ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగష్టు 2019 న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భముగా ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమం లో భాగంగా వయస్సుకి తగ్గ ఆరోగ్యనియమాలు మరియు మార్గదర్శకాలు తెలుగు భాషలో విడుదల చేస్తున్నట్లు పర్యాటక, యువజన సంక్షేమ, క్రీడా శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయం నుండి మార్గదర్శకాలు వర్చువల్ లాంచ్ చేసి వీడియో కాన్పరెన్స్ ద్వారా క్రీడా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దైనందిన జీవన శైలిలో భాగంగా వయస్సుకు తగిన వ్యాయామం మరియు యోగాసనాలు అవలంభించడంలో మనల్ని ప్రేరేపించడానికి ఫిట్ ఇండియా ఉద్యమం దారి తీస్తుందని అన్నారు. .ఫిట్ ఇండియా ఉద్యమములో భాగముగా పాఠశాల పిల్లలు ,స్కూల్ వీక్ ,ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ మరియు ఫిట్ ఇండియా ఆక్టివ్ డే సిరీస్లు భాగముగా వున్నాయి అని తెలిపారు. సుమారు 2.5 లక్షల పాఠశాలలు ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ కోసం రిజిస్టర్ చేయ బడివున్నవని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వతహాగా క్రీడాకారులని, ఆయన ప్రతి నిత్యం వ్యాయామం చేస్తారని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని తెలిపారు.
మనిషి జీవితంలో ఒత్తిడి పెరిగిపోయిందని, పిల్లలు స్వల్ప కారణాలకే ఆత్మహత్యా చేసుకుంటున్నారని, దీనిని అధిగమించడానికి మన ప్రాచీన వారసత్వాలైన యోగా , ప్రాణాయామం ఆచరించాలని కోరారు.
ప్రతిరోజూ 30-60 నిముషాలు పాటు విస్తృతంగా శారీరకంగా పని చేయడాన్ని నిర్ధారించే సాధారణ మార్గదర్శకాలు నియమాలు ఇందులో రూపొందించ బడ్డాయని తెలిపారు. ప్రస్తుత సమయంలో దీర్ఘకాల వ్యాధులు, సంక్రమితం కానీ వ్యాధుల వలన మారుతున్న ప్రజల లక్షణాల వివరాలు,వ్యాధుల భారం మరియు పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యాయామాలతో మరింత సమగ్రమయిన ప్రాధమిక ఆరోగ్య సంరక్షణని అందించే దిశగా ఫిట్ ఇండియా ఉద్యమం దోహదం చేస్తుందని తెలిపారు.
వయస్సుకి తగ్గ ఈ ఆరోగ్య నియమాలు మరియు మార్గదర్శకాలు మూడు రకాల వయస్సులకు చెందిన సమూహాలు అనగా 5-18 సంవత్సరాలు, 18-64 సంవత్సరాలు మరియు 65సంవత్సరాలు పైబడిన వారి కి ఉద్దేశించినవని తెలిపారు.
సామాన్య పౌరుడు సైతం ఆరోగ్యాన్ని ఒక అంతర్భాగముగా చేయటానికి సరళమైన, సులభమైన ఆరోగ్య నియమాలు పాటించడానికి ఈ ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా శారీరక ఆరోగ్యాభివృధి చేసుకొనుటకు మార్గదర్శకం అవుతుందని అన్నారు.
కుమారసంభవం, శాకుంతలం కావ్యాలలో మహాకవి కాళిదాసు వివరించిన విధముగా అన్ని మంచి పనులకు శరీరమే ఒక సాధనమని అన్నారు. అటు వంటి శరీర పరిరక్షణే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగుతుందని తెలిపారు.
విజయవాడ నుండి క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి కె.రాంగోపాల్ మాట్లాడుతూ ఆరోగ్య నియమాలు, మార్గదర్శకాలను తెలుగులో ముద్రించి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు.
స్పోర్ట్స్ ఆథారిటి మేనేజింగ్ డైరక్టర్ బి.రామారావు మాట్లాడుతూ విశాఖ నగరంలోని కొమ్మాది స్టేడియం ను త్వరలో అభివృద్ది చేస్తామని తెలిపారు.
