1 ENS Live Breaking News

చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అరుదైన జీవజాలంకు ఆల‌వాలంగా ఉన్న చిత్త‌డి నేల‌ల ప‌రిర‌క్ష‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, ఇంధ‌న‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, గ‌నుల‌శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అట‌వీ అధికారుల‌ను ఆదేశించారు. అమ‌రావ‌తిలోని స‌చివాలయంలో బుధ‌వారం అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ అధికారుల‌తో వెట్ ల్యాండ్ బోర్డ్ తొలి స‌మావేశం మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అధ్య‌క్ష‌త‌న జరిగింది. ఈ స‌మావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలోని చిత్త‌డినేల‌ల్లో జీవ వైవిధ్యాన్ని ప్ర‌తిభింబిస్తూ అనేక ర‌కాల జంతువులు, ప‌క్షులు, జీవ‌జాలం మ‌నుగ‌డ‌ను సాగిస్తున్నాయ‌ని అన్నారు. కొల్లేరు, నేల‌ప‌ట్టు, పులికాట్, కొరింగ‌, శ్రీ‌కాకుళంలోని ప‌లు ప్రాంతాల్లో చిత్త‌డి నేల‌లు ఉన్నాయ‌ని అన్నారు. కొల్లేరు, పులికాట్ ప్రాంతంలోని చిత్త‌డి నేల‌ల్లో అరుదైన విదేశీ ప‌క్షులు వేల కిలోమీట‌ర్ల మేర ప్ర‌యాణం చేసి, ఈ ప్రాంతంలో త‌మ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయ‌ని తెలిపారు. 

వీటితో పాటు అంత‌రించుపోతున్న ప‌లు జంతువులు, జీవ‌జాలాలు చిత్త‌డి నేల‌ల్లో ప్ర‌కృతి ఒడిలో మ‌నుగ‌డ సాగిస్తున్నాయ‌ని అన్నారు. ఇటువంటి చిత్త‌డి నేల‌ల‌ను కాపాడుకోవాల‌ని ఇరాన్ లోని రామ్ స‌ర్ లో జాతీయ క‌న్వెన్స‌న్ జ‌రిగింద‌ని, ఇందులో ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు పాల్గొని ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, జీవివైవిధ్యంను కాపాడుకునేందుకు తాము కూడా భాగ‌స్వాములు అవుతామ‌ని స్ప‌ష్టం చేశాయ‌ని గుర్తు చేశారు. చిత్త‌డి నేల‌ల ప‌రిర‌క్ష‌ణ‌పై 2019, 2017లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ట్టాలు చేసింద‌ని తెలిపారు. వాటి ఆధారంగా రాష్ట్రంలోనూ వెట్ ల్యాండ్ బోర్డ్ ఏర్పాట‌య్యింద‌ని, అయితే ఈ బోర్డ్ స‌మావేశాలు గ‌తంలో జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం నిర్వ‌హించిన‌ తొలి స‌మావేశం సంద‌ర్బంగా అట‌వీశాఖ అధికారులు చిత్త‌డి నేల‌ల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌త్య‌క దృష్టి సారించాల‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు. 

కేంద్ర‌ప్ర‌భుత్వం మ‌న రాష్ట్రంలో మొత్తం 30వేల ఎక‌రాల్లో చిత్త‌డి నేల‌లు ఉన్న‌ట్లు గుర్తించింద‌ని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. వివిధ జిల్లాల్లో విస్త‌రించి ఉన్న ఈ నేల‌ల్లో కొంత మేర ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంద‌ని అన్నారు. కొల్లేరు ప్రాంతంలో 5 నుంచి 2 వ కాంటూరు వ‌ర‌కు చేప‌ల చెరువులు విస్త‌రించాయ‌ని అన్నారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో సీజ‌న‌ల్ గా వ్య‌వ‌సాయం, ఇత‌ర పంట‌లు సాగు చేస్తున్నారని తెలిపారు. వీట‌న్నింటిపైన నిర్ధిష్ట‌మైన స‌మాచారం రూపొందించేందుకు రెవెన్యూ, వ్య‌వ‌సాయం, అట‌వీశాఖ అధికారుల‌తో క‌మిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.  రెండు నెల‌ల్లో ఈ క‌మిటీ ప్రాథ‌మిక నివేదిక‌ను వెట్ ల్యాండ్ బోర్డ్ కు స‌మ‌ర్పిస్తుంద‌ని తెలిపారు. అటు ప్ర‌జ‌ల జీవ‌నోపాధుల‌కు విఘాతం లేకుండా, ఇటు చిత్త‌డి నేలల్లో జీవ‌జాలం మ‌నుగ‌డ‌కు ముప్పు లేకుండా వెట్ ల్యాండ్ బోర్డ్ ఆధ్వర్యంలో అవ‌సర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఈ స‌మావేశంలో అట‌వీశాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్, అట‌వీద‌ళాల అధిప‌తి మ‌ధుసూధ‌న్ రెడ్డి, పిసిపిఎఫ్ ఎకె ఝా, స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ శాంతిపాండే త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tadepalli

