1 ENS Live Breaking News

సీఎం వైఎస్.జగన్ క్లాస్ తో ఆ 40% మందికీ సీట్లు డౌటే..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లూ గెలవాలి..  మీరేం చేస్తారో నాకు తెలియదు.. ప్రభుత్వ పరంగా ఇచ్చి హామీలన్నీ నెరవేర్చాం.. వచ్చే మన ప్రభుత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం.. ఇక ప్రజలకు చేరువయ్యే బాధ్యత మీదే. ప్రజల్లో ఉన్నవారినే అంతా ఆదరిస్తారు.. గడప గడపకి ప్రభుత్వం  కార్యక్రమం పెట్టింది కూడా అందుకే.. ఈసారి గెలుపు అవకాశం లేనివారికి సీటు ఇచ్చేదిలేదు అంటూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలకు తెగేసి చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్చార్జులు, సమన్వయకర్తలతో సమీక్షించిన జగన్ ఖారాఖండీగా విషయాన్ని కుండ బద్దలు గొట్టారట. జగన్ ఇచ్చిన క్లాసు ఆధారంగా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 40శాతానికి పైగానే అభ్యర్దులకు సీట్లు కోల్పేయే ప్రమాదం ఉన్నట్టుగా సూచాయగా చెప్పటినట్టు తెలిసింది. దీనితో ఎవరికి సీటు వస్తుందో ఎవరికి రాదో అనే అనుమానాలు అపుడే పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అందులోనూ రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలకు కొత్తగా నియమించిన ఇన్చార్జిలు కూడా తమ రిపోర్టులను నిష్పక్షపాతం ఇవ్వలేనట్టు తెలిసింది. మరికొంత మంది సమన్వకర్తలు ఉన్నది ఉన్నట్టుగా రిపోర్టులు నియోజవర్గంలోని పరిస్థితిని సీఎం జగన్ ముందు ఉంచడంతో అధినేత ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు.

ప్రజల్లో పట్టు లేకపోతే సీటు ఇచ్చినా వృధా..
గత ఎన్నికల్లో సమయంలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చినహామీలన్నీ అమలు చేశాం. అయినా కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరకాలేకపోవడం దారుణం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా వుందో ఎప్పటికప్పుడు సమాచారం మొత్తం అంతా నాకు అందుతుందని నియోజకవర్గ ఇన్చార్జిలకు చెప్పారట జగన్. ప్రస్తుత  నియోజవకర్గాల్లో కో-ఆర్డినేటర్ల పరిస్థితి బాలేకపోవడంతోనే కొత్తవారిని నియమించాం. అయినా మార్పురాలేదని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా  చెబుతున్నారు. ఇలా అయితే ప్రజల్లో పట్టు కోల్పోతే సీటు ఇచ్చినా వృధా అయిపోతుంది. తీరుమార్చుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ప్రజల్లోనే ఉండాలి. వచ్చే  ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం చెప్పినట్టుగా 175కి 175 రావాల్సిందేనని దానికోసం మీరు ఏం చేస్తారో..ప్రజలను ఏ విధంగా మచ్చిక  చేసుకుంటారో తెలియదని తేల్చిచెప్పారట. అన్ని విషయాల్లోనూ  ప్రజలకు చేరువగా ఉంటేనే నెగిటివ్ ప్రచారాలకు ఆస్కారం వుండదని.. అదే సమయంలో ప్రభుత్వంపై వచ్చే అసత్య ప్రచారాలను తప్పికొట్టాలని కాస్త గట్టిగానే చెప్పినట్టు సమాచారం.

సీట్లన్నీ తెచ్చేపూచీ మాది భరోసా ఇచ్చిన ఇన్చార్జిలు
రాష్ట్రంలోని 175కి 175 స్థానాలు గెలిపించి తీసుకు వచ్చే బాధ్యత తమదని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు సీఎం వైఎస్. జగన్మోహనరెడ్డికి భరోసా ఇచ్చారట. తమపై పెట్టిన నమ్మకాన్ని సీట్లు గెలిపించి బహుమతిగా తీసుకు వస్తామని నియోజకర్గాలకు ఇన్చార్జిలుగా నియమింప బడ్డవారంతా ముక్త కంఠంతో చెప్పినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. అక్కడ ఏమేం కావాలో, ఎలాంటి అభివ్రుద్ధి పనులు చేయాలో, ఏ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఉంది.. ఎవరి నుంచి మంచి ప్రోత్సాహం వుంది తదితర అంశాలన్నింటిపైనా దృష్టిపెట్టి నియోజకవర్గాలన్నింటిని మనవైపు తిప్పుకోవాలని జగన్  ఇన్చార్జిలకు సూచించారట. నియోజకవర్గాల్లో అన్నివర్గాల ప్రజలతో సమావేశాలు ఏర్పాటుచేసి అక్కడ సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు చొరవ చూపాలని, ముఖ్యంగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు స్వీకరించి పరిష్కరిస్తే ప్రజల్లో మనపై నమ్మకం పెరుగుతుందని సీఎం ఇన్చార్జిలకు క్లాస్ ఇచ్చినట్టు చెబుతున్నారు. కాగా కొత్తగా ఇన్చార్జిలు నియమించిన వారిలో కొన్ని నియోజకవర్గాల్లో వారు వాస్తవ పరిస్థితిని నివేదికల రూపంలో ఇవ్వడం పట్ల జగన్ సంతృప్తి వ్యక్తం చేశారట.

ఎమ్మెల్యేలతో సమావేశం నాటికి పక్కా రిపోర్టులు అందాలి
త్వరలో ఎమ్మెల్యేలతో మరోసారి సమీక్ష నిర్వహిస్తాం ఆ నాటికి 175 నియోజకవర్గాల్లోని వాస్తవ పరిస్థితిని నా ముందుంచాలి అపుడు ఎవరెవరకి సీటు వచ్చేది.. ఎవరికి సీటు నిరాకరించేంది తేల్చి చెప్పేస్తా అని సీఎం తెగేసి చెప్పారట. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాం. ఇంటి ముంగిటే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాం. అయినా కొంతమంది ఎమ్మెల్యేల్లో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందంటే వారు ప్రజల్లో లేరని..వారికి ప్రజాభిమానం లేదని అర్ధమవుతుంది. అలాంటి వారి వలన పార్టీకి ప్రభుత్వానికి నష్టం రాకూడదు. ఈ విషయంలో ఇన్చార్జిలు చాలా ఖచ్చితత్వంగా వ్యవహరించాలని ఇన్చార్జిలతో ప్రత్యేకంగా మాట్లాడిన క్రమంలో జగన్ సూచించారట. సిట్టింగ్ ఎమ్మెల్యే విషయంలో అక్కడి ప్రజల నుంచి వస్తున్న స్పందన అక్కడ ప్రజల నుంచి ఎలాంటి మద్దతు ఉందనే విషయం తెలిస్తేనే మనం దైర్యంగా ముందుకి వెళ్లడానికి ఆస్కారం వుంటుందని..ఆ విషయాలను కనుక్కోవడానికే మిమ్మల్ని అక్కడ నియమించామనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోవద్దని చెప్పారట. మీతోపాటు ఎమ్మెల్యేలకు సమావేశం నిర్వహిస్తాం. అప్పటికి అంతా ప్రజాభిమానంతో, వారి పట్ల నూశాతం నమ్మకంతో రావాలి..లేదంటే నా పనినేను చేస్తానని చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా ఇన్చార్జిలతో ఏర్పాటు  చేసిన సమావేశంలో ఒక బలమైన సందేశాన్ని సీఎం జగన్ పంపినట్టు చెబుతున్నారు. దీనిని బట్టి ఈరోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే తీరులో మార్పు కనిపించే అవకాశం వుంది.. చూడాలి రాజకీయ ముఖ చిత్రం ఆ 40% మందిలో ఎలాంటి మార్పు తీసుకు వస్తుందనేది..!

