1 ENS Live Breaking News

సింహగిరిపై వరుస పండుగలు,భారీ ఏర్పాట్లు.. ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు

ఉత్తరాంధ్రాజిల్లాల్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలోని సింహగిరిపై వరుస పండుగుల తాకిడి నెలకొనబోతుంది. ఈ నేపథ్యంలో భక్తులు కూడా అదేస్ధాయిలో ఐదు రోజుల పాటు  సింహచలం శ్రీ వరహా లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకోవడానికి తరలిరానున్నారు. ఈ మేరకు శనివారం సింహచలం దేవస్దానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు సింహాద్రినాథుడు, క్షేత్రపాలకుడైన త్రిపురాంతక స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కాలం తరువాత సంక్రాంతితో కలిపి ఈ ఏడాది అప్పన్న ఉత్తరద్వార దర్శనం భక్తులకు లభించనుందన్నారు. ఆరోజున ఉత్తర ద్వారంలో కొలువున్న అప్పన్నను దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో కొలువున్న శ్రీమన్నారాయణనుడిని దర్శించుకున్నంత పుణ్యఫలం కలుగుతుందన్నది అప్పన్న భక్తకోటి ప్రగాడ విశ్వాసంగా శ్రీనుబాబు వివరించారు.  జనవరి12న అప్పన్న ఉత్తర ద్వార దర్శనం(ముక్కోటి ఏకాదశి), 13న భోగి,14న సంక్రాంతి,15న కనుమ పండుగులు రానున్నట్లు చెప్పారు. 16న ముక్కోనమ పండుగ ఘనంగా జరుపుకోనున్నారన్నారు. అయితే ఆయా పండగుల నేపథ్యంలో సంక్రాంతి పర్వదినం రోజున అప్పన్న మకరవేట ఉత్సవాన్ని(గజేంద్ర మోక్షం) ఘనంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనుబాబు చెప్పారు. ఆయా పండుగ రోజుల్లో భక్తులకు కనువిందు చేసే విధంగా సింహాద్రినాధుడి ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ  ఆధ్వర్యంలో సిబ్బంది భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఐదు రోజుల పాటు వరుస పండుగల నేపథ్యంలో భక్తులంతా స్వామిని దర్శించుకుని సేవించి,తరించాలని శ్రీనుబాబు విజ్ఞప్తి చేశారు. 

Simhachalam

2021-12-04 08:16:36

ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి..

తుఫాన్ అనంత పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కోరారు. తుఫాను  పరిస్థితులను పరిశీలించుటకు సంతబొమ్మాలి మండలం కారిపేట తదితర ప్రాంతాల్లో కలెక్టర్ శనివారం పర్యటించారు.  ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అందిస్తున్న ఆహారపదార్థాలను పరిశీలించారు. స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. కేంద్రంలో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అదేసమయంలో తుఫాను అనంతరం పరిస్థితుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వర్షాలకు గోడలు తడిసిపోయి ఉండవచ్చని, గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగవచ్చని, విద్యుత్ తీగలు క్రిందకు ఉండవచ్చని వాటిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాలకు వర్షపు నీరు తాగునీటి కలిసి కలుషితం కావడం వలన పలు వ్యాధులు సంభవించే అవకాశాలు ఉంటాయని వాటిని పరిశీలించాలని అన్నారు. నీటిని బాగా మరిగించి చల్లార్చి తాగాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణం సంబంధిత వైద్య అధికారిని కలవాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో సమస్య ఉంటే వాటిని కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని చెప్పారు. అధికారులకు సహకారం అందిస్తూ తుఫాను సమయంలో సురక్షితంగా ఉండుటకు ప్రయత్నించాలని కలెక్టర్ అన్నారు.

Srikakulam

2021-12-04 08:11:22

తహసిల్థార్లు నుండి సమాచారం సేకరించాలి..