2022-09-28 15:44:11

శ్రీవారి సేవకులు స‌నాత‌న ధ‌ర్మ ర‌థ‌సార‌థులు

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ప్రేమతో సేవ‌లు అందించ‌డంతోపాటు టిటిడి వివిధ ప్రాంతాల్లో నిర్వ‌హిస్తున్న శ్రీ‌నివాస క‌ల్యాణాలు, వైభ‌వోత్స‌వాలు లాంటి ధార్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొని స‌నాత‌న ధ‌ర్మ ర‌థ‌సార‌థులుగా నిలుస్తున్నార‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు విచ్చేసిన శ్రీ‌వారి సేవ‌కుల‌కు తిరుమల ఆస్థానమండపంలో బుధ‌వారం అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లందించ‌డం శ్రీ‌వారి సేవ‌కుల అదృష్ట‌మ‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు 22 సంవ‌త్సరాల క్రితం శ్రీ‌వారి సేవ‌ను ప్రారంభించిన‌ట్టు చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశం న‌లుమూల‌ల నుండి 13 ల‌క్ష‌ల మందికి పైగా సేవ‌కులు పాల్గొన్నార‌ని వెల్ల‌డించారు. ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు ఏడు రాష్ట్రాల నుంచి 3500 మంది సేవ‌కులు వ‌చ్చార‌ని తెలిపారు. రానున్న కాలంలో అన్ని జిల్లాల నుండి సేవ‌కుల సంఖ్య పెంచాల‌ని సూచించారు. తిరుమ‌ల‌తోపాటు తిరుప‌తిలోని స్థానికాల‌యాల్లో కూడా సేవ‌కులు సేవ‌లందిస్తున్న‌ట్టు చెప్పారు. దీంతో పాటు ప‌ర‌కామ‌ణి సేవ‌కూడా ఉంద‌న్నారు. రూ.23 కోట్ల‌తో నిర్మించిన నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని బుధ‌వారం ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించిన‌ట్టు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప‌లువురు శ్రీ‌వారి సేవ‌కులు మాట్లాడుతూ శ్రీ‌వారి సేవ చేసే అవ‌కాశం రావ‌డం భ‌గ‌వంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్న‌ట్టు తెలిపారు.

శ్రీ‌వారి సేవ‌కుల కోసం క్యూ ఆర్ కోడ్ ప్రారంభం

తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో సేవ‌లందించే శ్రీ‌వారి సేవ‌కులు ఆయా మార్గాల‌ను తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన క్యూఆర్ కోడ్ విధానాన్ని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో ప్రారంభించారు. మొద‌ట‌గా ఒక శ్రీ‌వారి సేవ‌కుడు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆ ప్రాంతానికి వెళ్లే మార్గాన్ని తెలుసుకున్నారు. ద‌శ‌ల‌వారీగా భ‌క్తుల కోసం వివిధ ప్రాంతాల్లో ఈ క్యూఆర్ కోడ్‌ల‌ను అందుబాటులో ఉంచ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  పోక‌ల అశోక్‌కుమార్‌, జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సీఈవో  ష‌ణ్ముఖ్ కుమార్‌, విజివో  బాలిరెడ్డి, టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా.టి.రవి, సహాయ ప్రజాసంబంధాల అధికారి  పి.నీలిమ, శ్రీవారి సేవ ఏఈవో  నిర్మ‌ల, శ్రీ‌వారి సేవ సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2022-09-28 11:45:33

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటునమోదు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర1న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదేరోజు నుంచి ఓటర్లు కూడా తమ ఓటును నమోదు చేసుకోవాల్సి వుంటుంది. గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదవుటకు కాలపరిమితి అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు మాత్రమే వుంటుంది. ఓటు నమోదు చేసుకోవడానికి అభ్యర్ధులు ఫారమ్ 18ని నింపి దానికి డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ (అటెస్టెడ్) ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో జతచేయాల్సి వుంటుంది. అలా పూర్తిచేసిన దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయం, లేదా ఆర్డీఓ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ లలో సమర్పించవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్లై లో ceoandhra.nic.in ద్వారా కూడా నమోదు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. గతంలో ఓటర్లుగా ఉన్నవారు కూడా మళ్లీ ఓటు నమోదు చేసుకోవాలి. 

పాత ఓటరు జాబితా మొత్తం రద్దు చేయడం వలన ఇపుడు అభ్యర్ధులంతా కొత్తగా నోమోదు  చేసుకోవాలి. పెద్దల సభకు తమ ఓటు ద్వారా ప్రజాప్రతినిధులను పంపాలనుకునే పట్టభద్రులు ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవడంతోపాటు, ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీ ఒక్క పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవడంతోపాటు, తోటి పట్టభద్రులతో కూడా ఓటుని నమోదు చేసుకునేలా తమవంతు సహకారం అందించాలని కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ప్రతీ పట్టభద్రుడుకి సూచిస్తోంది. ఈసారి జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు ఓటింగ్ శాతం పెరగడానికి ప్రతీ ఒక్కరూ చేయి చేయి కలిపి ముందుకు సాగాలని కూడా కోరుతున్నాం.

