1 ENS Live Breaking News

ఏప్రిల్ 15నుంచి జూన్14 వరకూ చేపలవేట నిషేధం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రాదేశిక సముద్ర జలాలలో చేపలవేట చేసే మెకనైజడ్, మోటారు బోట్లు ద్వారా నిర్వహించే అన్నిరకాల చేపల వేటను  ఏప్రిల్ 15నుంచి జూన్ 14వరకు 61 రోజులు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ ఆర్ టి సంఖ్య  76ను జారీ చేసిందని విజయనగరం జిల్లా మ త్స్యశాఖ  ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడా రు. వివిధ చేపలు, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కాలములో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్స హించే కార్యక్రమంలో భాగంగా ఈ నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. తద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరతను సాధించవ చ్చునని ఆమె వివరించారు. ఉత్తర్వులు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా  డిడి నిర్మలకుమారి హెచ్చరించారు. మత్స్య శాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, నేవీ అధికారులతో గస్తీ ఏర్పాటు చేశామన్నారు.

Vizianagaram

2023-04-11 12:44:31

రోజుకి 200 మందికి కోవిడ్ పరీక్షలు చేయండి..

విశాఖజిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 50 మందికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఈ సంఖ్యను సోమవారం నుంచి 200కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జ్వరం, దగ్గు, తలనొప్పి లక్షణాలు ఉంటే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వర రావు తెలిపారు. ఈ మేరకు అన్ని పీహెచ్సీల వైద్యాధికారులకు సమాచారం అందించారు.  మరో వైపు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు సంబం ధించి కూడా బ్లీచింగ్ చైన్ ఎప్పటి కప్పుడు ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించా లని, బయటకు వెళ్లేటపుడు, తిరిగి ఇంటికి వచ్చిన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోవాలని, నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని సూచిస్తున్నారు. ఎక్కువ మంది ఉండే చోటకు వెళ్లడం శ్రేయస్కరం కాదంటున్నారు.

2023-04-10 14:19:56

సీతంపేటలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ

పార్వతీపురం మన్యం జిల్లా  సీతంపేటలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు జరగనున్నాయని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లను ఐటీడీఏ పీవో  డాక్టర్ నవ్య, టీటీడీ అధికారులతో  కలసి సోమవారం ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ టీటీడీ స్వామివారి ఆలయాలు నిర్మిస్తోందని  తెలిపారు. ఇందులో భాగంగా గిరిజన ప్రాంతమైన సీతంపేటలో శ్రీవారి ఆలయాన్ని చక్కగా నిర్మించినట్లు చెప్పారు. మే 4వ తేదీ నుంచి ఇక్కడ భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభిస్తామన్నారు. ఆలయ సమీపంలోని కల్యాణ మండపాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పరిసర ప్రాంతాల భక్తులు  విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

      ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. మహాసంప్రోక్షణ అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాలని, కల్యాణ మండపాన్ని స్థానిక గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
     కార్యక్రమానికి వచ్చే అర్చకులు,ఇతర అధికారులు,సిబ్బంది, శ్రీవారి సేవకుల వసతి కోసం ఐటి డి ఎ అతిథి గృహం, పాఠశాలలు పరిశీలించారు. ఆతరువాత మన్యం జిల్లా రాజాం లోని శ్రీవారి ఆలయాన్ని జేఈవో ఇతర అధికారులు సందర్శించారు.  టీటీడీ చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో గుణభూషణ్ రెడ్డి, ఎస్ ఈ (విద్యుత్ ) వెంకటేశ్వర్లు , విజివో మనోహర్, గిరిజన కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ సంధ్యా రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Seethampeta

2023-04-10 13:02:48

శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

టీటీడీకి చెందిన నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, 3న అంకురార్పణం నిర్వహిస్తారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నా యి. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. ఈ మేరకు టిటిడి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది.

