విజయనగరం జిల్లాలో కోవిడ్-19ను పూర్తిగా అదుపుచేసి డిసెంబరు చివరికి జిల్లాను గ్రీన్జోన్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ చెప్పారు. దీనికి ప్రజలంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19పై 50 రోజుల ప్రత్యేక ప్రచార ఉద్యమంలో భాగంగా సోమవారం కలెక్టర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ను ఎదుర్కొనడంలో జిల్లా యంత్రాంగం ఇతర జిల్లాలకంటే మెరుగ్గా పనిచేసిందని అభినందించారు. పాజిటివిటీ రేటు, కోవిడ్ మరణాలు ఇతర జిల్లాలతో పోలిస్తే విజయనగరంలో అతితక్కువని చెప్పారు. జిల్లాలో పాజిటివిటీ రేటు 7.4శాతం కాగా, మరణాలు కేవలం 0.5శాతం మాత్రమేనని, జిల్లాలో ఇప్పటివరకు 204 మరణాలు మాత్రమే నమోదయ్యాయని వెళ్లడించారు. ఇతర జిల్లాలకంటే జిల్లాలో రికవరీ రేటు కూడా అత్యధికంగా 99శాతం ఉందన్నారు. వివిధ శాఖల సమన్వయంతో, పటిష్టమైన ప్రణాళికతో చేపట్టిన కార్యాచరణ ఫలితంగా ఈ వ్యాధిని గణనీయంగా అదుపుచేయగలిగామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 5,54,059 కోవిడ్ పరీక్షలను నిర్వహించగా, 40,784 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 154 మాత్రమే ఉందన్నారు. అయినప్పటికీ రోజుకు సుమారు 4వేల వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని, ఇకనుంచీ ఖచ్చితంగా వ్యాధిని నిర్ధారించే ఆర్టిపిసిఆర్ టెస్టులను మాత్రమే చేయనున్నామని తెలిపారు. కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను కూడా ప్రస్తుతం రెండింటికి మాత్రమే పరిమితం చేశామన్నారు.
ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్నప్పటికీ, ప్రజలంతా ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరభారతదేశంలో, దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కోవిడ్ రెండోదశ మొదలయ్యిందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలను పాటించాలన్నారు. తప్పనిసరిగా మాస్కులను ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులను సబ్బుతో గానీ, శానిటైజర్తో గానీ శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన 15 కోవిడ్ నిబంధనలను ప్రతీఒక్కరూ పాటించాలంటూ వాటిని వివరించారు. ఇప్పటికే సాధారణ కార్యక్రమాలన్నీ మొదలైపోయాయని, ప్రజాజీవనం ఎప్పటిలాగే మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో కూడా కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చర్యలను తీసుకున్నామని, ఉపాధ్యాయులందరికీ కోవిడ్ పరీక్షలను నిర్వహించామని చెప్పారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో కూడా కోవిడ్ నిబంధనలను పాటించేవిధంగా ప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం స్వలప్పంగా ఉన్న కోవిడ్ కేసుల సంఖ్యను పూర్తిగా తగ్గించేసి జిల్లాను గ్రీన్జోన్గా మార్చడం, రెండో దశ మొదలవ్వకుండా తగిన చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. దీనిలో భాగంగా జిల్లాలో 37 శాఖల సమన్వయంతో 50రోజుల ప్రత్యేక ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ రామ్మోహనరావు, పిఓడిటి డాక్టర్ బాల మురళీకృష్ణ పాల్గొన్నారు.
విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందన కు 72 వినతులు అందాయి. ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు, పించన్ల, ఆరోగ్య శ్రీ , ఆదరణ, రైతు భరోసా లబ్ది కోసం దరఖాస్తులు అందాయి. జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్లాల్ , సంయుక్త కలెక్టర్ జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, విపత్తుల శాఖ అధికారి పద్మావతి వినతులను అందుకున్నారు. స్పందన వినతులు పలు అధికారుల వద్ద 1200 వరకు పెండింగ్ ఉన్నాయని, వెంట వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో విబిన్న ప్రతిబ వంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ నుండి జిల్లాకు కేటాయించిన నాలుగు శ్రావణ యంత్రాలను బధిరులకు, వయో వృద్ధులకు జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్లాల్ , సంయుక్త కలెక్టర్ జే. వెంకటరావు , సహాయ సంహలకులు నీలకంట ప్రధానో అందజేశారు. ఒక్కొక్కటి 3 వేల రూపాయల విలువైన ఈ యంత్రాలను లబ్దిదారులకు ఉచితంగా అందజేసారు. దూర ప్రాంతాల నుండి స్పందన వినతులు ఇవ్వడానికి వచ్చే వారి కోసం, గర్భిణీలు, వికలాంగుల కోసం 10 రూపాయలకే రుచికరమైన భోజనం ఏర్పాటు చేసారు జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్. అయితే కోవిడ్ దృష్ట్యా ఇటీవల స్పందన భోజనం ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం అధిక సంఖ్యలో వస్తున్న వారి కోసం స్పందన భోజనాన్ని ఈ సోమవారం నుండి తిరిగి ప్రారంబించారు.
కన్వర్జెన్స్ పనులు సత్వరమే ప్రారంభం కావాలి :
ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న కన్వర్జెన్స్ పనులను సత్వరమే ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. స్పందన అనంతరం కలెక్టర్ పలు పధకాల పురోగతి పై సమీక్షించారు. రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలు, సచివాలయాల నిర్మాణాలకు ప్రారంభం కాని పనులు వెంటనే ప్రారంభం చెయ్యాలన్నారు. జగనన్న పచ్చ తోరణం సమీక్షిస్తూ తక్కువ సాధించిన వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. లక్ష్యానికి 50 శాతం కన్నా తక్కువ ఉన్నవారు వచ్చే రెండు రోజుల్లో శత శాతం చేయాలన్నారు. వై.ఎస్.ఆర్ బీమా, జగనన్న తోడు పధకాలలో పురోగతి కనపడాలన్నారు. జిల్లాలో 514 ఇ - సేవలు పెండింగ్ ఉన్నాయని, ముఖ్యంగా రెవిన్యూ శాఖ లో ఎక్కువగా ఉన్నాయని, ఈ రోజే ఆయా అధికారులతో మాట్లాడి సాయంత్రం లోగా క్లియర్ అయ్యల చూడాలని జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు కు సూచించారు. జలసిరి దరఖాస్తు గ్రౌన్దింగ్ కార్యక్రమం వేగవంతం చేయాలనీ అన్నారు. ఇళ్ళ స్థలాల ప్రక్రియ పై ప్రత్యేకాధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. పలు కులాల కార్పొరేషన్లకు అవసరమగు కులాల రీ సర్వే వేగంగా జరిగేలా చూడాలని సాంఘిక సంక్షేమ డి.డి సునీల్ రాజ్ కుమార్ కు సూచించారు. నీతీ అయోగ్ క్రింద చేపడుతున్న పధకాలను సమీక్షిస్తూ మళ్ళి మొదటి స్థానం లో ఉండాలని, ఆయా శాఖలు ప్రగతి సాధన లో ముందుకు రావాలని అన్నారు. ఈ స్పందన లో అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరైనారు.
అనంతపురం జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ (ఆర్ ఆర్ బి కే అండ్ ఆర్) నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ 2020 సెప్టెంబర్ 4వ తేదీన నిర్వహించిన జిల్లాస్థాయి రహదారి భద్రత సమావేశం మినిట్స్ పై తీసుకున్న చర్యలపై చైర్మన్ కు వివరించారు.అలాగే సమావేశంలో చర్చించవలసిన అజెండా ఐటమ్స్ లను చదివి వినిపించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అంశాల వారీగా జెసి సమీక్షించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రి పెనుగొండలో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలకు సంబంధించి నిధులు మంజూరు చేయాల్సిందిగా మరోసారి వైద్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి లేఖ రాయాల్సిందిగా ఆయన సూచించారు.