ఇంకా డిల్లీ నుండి ఫిట్ ఇండియా మిషన్ డిప్యూటి డైరక్టర్ విష్ణు సుధాకరన్, బెంగుళూరు నుండి స్పోర్ట్స్ ఆథారిటి ఆఫ్ ఇండియా దక్షణ ప్రాంత అసిస్టెంట్ డైరక్టర్ ఎస్. హిమబిందు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి డి ఇ ఓ లింగేశ్వరరెడ్డి, సెట్విస్ సి ఇ ఓ శ్రీనివాసరావు, చీఫ్ కోచ్ సూర్యారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ముఖ్యమంత్రి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించారు. వీటిలో విజయవాడలోని దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. వీటితో పాటు 77 కోట్ల రూపాయల వ్యయంతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు కూడా సీఎం వైయస్ జగన్ మోహన రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కి దుర్గ గుడి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ బోత్స సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, రక్షణ నిధి, వంశీ, దేవినేని అవినాస్ తదితరులు పాల్గొన్నారు.
రాప్ట్రంలో పర్యాటక రంగం పురోగతికి కార్యాచరణ ప్రణాళికను వారం రోజుల్లో రూపొందించాలని రాప్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కారణంగా పర్యాటక రంగం తీవ్ర సంక్షోభానికి గురి అయిందని, ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్యాకేజీలను తయారుచేయాలని కోరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఎపిటిడిసి ద్వారా అరసవెల్లి, శ్రీకూర్మం తదితర పుణ్యక్షేత్రాలకు టూర్ ప్యాకేజీలను రూపొందించి ప్రచారం చేయాలని తెలిపారు. విశాఖ నగరంలో రామకృష్ణా బీచ్ రోడ్డులో పర్యాటక సమాచార కేంద్రాన్ని , జివియంసి అధికారులతో సమన్వయంతో సత్వరమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జి.వి.ఎం .సి , జిల్లా పరిషత్, వి ఎం ఆర్ డి ఎ అధికారులతో సంప్రదించి పర్యాటకులకు ఆహ్లదం కలిగించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఎ పి టి డి సి హోటళ్ల గురించి విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, ఆర్ డి రాం ప్రసాద్, డి వి ఎం ప్రసాద్ రెడ్డి, ఈఈ రమణ, డి టి ఓ లు, డిఈ, ఎఈ లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సపాలిటీల సమాచారం అందించడంలో ఉన్నతాధికారులు విఫలం అవుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, అభివ్రుద్ధి పనులు, కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టుల సమాచారం కార్పోరేషన్లలో కమిషనర్లు ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయాలి. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్లలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ల(పీఆర్వో) కొరత భారీగా వుంది. కొన్ని చోట్ల కార్పోరేషన్లలో పనిచేసే జోనల్ కమిషనర్లను పీఆర్వోలుగా వినియోగిస్తున్నారు. దీనితో వారికి సమాచారం మీడియాకి ఎలా ఇవ్వాలో తెలీక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేసమయంలో వీరు విధినిర్వహణలో భాగంగా ఇచ్చే సమాచారం అటు మీడియాకి ప్రతినిత్యం పెద్ద పెద్ద పరీక్షలు పెడుతున్నాయి. స్మార్ట్ సిటీ పథకంలో చేసే అభివ్రుద్ధిని నిత్యం మీడియాకి తెలియజేయాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి సమాచారమూ ఇవ్వడం లేదు. ఒక్క ముఖ్కలో చెప్పాలంటే స్మార్ట్ సిటీ పథకంలో ఎంతమంది పనిచేస్తున్నారు..