Tadepalli

2022-12-09 02:44:27

ఎన్నికల విధులన్నీ ఇక సచివాలయ ఉద్యోగులతోనే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించిన తరువాత..వాటిని గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే సచివాలయాల్లో బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) విధులను అప్పగించి ఓట్ల నమోదు, మృతిచెందిన వారి ఓట్ల తొలగింపు తదితర అంశాల పనులకు వినియోగిస్తోంది. ఈ ప్రక్రియలో బిఎల్వోలంతా ఇపుడు సచివాలయపరిధిలోని అన్ని ఇళ్లను గుర్తిస్తున్నారు. ఈ విధంగా పనిచేయించడం ద్వారా వచ్చే 2023లో జనాభా గణన కూడా వీరితోనే చేయించడానికి అవకాశం వుంటుంది. వీరికి గ్రామ, వార్డు వాలంటీర్లు తోడు ఉండటంతో ప్రభుత్వం పని చాలా సులువు కావడానికి ఆస్కారం వుంటుంది. అందులోనూ ఏ ప్రభుత్వ శాఖలోనూ లేనివిధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే 80 శాతానికి పైగా ఉద్యోగులంతా డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చదివిన వారు, బిటెక్ చేసిన వారు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు లక్షా 27వేల మందికి  పైగా సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నారు.

 వీరికి ఎన్నికల విధులను అప్పగించడం ద్వారా ఈవీఎంలు, వాటి నిర్వహణ పై ఉపాధ్యాయుల కంటే వేగంగా వీరికి శిక్షణ ఇవ్వడానికి బాగుంటుంది. పైగా టెక్నాలజీని బాగా వినియోగించడంలో సచివాలయ ఉద్యోగులు ముందుండటంతో ప్రభుత్వం పని మరింత సులువైపోనుంది. విధుల్లోకి చేరిన దగ్గర నుంచి అంటే సుమారుగా మూడేళ్లుగా సచివాలయ సిబ్బంది బిఎల్వో విధులను నిర్వహిస్తున్నారు కనుక వీరికి ఎన్నికల ప్రక్రియపై మరీ కష్టంగా శిక్షణ ఇచ్చే పనిలేదు. బహుసా ఇదే కారణంతోనే ప్రభుత్వం ఎన్నికల విధులు, జనాభా గణన నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించిందని చెబుతున్నారు. పైగా ఏ ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలతో అంత దగ్గరగా ఉండరు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే ప్రజలతో అన్ని పనులకు దగ్గరగా ఉండటంతో ఎన్నికల విధులను వీరికి అప్పగించడం ద్వారా పని సులవవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

ఇప్పటికే మండల తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలు, ఇలా మొత్తం రెవిన్యూ యంత్రాంగంతో కలిసే సచివాలయ ఉద్యోగులు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం సాధారణ విధులకంటే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి బిఎల్వో విధులే అధికంగా ఉన్నాయి. త్వరలో ఎన్నికలు జరగాల్సి రావడంతో, కొత్త ఓటర్ల నమోదు, లేని వారి తొలగింపు తదితర కార్యక్రమాలన్నీ త్వరతిగతిన చేపడితే గత ఎన్నికల ఓటర్లతో పోల్చుకుంటే ఓట్లు పెరిగి పెరిగే అవకాశం వుంటుంది. ఏది ఎలా చూసుకున్నా ప్రభుత్వానికి ఉపయుక్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు  
మారబోతున్నారు. మొన్నటి వరకూ ఎన్నికల విధల నుంచి ఉపాధ్యాయులను తప్పిస్తే ఆ బాధ్యత ఏ ప్రభుత్వ శాఖల సిబ్బందికి అప్పగిస్తారనే ఆలోచన అందరికీ ఉండేది. అయితే ప్రస్తుతం బిఎల్వో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకే అప్పగించడం ద్వారా గ్రామస్థాయిలో పని సులువుగా అయిపోతుందని ప్రభుత్వం భావించి ఆవిధంగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఒక ప్రత్యేక నెట్వర్క్ గా మారారడనడంలో ఎలాంటి సందేహం లేదనే విషయం ఇక్కడ మరోసారి తేటతెల్లం అవుతుంది.!

Tadepalli

2022-12-08 02:36:08

ఒంటిమిట్ట వద్ద జాంబవంతుని విగ్రహం ఏర్పాటు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం కల్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో జాంబవంతుని విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని  టీటీడీ  జేఈవో వీరబ్రహ్మం చెప్పారు. బుధవారం ఆయన అధికారులతో కలసి ఒంటిమిట్టలో టీటీడీ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జనవరి 1వ తేదీ , వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్ల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ రోజుల్లో దర్శనం సమయం కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట లోని కల్యాణ వేదిక వద్ద అవసరమైన నిర్మాణాలు చేపట్టి భక్తులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 
 అంతకుముందు ఆయన రాజంపేటలో శ్రీ అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు . ఇక్కడ శ్రీ వేంకటేశ్వర  స్వామివారి ఆలయ నిర్మాణం పనుల గురించి అధికారులతో  చర్చించారు. జనవరి చివరినాటికి ఆలయ నిర్మాణం పనులు  పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. 

అలాగే  ఇక్కడ జరుగుతున్న వేదిక నిర్మాణం ఇతర అభివృద్ధి  పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జేఈఓ  వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. అన్నమయ్య విగ్రహం పరిసరాల్లో పచ్చదనాన్ని  పెంపొందించేందుకు, ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం జేఈవో  వీరబ్రహ్మం దేవుని కడప  లక్షీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.  జనవరి 1వ  తేదీ, వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల దర్శనం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఇక్కడ నిర్మించిన వసతి సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చే విషయంపై అధికారులతో చర్చించారు. 
టీటీడీ చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో  నటేష్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ontimitta

2022-12-07 13:39:17

వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోంది: స్పీకర్

రాష్ట్రంలో పేదరికంలో ఉండకూడదని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రమాణాలు కలిగిన జీవన విధానం కల్పించాలని, అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. రాష్ట్రంలో ‘గడప గడపకు మన ప్రభు త్వం’  కార్యక్ర మానికి మంచి స్పందన వస్తుందని తెలిపారు. విజయవాడ కొత్త ఆర్టీసీ కాలనీలోని స్పీకర్ క్యాంపు కార్యాల యంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... శతాబ్ధాల కాలం నుంచి బీసీలు వివక్షతకు గురయ్యారని, ముఖ్యమంత్రి 
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు ప్రాధ్యానత ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కులాలకు సమ న్యాయం చేస్తూ.. రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేస్తూ అందరికీ సామాజిక న్యాయం చేసిందన్నారు. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదని.. బ్యాక్ బోన్ క్లాసెస్ అని నిరూపించిన ప్రభుత్వం అని కొనియాడారు. బీసీలు అంటే భారతదేశ నాగరికత, సంస్కృతికి ప్రతీక అన్నారు.