జిల్లాలో పాఠశాలలు ప్రారంభించిన నేపథ్యంలో పాఠశాలల బస్సులు, ఆటోలలో అనుమతించిన సంఖ్య కన్నా ఎక్కువ మంది విద్యార్థులతో వెళ్లకుండా చూడాలన్నారు .అందుకు సంబంధించి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు, కాలేజీలకు అధిక లోడుతో వచ్చే ఆటోలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా నివారించేలా సంబంధిత యాజమాన్యం వారి తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలియజేసేలా విద్యాశాఖ సర్క్యులర్లు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులకు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు .ఇందుకు సంబంధించి 2020 అక్టోబర్ 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వం ఉత్తర్వు నెంబర్ 21 నందు పేర్కొన్న ముప్పై ఒక్క అంశాలపై విధించే జరిమానాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇంటర్ ,డిగ్రీ చదివే విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ బైక్ లు నడుపరాదన్నారు. లైసెన్సు లేకుండాబైకులు నడిపితే ఆ విద్యార్థులను గుర్తించి వారికి మరియు వారి తల్లిదండ్రులకు విధించే శిక్షలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు గురించి సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్ లు వారి తల్లిదండ్రులకు వ్రాత మూలకంగా తెలియ చెప్పాలన్నారు. కొత్త చట్టం పై పోస్టర్లను రూపొందించి ప్రతి ఒక్క కాలేజీ వద్ద ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
మోటారు వాహన చట్టంలో సూచించిన మేరకు వాహనాల డిజైన్ ఉండాలన్నారు. అలాకాకుండా అందుకు విరుద్ధంగా అదనపు హంగులు వాహనాలకు చేర్చటం వలన ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుటి వాహనాల్లో ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాటుచేసిన స్పెన్సర్ పనిచేయవన్నారు. తద్వారా ఎయిర్ బ్యాగులు తెరచుకోకుండా వాహనాలలోని వ్యక్తులు ప్రమాద బారిన పడటమే కాకుండా, అధిక ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా వారి వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుందన్నారు.
పోలీసు మరియు రవాణా శాఖచే అక్టోబర్ 30 వరకు నిర్వహించిన తనిఖీలలో తక్కువ వయస్సు గల విద్యార్థులు నడుపుతున్న వాహనాలకు ,ఒకే వాహనంపై ముగ్గురు వెళ్లడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై, సీట్ బెల్ట్ లేకుండా, హెల్మెట్ లేకుండా, అధిక లోడు, అధిక వేగంతో ,సెల్ఫోన్ డ్రైవ్ చేస్తూ, రాంగ్ పార్కింగ్,లైసెన్స్ లేనివారు, మోటార్ వాహన చట్టాలను ఉల్లంఘించిన 4,53,575 మందిపై కేసులనునమోదు చేసి సుమారు 11 కోట్ల 25 లక్షల రూపాయలను జరిమానాలు విధించడం జరిగిందన్నారు .సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రమాదాలు, మృతులు ఐదు శాతం మేర తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించిందన్నారు.ఆ మేరకు జిల్లాలో 2019 వ సంవత్సరం లో 979 ప్రమాదాలు జరుగగా, 506 మంది చనిపోయారని, 1333 మంది గాయపడ్డారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఇప్పటివరకు 847 మంది ప్రమాద బారిన పడగా, 468 మంది చనిపోయారని, 981 మంది గాయపడ్డారని తెలిపారు .గత ఏడాదితో పోల్చుకుంటే ప్రమాదాలు 13.48శాతానికి తగ్గాయని, మరణాలు 7.51 శాతం, గాయాలు తగిలినవారు 26.41 శాతానికి తగ్గిందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె వి ఆర్ కే ప్రసాద్, ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు ,డీఎంహెచ్వో డా. కామేశ్వర ప్రసాద్ ,డిసిహెచ్ఎస్ డాక్టర్ రమేష్ నాధ్, సర్వజన ఆసుపత్రి సూపర్డెంట్ డా.