తిరుపతిలో అత్యాధునిక ప్రమాణాలతో ముంబాయికి చెందిన దాత ఉద్వేగ్ ఇన్ఫ్రాస్టెక్చర్ అండ్ కన్సల్టెన్సి ప్రైవెట్ లిమిటెడ్ (యు.ఐ.సి) ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించనుందని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బరెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి గారు, యు.ఐ.సి.సంస్థ సిఈవో , మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కె. సింగ్లు పరస్పర అవగాహన ఒప్పందంపై టిటిడి ఛైర్మన్ సమక్షంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంరతం ఆంధ్ర ప్రదేశ్లో ప్రత్యేకంగా చిన్న పిల్లలకు ఉన్నత వైద్య సేవలు అందించేందుకు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో చిన్న పిల్లల ఆసుపత్రులు నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీవారి పాదాల చెంత తొలిసారిగా తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి తీర్మానించిందన్నారు. శ్రీవారి అనుగ్రహంతో ముంబాయికి చెందిన యు.ఐ.సి. సంస్థ అధినేత రూ.300 కోట్ల విరాళంతో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం యు.ఐ.సి. సంస్థ, టిటిడితో ఎమ్వోయు కుదుర్చుకున్నట్లు వివరించారు.
అనంతరం ఈవో మాట్లాడుతూ ఇప్పటికే విద్య, వైద్య రంగాలలో టిటిడి విశేష సేవలు అందిస్తున్నదన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న చిన్న పిల్లల ఆసుపత్రి స్వీమ్స్కు అనుబంధంగా పని చేస్తుందని చెప్పారు. దాత శ్రీ సంజయ్ సింగ్ ఆసుపత్రి నిర్మాణంతో పాటు కొన్ని సంవత్సరాల పాటు నిర్వహణ భాధ్యతలు కూడా చూసుకోనున్నట్లు వివరించారు. త్వరలో ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్వేగ్ ఇన్ఫ్రాస్టెక్చర్ అండ్ కన్సల్టెన్సి ప్రైవెట్ లిమిటెడ్ సిఈవో మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కె. సింగ్ మాట్లాడుతూ, తిరుపతిలో చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మించేందుకు శ్రీవారి ఆశీస్సులతో ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్న పిల్లలకు వైద్య సేవలందించేందుకు గొప్ప అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు. ఇందుకు సహకారం అందించిన టిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వీమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, టిటిడి ఎఫ్ఎ అండ్ సీఏవో బాలాజీ, సిఇ రమేష్రెడ్డి, డిఎల్వో రెడ్డప్పరెడ్డి, సిఎమ్వో డాక్టర్ నర్మద, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పర్యటన లో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఈ నెల 12 న సా. 6.35 గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం సా. 7 గం. లకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకుని పూజలు నిర్వహించి రా. 9 గం.లకు తిరుమల చేరుకుంటారని తెలిపారు. 13 వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఉ.9.15 గం. లకు తిరుమల నుంచి బయల్దేరి ఉ.10.15 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఆపై ఉ. 10.50 లకు ఢిల్లీ బయల్దేరి వెళతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
డెంకాడ మండలంలోని ఇందిరా స్వయం సహాయక సంఘం జాతీయ అవార్డుకు ఎంపికవటం పట్ల జిల్లా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ హర్షం వ్యక్తం చేశారు. ఆ సంఘం సాధించిన ఘనత జిల్లాకే గర్వకారణమని అభివర్ణించారు. సంఘ సభ్యులు చూపిన చొరవ, సాధించిన విజయం జిల్లా ప్రగతికి తలమాణికంగా నిలిచిందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ అవార్డుకు ఎంపికైన ఇందిరా గ్రూపు సభ్యులను సోమవారం డీఆర్డీఏ కార్యాలయంలో సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సభ్యులందరినీ అభినందించి శాలువాలతో, పష్పగుచ్ఛాలతో సత్కరించారు. ముందుగా ఢిల్లీ నుంచి ఆన్లైన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అవార్డుల లిస్టును ప్రకటించారు. జిల్లాకు చెందిన ఇందిరా గ్రూపు సభ్యుల బృంద చిత్రంతో పాటు, వారు సాధించిన ప్రగతి నివేదికలను డిస్ప్లే చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డెంకాడ పొదుపు సంఘం సాధించిన విజయం జిల్లాలోని ఇతర మహిళల్లో విశ్వాసం నింపుతుందని పేర్కొన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా సంఘాల వారు కూడా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సాంస్కృతిక, క్రీడల నగరంగా ఉన్న విజయనగరం జిల్లాను చదువుల నగరంగా మార్చడంలో మహిళా సంఘాలు కీలకపాత్ర పోషించాలని ఈ సందర్భంగా కోరారు. భవిష్యత్తులో చదువు లేని గ్రామం ఉండకూడదని తీర్మానించుకొని ముందుకు సాగాలని సూచించారు.
