1 ENS Live Breaking News

అంగన్ వాడీలో ఎర్రబాట సేవలు..

అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మంచి ఆరోగ్యం వారి సొంతమవుతుందని ఎర్రబాట పత్రిక సంపాదకులు పితాని రాము అన్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ, రేపూరు అంగన్వాడీ కేంద్రాల్లో ఎర్ర బాట  108 మంది పిల్లలకు టూత్ పేస్టులు, బ్రష్ లు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో  పత్రిక ద్వారా తమ వంతు సహాయంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అలాగే జిల్లాలోని పలు  ప్రభుత్వ కార్యాలయాల్లో మాస్కులు, శానిటైజర్ లు కూడా అందించడం జరిగిందన్నారు. అనంతరం కొవ్వాడ పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడుతూ, కొవ్వాడ, రేపూరు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న మూడు సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలకు పేస్టులు, బ్రష్ లు ఇవ్వడం అభినందనీయమన్నారు. అన్నివర్గాల దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నిరుపేద కుటుంబాలకు కాస్త ఆసరా దొరుకుంతుందని సూచించారు. దన సహాయం కన్నా కరోనా సమయంలో వస్తు సహాయం ఎంతో ఉపయోగంగా వుంటుందని దాతల సహాయాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2020-09-30 14:31:05

బొలిశెట్టి అనుమతుంటే చాలు.. అక్రమ నిర్మాణమే

విశాఖజిల్లాలో ఒక సాధారణ మాజీ ఎంపీటీసీ ఎస్.రాయవరంలో రూలింగ్ చేయడం ప్రభుత్వ అధికారులకు, సిట్టింగ్  ఎమ్మెల్యే గొల్లబాబూరావుకి విస్మయాన్ని కలిగిస్తోంది... ఏదైనా నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు తీసుకున్నా, తీసుకోకపోయినా బొలిశెట్టి గోవిందరావు అనుమతి తీసుకుంటే చాలు...ఆ కట్టడాలను తనిఖీలు చేయడానికి ఏ ఒక్క అధికారి ఆ ఇరుప్రక్కలకు రాడు... వచ్చినా ఓహో ఇది బొలిశెట్టి అనుచరుడి నిర్మాణం కదా దీని జోలికి వెళ్లినా ఫలితం లేదనుకొని వెనక్కి వెళ్లిపోతారు..అలా ప్రభుత్వ అనుమతి లేకుండా బొలిశెట్టి అనుచరుడినని చెప్పుకుంటూ కేవలం జి ప్లస్ టు నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉన్న గ్రామ సచివాలయ పరిదిలో ఏకంగా నాలుగు అంతస్తుల కళ్యాణ మండపాన్ని నిబంధనలన్నీ మా చుట్టాలే నంటూ అధికారులను బెదిరించి మరీ నిర్మించేశారు..ఒక నిరుపేద ఒక్కసెంటు భూమిలో పాక వేసుకుంటే ఎక్కడలేని రూల్సు అకస్మాత్తుగా గుర్తుకొచ్చేసి ఆ పాకు కూల్చే వరకూ నిద్రపోని ప్రభుత్వ అధికారులు.. ఇక్కడ ప్రభుత్వ అనుమతి కంటే పెద్ద అనుమతి బొలిశెట్టి గోవిందు అనుమతి ఉండటంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అంతస్తులు శ్రీ వెంకటేశ్వరా కళ్యాణ మండపాన్ని స్థానిక ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల ముందే నిర్మించేసినా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. పైగా బొలిశెట్టి ప్రధాన అనచరుడినంటూ కర్రిధనరెడ్డి ఈ ఓనరుగా ఉన్న ఈ కళ్యాణ మండపాలకు వెళ్లడానికి నాలుగు వెపులా ఇరిగేషన్ కాలువలపై నిబంధనలకు విరుద్దంగా వంతెనలు కూడా నిర్మించాడు. ఈ విషయంపై సమాచారహక్కు చట్ట కార్యకర్త సోమిరెడ్డిరాజు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో విచారణకు వచ్చిన డిఇఇ సుజాత, ఏఈ చిన్నారావులను బొలిశెట్టి, ఎమ్మెల్యే గొల్లబాబూరావు పేర్లు చెప్పి బెదిరించి మరీ తరిమికొట్టాడు సదరు కళ్యాణ మండపం యజమాని. ఒక మాజీ ఎంపీటీసి పేరుతో జరుగుతున్న అక్రమనిర్మాణాలపై అటు రెవిన్యూ, గ్రామసచివాలయం, ఇటు ఇరిగేషన్, పోలీసు అధికారులు సైతం నోరు మెదకపపోవడం విచిత్రంగా వుందని సోమిరెడ్డి రాజు మీడియా ముందు వాపోయారు. ఎవరైనా నిరుపేదలు సెంటు స్థలంలో ఇళ్లు కట్టుకుంటే అనుమతులున్నాయా అంటూ ఆ పాకను పెకలించేంతవరకూ నిద్రపోని అధికారులు ఎస్.రాయవరంలో మాజీ ఎంపీటీసీ రూలింగ్ చేస్తూ, అక్రమ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నా చోద్యం చూస్తున్నారని రాజు ఆరోపిస్తున్నారు. తక్షణమే అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే జిల్లా కలెక్టరుని ఆశ్రయిస్తామని, లోకాయుక్తాకి ఫిర్యాదు చేస్తామని కూడా సోమిరెడ్డి హెచ్చరిస్తున్నారు. పైగా అభివ్రుద్ధి పనులకే పెద్దపీట వేసే ఎమ్మెల్యే గొల్లబాబూరావుని అక్రమాల ఊబిలోకి బొలిశెట్టి, అతని అనచరులు నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

