1 ENS Live Breaking News

శ్రీ‌వారికి రూ.కోటి ప‌దార్థాల విరాళం..

తిరుమ‌ల శ్రీ‌వారికి గో వ్య‌వ‌సాయ ఆధారిత వంట ప‌దార్థాల‌తో సంపూర్ణ నైవేద్యం స‌మ‌ర్పించేందుకు వీలుగా దాదాపు ఒక కోటి రూపాయ‌లు విలువైన వంట దినుసులు బుధ‌వారం విరాళంగా అందాయి. టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు, మై హోమ్ గ్రూపు అధినేత  జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు ఈ మేర‌కు హైద‌రాబాద్‌లోని త్రిదండి చిన్న‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మం నుంచి ఈ వంట‌ప‌దార్థాల‌ను పంపారు. టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు  శివ‌కుమార్ ఈ వ‌స్తువుల‌ను తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ఎదుట ఆల‌య అధికారుల‌కు అంద‌జేశారు. వీటిలో 6200 కిలోల బియ్యం, 1500 కిలోల దేశీ ఆవునెయ్యి, 600 కిలోల బెల్లం, 17 కిలోల బాదాం, 315 కిలోల జీడిప‌ప్పు, 21 కిలోల కిస్‌మిస్‌, 85 కిలోల ఆవాలు, 18 కిలోల మెంతులు, 20 కిలోల ప‌సుపు, 25కిలోల ఇంగువ‌, 380 కిలోల పెస‌ర‌ప‌ప్పు, 200 కిలోల శ‌న‌గ ప‌ప్పు, 265 కిలోల మినుములు, 350 కిలోల చింత‌పండు, 50 కిలోల రాక్ సాల్ట్‌, 375 కిలోల నువ్వుల నూనె, 7 కిలోల నువ్వులు, 10 కిలోల శొంఠి ఉన్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి పోటు పేష్కార్ శ్రీ‌నివాసులు, ఆల‌య ఓఎస్‌డి పాల శేషాద్రి, ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతు విజ‌య‌రామ్‌, వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ కెఎస్ఎస్‌.అవ‌ధాని, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-06-30 13:45:55

పీవీ జాతి గర్వించదగ్గ రాజనీతిజ్ఞుడు..

పాములపర్తి వెంకట నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అని  ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శతజయంతి సందర్భంగా విశాఖలోని సర్క్యూట్ హౌస్ వద్ద ఆయన విగ్రహానికి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతదర్శిగా  పీవీని అభివర్ణించారు. ఆయన నాయకత్వం , దూరదృష్టి ద్వారా ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలోకి మరలించారని తెలిపారు. పీవీ మాటల్లో చమత్కారం, చేతల్లో నిర్వహణా సామర్థ్యం మరువలేనివని తెలిపారు. దేశంలో లైసెన్స్ రాజ్ ను రద్దు చేసిన ఘనత  పీవీ నరసింహారావుదన్న ఉపరాష్ట్రపతి, భారత ఆర్థిక సరళీకరణల నిర్మాతగా అభివర్ణించారు. ముఖ్యంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.వో)లోకి  భారతదేశ ప్రవేశానికి వీలు కల్పించినది ఆయనేనని అన్నారు.  ప్రపంచ యవనికపై దేశ ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించిన  పీవీ, ఎంతో క్లిష్టమైన సమయంలో దేశ పాలనా పగ్గాలను చేపట్టి, వ్యూహాత్మకంగా దేశాభివృద్ధిని గాడిలో పెట్టారని తెలిపారు.  పీవీ భాషాభిమానాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, శ్రీ విశ్వనాథ వారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫాణ్’ గా హిందీలోకి అనువదించిన విషయాన్ని ప్రస్తావించారు. అంతేగాక ప్రసిద్ధ మరాఠీ నవల ‘పాన్ లక్షత్ కోన్ ఘేతో’ని ‘అబల జీవితం’ పేరిట తెలుగులోకి అనువదించారని తెలిపారు. బహుభాషా కోవిదుడైన  పీవీ మాతృభాషలో ప్రాథమిక విద్య సాగాలని ఆకాంక్షించారన్న ఉపరాష్ట్రపతి, హైస్కూల్ స్థాయి వరకూ బోధనా మాధ్యమం మాతృభాషగా ఉండాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

