ఆంధ్రవిశ్వవిద్యాలయంతో బిఎస్ఎన్ఎల్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్, ఎంబిఏ విద్యార్థులకు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను, సాంకేతిక అంశాలపై శిక్షణ అందించే దిశగా ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. శనివారం ఏయూ పాలకమండలి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం ఇంటర్న్షిప్, నైపుణ్య శిక్షణను భాగం చేసిందన్నారు. దీనిని ఏడాదిన్నర క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి ప్రతిపాదించారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి దీనిని ఆచరణలో చూపడం జరుగుతోందన్నారు. విశ్వవిద్యాలయ పరిశోధకులకు ఇటువంటి శిక్షణ తరగతులు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయన్నారు. వర్సిటీతో సంయుక్తంగా పరిశోధనలు జరపాలని ఆహ్వానించారు.
బిఎస్ఎన్ఎల్ పిజిఎం పి.విలియమ్స్ మాట్లాడుతూ దేశానికి మానవ వనరులే సంపదగా నిలుస్తున్నాయన్నారు. వీరికి మెరుగైన నైపుణ్యాలు, సామర్ధ్యాలను అందించే దిశగా కలసి పనిచేయాల్సిన అవసరం ఉదంన్నారు. విద్యార్తులకు అవసరమైన ప్రత్యక్ష జ్ఞానాన్ని అందించడంలో బిఎస్ఎన్ఎల్ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు.బిఎస్ఎన్ఎల్ ఏజిఎం ఎం.సత్యప్రసాద్ శిక్షణలో భాగంగా అందించే శిక్షణ కార్యక్రమాలు, కోర్సు వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.కె భట్టి, అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంకట రావు, డీన్ ఆచార్య ఏ.భుజంగ రావు తదితరులు పాల్గొన్నారు.
ఎందరో అభిమానులకు ఆరాధ్యుడు రజనీకాంత్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆ భగంతుడ్ని ప్రార్థిస్తున్నటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్ చందర్ అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు రజనీకాంత్ సేవలు ఎంతో అవసరమన్నారు. త్వరలో ఆయన రాజకీయాలలోకి వచ్చి సమాజానికి సేవలు అందించాలని విజయ్ చందర్ ఆకాంక్షించారు. తెలుగుప్రజలకు అతి దగ్గరవాడైన రజనీకాంత్ కోలుకొని తన అనుకున్న లక్ష్యాలను సాధించే సంకల్పంతో మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వస్తారని విజయ్ చందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అస్వస్థకు గురయ్యారని తెలియగానే ఎంతో ఆవేదనకు గురయ్యారని అన్న ఆయన ఆయన త్వరగా కోలుకోవాలని ఆ షిర్డీసాయినాధుడిని మనసారా కోరుతున్నానని చెప్పారు.
నా సుదీర్ఘ 3,648 కి.మీ..పాదయాత్రలో గూడులేని పేదల కష్టాలను ప్రత్యక్షంగా చూశానని, అందుకే పేదలకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో శుక్రవారం మొదలు 15 రోజుల పాటు పట్టాల పంపిణీ పండగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో యు.కొత్తపల్లి మండలంలోని కొమరగిరి గ్రామంలోని భారీ లేఅవుట్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కాచెల్లెమ్మలకు 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తూర్పు కిరణాల సాక్షిగా పేద మహిళలకు ఇళ్ల పట్టాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి శుభదినాన ఇల్లులేని పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. మొత్తం 28.30 లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా తొలిదశలో 15.60 లక్షల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రెండో దశలో 12.70 లక్షల ఇళ్లు నిర్మించనున్నామన్నారు. రూ.50,940 కోట్ల వ్యయంతో రెండు దశల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సొంత ఇల్లు లేని పేద మహిళలకు 17,005 జగనన్న వైఎస్సార్ కాలనీల్లో లే అవుట్లను అభివృద్ధి చేసి, ఇళ్ల స్థలాలను ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఇంతకంటే నాకు దేవుడు ఇచ్చిన వరం ఏముంటుందన్నారు. ఈ జన్మకు ఇది చాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా సెంటున్నర భూమి, పట్టణ ప్రాంతాల్లో సెంటు నుంచి సెంటున్నర భూమిలో ఇళ్ల పట్టాలను మహిళా లబ్ధిదారులకు దాదాపు 68,361 ఎకరాల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.21,345 కోట్ల విలువగల 2.62 లక్షల టిడ్కో ఇళ్ల సేల్ అగ్రిమెంట్లను కూడా అక్కాచెల్లెమ్మలకు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇళ్ల స్థలాల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉండి, ఇల్లు లేనివారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోనే ఇంటి పట్టా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పేదలకు సొంతింటితో సామాజిక గౌరవాన్ని కల్పిస్తామన్నారు.