04-05-2023 - ధ్వజారోహణం -   పెద్దశేష వాహనం

05-05-2023- చిన్నశేష వాహనం - హంస వాహనం

06-05-2023- సింహ వాహనం - ముత్యపుపందిరి వాహనం

07-05-2023 - కల్పవృక్ష వాహనం  సర్వభూపాల వాహనం

08-05-2023 - మోహినీ అవతారం - గరుడ వాహనం

09-05-2023 - హనుమంత వాహనం - గజ వాహనం

10-05-2023 - సూర్యప్రభ వాహనం  - చంద్రప్రభ వాహనం

11-05-2023 - రథోత్సవం, ఆర్జితకల్యాణోత్సవం - అశ్వవాహనం

12-05-2023 - చక్రస్నానం - ధ్వజావరోహణం.

Nagalapuram

2023-04-10 11:46:25

కోవిడ్ ను ఎదుర్కొనేందుకు 100పడకలతో విమ్స్ సిద్ధం

కోవిడ్ Xbb1.16 భారత దేశంలో కూడా  ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి, రెండో వేవ్ లలో డెడికేటెడ్ కోవిడ్ ఆసుపత్రిగా నిలిచిన విమ్స్ ను 100 పడకలతో సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన మాక్ డ్రిల్ ను విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ ను విజయవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటు న్నామన్నారు. అందులో భాగంగా కోవిడ్ రోగులకు అందించాల్సిన మందులు, ఆక్సిజన్ సరఫరాల ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తుగా నిల్వ చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం 100 పడకలను కేటాయించడం జరిగిందని అవసరం బట్టి వాటి సంఖ్యను 600 పడకల వరకు పెంచుకుంటూ వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 200 ఐసీయూ పడకలకు అందుబాటులోకి తీసుకునిరాగల సామర్థ్యం విమ్స్ ఆస్పత్రికి ఉందన్నారు. 

విమ్స్ లో అందుబాటులో ఉన్న రెండు ఆక్సిజన్ ట్యాంకులు, రెండు ఆక్సిజన్ ప్లాంట్లు పరిశీలించి పని తీరును గమనించడం జరిగిందన్నా రు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. కోవిడ్ ను ఎదుర్కొన్నందుకు ఎవరు ఎవరు ఎటువంటి విధులు నిర్వర్తించాలి అనేది కేటాయించడం జరిగిందని అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో రోగులకు ఉత్త మ వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  విమ్స్ ఆస్పత్రి ప్రస్తుతం సాధారణ రోగులకు ఉత్తమ వైద్యం అందించడంలో నిమగ్న మై ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేకంగా ఫీవర్ ఒపీను ఏర్పాటు చేయటం జరిగింది అన్నారు.  అక్కడే రోగులకు పరీక్షించి కరోనా పాజిటివ్ అయితే కోవిడ్ వార్డుకు సాధారణ జ్వరం అయితే సాధారణ వార్డుకు తరలిం చడం జరుగుతుందన్నారు.

Visakhapatnam

2023-04-10 11:17:07

వైభవంగా శ్రీ సీతారాముల స్వామివారి కల్యాణం

చంద్రగిరి  శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం శ్రీ‌ సీతారాముల కల్యాణం నేత్ర‌ప‌ర్వంగా  జరిగింది.    ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల త‌లంబ్రాల స‌మ‌ర్ప‌ణ‌, విశేష నివేద‌న‌, మాల‌మార్పిడి, అక్ష‌తారోహ‌ణ‌, హార‌తి, చ‌తుర్వేద పారాయ‌ణం, య‌జ‌మానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగ‌ణంలో ఊరేగింపు నిర్వహించారు.