‘రాజకీయ వ్యవస్థ కంటే దేశమే ఉన్నతమైనదని నమ్మిన దేశభక్తుడైన రాజనీతిజ్ఞుడు’అంటూ  పీవీ గురించి మాజీ రాష్ట్రపతి  కలాం పలుకులను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఆయన ఈ నేలపై ఘనమైన వారసత్వాన్ని విడిచి వెళ్ళారని, యువతరం వారి నుంచి ప్రేరణ పొంది, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.  పీవీ నరసింహారావు లాంటి గొప్ప నాయకుడి సేవలకు తగిన గుర్తింపు, గౌరవం లభించలేదన్న ఉపరాష్ట్రపతి, ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, దేశనిర్మాణంలో  పీవీ కృషిని ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏ దేశం కూడా తన సంస్కృతి, వారసత్వం మరియు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుల అపారమైన సేవలను మరచి ముందుకు సాగలేదన్న ఆయన,  నరసింహారావు లాంటి మహనీయుల జీవితాలను, బోధనలను యువతరానికి తెలియజేయాలని పేర్కొన్నారు.

Visakhapatnam

2021-06-28 09:11:13

తెలుగుభాష పరిరక్షణ ఉద్యమంలా సాగాలి..

తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో ఆదివారం విశాఖ నుంచి ముఖ్యఅతిధిగా అంతర్జాల వేదిక ద్వారా ప్రసంగించిన ఆయన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగు వారంతా సంఘటితం కావలసిన అవసరం ఉందని తెలిపారు. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏక తాటి మీదకు తీసుకు రావాలన్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆశయాన్ని అభినందించారు. మనుషులనే గాక తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉందన్న ఉపరాష్ట్రపతి, మనల్ని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే, రెండో గొలుసు భాష-సంస్కృతులని తెలిపారు. తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగు వారు తమ సంస్కతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందించేందుకు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్న ఆయన,  మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు లాంటి సంప్రదాయాలను పునరుజ్జీవింపచేసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మనం మన భాషను విస్మరిస్తే మన సంస్కృతి, సాహిత్యం, ఆహార వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు అన్ని మన ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందన్న ఉపరాష్ట్రపతి, ఇందు కోసం తెలుగు వారందరూ తెలుగు భాషా పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. మన మాతృభాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడమే గాక, ఇతరుల భాషా సంస్కృతులను తప్పని సరిగా గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రాథమిక విద్య మాతృభాషలో సాగడం వల్ల విద్యార్థులు నేర్చుకోవడం సులభతరం అవుతుందన్న ఆయన, నూతన విద్యా విధానం మాతృభాషకు పెద్ద పీటల వేయడం ఆనందించదగిన అంశమని తెలిపారు. మాతృభాషలో చదివితే జీవితంలో ఎదగలేమనే తప్పుడు అపోహ సమాజంలో నాటుకుపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రస్తుత భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలా అందరూ మాతృభాషలో విద్యను అభ్యసించి ఎదిగిన వారేనని గుర్తు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల వెలుపల సుమారు వెయ్యికి పైగా సంస్థలు భాష, సంస్కృతుల పరిరక్షణకు పాటు పడుతున్నాయన్న ఉపరాష్ట్రపతి, ఈ సంస్థలన్నీ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ద్వారా ఏకతాటి మీదకు వచ్చి అనేక సంగీత, సాహిత్య, భాషాభివృద్ధి కార్యక్రమాలతో, తెలుగు సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తున్న వారి చొరవను అభినందించారు. తెలుగు రాష్ట్రాల వెలుపల తెలుగు సంస్కృతిని తమ నివాస ప్రాంతాల్లో విస్తరించేందుకు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య చేస్తున్న కృషి గురించి తెలుసుకుని ఆనందించానన్న ఆయన,  వివిధ రాష్ట్రాల్లో తెలుగు భాషను ఐచ్చిక విషయంగా ప్రోత్సహించడం కోసం వారు చేస్తున్న కృషి ఉన్నతమైనదని తెలిపారు.

భాషాభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషి మాత్రమే చాలదన్న ఉపరాష్ట్రపతి, భాషా పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. స్వచ్ఛభారత్ మొదలుకుని వ్యాక్సిన్ వరకూ ప్రజా ఉద్యమంగా మారి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్న ఆయన, తెలుగు భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చకపోతే సంరక్షించుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఇందు కోసం పరభాషా వ్యామోహం నుంచి బయట పడడంతో పాటు తెలుగు వారందరూ తెలుగులోనే మాట్లాడం, ప్రభుత్వాలు మాతృభాషను ప్రోత్సహించేలా ఒత్తిడి తీసుకురావడం అవసరమని తెలిపారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు వెలుపల ఉన్న తెలుగు వారు తమ తమ రాష్ట్రాల్లో భాష-సంస్కృతుల గొప్పతనాన్ని చాటుకునే దిశగా ఆయా రాష్ట్రాల భాషల్లోకి తెలుగు సాహిత్య అనువాదం కోసం చొరవ తీసుకోవాలని సూచించారు. ఇతర భాషా సాహిత్యాలు మన తెలుగులోకి అనువాదమైనంతగా, తెలుగు సాహిత్యం అనువాదం కావడం లేదని, ఇందు కోసం ప్రభుత్వాలతో పాటు తెలుగు సంస్థలు కూడా చొరవ తీసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సహా పలు తెలుగు సంస్థలు తమ సమావేశాలను అంతర్జాల వేదిక ద్వారా నిర్వహిస్తుండడం అభినందనీయమన్న ఉపరాష్ట్రపతి, ఇదే స్ఫూర్తితో భాషను, సాంకేతికతతో అనుసంధానించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  బండారు దత్తాత్రేయ, బెంగాల్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. శశి పంజా, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి డా. మండలి బుద్ధ ప్రసాద్, ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డా. సి.ఎం.కె.రెడ్డి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సుందరరావు, కార్యదర్శి  పి.వి.పి.సి ప్రసాద్ తదితరులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-27 06:53:07

నౌకాయాన రంగంలో అగ్రగామి కావాలి..

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నౌకాయాన రంగానిది కీలక పాత్ర అని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం భారత నౌకాయాన రంగాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.  విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతికి శనివారం  పోర్టు చైర్మన్  కె.రామ్మోహన్ రావు ఇతర అధికారులు కలిసి పోర్టు పురోగతికి సంబంధించిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. 103 ఎకరాల్లో రూ.406 కోట్లతో ఫ్రీ ట్రేడ్ అండ్ వేర్‌హౌజింగ్ జోన్ (ఎఫ్‌టీడబ్ల్యూజెడ్) ఏర్పాటు చేయనున్న విషయాన్ని ఉపరాష్ట్రపతికి ట్రస్టు చైర్మన్ వివరించారు. దీంతోపాటు ఇతర అంశాల్లోనూ ట్రస్టు సాధిస్తున్న పురోగతిని ఉపరాష్ట్రపతి అభినందించారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచ వ్యూహాత్మక నౌకాయాన మార్గంలోనే భారతదేశం ఉండటం, దీనికి తోడు మన దేశానికి 7,517 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉండటం, 200కు పైగా భారీ, చిన్న తరహా నౌకాశ్రయాలుండటం విశేషమని పేర్కొన్నారు. ఈ పోర్టులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు.
భారతదేశం ప్రాచీన కాలంలోనూ బలమైన నౌకాయాన వ్యవస్థను కలిగి ఉండేదన్న విషయాన్ని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి, చోళ రాజులు, కళింగ రాజులు సముద్రాలపై చేసిన వ్యాపారం మనకు మార్గదర్శనం చేస్తోందన్నారు. ఆ స్ఫూర్తితో ఈ రంగానికి పునర్వైభవం తీసుకురావాలని ఆయన సూచించారు. భారతదేశంలో నౌకాయాన మౌలిక వసతుల గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి భారతదేశంలో పోర్టుల ఆధారిత అభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాగర్‌మాల’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంతో 504 ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. దీంతోపాటుగా రూ.3.57లక్షల కోట్ల మౌలికవసతులు కూడా సమకూరుతున్నాయన్నారు.
2015-16 నుంచి 2019-20 వరకు కార్గో రవాణా విషయంలో విశాఖపట్టణం సాధించిన ప్రగతిని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా కాస్త ఇబ్బందులు తలెత్తాయని.. త్వరలోనే అన్నీ సర్దుకుని మళ్లీ విశాఖపట్టణం పోర్టు ప్రగతిపథాన పయనిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కరోనా అనంతర కాలంలో పోర్టులు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించనున్నాయని ఆయన పేర్కొన్నారు. 