కాలనీలు కాదు.. ఊళ్లకు ఊళ్లే రాబోతున్నాయి
కొమరగిరి లేఅవుట్ను చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లు రాబోతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ లేఅవుట్లో దాదాపు 16,681 ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో వైఎస్సార్ జనతా బజార్, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రం, బస్టాప్, అంగన్వాడీ కేంద్రాలు, ఫంక్షన్ హాల్, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, కమ్యూనిటీహాల్, పార్కులు తదితరాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాలనీల పరిమాణాన్నిబట్టి మురుగునీటి వ్యవస్థ, అప్రోచ్ రోడ్లు, విద్యుత్, తాగునీరు... ఇలా సకల సామాజిక మౌలిక వసతులను ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కనీసం రూ.4 లక్షల మార్కెట్ విలువగల ప్లాటును ఈ రోజు అక్కాచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నట్లు తెలిపారు. ఓ అన్నగా, తమ్ముడిగా ఉంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని దేవుడు నాతో చేయిస్తున్నందుకు ఎంతో ఆనందపడుతున్నానన్నారు. పక్కా ఇల్లు లేకపోతే కష్టం ఎలా ఉంటుందో పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూశానన్నారు. పేదలు తాము సంపాదించిన మొత్తంలో దాదాపు 35 నుంచి 40 శాతం అద్దెలకే చెల్లించి ఎంతో కష్టాలు అనుభవిస్తుండటాన్ని గమనించానన్నారు. చాలీచాలని జీతాలతో బతుకు బండిని లాగిస్తున్న పేదల బతుకులను కళ్లారా చూశానన్నారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చాలనే ఉద్దేశంతో ఎన్నికల మ్యానిఫెస్టోలో పేదలకు సొంతిళ్ల అంశాన్ని చేర్చామని, మ్యానిఫెస్టో తనకు ఓ బైబిలు, ఖురాన్, భగవద్గీత అని పేర్కొన్నారు. అందుకే మ్యానిఫెస్టో అమలుకు అహర్నిశలూ కృషిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీలు, మతాలు, కులాలు, రాజకీయాలు, వర్గాలు.. ఇలా ఏవీ చూడకుండా అర్హత మాత్రమే ప్రాతిపదికగా అయిదేళ్లలో 25 లక్షల ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చామని, కానీ.. అంతకుమించి ఈ రోజు 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.95 కోట్లు.. అయితే ఇప్పుడు ఇంటి పట్టాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా కోటి 24 లక్షల మంది జనాభాకు మేలు జరుగుతోందని సగర్వంగా చెబుతున్నాను. 340 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
* అందరూ కలిసి ఉంటేనే అది రాజధాని*
అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన వారు అందరూ కలిసి ఉండగలిగితేనే అది రాజధాని అవుతుందని, దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అందరికీ చోటిస్తేనే అది సమాజమని, అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వమవుతుందన్నారు. అలాంటి రాజధానిని, సమాజాన్ని, ప్రభుత్వాన్ని దేవుని చల్లని దీవెనలతో తప్పనిసరిగా నిర్మించుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఏ పథకం కావాలి?
టిడ్కో ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టి, మధ్యలో వదిలేసి వెళ్లిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2.62 లక్షల టిడ్కో గృహాలను త్వరలోనే పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. టిడ్కో ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం మరో రూ.9,500 కోట్లు ఖర్చు చేయనుందన్నారు. 300 చదరపు అడుగుల లోపు ఇంటికయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కేవలం ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు ఇచ్చే జగనన్నపథకం కావాలో.. లేదంటే రూ.2 లక్షల 65వేల బ్యాంకు రుణాన్ని 20 ఏళ్లపాటు వడ్డీతో పాటు రూ.7.20 లక్షలు ఖర్చయ్యే గత ప్రభుత్వ స్కీం కావాలో తేల్చుకోవాలని ముఖ్యమంత్రి లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు.
ఇంకా ముఖ్యమంత్రి ఏమన్నారంటే:
- అక్కాచెల్లెమ్మలకు లేఅవుట్లను అభివృద్ధి చేసిన 68,361 ఎకరాల భూమి మార్కెట్ విలువ రూ.25,530 కోట్లు.