   అనంతరం సాయంత్రం 6:30 గంటలకు శ్రీ కోదండరామస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించారు.  ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  దేవేంద్ర బాబు, ఏఈవో పార్థసారథి,  సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు టెంపుల్ ఇన్స్పెక్టర్  గోపాలకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Chandragiri

2023-04-05 15:43:09

డా|| బాబు జగ్జీవన్‌రామ్ అడుగుజాడ‌ల్లో న‌డ‌వాలి

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దేశానికి ఉప ప్రధానిగా ఎదిగిన డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్ సామాజిక అంత‌రాల‌ను తొల‌గించేందుకు ఎంత‌ గానో కృషి చేశార‌ని, వారి అడుగుజాడ‌ల్లో అంద‌రం న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని హైదరాబాద్ లోని ఉస్మానియా వర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ లా డీన్ ఆచార్య గాలి వినోద్ కుమార్ కోరారు. జ‌గ్జీవన్‌రామ్ 116వ జయంతి వేడుకలను తిరుపతిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆచార్య గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ 52 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో త‌ర‌త‌మ భేదాలు లేకుం డా అంద‌రికీ విశేషంగా సేవ‌లందించిన అజాత‌శ‌త్రువు శ్రీ జ‌గ్జీవ‌న్‌రామ్ అన్నారు. పాఠ‌శాల వ‌య‌సులోనే రెండు కుండ‌ల విధానాన్ని వ్య‌తిరే కించార‌ని, రిజ‌ర్వేష‌న్‌లో వ‌చ్చే స్కాల‌ర్‌షిప్ కాద‌ని మెరిట్ స్కాల‌ర్‌షిప్ పొందిన మేధావి అని కొనియాడారు. కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రిగా దేశం లో హ‌రిత విప్ల‌వం తీసుకొచ్చి దిగుబ‌డులు పెంచిన ఘ‌నత వారికే ద‌క్కుతుంద‌న్నారు.
  

       అంతకుముందు టిటిడి అధికారులు శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా విశేష సేవ‌లందించిన ప‌లువురికి జ్ఞాపిక‌లు, వ్యాస‌ర‌చ‌న‌, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. కార్య‌క్ర‌మం మొద‌ట్లో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కళాకారుడు డా.ఎం.భిక్షు నాయక్ బృందం  ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ లోని ప్రభుత్వ సిటి కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డా.కోయి కోటేశ్వరరావు, తిరుపతి క్రైమ్ సిఐ  పి.సుమతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు  స్నేహలత, ఆనంద‌రాజు, జగదీశ్వరి, ఇఇ మ‌నోహ‌రం ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.  

Tirupati

2023-04-05 15:36:03

అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లు పరిశీలన..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై బుధవారం జిల్లా  అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. విశాఖ జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ,నగర పోలీస్ కమిషనర్  సిహెచ్ శ్రీకాంత్, .జాయింట్ కలెక్టర్ విశ్వనాధ్, డీసీపీలు సునీల్ సుమిత్. ఆనంద్ రెడ్డి.. ఇతర పోలీసు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు సింహాచలం ఈవో వి త్రినాధరావు తో కలిసి చందనోత్సవ ఏర్పాట్లను పలు ప్రాంతాల్లో పరిశీలించారు. తొలుత వీరంతా కళ్యాణ వేదిక వద్దకు చేరుకొని  క్యూలైన్ల మార్గాలు,, భక్తులు వాహనాలు పార్కింగ్ ఇతర సదుపాయాలు కోసం ఉత్సవ మాస్టర్ ప్లాన్ ను నిషితముగా పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఉచిత దర్శనం 300, 1000, 1500 క్యూ లైన్లు ఏ విధంగా వేగంగా ముందుకు సాగుతాయని  ఈఓ త్రినాధ్ రావు ను, ఈఈ ను అడిగి తెలుసుకున్నారు. 