ఏఏ ప్రాజెక్టులు చేపడుతున్నారనే విషయాన్ని ఏడాది ఒకసారి కమిషనర్ ప్రెస్ మీట్లో తప్పా ఇతర సమయాల్లో మీడియాకి తెలియజేడం లేదు. అదీకాకుండా అధికారులుగా విధులు నిర్వహించేవారికి పీఆర్వో పని చేయడం రాకపోవడంతో.. కార్పోరేషన్లలోని సమాచారం న్యూస్ ఫార్మాట్ లో తెలియజేయడం ఇబ్బంది కరంగా మారుతోంది. కొంత సమాచారం అధికారులు ఇచ్చింది ఇచ్చినట్టుగా ఇచ్చేయడం, అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్ లోనూ, కొన్ని విషయాలు పూర్తిస్థాయిలో తెలియజేకపోవడం వంటి లోపాలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియడం లేదు. ఎందుకిలా చేస్తున్నారని ఆరా తీస్తే అన్నివిషయాలు మీడియాకి తెలిస్తే..పనికొగట్టుకొని వార్తలు రాస్తారని కావాలనే చాలా కార్పోరేషన్లలో పీఆర్వోలను నియమించలేదనే వాదన కార్పోరేషన్లలలోని అధికారుల నుంచే వస్తుంది. ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ద్వారా కార్పోరేషన్లలో పీఆర్వోలను నియమించుకునే అవకాశం వున్నప్పటికీ రాష్ట్రంలోని ఒకటి అరా కార్పోరేషన్లు మినహా మరెక్కడా పీఆర్వోలు లేరు. కొన్ని చోట్ల సమాచారశాఖలోని ఏపీఆర్వోలే కార్పోరేషన్ పీర్వోలుగా డిప్యూటేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో సమాచారశాఖ నుంచి డిప్యూటేషన్ కావాలని కార్పోరేషన్లకు వేయించుకవోడంతో సమాచారశాఖలోని సిబ్బంది కొరత ఏర్పడుతుంది. అయితే వాస్తవాలు, లోపాలు, ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతి మీడియా ద్వారా బయటకు రాస్తే మాత్రం రాష్ట్రంలోని పలు కార్పోరేషన్ల కమిషనర్లకు ఎక్కడలేని ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. కార్పోరేషన్ల ద్వారా సమాచారం రావడం లేదని ప్రశ్నిస్తే...మేము బాగానే పంపిస్తున్నాం కదా..దానిని మీకు అనుకూలంగా మార్చుకోండని ఉచిత సలహాలు మాత్రం ఇస్తున్నారు. ఇలా అయితే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రంలోని ప్రజలకు ఎలా తెలుస్తాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది..!
అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ దక్కేవరకూ గళం తగ్గించేది లేదని ఏ.పి.యు.డబ్ల్యు.జే. అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం సమాచారశాఖ కార్యాలయంలో బైటాయించి తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో అనేక వర్గాల ప్రజలకు ఏన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల దగ్గరకు వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. రాజన్నరాజ్యం తెస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ఆనాడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి అమలుచేసిన అక్రెడిటేషన్ విధానాన్ని ఎందుకు మారుస్తున్నారో చెప్పాలన్నారు. 142 జీఓ లోని నియమాలన్నీ వై.ఎస్. విధానానికి విరుద్ధమైనవని అన్నారు. వై.ఎస్. విధానం తప్పని చెప్పదలచుకున్నారా అని సూటిగా ప్రశ్నించారు. అక్రెడిటేషన్ విధానాన్ని సరళతరం చేసి నిజంగా పనిచేస్తున్న జర్నలిస్టులు అందరికీ గుర్తింపుఇవ్వాలన్నారు. ఐ.జే.యు. జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా నేపథ్యం లో పత్రికా రంగం ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం పాత్రికేయుల పై సానుభూతి తో వ్యవహరించాలని కోరారు.
ఐ.జే.యు.జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ 142 జీఓ పత్రికా రంగంలోని వాస్తవిక స్తితిగతులకు విరుద్ధంగా ఉందన్నారు. జి.ఎస్.టి., సర్క్యు లేషన్ వంటి వ్యాపార అంశాలతో పాత్రికేయ వృత్తిని కొలవడం సమంజసం కాదని అన్నారు.
ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టులలో వ్యక్తమవుతున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని అక్రెడిటేషన్ విధానాన్ని మార్చాలని కోరారు. కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి తన చాంబరునుండి కారిడార్ లోకి వచ్చి యూనియన్ నాయకులు అందచేసిన వినతిపత్రాన్ని తీసుకున్నారు. చర్చలకు రావాల్సిందిగా నాయకులను కోరారు. చర్చలఅనంతరం అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ ఇచ్చిన హామీల అమలును పరిశీలిస్తామని జర్నలిస్టులకు న్యాయంజరగని పక్షంలో యూనియన్ తన ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు జనవరి 7వ తేదీ గురువారం ముగియనున్నాయి. గత ఏడాది డిసెంబరు 14న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు 25 రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు ప్రతి రోజు గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదిస్తున్నారు. ఈ 25 రోజుల్లో ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను శ్రీవైష్ణవులు స్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పారాయణం చేస్తున్నారు. కాగా అధ్యయనోత్సవాల్లో తొలి 11 రోజులను పగల్పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీ వరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున తణ్ణీరముదు ఉత్సవంతో ఈ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.
నిరుపేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. నవరత్నాలులో భాగంగా పేదలకు శాశ్వతంగా ఆవాసాలను కల్పించే పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే నెంబరు 1 స్థానంలో నిలిచింది. జిల్లాలో డిసెంబరు 25 న ప్రారంభమైన పట్టాల పంపిణీ కార్యక్రమం, 30న ముఖ్యమంత్రి రాకతో మరింత ఊపందుకొని, ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. కొన్ని పెద్ద కాలనీలు మినహా, సుమారు 78శాతం జగనన్న కాలనీల్లో పట్టాల పంపిణీ ఇప్పటికే పూర్తి అయ్యింది. పేదలు ఏళ్లతరబడి కంటున్న కలలను నిజం చేస్తూ, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రభుత్వ ఉత్తుర్వులు మరకు, మంత్రుల సూచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ పర్యవేక్షణలో పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడి ఎంఎల్ఏలు, మంత్రుల చేతులమీదుగా పట్టాల పంపిణీ జరుగుతోంది. విజయనగరం నియోజకవర్గంలో డిసెంబరు 30న జరిగిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి పాల్గొని తన చేతులతో పట్టాలను పంపిణీ చేయడం ద్వారా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్లలో ఒకటైన గుంకలాం లేఅవుట్లో 12,301 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులంతా ప్రతీరోజూ ఉత్సాహంగా పట్టాలను పంపిణీ చేస్తూ, పేదల ఆశలను నిజం చేస్తున్నారు. చాలాచోట్ల పట్టాలతోపాటుగా ఇళ్లును కూడా ప్రభుత్వం మంజూరు చేయడంతో, మరోవైపు లబ్దిదారులు పునాదులు తవ్వేందుకు కూడా సన్నద్దమవుతున్నారు.
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద జిల్లాలో 72,625 మందిని కొత్తగా ఇళ్ల పట్టాల పంపిణీకి అర్హులుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వీరిలో 4వ తేదీ నాటికి సుమారు 39,772 మందికి పట్టాలను పంపిణీ చేయడం పూర్తయ్యింది. కొన్నిచోట్ల జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఎంఎల్ఏల చేతులమీదుగా పట్టాల పంపిణీ జరగ్గా, మరికొన్ని చోట్ల వాలంటీర్లే ఇంటింటికీ వెళ్లి మరీ, లబ్దిదారులకు భద్రంగా పట్టాలను అందజేస్తున్నారు. టిట్కో ఇళ్లకు సంబంధించి జిల్లాలో 8,048 మందిని అర్హులుగా గుర్తించగా, వీరిలో 5,207 మందికి ఇప్పటికే వాటికి సంబంధించిన పత్రాలను అందజేయడం జరిగింది. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద పట్టాల పంపిణీకి జిల్లాలో 1164 లేఅవుట్లను రూపొందించి, జగనన్న కాలనీలను అన్ని హంగులతో పంపిణీకి సిద్దం చేయగా, వీటిలో 911 కాలనీల్లో ఇప్పటికే పట్టాల పంపిణీ పూర్తి చేయడం చెప్పుకోదగ్గ విశేషం. ఆక్రమిత స్థలాల రెగ్యులైజేషన్, పొజిషన్ పట్టాల పంపిణీ, కోర్టు పత్రాల పంపిణీలో కూడా ఇతర జిల్లాల కంటే విజయనగరం జిల్లా ఎంతో ముందంజలో ఉంది. ఆక్రమిత స్థలాల రెగ్యులైజషన్, పొజిషన్ పట్టాలకు సంబంధించి మొత్తం 25,274 మందిని అర్హులుగా గుర్తించగా, ఇప్పటికే 19,572 మందికి పొజిషన్ సర్టిఫికేట్లను అందజేశారు. కోర్టు కేసుల కారణంగా పెండింగ్ లో ఉన్న పట్టాల పంపిణీకి సంబంధించి, 47శాతం మందికి ఇప్పటికే లేఖలను అందజేయడం పూర్తయ్యింది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత తమ సొంతింటి కల సాకారం అవుతుండటంతో, లబ్దిదారుల ఇళ్లలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయ్యింది.