Guntur

2022-09-28 07:29:43

రాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో కోల్డ్ వార్..పోటా పోటీ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పుణ్యమాని రాష్ట్రప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శిలు,  ముఖ్య అధికారుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. దిశా నిర్ధేశం లేని వ్యవస్థలో 19 ప్రభుత్వశాఖల ప్రన్సిపల్ సెక్రటరీలు పోటా పోటీగా ఉత్తర్వులు ఇస్తూ జిల్లాల కలెక్టర్లు, సచివాలయ ఉద్యోగులను గంధరగోళానికి గురిచేస్తున్నారు. ఇదే అదునుగా జిల్లా, మండల స్థాయి అధికారులు, పంచాయతీలు, సచివాలయాల్లోని కార్యదర్శిలు కూడా తమ ప్రతాపాన్ని సిబ్బందిపైనే చూపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లు ఎవరికి వారే తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టుగా తాజాగా విడుదలైన ఉత్తర్వులే రుజువు చేస్తున్నాయి. ఫలితంగా ప్రజలకు ఇంటి ముంగిట అందాల్సిన ప్రభుత్వ సేవలు అటకెక్కుతున్నాయి. సిబ్బంది వారి వారి మత్రుశాఖల విధుల కంటే అదనపు ప్రభుత్వశాఖల పనులు అధికంగా చేయాల్సి వస్తున్నది. ఎవరు ఏ శాఖ ఉద్యోగులో వారికే తెలియని అయోమయ పరిస్థి నెలకొంది. అన్ని ప్రభుత్వశాఖల్లోనూ రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఇన్చార్జి వ్యవస్థలు కొనసాగుతుండటంతో పరిపాలన వ్యవస్థ గాడితప్పుతున్నదా అనే అనుమానాన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు 26 జిల్లాల కలెక్టర్లుకి ఇచ్చిన ఉత్తర్వులు రుజువుచేస్తున్నాయి.

ఒకరు చేయాలని ఉత్తర్వులిస్తే..మరొకరు తొలగించమని ఆదేశాలు
ప్రభుత్వ శాఖల్లోని ప్రిన్సిపల్ సెక్రటరీలు గ్రామ, వార్డు సచివాలయశాఖలోలని 19 శాఖల సిబ్బందికి అన్ని రకాల పనులు చేయాలని ఉత్తర్వులు జారీచేస్తే..తమ శాఖ సిబ్బందికి ఆ పనులు చెప్ప వద్దంటూ మరోశాఖ ముఖ్యకార్యదర్శి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వుల ద్వారా ఆదేశాలు వస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే కాదు ఇటు జిల్లాల కలెక్టర్లు కూడా ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు చేసే ఆదేశాలతో తలలు పట్టుకుంటున్నారు. వెరసీ రాష్ట్రశాఖల అధికారుల మధ్య కోల్డ్ వార్ ఉత్తర్వుల రూపంలో సచివాలయ సిబ్బందిపైనే తీవ్ర ప్రభావం చూపుతోంది. అలాగని క్రిందిస్థాయిలో జిల్లా అధికారులు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శిలు ముందుగా వచ్చిన ఆదేశాలను అమలు చేసి, ఆ తరువాత మరోశాఖ కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి ఎక్కడలేని నొప్పులన్నీ పడుతున్నారు. జిల్లాల్లో అయితే జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ఉత్తర్వులను తప్పా.. మండల అధికారులు ఏ ప్రభుత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చినా వాటినైనా బుట్టదాఖలు చేస్తున్నారు. అలాగని జిల్లా కలెక్టర్లు సైతం ప్రభుత్వశాఖల నుంచి వచ్చిన ఉత్తర్వులను జిల్లాశాఖల అధికారుల ద్వారా ప్రాపర్ ఛానల్ లో మండల అధికారులకు పంపడం లేదు. పంపినా వాటిని వెంటనే అమలు చేయాలని ఆదేశాలివ్వడం లేదని అధికారులే చెబుతున్నారు.

నాడు 3సార్లు అందరికీ బయో మెట్రిక్..నేడు కొందరికి రెండుసార్లే
గ్రామ, వార్డు సచివాలయాల్లో 19శాఖల సిబ్బంది ఖచ్చితంగా మూడు సార్లు బయోమెట్రిక్ అటెండెన్సు వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే..కొన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది కేవలం తమ శాఖ సిబ్బంది రోజుకి రెండుు సార్లు మాత్రమే బయోమెట్రిక్ వేస్తారని, వారికి మూడుసార్లు అటెండెన్సు అవసరం లేదని ఉటంకిస్తూ..అన్ని జిల్లాల కలెక్టర్లకు పలుశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉత్తర్వులు జారీచేశారు. దీనితో పనిచేసే కొందరు సచివాలయ సిబ్బందికి రోజూ మూడు సార్లు వేసే బయో మెట్రిక్ అటెండెన్సు నుంచి మినహాయింపు వచ్చింది. ఇలా కొన్ని శాఖలకు మినహాయింపు ఇవ్వడంతో మిగిలిన శాఖల కమిషనర్లు, ప్రిన్సిపల్ కార్యదర్శిలు కూడా తమశాఖ సిబ్బందికి ఎలాంటి అదనపు పనులూ అప్పగించవచ్చదని మరొకొన్ని ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నుంచి కొన్నిశాఖల సిబ్బంది కోసమే వచ్చిన ఉత్తర్వులు మిగిలినశాఖల సిబ్బందికి తీవ్ర మనస్థాపాన్ని కలిగిస్తున్నాయి.