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు వీరికి వివిధ క్యూలైన్లు చూపించారు. గత ఏడాది ఏర్పాటుచేసిన క్యూలైన్ లకు ఈ ఏడాది ఏర్పాటుచేసిన వాటికి వ్యత్యాసం అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లు వేగవంతంగా  సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని దేవస్ధానం అధికారులు కి కలక్టర్ సూచించారు. భక్తులు ఎక్కువసేపు వేచి చూడకుండా వేగవంతంగా సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా చూడాలని కోరారు. అనంతరం ఆలయ ప్రాంగణం తో పాటు వివిధ మార్గాల రూట్లను పరిశీలించారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీ , ప్రోటోకాల్  ప్రముఖులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి ను దర్శించుకోవాలని  అందుకు తగ్గ ఏర్పాట్లు చేద్దామని అధికారులు చర్చించారు.అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ సంయుక్తంగా ఏఏ మార్గాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కాసేపు మాట్లాడుకున్నారు. అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత ఏడాది నిజరూప దర్శనం ఉత్సవం పూర్తి స్థాయి లో విజయవంతం  ఐయ్యిందన్నరు.

 ఉత్సవం ప్రారంభ దశలో వర్షం కురవడము వల్ల కొద్ది పాటి   ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నది కలక్టర్ కు తెలియజేశారు. ఐతే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి సహకారము తో చందనోత్సవం విజయవంతం చేద్దామని కలక్టర్ మల్లికార్జున అన్నారు..  అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయి లో పక్కాగా చేసుకోవాలి అన్నారు. ఆనంతరం వీరు సింహాద్రి నాథుడు ను దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు వీరి పేరిట నిర్వహించారు.ఆలయ ఈఓ త్రినాధ్ రావు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు దినేష్ రాజ్, సంపంగి శ్రీను, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2023-04-05 09:40:27

కల్యాణానికి విచ్చేసే భక్తుల ఏర్పాట్లు పరిశీలన

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే  భక్తుల కోసం  చేపట్టిన ఏర్పాట్లను జేఈవో వీరబ్రహ్మం పరిశీలించారు.  ఆలయం ఎదుట టీటీడీ  అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ  వైట్ రైస్, వెజిటబుల్ పలావు, చట్ని, కేసరి,  రసం, సాంబారు, పప్పు, వెజిటబుల్ కర్రీ భక్తులకు వడ్డిస్తున్నారు. పలువురు భక్తులను పలకరించి అన్నప్రసాదాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ టీటీడీ  పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కళ్యాణ వేదిక దగ్గర భక్తులకు పంపిణీ చేసేందుకు  పులిహోర ప్యాకెట్ల తయారీని పరిశీలించారు. కళ్యాణానికి విచ్చేసే భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, కుంకుమ, కంకణం, 2 చిన్నలడ్డూ ప్రసాదం, పులిహోర, వాటర్ బాటిల్ కలిపి తయారు చేసిన కిట్లను పరిశీలించారు. గ్యాలరీలోకి ప్రవేశించే ముందే భక్తులకు ఈ ప్రసాదం కిట్లను అందజేయాలని అధికారులకు సూచించారు.

      జేఈవో  వెంట టీటీడీ  చీఫ్ ఇంజనీర్  నాగేశ్వరరావు,  విద్యుత్ విభాగం ఎస్.ఇ  వెంకటేశ్వర్లు, డిఇ చంద్రశేఖర్, ఇఇ  సుమతి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి,విజీవో మనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ తదితరులు ఉన్నారు.

Ontimitta

2023-04-05 08:57:53

శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

 స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ నటేష్ బాబు, మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఏఈఓ  గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య,  ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్  ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

Ontimitta

2023-04-05 07:36:22

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు

ఒంటిమిట్టలో బుధవారం  జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్య క్షుడు  కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను మంగళవారం సమర్పించారు. మొత్తం 180 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద డెప్యూటీ ఈవో  నటేష్ బాబు, అర్చకులు  శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు.   ఈ తలంబ్రాల కోసం ఆరు నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి నాలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తిభావంతో మూడు నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో 12 ఏళ్లుగా భద్రాద్రి రామునికి, ఆరేళ్లుగా ఒంటిమిట్ట రామునికి కల్యాణోత్సవం సందర్భంగా అందజేస్తున్నామని  కళ్యాణ అప్పారావు తెలిపారు.