ఇన్ని అవార్డులు రావడానికి కారణం.. మహిళలే
జిల్లాకు ఇప్పటి వరకు 16 జాతీయ అవార్డులు వచ్చాయని.. ఇందిరా సంఘం సాధించిన దానితో 17 జాతీయ అవార్డులు జాబితాలో చేరాయన్నారు. మహిళల్లో ఉన్న పట్టుదలకి, ఏదైనా సాధించాలనే తపనకు ఈ అవార్డులు నిదర్శనమని అభివర్ణించారు. జిల్లాకు ఇన్ని అవార్డుల రావడానికి మహిళా అధికారులే కారణమని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో అత్యధికంగా మహిళా అధికారులు, సిబ్బంది ఉన్నారని చెప్పారు.
అనంతరం సంయక్త కలెక్టర్ జె.వెంకటరావు మాట్లాడారు. ఇది చాలా ఆనందదాయకమైన సంఘటన అని హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు జిల్లాకు మరో కలికితురాయి అని పేర్కొన్నారు. కలెక్టర్ నాయకత్వంలో మహిళలు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. డీఆర్డీఏ పీడీ సుబ్బారావు, ఎస్.కోట ఏసీ జయశ్రీ, ఏపీడీ సావిత్ర మాట్లాడారు. అనంతరం ఇందిరా స్వయం సహాయక సంఘ సభ్యులను పూలమాలలతో, దుశ్సాలువాలతో సత్కరించారు. సంఘ సభ్యులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఏపీడీ సావిత్రి, ఏసీలు జయశ్రీ, స్వర్ణకుమారి, ఏజీఏం, ఏపీఎంలు, సీసీలు, డీఆర్డీఏ, వెలుగు సిబ్బంది, వివిధ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తమిళనాడులోని శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వరాహ మహాదేశికన్ (ఆండవన్) స్వామీజీకి టిటిడి శ్రీవారి ఆలయం తరపున ఆదివారం ఉదయం పెద్ద మర్యాద చేశారు. ముందుగా పాత అన్నప్రసాద భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు స్వామీజీ చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. శ్రీవారి ఆలయం వద్ద స్వామీజీకి టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవోహరీంద్రనాథ్, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భారత ఉప రాష్ట్రపతిఎం.వెంకయ్యనాయుడు, వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ఉ.5.30 గంటల కు శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్,తిరుపతి అర్బన్ ఎస్ పి వెంకట అప్పల నాయుడు ఉండగా, వైకుంఠం కాంప్లెక్స్ వద్ద టిటిడి అదనపు ఈ ఓ ధర్మారెడ్డి,సి వి ఎస్ ఓ గోపి నాధ్ జెట్టి తదితరులు స్వాగతం పలికారు. ఆలయం మహా ద్వారం వద్ద టిటిడి ఈ ఓ జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. శ్రీ వారి దర్శనానంతరం రంగనాయకుల మండపం లో వేద పండితుల ఆశీర్వదం అందించారు. అనంతరం ఈఓ స్వామి తీర్ధ ప్రసాదాలతోపాటు, ఫోటలను అందజేశారు.
భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గురువారం సాయంత్రం 5.15 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్జెట్టి స్వాగతం పలికారు. ఉప రాష్ట్రపతి శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, ఆర్డివో కనక నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏర్పేడు/తిరుపతి, మార్చి 04: 2015 మార్చి 28న శంఖుస్థాపన చేసిన నేను కల సాకారమై నేడు అందరి సహకారంతో ఆకారం ఏర్పడి, ఈప్రాకారంలో పాల్గొనడం అదృష్టమని ఇందుకు సహకరించిన కేంద్రం, రాష్ట్ర అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుని ఐఐటి కళాశాల 6వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా వుందని భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. గురువారం ఉదయం కళాశాల 6వ వార్షికోత్సవంలో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను అందించే కార్యక్రమంలో భారత ఉప రాష్ట్ర పతి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
భారత ఉప రాష్ట్రపతి ప్రసంగిస్తూ వైద్య విద్య, శాస్త్ర సాంకేతిక విద్య, పరిశోధనలు, న్యాయ విద్య భారతీయ భాషల్లో భోధించే రోజులు రావాలని, వస్తాయని నాకు ప్రగాడ విశ్వాసం ఉందని తెలిపారు. ఉన్నత పాఠశాల విద్య వరకు మాతృ బాషలో బోధన ఉండాలని, పరిపాలన విషయంలో ప్రజల భాషలో ఉండాలని, న్యాయ స్థానాల వాదనలు, తీర్పులు మాతృ బాషలో ఉండాలని అన్నారు. మాతృ బాష తరువాత నే పరుల బాషలు నేర్చుకోవాలని భారతీయ సాంప్రదాయాలు భావితరాలకు నేటియువత అందించాలని అన్నారు. ప్రపంచ దేశాల కన్నా కోవిడ్ – 19 నియంత్రణ మన దేశం లో మెరుగుగా ఉందని అందుకు మన ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటివని అన్నారు. రైతుల విషయంలో 98 శాతం మందికి కోవిడ్ – 19 దరిదాపులకు కూడా రాలేదని వారు కష్టపడే విధానం, పీల్చే గాలి, తిండి కారణమని అన్నారు. తిరుపతి పవిత్ర పుణ్య క్షేత్రమని, జ్ఞాన యజ్ఞం లా ఇక్కడ విద్య ఉంటుందని, విద్యా హబ్ గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఆదికాలం, వేదకాలం నుండి ధర్మాన్ని అనుసరించే దేశమని, నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు పరాయి పాలనలో కనుమరుగైయ్యానని, అయినా నేడు ప్రపంచం పెట్టుబడులకు భారత దేశం వైపు చూస్తున్నదని అన్నారు. సంపద ఉంటే సంతోషం రాదని, ఆత్మ సంతృప్తి, ఆనందం వంటివి ఆధ్యాత్మికత, యోగాలతో సాకారం అవుతుందని అన్నారు. ఇంజినీరింగ్ విద్యతో పాటు ఇక్కడ ఫుడ్ టెక్నాలజి, కొత్త ఆవిష్కరణలు వంటివి రావాలని అన్నారు. సామాజిక అవసరాల మేరకు దేశానికి విజ్ఞానాన్ని యువత అందించేలా అలవరచుకోవాలని, బోధనలు తదనుగుణంగా జరగాలని అన్నారు. కలలు కనేటప్పుడు పెద్దవి గా వుండాలనే అబ్దుల్ కలాం ఆశయాన్ని, స్వామి వివేకానంద బోధనలు యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని, ఆత్మ నిర్భర్ భారత్ అందిపుచ్చుకోవాలని అన్నారు. సామాన్య మానవుడు, పేదవాడు సంతోష పడే విధంగా, అవసరాలు తీర్చగలిగేలా మన విజ్ఞానం సహాయపడాలని సూచించారు. మాతృ మూర్తిని, మాతృ భాషను, గురువును మరువరాదని అన్నారు. ‘వారసత్వ నిర్మాత’ పుస్తకాన్ని ఆవిష్కరించి, కోవిడ్ కారణంగా క్యాంపస్ లో అందుబాటులో ఉన్న సాహిల్, చైతన్య, నిఖిత, మారై సోజన్ లకు ప్రతిభ గల విద్యార్థులకు అవార్డులు, నగదు బహుమతిని ఉప రాష్ట్రపతి అందించారు. అనంతరం విధ్యార్థుల వద్దకు స్వయంగా వెళ్ళి పలకిరించారు.