రామస్వామి నాయక్ ,డీఈవో శామ్యూల్ ,నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి ,అనంతపురం, హిందూపురం ఎంవీఐలు వరప్రసాద్, రమేష్ , ఆర్ అండ్ బి,అనంతపురం ,ధర్మవరం ఈఈలు సంజీవయ్య ,రాజగోపాల్ ,లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్ ,ఆర్డిటి చైర్మన్ తిప్పేస్వామి ,ఆర్టీసీ ఆర్ఎం సుమంత్ ఆర్ ఆదోని, రవాణా శాఖ ఏవో వెంకటకుమార్ ,ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పదునుతేలిన టెక్నికల్ ఎనాలిసిస్ వింగ్.. నైపుణ్య వృద్ది, నేరాల పరిశోధనలో సాంకేతికత మెలకువలను అందిపుచ్చుకొని ఒక నెల కాల వ్యవధిలోనే పిర్యాది దారులు పోగొట్టుకొన్న సుమారు 40 లక్షల విలువ గల 277 మొబైల్ ఫోన్ ల రికవరీ చేశారు చిత్తూరు జిల్లా పోలీసులు. ఆ సెల్ ఫోనులన్నీ పోగొట్టుకున్న బాధితులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్.పి. ఎస్.సెంథిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఎస్బీ డిఎస్పీ ఎన్. సుధాకర్ రెడ్డి నేతృత్వం లో టిఏడబ్ల్యూ టీంకు జిల్లా వ్యాప్తం గా ఒక్క సంవత్సర కాలం లో నమోదైన సెల్ ఫోన్స్ మిస్సింగ్ ల పై విచారణచేయాలని ఆదేశించడంతో 1 నెల కాల వ్యవధిలోనే ఫిర్యాది దారులు పోగొట్టుకొన్న సుమారు రూ.40 లక్షల విలువ గల 277 సెల్ ఫోన్స్ రికవరీ చేశారన్నారు. తరువాత ఎవరెవరు సెల్ ఫోన్లు పోగొట్లుకున్నారో వారి నెంబర్లు, ఇతర మొబైల్ బిల్స్ ఆధారంగా వారి ఫోన్లను వారికి అందజేసినట్టు ఎస్పీ వివరించారు. ఇందులో ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్ర ల నుంచి రికవరీ చేసినట్టు వివరించారు. ఎవరైనా ఏపి పోలీస్ సేవ యాప్ ద్వారా ఫిర్యాదు చేసినా వాటిపైనా తక్షణమే స్పందిస్తామని ఎస్పీ వివరించారు. అత్యంత తక్కువ కాల వ్యవధిలోనే సాంకేతికపర శిక్షణ పూర్తి చేసుకొని సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న టిఏడబ్ల్యూ టీం, వారికి శిక్షణ ఇచ్చిన హెడ్ కానిస్టేబుళ్లు ఈ.దేవరాజులు రెడ్డి, కే. బాపూజీ, ఐటీ కోర్ టీమ్ వారిని ఎస్.పి ప్రత్యేకంగా అభినంధించి రివార్డులు అందజేశారు.
శ్రీకాకుళంజిల్లాలో స్పందన కార్యక్రమానికి 62 వినతులు వచ్చినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖకు చెందిన వినతులు 19 కాగా, పౌర సరఫరాల శాఖకు చెందినవి 6 , ఇతర శాఖలకు సంబంధించి వినతులు 37 ఉన్నాయని తెలిపారు. కరోనా నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఫిర్యాదులు అందాయి. ఫోన్ స్పందన కార్యక్రమానికి ఫోన్ చేసి 10 మంది తమ ఫిర్యాదులను తెలియజేసారని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు బదలాయించి వాటికి వారంరోజుల్లో పరిష్కారం చూపించాల్సింది ఆదేశించినట్టు డిఆర్వో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్ నుండి చలమయ్య, స్పందన విభాగం సూపర్ వైజర్ బి.వి.భాస్కరరావు, హెచ్.సెక్షన్ డి.టి.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డికి అభినందన వెల్లువ గత మూడు రోజుల నుంచి నిరాటకంగా కొనసాగుతూనే. ఆయనను అభినందించడానికి పలువురు ప్రముఖులు వస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సోమవారం వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి , గ్రేటర్ విశాఖ యువజన అధ్యక్షులు కొండా రాజీవ్ గాంధీ కలిసి ఘనంగా సత్కరించారు. ఆయన చిత్రపటాన్ని బహూమరించారు. ఈ సందర్ంగా రాజీవ్ మాట్లాడుతూ, ఎవరికీ దక్కని గౌరవం ఆచార్య పివిజిడి ప్రసాదరావుకి దక్కిందని కొనడియాడారు. ఆంధ్రాయూనివర్శిటీ చరిత్రలో కొత్తగా నియమితులైన విసికి ఇంత స్థాయిలో అభినందనలు రావడం ఇదే తొలిసారి కావడం కూడా విశేషమని అన్నారు. ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో వర్శిటీ మరింత అభివ్రుద్ధి చెంది విద్యార్ధులకు మంచి ఉద్యోగ, ఉపాది అవకాశాలు దక్కుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