మా శాఖ సిబ్బందికి బిఎల్వో డ్యూటీలు వేయకండి..
భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఎలా ఉన్నా..వారి ప్రభుత్వశాఖల పనులు కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లోని అన్ని ప్రభుత్వశాఖల సిబ్బందికీ బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) విధులు అదనంగా వేసి మాత్రుశాఖల విధులకు పక్కన పెట్టేవిధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనితో సచివాలయ సిబ్బంది వారి వారి శాఖల ప్రధాన విధులను పక్కనబెట్టి, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆదేశాలు, మండల స్థాయిలో తహశీల్దార్ల ఆదేశాలకు, హెచ్చరికలకు భయపడి బిఎల్వో విధులనే చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్రశాఖల కమిషనర్లు తమ శాఖ సిబ్బందికి బిఎల్వో విధులు తప్పించాలని, అదేవిధంగా బయో మెట్రిక్ మూడు సార్లు కూడా వేయరని మళ్లీ తాజాగా జిల్లా కలెక్టర్లకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేశారు. ఇలా ఎవరి శాఖలకు సంబంధించిన ముఖ్యకార్యదర్శిలు, కమిషర్లు వారి వారి శాఖల సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది.

రాష్ట్రశాఖల అధికారుల్లో కొరవడిన సమన్వయం..
ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో గ్రామస్థాయిలోనే ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వశాఖల మధ్య కొరవడిన సమన్వయంతో ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరిస్తున్నారు. ఒక శాఖ అధికారి సచివాలయ సిబ్బంది మొత్తం తమ శాఖ సూచించిన విధులు నిర్వర్తించాలని ఆదేశిస్తే..మరోశాఖ అధికారా ఆ విధుల నుంచి తమ శాఖ సిబ్బందికి ఎలాంటి విధులూ అప్పగించకూడదని మరో ఉత్తర్వు జారీచేస్తున్నారు. ఈ విధానం చూస్తుంటే అసలు రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి, ఇతర ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శిలకు, కమిషనర్లకు శాఖల మధ్య అవగాహన లేదనే విషయం స్పష్టమవుతున్నది. వాస్తవానికి సచివాలయాల్లోని 19శాఖల సిబ్బందికి వారి ప్రభుత్వ శాఖలకు చెందిన విధులు, పనులు కాకుండా అదనపు విధులు అప్పగించడం ద్వారా ఏ లక్ష్యంతో అయితే వీరిని ఉద్యోగాల్లో నియమించారో ఆ పని జరగకుండా అదనపు విధులు మోకాలడ్డుతున్నాయి. దీనితో ఏ శాఖకు చెందిన రాష్ట్ర అధికారులు, వారి శాఖల సిబ్బందికోసం, వారి శాఖలో పేరుకు పోతున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఒక శాఖ జారీచేసిన విధులను రద్దు చేయాలని మరో ఉత్తర్వులు జారీచేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అన్ని ప్రభుత్వశాఖలకు గ్రామస్థాయిలో సిబ్బంది ఉన్నారు కనుక వారి వారి శాఖల పనుల పురోగతిపై కాకుండా అన్ని రకాల పనులను అందరికీ అప్పగించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చూడాలి ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనేది..!

Guntur

2022-09-28 03:22:18

పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌లో సీఎం వైఎస్.జగన్..

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన మంగ‌ళ‌వారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. బుధ‌వారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

          ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు  నారాయణ స్వామి,  సత్యనారాయణ, మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  వేణుగోపాలకృష్ణ, మతి రోజా, ఎంపిలు  మిథున్ రెడ్డి,  రెడ్డెప్ప, గురుమూర్తి,  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు  భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి,  బియ్యపు మధుసూదన్ రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు  రాములు,  పోకల అశోక్ కుమార్,  సంజీవయ్య,  మధుసూదన్ యాదవ్,  మారుతి ప్రసాద్,  ప్రశాంతిరెడ్డి, జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-09-27 16:46:58

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన మంగ‌ళ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా  ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి  ఎవి.ధ‌ర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

           ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి  నారాయణ స్వామి, మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  సత్యనారాయణ,  వేణుగోపాలకృష్ణ,  రోజా, ఎంపిలు  మిథున్ రెడ్డి,  రెడ్డెప్ప, తిరుప‌తి ఎమ్మెల్యే  భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-09-27 16:15:37

శ్రీవారి వైభవాన్ని భక్తులకు చూపండి

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రసారమాధ్యమాలు, పత్రికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చూపాలని టీటీడీ చైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి మీడియా ప్రతినిధులను కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదటిరోజైన మంగ‌ళ‌వారం ఉదయం తిరుమలలోని రాంభగీచా-2 విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ కోవిడ్ కార‌ణంగా గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. ఈ ఏడాది అధిక సంఖ్య‌లో విచ్చేసే  భక్తులకు సేవలందించేందుకు అన్ని విభాగాల ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి మూలవిరాట్టు దర్శనంతోపాటు వాహనసేవల దర్శనం కల్పించేందుకు అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు.