s.rayavaram

2020-09-29 13:38:05

దళితులపై దురాగతాలు సహించేది లేదు..

దళితుల పై దురాగతాలను చేపడితే ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య హెచ్చరించారు. సోమవారం రావికమతం మండలంలోని గుమ్మళ్ళపాడు గ్రామాన్ని సందర్శించి అక్కడ దళితుల గ్రామ బహిష్కరణ పై విచారణ చేపట్టారు. అక్కడ జరిగిన విషయాలను గ్రామ ప్రజలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, దళిత సామాజిక వర్గానికి చెందిన యువతిని అగ్రవర్ణానికి చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో సంబంధిత కుటుంబాలను గ్రామ బహిష్కరణ గావించడం ఎంతో విచారించదగిన విషయం అన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సంబంధిత కుటుంబాల వారికి కౌన్సిలింగ్ చేయాల్సిందిగా మండల అధికారులకు ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు మరి ఏ మండలం లోనూ, గ్రామాలలో నూ పునరావృతం కాకూడదని, మరలా ఇటువంటి సంఘటనలు జరిగినట్లు తన దృష్టికి వస్తే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ తో పాటు రావికమతం మండల తాసిల్దార్ కనకారావు, సీ ఐ లక్ష్మణ మూర్తి, ఎస్ ఐ చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ravikamatham

2020-09-28 18:46:43

నిధులు దారిమళ్లింపు కఠిన చర్యలు..!

గ్రామసచివాలయాల్లో  ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారిణయ సిబ్బందిని హెచ్చరించారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని ఎస్.రాయవరం సచివాలయంలో ఈఓపీఆర్డీ ఏవిఎస్ఎస్ ప్రసాద్ ప్రభుత్వ నిధులను తన కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లించిన వ్యవహారంలో నర్సీపట్నం డీఎల్పీఓ విచారణ చేపట్టారని, ప్రాధమికం రూ.47 వేలు తన కుమారుడి ఖాతాలోకి మళ్లించినట్టు రుజువైందన్నారు. విచారణ నివేదికను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కు చర్యలు నిమిత్తం పంపించనున్నట్టు ఆమె వివరించారు. ఈయనతోపాటు మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిలు కూడా తమ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి పంచాయతీ నిధులు దారిమళ్లించినట్టు గుర్తించామని, వారిపై చర్యలు తప్పవని డిపిఓ వివరించారు. కరోనా సమయంలో చాలా సచివాలయాల్లో సిబ్బందిని ఫినాయిల్, బ్లీచింగ్, ఇతర ఖర్చుల విషయంలో అధికంగా ఖర్చులు చేసేరా విషయంపై వచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టినట్టు ఆమె వివరించారు. ఎవరైనా నకిలీ బిల్లులు పెట్టినా, నిధులు పక్కదారి పట్టించినా కఠిన చర్యలు తప్పవని డిపిఓ హెచ్చరించారు. కాగా ఎస్.రాయవరం సచివాలయంలో ఈ నిధులతోపాటు మరికొన్ని నిధులు దుర్వినియోగంపైనా లోకాయుక్తాలో కూడా కేసులు నడుస్తుండటం విశేషం. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి..

