1 ENS Live Breaking News

శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి వంద కోట్ల హిందువుల ఆస్తి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం చరిత్రను ప్రపంచానికి తెలియజేసిన శ్రీమాన్ సాధు సుబ్రమణ్య శాస్తి దేశంలోని వంద కోట్ల హిందువుల ఆస్తి అని ఎమ్మెల్యే భూమన కరుణా కర రెడ్డి అన్నారు. సుబ్రమణ్య శాస్త్రి 133వ జయంతి సందర్భంగా శనివారం శ్వేత సమావేశం మందిరంలో జరిగిన జయంతి సభకు కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారి ఆలయ చరిత్ర వెలికి తీసిన  సుబ్రమణ్య శాస్త్రి స్వామివారి కి అనన్య సేవ చేశారన్నారు. రాణి సామవై భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని ఆలయానికి అందించారని శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి వెలికి తీసిన తొలి శాసనమే శ్రీవారి ఆలయ చరిత్ర బయటకు రావడానికి కారణమన్నారు. టీటీడీలో చిన్న స్థాయి అధికారిగా ఉంటూ వెయ్యి కి పైగా శాసనాలను వెలికితీసి పరిష్కరించిన గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పారు. అలాంటి మహానుభావునితో తనకు పాఠశాల చదివే రోజుల్లోనే పరిచయం కావడం తన అదృష్టమని తెలిపారు. 

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి,  వేటూరి ప్రభాకరశాస్త్రి,  రాళ్ళ పల్లి ఆనంతకృష్ణ శర్మ విగ్రహాలు ప్రతిష్టించాలనే ఆలోచన శ్రీ వేంకటేశ్వర స్వామి వారే తనకు కల్పించారన్నారు. ఇలాంటి మహానుభావుల జీవితాల మీద చర్చ జరగాలని, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సాధు సుబ్రమణ్య శాస్త్రి వెలికి తీసి పరిష్కరించిన శాసనాల పుస్తకాలను ప్రతి ఒక్కరు చదవాలన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు  పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ,  సుబ్రమణ్య శాస్త్రి తన జీవితాన్ని స్వామి సేవకు అంకితం చేసిన మహా మనిషి అన్నారు. ఇలాంటి వారి సేవలను టీటీడీ గుర్తు చేసుకోవడం సంతోషమన్నారు. సుబ్రమణ్య శాస్త్రి కూతురు  గిరిజ, మనుమడు, కడప అదనపు జిల్లా సెషన్స్ జడ్జి  సి ఎస్ మూర్తి మాట్లాడుతూ,  భూమన కరుణాకర రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలోసుబ్రమణ్య శాస్త్రి విగ్రహం ప్రతిష్టించడం సంతోషమన్నారు.

 శ్వేత డైరెక్టర్  ప్రశాంతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో శాసన పరిశోధకులు కృష్ణారెడ్డి, టీటీడీ సిఏవో  శేషశైలేంద్ర, 
డిఈవో  భాస్కర రెడ్డి, దూరదర్శన్ విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్  అనంత పద్మనాభరావు, పుదుచ్చేరి యూనివర్సిటీ ప్రొఫెసర్  చంద్ర మౌళి, ఎస్వీ మ్యూజియం ప్రత్యేకాధికారి  కృష్ణారెడ్డి,  ఎస్వీ ఓరియంటల్ కళాశాల ఆచార్యులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా

 సాధు సుబ్రమణ్య శాస్త్రి జయంతి సందర్బంగా టీటీడీ ముద్రించిన సారస్వత సంవీక్షణం పుస్తకాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే  కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు.  అంతకుముందు శ్వేత భవనం ఎదురుగాగల శ్రీమాన్ సాధు సుబ్రమణ్య శాస్త్రి విగ్రహానికి అథితులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Tirumala

2022-12-17 08:28:54

గ్రామ, వార్డు సచివాలయాల్లో పేరుకుపోతున్న కాగిత చెత్త

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాలకు ఇపుడు కొత్త చె(చిత్తు)త్త సమస్య వచ్చిపడింది..తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెట్టుకునే కాగితపు అర్జీలు, ఇచ్చిన దరఖాస్తులన్నీ చెత్తగా మారి కార్యాలయాల డెస్కులు నిండిపోతుండగా, కొన్నింటిని బయట పడేస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇదినిజం. రాష్ట్రప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు నేటితో మూడేళ్లు  ర్తిచేసుకుంటున్నా.. ఈ శాఖలో ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయలేదు. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 12 ప్రభుత్వ శాఖల సిబ్బంది పనిచేస్తుండటంతో వారి పరిధిలోకి వచ్చే సమస్యల దస్త్రాలన్నీ, అభ్యర్ధన రూపంలో కార్యాలయాల్లో మేట్లుగా నిండిపోతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎంతమేర చిత్తు పేరుకుపోతున్నదో ఒక్కసారి రాష్ట్రప్రభుత్వం గుర్తించాల్సి వుంది. వీటికితోడు సచివాలయాల్లోనే ఇచ్చే, జనణ, మరణ దృవీకరణ పత్రాల నకళ్లు కూడా ఇక్కడ భారీ ఎత్తున దొంతర్లుగా పేరుకుపోతున్నాయి. చిత్తు పెరిగిపోతుందని వాటిని పడేయలేక, ఎపుడైనా అవసరం వస్తుందని వాటిని ఉంచలేక సచివాలయ సిబ్బంది, కార్యదర్శిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి ముఖ్యమైన దస్త్రాలు వాటిలో కలిసిపోయి సమయానికి కపించకుండాపోయి జిల్లా అధికారులతో నానా చివాట్లూ సిబ్బంది తినాల్సి వస్తున్నది.

ఈ-ఫైలింగ్ విధానం లేక పడరాని పాట్లు
ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే సుమారు 12 నుంచి 16శాఖల సిబ్బంది పనిచేస్తున్న సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖలో ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడం లేదు. ఈవిధానం అమలు చేయడం ద్వారా ప్రజలకు చెందిన వివిధ సమస్యల డేటాతోపాటు, నకలు, అసలు కూడా అన్నీ ఈ-ఫైలింగ్ లోనే నిక్షిప్తం అయి ఉంటాయి. అలా చేయకపోవడం నేటికీ దస్త్రాలు పట్టుకునే గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకూ ప్రజలు అధికారులు, సిబ్బంది చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తున్నది. ఒక సారి పెట్టిన సమస్య అర్జీపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పదే పదే పెట్టే అర్జీల వలక కూడా చిత్తు కార్యాలయాల్లో అత్యధికంగా పేరుకు పోతున్నది. పైగా సచివాలయాల్లో ఈ-ఫైలింగ్ లేకపోవడం వలన సచివాలయాల నుంచి సంబంధిత శాఖకు దస్త్రాన్ని పంపడానికి కూడా రోజుల తరబడి సమయం పడుతున్నది. ఒక్కోసారి దస్త్రం సంబంధిత మండల, జిల్లాశాఖలకు వెళ్లినా సదరు కార్యాలయ సిబ్బంది కూడా ఏదో మూల పడేస్తున్నారు తప్పితే వాటిపై ప్రత్యేక శ్రద్ద చూపించడం లేదు. ఫలితంగా ఇటు సచివాలయంతో పాటు, అక్కడ జిల్లా కార్యాలయంలోనూ దస్త్రాలు పేరుకుపోతున్నాయి. ఒకప్పుడు పంచాయతీలు ఉండే సమయంలో ఈ సమస్య పెద్దగా ఉండేదికాదు. ఇపుడు సచివాలయ వ్యవస్థ  ఏర్పాటైన తరువాత ఉద్యోగులు, పెరగడం ప్రభుత్వశాఖల వారీగా ఉద్యోగులు కూడా పెరగడతో అర్జీల దరఖాస్తు చిత్తు కూడా అదే మొత్తంలో పెరుగుతూ వస్తున్నది. ఈ-ఫైలింగ్ విధానం అమలు చేస్తే ఉపయోగం ఏమిటంటే గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రజల సమస్యల దరఖాస్తుకి ఖచ్చితత్వం వస్తుంది.  గ్రామసచివాల యంలో ని కార్యదర్శి, ఇతర శాఖ సిబ్బంది లాగిన్ల నుంచి మండలంలోని ఎంపీడీఓ ఇతర మండలశాఖల అధికారుల లాగిన్లు, ఆ తరువాత జిల్లా అధికారుల లాగిన్ వరకూ ఒక స్టేజ్ వైజ్ సిస్టమ్ ఏర్పాటవుతుంది. ప్రతీ దరఖాస్తూ క్రమ సంఖ్యతో ప్రభుత్వశాఖల అధికారుల లాగిన్ లో స్పష్టంగా చూపిస్తుంది. తద్వారా సమస్య పరిష్కారానికి ఆస్కారం ఏర్పడటంతోపాటు, ఏ సమస్య పరిష్కారం కాలేదో ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఎన్ని సమస్యలు, ఎన్ని అర్జీలకు అధికారులు పరిష్కారం చూపించారో కూడా రికార్డెడ్ గా ప్రభుత్వశాఖలు ప్రభుత్వానికి నివేదించడానికి కూడా వీలుపడుతుంది. ఒక్కోసారి అర్జీదారుడు ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన సమస్య పరిష్కారానికి నోచుకోనపుడు ఎన్నిసార్లు అదే సమస్యపై అర్జీపెట్టారు.. ఏ ప్రభుత్వశాఖ సదరు సమస్యను పరిష్కరించకుండా వదిలేసింది అనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒక్క ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఇటు ప్రభుత్వశాఖ సిబ్బందికీ, అధికారులకు, ప్రజలకూ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మేలు జరగడంతోపాటు గో గ్రీన్ ఆఫీస్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడానికి మార్గం సుగమం అవుతుంది.