 వృత్తి నైపుణ్యంతో  భారతదేశాన్ని ముందుకు నడిపింది బీసీలేనని తెలిపారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో బీసీలకు ఖర్చుచేసింది కేవలం 964 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలో 90 వేల 415 కోట్ల రూపాయలను బీసీల సంక్షేమం కోసం వెచ్చించిందని వివరించారు. బీసీల అభ్యున్నతి కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్  చైర్మన్లు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, సహకార రంగంలో చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, డైరెక్టలు ఇలా అన్ని రకాల పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ కే దక్కుతుందని స్పీకర్ తమ్మినేని తెలిపారు.  

Vijayawada

2022-12-06 16:43:17

2024లో YSRCP ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కేదెవరకో..!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి కేవలం 16నెలలు మాత్రమే సమయం ఉంది. ఈలోగా 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం ఆశపడుతున్నవారు..ఆందోళన పడుతున్నవారు అధిమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాలను ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. దానికి అనుగుణంగా సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. అదికూడా పార్టీకోసం ఎవరు ఏవిధంగా పనిచేశారు.. ఎంతమేర కష్టపడ్డారు..వారికి నియోజవర్గంలో ఫాలోయింగ్ ఎలావుంది..ప్రలజకు, యువతకు ఎమ్మెల్యే అభ్యర్ధి ఏస్థాయిలో దగ్గరగా ఉన్నారు..గెలుపుశాతం ఎంతవుంది.. ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఏం చెబుతున్నాయి.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని మరీ దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీ అధినేత చేస్తున్న సూచనలు నేతల్లో కొండంత బలాన్ని పెంచుతున్నా.. కాస్త తేడాగా ఉండి, ప్రజల్లో పేరు 
పోగొట్టుకొని, క్యాడర్ దగ్గర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం అపుడే గుండెల్లో దడ మొదలైంది.

గెలిచే అభ్యర్ధులకే టిక్కెట్ అదిమాత్రం పక్కా..
వైఎస్సార్సీపీలో ప్రభుత్వంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా వున్నవారికి సైతం సీఎం వైఎస్ జగన్ చేతిలో వున్న నివేధికల ఆధారంగా కేలం గెలిచే అభ్యర్ధులను, వారి నియోజకవర్గాలను మాత్రమే ముందుగా తాడేపల్లి పిలుపించుకొని సమీక్షలు చేస్తున్నారు. దానితో ప్రస్తుతం వున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరికి సీటు వస్తుందో అపుడే చాలా మందికి క్లారిటి వచ్చేసింది. అలా క్లారిటీ రావడం కోసం అలాంటి నియోజవర్గాలను ఆఖరున సమీక్షించాలని..అక్కడ మరో నేత ఎవరిని పెడితే ఆ స్థానం కైవసం చేసుకోవచ్చో తెలుసుకునేందుకు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిల ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారని సమాచారం అందుతుంది. ఈ 
విషయంలో ఎక్కడా రాజీలేకుండా వ్యవహరిస్తే తప్పా 175కి 175 స్థానాలు గెలవడంలో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందనే సంకేతాల నడుమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇచ్చిన ఎన్నికల హామీలు పెద్ద ఎత్తున నెరవేర్చడం, సాధారణ ప్రజానికానికి దగ్గరైన తరుణంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకగా మారాలన్నది సీఎం అభిమతంగా కనిపిస్తుంది.  ప్రభుత్వానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పథకాలు పొందని వారు, పదవులు రానివారు, రెబల్స్ , ఇతర పార్టీలకు జంప్ అవుదామనుకున్నవారు ఉన్నప్పటికీ చాకచక్యంగా వ్యవహరిస్తే గెలుపు మనదేననే సంకేతాలను బలంగా ఇచ్చినట్టు కనిపిస్తుంది.

విశాఖలో ఎమ్మెల్యేటిక్కెట్టుపై బోణీ కొట్టిన కెకె.రాజు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మూడురాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్న సమయంలో.. అది విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసే విశాఖపట్నం జిల్లా నుంచి తొలుత ఉత్తర నియోజకవర్గం సీటును ప్రస్తుతం ఇన్చార్జి కెకె.రాజు కైవసం చేసుకొని బోణి కొట్టారు. ఇంకా విశాఖజిల్లాలో భీమిలి, విశాఖ దక్షిణం, విశాఖ తూర్పు, విశాఖ పడమర అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి వుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇన్చార్జిలకే సీట్లు ఇస్తారని చెబుతున్నా.. నియోజకవర్గాల సమీక్షలు పూర్తయితే తప్పా 
ఎవరికి ఎమ్మెల్యే సీటు వస్తుందో అనేదానిపై క్లారిటీ రాదు. ఈస్థానాలతోపాటు విశాఖ ఎంపీ సీట్లుకి అభ్యర్ధులను ఖరారు చేయాల్సి వుంది. ప్రస్తుతం విశాఖ నుంచి కొందరు సదరు నియోజకవర్గాల నుంచి సీట్లు ఆశిస్తున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో వారికి కేటాయించిన సీట్లను ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, మరికొందరు నేతలకు కేటాయించడంతో ఈసారికి వారికి సీటు కేటాయించే అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతుంది. 

2024 ఎన్నికల్లో విశాఖలో కీలకం కానున్న కార్పోరేటర్లు 
2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఈసారి కార్పోరేటర్లు చాలా కీలకం కానున్నారు. దానికోసం ఇప్పటి నుంచే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నియోజకవర్గాల సమీక్షలో కార్పోరేటర్లు, అక్కడి నేతలను కూడా పిలిచి  ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ప్రతీ ఒక్క కార్పోరేటర్ నుంచి, అక్కడ వివిధ కార్పోరేషన్లలో చైర్మన్ లుగా ఉన్నవారు,డైరెక్టర్లుగా ఉన్నవారు, మహిళా నేతలు ఇలా అందరితోనూ మాట్లాడి అక్కడి తాజా పరిస్తితిని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలోని కేడర్ ని అంతా సద్వినియోగం చేసుకొని ఈసారి ఎలాగైనా 
జీవిఎంసీ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలంటే కార్పోరేటర్లు..స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం ఒక్కటే మార్గమని..దానికోసం ముందు నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే తప్పా స్థానాలు గెలుచుకోవడం కష్టమని భావించి ముందుగానే కార్పోరేటర్లను కీలకంగా మార్చడానికే నియోజవర్గస్థాయి సమావేశంలో వారికి పెద్ద పీట వేశారని చెబుతున్నారు. అదే సమయంలో ఈ 
మూడున్నర సంవత్సరాల్లో కష్టపడి పనిచేసినా..పదవులు దక్కని వారికి వచ్చే ప్రభుత్వంలోగానీ, ఈఏడాదిన్నరలో గానీ పదవులు ఇస్తామనే సంకేతాలు కూడా వదిలినట్టు తెలుస్తుంది.