Ontimitta

2023-04-04 12:12:43

ప్ర‌జ‌ల‌తో స్నేహ‌పూర్వ‌కంగా మెల‌గాలి

ప్ర‌తీ ప్ర‌భుత్వ ఉద్యోగి ప్ర‌జ‌ల‌తో స్నేహ‌పూర్వ‌కంగా మెల‌గాల్సి ఉంటుంద‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి అన్నారు. ఉద్యోగుల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత‌భావం త‌ప్ప‌నిస‌రి అని ఆమె స్ప‌ష్టం చేశారు. ఎపి సివిల్ స‌ర్వీసెస్ కాండ‌క్ట్ రూల్స్‌పై స‌ర్వేయ‌ర్లు, విఆర్ఓలు, స‌చివాల‌య సిబ్బందికి క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.  ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, శిక్ష‌ణ‌ను స‌ద్విని యోగం చేసుకొని, వివిధ అంశాల‌పై సంపూర్ణ అవ‌గాహ‌న ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. చ‌ట్టాల‌ను, ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌తీ ప్ర‌భుత్వ ఉద్యోగీ ప్ర‌భుత్వంలో ఒక భాగ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌తో స్నేహ‌పూ ర్వ‌కంగా, న‌మ్ర‌త‌గా, ఆచితూచి మాట్లాడాల‌ని సూచించారు. తాము ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌మ‌న్న విష‌యాన్ని నిరంత‌రం మ‌న‌నంలో ఉంచు కోవాల‌న్నారు.

 ప్ర‌తీఒక్క‌రికీ వృత్తిప‌ర‌మైన క్ర‌మ‌శిక్ష‌ణ చాలా అవ‌స‌ర‌మ‌న్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగంలో ఒత్తిడి చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని, దీనినినుంచి బ‌య‌ట ప‌డ‌టానికి సంగీతం, చిత్ర‌లేఖ‌ణం, ర‌చ‌న త‌దిత‌ర క‌ళ‌ల‌ను అల‌వాటు చేసుకోవాల‌ని సూచించారు. దాదాపు వందేళ్ల త‌రువాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్న భూముల రీస‌ర్వేలో భాగ‌స్వాములు అవుతున్నందుకు గ‌ర్వ‌ప‌డాల‌ని కోరారు. ప‌నిలో మ‌మేకం కావాల‌ని, ఆ ప‌నిలోనే ఆనందాన్ని పొందాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో కెఆర్ఆర్‌సి ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్ సూర్య‌నారాయ‌ణ‌, స‌ర్వేశాఖ ఎడి టి.త్రివిక్ర‌మ‌రావు, జిల్లా శిక్ష‌ణా కేంద్రం మేనేజ‌ర్ ఎన్‌.శ్రీ‌నివాసులు తదిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-04-04 10:57:19

రీ సర్వేలో జిల్లా మొదటి స్థానంలో నిలబడాలి..

స‌మ‌ర్ధ‌వంత‌మైన ప‌నితీరుతో, రెవెన్యూ స‌ర్వేశాఖ‌ల ప్ర‌తిష్ట‌ను పెంచాల‌ని, జాయింట్ క‌లెక్ట‌ర్ కె.మ‌యూర్ అశోక్ కోరారు. రీ స‌ర్వేలో జిల్లాను రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిల‌పాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఎపి సివిల్ స‌ర్వీసెస్ కాండ‌క్ట్ రూల్స్‌పై స‌ర్వేయ‌ర్లు, విఆర్ఓలు, స‌చివాల‌య సిబ్బందికి క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.    ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన జెసి మ‌యూర్ అశోక్ మాట్లాడుతూ, రీ స‌ర్వే రాష్ట్రంలో జ‌రుగుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మంగా పేర్కొన్నారు. రీస‌ర్వేలో మ‌న జిల్లా 60శాతం పూర్తి చేసుకొని ఇప్ప‌టికే ముందంజ‌లో ఉంద‌ని, మొత్తం ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తిచేసి, రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిల‌పాల‌ని కోరారు. దాదాపు వందేళ్ల త‌రువాత చేప‌ట్టిన రీస‌ర్వే ప్ర‌క్రియ‌లో, ఇత‌ర రాష్ట్రాలతో పోలిస్తే మ‌న రాష్ట్రం ఎంతో ముందుంద‌ని చెప్పారు. దీనికి స‌చివాల‌య వ్య‌వ‌స్థే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