Visakhapatnam

2020-09-26 14:15:08

నాడు ఈఎన్ఎస్ చెప్పింది.. నేడు నిజమైంది ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కరోనా ఖజనాకి కన్నం పెట్టినా.. గ్రామసచివాలయ కార్యదర్శిలకు మహబాగా నాలుగు రాళ్లు వెనుకేసుకేలా చేసింది. చేతికి ఎంత దొరికితే అంతే అడ్డంగా దోచేశారు.. ఇదే సమయంలో ప్రభుత్వ నిధులను పక్కదానికి పట్టించి ఎవరికీ అనుమానం రాకుండా సచివాలయ కార్యదర్శిలు తమ పిల్లలు, భర్తల పేరనే బ్యాంకుల్లో డిపాజిట్ చేసేకున్నారు. ఈ విషయాన్ని ఎస్.రాయవరం గ్రామసచివాలయ అవకతవకలపై ఈఎన్ఎస్ మూడు నెలల క్రితం వార్తా కథనాలు అందించింది. నేడు నర్సీపట్నం డివిజనల్ పంచాయతీ అధికారిణి, ఎస్.రాయవరం గ్రామసచివాలయంలో చేసిన విచారణలో ఆశక్తికర వాస్తవాలువ వెలుగు చూశాయి. కొత్తరేవుపోలవరం కార్యదర్శిగా వున్న ఏవిఎస్ఎస్ ప్రసాద్ ని ఎస్.రాయవరం సచివాలయ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అదే సమయంలో కరోనా వైరస్ విజ్రుంభించడంతో సచివాలయానికి కావాల్సిన బ్లీచింగ్, ఫినాయిల్, శానిటైజర్లు ఇలా అన్నింటిని కొనుగోలు చేయడానికి నేరుగా కార్యదర్శిలు తమ కుటుంబ సభ్యులను వినియోగించుకున్నారనే విషయం డిఎల్పీఓ విచారణలో తేలింది. ఏకంగా 47వేల రూపాయలు సదరు కార్యదర్శి తన కొడుకు బ్యాంకు ఖాతాకి మళ్లించినట్టు రుజువు అయ్యింది. దీంతో సచివాలయంలోని రికార్డలన్నింటినీ డిఎల్పీఓ నర్సీపట్నంలోకి కార్యాలయానికి తీసుకువెళ్లారు. మొత్తం ఎస్.రాయవరం పంచాయతీ రికార్డులు మొత్తం తనిఖీలు చేపడితే మరిన్నివిషయాలు వెలుగు చూసే అవకాశం వుంది.

s.rayavaram

2020-09-25 20:45:30

మండపంలో 55 మందికి వైద్య పరీక్షలు..

శంఖవరం మండలంలోని మండపం రామాలయంలో గురువారం డా.అభిషేక్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు గ్రామంలో 55 మంది వృద్ధులు వికలాం గులు,మహిళల కు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. సచివాలయ ఏఎన్ఎమ్ సుష్మా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని  గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు జ్వరం ,మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కూనిశెట్టి మాణిక్యం , కార్యదర్శి పి నాగమణి ,మహిళా పోలీస్ గౌతమి ,మాజీ సర్పంచ్ నక్కా మాణిక్యం ,ఏఎన్ఎమ్ కృష్ణ కుమారి,అల్లు బాబు ,ఆశా నాగమణి ,విహెచ్ఏ శ్యామ్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.

మండపం

2020-09-24 19:40:45

శంఖవరంలో 2 కరోనా పాజిటివ్ కేసులు..

శంఖవరం పీహెచ్సీలో గురువారం నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో 2 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు  పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ఈరోజు మొత్తం 9 మందికి పరీక్షలు చేయగా 2పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలాఅప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ తీసుకొని మందులు వాడటం ద్వారా వైరస్ నియంత్రణ జరుగుతుందన్నారు. ప్రజలంతా ప్రభుత్వం నిర్ధేశించిన 4.0 అన్ లాక్ ఆదేశాలను తప్పక పాటించాలన్నారు.  అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు

Sankhavaram

2020-09-24 15:50:28

వైఎస్సార్సీపీలోకి మరో టిడిపి ఎమ్మెల్యే జంప్..

