శ్రీకాకుళం జిల్లాలోని రైతాంగానికి ఎట్టిపరిస్థితిల్లోనూ యూరియా కొరత ఉండరాదని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులకు స్పష్టం చేసారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వ్యవసాయానికి సంబంధించి రైతులకు అవసరమైన ఎరువులు పుష్కలంగా ఉన్నాయని, ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ, మార్కెఫెడ్ సమన్వయంతో పనిచేసి జిల్లాలోని రైతాంగానికి యూరియా కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ బంగ్లాలో రైతాంగానికి యూరియా, విత్తనాలు సరఫరాపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 23,059 మెట్రిక్ టన్నుల ఎరువులు లభ్యంగా ఉన్నాయని, ఇంకా అదనంగా కావలసిన యూరియాను తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తొలుత వ్యవసాయ , మార్కెఫెడ్ శాఖల అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రోజు విడిచి రోజు యూరియా నిల్వలు రప్పిస్తున్నామని, నాలుగు మండలాలను ఒక యూనిట్ గా విభజించి 200 మెట్రిక్ టన్నుల నిల్వలను ఆయా చోట్ల అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఎప్పటికప్పుడు ఆయా స్లాట్ అలాట్మెంట్ లను వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారని, జిల్లాలో ఆగష్టు మాసాంతానికి 18,000 టన్నుల యూరియా అవసరం ఉందని, ప్రస్తుతానికి 11,698 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిలో మూడు వేల టన్నులు ప్రైవేటు ట్రేడర్స్ వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ 10 వేల టన్నులే కాకుండా ఈ నెలాఖరుకు మరో 18 వేల టన్నులు అవసరం ఉంటుందని, అవి సరైన సమయంలోనే జిల్లాకు రానున్నట్లు తెలిపారు. యూరియా తో పాటు డిఎపి 6,400 టన్నులు, ఎంవోపి 2,133 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 3,488 టన్నులు, ఎస్ ఎస్ పి 1,659 టన్నుల నిల్వలు జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా రైతాంగం వినియోగిస్తున్న ఎరువుల అంచనా ప్రకారం దానిని పరిగణలోకి తీసుకొని లక్ష్యాన్ని నిర్ధేశించామని తెలిపారు. 7,500 మెట్రిక్ టన్నుల ఐపిఎల్ ,వెయ్యి టన్నుల స్పీక్, వెయ్యి టన్నుల కోరమండల్ ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు గాను తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని, అక్రమంగా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కు వివరించారు. జిల్లాలో రైతాంగానికి సక్రమంగా వాటిని పంపిణీ అయ్యేలా చూడాలని, ఏ ఒక్క రైతు నష్టపోరాదని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె. శ్రీధర్, మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ కె.యు.పి.రమణి, డి.సి.సి.బి ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి.సత్యనారాయణ, ఆత్మా పథక సంచాలకులు కె.కృష్ణారావు, క్వాలిటీ కంట్రోల్ ఇన్ స్పెక్టర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతున్నదని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళవారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు. ఖాళీగా ఉన్న సహాయ ఎలక్టోరల్ అధికారుల పోస్టులను వెంటనే భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ మాట్లాడుతూ, జనవరి15 నాటికి ఓటర్ల జాబితాలు ప్రచురించడానికి చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుల దరఖాస్తులను జనవరి5 నాటికి పరిష్కరించాలన్నారు.రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ని బూత్ స్థాయి అధికారులుగా నియమించాలన్నారు. నియోజకవర్గ ఇ.ఆర్.ఓ లు లేనిచోట సీనియర్ అధికారులను ఇ.ఆర్.ఓ లుగా నియమించాలన్నారు.రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ కొరకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు నమోదయ్యెందుకు సెప్టెంబర్28,29 తేదీలు, నవంబర్ 12,13 తేదీల్లో స్పెషల్ క్యాంపన్ డేస్ గా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. రాష్ట్రంలో యువతకు ఓటు హక్కు నమోదు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, నియోజకవర్గాల ఈ ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతున్నదని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళవారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు. ఖాళీగా ఉన్న సహాయ ఎలక్టోరల్ అధికారుల పోస్టులను వెంటనే భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ మాట్లాడుతూ, జనవరి15 నాటికి ఓటర్ల జాబితాలు ప్రచురించడానికి చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుల దరఖాస్తులను జనవరి5 నాటికి పరిష్కరించాలన్నారు.రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ని బూత్ స్థాయి అధికారులుగా నియమించాలన్నారు. నియోజకవర్గ ఇ.ఆర్.ఓ లు లేనిచోట సీనియర్ అధికారులను ఇ.ఆర్.ఓ లుగా నియమించాలన్నారు.రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ కొరకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు నమోదయ్యెందుకు సెప్టెంబర్28,29 తేదీలు, నవంబర్ 12,13 తేదీల్లో స్పెషల్ క్యాంపన్ డేస్ గా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. రాష్ట్రంలో యువతకు ఓటు హక్కు నమోదు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, నియోజకవర్గాల ఈ ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయంగా కక్షగట్టి లక్షల్లో గ్రానైట్ వ్యాపారం చేసేవారిని ప్రభుత్వ అధికారులు రూ.215 కోట్ల రూపాయాలు పెనాల్టీ కట్టమనడం ఎంతవరకూ సమంసజమని ఎంఎస్పీ గ్రానైట్ అధినేత పళనివేల్ ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టెక్కలి నియోజకవర్గంలో లింగాలవలస గ్రామంలో గ్రానైట్ క్వారీ విజిలెన్స్ ఎస్పీ పనసా రెడ్డి ఆధ్వర్యంలో 2019 డిసెంబరులో తనిఖీ నిర్వహించారు3 రోజులపాటు నిర్వహించిన సర్వేలో కేవలం 26క్యూబిక్ మీటర్ల వరకు పెనాల్టీ వేశారన్నారు. దీంతో తాము హైకోర్టుకి వెళితే అక్కడ తమకు న్యాయం జరిగి1400 క్యూబిక్ మీటర్లకే పెనాల్టీ వేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. తరువాత హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ ఇద్దరు అధికారులు కక్షగట్టి ఈరోజు కూడా సర్వేచేసి ఇపక్కక్వారీలన్నింటికి కలిపి ఒక్కరినే పెనాల్టీ కట్టాలని వేధించడం బావ్యంకాదని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరుపుతారని కుటుంబాలకు ఆదుకుంటారని కోరుతున్నామని ఎం ఎస్ పి గ్రానైట్ అధినేత పళని వేల్ తెలిపారు.
విశాఖకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎన్.నాగేశ్వరరావు (ఎన్ఎన్ఆర్)కు మరో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టస్ ఇండియా (ఎన్యూజేఐ) ఆధ్వర్యంలో 3 దశాబ్దాలుగా పని చేస్తున్న స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్ఓజే) గవర్నింగ్ కౌన్సిల్లో ఎన్.ఎన్.ఆర్.కు స్ధానం లభించింది. వరుసగా రెండవ సారి ఈ అవకాశం ఆయనకు దక్కింది. న్యూఢిల్లీ కేంద్రంగా 1992 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జర్నలిజం స్కూల్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వుంది. ఎన్యూజేఐ ఉపాధ్యక్షునిగా వరుసగా 2వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్.ఎన్.ఆర్.ను జర్నలిజం స్కూల్ పాలకమండలి సభ్యునిగా తీసుకుంది. జర్నలిజం స్కూల్ పూర్వ గవర్నింగ్ కౌన్సిల్లో ఎన్.ఎన్.ఆర్. కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలను గుర్తించిన పాలకమండలి మరోసారి కౌన్సిల్లోకి అవకాశం కల్పించింది. ఈనెల 24వ తేదీన జరిగిన జర్నలిజం స్కూల్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది.
వై.ఎస్.ఆర్. హైల్త్ క్లినిక్ స్వంత భవనాలు నిర్మాణానికి 400 లేక 450 గజాలు స్థలం పరిశీలించి సిద్దం చేయాలన్నారు. ఆసుపత్రులలో కావలసిన మానవ వనరులను సమీకరించుకోవాలని అధికారులకు తెలిపారు. ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అందుకు అవసరమైన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. పోస్టులు భర్తీ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగాలని తెలిపారు. సిబ్బంది అటెండెన్స్, పనితీరుపై పర్యవేక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాకు కేటాయించిన వెంటిలేటర్స్ అవసరమైన ఆసుపత్రులకు సర్దుబాటు చేసారు. కోవిడ్ బాదిత గర్బిణీలకు, డయాలసిస్ కే.జి.హెచ్. లో చికిత్స అందించే ఏర్పాటు చేయాలని వైధ్యాధికారులు కోరగా పరిశీలించాలని తెలిపారు.