ఈ-ఫైలింగ్ లేక సిబ్బందికీ తీరని ఇబ్బందులు 
గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఈ-ఫైలింగ్ విధానం అమలు చేయకపోవడం వలన ఇటు సిబ్బంది కూడా రాష్ట్రవ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆఖరికి ఒక సెలవు తీసుకోవాలన్నా సెలవుచీటీ రాసి సచివాలయంతోపాటు, ఎంపీడీఓ, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పెట్టినపుడు, తిరిగి రీ జాయిన్ అయినపుడు, సాలరీ బిల్లులు పెట్టించుకునే సమయంలోనూ, తిరిగి దరఖాస్తు ద్వారా విషయాన్ని తెలియజేసే విషయంలో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. సెలవుల అర్జీలను పోస్టుద్వారా పంపే సమయంలో జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో అవి కనిపించకుండా పోవడం, వాటిని అధికారులు పట్టించుకోనట్టు వదిలేయడం తదితర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలా కాకుండా ఈఫైలింగ్ విధానం అమలు చేయడం ద్వారా గ్రామసచివాలయం నుంచి ఐదంచెల విధానంలో సచివాలయం నుంచి జిల్లాశాఖ అధికారుల వరకూ దస్త్రం మొత్తం ఈ-ఫైలింగ్ విధానంలోనే చేరి అనుమతులు మంజూరు చేయడం కూడా సులభంఅవుతుంది. అర్జీ కూడా ఆన్ లైన్లో తేదీతో తహా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అధికారులు ప్రత్యేకంగా కార్యాలయంలోనే ఉండే పనికూడాలేదు. వారి విధినిర్వహణ చేసే సమయంలో ఏదో కొద్ది సమయం కేటాయిస్తే అధికారుల ప్రోటోకాల్ లాగిన్ ప్రకారం ఈ-ఫైలింగ్ పెట్టిన దస్త్రానికి అదే వేదిక ద్వారా అనుమతులు ఇవ్వడానికి మార్గం ఏర్పడుతుంది. తద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో దస్త్రాల చిత్తు పెరిగిపోకుండా వుంటుంది.

సచివాలయశాఖ కార్యదర్శి పునుకుంటేనే అడుగు పడేది
గ్రామ, వార్డు సచివాలయాల్లో పేరుకుపోతున్న చెత్తను నియంత్రించడానికి ఈ శాఖకు చెందిన ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఈ-ఫైలింగ్ విధానం అమలు చేసే విషయంలో పూనుకుంటే తప్పా..సచివాలయాల్లో ఈ-ఫైలింగ్ అందుబాటులోకి రాదు. అలాగని సదరుశాఖ ముఖ్యకార్యదర్శి సచివాయాల్లోని ఇబ్బందులపై దృష్టి సారించినదీ లేదు. ఇటు జిల్లా కలెక్టర్లు, సచివాలయశాఖతో అనుసంధానంగా వున్న ఇతర ప్రభుత్వశాఖల కమిషనర్లుగానీ, ఇతర ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు కూడా ఈ-ఫైలింగ్ విధానంలో నేటికీ నోరు మెదపడం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందుకి తీసుకెళ్లనూ లేదు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై మూడేళ్లు దాటిపోతున్నా..నేటికీ ఉద్యోగులకు సంబంధించి విధివిధానాలనే ప్రభుత్వం పూర్తిస్థాయిలో రూపొందించలేదు. ఇక తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఏం పట్టించుకుంటారని సచివాలయ సిబ్బంది మీడియా ముందు పెదవి విరుస్తున్నారు. ఏ ప్రభుత్వశాఖలోనైనా ఏ శాఖకు చెందిన ఉద్యోగులు,, సిబ్బంది ఆ ప్రభుత్వశాఖ విధులే నిర్వహిస్తారు. కానీ సచివాలయశాఖలో మాత్రం ప్రభుత్వంలోని అన్నిశాఖల విధులు ఇక్కడి ఉద్యోగులు నిర్వహించాల్సి వుంటుంది. ఆ తీవ్రతను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనైనా ప్రభుత్వం ఇక్కడ ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించి గ్రీన్ చానల్ సచివాలయాలుగా మార్చి ప్రజలు సత్వర సేవలు అందించడానికి ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేస్తే మరిన్ని ఫలితాలు వస్తాయని సచివాలయ ఉద్యోగులే సూచిస్తున్నారు. చూడాలి ప్రభుత్వం ఈ-ఫైలింగ్ విధానం ఏర్పాటు చేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!

Tadepalli

2022-12-15 07:16:08

ఈఎన్ఎస్ లైవ్ కథనం చెప్పినట్టుగానే ప్రభుత్వ చర్యలు

భారతదేశపు తొలి తెలుగు జాతీయ వార్త సంస్థ ఈఎన్ఎస్ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net కథనాలు అక్షర సత్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే మరోసారి నిరూపించింది. ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించిన తరువాత ఆ విధులన్నీ గ్రామ, వార్డు 
సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తుందని.. వారినే ఎన్నికల విధులకు వినియోగించనున్నదని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ప్రత్యేక కథనాన్ని ఇటీవలే ప్రచురించింది. నేడు అదే విషయాన్ని నిజంచేస్తూ.. రాష్ట్ర సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ అధికారికంగా ప్రకటించారు. 

Tadepalli

2022-12-14 09:43:34

సచివాలయాలకు చట్టబద్దత సరే మరి సర్వీసు రూల్సు..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో ఒక కీలక అడుగు వేసి.. రెండు అడుగులు వెనక్కి వేసింది.. ఈ సచివాలయ వ్యవస్థకుకొత్తగా చట్టం తీసుకొస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. సచివాలయాలు ఏర్పాటై మూడేళ్లు దాటిపోతున్న తరుణంలో ఈవ్యవస్థపై చట్టబద్దత వచ్చినందు కు ఆనందపడాలో..నేటికీ తమ ఉద్యోగాలకు సర్వీసు రూల్స్ పొందు పరచకుండా తాము ఏ కేటగిరీ ఉద్యోగాల కిందకి వస్తామో చెప్పకుండా, ఈ ఉద్యోగాల్లో తమకు ఎలాంటి పదోన్నతులు వస్తాయో వివరించకుండా వదిలేసినందకు బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. 2019 అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పట్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నూతన వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం, ఆంధ్రప్రదేశ్‌ మునిసిపాలిటీ, మునిసిపల్‌ కార్పొరేషన్‌ చట్టం తరహాలోనే సచివాలయ వ్యవస్థకు కూడా చట్ట రూపం వచ్చింది. రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రకారం ప్రజల కేంద్రంగా ప్రభుత్వ సేవలు, ఇతర సదుపాయాలను అందించేందుకు చట్టం ద్వారా గ్రామ/వార్డు సచివాల­యాల పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.  

చట్టంతో పూర్తిస్థాయి పటిష్టత.. ఏదీ సక్రమంగా జరగలేదు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సుతో చట్టబద్దత వచ్చినప్పటికీ.. సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏదీ సక్రమంగా జరగలేదు. వీరి సర్వీసులను రెండేళ్లలో క్రమబద్దీకరించాల్సి ఉండగా అదనంగా 9నెలలు పనిచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉద్యోగులు ఒక డీఏతోపాటు, పూర్తిస్థాయి పేస్కేలు కోల్పోయారు. పోనీ ఎట్టకేలకు ఉద్యోగాలు రెగ్యులర్ చేశారనుకుంటే.. నేటి వరకూ సచివాలయాల్లో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల సర్వీసు రూల్సు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వం నేటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసు స్టాఫ్ నర్స్ శిక్షణ ఇప్పిస్తున్నప్పటికీ..మిగిలిన శాఖల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు.  రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఏ కేటగిరీలోకి వస్తారో ఆర్డినెన్సుకి ముందే ప్రభుత్వం ప్రకటించి ఉంటే బావుండేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సచివాలయాల్లతో 545 రకాల సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చినా కొన్ని సేవలను మాత్రమే అమలు చేస్తున్నారు.. అన్ని సేవలు అమలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు, ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరేది. కానీ అలా జరగడం లేదు.