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి టిడిపి ఎమ్మెల్యేల జంపింగ్ కోసం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సిద్ధంగా వున్నట్టు తెలుస్తోంది. ఇందు ముందుగా విశాఖ పశ్చిమ నియోజ కవర్గ ఎమ్మెల్యే గణబాబు పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు సమాచారం. వచ్చేనెల ఐదున అధికారపార్టీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారట. ఈయన తరువాత తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే, ఆతరువాత ఉత్తర నియోజవర్గ ఎమ్మెల్యే గంటా ఇలా విశాఖ నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీలోకి చేరతారని విశేషంగా ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో విశాఖ జిల్లా చాలా కీలకంగా వుంది. అలాంటి జిల్లాలో 2019 ఎన్నికల్లో విశాఖ మహానగరంలో ఎంపీ మినహా ఎవరూ పార్టీ నుంచి గెలవలేకపోయారు. ఆ తరువాత ఏడాది దాటిన తరువాత గెలిచిన ఎమ్మెల్యేలంతా యూ టర్న్ తీసుకొని అధికారపార్టీలోకి వచ్చేస్తున్నారు. ముందుగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వచ్చేయగా, ఇపుడు గణబాబు సిద్ధమయ్యారు. అయితే వీరంతా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా అధికారపార్టీకి మద్దతు నిస్తూ, పార్టీలోకి రావడం విశేషం.

పశ్చిమ నియోజకవర్గం

2020-09-24 13:20:57

ముగ్గురు పారామెడికల్ సిబ్బంది నియామకం..

శంఖవరం ఆయుష్మాన్ భారత్ వెల్ నెస్ కేంద్రానికి మంజూరైన ముగ్గురు పారామెడికల్ సిబ్బంది విధుల్లోకి చేరారని వైద్యాధికి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. గురువారం ఆయన ఆసుపత్రిలో మీడియాలో మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ ఆసుపత్రికి ఒక ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సులను నియమించిందన్నారు. ఇప్పటి వరకూ సిబ్బంది కొరతతో ఉన్న ఆసుపత్రికి ప్రభుత్వం అందించిన ఈ సిబ్బందితో కాస్త కొరత తీరుతుందని చెప్పారు. అయితే ఈ ఆసుపత్రికి రెండు ల్యాబ్ టెక్నీషియన్లు మంజూరు ఉండగా ప్రస్తుతం ఒక్కరు మాత్రమే వచ్చారన్నారు. ఇద్దరు ఫార్మసిస్టులతో పూర్తిస్థాయిలో మందుల పంపిణీకి వీలుపడుతుందన్నారు. ప్రస్తుతం ల్యాబ్ టెక్నీషియన్ నియామకంతో ఆసుపత్రిలో ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడానికి వీలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు అధికంగా వుండటం వలన ఆ పరీక్షలు మాత్రమే ప్రతినిత్యం చేస్తున్నట్టు చెప్పారు. ఆసుపత్రికి పారామెడికల్ సిబ్బంది మంజూరుకి క్రుషి చేసి ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా డాక్టర్ అభినందనలు తెలియజేశారు.

Sankhavaram

2020-09-24 12:54:17

ఆ కాంట్రాక్టు లెక్చిరర్లను తిరిగి చేర్చుకోవాలి..

 శ్రీకాకుళం జిల్లాలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు లో గత ఏడాది 2019/2020 విద్యాసంవత్సరంలో కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో 20 మంది అధ్యాపకులు జీవితాలు రోడ్డున పడ్డాయి. గత సంవత్సరంలో ఈ అధ్యాపకులు ఒప్పంద అధ్యాపకుల వలె విద్యార్థులకు  పాఠాలను బోధించారు. రాత్రి 24 గంటలు  కళాశాలలో ఉండి విద్యార్థులకు అదనపు తరగతులు బోధించారు. ప్రాక్టికల్స్ నిర్వహించడం , విద్యార్థులకు పరీక్షలు పెట్టి వారి యొక్క మేధస్సును పెంచడం, ప్రభుత్వం ప్రధాన పరీక్షల్లో పరిశీలన పర్యవేక్షించడం, విద్యార్థుల యొక్క చివరి పరీక్షల్లో మూల్యాంకనం కూడా చేశారు. అంతేకాదు ఎన్నికలు విధులు కూడా నిర్వహించారు. బడి మానేసిన విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించడం అనేక కార్యక్రమాలను నిర్వహించిన వీరిని విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించారు. ఇన్ని చేసిన  వీరిని ఉద్యోగులుగా గుర్తించి తొలగించడం చాలా బాధాకరం విషయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రధాన కార్యదర్శి కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం సేవలందించిన వీరిని మళ్లీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారిని వీ.సెల్వియాకి విన్నవించామని చెప్పారు.  , తిరిగి తమ ఉద్యోగాలను ఇవ్వవలసిందిగా మిక్కిలి వినయ పూర్వకంగా  కోరుతున్నారు..