ఐఐటి డైరెక్టర్ మాట్లాడుతూ ఐఐటి లో 1050 మంది విద్యార్థులు ఉన్నారని, దాదాపు 70 ప్రాజెక్టు లు విద్యార్థులచే రూపొందించారని, గత సంవత్సరం ప్రతిభ కనబరచిన వివిధ రంగాల లోని విద్యార్థులకు 19 మందికి అవార్డుల కొరకు ఎంపిక కాబడ్డారని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఉప రాష్ట్రపతికి ఐఐటి ప్రాంగణం వద్ద డిప్యూటీ సి ఎం కె. నారాయణస్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ స్వాగతం పలికారు. ప్రాంగణంలో ఉప రాష్ట్రపతి మొక్కను నాటి సభలో పాల్గొనగా, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఐఐటి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉదయం జిల్లాకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు దంపతులకు ఘన స్వాగతం లభించింది. భారత ఉప రాష్ట్రపతి దంపతులు గురువారం ఉదయం 9.45 గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. జిల్లాకు విచ్చేసిన ఉప రాష్ట్రపతి దంపతులకు ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజు వాణిజ్య పన్నులశాఖ మంత్రి కె. నారాయణ స్వామి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తిరుపతి ఎం ఎల్ ఏ భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి,ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, రేణిగుంట తహశీల్దార్ శివ ప్రసాద్, తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి ఏర్పేడు లోని ఐ ఐ టి కళాశాల ఆవరణలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి బయల్దేరి వెళ్లారు.
భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు రేపటి తిరుపతి, తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ బుధవారం మీడియాకి తెలిపారు. ఉప రాష్ట్రపతి మార్చి 4 న తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా చెన్నై నుంచి వాయుసేన ప్రత్యేక విమానం ద్వారా బయల్దేరి ఉ. 9.50 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని చెప్పారు. అనంతరం ఉ. 10.15 గం. లకు తిరుపతి లోని ఐఐటి కళాశాల చేరుకుని అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. తర్వాత ఉ. 11.20 ని. లకు తిరుపతి లోని అమర ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసి.. అనంతరం మ. 12.15 గం.లకు అమర ఆసుపత్రి నుండి బయల్దేరి గల్లా రామ చంద్రనాయుడు గారి నివాసం చేరుకుంటారన్నారు. మళ్లీ సా. 4.15 గం.లకు బయలుదేరి సా. 5.15 గం.లకు తిరుమల పద్మావతి అతిథి గృహం నకు చేరుకుని రాత్రి బస చేస్తారని పేర్కొన్నారు. మరుసటి రోజున 5 వ తేదీ ఉదయం 5.30 గం.లకు శ్రీ వారిని దర్శించుకుని అనంతరం ఉ.8.30 ని.లకు తిరుమల నుంచి బయల్దేరి ఉ. 9.20గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ఉ. 9.25 గం. లకు వాయుసేన ప్రత్యేక విమానంలో సూరత్ బయల్దేరి వెళతారని కలెక్టర్ వివరించారు.
జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు అందుకుంటున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఖ్యాతి ఇప్పుడు ఖండాలు దాటింది. ఏకంగా ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారో శిఖరాగ్రానికి ఆయన ఖ్యాతి చేరింది. జిల్లాకు చెందిన రిత్విక శ్రీ అనే 9 ఏళ్ల బాలిక కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి పర్వతంపై జాతీయ జెండాతో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు ఉన్న ఫోటోను ప్రదర్శించిందన్న వార్త సామాజిక మధ్యమాలలో దావాలనంలా వ్యాపించింది. తాడిమర్రి మండలం, ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన కడపల శంకర్ కుమార్తె రిత్విక శ్రీ శుక్రవారం టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. అనంతరం పర్వత శిఖరంపై మాతృ దేశానికి, పర్వతారోహనకు ఆర్థిక సహాయాన్ని అందించిన కలెక్టరు గంధం చంద్రుడుకు కృతజ్ఞతలు తెలుపుకుంది. 