    మంగ‌ళ‌వారం సాయంత్రం ధ్వ‌జారోహ‌నం సంద‌ర్భంగా రాష్ట్ర  ప్ర‌భుత్వం త‌రుపున ముఖ్య‌మంత్రి   వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీ‌వారికి పట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని చెప్పారు. అదేవిధంగా దాత‌ల స‌హ‌కారంతో రూ.23 కోట్ల‌తో నిర్మించిన ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని బుధ‌వారం ఉద‌యం సిఎం ప్రారంభించ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. మీడియా సెంటర్‌లో భోజన సదుపాయంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, ఫ్యాక్స్‌, టెలిఫోన్‌ వసతి కల్పించామని, మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ కోరారు. టీటీడీ జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, పిఆర్వో డా.టి.రవి, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ‌, ఒఎస్డీ  నాగేశ్వ‌ర‌రావు, సూపరింటెండెంట్‌  శ్రీ‌నివాసులు రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2022-09-27 15:58:11

నూత‌న పరకామణి భ‌వ‌నంలో ఈవో తనిఖీ..

తిరుమలలోని అన్నప్రసాదం కాంప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న నూత‌న‌ పరకామణి భవనాన్ని టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి గురువారం సాయంత్రం సివిఎస్‌వో  నరసింహకిషోర్‌తో కలిసి త‌నిఖీ చేశారు. ఈ భ‌వ‌నాన్ని సెప్టెంబ‌రు 28న ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. ఆ త‌రువాత శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో రూ.4 కోట్లతో జరుగుతున్న పునరుద్ధరణ పనులను ఈవో పరిశీలించారు. ఇక్క‌డి భోజ‌న‌శాల‌లో దాదాపు 150 మంది భోజ‌నం చేసేలా అభివృద్ధి చేస్తున్నారు. ఈవో వెంట చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఇఇలు జగన్మోహన్ రెడ్డి,  సురేంద్రనాథ్ రెడ్డి, డిఇ  రవిశంకర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు వెంకటయ్య, సెల్వం, విజివో  బాలిరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

Tirumala

2022-09-22 14:49:33

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గవర్నర్ కు ఆహ్వానం

తిరుమల బ్రహ్మోత్సవాలకు స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ కు  తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వ హణాధికారి ఏ.వీ ధర్మారెడ్డి ఆహ్వాన పత్రికను అందచేసారు. బుధవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన వీరు స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలను బహుకరించి బ్రహ్మోత్సవాల విశిష్టతను గురించి వివరించారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 5 వ తేదీవరకు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, సతీసమేతంగా ఈ అధ్యాత్మిక వేడుకకు హాజరై స్వామివారి ఆశ్సీస్సులు అందుకోవాలని కోరారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-09-21 13:14:23

ఎన్టీఆర్ పేరు మార్పు.. యార్లగడ్డ రాజీనామా

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ప్రకటించారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహానుభావుడి పేరు ఆరోగ్య వర్సిటీకి ఉంచాలన్నదే తన అభిప్రాయమని కుండ బద్దలు కొట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి వున్న ఎన్టీఆర్ పేరు మార్చడం, ఎన్టీఆర్ అభిమానుల మనసు గాయపడటంతోపాటు, ఆ మహానుభావుని ఆత్మకూడా క్షోభిస్తుందన్నారు. ఆయన పేరు మార్పును తట్టుకోలేక బాధతోనే తాను ప్రస్తుతం ఉన్న పదవికి రాజీమా చేస్తున్నానని చెప్పారు. తన రాజీమా లేఖను ప్రభుత్వానికి పంపించానని చెప్పారు.  మరోవైపు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై టీఎన్‌టీయూసీ, తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఇటు వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం హెల్త్ యూనివర్శిటీకి డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు చక్కగా వుందంటూ తమ వాదనని వినిపిస్తున్నారు.

Visakhapatnam

2022-09-21 10:43:35

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎంకి ఆహ్వానం

కలియుగ వైకుంఠం తిరుమలలోని  ఈ నెల 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల‌ని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి టిటిడి ఆహ్వానం అందించింది. ఈ మేరకు బుధవారం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే  భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి  ముఖ్యమంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. వెల‌గ‌పూడి సచివా‌లయంలోని ముఖ్య‌మంత్రి ఛాంబ‌ర్‌లో సీఎంను క‌లిసి బ్ర‌హ్మోత్స‌వాల వివరాలను తెలియజేశారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అందించారు. 