శ్రీకాకుళం జిల్లాలో  మండలాలకు సంబంధించి తహసిల్థార్లు నుండి పూర్తి స్థాయి సమాచారం సేకరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు.  జవాద్ తుఫాన్ కు సంబంధించి మండలాల్లో పరిస్థి ఏ విధంగా ఉన్నదని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఆయన శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీతతో సమీక్షించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల్లో పునరావాస కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు, అక్కడ ఎంత మంది ప్రజలు ఉన్నారు, వారికి ఆహారం సరఫరా చేస్తున్నది లేనిది తెలుసుకోవాలన్నారు.  ప్రస్తుత పరిస్థితి మండలాల్లో ఏ విధంగా ఉన్నదీ తెలుసుకోవాలని పేర్కొన్నారు.  వర్షపాతం నమోదు, గాలులు వేగం, తదితర అంశాలపై మండలాల నుండి సమాచారం సేకరించాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో ఆయా విభాగలకు సంబంధించిన పర్యవేక్షకులు, కంట్రోల్ రూరం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-12-04 07:53:06

అప్పన్న దేవస్థానం అభివృద్ధికి సహకారం..

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు బృందం పేర్కొంది. ఈమేరకు శుక్రవారం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల  శ్రీను బాబు, మేడిద మురళీ కృష్ణ, దశమంతుల మాణిక్యాలరావు, యండమూరి వెంకట్రావు తదితరులు వరాహ పుష్కరిణి ప్రాంతంతోపాటు కొండ దిగువన శ్రీవెంకటేశ్వర ఆలయం ప్రాంతాలను వీరు సందర్శించారు. వరహా పుష్కరనీ ప్రాంతాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని తాము ఇప్పటికే ట్రస్ట్ బోర్డు సమావేశంలో ప్రతిపాదించినట్లు శ్రీనుబాబు చెప్పారు. వరాహ పుష్కరిణి ప్రాంతం  అభివృద్ధి చేస్తే భక్తులుకి ఆహ్లాద కరమైన వాతా వరణం కలుగుతుందని , ఇక్కడ సేద తీరే అవకాశం కలుగుతుందన్నారు. అంతేకాకుండా సాయంత్రం పూట గ్రామ ప్రజలు కూడా ఆహ్లాదంగా గడిపేందుకు అవకాశం కలుగుతుందని  శ్రీనుబాబు  పేర్కొన్నారు. ఇక అడవివరం స్మశానానికి వెళ్లే రహదారిని కూడా మెరుగు పరచవలసిన అవసరం ఉందని, నాలుగు వైపులా రహదారులు అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం సుందరముగా  విరాజిల్లుతోంది అన్నారు.
ఆదివారం నాటి పోలి పాడ్యమి సందర్భంగా సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లు  ప్రశంసనీయంగా ఉన్నాయని వీరు కొనియాడారు. పుష్కరిణిలో నాచు పట్టిన పలు ప్రాంతాలను  పరిశీలించారు. అనంతరం ఇక్కడ పేరుకుపోయిన కొంత చెత్తాచెదారాన్ని వీరు క్లీన్ అండ్ గ్రీన్ ద్వారా తొలగించారు. తదుపరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ భక్తులను  లోటుపాట్లు అడిగి తెలుసుకున్నారు.  అక్కడ కైంకర్య పరుడికి సక్రమంగా జీతం చెల్లిస్తున్నందుకు  ఈవో సూర్య కళ కి  ధన్యవాదాలు తెలియజేశారు. గతములో జీతం లేకపోవడం వల్ల తాము ఈ విషయాన్ని ఈఓ దృష్టికి తీసుకు వెళ్ళడంతో సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. దాతల సహకారంతో సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చించి ధనుర్మాసం నాటికి వేంకటేశ్వర స్వామి ఆలయం లో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం అక్కడ చెక్ డామ్ పరిశీలించారు.

Simhachalam

2021-12-03 09:39:54

తుపాను కారణంగా 4వ తేదీన పాఠశాలలకు సెలవు..