Srikakulam

2020-09-24 12:14:30

నిధుల మళ్లింపుపై విచారణ ప్రారంభం..

ఎస్.రాయవరం మండలంలోని పంచాయితీల నిధులు మళ్ళీంపు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు డిఎల్ఫీవో శిరీషారాణి తెలిపారు. బుధవా రం మండల కేంద్రమైన రాయవరం పంచాయితీ కార్యాలయంలో మండల ఈవోపీఆర్డీ త్రిమూర్తులపై వచ్చిన ఫిర్యాదుపై ఐదు పంచాయితీల రికార్డులను పరిశీలిం చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ , గొలుగొండ మండలం ఏ.ఎల్.పురం గ్రామానికి చెందిన ఎస్.వెంకటరమణ అను వ్యక్తి రాయవరం ఈవోపీఆర్డీగా పని చేస్తున్న త్రిమూర్తులు ప్రత్యేకాధికారిగా వున్న ఐదు గ్రామాలకు చెందిన నిధులను తన కుమారుడు బ్యాంకు అకౌంట్ కు తరలించినట్లు ఫిర్యాదు చేశాడన్నారు. ఆ ఫిర్యాదుపై ఆయన ప్రత్యేకాధికారిగా వున్న కొరుప్రోలు, పెదవుప్పలం, గెడ్డపాలెం, కొత్త రేవుపోలవరం, గుడివాడ గ్రామపంచాయితీలలో అభివృద్ధి పనులకై ఖర్చు చేసిన వివరాల పరిశీలన చేస్తున్నామన్నారు . కొరుప్రోలు పంచాయితీ నుండే సుమారు యాభైవేల రూపాయలు నిధులు మళ్ళింపు జరిగాయని ఫిర్యాదులో పేర్కొనగా , సుమారు పది లక్షల రూపాయలు వరకు ఐదు పంచాయితీల నుండి నిధులు మళ్ళింపు జరిగి వుంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు . రికార్డుల పరిశీలన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని డిఎల్పీఓ శిరీషారాణి వెల్లడించారు.

s.rayavaram

2020-09-23 18:34:40

వాకపాడు ప్రయాణమా...ఆమ్మో జాగ్రత్త సుమా..

ఆ గ్రామానికి చేరుకోగానే వాహనచోదకుల గుండెళ్లో రైళ్లు పరిగెడతాయి...ఒకటి కాదు రెండు కాదు...పది రోజుల వ్యవధిలో 15 ద్విచక్రవాహనాలు ఆ ప్రాంతంలో ప్రమా దాలకు గురయ్యాయి. సుమారు 20 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదాలకు నిలయమైన ఆ ప్రాంతం కోసం తెలుసుకుంటే ఎస్.రాయవరం మండ లంలో, ఎస్.రాయవరం నుంచి వాకపాడు వెళ్లే దారిలోని ఆర్అండ్ బి కి చెందిన తారురోడ్డు పూర్తిగా శిథిలమైంది. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లిన ద్వికచక్రవాహదారులు బురదమయంగా మరిన రోడ్డులో బోల్తా కొడుతున్నారు. నాలుగు రోజులు క్రితం బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వెళుతూ ఈ గుంతమయమైన బురద రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని వాకపాడు గ్రామసచివాలయ కార్యదర్శి ఎస్.కుమార పట్నాయక్ కి విన్నవిస్తే...తామేమీ చేయలేమని, ఈ రోడ్డు ఆర్ అండ్ బి చెందినదని చేతులెత్తేశారు. పైగా ఈ గ్రామాన్ని సందర్శించిన నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య రోడ్డు దుస్థితి చూసి తక్షణమే ఈరోడ్డు పనులు చేయాలని అధికారులను ఆదేశించడంతో సబ్ కలెక్టర్ నుంచి తప్పించుకోవడానికి ఈ గుంతలమయం అయిన రోడ్డులో మట్టివేయించి చేతులు దులుపుకున్నారు. ఆతరువాత కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డు మరింత దారుణంగా తయారై ప్రమాదాలు అధికం అయ్యాయి. దీనికి తోడు గ్రామంలో ఎక్కడా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఎప్పుడు వర్షం పడినా మురుగునీరు మొత్తం ఈ పాడైన రోడ్డుకి చేరిపోవడంతో రోడ్డు మరింత దారుణంగా పాడైపోయింది. ఎనిసార్లు ఫిర్యాదులు చేసినా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోగా, రోడ్డు బాగాలేని సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని సలహా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామసచివాలయం, ఆర్ అండ్ బి రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో గ్రామస్తులతోపాటు, ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించే వాహచోదకులు వరుస ప్రమాదాలతో నరకం చవి చూస్తున్నారు.

