్ యాప్ లో ముందస్తుగా వివరాలు నమోదు చేయకున్నప్పటికి టీకా పొందే సౌలభ్యం ఉందని, దీనికిగాను సంబంధిత కేంద్రం లో ఆ రోజు టీకా వేయుంచుకొనే వారు తక్కువ మంది ఉంటే తక్షణమే తమ వివరాలు నమోదు చేసుకొని టీకా తీసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. 45 - 50 ఏళ్ళు పైబడి 20 రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు సదరు కోవిడ్ పొందుటకుగాను టీకా పంపిణీ కేంద్రానికి వెళ్లి అక్కడి సిబ్బందికి రిజిస్టర్ వైద్యులు ఇచ్చిన సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి. ధ్రువీకరణ పత్రము చూపించాలని, 60 ఏళ్ళు దాటిన వారికీ వైద్యుల ధ్రువీకరణపత్రము అవసరము లేదని, వయస్సును గుర్తించేందుకు జనవరి 1, 2022 ను ప్రామాణికముగా తీసుకునేందుకు గుర్తింపు కార్డు లో ఏదో ఒకటి అనగా ఆధార్ కార్డు, ఫోటో తో కూడిన ఓటర్ కార్డు, బైపింగ్ లైసెన్సు కార్డు, పాస్ పోర్ట్ , ఫోటో తో ఉన్న ఫించన్ కార్డు లేదా జాతీయ జనాభా నమోదు కార్డు చూపించి వాక్సిన్ పొందవచ్చని జె.సి స్పష్టం చేశారు. గర్భిణీలు, బాలింతలు, ఎలర్జీ సమస్యలు ఉన్నవారు కోవిడ్ టీకా పొందేందుకు అనర్హులని జె.సి తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.
@అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా ఉండొచ్చు..
@అల్లం టీ ని సేవించడం ద్వారా గర్భణీలకు ఎంతో మేలు చేకూరుతుంది..
@వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది..
@ఛాతిలో మంట, అజీర్ణానికి అల్లం టీతో చెక్ చెప్పవచ్చు..
@అల్లం టీతో మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు తిప్పికొట్టొచ్చు..
@మోకాళ్ల వాపులు అల్లం 'టీ'రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి..
@అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది..
@జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం ''టీ''తీసుకుంటే ఇట్టే ఫలితం వస్తుంది..
@ జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లం టీ సుకుంటే ఉపసమనం లభిస్తుంది..
@ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.. రోజుకి 3 సార్లు మాత్రమే తాగాలి..
@ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం 'టీ'రోజూ తేనెతో కలిపి తీసుకోవాలి..
@అల్లం టీతో సేవించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు..
@ జీర్ణ ప్రక్రియకు అల్లం టీ దివ్య ఔషదం..
@మానసిక ఒత్తిడిని మాయం చేయడంలో అల్లంటీ మేటి..
@నీరసంగా ఉన్నవారు అల్లం టీతాగితే నూతనోత్సహం వస్తుంది..
@చలి ప్రభావ సమస్యలను ఇది అదుపులో ఉంచుతుంది..
@కొందరికి ప్రయాణాలు పడవు ఆ సమయంలో కడుపంతా వికారంగా ఉండటం, వాంతులవడం వంటి సమస్యలు వేధిస్తాయి. అలాంటప్పుడు ముందుగా ఓ కప్పు అల్లం టీ తాగి చూడండి. ఉత్సాహం వచ్చేస్తుంది. వికారంలాంటివి పారిపోతాయ్..
@భుక్తాయాసం నుంచి బయట పడాలంటే కప్పు అల్లం టీ తాగాల్సిందే..
@అల్లం టీతో కండరాలూ, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది..
@అల్లం టీతో శ్వాసకోశ సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి..
@రక్త ప్రసరణ నియంత్రణలో ఉంచడంలో అల్లం టీ మేటి..
@అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి..
@హృదయ కవాటాల్లో రక్త సరఫరాకి అల్లంటీ చాలా బాగ దోహదపడుతుంది..
@అల్లంటీతో హృద్రోగాలూ దూరంగా ఉంటాయి..
@నెలసరి సమస్యలున్న వారు అల్లం టీతో నియంత్రిచుకోవచ్చు..
@ అల్లంటీతో శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందుతాయి..
@రోగనిరోధక శక్తి పెంచి, ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించడంలో అల్లం టీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. దీనిలో ఉండే అరోమా గుణాలు మెదడుకి ఉత్తేజాన్నిస్తాయి..