కరోనా మహమ్మారితోపాటు టౌక్టే, యాస్ తుపానుల సమయంలో ప్రజలకు అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరా చేయడంలో పోర్టులు చేసిన కృషిని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. విశాఖపట్టణం పోర్టులో సుస్థిరాభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి మౌలికవసతుల కల్పన, పోర్టు ఆధారిత అభివృద్ధి, డిజిటైజేషన్ వ్యవస్థతోపాటు  వివిధ పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో ఈ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పోర్టు ట్రస్టు చైర్మన్  రామ మోహన్ రావు, డిప్యూటీ చైర్మన్  దుర్గేష్ కుమార్ దూబే, సి.వి.వో.  ప్రదీప్ కుమార్ సహా పలు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-26 12:07:56

భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం..

విశాఖ నగర పర్యటనకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కు శపివానం విమానాశ్రయంలో  ఘనంగా స్వాగతం లభించింది.  ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం గం. 11: 45 ని. లకు విశాఖ చేరుకున్నారు.  ఉపరాష్ట్రపతి కి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,  నౌకాదళ అధికారి  వైస్ అడ్మిరల్ ఏ.బి. సింగ్, విశాఖ మేయరు జి.వి.హరి కుమారి, విశాఖ పోర్టు చైర్మన్ కె. రామ్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎమ్ఎల్సీ  పి.వి.మాధవ్, తదితరులు స్వాగతం పలికారు.  తరువాత  ఆయన నేరుగా  విశాఖ పోర్ట్ ట్రస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్లారు.  కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-26 07:24:25

ఎస్వీబీసీ ట్రస్టుకి రూ. కోటి విరాళం..

తిరుమల లోని ఎస్వీబీసీ ట్రస్టుకి శనివారం కోటి రూపాయల భారీ విరాళం అందింది. కర్ణాటకు చెందిన కురుగోడు మాజీ ఎమ్మెల్యే ఎన్.సూర్యనారాయణ రెడ్డి ఈ మొత్తం యొక్క చెక్కును అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డికి కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, శ్రీవారి సేవలను దేశంలోని ప్రముఖ భాషల్లో ప్రసారాలు అందించడం ద్వారా స్వామిసేవలు అందరికీ చేరువ అవుతాయన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-06-26 05:47:57

30 కోట్ల టీకా మైలురాయిని దాటిన భారత్..

కోవిడ్ టీకాల పంపిణీలో భారత్ మరో మైలరాయి దాటింది.  నిన్నటికి 30 కోట్ల డోసుల టీకాలు పూర్తి చేసుకుంది. ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 40,45,516  శిబిరాల ద్వారా మొత్తం  30,16,26,028 టీకా డోసుల పంపిణీ జరగగా  గత 24 గంటలలో 64,89,599 టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  54,069 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ విధంగా రోజుకు లక్ష లోపు కేసులు రావటం గత 17 రోజులుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల్లో అధికారుల ఉమ్మడి కృషి వలనే ఇంత పెద్ద స్థాయిలో ఫలితాలు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది.. మరో వైపు కరోనా చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 6,27,057 మంది కాగా.. చికిత్సలో ఉన్నవారు నికరంగా 16,137 మంది గత 24 గంటల్లోనే తగ్గగా చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 2.08% మాత్రమే కావటం గమనార్హం.  కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 421 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 24 గంటలలో  68,885 మంది కోలుకున్నారు.  అంతకు ముందురోజుకంటే 14,816 మంది అదనంగా కోలుకున్నారు.  ఇప్పటివరకూ కోవిడ్ బారిని పడి కోలుకున్నవారు 2,90,63,740 మంది కాగా గత 24 గంటలలో 68,885 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి శాతం 96.61% కు పెరిగింది. కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 18,59,469 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 39.78 కోట్లకు పైగా (39,78,32,667) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  3.04% కాగా రోజువారీ పాజిటివిటీ  2.91%  అయింది. వరుసగా 17 రోజులుగా ఇది 5% లోపే ఉండటం గమనార్హం..

New Delhi

2021-06-24 17:05:30

VMRDA బకాయి వడ్డీతో రీఫండ్‌ చేయండి..

విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ –గతంలో వుడాగా వ్యవహరించేవారు) ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 12ఏ కింద చారిటబుల్‌ సంస్థగా రిజిస్టర్‌ అయింది. గతంలో ఆదాయ పన్ను శాఖ ఈ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి 571 కోట్ల రూపాయలు ఐటీ బకాయిల కింద చెల్లించాల్సిందిగా డిమాండ్‌ నోట్‌ పంపించడంతో వుడా 219 కోట్ల రూపాయలు చెల్లించి దీనిని రిజిస్ట్రేషన్‌ రద్దును సవాలు చేస్తూ ఐటీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత ట్రైబ్యునల్‌ వీఎంఆర్‌డీఏకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఐటీ చట్టంలోని సెక్షన్‌ 12ఏ ప్రకారం చారిటబుల్‌ సంస్థగానే పరిగణిస్తూ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించాలని కూడా ట్రైబ్యునల్‌ 2020లో ఆదాయ పన్ను శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు  విజయసాయి రెడ్డి ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్‌కు వివరించారు. అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ తీర్పు నేపథ్యంలో గతంలో ఆదాయ పన్ను కింద వుడా చెల్లించిన 219 కోట్ల రూపాయలను వడ్డీతో సహా వీఎంఆర్‌డీఏకు రీఫండ్‌ చేసేలా తగిన ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఆయన మంత్రిని కోరారు. ఈ రెండు విజ్ఞప్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి ఆయనకు హామీ ఇచ్చారు.

New Delhi

2021-06-24 15:33:51

టీటీడీకి జీఎస్టీ మినహాయింపు ఇవ్వండి..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గతంలో వుడా)ని చారిటబుల్‌ సంస్థగా పరిగణిస్తూ గతంలో ఆదాయ పన్ను కింద వుడా చెల్లించిన 219 కోట్ల రూపాయలను వడ్డీతో సహా రీఫండ్ చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత  వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గురువారం ఆయన ఆర్థిక మంత్రితో జరిపిన భేటీలో జీఎస్టీ కారణంగా టీటీడీ, ఆదాయ పన్ను కారణంగా వుడా ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వేర్వేరుగా రెండు విజ్ఞాపన పత్రాలను మంత్రికి సమర్పించారు. హుండీ ఆదాయం, ప్రసాదాల విక్రయం ద్వారా లభించే ఆదాయంపై టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. అయితే కాటేజీలు, వసతి గృహాలపై భక్తుల నుంచి వసూలు చేసే అద్దెలు, క్యాంటీన్‌ ఆదాయం, హుండీ ద్వారా స్వామి వారికి భక్తులు సమర్పించే కానుకల వేలం ద్వారా లభించే ఆదాయం, క్యాలెండర్లు, డైరీల అమ్మకాలపై వచ్చే అదాయం ఇతర రాష్ట్రాలలోని టీటీడీకి చెందిన వివిధ శాఖలు, అనుబంధ ట్రస్టులు సరఫరా చేసే వివిధ వస్తువులపై యధావిధిగా జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు శ్రీ విజయసాయి రెడ్డి ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఇలా వసూలు చేసే జీఎస్టీ ఏడాదికి 120 కోట్ల రూపాయల పైబడే ఉంటోందని ఆయన వివరించారు. అందువలన ఈ సేవలు, వస్తు విక్రయాలను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే టీటీడీకి చెందిన ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించవలసిందిగా ఆయన మంత్రిని కోరారు. టీటీడీకి ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను సత్వరం పునరుద్ధరించడం వలన ఎన్‌ఆర్‌ఐ భక్తులు శ్రీవారికి సమర్పించే విరాళాలు మళ్ళీ పుంజుకుంటాయని తద్వారా దేశానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని ఆయన మంత్రికి వివరించారు.

New Delhi

2021-06-24 15:28:00

ఒలింపిక్స్ లో పథకాలు సాధించాలి..