        బ్ర‌హ్మోత్సవాల తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్యమంత్రి  వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.

Tadepalli

2022-09-21 09:29:30

తిరుమలలో బాల‌ల హ‌క్కుల క‌మిష‌న్‌

రాష్ట్ర బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ ఛైర్మ‌న్  కేస‌లి అప్పారావు, స‌భ్యులు  త్రిప‌ర్ణ ఆదిల‌క్ష్మి,  ముడిమేల ల‌క్ష్మీదేవి బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల‌లోని వేద పాఠ‌శాల‌, క‌ల్యాణ‌వేదికను ప‌రిశీలించారు.వేద పాఠ‌శాల‌లో విద్యార్థుల‌తో స‌మావేశమ‌య్యారు. అక్క‌డి వ‌స‌తులు, త‌ర‌గ‌తి గ‌దుల‌ను ప‌రిశీలించారు. అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు. బాల‌ల‌కు ఒత్తిడి లేకుండా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన విద్య అందించాల‌ని సూచించారు. క‌ల్యాణ‌వేదికలో వివాహాలకు అనుమ‌తి ఇచ్చే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాలు జ‌రుప‌రాద‌ని బోర్డులు ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించారు. అనంత‌రం శ్రీ‌వారి ఆల‌య ప‌రిస‌రాలు, ముఖ్య‌మైన కూడ‌ళ్ల‌లో భిక్షాట‌న చేస్తున్న బాల‌ల‌ను గుర్తించి వారికి పునరావాసం క‌ల్పించాల‌ని అధికారులకు సూచించారు. 

అంతకుముందు షాపింగ్ కాంప్లెక్స్, అతిథి గృహాల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను కమిషన్ పరిశీలించింది. క‌మిష‌న్ వెంట టిటిడి ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డిసిపివో  సురేష్‌, హెల్త్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ శ్రీ‌దేవి, లైజాన్ ఆఫీస‌ర్ ఆనంద‌రాజు, డెప్యూటీ ఈవో సెల్వం, విజివో  బాలిరెడ్డి, క‌ల్యాణ‌క‌ట్ట ఏఈవో  ర‌మాకాంత్ త‌దిత‌రులు ఉన్నారు.

Tirumala

2022-09-07 11:36:15

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో సామాన్యల‌కు పెద్ద‌పీట

తిరుమ‌ల‌లో రెండేళ్ల త‌రువాత శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లను మాడ వీధుల్లో నిర్వ‌హించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌డుతోంది. క‌రోనా కార‌ణంగా గ‌తంలో రెండు బ్ర‌హ్మోత్స‌వాలు శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌కు పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే అమ‌లు చేయాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. అన్నిర‌కాల ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసింది. బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలను టిటిడి ర‌ద్దు చేసింది. ఆర్జిత సేవలు, రూ.300/- దర్శన టికెట్ల‌తోపాటు శ్రీవాణి ట్ర‌స్టు దాత‌ల‌కు, ఇత‌ర ట్ర‌స్టుల దాతలకు ద‌ర్శ‌న‌ టికెట్లు రద్దు చేశారు. 

స్వ‌యంగా వ‌చ్చే ప్రొటోకాల్ విఐపిల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుంది. గ‌దుల‌కు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో భ‌క్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గ‌దుల‌ను ఆఫ్‌లైన్‌లో తిరుమ‌ల‌లోని వివిధ కౌంట‌ర్ల ద్వారా భ‌క్తుల‌కు కేటాయిస్తారు. అక్టోబ‌రు 1న గ‌రుడ‌సేవ కార‌ణంగా భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ట్ర‌స్టుల దాత‌ల‌కు, కాటేజీ దాత‌ల‌కు సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబ‌రు 2వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో గ‌దుల కేటాయింపు ఉండ‌దు. దాత‌లు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

              అదేవిధంగా ఎంతో ప‌విత్రంగా భావించే పెర‌టాసి మాసంలో బ్ర‌హ్మోత్స‌వాలు రానుండ‌డంతో పెద్దసంఖ్య‌లో భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, తిరుమ‌ల‌లో గ‌దుల ల‌భ్య‌త ప‌రిమితంగా ఉన్న కార‌ణంగా ఈ విషయాన్ని గమనించి భక్తులు తిరుప‌తిలో గ‌దులు పొంది బ‌స చేయాల‌ని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Tirumala

2022-09-05 09:21:06

భ‌క్తుల స‌మ‌క్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమ‌ల‌లో రెండేళ్ల తర్వాత భ‌క్తుల స‌మ‌క్షంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వ‌హిం చేందుకు టిటిడి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు ఆల‌య మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ కార‌ణంగా రెండేళ్ల‌పాటు ఆల‌యంలో ఏకాంతంగా బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈసారి మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నుండ‌డంతో విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని టిటిడి అంచ‌నా వేస్తోంది. ఈ క్ర‌మంలో భ‌క్తుల‌కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతోంది. బ్ర‌హ్మోత్స‌వాల్లో తొమ్మిది రోజుల పాటు జ‌రుగ‌నున్న వాహ‌న‌సేవల వివ‌రాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబ‌ద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగ‌నుంది.


సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు చూసుకుంటే.. సెప్టెంబర్ 26న రాత్రి 7 నుండి 8 గంట‌ల మ‌ధ్య‌ అంకురార్పణ,  సెప్టెంబరు 27న మొద‌టి రోజు సాయంత్రం 5.15 నుండి 6.15  గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనం,  సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహనం,  సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనం, సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనం. అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం, 


అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం(స్వ‌ర్ణ‌ రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహనం, అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనం, అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహనం సేవలతో పాటు అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజావరోహణం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు సంబంధించి టిటిడి అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను టిటిడి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వీటి ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తులు దేశవ్యాప్తంగా ఇంటి దగ్గర ఉంటే తిలకించవచ్చు.

Tirumala

2022-09-02 13:07:36

ప్రసూతి కష్టాలు వారిని వెంటాడుతున్నాయ్

మహిళ జీవితంలో తల్లికావడం ప్రతీ అమ్మకు దేవుడిచ్చిన అమూల్యమైన ఒక వరం.. అది సాఫీగా జరిగితే దానంత పండుగ మరొకటి ఉండదు.. అదే తల్లికావడం ప్రభుత్వ ఉద్యోగుల కైతే, ఒక్కోసారి అధికారులు చేసే తప్పిదాలకు ఆ ప్రసూతి కష్టాలు వారిని నిత్యం వెంటా డుతూనే ఉంటాయి.. సరిగ్గా ఇలాంటి ప్రసూతి వేధన గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులను నేటికీ వెంటాడుతూనే ఉంది.. తల్లికావడానికి తీసుకున్న ప్రసూతి సెలవుల విషయంలో వచ్చిన సాంకేతిక ఇబ్బందులు, సర్వీసు రెగ్యులర్ అయినా వారి జీతాల కోతల నష్టాలు వారిపై తీవ్రంగా పడుతున్నాయి. 6నెలల ప్రసూతి సెలవుల పొడిగింపు తరువాత సర్వీసు క్రమబద్దీకరణ జరిగినందుకు ఆనందపడాలో.. చివరి నెలలో మిగిలిపోయిన రోజులకు జీతాలు కోత పడినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొందీ ఆ సచివాలయ ఉద్యోగులకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెల1 నుంచి క్రమబద్దీకరించిన జీతాలు రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు ఇస్తున్నామని ప్రకటించింది గానీ, ప్రసూతి సెలవులు తీసుకున్నవారి విషయంలో ఏ విధమైన నిబంధనలు పాటించాలో మాత్రం తెలియజేయలేదు. దీనితో పాత పద్దతిలోనే సెలవుల గడువు ముగియకపోవడంతో( పదిరోజుల తేడాతో) ప్రసూతి సెలవులు తీసుకున్న సచివాలయ మహిళా ఉద్యోగులందరికీ  రూ.15వేలే జీతాలు వచ్చాయి.. మిగిలిపోయి పోయిన రోజుల బకాయి జీతాలు మాత్రం ఇప్పటికీ గాల్లో ఉండిపోయాయి. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు..రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని వుంది.



రాష్ట్ర అధికారుల తప్పిదమే ప్రధాన కారణం
గ్రామ, వార్డు సచివాలయ శాఖలో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులందరికీ ఉద్యోగాలను క్రమబద్దీకరించే సమయంలో, ఎవరైనా మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తీసుకున్న సమయంలో ఎన్ని రోజుల్లో వారికి అదనంగా ఆరునెలలు పూర్తవుతుందనే విషయాన్ని తెలుసుకొని జీతాల బిల్లు పెట్టాలనే విషయాన్ని సూచించలేదు. దీనితో పాత పద్దతిలోనే సచివాలయ ఉద్యోగులు జీతాల బిల్లులు పెట్టడంతో పాత జీతం రూ.15వేలు మాత్రమే అందుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకు జ్యోతి(పేరు మార్చాం) అనే సచివాలయ ఉద్యోగి ప్రసూతి సెలవులు తీసుకున్న సమయంలో ఆమె సెలవులు  జూలై 18కి ఆరునెలలు పూర్తయ్యాయి. కానీ సదరు ఉద్యోగికి జిల్లాశాఖ నుంచి సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేయలేదు. దీనితో ఆమెకు యధావిధిగా పాత పద్దతిలోనే జీతాల బిల్లు పెట్టేశారు. అలా ఆమెకు ఆ నెలలో అంటే ఆగస్టు నెల జీతం రూ.15వేలు మాత్రమే వచ్చింది. కానీ సచివాలయ ఉద్యోగులు జీతాల బిల్లులు పెట్టే సమయంలో 12 రోజు తగ్గించి జీతాల బిల్లులు పెడితే..పెరిగిన జీతం, మరుసటి నెలలో పెట్టాల్సిన జీతంతో కలిపి సాలరీ బిల్లు పెట్టడానికి ఆస్కారం ఉండేది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఎవరూ ఆ విధంగా బిల్లులు పెట్టలేదు. కానీ మరుసటి నెల మాత్రం సర్వీస్ డిక్లరేషన్ సాలరీ బిల్ పెట్టడంతో పూర్తి జీతం వచ్చి ముందు నెల మిగిలిపోయిన 12 రోజులకు జీతం మాత్రం గాల్లోనే ఉండిపోయింది.