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారానికి చట్టబద్దతో చెక్
గ్రామ, వార్డు సచివాలయాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉంటాయి..ఆ తరువాత ఉద్యోగాలను ఆ వచ్చే ప్రభుత్వం తీసేస్తుందని ప్రతిపక్షాలు పనిగట్టుకొని చేసే ప్రచారానికి ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఆర్డినెన్సుతో తెరపడినట్టు అయ్యింది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ­రాజ్, మునిసిపల్‌ చట్టాలకు అదనంగా గ్రామ/­వార్డు సచివాలయ వ్యవస్థ చట్టం ఉంటుందని ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆర్డినెన్స్‌తో గ్రామ/­వార్డు సచివాలయాల ద్వారా అందజేసే ప్రభుత్వ సేవలు, గ్రామ/వార్డు సచివాలయ శాఖ ద్వారా జారీ చేసే ఉత్తర్వులు శాసనాధికారంతో కూడినవిగా ఉండనున్నాయి. ఈ చట్టం శాసనసభ, శాసన మండలిలో ఆమోదం పొందిన తరువాత ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, పదోన్నతుల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అపుడు గానీ సచివాలయ ఉద్యోగులు ఏ కేటగిరీ ఉద్యోగులో తేలే అవకాశం లేదు. కాకపోతే భారతదేశం మొత్తం తొంగి చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంచి ప్రశంసలు అందుతున్నప్పటికీ మూడేళ్లు దాటినా ఒక విధి విధానంలో ఈ శాఖను అమలు చేయని విషయంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటైన మూడేళ్ల తరువాత చట్టబద్దత తీసుకొచ్చే విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసిందనే చెప్పాలి..!

Tadepalli

2022-12-13 02:05:52

పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమిత పెంచండి

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ జనరల్ అభ్యర్థుల వయోపరిమితి 29 సంవత్సరాలకు, ఎస్ఐ కి 32 సంవత్సరాలకు వయస్సు పెంచాలని ప్రభుత్వాన్ని సీబీఐ మాజీ జెడి వి.వి.లక్ష్మీనారాయాణ కోరారు. శుక్రవారం 
డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పలు జిల్లాలు పర్యటిస్తున్నప్పుడు SI/కానిస్టేబుల్,  పోటీ పరీక్షలకు సన్నదమవుతున్న యువత కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగోలేక కోచింగ్ తీసుకోలేకపోతున్నామని..దానికి కోసం సహాయం చేయమని అడిగారని, వారి అభ్యర్ధన మేరకు ఐఏసిఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇచ్చి  సహకరిస్తామని ముందుకు వచ్చారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం జేడీ ఫౌండేషన్, సదరు కోచింగ్ సెంటరుతో కలిసి సంపూర్ణ కోచింగ్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 45 వేల వరకు అభ్యర్ధులు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. అందులో 1000 మందిని మెరిట్ లో ఎంపికచేసి వారికి ఉచితంగా రాత పరీక్ష, గ్రౌండ్ ఈవెంట్స్, మెయిన్స్ వరకు పూర్తి కోచింగ్ online మరియు offline లో సేవలు అందిస్తామని చెప్పారు, ఆదివారం ఉదయం 9.30 నుండి 12.30 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో 38 పరీక్ష కేంద్రాలలో రాత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 10 వరకు అభ్యర్ధులు పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఆశక్తి కలిగిన వారు 7093651037 వాట్సాప్ నెంబర్ కి HI అని సందేశం పంపిస్తే, పూర్తి వివరాలు పంపిస్తాం అని వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ కన్వీనర్ ప్రియాంక దండి, కోఆర్డినేటర్ జగన్ మురారి,బుద్దాల కృష్ణ మోహన్ మురారి, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్  కుమార్, కోచింసెంటర్ ఇంచార్జ్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-09 11:03:44

గ్రామ, వార్డు సచివాలయాలకు ఆత్మహత్యల గ్రహణం

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆత్మహత్యల గ్రహణం పట్టుకున్నట్టుంది. ఒకే ఏడాదిలో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో ఇద్దరు ఉద్యోగుల విశాఖపట్నంలో ఆత్మహత్యచేసుకోగా..మరో సచివాలయ ఉద్యోగి తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్యచేసుకున్నాడు. ఈ మూడు ఆత్మహత్యలకు విధి నిర్వహణలోని పని ఒత్తిడే కారణంగా చెబుతున్నారు. ఆశలు నెరవేరి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందనే ఆనందం ఉన్న రోజులు కూడా నిండకుండానే మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. అధికారుల వేధింపులు ఓ ప్రక్క.. పని ఒత్తిడి మరోప్రక్క వెరసీ గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఆత్మహత్యలు చేసుకునే సమయంలో తమ ఛావుకి పని ఒత్తిడే కారణమని సూసైడ్ నోట్ లో రాసి మరీ చనిపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ లోపం, పని ఒత్తిడి, చదివిన చదువుకి అటు అటెండరు, ఇటు జూనియర్ అసిస్టెంట్ కాని క్యాడర్, అన్ని ప్రభుత్వశాఖల్లో కెల్లా అతి తక్కువ జీతం.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకంటే అత్యధిక పనిభారం ఈ ఆత్మహత్యలకు కారణం అవుతూ, కన్నవారికి కన్నీరుని 
మిగులుస్తున్నాయి.

ఫ్యాషనైన పదం..నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తా..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను అధికారులు ఏ స్థాయిలో బెదిరిస్తున్నారంటే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసిపారేస్తా(ఒక ప్రభుత్వ ఉద్యోగిని విధుల్లో నుంచి  తీసేసే హక్క ఆ ప్రభుత్వానికి కూడా ఉండదు, తప్పిదారి దేశ ద్రోహం చేస్తే తప్పా.. ఆ విషయం తెలిసీ కూడా మండల, జిల్లా అధికారులు ఈ విధమైన బెదిరింపులు 
ఎలా చేస్తున్నారో వారికే తెలియాలి).. ఈ నెల నువ్వు జీతాలు ఎలా అందుకుంటావో చూస్తాను.. ఇక నుంచి ఉద్యోగాలు ఎలా చేస్తారో అదీ చూద్దాం.. నాకేం  సంబంధం లేదు.. సచివాలయంలో నేనున్నా సెలవు కావాలంటే ఎంపీడీఓని అడగండి.. లేదంటే మీ మండల, జిల్లా అధికారి నుంచి అనుమతి పత్రం, డ్యూటీ 
సర్టిఫికేట్, సెలవు చీటీలు తీసుకురండి(వాళ్ల దగ్గర నుంచి, వీళ్ల దగ్గర నుంచి అనుమతి తీసుకొస్తే సచివాలయంలో ఉన్న కార్యదర్శి ఎందుకో జిల్లా అధికారులకే  తెలియాలి).. అంటూ ఫ్యాషన్ గా బెదిరించడం అలవాటు చేసుకున్నారు. పంచాయతీలోని కార్యదర్శి దగ్గర నుంచి మండల కేంద్రంలో ఎంపీడీఓ, జిల్లాశాఖల 
వరకూ ఇదే వరస. ఎక్కడ చూసినా సచివాలయ ఉద్యోగులను బెదిరించడానికే వీరికి సమయం సరిపోవడం లేదు. ప్రైవేటు ఉద్యోగం కంటే దారుణంగా టార్గెట్లు విధించడం సచివాలయశాఖలో షరా మామూలు అయిపోయింది. ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయకపోతే మెమోలు ఇవ్వడం, సమావేశంలో అందరి ముందు నిలబెట్టి  తిట్టడం, మీపై జిల్లా అధికారులకు రిపోర్టు చేస్తానని చెప్పడం ఇలా మండల అధికారులకు ఏ విధంగా తోస్తే ఆవిధంగా చేస్తూ సచివాలయ ఉద్యోగులపై తీవ్ పని ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఆఖరికి ఉద్యోగి సెలవుపై వెళ్లినా ఆ సమయంలో కూడా తీవ్ర స్థాయిలో స్కూలు, కాలేజి విద్యార్ధులను బెదిరించినట్టు ఒత్తిడితో కూడిన బెదిరింపులకు దిగుతున్నారు మండల, జిల్లా అధికారులు. 