ఆఖరి వరకూ ఆశావాహులు గాల్లోనే..
2019లో వరకూ పార్టీకోసం కష్టపడి పనిచేసి, సీటు దక్కని నేతలు, రెబల్స్, సీటు కోసం ఆశించేవారి పేర్లు ప్రస్తుతం సీల్డు కవర్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వారిని ఆఖరి నిమిషం వరకూ అలాగే వుంచి. ప్రజల్లో వ్యతిరేకత వున్న ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానంలో వారిని సర్ధుబాటు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నా..ఆఖరివరకూ మాత్రం వారు అలా గాల్లోనే ఉండాలనే సంకేతాలు వెళ్లినట్టు చెబుతున్నారు. ఇప్పటికే 175 నియోజవర్గాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావాహుల జాబితా మొత్తం తన చేతుల్లో పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ కేవలం గెలుపే లక్ష్యంగా గెలుపు గుర్రంపై స్వారీ చేసే బలమైన నాయకులకే తొలుత సీట్లు ఇస్తామని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ తరుణంలో లైంగిక వేధింపులు, సోషల్ మీడియలో తప్పుడు ప్రచారం పొందిన వారు, నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉంటూ వారి కార్యకలాపాలు చేసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, అదే సమయంలో పార్టీనే అంటిపెట్టుకుని ప్రజలకు, కేడర్ కు 
సహాయం చేస్తున్న నాయకుల పేర్లు కూడా పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ చలికాలంలో మొదలైన ఎన్నిక వేడి ఎవరికి మంట పెడుతుంతో, ఎవరిని చల్లబరుస్తుందో..ఎవరికి సీటు కన్ఫర్మ్ చేసి.. మరెవరికి రిక్త హస్తం మిగులుస్తుందో అన్ని నియోజకవర్గాల సమీక్షలు పూర్తయితే తప్పా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. ఆ తరువాత కూడా లాస్ట్ హవర్ లో గోల్డెన్ ఛాన్సు కొట్టే నేతలు ఉన్నారని చెబుతున్నారు కేడర్..!

Tadepalli

2022-11-17 07:44:36

సతీష్ ఎలాఉన్నారు సీఎం ఆప్యాయ పలకరింపు

విశాఖ జివిఎంపీ డిప్యూటీ మేయ్ కటమూరి సతీష్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా పలకించారు. ఏం సతీష్ ఎలా ఉన్నారు. కష్టపడి పనిచేసి ఉత్తర నియోజకవర్గంలోని కెకె.రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించి తీసుకురావాలి..ఆ విషయంలో మీరు కీలకంగా వ్యవహరించాలంటూ వెన్నతట్టారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన విశాఖ ఉత్తర నియోజకవర్గం సమీక్ష సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె.రాజుతో కలిసి జీవిఎంసి డిప్యూటిమేయర్  కటుమూరి సతీష్ పాల్గొన్నారు. 

Tadepalli

2022-11-16 14:31:14

పీహెచ్సీల్లోనూ ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ యాప్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)ల్లో ని సిబ్బంది హాజరు కోసం ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ని అమలులోకి తీసుకు వచ్చింది. ఈ యాప్ ద్వారానే ప్రస్తుతం ఉద్యోగులంతా అటెండెన్సు వేస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఎవరు ఎక్కడి నుంచి అటెండెన్సు వేసిందీ లైవ్ లోకేషన్ తో సహా నమోదవుతోంది. ఒక పీహెచ్సీలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంతమంది ఏ సమయానికి అటెండెన్సు వేశారు.. ఎంత మంది లీవ్ లో ఉన్నారు. ఇంకా ఎంతమంది అటెండెన్సు వేయాల్సి వుంది తదితర వివరాలన్నీ డాక్టర్ డాష్ 
బోర్డులో దర్శనమిస్తున్నాయి. ఈ విధానం ద్వారానే సిబ్బందితోపాటు వైద్యునితో సహా అటెండెన్సు వేస్తున్నారు. ఉదయం పదిగంటలకు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఇన్ మరియు ఔట్ తప్పనిసరిగా అటెండెన్సు వేయాల్సి వుంటుంది. ఈ అటెండెన్సు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంతోపాటు, చివాలయంలోని రాష్ట్ర కార్యాలనికి అనుసంధానించారు. త్వరలోనే ఓపీ సేవలు కూడా ఆన్ 
లైన్ చేస్తారని వైద్యఆరోగ్యశాఖకు చెందిన రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి ప్రత్యేకంగా తెలియజేశారు.

Tadepalli

2022-11-16 12:29:24

ఏపీలో రాష్ట్రప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల గణన..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల గణన మొదలు పెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగవిరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. అలా పెంచిన ఉద్యోగుల మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్నా రు. అపుడు రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఖాళీలు ఏర్పడనున్నాయి. దానికోసం ముందుగా ఏ ప్రభుత్వ శాఖల్లో ఎంతమంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, ఏ కేడర్ లోని ఉద్యోగులు త్వరలో రిటైర్ కాబోతున్నారు అనే సమాచారాన్ని సేకరించే పనిలో పడింది. ఒకేసారి ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేస్తే పరిపాలనలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం వుంది. దీనితో కొత్త ఉద్యోగాల భర్తీ చేపట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమస్యను అధిగమించేందుకు ముందుగానే ఖాళీల వివరాలను, ఉద్యోగుల గణన చేపట్టి ఉంచితే ఎన్నికల ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి బావుంటుందని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది.

వైఎస్సార్ నోటిఫికేషన్ల కంటే ఎక్కువగా ఉంటాయ్
దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించే సమయంలో కూడా ఇలానే ఎన్నికలకు ఏడాది సమయం ఉందనగా రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను లెక్కించి.. సరిగ్గా ఎన్నికల ముందు సుమారు 55వేల ఉద్యోగాలకు పైగానోటిఫికేషన్ జారీ చేశారు. కాకపోతే ఇపుడు ఆ సంఖ్య రెండితలు అయ్యే అవకాశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అతిపెద్ద రెగ్యుల్ జాబ్స్ నోటిఫికేషన్ ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖది తప్పితే మరే ఇతర శాఖలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం కాంట్రాక్టు పద్దతిలో పారామెడికల్ సిబ్బంది, వైద్యుల పోస్టులను భర్తీచేశారు. మిగిలిన శాఖల్లో ఒకటి అరా పోస్టులు తప్పితే ఒకే సారి వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీని చేపట్టలేదు. అయితే ప్రభుత్వం పెంచిన రెండేళ్ల అదనపు ఉద్యోగ విరమణ వయస్సు ఉద్యోగులకు వచ్చే ఏడాదితో పూర్తవుతున్న తరుణంలో ముందుగానే ఉద్యోగాల నోటిఫికేషన్లకు సిద్ధం కాకపోతే చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదం వుంది.

నిరుద్యోగులకు అసలైన ఉద్యోగాల పండుగ
ఆంధ్రప్రదేశ్ లో అసలైన ఉద్యోగాల పండుగ 2019లో ఒకసారి గ్రామ, వార్డు సచివాలయశాఖ నోటిఫికేషన్ ద్వారా వస్తే.. 2024లో మరోసారి అదే స్థాయిలో వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ విరమణలు చేసే ఖాళీలతోపాటు, అప్పటికే గుర్తించిన ఖాళీలు ప్రభుత్వం గుర్తించాల్సి వుంటుంది. ఈ రెండు దఫాల ఖాళీలను బేరీజు వేసుకొని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తీసే అవకాశాలు 2024 ఎన్నికల ముందు రానున్నాయి. అందులోనూ రాష్ట్రంలోని 13 జిల్లాలను కాస్తా 26 జిల్లాలు చేసిన నేపథ్యంలో కొత్త జిల్లాల్లో చాలా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టాల్సి వుంది. ఇప్పటికే వాటికోసం గ్రూప్-1 ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు ప్రస్తుతం నోటీఫికేషన్లు వేసినప్పటికీ అప్పికి ఖచ్చితంగా మరోసారి నోటిఫికేషన్లు వేసి తీరాల్సిందే. ఇప్పటికే ప్రభుత్వశాఖల్లో అధికారులు, మినిస్ట్రీరియల్ సిబ్బంది తక్కువగా ఉండటంతో అధికారిక పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. అలాంటి ఇబ్బందులు 2024 తరువాత రాకుండా ఉండాలంటే భారీ సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్లు తీయాల్సిన అవసరం వుంది.

రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ధిక భారం..
ఇప్పటికే ఆర్ధికలోటుతో కొట్టిమిట్టాడుతున్న రాష్ట్రప్రభుత్వానికి 2024లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ తోపాటు, ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలను కూడా ఇవ్వాల్సి వుంది. అలా చేయాలంటే ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుంది. దానికోసం ఇప్పటి నుంచే ఆదాయవనరులను పెంపొందించుకోవాల్సిన అవసరం వుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నది. ఆర్ధిక లోటును ఆదాయాలు వచ్చే ప్రభుత్వశాఖల ద్వారా సమకూర్చుకోవడం ద్వారా భర్తీచేసుకోవాలని యోచిస్తూ .. దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా చేపట్టింది. చూడాలి వచ్చే రెండేళ్లలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకోసం ఏవిధమైన వ్యూహాన్ని అవలంభించనున్నదో..!



Tadepalli

2022-11-16 03:00:20

రూ. కోట్లలో కోల్పోతున్న సచివాలయాల ఆదాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశం మొత్తం తొంగి చూసేవిధంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని కోల్పోతున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సచివాలయాల ద్వారా ప్రభుత్వం అన్ని రకాల సేవలను అందించడం ప్రారంభిస్తే సిబ్బంది నెలవారీ జీతాలు పోను ఇంకా ప్రభుత్వానికే అధిక ఆదాయం సమకూరుతుంది. ఆ విషయం ప్రభుత్వానికి తెలిసినా ఎందుకనో ముందడుగు వేయలేక పోతున్నది. పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే గ్రామ, వార్డు సచివాలయాలు ఏపీ ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరుగా మారిపోతాయనడంలో ఎలాంటి సందేహమూలేదు. అంతేకాదు ఇంటిముంగిటే ప్రజలకు అన్ని సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుంది. ప్రభుత్వం ప్రస్తుతం 570 రకాల సేవలను కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. పేరుకేవాటిని తీసుకు వచ్చింది తప్పితే అన్నిసేవలు పూర్తిస్థాయిలో సచివాలయాల ద్వారా ప్రజలకు చేరడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాలు, 1.20 లక్షల మంది ఉద్యోగులు ఉన్నా వీరిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదు.

భారమంతా డిజిటల్ అసిస్టెంట్ల పైనే..
గ్రామ,వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన కామన్ సర్వీస్ సెంటర్ సేవల భారంత మొత్తం డిజిటల్ అసిస్టెంట్లపైనే పడిపోతుంది. ఈ ఒక్క ఉద్యోగి దగ్గర నుంచే అన్నీసేవలు అందాల్సివుంటోంది. మిగిలిన సిబ్బందికి కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం, ఆయా ప్రభుత్వశాఖల సేవలను వారి ద్వారా చేసే అవకాశం లేకపోవడం కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. ఇటీవల కాలంలో ఆధార్ అనుసంధాన కార్యక్రమం కూడా సచివాలయాల్లో చేస్తుండటంతో సాధారణ పనులకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. సచివాలయాల్లో పలు దృవీకరణ పత్రాలు జారీ ఆలస్యం కావడంతో ఇవే సేవలను అత్యధిక మొత్తం చెల్లించి మీ-సేవా కేంద్రాల్లో తీసుకోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం అందిస్తామని ప్రకటించి 570 సేవల్లో కొద్ది రకాల సేవలు మాత్రమే ప్రస్తుతం గ్రామ,వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. చాలా వరకూ సేవలు ఇంకా ప్రభుత్వం పూర్తిస్థాయిలో జారీచేసే అవకాశం ఇవ్వలేదు.

సచివాలయాల్లో చాలీ చాలని కంప్యూటర్లు
గ్రామ, వార్డు సచివాయాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది వున్నా పూర్తిస్థాయిలో పనులు చేయడానికి, ప్రభుత్వ సేవల ద్వారా పలు రకాల దృవీకరణ పత్రాలు జారీచేయాలన్నా కంప్యూటర్ల సమస్య తీవ్రంగా తలెత్తున్నది. ఒక్కో సచివాలయానికి కేవలం రెండు మాత్రమే కంప్యూటర్లు ఉండటంతో ఒకటి పూర్తిగా డిజిటల్ అసిస్టెంట్ స్వాధీనంలో ఉండగా మరో కంప్యూర్ ను మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది వినియోగించాల్సి వస్తున్నది. అలా కాకుండా అన్ని ప్రభుత్వశాఖల సిబ్బందికి ప్రభుత్వం కంప్యూటర్లు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ప్రకటించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారానే అందించడానికి వీలు కలుగుతుంది. ఏ పనిచేయాలన్నా డిజిటల్ అసిస్టెంటు మాత్రమే చేయాల్సి వస్తున్నది. మిగిలిన ప్రభుత్వశాఖల సిబ్బంది సైతం ఆన్ లైన్ కార్యక్రమాలు, పనులు చేయాలంటే వేచి ఉండే పరిస్థితి నెలకొంది. అదే సమయంలో సచివాలయాలకు వచ్చే ఇంటర్నెట్ కూడా స్పీడ్ గా లేకపోవడం వలన కూడా ఇక్కడ పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. కొంతమంది సిబ్బంది సొంత ల్యాప్ టాప్ లు వినియోగిస్తున్నా వారి పనులు మాత్రమే చేసుకుంటున్నారు.

సిబ్బందిని మొత్తం వినియోగిస్తే గళ్లాపెట్టి గల గల
గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 19 ప్రభుత్వశాఖల సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వారందరినీ రాష్ట్రవ్యాప్తంగా ఏక కాలంలో వినియోగిస్తే ప్రభుత్వానికి అపారంగా ఆదాయం పెరుగుతుంది. కానీ ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఆన్ లైన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా నేటికీ.. కాగితపు దృవీకరణలతోనే పనులు జరుగుతున్నాయి. ఆవిధంగా చూసుకున్నా సచివాలయాల ద్వారా జారీ చేసే దృవీకరణల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం నిత్యం వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వం సచివాలయాల ద్వారా సేవలను  పెంచుతుంది తప్పితే వాటిని ఆయా ప్రభుత్వశాఖల సిబ్బంది ద్వారా చేయించే ఏర్పాటు మాత్రం చేయడం లేదు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటై 1.20లక్షల మంది సిబ్బంది అందుబాటులోకి వచ్చినా నేటికీ ప్రజలు అత్యవసర పనుల కోసం మీ-సేవా కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

శాఖలవారీగా భర్తీచేసిన ఉద్యోగాలతో ఉపయోగమేంటి..?
ఏపీ ప్రభుత్వం శాఖల వారీగా సచివాలయాల్లో ఉద్యోగులను నియమించింది. కానీ వారితో పూర్తిస్థాయిలో సేవలను మాత్రం ప్రజలకు  చేరవేసే విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. సచివాలయాలు ఏర్పాటై మూడేళ్లు దాటుతున్నా ఇంకా సచివాలయాల్లో ఏఏ రకాల సేవలు పొందవచ్చునో ప్రజలకు అవగాహన లేదంటే అతిశయోక్తికాదేమో. గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలంటే ఎన్నిప్రభుత్వశాఖల ఉద్యోగులను సచివాలయాల్లో ఏర్పాటు చేసిందో..వారందరితోనూ సేవలు, దృవీకరణ పత్రాలు, ఇతరత్రా అంశాలకు చెందిన కార్యకాలపాలు చేపడితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టు అవుతుంది. సచివాలయంలోని అన్నిశాఖల సిబ్బంది కలిపి కంప్యూటర్లు ఏర్పాటు చేయడంతోపాటు, హైస్పీడ్ ఇంటర్నెట్, అధునాతన ప్రింటర్లను అందుబాటులోకి తీసుకువస్తే..ఏకకాలంలో రాష్ట్రవ్యప్తంగా సిబ్బంది మొత్తం కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా చేసే పనులతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఒక రేంజి లో ఉంటుంది. ప్రస్తుతం ఇవే సేవలు ప్రజలంతా మీ-సేవా కేంద్రాల నుంచి పొందుతున్నారు. అదే ఉన్న అన్నిశాఖల సిబ్బందిని వినియోగించుకుంటే ప్రజలకు సేవతోపాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఆర్ధిక లోటు కూడా తగ్గే అవకాశాలున్నాయి.. చూడాలి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది..!