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా  రానున్న 3 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక నేపద్యంలో  జిల్లా యంత్రాంగం, ప్రజలు ముందు జాగ్రత్తలతో అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కోరారు.  మధ్య అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడి వాయువ్య దిశలో కదులుతూ ఈ నెల 4వ తేదీ ఉదయానికి ఉత్తరాంధ్ర-ఒడిస్సా తీరాన్ని తాకనుందని, దీని ప్రభావం వల్ల డిశంబరు 3 నుండి 5వ తేదీ వరకూ తూర్పు గోదావరి జిల్లాలో బలమైన గాలులతో భారీ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ  హెచ్చరిక జారీ అయిందని ఆయన తెలిపారు.                                    తుఫాను హెచ్చరిక నేపద్యంలో మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించాలని, ఇప్పటికే సముద్రంలో ఉన్న వారిని వెంటనే తీరానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని మత్య్సశాఖ అధికారులను ఆదేశించారు.  పెనుగాలుల వల్ల ప్రమాదాలు సంభవించకుండా  పూరిళ్లు, తాటాకు, పెంకుటిల్లలో నివశిస్తున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన కోరారు. అలాగే వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద ఉండవద్దని హెచ్చరించారు. రానున్న 2,3 రోజులలో భారీ వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రమాదం ఉందని, కావున ప్రసవ తేదీకి దగ్గరలో ఉన్న గర్భవతులందరినీ సమీప ప్రభుత్వ ఆసుపత్రులలోని ప్రసవ నిరీక్షణ గదులకు తరలించాలన్నారు. గంటకు 80 కి.మీ. వేగంతో తుఫాను ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున, చెట్లు విద్యుత్ స్థంబాలు కూలి రహదార్లకు అంతరాయం ఏర్పడే అవకాశం దృష్ట్యా ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.            రవాణా అవరోధాలను తొలగించేందుకు అవసరమైన జెసిబిలు, పవర్ కట్టర్లు, రంపాలు, ట్రాక్టర్లను సిద్దంగా ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయాల వల్ల త్రాగునీటి సరఫరాకు ఆటంకం కలుగకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్ని ఎటువంటి  అంతరాయం లేకుండా సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు.   రెవెన్యూ, అగ్నిమాపక, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పంచాయితీరాజ్, రోడ్లు భవనాలు, పోలీస్ తదితర రక్షణ,సహాయ శాఖలకు సెలవులు రద్దు చేసి, అధికారులు, సిబ్బంది అత్యవసర విధులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తుఫాను హెచ్చరికలను మీడియా, వలంటీర్ల వ్యవస్థ, టాంటాం ద్వారా ప్రజలకు ఎప్పటి కప్పుడూ తెలియజేయాలని, మండల ప్రత్యేక అధికారులు తమతమ మండల కేంద్రాలలో ఉండి ముందస్తు జాగ్రత్తలను, సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ముందు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు ఈ నెల 4వ తేదీన స్థానిక శెలవు దినం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  కలెక్టరేటులోను, అన్ని డివిజన్ కేంద్రాలలోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని తుఫాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు, కంట్రోల్ రూమ్ కు సమాచారం తెలియజేయాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందకు  ప్రమాణిక విపత్తు నియంత్రణ కార్యాచరణలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్ నంబర్లుః
1. జిల్లా కలెక్టరు కార్యాలయం, కాకినాడ 1800-425-3077
2. ఆర్డిఓ, కాకినాడ కార్యాలయం 0884-2368100
3. ఆర్డిఓ, అమలాపురం కార్యాలయం 08856-233208
4. ఆర్డిఓ, రామచంద్రపురం కార్యాలయం 08857-245166
5. ఆర్డిఓ, పెద్దాపురం కార్యాలయం 9603663227
6. పిఓ.ఐటిడిఏ, రంపచోడవరం కార్యాలయం 1800-425-2123
7. సబ్ కలెక్టర్, రంపచోడవరం కార్యాలయం 08864-243561
8. సబ్ కలెక్టర్, రాజమండ్రి కార్యాలయం 0883-2442344
9. ఆర్డిఓ, ఎటపాక కార్యాలయం 08864-285999, 7331179044

Kakinada

2021-12-02 15:59:57

ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. 24 గంటల్లో లబ్ధిదారునికి ఇసుక చేరాలన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇసుకపై సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీతతో ఆయన సమీక్షించారు.  ప్రజలకు, ప్రభుత్వ అవసరాలకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త రీచ్ లను గుర్తించి ఇసుక తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య ఏమైనా ఉంటే తెలియజేయాలన్నారు.   నదీ పరీవాహక కొన్ని ప్రాంతాల్లో సందర్శించాలని మైన్స్ డిడిని ఆదేశించారు. శాంతినగర్ వద్ద నిర్మాణం జరుగుతున్న డైక్ పనులు వద్ద ఇసుక తరలించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు లేఖ పెట్టాలన్నారు.   గృహ నిర్మాణానికి అవసరమైన స్టాక్ పాయింట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రణస్థలం, రాజాం ప్రాంతంల్లో ఎక్కడా ఇసుక స్టాక్ పాయింట్ లేదని, అక్కడ అవసరమైన భూమి అందుబాటులో లేకపోతే లే ఔట్లను వినియోగించుకోవాలని చెప్పారు. డిశంబరు 1వ తేదీ నాటికి ఇసుకను స్టాక్ పాయింట్ ల వద్ద నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు.   ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకుంటామని జయ ప్రకాష్ పవర్ వెంచర్స్ జిల్లా ఇన్చార్జి రాజేష్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో డిడి మైన్స్ సిహెచ్ సూర్య చంద్రరావు, ఎడి బాలాజి నాయక్, ఇరిగేషన్ ఎస్ఇ బి, ఆర్ అండ్ బి ఎస్ఇ కాంతిమతి, పంచాయతీ రాజ్ ఎస్ ఇ, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-24 08:03:07