ఆంధ్రప్రదేశ్ లోని హిందు ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులను ఇటు కేంద్ర ప్రభుత్వం,అటు నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయం సునిశితంగా గమనిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తాజాగా ఈరోజు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శ్రీలక్షి వరాహ నరసింహ స్వామి వారి ఆలయ ముఖద్వారం పై చేతిని విరగొట్టటం తో ఈ ఆందోళన ఉత్తరాంద్ర నుంచి రాజమండ్రి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి విగ్రహం, విజయవాడలో సీతా దేవి విగ్రహం ధ్వంసం చెయ్యగా తాజాగా సింగరాయకొండ వరకు అంటే కోస్తా జిల్లాల్లో ఉద్రిత్కథ విస్తరించింది. ఈ రోజు బీజేపీ,దాని మిత్ర పక్షం జనసేన తలపెట్టిన ధర్మ యాత్ర ను రామతీర్థం చేరకుండా ముందుగానే 30 సెక్షన్ విధించిన పోలీసులు నివారించే భాగంలో జరిగిన తోపులాట లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కిందపడ్డారు కూడా. ఈ విషయంలో అటు జాతీయ బీజేపీ,అలాగే ఆయన ఆర్ ఎస్ ఎస్ నేపధ్యము కలిగి ఉండటంతో అటు ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయం కూడా ఈ పరిస్థితిపై నిశితంగా ఆరాతీస్తున్నాయి అని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. హిందు దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను నిలవరించక పోవటంలోను,జరిగిన దాడులపై సరైన చర్యలు తీసుకోలేకపోవటం వెనుక జరుగుతున్న పరిణామాలను పూర్తీ వివరాలతో నివేదికను రాష్ట్ర గవర్నర్ నుండి కోరే అవకాశాలున్నట్లు విశ్వనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటివరకు కొంత సమన్వయంతో ఉన్న జాతీయ బీజేపీ శ్రేణులు,ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయం కూడా ఈ రోజు సోము వీర్రాజు తోపులాటలో క్రింద పడటాన్ని సీరియస్ గా తీసుకుని నివేదిక వచ్చేవరకు వేచి చూసి అంతరం తీసుకోవలసిన చర్యలు గూర్చి ఒక కొలిక్కి వస్తాయి అని భావిస్తున్నారు. కాగా ఇప్పటివరకు టీడీపీ పై మాత్రమే విమర్శలు కురిపిస్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజుని విమర్శిస్తున్న వారు,ఈ రోజు ధర్మయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం పై ఆయన చేసిన శపథం తీరు గమనిస్తే బీజేపీ అటు పుష్కరాల సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 40 ఆలయాలు కూల్చి వేత, ఇప్పటి ప్రభుత్వంలో జరుగుతున్న వరుస దాడులపట్ల సమాంతర దృష్టితో వెళుతున్నారని తేటతెల్లం అయిందని పరిశీలకుల భావన. మాజీ మంత్రి బీజేపీ నాయకుడు కే.శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ను తమ పార్టీ నేతలను రామతీర్థం వెళ్లనివ్వకుండ అడ్డుకున్న ఈ ప్రభుత్వం ఫలితాన్ని అనుభవిస్తుంది అని ఆగ్రహిం వ్యక్తం చేశారు.