ఇంటి పెద్దను కోల్పుతున్న కుటుంబాలు
బలవంతంగా సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం వలన ఆ కుటుంబాన్ని అంతటినీ పోషించే పెద్దదిక్కును కోల్పోతున్నారు. ఎంతో కొంత జీతం వచ్చి నాలుగు వేళ్లు నోట్లోకి వెళతాయనుకుంటున్న తరుణంలో సచివాలయ ఉద్యోగులు యుక్త వయస్సులో ఆత్మహత్యలకు పాల్పడటం రాష్ట్రస్థాయిలో 
చర్చనీయాంశం అవుతున్నది. తమ పుత్రుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, తమ కష్టాలు తీరుతాయనుకునే లోపే సదరు ఉద్యోగులు పని ఒత్తిడి, అధికారుల  బెదిరింపుల నేపథ్యంలో మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. దీనితో తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలుతోంది. దానికితోడు ప్రస్తుతం సచివాలయ ఉద్యోగాలు 
చేస్తున్నావారిలో 70శాతానికి పైగా నిరుపేద కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినవారే కావడంతో ఆ కుటుంబాలు చెట్టంత కొడుకుని కోల్పోయి మళ్లీ రోడ్డున పడిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగం వచ్చిందనే దైర్యంతో పెళ్లిళ్లు చేసుకొని మధ్యలోనే ఆత్మహత్యలకు పాల్పడి ఇటు కట్టుకున్న భార్యకి, అటు కన్నవారికీ దూరమైపోతున్నారు. కేవలం అధికారులు ప్రభుత్వం అప్పగించిన పనిని పూర్తిచేయాలనే నెపంతో ఉద్యోగులపై తీవ్రమైన పనిఒత్తిడికి గురిచేస్తూ.. బెదిరింపులతో ఉద్యోగులు ఆత్మహత్యులు చేసుకోవడానికి కారణం అవుతున్నారు.

పేరుకే ఒక శాఖ ఉద్యోగం..అన్నీశాఖల పనులూ చేయాలి..
‘‘ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు’’ అన్నట్టు తయారైంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విధినిర్వహణ. సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖలో అయినా సదరు ప్రభుత్వ శాఖకి చెందిన పనులు మాత్రమే చేయాల్సి వుంటుంది. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖలో వారి మాతృశాఖతో పాటు అన్నిశాఖల ప్రభుత్వ 
ఉద్యోగాలను, విధులను చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గానీ, జిల్లాశాఖల అధికారులు గానీ నోరు మెదపకపోవడంతో అన్నశాఖల మండల అధికారుల పని ఒత్తిడి సచివాలయ ఉద్యోగులపై పడుతున్నది. సమయానికి వచ్చి బయో మెట్రిక్ వేయకపోతే జీతాల్లో కోత విధించాలని సిఫార్సు చేస్తున్న మండల అధికారులు, అదే ఉద్యోగులు రాత్రి 8 గంటల వరకూ విధులు నిర్వహించినపుడు మాత్రం అదనంగా చేసిన పనిగంటలను, అదనపు బాధ్యతల విషయాన్ని జిల్లా అధికారుల వద్ద కనీసం నోరువిప్పి చెప్పడంలేదు. పైగా సచివాలయ ఉద్యోగులు పడిన కష్టం, చేసిన పనంతా తామే చేసేసినట్టు జిల్లా అధికారులు వద్ద ఇచ్చే 
కలరింగ్ కి సినిమా సీన్లను మించిపోతున్నది. ఈ తరుణంలో కనీసం ప్రభుత్వం అయినా అసలు సచివాలయ ఉద్యోగులు తక్కువ సమయంలో ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించడంలేదు.

సచివాలయ ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగాలకు
జీవితంలో స్థిరపడిపోవచ్చునని ఎన్నో ఆశలతో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగాలల్లోకి వచ్చిన వారంతా ఇపుడు వేరే ఉద్యోగాలవైపు చూస్తున్నారు. మరికొందరు వేరేశాఖలో ఉద్యోగం వస్తే దీనిని వదిలి వెళ్లిపోతుండగా, మరికొందరు ఉద్యోగాలను శాస్వతంగా వదిలి వెళ్లి పోతున్నారు. గత మూడేళ్లలో 
సచివాలయం ఉద్యోగం వచ్చి వేరే ఉద్యోగాలకు వెళ్లిపోయినవారు, వేరే ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు వచ్చి వెళ్లిపోయిన వారి సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500కి పైగానే ఉంటుంది. బ్యాంకు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, ఇదే శాఖలో గ్రేడ్4 కార్యదర్శిలు, ఇలా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగాల్లోకి వెళ్లిపోతున్నారు. 
ప్రస్తుతం అన్ని ప్రభుత్వశాఖ ఉద్యోగాలతో పోల్చుకుంటే ఒక్క సచివాలయశాఖలోని ఉద్యోగులకే అత్యంత తక్కువ జీతాలు ఉండటం, పని ఒత్తిడి ఇతర ప్రభుత్వశాఖల కంటే అత్యధికంగాఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో జరుగుతున్న వరుస 
ఆత్మహత్యలపై విచారణ కమిటీ వేయకపోతే ఈ మరణమృదంగం కొనసాగే అవకాశాలే చాలా అధికంగా కనిపిస్తున్నాయి..!

Tadepalli

2022-12-09 10:23:00

సీఎం వైఎస్.జగన్ క్లాస్ తో ఆ 40% మందికీ సీట్లు డౌటే..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లూ గెలవాలి..  మీరేం చేస్తారో నాకు తెలియదు.. ప్రభుత్వ పరంగా ఇచ్చి హామీలన్నీ నెరవేర్చాం.. వచ్చే మన ప్రభుత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం.. ఇక ప్రజలకు చేరువయ్యే బాధ్యత మీదే. ప్రజల్లో ఉన్నవారినే అంతా ఆదరిస్తారు.. గడప గడపకి ప్రభుత్వం  కార్యక్రమం పెట్టింది కూడా అందుకే.. ఈసారి గెలుపు అవకాశం లేనివారికి సీటు ఇచ్చేదిలేదు అంటూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలకు తెగేసి చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్చార్జులు, సమన్వయకర్తలతో సమీక్షించిన జగన్ ఖారాఖండీగా విషయాన్ని కుండ బద్దలు గొట్టారట. జగన్ ఇచ్చిన క్లాసు ఆధారంగా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 40శాతానికి పైగానే అభ్యర్దులకు సీట్లు కోల్పేయే ప్రమాదం ఉన్నట్టుగా సూచాయగా చెప్పటినట్టు తెలిసింది. దీనితో ఎవరికి సీటు వస్తుందో ఎవరికి రాదో అనే అనుమానాలు అపుడే పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అందులోనూ రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలకు కొత్తగా నియమించిన ఇన్చార్జిలు కూడా తమ రిపోర్టులను నిష్పక్షపాతం ఇవ్వలేనట్టు తెలిసింది. మరికొంత మంది సమన్వకర్తలు ఉన్నది ఉన్నట్టుగా రిపోర్టులు నియోజవర్గంలోని పరిస్థితిని సీఎం జగన్ ముందు ఉంచడంతో అధినేత ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు.

ప్రజల్లో పట్టు లేకపోతే సీటు ఇచ్చినా వృధా..
గత ఎన్నికల్లో సమయంలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చినహామీలన్నీ అమలు చేశాం. అయినా కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరకాలేకపోవడం దారుణం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా వుందో ఎప్పటికప్పుడు సమాచారం మొత్తం అంతా నాకు అందుతుందని నియోజకవర్గ ఇన్చార్జిలకు చెప్పారట జగన్. ప్రస్తుత  నియోజవకర్గాల్లో కో-ఆర్డినేటర్ల పరిస్థితి బాలేకపోవడంతోనే కొత్తవారిని నియమించాం. అయినా మార్పురాలేదని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా  చెబుతున్నారు. ఇలా అయితే ప్రజల్లో పట్టు కోల్పోతే సీటు ఇచ్చినా వృధా అయిపోతుంది. తీరుమార్చుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ప్రజల్లోనే ఉండాలి. వచ్చే  ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం చెప్పినట్టుగా 175కి 175 రావాల్సిందేనని దానికోసం మీరు ఏం చేస్తారో..ప్రజలను ఏ విధంగా మచ్చిక  చేసుకుంటారో తెలియదని తేల్చిచెప్పారట. అన్ని విషయాల్లోనూ  ప్రజలకు చేరువగా ఉంటేనే నెగిటివ్ ప్రచారాలకు ఆస్కారం వుండదని.. అదే సమయంలో ప్రభుత్వంపై వచ్చే అసత్య ప్రచారాలను తప్పికొట్టాలని కాస్త గట్టిగానే చెప్పినట్టు సమాచారం.