 గ్రామ స్థాయిలో కూడా ఉన్న‌త విద్యార్హ‌త‌ల‌తో కూడిన‌ సుశిక్షితులైన సిబ్బంది అందుబాటులో ఉండ‌టం వ‌ల్ల ఏ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాన్ని అయినా విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌గ‌లుగుతున్నామ‌ని అన్నారు. ఇంత గొప్ప నెట్‌వ‌ర్క్ ఏ రాష్ట్రంలోనూ లేద‌ని, అందుకే మ‌న స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఇత‌ర దేశాల‌కు సైతం ఆద‌ర్శంగా నిలిచింద‌ని చెప్పారు. ఎన్నో వివాదాల‌కు భూములే కార‌ణ‌మ‌ని, రీ స‌ర్వే పూర్తి అయితే చాలా వివాదాల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని అన్నారు. చ‌ట్టాల ఆధారంగా ప్ర‌భుత్వ పాల‌నా వ్య‌వ‌స్థ ప‌నిచేస్తుంద‌ని, అందువ‌ల్ల చ‌ట్టాలు, ప్ర‌భుత్వ  నిబంధ‌న‌ల ప‌ట్ల సిబ్బంది సంపూర్ణ అవ‌గాహ‌న ఏర్ప‌ర‌చుకోవాల‌ని సూచించారు. స‌ర్వేయ‌ర్లు, స‌చివాల‌య సిబ్బంది త‌మ జాబ్ చార్ట్ ప‌ట్లా, విధులు, నిబంధ‌న‌లు, చ‌ట్టాల‌పై ప‌ట్టు పెంచుకోవాల‌న్నారు. స‌ర్వేయ‌ర్లు ఒక‌ర‌కంగా లీగ‌ల్ అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ, స‌ర్వే శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. మ‌న‌కు ఎంతో ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులో ఉంద‌ని, దానిని వినియోగించుకోవాల‌ని జెసి కోరారు.
                   
                   ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో కెఆర్ఆర్‌సి ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్ సూర్య‌నారాయ‌ణ‌, స‌ర్వేశాఖ ఎడి టి.త్రివిక్ర‌మ‌రావు, జిల్లా శిక్ష‌ణా కేంద్రం మేనేజ‌ర్ ఎన్‌.శ్రీ‌నివాసులు తదిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-04-04 07:28:42

మోహినీ అలంకారంలో జగన్మోహనుడు

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం మోహినీ అలంకారంలో రాము లవారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

        మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది. ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో రాములవారు ప్రకటిస్తున్నారు.

         ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ  నటేష్ బాబు, మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి  విజయలక్ష్మి, ఏఈఓ  గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య,  ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్  ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

Ontimitta

2023-04-04 07:21:58

149 పరీక్షా కేంద్రాలు 29 వేల మంది విద్యార్థులు హాజరు

శ్రీకాకుళం జిల్లాలో 149 పరీక్షా కేంద్రాల్లో సుమారు 29 వేల మంది విద్యార్థిని, విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వెల్లడించారు.  స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎ.పి. ఓపెన్ స్కూల్ కు సంబంధించి సుమారు 1200 మంది విద్యార్థులు 13 పరీక్షా కేంద్రాల్లో రెండవ పూట పరీక్షకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.  పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్ లకు పలు సూచనలు జారీచేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షలు సజావుగా జరిగేలా యంత్రాంగానికి సహకరించాలని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో విద్యాశాఖ నుండి ఎసిఇ లియాఖత్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-04-03 07:14:19