మెరిట్ జాబితా రేపు ఆన్ లైన్ లో ప్రకటన.. డిఎంహెచ్ఓ

తూర్పుగోదావరి జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ క్రింద అర్బన్ పీహెచ్సీల్లో నియమించే వైద్యులు, పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ అభ్యర్ధుల జాబితా రేపు తూర్పుగోదావరి జిల్లా అధికారిక వెబ్ సైట్ లో పొందుపరచనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.గౌరీశ్వర్రావు తెలియజేశారు. ఈమేరకు మంగళవారం కాకినాడ లో జిల్లా మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అభ్యర్ధులు జాబితా ఆధారంగా ఒరిజిన్ సర్టిఫికేట్లతో నిర్ధేశించిన తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన సూచించారు. ఇందులో స్టాఫ్ నర్సులు 35, మెడికల్ ఆఫీసర్లు 40, ల్యాబ్ టెక్నీషియన్-1, హాస్పటిల్ అటెండెంట్-3, శానటరీ అటెండ్-3, కన్సల్టెంట్ క్వాలిటీ మెంటర్ పోస్టు ఒకటి ఉన్నదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివరించారు.

Kakinada

2021-11-23 16:20:45

సమాజసేవే సత్య సాయిబాబా లక్ష్యం..

ప్రపంచ దేశాలలో లక్షలాదిమంది హృదయాలలో పిలిస్తే పలికే దైవం గా నిలిచిన సత్య సాయి బాబా తుది శ్వాస వరకు సమాజసేవే తన ఊపిరిగా సేవలు అందించారని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ  సర్పవరం జంక్షన్ లో  బోటు క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సత్య సాయి బాబా 96 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  పట్నాయక్ మాట్లాడుతూ 1926 నవంబర్ 23న సత్య సాయిబాబా  జన్మించారని అన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి విద్య, వైద్య, తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. వీరభద్రరాజు మాట్లాడుతూ మతాలు, కులాలు,  ప్రాంతాలు,  వర్గాలు, దేశాల కతీతంగా సాయి భక్తులు సేవా మార్గంలో  పయనిస్తున్నారన్నారు. భక్తుల మనస్సుల్లో సానుకూల దృక్పథం తీసుకురావడం ద్వారా ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి సత్య సాయి బాబా బాటలు వేశారని కొనియాడారు. అనంతరం  వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్ ,బాపిరాజు, రాఘవ రావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-23 07:53:33

వాహన దారుల పట్ల జిల్లా ఎస్పీ దాత్రుత్వం..

ఐపీఎస్ అధికారులంటే కేవలం కింది స్థాయి అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణ కేసుల విధించే విషయంలో ఆదేశాలు జారీచేయడం చూసిన వాహనదారులకు..అదే ఐపీఎస్ అధికారులు తలచుకుంటే అదే వాహన దారుల ఇబ్బందులను కూడా అదే స్థాయిలో పట్టించుకోవడం తూర్పుగోదావరి జిల్లాలో కళ్లకి కట్టినట్టు కనిపించింది. అవును తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు అనపర్తి నుంచి రాజానగరం వెళ్లే రోడ్డు చిద్రమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటం మీడయా కధనాల ద్వారా తెలుసుకుని అక్కడి పోలీసు సిబ్బంది ఈ విషయం తెలియజేశారు. దీనితో రామచంద్రాపురం డిఎస్పీ పర్యవేక్షణలో సిఐ ఎన్వీ భాస్కర్ అనపర్తి నుంచి రాజానగరం వెళ్లే రోడ్డుతో పాటు ఇంకొన్ని రోడ్లపై పడ్డ గుంతలను తన సిబ్బందితో క్వారీ రాయి గుండతో కప్పించారు. ఈ పనికి పోలీస్ సిబ్బంది శ్రమధానంతో ఇదంతా చేపట్టారు. మనసున్న అధికారి ఇలాంటి సేవచేసే పనులు అప్పగిస్తే పోలీసు సిబ్బంది అంతే నిబద్ధతో ఏ విధంగా చేస్తారో ఈ శ్రమధానంతో నిరూపితమైంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, అదే ప్రజలు ప్రయాణాల్లో ఇబ్బందులు పడుతున్నా చూస్తూ ఊరుకోరని తూర్పుగోదావరి జిల్లా పోలీసు నిరూపించి, గుంతలు పడిన రోడ్డును బాగుచేసి చూపించారు. ఖాకీలు చేసిన ఈ సేవకు వాహనదారులు ఫిదా అవుతున్నారు. ఈ అంశం ఇపుడు జిల్లాలోనే చర్చనీయాంశం అవుతుంది.

