ఏఐఎఫ్ పథకం క్రింద జిల్లాలో రైతాంగానికి భారీ ఎత్తున మౌలిక వసతులు కల్పించేందుకు తగిన సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. వివిధ వ్యవసాయ, అనుబంధ శాఖలు, బ్యాంకు అధికారులతో తన ఛాంబర్లో మంగళవారం ఏఐఎఫ్ పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పథకం అమల్లో బ్యాంకులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. కోత అనంతరం, సరైన సమయంలో విక్రయించేందుకు అనువుగా పంటను నిల్వచేసుకోవడానికి, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడానికి, మార్కెటింగ్, ప్రాసెసింగ్ తదితర సదుపాయాలను కల్పించడానికి కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని చెప్పారు. పథకాన్ని సకాలంలో, సక్రమంగా ఉపయోగించుకోగలిగితే జిల్లాకు సుమారు రూ.500 కోట్లు వరకూ వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పథకాన్ని అమలు చేయడానికి విభిన్నంగా, వినూత్నంగా కొత్త యూనిట్ల స్థాపనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు. కేవలం వ్యవసాయానికే కాకుండా, ఉద్యాన, పాడి, మత్స్య, పట్టు, మార్కెటింగ్ తదితర అనుబంధ శాఖల్లో కూడా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి, అంతిమంగా రైతుకు మేలు చేసేందుకు కృషి చేయాలని జెసి కోరారు. ముందుగా నాబార్డు ఎజిఎం హరీష్ మాట్లాడుతూ పథకం వివరాలను వెళ్లడించారు. అనంతరం వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, పశు సంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, ఉద్యానశాఖ డిడి ఆర్.శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఏడి వై.వి.శ్యామ్కుమార్, జెడ్పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, మత్స్యశాఖ ఎఫ్డిఓ కిరణ్కుమార్, కెల్ల పిఏసిఎస్ అధ్యక్షులు కెవి సూర్యనారాయణరాజు తదితరులు ఈ పథకం అమలుపై పలు సూచనలు చేశారు. ఇంకా సమావేశంలో ఎల్డిఎం కె.శ్రీనివాసరావు, వివిధ పిఏసిఎస్ ల అధ్యక్షులు డి.శ్రీధర్, టి.వెంకటనారాయణరాజు, డిడిఏ ఎం.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హత్రశ్ జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గ మహిళ మనీషాను సామూహిక బలాత్కారం చేసి ఆమె మృతికి కారణం అయిన నిందితులను తక్షణమే ఉరి తీయాలని ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఆచార్య నునావత్ దేవదాస్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన శంఖవరంలో మీడియాతో మాట్లాడుతూ, మనీషా పార్థివ దేహం కడచూపును కూడా ఆమె తల్లి తండ్రులకు దక్కకుండా చేసి చాటుగా అంత్య క్రియలు చెయ్యడం పట్ల ప్రజల్లో ఆక్రోశం పెల్లుబిగిసిందనీ, ఈ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యనికి గొడ్డలి పెట్టు అని అన్నారు. సుప్రీంకోర్టు ఈ పరిణామాలన్నీ స్వయంగా పర్యవేక్షించి సరైన విచారణ చేపట్టకపోతే మనీషా కుటుంబానికి న్యాయం జరగదని, నిందితులకు శిక్ష పడదని అన్నారు. కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు ఈ విషయంపై జోక్యం చేసుకుని నిందితులను తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం 6.15 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర జలశక్తి (జలవనరుల శాఖ) మంత్రి గజేంద్ర సింఘ్ షెకావత్ గారికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.పి.అనిల్ కుమార్, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి, జెసి మార్కండేయులు , తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, డిప్యూటి కమాండెంట్ శుక్లా , డ్వామా పిడి చంద్రశేఖర్, రేణిగుంట తహసిల్దార్ శివ ప్రసాద్, భానుప్రకాష్ రెడ్డి, కోడూరు బాలసుబ్రమణ్యం, పోకల అశోక్ కుమార్, వల్లివేడు రాజా రెడ్డి, ఎం.శ్రీనివాస్ , డిఎస్పీ చంద్రశేఖర్, ఎయిర్ పోర్ట్ టర్మీనల్ మేనేజర్ గోపాల్ సెంట్రల్ వాటర్ కమిషన్ అబ్జర్వర్ కుమార్, బిజెపి కార్యకర్తలు, స్వాగతం పలికిన వారిలో వున్నారు. అనంతరం రోడ్డుమార్గాన తిరుమల బయలు దేరి వెళ్లారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శించుకుని సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగుప్రయాణం కానున్నారు.