పౌరసరఫరాల శాఖ ద్వారా లబ్దిదారులకు నాణ్యమైన రేషన్ బియ్యం నేరుగా వారి ఇంటి వద్దకే అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వెల్లడించారు. ప్రతి బస్తాపై క్యూ ఆర్ కోడ్, వాహనాలకు జీపీఎస్ అనుసంధిస్తారని చెప్పారు. దీంతో అక్రమాలకు ఇక తెర దించినట్లేనని మంత్రి వెల్లడించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు పాల్గొనేందుకు విజయవాడకు వెళ్లే హడావిడిలో సైతం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తొలుత స్థానిక రాజుపేటకు చెందిన ఎగ్గొని గోపీచంద్ , ఎస్.ఎన్.గొల్లపల్లి సమీప సీతారామపురం ప్రాంతానికి చెందిన పీట అనిల్ కుమార్ లు మంత్రి పేర్ని నానిని కలిసి రేషన్ కార్డుదారులకు బియ్యం డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం సంచార వాహనాలు సమకూరుస్తున్నదని తమకు ఆయా వాహనం మంజూరయ్యేలా సహాయం చేయమని అభ్యర్ధించారు. తగిన అర్హతలు ఉంటే అవి తప్పక సమకూరుతాయని తొలుత ఆయా వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్నారా అని వారిరువురిని మంత్రి ప్రశ్నించారు. వచ్చే ఏడాది జనవరి 01 తేదీ నుంచి కార్డుదారుని ఇంటికే ప్రభుత్వం అందించనున్నదని నవంబర్ మొదటి వారంలో కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో 9 వేల 260 మొబైల్ వాహనాలను సమకూర్చాలని నిర్ణయం తీసుకొందని వీటిని 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మరో 20 శాతం ఈబీసీలకు కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం ఇస్తుందని, ఇక్కడ లబ్దిదారుడు కేవలం 10 శాతం భరించాల్సి ఉంటుందన్నారు. 6 ఏళ్ళ తర్వాత వాహనం లబ్దిదారుడికి సొంతం అవుతుందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని ఇందుకు అత్యాధునిక టెక్నాలజీ సైతం వాడుతున్నట్లు ఆయన చెప్పారు. పర్యావరణ హితంగా ఉండేలా పునర్వినియోగ బ్యాగును బియ్యంతో పాటు పంపిణీ చేస్తారని మంత్రి వివరించారు. వాహనంలో తీసుకెళ్లే బియ్యం బస్తాలకు టాంపర్ ఫ్రూఫ్ స్ట్రిప్ సీల్తో పాటు, ఆ బ్యాగ్పై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని ,దీని వల్ల ఎక్కడా ఆ బియ్యం పక్కదారి పట్టే అవకాశం ఉండదని మంత్రి పేర్ని నాని తెలిపారు.
ఆంధ్ర విశ్వదవిద్యాలయం ఉపకులపతిని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం 11.55 గంటలకు ఆయన తన కార్యాలయంలో నిరాడంబరంగా వర్సిటీ 18వ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రసాద రెడ్డిని రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, పాలక మండలి సభ్యులు జేమ్స్ స్టీఫెన్, టి.శోభశ్రీ, క్రిష్ణమంజరి పవార్, డీన్ డాక్టర్ టి.షారోన్ రాజులు అభినందించారు. వర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య ప్రసాద రెడ్డిని వర్సిటీ ఆచార్యులు, పరిశోధకులు, ఉద్యోగులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఏయూ మహిళా ఆచార్యుల సంఘం సభ్యులు వీసీకి అభినందనలు తెలియజేశారు. ఒక పరిశోధకుడిగా, రెక్టార్ గా, ఆ తరువాత ఇన్చార్జి విసిగా, ఇపుడు పూర్తిస్థాయి వీసిగా ఒకే వ్యక్తికి అరుదైన అవకాశం రావడం ఆంధ్రాయూనివర్శిటీలో అరుదైన అంశంగా చరిత్రకెక్కింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 21 నుంచి వైఎస్ఆర్ కప్ 2020 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం ఏయూ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోర్నమెంట్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 98 వార్డుల పరిధిలో 300కిపైగా టీములతో టోర్నమెంట్ నిర్వహణ జరుగుతుందన్నారు. దీనిలో పాల్గొనే వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ లో ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయన్నారు 12 వ తేదీ సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్లను అనుమతిస్తామన్నారు. నాకౌట్ పద్దతిలో పోటీలు జరుగుతాయన్నారు. మెత్తం 8 పూల్లుగా పోటీలను నిర్వహిస్తామన్నారు. మెదటి దశలో 12 ఓవర్ల మ్యాచ్గా నిర్వహిస్తామని, రెండో దశ పోటీలు 15 ఓవర్లకు మ్యాచ్ జరుగుతుందన్నారు. 16 గ్రౌండ్లను సిద్దం చేసామని,8 గ్రౌండ్లలో పోటీలు జరుపుతామన్నారు.