Kakinada

2021-11-23 02:56:11

కకనకదాసు చూపిన జ్ఞాన మార్గంలో నడవాలి-జిల్లా కలెక్టర్

భక్త కనకదాసు వెనుకబడిన కులం లో, కడు పేద కుటుంబం లో జన్మించిమప్పటికి గొప్ప తత్వ వేత్తగా ఎదిగిన  వ్యక్తి యని ఆయన చూపిన జ్ఞాన మార్గం లో అందరూ నడవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో భక్త కనక దాసు జయంతిని ఘనంగా నిర్వహించారు.  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, జె.వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు  లు  తొలుత జ్యోతిని వెలిగించి    కనక దాసు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కన్నడ భాష లో అనేక కీర్తనలను రచించిన కనక దాసు  గొప్ప భక్తుడు,  ఆధునిక కవి, తత్వ వేత్త, సంగీత కళాకారుడని కలెక్టర్ పేర్కొన్నారు. వందేళ్లు జీవితాన్ని గడిపిన  వ్యక్తి అసలు కులమనేదే లేదనే తత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారని తెలిపారు. తక్కువ కులం లో పుట్టారని కృష్ణుని ఆలయం లోనికి పూజారులు ప్రవేశించ నీయలేదని, ఆయన భక్తికి  తార్కాణం గా  కృషునిని దర్శన భాగ్యం లభించిందని, అంతటి భక్తి పరాయనత గలా వారని పేర్కొన్నారు. నిజాయితీ గా వ్యవరించే వారికి ఎప్పటికైనా మంచే జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఎ. పి.డి డా. అశోక్ కుమార్, పశు సంవర్ధక శాఖ జె.డి డా.రమణ, మెప్మా పిడి సుధాకర్, డిడి ఫిషరీస్ నిర్మలా కుమారి, సమగ్ర శిక్షా పి.డి స్వామి నాయుడు,  బి.సి సంక్షేమ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భ0గా  కనక దాసు రచించిన కన్నడ  కీర్తన ను మహారాజా సంగీత కళాశాల విద్యార్థులు హృద్యంగా ఆలపించారు.

Vizianagaram

2021-11-22 14:22:48

సోమవారం స్పందన రద్దు.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్

తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవరం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం కాకినాడలోని జిల్లా మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సోమవారం స్పందన ఉందనుకొని జిల్లా కార్యాలయానికి వచ్చేవారు స్పందన రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. రేపు నిర్వహించే స్పందన రద్దు చేస్తున్నామని తదుపరి స్పందన యధాతధంగా కొనసాగుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు నేరుగా కలెక్టర్ కార్యాలయానికి రాకుండా తొలుత గ్రామసచివాలయాల్లో  స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే  మాత్రమే జిల్లా కలెక్టర్  కార్యాలయానికి  సమస్య పరిష్కారం కోసం రావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Kakinada

2021-11-21 15:32:32

పోషకాల గని కోడి గుడ్డు.. బాలల సంక్షేమ అధికారి వెంకట్రావు..

కోడిగుడ్డులో అధిక పోషకాలు ఉన్నందున ప్రభుత్వం కూడా అంగన్వాడి కేంద్రాల ద్వారా బాలలకు పోషకాహారంగా అందిస్తుందని జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్. వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడలోని  సర్పవరం జంక్షన్ లో లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో కోడిగుడ్లు పంపిణీ చేపట్టారు. వెంకటరావు మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా ప్రభుత్వం రోజూ కోడిగుడ్డు ఇస్తుందని తెలియజేశారు. డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, కోడి గుడ్డు లో ఆరు గ్రాముల ప్రోటీన్లు, 14 రకాల పోషక పదార్థాలు ఉన్నాయన్నారు.  అందుచే ప్రతి ఒక్కరు  రోజుకొక గుడ్డును ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి అవినాష్ రెడ్డి,  న్యాయవాది యనమల రామం,  సంఘం నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-21 13:34:35

ఉత్సాహంగా భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు..