Tadepalli

2022-11-15 04:49:03

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ఆప్కాస్ చొరవ ప్రశంసనీయం

వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇపిఎఫ్, ఇఎస్ ఐ సమస్యల పరిష్కారం కోసం అప్కాస్(ఎపి కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్  సర్వీసెస్) చూపుతున్న చొరవ ప్రశంసనీయమని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ అన్నారు.  ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇఎస్ఐ కార్డులను ఆయన అందజేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నాడు ఏపిఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో అప్ కాస్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నివాస్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇపిఎఫ్, ఇఎస్ఐ వంటి సౌకర్యాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఆప్కాన్ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన ఇపిఎఫ్, ఇఎస్ఐ మరియు వారి సాంకేతిక పరమైన సమస్యలను ఆప్కాస్ సిబ్బంది అక్కడికక్కడే పరిష్కరించారు.  కార్డుల ప్రాముఖ్యతను అప్కాస్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) బి. నాగ ప్రసాద్ ఉద్యోగులకు వివరించారు. కుటుంబంలోని కొత్త సభ్యులను చేర్చుకోవటంతోపాటు సభ్యుల వివరాలను అప్డేట్ చేయటం వంటి సమస్యలను కూడా పరిష్కరించామని ఈ సందర్భంగా కమీషనర్ నివాస్ గారికి జిఎం వివరించారు.  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను అన్లైన్లో పరిశీలించి, కొంతమంది వివరాలను అప్డేట్ చేయటంతో పాటు మరికొంతమందికి జాయింట్ డిక్లరేషన్ ఫారంలను కూడా అందజేశామన్నారు. ఈ సందర్భంగా అప్ కాస్ సిబ్బందికి నివాస్ గారు అభినందించారు. 

Tadepalli

2022-11-14 14:18:36

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కాస్త ఆలస్యం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 6500 పోలీసు కానిస్టేబుల్ నియామకాల విషయంలో కాస్త జాప్యం జరిగే అవకాశాలు కనిస్తున్నాయి. దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ జారీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని రకాల అంశాలను ప్రభుత్వం  పరిశీలిస్తుందని ఏపీ డీజిపి కేవి రాజంద్రనాధ్ రెడ్డి ప్రకటించడం దానికి బలం చేకూరింది. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటులో మహిళా పోలీసులను నియమించిన విషయంలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే అలాంటి ఇబ్బందులు త్వరలో తీయబోయే భారీ నోటిఫికేషన్ లో రాకూడదనే ఉద్దేశ్యంలో అన్ని అంశాలను ప్రభుత్వం  పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతుంది.  ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుళ్లు, ఎస్ఐల సంఖ్య పెరగడం, తగ్గడం, కొన్ని కుదించుకుపోవడం, మరికొన్ని పదోన్నతులలో పోవడం ఇలా చాలా వరకూ సాంకేతిక అంశాలను పోలీసుశాఖ పరిశీలస్తున్న విషయం మరోసారి డిజిపీ మాటల్లో తేటతెల్లం అవుతుంది.  అయితే నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కాగా వస్తుందని మాత్రం ఆయన చెప్పారు. తీరా నోటిఫికేషన్ జారీ అయిన తరువాత ఏ ఒక్క అభ్యర్ధి ఇబ్బందులు పడకూదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పోలీసు ఉద్యోగాలకు  సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, దీనిపై ఇప్పటికే డిజిపి కార్యాలయం నుంచి కూడా చాలా సమాచారం ప్రభుత్వం సేకరించిందని చెబుతున్నారు. నవంబరు నెలాఖరుకి తొలుత నోటిఫికేషన్ విడుదల చేసి మొత్తం 5నెలల్లో ప్రక్రియ మొత్తం పూర్తిచేయాలని తొలుత ప్రభుత్వం భావించినట్టుగా చెబుతున్నారు. అయితే తాజా నోటిఫికేషన్ విషయంలో సమస్యలు తలెత్తితే అభ్యర్ధులు ఎక్కడా నష్టపోకుండా 
ఉండేందుకు, వయస్సు విషయంలోనూ కాస్త మార్పులు చేసే అవకాశాలున్నట్టు కూడా సమాచారం అందుతంది. చూడాలి పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి సమస్యలను అధిగమించి ప్రకటన జారీ చేస్తుందనేది..!

Tadepalli

2022-11-14 12:53:20

ఇంకా ఏఓబీలో మావోయిస్టు కార్యకలాపాలు

మావోయిస్టు కార్యకలాపాలు ఎఓబిలో ఉన్నాయని, వారి చర్యలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు ఏపీ డీజిపీ డిజిపీ కెవి.రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో అదికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల నియంత్రణకు ఎప్పటిలాగే పోలీసుశాఖ చర్యలు కొనసాగిస్తుందన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రభుత్వం సహాయ సహకార కార్యక్రమాలు, నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు కల్పిస్టున్నట్టు చెప్పారు. మావోయిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపి పిలుపునిచ్చారు.  కాగా జిల్లాల
పునర్విభజనతో ఏర్పడిన ఇబ్బందులను ఇప్పటికే చాలా వరకు పరిష్కరించామన్నారు. సిబ్బంది, వాహనాలు, మౌళిక వసతుల కల్పన వంటి అంశాల్లో చాలా వరకు సమస్యలు లేకుండా పరిష్కరించామన్నారు. పోలీసు నియామకాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కొన్ని అంశాలను పరిశీలిస్తుందని, త్వరలో దీనిపై ప్రభుత్వం ప్రకటన  చేస్తుందని రాష్ట్ర డిజిపి కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.ఈ మీడియా సమావేశంలో శాంతిభద్రత విభాగం అదనపు డిజి డా. రవిశంకర్ అయ్యన్నార్, విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎస్. హరికృష్ణ, జిల్లా ఎస్పీ ఎం. దీపిక పాటిల్ పాల్గొన్నారు.