21న ప్రారంభోత్సవం...
టోర్నమెంట్ ప్రారంభోత్సవం ఈ నెల 21న ముఖ్యమంత్రి జన్మదినోత్సవం రోజున ఘనంగా నిర్వహిస్తామన్నారు. దీనిలో ఎంపీ వి.విజయసాయి రెడ్డి, భారతీయ క్రికెట్ క్రీడాకారుడు వేణుగోపాల్, పలువురు ప్రముఖులు పాల్గొంటారన్నారు. 22వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయన్నారు. ప్రతీ టీంకు బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. మెగా టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతను, సాంకేతిక సహకారాన్ని ఏయూ అందిస్తుందన్నారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు చేపట్టారు. శని, ఆదివారాల్లో బూత్ స్థాయి అధికారుల నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే నిమిత్తం ఆదివారం పలు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బి.ఎల్.ఓ.లకు సూచనలు చేశారు. జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ బొండపల్లి మండలంలోని గొట్లాం, అంబటివలస గ్రామాల్లోని పలు కేంద్రాలు సందర్శించి ఓటర్ల నమోదు జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు డెంకాడ మండలంలోని పెద తాడివలస, భోగాపురం మండలం సవరవల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. విజయనగరం ఆర్.డి.ఓ. బిహెచ్.భవానీ శంకర్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
విజయనగరం జిల్లా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన 486 మంది విద్యార్ధినులను జూనియర్ రెడ్క్రాస్లో సభ్యులుగా చేర్పించినట్లు జూనియర్ రెడ్క్రాస్ జిల్లా సమన్వయకర్త రామ్మోహన్ తెలిపారు. పాఠశాల ప్రదానోపాధ్యయురాలు శోభారాణి నేతృత్వంలోప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి బాలికలను చేర్పించామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో బాలికలతో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ రెడ్ క్రాస్ డి.ఎఫ్.ఓ.లు గౌరి, చంద్రరావు తదితరులు పాల్గొన్నట్టు పేర్కొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డికి అభినందన వెల్లువ గత మూడు రోజుల నుంచి నిరాటకంగా కొనసాగుతూనే. ఆయనను అభినందించడానికి పలువురు ప్రముఖులు వస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయనను కార్యాలయంలో కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.రాంజీ, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూధన రావు, విశాఖ స్టీల్ ప్లాంట్ డివిఆర్ స్టీల్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు, పశ్చిమగోదావరికి చెందిన మాదాల రాజేష్ తదితరులు అభినందించారు. ఎవరికీ దక్కని గౌరవం ఆచార్య పివిజిడి ప్రసాదరావుకి దక్కడంతో ఆయన సహచరులు, వివిధ యూనివర్శిటీలకు చెందిన విసిలు కూడా వచ్చి ఆయనను అభినందిస్తున్నారు. ఆంధ్రాయూనివర్శిటీ చరిత్రలో కొత్తగా నియమితులైన విసికి ఇంత స్థాయిలో అభినందనలు రావడం ఇదే తొలిసారి కావడం కూడా విశేషం..
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాయంలో ఆదివారం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరిగింది. కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ముందుగా, సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన కొండపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ తరువాత జ్వోలాతోరణం వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.