గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షణ ధ్యేయంగా శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మూడు రోజుల పాటు నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్ కె రోజా పేర్కొన్నారు. మంగళవారం పాడేరులో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రివర్యులు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన మోదకొండమ్మ అమ్మవారి జాతరకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కరోనా వల్ల గత రెండేళ్లుగా జాతర జరుపుకోలేకపోయామని గుర్తు చేసిన మంత్రి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరు సంతోషంగా ఉండాలని అభిలషించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అందించని సేవలు, సౌకర్యాలు మన ముఖ్యమంత్రి జగనన్న గిరిజనులకు అందిస్తున్నారని వెల్లడించారు. జిల్లాల విభజన లో భాగంగా గిరిజనుల కోసం పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడం గిరిజనులపై ముఖ్యమంత్రికి ఉన్న అభిమానం అని మంత్రి వివరించారు.
ఆలయానికి, దేవతకు ముఖ్యమైన చరిత్ర ఉందనీ, గిరిజన, గిరిజనేతర వర్గాలచే పూజించబడుతున్న ఏజెన్సీ ప్రాంతంలో శక్తివంతమైన దేవతగా మోదకొండమ్మ అమ్మవారు పరిగణించబడుతుందనీ పేర్కొన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధికి మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేయటమే కాకుండా ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై సాగు హక్కు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు.
పర్యాటకంగా అభివృద్ధికి కృషి
అరకు వ్యాలీలో ఎన్నో సహజసిద్ధమైన అందాలు ఉన్నాయని, బొర్ర గుహలు ప్రత్యేకతను సంతరించుకున్నాయని పేర్కొన్న మంత్రి అరకు పేదవారి స్విట్జర్లాండు గా అభివర్ణించారు. అటువంటి అరకు, పరిసర ప్రాంతాలను పర్యాటక ఆకర్షణ గా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన మంత్రివర్యులను ముందుగా ఐటిడిఎ పిఓ రోణంకి గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి. అభిషేక్ ఘన స్వాగతం పలికారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో అమ్మవారి ఆలయంలోకీ తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహింపజేసారు. అనంతరం అమ్మవారి చిత్ర పటాన్ని బహూకరించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పాడేరు శాసనసభ్యులు కె. భాగ్యలక్ష్మి, ఎంఎల్సి వరుధు కల్యాణి, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఛైర్మన్ శొభా స్వాతిరాణి, ఉత్సవ కమిటీ చైర్మన్ సింహాచలం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.