Tadepalli

2022-11-14 12:11:04

అవినీతి నిర్మూలనకు 144‌‌‌00 యాప్ వాడాలి..డిజీపి

అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం రూపొందించిన 14400 మొబైల్ యాప్ సేవలను ప్రజలు
సద్వినియోగం చేసుకోవాలని ఏపీ డిజిపీ కెవి.రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో అదికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ కు వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే 58 కేసులు నమోదు చేసామన్నారు.  లోను యాప్ ల మోసాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు  చేపడుతున్నదన్నారు. లోను యాప్ ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, అవగాహన లేకుండా వారు అడిగే వాటన్నింటికి అనుమతులు ఇవ్వొద్దన్నారు. రుణాలు తీసుకొనే క్రమంలో వారు అడిగిన వాటన్నింటికి అనుమతులు ఇవ్వడంతో మన ఫోటోలు, లొకేషను, కాంటాక్ట్ నంబర్లు తదితర డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళి పోతుందన్నారు. ఇలా పొందిన డేటాతో వారు రుణగ్రహీతల ఫోటోలను మార్ఫింగ్ చేసి, బెదిరింపులకు పాల్పడుతూ, అధిక వడ్డీలతో మంజూరు చేసిన రుణాలు వసూలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నా రన్నారు. బ్యాంకు అధికారులు కూడా అనధికార వ్యక్తులు బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలోను అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు చేసే ఖాతాలపై నిఘా పెట్టాలన్నారు. రుణ యాప్ల వేధింపులు కారణంగా ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సకాలంలో ఫిర్యాదు చేస్తే, వారిపై చర్యలు చేపడతామన్నారు.  

Vizianagaram

2022-11-14 12:01:08

16న రాష్ట్ర సమాచార కమీషనర్ల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ నూతన కమీషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈనెల 16న జరగనుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జిపిఎం అండ్ ఎఆర్)ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. 16వతేది బుధవారం మధ్యాహ్నం 3గం.లకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సమాచార కమీషనర్ గా నియమితులైన ఆర్.మహబూబ్ భాషా మరియు రాష్ట్ర సమాచార కమీషనర్ గా నియమితులైన పి.శామ్యూల్ జొనాతన్ లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారని ఆయన తెలియ జేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కు ముఖ్య సమాచార కమీషనర్ గా మహబూబ్ భాషా,సమాచార కమీషనర్ గా శామ్యూల్ జొనాతన్ లను నియమిస్తూ గత నెల 21వతేదీన రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్.ల సంఖ్య 128,129ల ద్వారా  ఆదేశాలు జారీ చేసిందని ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈఇరువురు నూతన కమీషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారని ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.

Tadepalli

2022-11-14 11:47:10

గ్రామ సచివాలయాల్లో వింత పరిస్థితి..ఏ పనీ లేక..!

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయశాఖలో వింత పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వం ఎంతో  ముందుచూపుతో గ్రామస్థాయిలోనే  ప్రజలకు ఇంటిముంగిటే అన్నిరకాల సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామసచివాలయాల్లో గ్రేడ్-5 పంచాయతీ  కార్యదర్శిలకు పనిలేకుండా పోయింది. కేవలం మిగిలిన సిబ్బందిని కో-ఆర్డినేషన్ చేసుకోవడం, అడపా దడపా వారి పరిధిలో పారిశుధ్య  నిర్వహణ తప్పితే మరేపనీ చేయడానికి అవకాశం లేదు. అలాగని వారిని ఖాళీగా ఉన్న పంచాయతీలకు ఇన్చార్జిలుగా నియమిస్తున్నారా అంటే అదీలేదు. గ్రేడ్-4 నుంచి గ్రేడ్-1 కార్యదర్శిలను మాత్రమే ప్రభుత్వం ఇన్చార్జిలుగా నియమిస్తోంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా వున్న సుమారు 6వేలకు పైగా వున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు చేతి నిండా పనిలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం  చేసుకోవచ్చు.  అలాగని వాస్తవ పరిస్థితి మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ అధికారులు కూడా జిల్లా  కలెక్టర్లు, ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లడం లేదు. కేవలం మండల అధికారుల సమావేశాలు, సచివాలయాల పరిధిలోని చెత్త ఎత్తించడం,  అడపా దడపా పన్నులు వసూలు చేసే కార్యక్రమాలు తప్పా వీరికి మరో పనిలేకుండా పోయింది. 

ఆ పంచాయతీల్లో ఇద్దరు కార్యదర్శిలూ ఉత్సవ విగ్రహాలే..
రాష్ట్రంలోని మేజర్ పంచాయతీలుగా ఉన్న చోట ప్రభుత్వం గ్రేడ్1 కార్యదర్శితోపాటు ఇతర రెండు గ్రామ సచివాలయాల్లోనూ గ్రూడ్-5  కార్యదర్శిలను నియమించింది. కానీ వారికి చేతినిండా పనిలేదు. చెక్ పవర్ లేదు, కనీసం సచివాలయాల్లో జారీ చేసే దృవీకరణ పత్రాలపై  సైతం వారి సంతకాలకు విలువ కూడా లేదు. పంచాయతీ కార్యాయంలో ఉన్న సచివాలయ కార్యదర్శితోపాటు వారి పరిధిలోని  పంచాయతీ పనులు చేయడం తప్పా మరేమీ చేయడానికి వీలు లేకుండా పోతుంది. అలాగని బ్లీచింగ్, ఫినాయిల్, వీధిలైట్లు, వీధి  
కుళాయిలు ఇలా ఏ పనులు చేయించాలన్నా మళ్లీ వీరిద్దరూ వెళ్లి పంచాయతీ కార్యాలయంలోని గ్రేడ్-1 కార్యదర్శి వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగని మూడు సచివాలయాలు ఉన్నచోట పరిధిలు విస్తరించినా.. ప్రధాన పంచాయతీ కార్యాలయం ద్వారానే  అన్నిపనులు జరుగుతున్నాయి. దీనితో ఈ ఇద్దరు గ్రేడ్-5 కార్యదర్శిలు ఉత్సవ విగ్రహాల్లానే మిగిలిపోతున్నారు. తమ పరిస్థితిని రాష్ట్ర, జిల్లా  యూనియన్ ల ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లినా నేటికీ ఫలితం శూన్యం. ఈ అవకాశం కాస్త ఆడుతూ, పాడుతూ పనిచేసేవారికి  మాత్రం భలే కలిసి వస్తోంది. నిజంగా ప్రజలకు సేవలచేయాలనుకునే వారికి ప్రతిబంధకంలా మారింది. 

ఇక్కడుండలేం బదిలీలైతే వెళ్లిపోతాం బాబోయ్
గ్రామసచివలయశాఖలో ఎలాంటి అధికారం లేని గ్రేడ్-5 కార్యదర్శిలు తమకు అధికారికంగా ఎలాంటి పనీ లేకపోవడం, తమ సంతకానికి విలువలేకపోవడం, చేసే పనికీ గ్రేడ్-1 కార్యదర్శి చుట్టూ సాధారణ ప్రజలు పనులు మాదిరి ప్రదక్షిణలు చేయాల్సిరావడంతో మేజర్ పంచాయతీల్లో పనిచేసే గ్రేడ్-5 కార్యదర్శిలు ఎంత త్వరగా బదిలీలు జరిగితే అంతే త్వరగా బయటకు వెళ్లిపోవడానికి కార్యాచరణ  సిద్ధం చేసుకుంటున్నారు. అలా కాకపోయినా, తమకు సహకరించే గ్రేడ్-1 కార్యదర్శిలు ఉన్న మేజర్ పంచాయతీలకైనా వెళ్లిపోతామని 
బాహాటంగానే చెబుతున్నారు.  తాము పేరుకి పంచాయతీ కార్యదర్శిలమే అయినా తమకు సచివాలయాల్లో విలువ చాలా తక్కువగా ఉందని, అలాగని తమ సచివాలయ పరిధిలోని ప్రజలకు పనిచేయాలన్నా తాము కూడా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. చెత్త వాహనాలు, చెత్త బండ్లు, పారిశుధ్య కార్మికులు, శానిటేషన్ సామాగ్రి ఇలా అన్నింటికోసం పరుగులు పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. కొన్ని సార్లు తమ సొంత డబ్బులతోనే పనులు చేయిస్తున్నామని..అలా ఖర్చు పెట్టిన డబ్బులకి నేటికీ అతీ గతీ కూడా లేదని బాధపడుతున్నారు. ఎలాంటి అధికారాలు, పనిచేయడానికి పారిశుధ్య సిబ్బంది కూడా లేకుండా తాము ప్రజలకు ఏవిధంగా సేవలు అందించాల్లో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