ఎస్.రాయవరంలో మాజీ ఎంపీటీసీ బొలిశెట్టిగోవిందరావు అక్రమాలు బయటపెడుతున్నాడనే అక్కసుతో సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు ఇంటి ముందు సిసి కెమెరాలతో అనుమతి లేకుండా రికార్డింగులు చేయించి మరీ వేధింపులకు దిగడం చర్చనీయం అవుతోంది. రాజు ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకునేందు ఏకంగా విద్యుత్ స్థంబాలను, టెలీఫోను స్థంబాలను వినియోగించి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలిసినా సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన బోలిశెట్టిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. రాజు ఇంటిముందు ఒకటి, ఎంపిపి స్కూలు విద్యుత్ స్థంబానికి ఒకటి, మరొకటి పక్కనే వున్న టెలీఫోన్ స్థంబానికి సిసికెమెరాలు అమర్చి రాజు ఏం చేస్తున్నాడో గమనిస్తున్నాడు. రాజ్యాంగ బద్ధంగా తాను జీవించే హక్కుకి బంగం కలిగించేలా వ్యవహరిస్తున్న బోలిశెట్టిపై చర్యలు తీసుకోకపోగా, ఆయనకే ప్రభుత్వ అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు సోమిరెడ్డి రాజు. ఒకరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక ప్రైవేటు వ్యక్తి సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరం అయినా అధికారులు పట్టించుకోకపోవడం చూస్తుంటే ఒక మాజీ ఎంపీటీసీ అధికారులను ఏ స్థాయిలో కట్టడి చేశాడో అర్ధం చేసుకోవాలని రాజు వాపోతున్నాడు. నాలుగు నెలలుగా సిసి కెమెరాల ద్వారా మా ఇంట్లో ఏం జరుగుతుందో అన్ని రికార్డు చేయిస్తున్నారని, కేవలం బొలిశెట్టి అక్రమాలపై జిల్లా కలెక్టర్ కు, లోకాయుక్తాకు ఫిర్యాదు చేశాననే అక్కసుతో ఇదంతా చేస్తున్నారని సోమిరెడ్డి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లో మహిళలు ఉన్నా నిరంతరాయంగా తమ ఇంటిలో జరుగుతున్నదంతా రికార్డు చేయిస్తున్నారని చెప్పాడు. పోలీసులు, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు అనుమతి లేకుండా వినియోగిస్తున్న స్థంబాల విషయంలో నేటికీ ఎవరూ బోలిశెట్టిపై చర్యలు తీసుకోలేదన్నాడు. ఈవిషయమై డిఐజి ఆఫ్ పోలీస్, విశాఖపట్నం జిల్లా పంచాయతీ అధికారి, ఎస్.పి, రూరల్, విశాఖపట్నం, ఏఎస్పీ, నర్సీపట్నం, సిఐ, నక్కపల్లి, ఎస్.ఐ, యస్.రాయవరం కు ఫిర్యాదు చేస్తున్నట్టు రాజు మీడియాకి వివరించాడు.
అధికారుల అనాలోచిత నిర్ణయం ఆ గ్రామస్తుల పాలిటి శాపంగా మారింది. చినుకు పడితే చాలు నీరంతా గుమ్మంముందు తిష్టవేయడంతో ఎటూ వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విశాఖజిల్లాలోని ఎస్.రాయవరం మండలంలో చినగుమ్ములూరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యం లో గతంలో సైడ్ డ్రైన్స్ లేకుండా రోడ్డు నిర్మాణాలు చేపట్టడంతో ఈ దుస్థితి వచ్చినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరుపోయే మార్గం లేకపోవడంతో రోడ్లన్నీ మురికి కాలువలను తలపిస్తున్నాయి. ఇక్కడ మురికిగా తయారైన పంచాయితీ రోడ్లు, అపరిశుభ్రతతో దుర్గంధం వెదజల్లుతున్న కనీసం పట్టించుకునేనాధుడే కరువయ్యాడని ఈ గ్రామస్తులు వాపోతున్నారు. చినగుమ్ములూరు గ్రామంలో ఏ వీధిలోనూ సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో స్నానపానాలు చేసిన వ్రుధానీరు కూడా రోడ్లపైకి వచ్చేస్తుంది. గ్రామస్తులు పంచాయితీకి ఎన్ని సార్లు పిర్యాదు చేసిన సైడ్ కాలువ కూడా నిర్మించపోవడంతో ఈ విషయాన్ని గ్రామస్తులు మీడియాకి ముందుకి తీసుకు వచ్చారు. మురికి, దుర్గంధం వలన పిల్లలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీలు లేని తమ గ్రామంలో ప్రభుత్వం తక్షణమే డ్రేనేజీలు తవ్వించాలని గ్రామస్తులు కోరుతున్నారు.