వాకపాడు

2020-09-23 16:33:44

ప్రభుత్వ అనుమతులు లేవు.. బొలిశెట్టి అనుమతి వుంది..

అంతా నాఇష్టం పంటకాలువలు.. ఆర్అండ్ బీ రోడ్డూ.. ఎక్కడైనా నేను నా ఆస్తులకు బ్రిడ్జిలు నిర్మిస్తాను.. అడిగేవారెవరు?  నీటిపారుదలశాఖ ఏఇ వచ్చి ఇరిగేషన్ కాలువపై నిర్మిస్తున్న బ్రడ్జీలు, నేను చెప్పిన సమాధానం విని ఏమీ అనకుండా వెళ్లిపోయాడు.. ప్రభుత్వ అనుమతులు లేవు.. పంచాయతీ అనుమతులు అసలే లేవు.. కానీ వైఎస్సార్సీపీ పెద్దనాయకుడు బొలిశెట్టి గొవిందరావు అనుమతి వుంది.. పైగా నేను ఆయన అనుచరుడిని చాలా ఇంకేమైనా కావాలా.. అంటూ కర్రి ధనరెడ్డి అనే వ్యక్తి ఎస్.రాయవరంలో తనకు నచ్చినట్టుగా పంటకాలువపై ఇష్టమొచ్చినట్టు నాలుగు వంతెనలు నిర్మించాడు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొల్లబాబూరావు, తరువాత అత్యధిక ఫాలోయింగ్ వున్న వ్యక్తి బొలిశెట్టి గోవిందరావు, ఈయనను ప్రసన్నం చేసుకుంటే చాలు నియోజకవర్గంలోని అందరు అధికారులు చెప్పినట్టు వింటారు. అదే ఫాలోయింగ్ ను కొందరు అక్రమార్కులు కూడా తమకి నచ్చినట్టుగా వినియోగించుకుంటన్నారు. ఎస్.రాయవరంలో ఎంపీడిఓ కార్యాలయం ముందున్న శ్రీ వెంకటేశ్వర  కళ్యాణమండపానికి సదరు ఓనరు కర్రిధనరెడ్డి మండపాని రెండువైపులా ఇరిగేషన్ కాలువపై బ్రిడ్జిలు నిర్మించేశారు. ఇపుడు మూడవది ముందువైపు నిర్మస్తున్నారు. అంతేకాదు తన ఇంటి ముందు పంటకాలువపై మరొక వంతెన కూడా నిర్మించేస్తున్నాడు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే. ఇరిగేషన్ పంట కాలువలపై ఎలాంటి ఆక్రమణలు, కట్టడాలు ప్రభుత్వం తప్పా మరెవరూ నిర్మించడానికి వీలులేదు. అయినా తన వెనకున్న నాయకుడిని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా పంటకాలువలను ఆక్రమించారని ఎస్.రాయవరానికి చెందిన సమాచారహక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డిరాజు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఇరిగేషన్ ఏఇ ఈ నిర్మాణాల అక్రమమని హెచ్చరించినా, బొలిశెట్టి ద్వారా ఎమ్మెల్యే తో మాట్లాడిస్తానని, కావాలంటే మీరు వారికి సమాధానం చెప్పుకోవాలని కర్రధనరెడ్డి ప్రభుత్వ ఏఇని వారించి పంపేశారు. ఆరోజుకిని నిర్మాణం ఆపినా, మరుసటి రోజు నుంచి నిరాటంకంగా నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు. 5వ వంతెన రాయవరం నుంచి సర్వశిద్ధి పోవు తారురోడ్డుని ఆనుకొని వున్న గెస్టు హౌస్ కి ఒక బ్రిడ్జి పంటకాలువపై కట్టాడు. వీటన్నింటినీ సోమిరెడ్డి రాజు ఫోటో ఆధారాలు లిఖిత పూర్వ ఫిర్యాదులతో ఇరిగేషన్ శాఖకు, ఆర్అండ్బి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా ఎవరైనా స్థానికులు అక్రమనిర్మాణాలపై మాట్లాడేందుకు ముందుకు వస్తే...వారి అవసరాలకు అప్పులు ఇచ్చి వారిని నియంత్రిస్తాడని కూడా రాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్.రాయవరం మండలంలోని అక్రమాలు, అవినీతిపై గత కొన్ని సంవత్సరాలుగా సోమిరెడ్డిరాజు సమాచార హక్కుచట్టం ద్వారా జరిగిని అవినీతిని వెలికితీస్తున్నారు. ఈ విషయం బొలిశెట్టికతి తెలియడంతో, ఎమ్మెల్యే ఏమీ అనకుండా తాను చూసుకుంటానని, నీ పనిఎక్కడా ఆపొద్దంటూ హామీ ఇవ్వడంతోనే కర్రిధనరెడ్డి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పంటకాలువపై, ఇరిగేషన్ ఆస్తులపై సొంత నిర్మాణాలు చేపడుతున్నారని సోమిరెడ్డి మీడియాకి వివరించారు. తక్షణమే ఈ అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే, విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్రుష్టికీ తీసుకెళతామని సోమిరెడ్డిరాజు, స్థానిక గ్రామస్థాయి నాయకులు మీడియాకి వివరించారు.  ఇరిగేషన్ భూములు, పంటకాలువలపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే సుప్రీంకోర్టుఆదేశాలున్నా...కొందరు అక్రమార్కులు అధికారపార్టీ ఎమ్మెల్యేలకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించడం విశాఖజిల్లాలో చర్చనీయాంశం అవుతుంది..