9 ఏళ్లకే ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన రిత్వికపై కలెక్టర్ ప్రశంసల జల్లు కురిపించారు. కిలిమంజారో పర్వతంపై తన చిత్రాన్ని ప్రదర్శించడంపై సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఒక కలెక్టరుగా ప్రతిభ ఉన్న చిన్నారికి సాయం చేశానన్నారు. చిట్టితల్లి విజయంలో తనకు కూడా భాగం ఇవ్వడం రిత్విక గొప్పతనం అన్నారు. ప్రతిభ, పట్టుదల, వినయం కలగలిసిన మాణిక్యం రిత్విక అన్నారు. స్వతహాగా క్రికెట్ కోచ్ అయిన రిత్విక తండ్రి కడపల శంకర్ జిల్లా కలెక్టరుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పర్వతారోహణ చేయడం భారం అవుతుందని కలెక్టరు గారిని సంప్రదించిన వెంటనే ఆర్థిక సహాయం అందించారన్నారు. భారత దేశం నుంచి బయల్దేరినప్పటి నుంచి ఎప్పటికప్పుడు తమ పరిస్థితుల గురించి ఆరా తీసేవారన్నారు. టాంజానియా నుంచి స్వదేశానికి వచ్చిన అనంతరం కలెక్టరు గారిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటామన్నారు. రిత్విక శ్రీ కిలిమంజారో పర్వతారోహణకు ఆర్థిక సహాయం చేయాలని తండ్రి కడపల శంకర్ కోరడంతో ఈ నెల 1వ తేదీన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.2,98,835 లను కలెక్టర్ గంధం చంద్రుడు చిన్నారికి అందించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంకు ఢిల్లీకి చెందిన సంజయ్ పస్సి, శాలిని పస్సి అనే భక్తులు శుక్రవారం రూ. 10 కోట్ల విరాళం అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ మేరకు డిడిలను అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డికి అందజేశారు. రూ.9 కోట్లు శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్ట్ కు, రూ.కోటి సర్వశ్రేయస్సు ట్రస్ట్ కు అందించారు. ఈ సందర్భంగా దాత మీడియాతో మాట్లాడుతూ, స్వామివారికి చెందిన ఎస్వీబీసీ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూడటానికి అవకాశం ఏర్పటుడుతుందన్నారు. శ్రీవారి ఎస్వీబీసీ భక్తి ఛానల్ ను అన్ని దేశంలోని అన్ని భాషల్లోనూ ప్రసారం చేయడం ద్వారా శ్రీవారికి కార్యక్రమాలు మరింతగా భక్తులకు చేరువ అవుతాయన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు భక్తకోటిపై ఉండాలని, కరోనా వైరస్ పూర్తిగా సమసి పోవాలని స్వామిని వేడుకున్నట్టు దాత వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ అవార్డు సొంతం చేసుకుని వ్యవసాయ రంగంలో అనంతపురం జిల్లా మరోసారి సత్తా చాటింది. బుధవారం న్యూఢిల్లీ లోని పుసా ప్రాంతం పరిధిలోగల ఏపీ షిండే హాల్, ఎన్ ఏ ఎస్ సి కాంప్లెక్స్ లో నిర్వహించిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ నుంచి పీఎం కిసాన్ జాతీయ అవార్డును జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అందుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, అనంతపురం వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, ఏవో వంశీకృష్ణ లతో కలిసి జాతీయ అవార్డును జిల్లా కలెక్టర్ అందుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ అవార్డు అందుకోవడం పట్ల రైతుల కోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి దేశ వ్యాప్త గుర్తింపు దక్కినట్టయిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకుముందు అనంతపురం నుంచి న్యూఢిల్లీకి ఉద్యాన ఉత్పత్తులతో తరలించే కిసాన్ రైలు కార్యక్రమానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కిందని, ఇప్పుడు వ్యవసాయ రంగంలోనే పీఎం కిసాన్ జాతీయ అవార్డు జిల్లాకు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
పీఎం కిసాన్ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండవ వార్షికోత్సవంతో పాటు పథకం అమలులో ముందు వరుసలో ఉన్న జిల్లాలకు అవార్డులు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా పీఎం కిసాన్ లో లబ్ధిదారుల ఫిజికల్ వెరిఫికేషన్ విభాగంలో ముందుగా నిలిచిన జిల్లాకు జాతీయ అవార్డు వరించింది. పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారిలో 28,505 మంది రైతుల వెరైఫికేషన్ ను జిల్లా యంత్రాంగం పూర్తి చేయగా.. జాతీయ స్థాయిలో మరే జిల్లాలోనూ లేని విధంగా 99.60 శాతం రైతుల వెరిఫికేషన్ పూర్తి చేయడంతో జిల్లాకు జాతీయ అవార్డు వరించింది. దీంతో జిల్లా కీర్తి దేశ స్థాయిలో వినిపించింది.