సచివాలయాల్లో వాస్తవ పరిస్థిని గుర్తించని జిల్లా కలెక్టర్లు
రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ జిల్లాకలెక్టర్లు గ్రామ సచివాలయాల్లోని వాస్తవ పరిస్థితులను గుర్తించడం లేదు. ఎప్పుడు పర్యటనలకు వచ్చినా సచివాలయాలు ఎలా ఉన్నాయి.. అక్కడ సేవలు అందుతున్నాయా లేదా.. పారిశుధ్య నిర్వహణ ఎలా ఉంది అనేవిషయాలను పరిశీలన చేస్తున్నారు తప్పితే మిగిలిన అంశాలను పరిశీలంచడం లేదు. కనీసం గ్రేడ్-5 కార్యదర్శిల సేవలు పంచాయతీలు, గ్రామాల్లో ఏవిధంగా అందుతున్నాయి..? వారికి ప్రభుత్వం ద్వారా ఎలాంటి అధికారాలు సంక్రమించాయి..? వారు చేస్తున్న ప్రధాన విధులేంటి..? గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలకు మాత్రమే ఇతర పంచాయతీల్లో ఇన్చార్జిల బాధ్యతలు ఎందుకు అప్పగిస్తున్నారు..? మేజర్  పంచాయతీల్లోని ప్రధాన పంచాయతీ కార్యలయంలోని సచివాలయంతోపాటు ఇతర రెండు సచివాలయాల్లోని సిబ్బంది, కార్యదర్శిలు  ఏం చేస్తున్నారు..? వారికి ఏవిధంగా పంచాయతీ కార్యాలయం నుంచి సహకారం అందుతుంది..? ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలు ఏవిధంగా విధులు నిర్వహిస్తున్నారు..? ఖాళీగా వున్న చిన్న పంచాయతీలకు వీరిని ఎందుకు పంపడం లేదు..? అసలు సచివాలయ కార్యదర్శిలు ప్రభుత్వం నిర్ధేశించిన రికార్డులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు..? ఎంతమంది పూర్తిస్థాయిలో సచివాలయాల్లోనే ఉండి సేవలు అందిస్తున్నారు? బయో మెట్రిక్ వేసి ఇతర కార్యక్రమాల పేరుతో ఎందరు జంప్ అయిపోతున్నారు..? తదితర అంశాలపై రాష్ట్రంలో 
ఇప్పటి వరకూ ఒక్క జిల్లా కలెక్టర్ సైతం ద్రుష్టి పెట్టలేదు. అలా పెట్టివున్నా, తెలుసుకునే ప్రయత్నం చేసినా..గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు మేజర్ పంచాయతీల్లో వీరికి ఏ స్థాయిలో పనులున్నాయో..అసలు వీరేం చేస్తున్నారో జిల్లా కలెక్టర్లకు ఒక క్లారిటీ వచ్చేది.

 పంచాయతీరాజ్ లో 2024తరువాత భారీగా ఖాళీలు..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలను..ఇప్పటి వరకూ ఇన్చార్జిల పాలనతో ఉన్న పంచాయతీలకు సర్ధుబాటు చేస్తే కనీసం అక్కడ పంచాయతీలన్నీ  పూర్తిస్థాయిలో అభివ్రద్ధి చెందడానికి, ప్రభుత్వ సేవలు  అందడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే 2024 తరువాత గ్రామ, వార్డు సచివాలయశాఖలో భారీగా ఖాళీలు ఏర్పడితే అప్పుడు పరిస్థితి  మరింత జఠిలం అవుతుంది. వాస్తవానికి మేజర్ పంచాయతీల్లో గ్రేడ్-1,2 స్థాయి కార్యదర్శిలు ఉన్నచోట మరో ఇద్దరు గ్రేడ్-5 కార్యదర్శిల అవసరం వుండదు. కానీ ప్రభుత్వం మేజర్ పంచాయతీల్లో మూడు సచివాలయాలు ఏర్పాటు చేయడంతో వీరిని నియమించింది. నాటి నుంచి నేటి వరకూ వీరికి పనిలేకుండానే పోయింది. ఇప్పటికైనా గ్రామ,వార్డు సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శి వీరి అధికారాలు, సేవలు,  విషయంలో ఆలోచిస్తే తప్పా..వీరికి చేతినిండా పనిదొరకదు సరికదా.. కార్యదర్శిలు లేని గ్రామపంచాయతీలు సైతం ఎలాంటి  ప్రభుత్వసేవలకు నోచుకోకుండా పోయే ప్రమాదం వుంది. మరోపక్క గ్రేడ్-1,2 కార్యదర్శిలను ఇతర పంచాయతీలకు  ఇన్చార్జిలగా నియమిస్తుండటంతో వారు రెండుచోట్లా పూర్తిస్థాయిలో పనిచేయడానికి వీలు లేకుండా పోతుంది. ఇదే సమయంలో ఆదాయం వచ్చే  పంచాయతీలకే కొందరు కార్యదర్శిలు పరిమితమైపోతున్నారు.  సచివాలయాలు, అక్కడి సేవల్లో ఎవరికీ అందుబాటులో లేకుండా  పోతున్నారు.

అసలు విషయమిదే..
గ్రామ సచివాలయాల్లో అంతమంది సిబ్బంది వున్న సేవల విషయంలో కలుగుతున్న ఇబ్బందులను తెలుసుకునే క్రమంలో ఈఎన్ఎస్  నేషనల్ న్యూస్ ఏజెన్సీ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ, 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనూ గ్రౌండ్ లెవల్ రియాల్టీని  పరిశీలిన చేసింది. తొలుతగా గ్రామ సచివాలయాల పరిస్థితిని ప్రజలకు, అటు ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక  కధనాన్ని అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇక్కడ జరిగే ప్రతీ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, అధికారిక వెబ్ సైట్ www.enslive.net ద్వారా  బాహ్య ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏ మీడియాని రాయనన్ని కధనాలు కూడా ఒక్క ఈఎన్ఎస్ నెట్వర్క్ ద్వారా అందించిన విషయం కూడా ప్రజలకు, పాఠకులకు, అటు అధికారులకు కూడా తెలుసు.  ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా.. అడుతూ పాడుతూ  పనిచేసేవారు ఓ.. తెగఫీలైపోయి గుక్కెట్టి ఏడ్చేసినా.. వాస్తవం తెలుసుకున్నవారు కనీసం వీళ్లైనా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి  తీసుకెళ్లారని ఆలోచించినా.. అన్నింటినీ ఈఎన్ఎస్ ఒకేలా స్వీకరిస్తుందని మాత్రం  గుర్తుపెట్టుకోవాలి.  సీఎం వైఎస్.జగన్ మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలశాఖ ద్వారా ప్రజలకు  పూర్తిస్థాయిలో సేవలు అందాలనేదే మా యొక్క లక్ష్యం. గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల  ద్వారానే సిద్ధిస్తుందని నమ్మి  ప్రజలు, ప్రభుత్వం, పాఠకుల పక్షాన నిలబడి అక్షర సేద్యం చేస్తున్నాం.  ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదని మరోసారి బల్లగుద్ది చెబుతున్నాం..!




Tadepalli

2022-11-14 08:09:17