విశాఖనగర పరిధిలోని ప్రతి వార్డుకు అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం అర్భన్ వైద్యసేవలసై అధికారులతో సమీక్షించారు. అర్భన్ పీహెచ్సీల్లో ఇద్దరు డాక్టర్లు, సిబ్బందిని నియమించి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. టెస్టులు గ్రామ, వార్డు స్థాయినుండే నిర్వహించాలన్నారు. గ్రామీణంలో ఆశ వర్కర్లు సేవలు ఉపయోగించుకోవాలన్నారు. సచివాలయాలలో ఇంటర్నెట్ సదుపాయలు ఏర్పాటుచేసి, డిజిటల్ అసిస్టెంటు ద్వారా డేటా నమోదు చేయించాలన్నారు. డిజిటల్ అసిస్టెంటు లేకపోతే తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలన్నారు. పనులన్నీ సత్వరమే చేయాలని జిల్లా అధికారులను ఆదేశించిన ఆయన ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా వైద్యసిబ్బంది, అధికారులు పనిచేయాలన్నారు.
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కోవిడ్ విభాగంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ డాక్టర్లను కోరారు. సోమ వారం ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యులు, పిజి వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించుటకు సిద్ధంగా ఉన్నామని అయితే ఆయా విభాగాలకు చెందిన వైద్యులు పూర్తిగా అంకితభావంతో పనిచేసి మంచి వైద్య సేవలు అందించాలని కోరారు. ఆసుపత్రిలో చేరిన ప్రతి ఒక్కరు సంతృప్తితో ఉండాలని అన్నారు. కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లాలని ఆయన చెప్పారు. కరోనా విషయాలను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి మానసిక స్థైర్యాన్ని నింపాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అవసరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు స్పంది స్తూ అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని విభాగాలకు సంబంధించిన యంత్ర పరికరాలు కొంత మేరకు అవసరం ఉంద ని వాటిని సమకూర్చాలని కోరారు. ప్రతిరోజూ 20 నుండి 30 కేసులు ఆస్పత్రికి వస్తున్నాయని వాటిలో దాదాపు ఐదు కేసులు చివరి దశలు ఉన్నవి వస్తున్నా యని వివరించారు. అదే విధంగా ఎం.ఎన్. ఓలు, ఎఫ్. ఎన్. ఓ లకు విభాగాలలో నియామకాలకు ముందు తగిన శిక్షణ కల్పించాలని ఆయన సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలో పాఠశాల విద్యార్ధులకు కంటి అద్దాలను పంపిణీ చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డా.జి.వి.రమణకుమార్ తెలిపారు. సోమ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డా.వై.యస్.ఆర్.కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. సమగ్ర కంటి వైద్య సేవలు ఉచితంగా అందిoచుటకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2019 అక్టోబరు 10వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇందులో భాగంగా మొదటి, రెండవ దశలలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 12,069 మంది విద్యార్థులకు కంటి అద్దాలు అవసరమని నిర్ధారించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి 6,872 కంటి అద్దాలను బడి పిల్లలకు పంపిణి చేసామని ఆయన తెలిపారు. ఇంకా 5,197 కంటి అద్దాలను ప్రధానోపాద్యాయలు ద్వారా పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 123 వినతులు అందాయని డీఆర్వో బి.దయానిధి చెప్పారు. ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్, స్పందన కార్యక్రమాల్లో ప్రజల ఆర్జీలను భౌతికంగా కాకుండా ఫోన్ ద్వారా స్వీకరించేందుకు ప్రతీ సోమవారం ఉదయం 09.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు స్వీకరించామన్నారు. అందులో భాగంగా సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాలకు చెందిన 123 మంది ఆర్జీదారులు తమ ఫిర్యాదులను జిల్లా రెవిన్యూ అధికారికి విన్నవించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, ప్రజలు స్పందనలో చేసుకున్న అర్జీలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందించి అర్జీలను పరిష్కరించాలని ఆదేశాలు జారీచేసినట్టు ఆయన వివరించారు.