ఒలింపిక్ క్రీడోత్సవాలలో భార‌త‌దేశాని కి ప్రాతినిధ్యం వ‌హించిన వారంద‌రిని చూసుకొని దేశ ప్ర‌జ‌లు గ‌ర్వప‌డుతున్నారని భారత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒలింపిక్ క్రీడల దినోత్సవం సంద‌ర్భంగా టోక్యో ఒలింపిక్ క్రీడల లో పాలుపంచుకోనున్న భార‌తీయ క్రీడాకారుల కు, భారతీయ క్రీడాకారిణుల కు అంతా మంచే జ‌ర‌గాలని ఆయ‌న అభిల‌షించారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఒలింపిక్స్ లో  భార‌త‌దేశాని కి ప్రాతినిధ్యం వ‌హించిన అంద‌రిని నేను అభినందిస్తున్నాను. టోక్యోలో జరగనున్న క్రీడల్లో మ‌న దేశాని కి చెందిన  క్రీడాకారులు అందులో అత్యుత్త‌మ ఫ‌లితాల‌ ను సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.

New Delhi

2021-06-23 15:29:13

నిధులు తక్షణమే విడుదల చేయండి..

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. మంగళవారం  సాయంత్రం న్యూఢిల్లీలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఆమెతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ ఎస్ రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావ్నా సక్సేనా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ కోవిడ్ తత్కారణంగా చేపట్టిన లాక్డౌన్ వల్ల పేదలు పనికి పోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.   పేద, మధ్యతరగతి వర్గాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని పేర్కొన్నారు.   వైద్యం పై అత్యవసరంగా అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.  కోవిడ్ వల్ల రాష్ట్రం ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కుంటున్నా రేషన్, మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటుగా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా కోవిడ్, బ్లాక్ ఫంగస్ బాధితులకు ఉచిత వైద్యం అందిస్తోందన్నారు.  బ్లాక్ ఫంగస్ బాధితులకు ఒక్కరికి 5-7 లక్షలు ఖర్చవుతోందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు.  ఈ బాధ్యతలను సమర్థవంతంగా  నిర్వర్తించడానికి, ప్రజాభివృద్ధికి వనరులు చాలా ముఖ్యమని వివరించారు.  పేద, మద్యతరగతి వర్గాలను ఆదుకుని అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందడుగు వేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.   

New Delhi

2021-06-22 15:57:05

పార్లమెంటు బిసీ కమిటీలో బెల్లాన..

 వెనుకబడిన తరగతుల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ లో విజయనగరం ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ కు చోటు దక్కింది. పార్లమెంట్ సభ్యుడు  రాజేష్ వర్మ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ పదవీకాలం ఏడాది పాటు వుంటుంది. 20221-22 సంవత్సరానికి సంబంధించి 20 మంది లోక్ సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో బి.సి. సంక్షేమ పార్లమెంటరీ కమిటీ ని ఏర్పాటు చేస్తూ లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన నియామకం పట్ల విజయనగరం జిల్లా  వైఎస్సార్సీపీ బిసి విభాగం హర్షం వ్యక్తం చేసింది..

Vizianagaram

2021-06-22 12:46:24

నేడే రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల..

తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జులై నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 22న మంగళవారం ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. రోజుకు 5 వేల చొప్పున టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు. కాగా, జులై నెలకు సంబంధించిన గదుల కోటాను జూన్ 23న బుధవారం ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.  భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.

Tirumala

2021-06-22 02:01:15

ఎస్వీబీసీ ట్రస్టుకి రూ.20లక్షలు విరాళం..

తిరుమలలోని శ్రీవారికి చెందిని ఎస్వీబీసీకి సోమవారం రూ.20లక్షలు విరాళం అందింది. బెంగళూరుకి చెందిన హేమనాథ్ గౌడ ఈ విరాళ చెక్కును  అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డికి కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, ఎస్వీబీసీ ద్వారా భక్తులకు శ్రీవారి సేవలు ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలుగుతుందన్నారు. భారతదేశంలోని అన్ని భాషల్లోనూ స్వామిప్రసారాలు అందజేస్తే శ్రీవారిసేవలు అందరికీ చేరువ అవుతాయని అదనపు ఏఈఓను కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-06-21 14:04:10

ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ. కోటి విరాళం

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కి చెందిన పరమేషు బయోటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఎండి  తెటాలి ఉపేంద్రరెడ్డి శుక్రవారం టిటిడి శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులువైవి.సుబ్బారెడ్డికి కుటుంబ సమేతంగా కలిసి వెళ్లి అందజేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరంచారు.

Tirumala

2021-06-18 12:10:32