s.rayavaram

2020-09-23 12:40:43

సచివాలయ నిర్మాణాలు సత్వరం పూర్తికావాలి..

ఏజెన్సీలోని గ్రామసచివాలయ భవన నిర్మాణాలు సత్వరం పూర్తిచేయాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల అధికారులను ఆదేశించారు. హుకుం పేటలో పీఓ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా బాకూరు గ్రామంలో జరుగుతున్న భూ సర్వే,పనులు పరిశీలించారు. సర్వే వేగంగాపూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ బాలురు, బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులు తనిఖీ చేశారు. రూ.18 లక్షలతో ఎం పిపి పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పనులు తనిఖీ చేశారు. పటిష్టమైన నాణ్యతలు పాటించాలన్నారు. 82 కుటుంబాలను సర్వే చేశామని రెవిన్యూ  అధికారులు వివరించారు. గ్రామసభ తీర్మాణాలపై ఆరాతీశారు.సుండ్రుపుట్టు గ్రామం రైతు డూరు ఈశ్వరరావు పొలంలో ఐటీడీఏ సహాయంతో వేసిన జామ తోట,మొదమాంబ స్వయం సహాయక సంఘానికి ఇచ్చిన  సోలార్ పంపుసెట్ ను పరిశీలించారు. పంపుసెట్ పనితీరు గురించి, సరఫరా చేస్తున్న నీటి సామర్ధ్యం పై ఆడిగితెలుసుకున్నారు. దిగుడుపుట్టు గ్రామంలో పౌల్ట్రీ ని  రూ.2.80లక్షల వ్యయం తో నిర్మిస్తున్న సోలార్ తాగునీటి పధకం పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేసి వినియోగం లోకి తీసుకురావాలని వెలుగు అధికారులను ఆదేశించారు.  గెడ్డంగి నారాయనమ్మ నాటు కోళ్ల పెంపకాన్ని పరిశీలించారు. ప్రతి గ్రామంలో 5గురికి కోళ్లు  పంపిణీ చేయాలని వెలుగు అధికారులను ఆదేశించారు. పౌల్ట్రీ పై  వస్తున్న ఆదాయ వ్యయాలను అడిగి తెలుసుకున్నారు. రూ.42 లక్షలతో నిర్మిస్తున్న  సూకూరు  గ్రామ సచివాలయం నిర్మాణపు పనులు, గిరిజన సంక్షేమ బాలుర  ఆశ్రమ పాఠశాలలో రూ.42.69లక్షలతో చేపట్టిన మనబడి నాడు పనులు తనిఖీ చేశారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.  భీమవరం గ్రామంలో  గ్రామ సచివాలయం,రైతు భోరోసా కేంద్రం పనులు తనిఖీ చేశారు.గ్రామంలో తాగునీటి సదుపాయాలు, మొబైల్ టవర్ నిర్మించాలని గ్రామస్థులు కోరగా పి ఓ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈ ఈ జి.మురళి, వెలుగు ఎపిడి ఎం.నాగేశ్వరరావు, తహసీల్దార్ వై.వి కోటేశ్వరరావు, ఎంపిడివో ఇమ్మనియేలు, ఏ ఈ దేముళ్లు, డిపి ఎం సత్యం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Hukumpeta