ఇది ఇలా వుండగా శ్రీకాళహస్తిలో ఈ ఉదయం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నేతలని రామతీర్థం అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుందని జరగబోయే పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలని హెచ్చరించారు.రామతీర్థం కొండ మీదికి టీడీపీ, వైసిపిని అనుమతించి మమ్మల్ని అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకుని డ్యూటీ చేయండి అన్నారు. పోలీసులకి జీతాలు ఇస్తోంది వైసీపీ ఆఫీసా..లేక రాష్ట్ర ప్రభుత్వమా అని ప్రశ్నించారు.
ఏపీలో మనవహక్కుల ఉల్లంఘనపై పోలీసుల దమన కాండ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నటు వీస్ట్నువర్ధన రెడ్డి పేర్కొన్నారు.
60ఏళ్ల వయసున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఏపీలో పోలీసుల ప్రభుత్వం ,పోలీసుల వైపల్యం వలనే వరుస సంఘటనలు జరుగుతున్నాయని పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్ణు వర్ధన్ రెడ్డి ఆగ్రహంతో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ యూనివర్శిటీల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు(పీఆర్వో)ల కొరత దారుణంగా పట్టిపీడిస్తుంది. ఏ ఒక్క యూనివర్శిటీలో కూడా సక్రమంగా సమాచారం మీడియాకి అందించేందుకు ఒక్క పీఆర్వో కూడా లేదు. చాలా యూనివర్శిటీల్లో జర్నలిజం విభాగంలో చదివే విద్యార్ధులు, విభాగాల అధిపతులు పీఆర్వో బాధ్యతలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు. వాస్తవానికి ప్రభుత్వ యూనివర్శిటీల్లో పరీక్షలు, తరగతులు, పరీక్షల ఫీజులు, ఇతరత్రా అంశాలను ఎప్పటి కప్పుడు విద్యార్ధులందరికీ తెలియజేయాల్సి వుంటుంది. ఆ సమాచారం యూనివర్శిటీ వెబ్ సైట్లలో కూడా సక్రమంగా పెట్టడం లేదు. కొన్ని యూనివర్శిటీల్లో ప్రైవేటు వ్యక్తులను యూనివర్శిటీ అధికారులు వినియోగించుకుంటున్నారు. వారికి ఇంగ్లీషు ప్రెస్ నోట్లు తెలుగులోకి తర్జుమా చేయడం రాక వాటినే మీడియాకి అలా పంపేస్తున్నారు. దీనితో చాలా మీడియా సంస్థల్లో జర్నలిస్టులకు ఇంగ్లీషుపై పట్టు తక్కువగా వుండటంతో ముఖ్యమైన ఇంగ్లీషు ప్రెస్ నోట్లు బుట్టదాఖలవుతున్నాయి. దానికితోడు ఏ యూనివర్శటీలోనూ పీఆర్వోగా పనిచే ప్రైవేటు వ్యక్తులకు న్యూస్ ఫార్మాట్ లో ప్రెస్ నోటు పంపే అవగాహన లేదు. అక్కడ ఏం జరిగిందో తెలియజేసే క్రమం కూడా సక్రమంగా రాకపోవడం శోచనీయం. ప్రభుత్వం యూనివర్శిటీల్లో పీఆర్వోల నియామకానికి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా ప్రైవేటు యూనివర్శిటీల తరచుగా మీడియా ద్వారా ఇచ్చే సమాచారం విద్యార్ధులు కూడా ప్రైవేటు యూనివర్శిటీల్లో చదువుకునేందుకే మొగ్గు చూపిస్తున్నారు. కొన్ని యూనివర్శిటీల్లో పీఆర్వోలు ఉన్నా వారంతా ప్రధానన మీడియా సంస్థలకు మాత్రమే సమాచారన్ని కొద్దో గొప్పో పంపిస్తున్నారు. అసలు ఒక ప్రభుత్వ యూనివర్శిటీలో ఏం జరుగుతుందో సదరు పీఆర్వోనే విద్యార్ధులకు అధికారిక యూనివర్శిటీ వెబ్ సైట్ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి వుంది. కొన్న సమయాల్లో యూనివర్శిటీ వెబ్ సైట్లలో సమాచారం వుంచినా దానిని ఎవరూ చూసే పరిస్థితి ఉండటం లేదు. వివిధ యూనివర్శిటీలో వైస్ చాన్సలర్స్ కి పీఆర్వోలను నియమించుకునే అధికారాలు ఉన్నప్పటికీ వారు వారి పదవి కాపాడుకోవడానికే సమయాయాన్ని వెచ్చిస్తున్నారు తప్పితే విద్యార్ధులకు యూనివర్శిటీకి సంబంధించి అన్ని రకాల సమాచారాన్ని అందించాలనే యోచన చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సమాచారం మీడియాకి తెలుగులో ఇస్తే తప్పా విద్యార్ధులకు త్వరగా చేరే పరిస్థితి లేదు. ఇంగ్లీషులో పత్రికలు, మీడియాల్లో విషయం వచ్చినా యూనివర్శిటీ విద్యార్ధులకు రీచ్ కావడం లేదు. ప్రస్తుత కాలంలో విద్యార్ధులు, అద్యాపకులు, యూనివర్శిటీ సిబ్బంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్న తరుణంలో పీర్వోల అవసరం మరింత అనివార్యం అయ్యింది. సమాచారాన్ని కరెక్టుగా మీడియాకి పంపితే వారంతా పోటీ మీద మొబైల్ న్యూస్ యాప్ లు, న్యూస్ వెబ్ సైట్లు, లోకల్ కేబుల్ టీవీ ఛానళ్లలో స్క్రోలింగ్ ద్వారా సమాచారం విద్యార్ధులకు చేరవేస్తున్నారు. కరోనా లాంటి సమయంలో పీఆర్వోల అవసరం కొట్టొచ్చినట్టు తెలిసినా ప్రభుత్వం పీఆర్వోలను నియమించే ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు. ఫలితంగా యూనివర్శిటీల్లో జర్నలిజం విభాగం వాటిని పూర్తిస్థాయిలో మీడియాకి అందించే ఏర్పాటు చేయడంలేదు. యూనివర్శిటీలో విద్యార్ధులకు క్రమం తప్పకుండా సమాచారాన్ని మీడియా ద్వారా అందించేందుకు పీఆర్వోల ద్వారా ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో పలు యూనివర్శిటీల వీసీలను ఈఎన్ఎస్ వివరణ కోరగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని చెప్పారు. కొన్ని సమయాల్లో విద్యార్ధులు ఇబ్బంది పడకుండా ప్రైవేటు వ్యక్తులు, పీజి విద్యార్ధుల సహాయంతో మీడియాకి సమాచారన్ని పంపిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇలాంటి తరుణంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పా ప్రభుత్వ యూనివర్శిటీల సమాచారం సక్రమంగా మీడియా ద్వారాగానీ, యూనివర్శిటీల వెబ్ సైట్ ద్వారా గానీ అందించే వీలుపడదు..!
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 4.26 లక్షల మంది భక్తులకు తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్టు టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి తెలిపారు. టిటిడి తొలిసారిగా ప్రారంభించిన 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి శాస్త్ర సహేతుకంగా అంగీకరించిన పీఠాధిపతులకు, తిరుమల పెద్దజీయంగార్, చిన్నజీయంగార్లకు, ఆగమపండితులకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఈ 10 రోజుల పాటు భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్క టిటిడి ఉద్యోగికి పేరుపేరునా అభినందనలు చెప్పారు. 10 రోజులు వైకుంఠ ద్వార దర్శన నిర్ణయానికి గొప్ప ప్రాచుర్యాన్ని, సహకారాన్ని అందించిన మీడియా మాధ్యమాలన్నింటికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, టిటిడి భద్రతా సిబ్బందికి, పోలీసులకు, పుష్పాల దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు టిటిడి ఈఓ..