విశాఖజిల్లా లో కోవిడ్ - 19 ను అరికట్టడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కలెక్టర్ వి.వినయ్ చంద్ ను సోమవారం కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ కోనాడ సుదర్శన్, కార్యదర్శి జి. అర్. ప్రభు కిరణ్, స్టేట్ కో ఆర్డినేటర్ మారియా, జిల్లా ప్రెసిడెంట్ హిల్డా మ్యాత్యు లు ఘనంగా శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు, పారిశుధ్య కార్మికుల భాగస్వామ్యంతో జిల్లాలో కరోనా నియంత్రణ బాగా జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చేస్తున్న క్రుషి ఎనలేదని కొనియాడారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించిన అనంతరం కరోనా వ్యాప్తి నివారణకు అన్ని వ్యాపార సంస్థలు వినియోగదారులకు తప్పనిసరిగా శ్యానిటైజర్ ను అందుబాటులో ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అందరూ మాస్క్ లను ధరించేలా అవగాహన కల్పించాలని కోరారు.
జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 19 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ డా. జి. సృజన చెప్పారు. సోమవారం టోల్ ఫ్రీ నం. 1800-4250-0009 ద్వారా ఉదయం 10.00 గం. నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించివాటిని సమస్య పరిష్కారానికి జెడ్సీలకు, సంబంధిత శాఖల అధికారులకు పంపించి మూడు రోజుల్లో నివేదికలు తయారు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఫిర్యాదుల్లో 1వ జోనుకు సంబందించి 04, 2వ జోనుకు సంబందించి 04, 3వ జోనుకు సంబందించి 03, 4వ జోనుకు సంబందించి 04, 5వ జోనుకు సంబందించి 02, 6వ జోనుకు సంబందించి 02, మొత్తము 19 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎ. వి. రమణి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ మంగపతి రావు, ప్రోజెక్ట్ డైరెక్టర్ (యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, సి.సి.పి. విద్యుల్లత, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎల్.ఎస్.జి. శాస్త్రి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన విద్యను అందించే దిశగా సిలబస్ రూపకల్పన చేయడం జరుగుతోందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఏయూ అకడమిక్ సెనేట్ సమావేశం జరిగింది. సెనేట్ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అద్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ ముందకు సాగడం జరుగుతోందన్నారు. అన్లైన్ బోధన విధానాన్ని అవలంభించామన్నారు. వర్సిటీలోని పలు విభాగాలు వెబినార్లను సమర్ధవంతంగా నిర్వహించాయన్నారు. కోవిడ్ విపత్తు సమయంలో సైతం తమ విశ్వవిద్యాలయం ఆచార్యులు సమర్ధవంతంగా పరిశోధన ప్రాజెక్టలను సాధించడం శుభపరిణామమన్నారు. త్వరలో విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో సేవలు అందించే దిశగా, విద్యార్థులకు తరగతులు, పరీక్షల నిర్వహణకు విభిన్న వ్యూహాలను అవలంభించడం జరుగుతోందని వివరించారు.
నిస్వార్ధ ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనంగా టంగుటూరి ప్రకాశం పంతులు నిలుస్తారని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. టంగుటూరి ప్రకాశం జయంతిని ఆదివారం ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించారు. ముందుగా టంగుటూరి చిత్రపటానికి వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ బ్రిటీషు వారికి ఎదురొడ్డి ప్రాణాలను సైతం దేశ స్వాతంత్య్రం కోసం అర్పించడానికి సిద్దపడిన ధీశాలిగా టంగుటూరి చరిత్రలో నిలచిపోయారన్నారు. ఆయన చూపిన ధైర్యం, తెగువ నేటి యువతకు ఆదర్శనమన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ది ఎంతో ఆదర్శనమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య ఎస్.హరనాథ్, డీన్ ఆచార్య ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం పంచగ్రామాల సమస్యను త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రానివాసరావు అన్నారు. ఆదివారం ఆయన సింహాచలంలో శ్రీ వారహ లక్ష్మి నృసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింహాచలం దేవస్థానంలో కనీవినీ ఎరుగని అభివ్రద్ధి చేయనున్నట్టు చెప్పారు. భక్తులకు సౌకర్యాలు పెంచడంతోపాటు, రాష్ట్రంలోనే ప్రముఖ దేవస్థానంలా మార్పు చేయడానికా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారికి జరిగే సేవలను ప్రజలకు, పర్యాటకులకు తెలియజేసే కార్యక్రమం చేపడతామన్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మంత్రికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు పూజలు, కప్పస్థంభం ఆలింగనం తరువాత తీర్ధ ప్రసాదాలను అందజేసి, వేదపండితులతో ఆశీర్వాదాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.