2020-09-22 19:03:50

మండలంలో 2 పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి..

విశాఖ ఏజెన్సీలో ఇంజనీర్లు వినూత్నంగా ఆలోచించి మనబడి నాడు నేడు లో మండలానికి రెండు పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా. వెంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. సోమవారం రెవెన్యూ, గిరిజన సంక్షేమశాఖ,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎం.పి.డి. ఓలు, ఉపాధిహామీ, వెలుగు అధికారులతో వారాంతపు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మనబడి నాడు నేడు పనులు నత్తనడకన జరుగుతున్నా యని పనులు వేగం పెంచాలని ఆదేశించారు. నాడు నేడు పనులకు రివైజ్డ్ అంచనాలు వేసి మండలానికి రెండు పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేసారు. సోమవారం నాటికి నాడు నేడులో రూ.74.55 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.55 కోట్లు ఖర్చు చేసారని అన్నారు. అటవీ హక్కులపై గ్రామ సభ తీర్మానాలు త్వరగా పూర్తి చేయాలిన చెప్పారు. ఈనెల 23 వతేదీన ఆర్ ఓ ఎఫ్ పట్టాలపై సబ్ డివిజినల్ స్దాయి సమావేశం నిర్వహించి 24, లేదా 25 తేదీలలో జిల్లా స్దాయి కమిటీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈలోగా జి పి ఎస్ సర్వే పూర్తి చేసి సరిహద్దురాళ్లు నాటించే పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం అనుసంధానంతో చేపట్టిన రైతు భరోసా, గ్రామ సచివాలయ నిర్మాణాల పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. సిమ్మెంటు, ఇసుక,నిర్మాణ సామగ్రి కొరతలేదని నిర్దిష్ట సమయానికి జరగవలసిన పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. 228 ప్రహరీ గోడలపనులకు 8 మాత్రమే పూర్తి చేసారని అన్నారు. మండలంలోని కమ్యూనిటీ సమన్వయ కర్తలు సామాజిక పెట్టు బడి నిధి నెలకు రూ.50 వేలు రికవరీ చేయాలని వెలుగు అధికారులకు సూచించారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలని అన్నారు. ఉపాధిహామీ పధకంపై సమీక్షిస్తూ ముంచింగ్ పుట్టు, పెదబయలు, జి.కె. వీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాలో జరిగిన ఉపాధిహామీ పనులపై సామాజిక తనిఖీలు చేయించాలని చెప్పారు. ఉపాధికూలీల సంఖ్య తగ్గిందని పెంచాలని చెప్పారు. ఎపి ఓలు ఉపాధిహామీ పనులపై ప్రత్యేక శ్రద్ద వహించి పనులు చేయాలన్నారు. కాఫీ పిట్టింగ్, ప్లాంటేషన్‌పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఆర్ డి ఓ కె. లక్ష్మి శివ జ్యోతి మాట్లాడుతూ రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వెంటనే రైస్ కార్డు లబ్దిదారులకు అందించాలని చెప్పారు. ప్రతీ డి ఆర్ డిపో వద్ద ఇద్దరు వాలంటీర్ల ను నియమించి నవశకంలో పెండింగ్‌లో ఉన్న రైస్ కార్డులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ రిపోర్టులలో ఉన్న వ్యత్యాసాలను సరిదిద్దాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ కె. వి. ఎస్ ఎన్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ ఇలు ఆర్.కె. భాస్కర్, పి ఐ యు ఇ ఇ శ్రీనివాసరావు, వెలుగు ఎపిడి నాగేశ్వరరావు, ఎస్ ఎం ఐ డి ఇ రాజేశ్వరరావు, ఉపాధిహామీ ఎపిడి సి.హెచ్.లచ్చన్న ,కాఫీ ఎడి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Paderu

2020-09-21 20:36:17