సీట్లన్నీ తెచ్చేపూచీ మాది భరోసా ఇచ్చిన ఇన్చార్జిలు
రాష్ట్రంలోని 175కి 175 స్థానాలు గెలిపించి తీసుకు వచ్చే బాధ్యత తమదని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు సీఎం వైఎస్. జగన్మోహనరెడ్డికి భరోసా ఇచ్చారట. తమపై పెట్టిన నమ్మకాన్ని సీట్లు గెలిపించి బహుమతిగా తీసుకు వస్తామని నియోజకర్గాలకు ఇన్చార్జిలుగా నియమింప బడ్డవారంతా ముక్త కంఠంతో చెప్పినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. అక్కడ ఏమేం కావాలో, ఎలాంటి అభివ్రుద్ధి పనులు చేయాలో, ఏ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఉంది.. ఎవరి నుంచి మంచి ప్రోత్సాహం వుంది తదితర అంశాలన్నింటిపైనా దృష్టిపెట్టి నియోజకవర్గాలన్నింటిని మనవైపు తిప్పుకోవాలని జగన్  ఇన్చార్జిలకు సూచించారట. నియోజకవర్గాల్లో అన్నివర్గాల ప్రజలతో సమావేశాలు ఏర్పాటుచేసి అక్కడ సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు చొరవ చూపాలని, ముఖ్యంగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు స్వీకరించి పరిష్కరిస్తే ప్రజల్లో మనపై నమ్మకం పెరుగుతుందని సీఎం ఇన్చార్జిలకు క్లాస్ ఇచ్చినట్టు చెబుతున్నారు. కాగా కొత్తగా ఇన్చార్జిలు నియమించిన వారిలో కొన్ని నియోజకవర్గాల్లో వారు వాస్తవ పరిస్థితిని నివేదికల రూపంలో ఇవ్వడం పట్ల జగన్ సంతృప్తి వ్యక్తం చేశారట.

ఎమ్మెల్యేలతో సమావేశం నాటికి పక్కా రిపోర్టులు అందాలి
త్వరలో ఎమ్మెల్యేలతో మరోసారి సమీక్ష నిర్వహిస్తాం ఆ నాటికి 175 నియోజకవర్గాల్లోని వాస్తవ పరిస్థితిని నా ముందుంచాలి అపుడు ఎవరెవరకి సీటు వచ్చేది.. ఎవరికి సీటు నిరాకరించేంది తేల్చి చెప్పేస్తా అని సీఎం తెగేసి చెప్పారట. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాం. ఇంటి ముంగిటే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాం. అయినా కొంతమంది ఎమ్మెల్యేల్లో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందంటే వారు ప్రజల్లో లేరని..వారికి ప్రజాభిమానం లేదని అర్ధమవుతుంది. అలాంటి వారి వలన పార్టీకి ప్రభుత్వానికి నష్టం రాకూడదు. ఈ విషయంలో ఇన్చార్జిలు చాలా ఖచ్చితత్వంగా వ్యవహరించాలని ఇన్చార్జిలతో ప్రత్యేకంగా మాట్లాడిన క్రమంలో జగన్ సూచించారట. సిట్టింగ్ ఎమ్మెల్యే విషయంలో అక్కడి ప్రజల నుంచి వస్తున్న స్పందన అక్కడ ప్రజల నుంచి ఎలాంటి మద్దతు ఉందనే విషయం తెలిస్తేనే మనం దైర్యంగా ముందుకి వెళ్లడానికి ఆస్కారం వుంటుందని..ఆ విషయాలను కనుక్కోవడానికే మిమ్మల్ని అక్కడ నియమించామనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోవద్దని చెప్పారట. మీతోపాటు ఎమ్మెల్యేలకు సమావేశం నిర్వహిస్తాం. అప్పటికి అంతా ప్రజాభిమానంతో, వారి పట్ల నూశాతం నమ్మకంతో రావాలి..లేదంటే నా పనినేను చేస్తానని చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా ఇన్చార్జిలతో ఏర్పాటు  చేసిన సమావేశంలో ఒక బలమైన సందేశాన్ని సీఎం జగన్ పంపినట్టు చెబుతున్నారు. దీనిని బట్టి ఈరోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే తీరులో మార్పు కనిపించే అవకాశం వుంది.. చూడాలి రాజకీయ ముఖ చిత్రం ఆ 40% మందిలో ఎలాంటి మార్పు తీసుకు వస్తుందనేది..!

Tadepalli

2022-12-09 02:44:27

ఎన్నికల విధులన్నీ ఇక సచివాలయ ఉద్యోగులతోనే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించిన తరువాత..వాటిని గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే సచివాలయాల్లో బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) విధులను అప్పగించి ఓట్ల నమోదు, మృతిచెందిన వారి ఓట్ల తొలగింపు తదితర అంశాల పనులకు వినియోగిస్తోంది. ఈ ప్రక్రియలో బిఎల్వోలంతా ఇపుడు సచివాలయపరిధిలోని అన్ని ఇళ్లను గుర్తిస్తున్నారు. ఈ విధంగా పనిచేయించడం ద్వారా వచ్చే 2023లో జనాభా గణన కూడా వీరితోనే చేయించడానికి అవకాశం వుంటుంది. వీరికి గ్రామ, వార్డు వాలంటీర్లు తోడు ఉండటంతో ప్రభుత్వం పని చాలా సులువు కావడానికి ఆస్కారం వుంటుంది. అందులోనూ ఏ ప్రభుత్వ శాఖలోనూ లేనివిధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే 80 శాతానికి పైగా ఉద్యోగులంతా డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చదివిన వారు, బిటెక్ చేసిన వారు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు లక్షా 27వేల మందికి  పైగా సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నారు.

 వీరికి ఎన్నికల విధులను అప్పగించడం ద్వారా ఈవీఎంలు, వాటి నిర్వహణ పై ఉపాధ్యాయుల కంటే వేగంగా వీరికి శిక్షణ ఇవ్వడానికి బాగుంటుంది. పైగా టెక్నాలజీని బాగా వినియోగించడంలో సచివాలయ ఉద్యోగులు ముందుండటంతో ప్రభుత్వం పని మరింత సులువైపోనుంది. విధుల్లోకి చేరిన దగ్గర నుంచి అంటే సుమారుగా మూడేళ్లుగా సచివాలయ సిబ్బంది బిఎల్వో విధులను నిర్వహిస్తున్నారు కనుక వీరికి ఎన్నికల ప్రక్రియపై మరీ కష్టంగా శిక్షణ ఇచ్చే పనిలేదు. బహుసా ఇదే కారణంతోనే ప్రభుత్వం ఎన్నికల విధులు, జనాభా గణన నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించిందని చెబుతున్నారు. పైగా ఏ ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలతో అంత దగ్గరగా ఉండరు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే ప్రజలతో అన్ని పనులకు దగ్గరగా ఉండటంతో ఎన్నికల విధులను వీరికి అప్పగించడం ద్వారా పని సులవవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

ఇప్పటికే మండల తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలు, ఇలా మొత్తం రెవిన్యూ యంత్రాంగంతో కలిసే సచివాలయ ఉద్యోగులు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం సాధారణ విధులకంటే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి బిఎల్వో విధులే అధికంగా ఉన్నాయి. త్వరలో ఎన్నికలు జరగాల్సి రావడంతో, కొత్త ఓటర్ల నమోదు, లేని వారి తొలగింపు తదితర కార్యక్రమాలన్నీ త్వరతిగతిన చేపడితే గత ఎన్నికల ఓటర్లతో పోల్చుకుంటే ఓట్లు పెరిగి పెరిగే అవకాశం వుంటుంది. ఏది ఎలా చూసుకున్నా ప్రభుత్వానికి ఉపయుక్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు  
మారబోతున్నారు. మొన్నటి వరకూ ఎన్నికల విధల నుంచి ఉపాధ్యాయులను తప్పిస్తే ఆ బాధ్యత ఏ ప్రభుత్వ శాఖల సిబ్బందికి అప్పగిస్తారనే ఆలోచన అందరికీ ఉండేది. అయితే ప్రస్తుతం బిఎల్వో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకే అప్పగించడం ద్వారా గ్రామస్థాయిలో పని సులువుగా అయిపోతుందని ప్రభుత్వం భావించి ఆవిధంగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఒక ప్రత్యేక నెట్వర్క్ గా మారారడనడంలో ఎలాంటి సందేహం లేదనే విషయం ఇక్కడ మరోసారి తేటతెల్లం అవుతుంది.!