- ఇళ్లను కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ప్రతి లేఅవుట్లోనూ ఓ మోడల్ ఇంటిని నిర్మించాం. అదే విధంగా ప్రతి ఒక్కరికీ ఇళ్లను ఇస్తాం.
- ప్రతి ఇంటిలో ఓ బెడ్రూం, లివింగ్ రూం, కిచెన్, వరండా, మరుగుదొడ్డి, స్నానాలగది, పైన సింటెక్స్ ట్యాంకు ఉంటుంది. రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్లైట్లు, రెండు ఎల్ఈడీ బల్బులు వంటివి ఉంటాయి.
- జగనన్న వైఎస్సార్ కాలనీలు ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున 13 లక్షల మొక్కలు నాటుతాం.
- అవినీతికి, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఇళ్ల స్థలాల కేటాయింపు చేశాం. సామాజిక తనిఖీ ప్రక్రియను చేపట్టాం.
- న్యాయపరమైన సమస్యలు తొలగిపోయిన అనంతరం ప్రస్తుతమిస్తున్న హౌస్సైట్ పట్టాల స్థానంలో అన్ని హక్కులతో అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తాం.
- రూపాయి లంచానికి కూడా తావులేకుండా 18 నెలల కాలంలో రూ.77 వేల కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేశాం.
- నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ద్వారా 30 రకాల పనుల ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థకు ఊతం తు లభిస్తుంది.
- 1978 నాటి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కును చట్టబద్ధమైన హక్కుగామార్చడం జరిగింది. దీనికోసం కృషిచేస్తుంటే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు.
మూడు ప్రత్యామ్నాయాలు
- ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇళ్లను కూడా కట్టించి ఇవ్వనున్నందున ప్రభుత్వం మూడు ఆప్షన్లను లబ్ధిదారుల ముందు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు.
అవి.. 1. నమూనా ఇంటి ప్రకారం ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్ ఛార్జీలను కూడా ఇస్తుంది. లబ్ధిదారుడే ఇల్లు కట్టించుకోవచ్చు.
2. ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారుడికే దశల వారీగా పూర్తి మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుంది. దీంతో లబ్ధిదారుడే ఇల్లు కట్టుకోవచ్చు.
3. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని ఇంటిని నిర్మించి ఇస్తుంది. ఈ మూడింటిలో దేన్నయినా లబ్ధిదారుడు ఎంపికచేసుకోవచ్చు. ఇలా ప్రభుత్వమే లబ్ధిదారుడి చేయి పట్టుకొని సొంతింటికి నడిపిస్తుంది.
శుక్రవారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా, యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకాన్ని రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి స్వాగతం పలుకగా, స్థానిక పిఠాపురం శాసన సభ్యులు పెండెం దొరబాబు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పరిపాలనా వికేంద్రీకరణలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను 2019 అక్టోబరు 2వ తేదీన తూర్పు గోదావరి జిల్లా నుండే ప్రారంభించారని, అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పధకం క్రింద ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్ల మంజూరు బృహత్తర కార్యక్రమాన్ని కూడా ఈ జిల్లా నుండే ప్రారంభించడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 17 లక్షల కుటుంబాల్లోని 22 శాతంగా 3 లక్షల 25 వేల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయన్నారు. తొలి దశగా 2,725 కోట్ల వ్యయంతో లక్ష 53 వేల లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఈ రోజు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయడం అనందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమం కొసం దాదాపు 3168 కోట్లు బడ్జెట్ కేయించి ముఖ్యమంత్రి ఆర్థికమైన, నైతిక మైన మద్దతు కల్పించడంతో కరోనా కలకలం, అధిక వర్షాలు, వరదలు ఎదురైనా లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలిగామని తెలిపారు.
సభకు అధ్యక్షత వహించిన స్థానిక పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ కొమరగిరిలో ఇళ్ల స్థలాలు పొందుతున్న లబ్దిదారులందరూ కాకినాడ సిటీ వారైనా, మంచి కార్యక్రమాన్ని తన నియోజక వర్గంలో ప్రారంభిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, అందరినీ గుండెలలో పెట్టి చూసుకుంటానని తెలిపారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా నాడు డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పవిత్ర క్రిస్టమస్, ముక్కోటి ఏకాదశి కలిసి వచ్చిన పర్వదినాన ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. దేవుడి దీవనలు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశీస్సుల బలంతో ప్రతి పేదకు నిలువనీడ కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెడ్డి చేపట్టిన సంకల్పాన్ని ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అపలేరన్నారు. నియోజక వర్గంలో ఎన్నిక సందర్భంగా 10 వేల ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చానని, ముఖ్యమంత్రి దయ వల్ల 31 వేల మందికి నియోజక వర్గ పరిధిలో ఇళ్లు కల్పించే అవకాశం తనకు లభించిందన్నారు.
ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పేదలందరి జీవితాల్లో సామాజిక భద్రత, గౌరవం కల్పిస్తూ సొంతింటి కలను సాకారం చేస్తున్న నవరత్నాలు – పేదలందరికి ఇళ్ల కార్యక్రమం ప్రారంభమౌతున్న ఈ రోజు వారందరికీ నిజమైన పండుగ రోజన్నారు. తొలి విడతగా 15.65 లక్షల ఇళ్లు చేపట్టగా, వచ్చే డిశంబరు నుండి మరో 12 లక్షల ఇల్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. పేదల ఇళ్ల స్థలాల కొరకు స్వచ్చందంగా భూములు అందించిన రైతులందరి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
అలాగే కార్యక్రమంలో సిసిఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ బృహత్త ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాల మహత్త ఆశయాలను వివరించారు.
‘క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి ఒకే రోజు రావడం చాలా అరుదైన సందర్భం. ఇంత మంచి రోజున రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నాను కానీ, పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నాననే చిన్న బాధ మనసులో ఉందన్నారు. నిన్ననే ఓ వ్యక్తి హై కోర్టుకు వెళ్లి పులివెందులలో పేదలకు ఇచ్చే 8,300 ఇళ్ల పట్టాలు ఏపీఐఐసీ భూముల్లో ఇవ్వకూడదని స్టే తీసుకురావడం మనసుకు బాధ అనిపిస్తుందన్నారు.
‘ఏపీఐఐసీ అయినా ప్రభుత్వమే.. భూములు ఇచ్చేది ప్రభుత్వమే. ఏపీఐఐసీలో భూములు చాలా ఉన్నాయి. అక్కడ పరిశ్రమలు వస్తే.. పరిశ్రమల్లో పనిచేయడానికి చాలా ఇళ్లు ఉంటేనే వర్క్ఫోర్స్ అందుబాటులో ఉంటుందని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేసులు వేసి అడ్డుకుంటున్నారు. జరిగే ప్రతి మంచిని అడ్డుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31.75 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అందులో 3.70 లక్షలు 10 శాతం ఇళ్ల పట్టాలు రకరకాల కుట్రల వల్ల ఆలస్యం అవుతున్నాయి. కానీ, పైనుంచి దేవుడు చూస్తున్నాడు. త్వరలో సుప్రీం కోర్టు వరకు వెళ్లి అయినా సరే స్టేలు ఎత్తేయించి.. పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగిపోయిన ప్రాంతాల్లో అందరికీ ఇళ్ల పట్టాలు అందజేసి ఇళ్లు కూడా కట్టిస్తాం. మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా గొప్పగా ప్రజలందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నాను’ అని సీఎం వైయస్ జగన్ అన్నారు.
తిరుమలలో 10 రోజుల పాటు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు శుక్రవారం ఉదయం 7- 30 గంటల నుంచే దర్శనం ప్రారంభిస్తామని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనం లో గురువారం సాయంత్రం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీయర్ స్వాములు, ఆగమ సలహాదారులు, దేశవ్యాప్తంగా అనేకమంది మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు తీసుకుని వైష్ణవ సంప్రదాయం ప్రకారం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేయించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరిస్తూ జూన్ 8వ తేదీ 5 వేల మందితో దర్శనం పునరుద్దరించామన్నారు. కోవిడ్ నిబంధనలు గట్టిగా అమలు చేస్తూనే ప్రస్తుతం రోజుకు 35 వేల మందికి దర్శనం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కూడా ఇదే సంఖ్యలో దర్శనాలు పరిమితం చేయాలని నిర్ణయించామని చైర్మన్ తెలిపారు. ఇందుకోసం రోజుకు 20 వేల రూ 300 టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేశామన్నారు. రోజుకు 10 వేల చొప్పున తిరుపతి స్థానికులకు 10 రోజులకు లక్ష సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్ట్, ప్రోటోకాల్ వీఐపీలకు దర్శనం ఇస్తున్నట్లు చైర్మన్ చెప్పారు.
వైకుంఠ ఏకాదశి శుక్రవారం వస్తున్నందున అభిషేకం అనంతరం ఉదయం 4 గంటలకు ప్రోటోకాల్ వీఐపీలకు, తరువాత,శ్రీవాణి టికెట్ల వారికి దర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 7.30 గంటల నుంచే సామాన్య భక్తులకు దర్శనం ప్రారంభిస్తామని అన్నారు.
తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులపై ఎక్కడా లాఠీచార్జి జరగలేదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. భక్తులపై లాఠీచార్జి జరిగినట్లు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు చైర్మన్ ఈ సమాధానం ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లలో టీటీడీ యంత్రాంగం సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం తనకు ఇష్టం లేదని విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేసే అంశం పరిశీలిస్తున్నామని అన్నారు. కావాలని తప్పుడు ప్రచారం చేసే వారిని ఆ దేవుడే శిక్షిస్తాడని చెప్పారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో కొత్త సంవత్సరం లో కళ్యాణమస్తు కార్యక్రమం ప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. భక్తులకు సేవ చేస్తున్న శ్రీవారి సేవకులు టీటీడీ నిర్వహించే అన్ని ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుమల ఆస్థాన మండపం లో గురువారం నిర్వహించిన శ్రీవారి సేవకుల సమావేశంలో చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తి స్పూర్తి గా 2000 నవంబరు లో కంచి పీఠాధిపతి స్వర్గీయ శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి శ్రీవారి సేవ ప్రారంభించారన్నారు. 200 మందితో ప్రారంభమైన శ్రీ వారి సేవలో 20 ఏళ్లలో సేవ అందించిన 12 లక్షల మంది సేవకులకు ఆయన అభినందనలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో కూడా సేవ కోసం వచ్చిన సేవకులు తిరుమల సహా అన్ని స్థానిక ఆలయాల్లో కూడా మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ భక్తులు కూడా వీటిని పాటించేలా చేయాలని కోరారు.
సి ఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో టీటీడీ దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీల్లో 500 ఆలయాలు నిర్మించబోతున్నామని ఆయన తెలిపారు. గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా గోవులను పోషించుకోగలిగే ఆలయాలకు గోవులను ఇవ్వనున్నట్లు చెప్పారు. పేద ప్రజలు పిల్లల పెళ్లిళ్ల కోసం అప్పుల పాలు కాకుండా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పెళ్ళిళ్ళు చేయించడానికి కొత్త సంవత్సరం లో కళ్యాణ మస్తు కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెళ్లి చేసుకునే జంటకు బట్టలు, మంగళ సూత్రం ఇవ్వడంతో పాటు ఇరు వైపుల వారికి భోజనం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
బ్రహ్మోత్సవాల తరహాలో ఈ సారి నుంచి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కూడా 10 రోజులు నిర్వహిస్తున్నామని చైర్మన్ చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు సేవ చేయడం మహాభాగ్యమని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీ సత్యసాయి సేవా సమితి వారు శ్రీ వారి సేవకులకు శిక్షణ ఇస్తుండటం ప్రశంస నీయమన్నారు.
టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, భక్తుల కోరిక, పీఠాధి, మఠాధిపతుల సలహా మేరకు 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అమలు చేస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు. శ్రీ వారి సేవకులు కోవిడ్ 19 నిబంధనలు జాగ్రత్తలు పాటిస్తూ భక్తులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. మాస్కు లు ధరించని వారికి వివరించి చెప్పాలని, క్యూ లైన్లు,ఆలయం తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, చేతులు శుభ్రం చేసుకునేలా చేయాలని కోరారు.
ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ, ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ రవి తో పాటు ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ విశాఖ యువజన అధ్యక్షులు, అధికార ప్రతినిధి కొండారాజీవ్ గాంధీ తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విశాఖ వైఎస్సార్సీపి పార్టీ కార్యాలయ మేనేజర్ రంగయ్యను స్వయంగా గుంటూరు వెళ్లి పరామర్శించారు. అంతేకాదు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10వేలు ఆర్దిక సహాయం కూడా చేశారు. రంగయ్య ఇటీవల కాలంలో అస్వస్థతకు గురై గుంటూరులోని లలిత ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయంతెలుసుకున్న రాజీవ్ వెంటనే గుంటూరు వెళ్లి రంగయ్యను పరామర్శించి వారికుటుంబానికి దైర్యం చెప్పి వచ్చారు. అంతేకాకుండా ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తనకు సమాచారం అందించాలని కూడా భరోసా ఇచ్చారు. దేవుడి దయవల్ల రంగయ్య అనతికాలంలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ నవ్వుతు తిరిగి విశాఖ పార్టీ కార్యాలయానికి తిరి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.