రాష్ట్రంలో అవసరమైన మేర ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారన్నారు. గడిచిన 24 గంటల్లో 71,758 శాంపిళ్లను పరీక్షించగా, 2,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 31 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కరోనా పాజిటివిటీ రేటు 3.1 శాతంగా నమోదైందన్నారు. కడప, కర్నూల్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి మరణాలు చోటు చేసుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 322 ఆసుపత్రుల్లో కొవిడ్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారన్నారు. 322 ఆసుపత్రుల్లో 2,786 ఐసీయూ బెడ్లు, 14,545 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం కొవిడ్ కేర్ సెంటర్లలో 5,311 మంది చికిత్స పొందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం...ఏపీకి రోజువారీగా ఆక్సిజన్ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తుండగా, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో తక్కువ మొత్తం ఆక్సిజన్ ను డ్రా చేస్తున్నామన్నారు. ఈ నెల 24న 196 మెట్రిక్ టన్నులు, 25న 169 టన్నులు, 27న 170 టన్నుల ఆక్సిజన్ డ్రా చేశామన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బ్రహ్మాండంగా అందుబాటులో ఉందన్నారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల పేషంట్లు మృతి చెందారని వార్తలు వచ్చాయని, వాస్తవాలను సంబంధిత జిల్లా కలెక్టర్ తెలిపారని తెలిపారు. అవరమైన ఆక్సిజన్ అందుబాటులో ఉన్నా తప్పుడు వార్తలతో ప్రజల, అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదన్నారు. అలా చేసిన వారిపై చట్టపరంగా సంబంధిత జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం నిర్వహించే సమీక్షా సమావేశాలపై అవాస్తవాలు ప్రచురించడం తగదన్నారు.
రాష్ట్రంలో 35 బ్లాక్ ఫంగస్ కేసులు..
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35 బ్లాక్ ఫంగస్ నమోదయ్యాయన్నారు. కొవిడ్ కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయన్నారు.. ఇప్పటి వరకూ 3,364 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 1,418 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 1,184 మందికి వైద్యులు సర్జరీ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ నుంచి 63,395 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రాగా, ప్రస్తుతం 9644 అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే వారం రోజుల్లో మరో 15 వేల ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రానున్నాయన్నారు. 49,250 పొసకొనజోల్ ఇంజక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేయగా, ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 32,197 అందుబాటులో ఉన్నాయన్నారు. 1,39,980 పొసకొనజోల్ మాత్రలు కొనుగోలు చేయగా, ప్రస్తుతం అన్ని జిల్లాల్లో 51,792 అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పొసకొనజోల్ మాత్రలు, ఇంజక్షన్ల కొరత లేదన్నారు.
5,515 సచివాలయాల్లో జీరో కేసులు...
ప్రస్తుతం రాష్ట్రంలో 42,252 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 5,515 గ్రామ, వార్డు సచివాయాల్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదన్నారు. 3,110 సచివాలయాల్లో ఒకే కేసు, 1,891 సచివాలయాల్లో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. 12,545 సచివాలయాల్లో సున్నా నుంచి 5 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ఒక సచివాలయంలో 50 కేసులు, మూడు సచివాలయాల్లో 40 నుంచి 50 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 690 సచివాలయాల్లో పది కంటే ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయన్నారు. ఈ సచివాలయాలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారన్నారు. మండలాల వారీగా చూస్తే... 105 మండలాల్లో 10 లోపల యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. మండలాలు, సచివాలయాల వారీగా చూసినా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. వారంతపు డేటాను గమనిస్తే ఎనిమిది జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదైందన్నారు.