Tadepalli

2022-12-08 02:36:08

ఒంటిమిట్ట వద్ద జాంబవంతుని విగ్రహం ఏర్పాటు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం కల్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో జాంబవంతుని విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని  టీటీడీ  జేఈవో వీరబ్రహ్మం చెప్పారు. బుధవారం ఆయన అధికారులతో కలసి ఒంటిమిట్టలో టీటీడీ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జనవరి 1వ తేదీ , వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్ల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ రోజుల్లో దర్శనం సమయం కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట లోని కల్యాణ వేదిక వద్ద అవసరమైన నిర్మాణాలు చేపట్టి భక్తులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 
 అంతకుముందు ఆయన రాజంపేటలో శ్రీ అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు . ఇక్కడ శ్రీ వేంకటేశ్వర  స్వామివారి ఆలయ నిర్మాణం పనుల గురించి అధికారులతో  చర్చించారు. జనవరి చివరినాటికి ఆలయ నిర్మాణం పనులు  పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. 

అలాగే  ఇక్కడ జరుగుతున్న వేదిక నిర్మాణం ఇతర అభివృద్ధి  పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జేఈఓ  వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. అన్నమయ్య విగ్రహం పరిసరాల్లో పచ్చదనాన్ని  పెంపొందించేందుకు, ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం జేఈవో  వీరబ్రహ్మం దేవుని కడప  లక్షీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.  జనవరి 1వ  తేదీ, వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల దర్శనం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఇక్కడ నిర్మించిన వసతి సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చే విషయంపై అధికారులతో చర్చించారు. 
టీటీడీ చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో  నటేష్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ontimitta

2022-12-07 13:39:17

వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోంది: స్పీకర్

రాష్ట్రంలో పేదరికంలో ఉండకూడదని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రమాణాలు కలిగిన జీవన విధానం కల్పించాలని, అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. రాష్ట్రంలో ‘గడప గడపకు మన ప్రభు త్వం’  కార్యక్ర మానికి మంచి స్పందన వస్తుందని తెలిపారు. విజయవాడ కొత్త ఆర్టీసీ కాలనీలోని స్పీకర్ క్యాంపు కార్యాల యంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... శతాబ్ధాల కాలం నుంచి బీసీలు వివక్షతకు గురయ్యారని, ముఖ్యమంత్రి 
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు ప్రాధ్యానత ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కులాలకు సమ న్యాయం చేస్తూ.. రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేస్తూ అందరికీ సామాజిక న్యాయం చేసిందన్నారు. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదని.. బ్యాక్ బోన్ క్లాసెస్ అని నిరూపించిన ప్రభుత్వం అని కొనియాడారు. బీసీలు అంటే భారతదేశ నాగరికత, సంస్కృతికి ప్రతీక అన్నారు.

 వృత్తి నైపుణ్యంతో  భారతదేశాన్ని ముందుకు నడిపింది బీసీలేనని తెలిపారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో బీసీలకు ఖర్చుచేసింది కేవలం 964 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలో 90 వేల 415 కోట్ల రూపాయలను బీసీల సంక్షేమం కోసం వెచ్చించిందని వివరించారు. బీసీల అభ్యున్నతి కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్  చైర్మన్లు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, సహకార రంగంలో చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, డైరెక్టలు ఇలా అన్ని రకాల పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ కే దక్కుతుందని స్పీకర్ తమ్మినేని తెలిపారు.  

Vijayawada

2022-12-06 16:43:17

2024లో YSRCP ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కేదెవరకో..!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి కేవలం 16నెలలు మాత్రమే సమయం ఉంది. ఈలోగా 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం ఆశపడుతున్నవారు..ఆందోళన పడుతున్నవారు అధిమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాలను ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. దానికి అనుగుణంగా సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. అదికూడా పార్టీకోసం ఎవరు ఏవిధంగా పనిచేశారు.. ఎంతమేర కష్టపడ్డారు..వారికి నియోజవర్గంలో ఫాలోయింగ్ ఎలావుంది..ప్రలజకు, యువతకు ఎమ్మెల్యే అభ్యర్ధి ఏస్థాయిలో దగ్గరగా ఉన్నారు..గెలుపుశాతం ఎంతవుంది.. ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఏం చెబుతున్నాయి.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని మరీ దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీ అధినేత చేస్తున్న సూచనలు నేతల్లో కొండంత బలాన్ని పెంచుతున్నా.. కాస్త తేడాగా ఉండి, ప్రజల్లో పేరు 
పోగొట్టుకొని, క్యాడర్ దగ్గర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం అపుడే గుండెల్లో దడ మొదలైంది.

గెలిచే అభ్యర్ధులకే టిక్కెట్ అదిమాత్రం పక్కా..
వైఎస్సార్సీపీలో ప్రభుత్వంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా వున్నవారికి సైతం సీఎం వైఎస్ జగన్ చేతిలో వున్న నివేధికల ఆధారంగా కేలం గెలిచే అభ్యర్ధులను, వారి నియోజకవర్గాలను మాత్రమే ముందుగా తాడేపల్లి పిలుపించుకొని సమీక్షలు చేస్తున్నారు. దానితో ప్రస్తుతం వున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరికి సీటు వస్తుందో అపుడే చాలా మందికి క్లారిటి వచ్చేసింది. అలా క్లారిటీ రావడం కోసం అలాంటి నియోజవర్గాలను ఆఖరున సమీక్షించాలని..అక్కడ మరో నేత ఎవరిని పెడితే ఆ స్థానం కైవసం చేసుకోవచ్చో తెలుసుకునేందుకు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిల ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారని సమాచారం అందుతుంది. ఈ 
విషయంలో ఎక్కడా రాజీలేకుండా వ్యవహరిస్తే తప్పా 175కి 175 స్థానాలు గెలవడంలో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందనే సంకేతాల నడుమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇచ్చిన ఎన్నికల హామీలు పెద్ద ఎత్తున నెరవేర్చడం, సాధారణ ప్రజానికానికి దగ్గరైన తరుణంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకగా మారాలన్నది సీఎం అభిమతంగా కనిపిస్తుంది.  ప్రభుత్వానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పథకాలు పొందని వారు, పదవులు రానివారు, రెబల్స్ , ఇతర పార్టీలకు జంప్ అవుదామనుకున్నవారు ఉన్నప్పటికీ చాకచక్యంగా వ్యవహరిస్తే గెలుపు మనదేననే సంకేతాలను బలంగా ఇచ్చినట్టు కనిపిస్తుంది.

విశాఖలో ఎమ్మెల్యేటిక్కెట్టుపై బోణీ కొట్టిన కెకె.రాజు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మూడురాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్న సమయంలో.. అది విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసే విశాఖపట్నం జిల్లా నుంచి తొలుత ఉత్తర నియోజకవర్గం సీటును ప్రస్తుతం ఇన్చార్జి కెకె.రాజు కైవసం చేసుకొని బోణి కొట్టారు. ఇంకా విశాఖజిల్లాలో భీమిలి, విశాఖ దక్షిణం, విశాఖ తూర్పు, విశాఖ పడమర అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి వుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇన్చార్జిలకే సీట్లు ఇస్తారని చెబుతున్నా.. నియోజకవర్గాల సమీక్షలు పూర్తయితే తప్పా 
ఎవరికి ఎమ్మెల్యే సీటు వస్తుందో అనేదానిపై క్లారిటీ రాదు. ఈస్థానాలతోపాటు విశాఖ ఎంపీ సీట్లుకి అభ్యర్ధులను ఖరారు చేయాల్సి వుంది. ప్రస్తుతం విశాఖ నుంచి కొందరు సదరు నియోజకవర్గాల నుంచి సీట్లు ఆశిస్తున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో వారికి కేటాయించిన సీట్లను ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, మరికొందరు నేతలకు కేటాయించడంతో ఈసారికి వారికి సీటు కేటాయించే అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతుంది. 

2024 ఎన్నికల్లో విశాఖలో కీలకం కానున్న కార్పోరేటర్లు 
2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఈసారి కార్పోరేటర్లు చాలా కీలకం కానున్నారు. దానికోసం ఇప్పటి నుంచే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నియోజకవర్గాల సమీక్షలో కార్పోరేటర్లు, అక్కడి నేతలను కూడా పిలిచి  ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ప్రతీ ఒక్క కార్పోరేటర్ నుంచి, అక్కడ వివిధ కార్పోరేషన్లలో చైర్మన్ లుగా ఉన్నవారు,డైరెక్టర్లుగా ఉన్నవారు, మహిళా నేతలు ఇలా అందరితోనూ మాట్లాడి అక్కడి తాజా పరిస్తితిని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలోని కేడర్ ని అంతా సద్వినియోగం చేసుకొని ఈసారి ఎలాగైనా 
జీవిఎంసీ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలంటే కార్పోరేటర్లు..స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం ఒక్కటే మార్గమని..దానికోసం ముందు నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే తప్పా స్థానాలు గెలుచుకోవడం కష్టమని భావించి ముందుగానే కార్పోరేటర్లను కీలకంగా మార్చడానికే నియోజవర్గస్థాయి సమావేశంలో వారికి పెద్ద పీట వేశారని చెబుతున్నారు. అదే సమయంలో ఈ 
మూడున్నర సంవత్సరాల్లో కష్టపడి పనిచేసినా..పదవులు దక్కని వారికి వచ్చే ప్రభుత్వంలోగానీ, ఈఏడాదిన్నరలో గానీ పదవులు ఇస్తామనే సంకేతాలు కూడా వదిలినట్టు తెలుస్తుంది.