అధికారుల అవగాహనా రాహిత్యం..
ఒక నెలలో ఉద్యోగులకు సర్వీస్ రెగ్యులైజేషన్ పూర్తవుతున్న సమయంలో ఏ రోజుకైతే సర్వీసు పూర్తవుతుందో ఆ తేదీనాటికి సర్వీసు రెగ్యులైజేషన్ ఫైలు సదరు గ్రామ, వార్డు సచివాలయానికి రావాలి. కానీ ఆవిధంగా జిల్లా అధికారులు ఆయా ప్రభుత్వశాఖల నుంచి పంపలేదు. దీనితో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడి సచివాలయాల్లో కూడా ఉద్యోగులు వారికి పూర్తిస్తాయిలో సాలరీ బిల్లులు తగ్గించిగానీ, పూర్తిస్థాయిలో గాని పెట్టలేక..పాత పద్దతిలోనే పెట్టారు. ఈ విధంగా పెట్టడం ద్వారా ఒక నెలలో మిగిలిని పోయిన రోజులకు ఇపుడు సదరు ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులకు సాలరీ బిల్లులు ఏ విధంగా పెట్టాలనే విషయమై అధికారులు, సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంత జీతం తగ్గించి పెట్టాలో తెలియక, మరెంత జీతం పెంచి మరుసటి నెలలో పెట్టాలో బోధపడక చాలా సచివాలయాల్లో సర్వీసు రెగ్యులర్ అయినా చాలా మందికి జీతాల బిల్లులు పెట్టలేదు. దీనితో ప్రసూతి సెలవులుు తీసుకున్న ఉద్యోగులకు పూర్తిస్థాయి జీతాలు రాలేదు. కొన్ని చోట్లు కొత్త జీతాలు వచ్చినా..ముందు నెలలో మిగిలిపోయిన జీతాలను వారంతా కోల్పోవాల్సి వచ్చింది. కొత్త జీతం వచ్చిందనే ఆనందంలో ఆ పదిరోజుల జీతం వదిలేద్దామనుకుంటే సర్వీస్ క్రమబద్దీకరణ జరిగిన సమయంలో పూర్తిస్థాయిలో జీతం తీసుకోనందుకు కారణం ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియాల్సి వుంటుంది. అలా తెలియజేస్తే సచివాయాల్లో సిబ్బంది చేసిన తప్పుని ఒప్పుకోవాలి..అలా చేయని సిబ్బంది ఏటూ తేల్చుకోలేక తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందితో ఎటూ పాలుపోని స్థితిలో ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు.


చేతులెత్తేసిన ఖజానా శాఖ..
ఎలాంటి ముందస్తు సమాచారం గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సూచించకపోవడంతో  పాత పద్దతిలోనే సాలరీ బిల్ పెట్టడం ద్వారా మహిళా ఉద్యోగులు ముందు నెలలో మిగిలిపోయిన జీతం కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ట్రజరీ అధికారుల ద్రుష్టికి తీసుకెళితే అంతా అయిపోయిన తరువాత తామేంచేస్తామని వారు కూడా చేతులెత్తేశారు. ఈ సమస్య ఒకరో, ఇద్దరో పడితే ఏదో అనుకోవచ్చు  జూలై, ఆగస్టు నెలలకి తీసుకున్న ఆరు నెలల సెలవులకి రెండేళ్లు పూర్తిచేసుకున్న మహిళా ఉద్యోగులంతా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వీరికోసం కొందరు సీనియర్ పంచాయతీ కార్యదర్శిలు ప్రస్తుతం ట్రజరీ అధికారులు, సిబ్బందితో సంప్రదింపులు జరిపినా ఫలితం మాత్రం రావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఏదైనా అధికారిక ఉత్తర్వులు వస్తే తప్పా తామేమీ చేయలేమని ట్రజరీ అధికారులు తెగేసి చెబుతున్నారు. జీతాల్లో తీవ్రమైన కోత నష్టంతో ఇబ్బంది పడుతున్న ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రకటన జారీ చేస్తుందా..లేదంటే ట్రజరీ అధికారులు ద్వారా ప్రత్యేక మార్గాన్ని చూపిస్తుందా అనేది నేటికీ తేలలేదు. ఇదే పద్దతి కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా సర్వీసు పూర్తికాకుండా, ప్రసూతి సెలవుల్లోనే ఉండిపోయిన మహిళా ఉద్యోగులు కూడా పెద్ద మొత్తంలో జీతాలు కోల్పోవాల్సి వస్తుంది. చూడాలి జీతాలు నష్టపోయిన గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏవిధమైన పరిష్కారం చూపిస్తుందనేది..!

Guntur

2022-09-02 01:11:03