కాకినాడ విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో ఆదివారం  జగన్నాదపురం సామా పబ్లిక్ స్కూల్ మరియు గాంధీనగరం మునిసిపల్ హైస్కూల్ లోను  ప్రఖండస్తాయి భగవద్గీత కంఠస్థం పోటీలు నిర్వహించినట్టు  జిల్లా ప్రముఖ్ లు గరిమెళ్ళ అన్నపూర్ణయ్య శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం పై జరిగిన ఈ పోటీలలో రెండుచోట్ల 150మంది  పోటీదారులు పాల్గొన్నారని తెలియజేశారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాలకు ఎంపిక చేయబడ్డవారిని జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు వివరించారు. న్యాయ నిర్ణేతలుగా  దుర్గాప్రసాద్, బి.శ్యాంసుందర్, డా.రమాదేవి, శ్రీమన్నారు, రవి వర్మ, మంగామని లు వ్యవహరించారని చెప్పారు. కార్యక్రమంలో  ఆర్.రవిశంకర్ పట్నాయక్, సహకార్యదర్శి ఉదయ్ భానోజి, ప్రఖండ ఇంచార్జ్ లు బచ్చు మహాలక్ష్మి, శ్రీకృష్ణ వాణి,ఈమని పరమేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-21 13:31:03

ప్రాణిక్ హీలింగ్ తో అద్భుత ఫలితాలు..

ప్రాణశక్తికి కేంద్రాలుగా ఉన్న ఏడు చక్రాలలో శక్తి ప్రసరణలో అంతరాయం కలిగితేనే రోగాలు వస్తాయని వాటిని ప్రాణిక్ హీలింగ్ చికిత్సతో నివారించవచ్చని ప్రముఖ వైద్య నిపుణురాలు ఎం.వరలక్ష్మి  చెప్పారు. ఆదివారం కాకినాడలోని  సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాణిక్ హీలింగ్ అనేది వ్యాధులను నయం చేసే ఒక ప్రాచీన  శాస్త్రీయ వైద్య విధానమని తెలియజేశారు. రోగి శరీరం యొక్క జీవధాతు పదార్థాలన్నీ ప్రాణశక్తిని సరి చేస్తాయని పేర్కొన్నారు. శరీరాన్ని సజీవంగా, ఆరోగ్యవంతంగా ఉంచే జీవ శక్తి లేదా ప్రాణాధార శక్తి ప్రాణశక్తి  అని గుర్తు చేశారు. ప్రాణా లేదా జీవనాధార శ్వాసను రోగి శరీరంలోకి ప్రసరింపజేయడంతో రోగికి పూర్తి స్వస్థత చేకూరుతుందని వరలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో బోట్ క్లబ్ నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-21 13:27:34

సైక్లింగ్ తో ఆరోగ్యం..స్వప్నిల్ దినకర్ పుండ్కర్..

ప్రతినిత్యం సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొదించుకోవచ్చునని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ నగరంలో గోదావరి సైక్లింగ్ క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాకినాడ నగరాన్ని సైకిల్  ఫ్రెండ్లీ నగరంగా మార్చేందుకు సైక్లింగ్ ట్రాక్లను విస్తరించనున్నామని, నగర వాసులు  ఈ ట్రాక్లను సైక్లింగ్కు వాడుకోవడం ద్వారా తగిన వ్యాయామం జరిగే పలు ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు అని తెలియజేశారు. కాకినాడ నగరం సైకిల్ ఫర్ చేంజ్  ఛాలెంజ్ కు ఎంపికైన సందర్భంగా ప్రతీ ఒక్కరూ సైక్లింగ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  భావితరాల వారికి కాలుష్య రహిత వాతావరణం అందించేందుకు ఈ సైకిల్  ట్రాక్లు ఎంతో దోహదపడతాయన్నారు. కనుక నగర వాసులంతా ఉత్సాహంగా సైక్లింగ్ లో పాల్గొనాలని చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాకినాడ సిటీ

2021-11-21 12:52:35