ఆఖరి వరకూ ఆశావాహులు గాల్లోనే..
2019లో వరకూ పార్టీకోసం కష్టపడి పనిచేసి, సీటు దక్కని నేతలు, రెబల్స్, సీటు కోసం ఆశించేవారి పేర్లు ప్రస్తుతం సీల్డు కవర్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వారిని ఆఖరి నిమిషం వరకూ అలాగే వుంచి. ప్రజల్లో వ్యతిరేకత వున్న ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానంలో వారిని సర్ధుబాటు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నా..ఆఖరివరకూ మాత్రం వారు అలా గాల్లోనే ఉండాలనే సంకేతాలు వెళ్లినట్టు చెబుతున్నారు. ఇప్పటికే 175 నియోజవర్గాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావాహుల జాబితా మొత్తం తన చేతుల్లో పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ కేవలం గెలుపే లక్ష్యంగా గెలుపు గుర్రంపై స్వారీ చేసే బలమైన నాయకులకే తొలుత సీట్లు ఇస్తామని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ తరుణంలో లైంగిక వేధింపులు, సోషల్ మీడియలో తప్పుడు ప్రచారం పొందిన వారు, నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉంటూ వారి కార్యకలాపాలు చేసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, అదే సమయంలో పార్టీనే అంటిపెట్టుకుని ప్రజలకు, కేడర్ కు 
సహాయం చేస్తున్న నాయకుల పేర్లు కూడా పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ చలికాలంలో మొదలైన ఎన్నిక వేడి ఎవరికి మంట పెడుతుంతో, ఎవరిని చల్లబరుస్తుందో..ఎవరికి సీటు కన్ఫర్మ్ చేసి.. మరెవరికి రిక్త హస్తం మిగులుస్తుందో అన్ని నియోజకవర్గాల సమీక్షలు పూర్తయితే తప్పా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. ఆ తరువాత కూడా లాస్ట్ హవర్ లో గోల్డెన్ ఛాన్సు కొట్టే నేతలు ఉన్నారని చెబుతున్నారు కేడర్..!

Tadepalli

2022-11-17 07:44:36

సతీష్ ఎలాఉన్నారు సీఎం ఆప్యాయ పలకరింపు

విశాఖ జివిఎంపీ డిప్యూటీ మేయ్ కటమూరి సతీష్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా పలకించారు. ఏం సతీష్ ఎలా ఉన్నారు. కష్టపడి పనిచేసి ఉత్తర నియోజకవర్గంలోని కెకె.రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించి తీసుకురావాలి..ఆ విషయంలో మీరు కీలకంగా వ్యవహరించాలంటూ వెన్నతట్టారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన విశాఖ ఉత్తర నియోజకవర్గం సమీక్ష సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె.రాజుతో కలిసి జీవిఎంసి డిప్యూటిమేయర్  కటుమూరి సతీష్ పాల్గొన్నారు. 

Tadepalli

2022-11-16 14:31:14

పీహెచ్సీల్లోనూ ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ యాప్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)ల్లో ని సిబ్బంది హాజరు కోసం ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ని అమలులోకి తీసుకు వచ్చింది. ఈ యాప్ ద్వారానే ప్రస్తుతం ఉద్యోగులంతా అటెండెన్సు వేస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఎవరు ఎక్కడి నుంచి అటెండెన్సు వేసిందీ లైవ్ లోకేషన్ తో సహా నమోదవుతోంది. ఒక పీహెచ్సీలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంతమంది ఏ సమయానికి అటెండెన్సు వేశారు.. ఎంత మంది లీవ్ లో ఉన్నారు. ఇంకా ఎంతమంది అటెండెన్సు వేయాల్సి వుంది తదితర వివరాలన్నీ డాక్టర్ డాష్ 
బోర్డులో దర్శనమిస్తున్నాయి. ఈ విధానం ద్వారానే సిబ్బందితోపాటు వైద్యునితో సహా అటెండెన్సు వేస్తున్నారు. ఉదయం పదిగంటలకు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఇన్ మరియు ఔట్ తప్పనిసరిగా అటెండెన్సు వేయాల్సి వుంటుంది. ఈ అటెండెన్సు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంతోపాటు, చివాలయంలోని రాష్ట్ర కార్యాలనికి అనుసంధానించారు. త్వరలోనే ఓపీ సేవలు కూడా ఆన్ 
లైన్ చేస్తారని వైద్యఆరోగ్యశాఖకు చెందిన రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి ప్రత్యేకంగా తెలియజేశారు.

Tadepalli

2022-11-16 12:29:24

ఏపీలో రాష్ట్రప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల గణన..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల గణన మొదలు పెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగవిరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. అలా పెంచిన ఉద్యోగుల మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్నా రు. అపుడు రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఖాళీలు ఏర్పడనున్నాయి. దానికోసం ముందుగా ఏ ప్రభుత్వ శాఖల్లో ఎంతమంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, ఏ కేడర్ లోని ఉద్యోగులు త్వరలో రిటైర్ కాబోతున్నారు అనే సమాచారాన్ని సేకరించే పనిలో పడింది. ఒకేసారి ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేస్తే పరిపాలనలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం వుంది. దీనితో కొత్త ఉద్యోగాల భర్తీ చేపట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమస్యను అధిగమించేందుకు ముందుగానే ఖాళీల వివరాలను, ఉద్యోగుల గణన చేపట్టి ఉంచితే ఎన్నికల ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి బావుంటుందని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది.

వైఎస్సార్ నోటిఫికేషన్ల కంటే ఎక్కువగా ఉంటాయ్
దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించే సమయంలో కూడా ఇలానే ఎన్నికలకు ఏడాది సమయం ఉందనగా రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను లెక్కించి.. సరిగ్గా ఎన్నికల ముందు సుమారు 55వేల ఉద్యోగాలకు పైగానోటిఫికేషన్ జారీ చేశారు. కాకపోతే ఇపుడు ఆ సంఖ్య రెండితలు అయ్యే అవకాశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అతిపెద్ద రెగ్యుల్ జాబ్స్ నోటిఫికేషన్ ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖది తప్పితే మరే ఇతర శాఖలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం కాంట్రాక్టు పద్దతిలో పారామెడికల్ సిబ్బంది, వైద్యుల పోస్టులను భర్తీచేశారు. మిగిలిన శాఖల్లో ఒకటి అరా పోస్టులు తప్పితే ఒకే సారి వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీని చేపట్టలేదు. అయితే ప్రభుత్వం పెంచిన రెండేళ్ల అదనపు ఉద్యోగ విరమణ వయస్సు ఉద్యోగులకు వచ్చే ఏడాదితో పూర్తవుతున్న తరుణంలో ముందుగానే ఉద్యోగాల నోటిఫికేషన్లకు సిద్ధం కాకపోతే చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదం వుంది.

నిరుద్యోగులకు అసలైన ఉద్యోగాల పండుగ
ఆంధ్రప్రదేశ్ లో అసలైన ఉద్యోగాల పండుగ 2019లో ఒకసారి గ్రామ, వార్డు సచివాలయశాఖ నోటిఫికేషన్ ద్వారా వస్తే.. 2024లో మరోసారి అదే స్థాయిలో వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ విరమణలు చేసే ఖాళీలతోపాటు, అప్పటికే గుర్తించిన ఖాళీలు ప్రభుత్వం గుర్తించాల్సి వుంటుంది. ఈ రెండు దఫాల ఖాళీలను బేరీజు వేసుకొని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తీసే అవకాశాలు 2024 ఎన్నికల ముందు రానున్నాయి. అందులోనూ రాష్ట్రంలోని 13 జిల్లాలను కాస్తా 26 జిల్లాలు చేసిన నేపథ్యంలో కొత్త జిల్లాల్లో చాలా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టాల్సి వుంది. ఇప్పటికే వాటికోసం గ్రూప్-1 ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు ప్రస్తుతం నోటీఫికేషన్లు వేసినప్పటికీ అప్పికి ఖచ్చితంగా మరోసారి నోటిఫికేషన్లు వేసి తీరాల్సిందే. ఇప్పటికే ప్రభుత్వశాఖల్లో అధికారులు, మినిస్ట్రీరియల్ సిబ్బంది తక్కువగా ఉండటంతో అధికారిక పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. అలాంటి ఇబ్బందులు 2024 తరువాత రాకుండా ఉండాలంటే భారీ సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్లు తీయాల్సిన అవసరం వుంది.

రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ధిక భారం..
ఇప్పటికే ఆర్ధికలోటుతో కొట్టిమిట్టాడుతున్న రాష్ట్రప్రభుత్వానికి 2024లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ తోపాటు, ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలను కూడా ఇవ్వాల్సి వుంది. అలా చేయాలంటే ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుంది. దానికోసం ఇప్పటి నుంచే ఆదాయవనరులను పెంపొందించుకోవాల్సిన అవసరం వుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నది. ఆర్ధిక లోటును ఆదాయాలు వచ్చే ప్రభుత్వశాఖల ద్వారా సమకూర్చుకోవడం ద్వారా భర్తీచేసుకోవాలని యోచిస్తూ .. దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా చేపట్టింది. చూడాలి వచ్చే రెండేళ్లలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకోసం ఏవిధమైన వ్యూహాన్ని అవలంభించనున్నదో..!



Tadepalli

2022-11-16 03:00:20

రూ. కోట్లలో కోల్పోతున్న సచివాలయాల ఆదాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశం మొత్తం తొంగి చూసేవిధంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని కోల్పోతున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సచివాలయాల ద్వారా ప్రభుత్వం అన్ని రకాల సేవలను అందించడం ప్రారంభిస్తే సిబ్బంది నెలవారీ జీతాలు పోను ఇంకా ప్రభుత్వానికే అధిక ఆదాయం సమకూరుతుంది. ఆ విషయం ప్రభుత్వానికి తెలిసినా ఎందుకనో ముందడుగు వేయలేక పోతున్నది. పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే గ్రామ, వార్డు సచివాలయాలు ఏపీ ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరుగా మారిపోతాయనడంలో ఎలాంటి సందేహమూలేదు. అంతేకాదు ఇంటిముంగిటే ప్రజలకు అన్ని సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుంది. ప్రభుత్వం ప్రస్తుతం 570 రకాల సేవలను కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. పేరుకేవాటిని తీసుకు వచ్చింది తప్పితే అన్నిసేవలు పూర్తిస్థాయిలో సచివాలయాల ద్వారా ప్రజలకు చేరడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాలు, 1.20 లక్షల మంది ఉద్యోగులు ఉన్నా వీరిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదు.

భారమంతా డిజిటల్ అసిస్టెంట్ల పైనే..
గ్రామ,వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన కామన్ సర్వీస్ సెంటర్ సేవల భారంత మొత్తం డిజిటల్ అసిస్టెంట్లపైనే పడిపోతుంది. ఈ ఒక్క ఉద్యోగి దగ్గర నుంచే అన్నీసేవలు అందాల్సివుంటోంది. మిగిలిన సిబ్బందికి కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం, ఆయా ప్రభుత్వశాఖల సేవలను వారి ద్వారా చేసే అవకాశం లేకపోవడం కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. ఇటీవల కాలంలో ఆధార్ అనుసంధాన కార్యక్రమం కూడా సచివాలయాల్లో చేస్తుండటంతో సాధారణ పనులకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. సచివాలయాల్లో పలు దృవీకరణ పత్రాలు జారీ ఆలస్యం కావడంతో ఇవే సేవలను అత్యధిక మొత్తం చెల్లించి మీ-సేవా కేంద్రాల్లో తీసుకోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం అందిస్తామని ప్రకటించి 570 సేవల్లో కొద్ది రకాల సేవలు మాత్రమే ప్రస్తుతం గ్రామ,వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. చాలా వరకూ సేవలు ఇంకా ప్రభుత్వం పూర్తిస్థాయిలో జారీచేసే అవకాశం ఇవ్వలేదు.

సచివాలయాల్లో చాలీ చాలని కంప్యూటర్లు
గ్రామ, వార్డు సచివాయాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది వున్నా పూర్తిస్థాయిలో పనులు చేయడానికి, ప్రభుత్వ సేవల ద్వారా పలు రకాల దృవీకరణ పత్రాలు జారీచేయాలన్నా కంప్యూటర్ల సమస్య తీవ్రంగా తలెత్తున్నది. ఒక్కో సచివాలయానికి కేవలం రెండు మాత్రమే కంప్యూటర్లు ఉండటంతో ఒకటి పూర్తిగా డిజిటల్ అసిస్టెంట్ స్వాధీనంలో ఉండగా మరో కంప్యూర్ ను మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది వినియోగించాల్సి వస్తున్నది. అలా కాకుండా అన్ని ప్రభుత్వశాఖల సిబ్బందికి ప్రభుత్వం కంప్యూటర్లు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ప్రకటించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారానే అందించడానికి వీలు కలుగుతుంది. ఏ పనిచేయాలన్నా డిజిటల్ అసిస్టెంటు మాత్రమే చేయాల్సి వస్తున్నది. మిగిలిన ప్రభుత్వశాఖల సిబ్బంది సైతం ఆన్ లైన్ కార్యక్రమాలు, పనులు చేయాలంటే వేచి ఉండే పరిస్థితి నెలకొంది. అదే సమయంలో సచివాలయాలకు వచ్చే ఇంటర్నెట్ కూడా స్పీడ్ గా లేకపోవడం వలన కూడా ఇక్కడ పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. కొంతమంది సిబ్బంది సొంత ల్యాప్ టాప్ లు వినియోగిస్తున్నా వారి పనులు మాత్రమే చేసుకుంటున్నారు.

సిబ్బందిని మొత్తం వినియోగిస్తే గళ్లాపెట్టి గల గల
గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 19 ప్రభుత్వశాఖల సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వారందరినీ రాష్ట్రవ్యాప్తంగా ఏక కాలంలో వినియోగిస్తే ప్రభుత్వానికి అపారంగా ఆదాయం పెరుగుతుంది. కానీ ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఆన్ లైన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా నేటికీ.. కాగితపు దృవీకరణలతోనే పనులు జరుగుతున్నాయి. ఆవిధంగా చూసుకున్నా సచివాలయాల ద్వారా జారీ చేసే దృవీకరణల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం నిత్యం వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వం సచివాలయాల ద్వారా సేవలను  పెంచుతుంది తప్పితే వాటిని ఆయా ప్రభుత్వశాఖల సిబ్బంది ద్వారా చేయించే ఏర్పాటు మాత్రం చేయడం లేదు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటై 1.20లక్షల మంది సిబ్బంది అందుబాటులోకి వచ్చినా నేటికీ ప్రజలు అత్యవసర పనుల కోసం మీ-సేవా కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

శాఖలవారీగా భర్తీచేసిన ఉద్యోగాలతో ఉపయోగమేంటి..?
ఏపీ ప్రభుత్వం శాఖల వారీగా సచివాలయాల్లో ఉద్యోగులను నియమించింది. కానీ వారితో పూర్తిస్థాయిలో సేవలను మాత్రం ప్రజలకు  చేరవేసే విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. సచివాలయాలు ఏర్పాటై మూడేళ్లు దాటుతున్నా ఇంకా సచివాలయాల్లో ఏఏ రకాల సేవలు పొందవచ్చునో ప్రజలకు అవగాహన లేదంటే అతిశయోక్తికాదేమో. గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలంటే ఎన్నిప్రభుత్వశాఖల ఉద్యోగులను సచివాలయాల్లో ఏర్పాటు చేసిందో..వారందరితోనూ సేవలు, దృవీకరణ పత్రాలు, ఇతరత్రా అంశాలకు చెందిన కార్యకాలపాలు చేపడితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టు అవుతుంది. సచివాలయంలోని అన్నిశాఖల సిబ్బంది కలిపి కంప్యూటర్లు ఏర్పాటు చేయడంతోపాటు, హైస్పీడ్ ఇంటర్నెట్, అధునాతన ప్రింటర్లను అందుబాటులోకి తీసుకువస్తే..ఏకకాలంలో రాష్ట్రవ్యప్తంగా సిబ్బంది మొత్తం కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా చేసే పనులతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఒక రేంజి లో ఉంటుంది. ప్రస్తుతం ఇవే సేవలు ప్రజలంతా మీ-సేవా కేంద్రాల నుంచి పొందుతున్నారు. అదే ఉన్న అన్నిశాఖల సిబ్బందిని వినియోగించుకుంటే ప్రజలకు సేవతోపాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఆర్ధిక లోటు కూడా తగ్గే అవకాశాలున్నాయి.. చూడాలి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది..!


Tadepalli

2022-11-15 04:49:03