1 ENS Live Breaking News

విశాఖలో రేపటి స్పందన కార్యక్రమం రద్దు..

విశాఖజిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున స్పందన కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సోమవారం స్పందన ఉందనుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చేవారు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రేపు నిర్వహించే స్పందన రద్దు చేసి, తరువాత ఎప్పటి నుంచి స్పందన నిర్వహిస్తామో ముందుగానే తెలియజేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా తొలుత గ్రామసచివాలయాల్లో స్పందను సద్వినియోగం చేసుకొని..అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు మాత్రమే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Visakhapatnam

2021-11-21 12:01:10

విద్యా ప్రమాణాలు మరింతగా పెంచాలి..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున పిలుపునిచ్చారు.  శనివారం వి ఎం ఆర్ డి ఎ చిల్డ్రన్ ఎరీనా లో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందింప చేయాలన్నారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి వారి తెలివితేటలు మూర్తిమత్వాన్ని బట్టి వారు అభివృద్ధి సాధించే రంగాల కు అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలన్నారు. పదవ తరగతి లో శత శాతం ఉత్తీర్ణత  సాధించాలన్నారు.  ప్రభుత్వం విద్యారంగానికి అనేక రాయితీలను కల్పిస్తుందని పేద విద్యార్థుల అభివృద్ధికి జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి పథకాలను ప్రవేశపెట్టారని వీటిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.  ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలన్నారు. మీ దగ్గర చదువుకున్న వారు ఉన్నత పదవులను అలంకరిస్తే ఎంత గర్వంగా ఉంటుందో ఆలోచించండి అన్నారు. పిల్లలకు మంచి అలవాట్లు ఆరోగ్య సూత్రాలు సమాజం పట్ల అవగాహన పెంపొందించాలి అన్నారు జె వి కె కిట్లు అందరికీ అందేటట్లు చూడాలన్నారు. 

జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్ చంద్రకళ మాట్లాడుతూ పాఠశాలలకు మంచి వాతావరణం కల్పించాలని, గదులు పరిసరాలు మరుగుదొడ్ల తో సహా అన్నీ పరిశుభ్రంగా  ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నాడు నేడు పనులను వేగంగా పూర్తి అయ్యే విధంగా సహకరించాలన్నారు. పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి భవిష్యత్తుకు తగిన బాటలు వేయాలని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఆర్జేడీ జ్యోతి కుమారి జీవీఎంసీ డిప్యూటీ డి ఈ ఓ శ్రీనివాస్  రామరాజు డైట్ ప్రిన్సిపాల్  మాణిక్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-11-20 13:34:28

ఓటరు నమోదు పక్కాగా నిర్వహించాలి..

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటరు నమోదు పక్కాగా ఉండాలని సంయుక్త కలెక్టర్ ఎం.విజయ సునీత బూత్ స్థాయి అధికారులకు స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఆర్ అండ్ బి కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 2022 నాటికి 18 సంవత్సరములు నిండబోవు లేదా నిండిన వారందరికీ తప్పకుండా ఓటరుగా నమోదు చేయాలని చెప్పారు. మొబైల్ అప్లికేషన్ లేదా ఆన్ లైన్ ద్వారా కూడా కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే చిరునామా మార్పుకు, ఓటరు కార్డు సవరణకు కూడా అవకాశమున్న సంగతిని ఓటర్లకు వివరించాలని ఆమె పేర్కొన్నారు. ఓటరు సేవలు ఇప్పుడు మరింత చేరువలోకి వచ్చయన్న సంగతిని ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు వచ్చిన డోల మోనిక, తల్లి మహాలక్ష్మిలతో జె.సి ముచ్చటిస్తూ ఓటరు నమోదు గురించి ఏ విధంగా తెలిసింది అని ఆరాతీయగా, వాలంటీరు ద్వారా తెలిసినట్లు చెప్పడంతో జె.సి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా, ప్రత్యేక సమ్మరీ రివిజన్ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని, దీన్ని అవసరమైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.వెంకటరావు, ఉప తహసీల్దార్ ఎస్.సతీష్, బూత్ స్థాయి అధికారులు డి.వరలక్ష్మి, జి.లత, వి.హరీష్ కుమార్, చైతన్య, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-20 11:43:16

పోలీసులకు ట్రాఫిక్ సేఫ్టీ ఎక్విప్ మెంట్ అందజేత..

తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖకు “ట్రాఫిక్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్”ను  సిద్ధాంతం మరియు దివాన్ చెరువు టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఎస్పీ కార్యాలయంలో అందజేశాయి. ఈ సందర్బంగా శుక్రవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం కిట్లను ఎస్పీ రవీంధ్రబాబుకి అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు సేవలు అందించే పోలీసుల కోసం ఆలోచించి మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.  ట్రాఫిక్ పోలీసులు వేసుకునే రిఫ్లక్టివ్ జాకిట్లు 410, రిఫ్లక్టివ్ టేప్స్ 80 మీటర్లు, కాషన్ టేప్స్ 70రోల్స్, 35 ఫస్ట్ ఎయిడ్ కిట్స్, 35 బోటమ్ లైట్స్, 35 మంచినీటి కూలర్లు, 35 ఎల్ఈడీ టార్చిలైట్లు, 15 మెగా ఫోన్లు అందజేశారు. తమ సంస్థ సిఎస్ఆర్ సేవ కింద వీటిని అందజేసినట్టు నిర్వాహకులు అనిల్ బొమ్మిశెట్టి, తెలియజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎస్పీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-19 15:46:25

కాకినాడలో ఘనంగా జాప్ ఆవిర్భావ దినోత్సవాలు..

జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్) 29వ ఆవిర్భావ దినోత్సవాలలో భాగంగా కాకినాడ జెన్టీటియు  వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాదరాజు,రిజిస్ట్రార్ సుమలత లను తూర్పుగోదావరి జిల్లా శాఖ దుశ్శాలువతో  సత్కరించింది. అనంతరం రెడ్ క్రాస్ హోం ఫర్ సీనియర్ సిటిజన్స్ (వృద్దుల అశ్రయం)లో వృద్దులకు,పళ్ళు,పౌష్టికాహార సామగ్రిని పంపిణీ చేసారు.నవసేన పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ పిల్లల సంరక్షణ కేంద్రం,చేయూత స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న కేంద్రంలో పిల్లలకు పళ్ళు,మిఠాయిలు, పళ్ళు,బిస్కెట్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎస్.ఎమ్.కృష్ణంరాజు,రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.ఎన్.ఎస్.కనకాద్రి,శ్రీనివాస వర్మ,గీసాల శ్రీను,జనతా వెంకట్,రాము,దాసరి శ్రీనివాస్,సుధీర్,లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-19 11:19:49

కాకినాడలో ఘనంగా ఇందిరా గాంధీ 104 జయంతి వేడుకలు..

ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా భారత ప్రజలకు ఎనలేని సేవలు అందించారని గ్రంథాలయ విశ్రాంత ఉద్యోగి చింతపల్లి సుబ్బారావు అన్నారు. శుక్రవారం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘంగా ఆధ్వర్యంలో  ఇందిరా గాంధీ 104వ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తో కలిసి ఆయన మాట్లాడారు. 1966 నుంచి 1977 వరకు వరుసగా 3సార్లు మరియు 1980 లో  నాలుగో పర్యాయం ప్రధానమంత్రిగా దేశ ప్రజలకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. గరీబీ హటావో నినాదంతో దేశ ప్రజలను ఉత్తేజపరిచారని గుర్తుచేశారు. బ్యాంకులను జాతీయం చేసి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించి వాటి అభివృద్ధికి కృషి చేశారన్నారు. 20 సూత్రాల కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుపరిచారని సుబ్బారావు తెలిపారు. అంతకు ముందు ఇందిర చిత్రానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులు అర్పించారు.

Kakinada

2021-11-19 09:51:18

అల్లూరి స్మారక భవనాలకు మరమ్మతులు చేయాలి..

శిధిలావస్థకు చేరిన క్రిష్ణదేవీపేటలోని అల్లూరి స్మారక సమాధుల ప్రాంతంలోని భవనాలను ప్రభుత్వం తక్షణమే మరమ్మతులు చేపట్టాలన అల్లూరి యువజన సంగం అధ్యక్షులు పడాల వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 16 అక్టోబర్‌ 2021న మ్యూజియంలో ఉన్న సీలింగ్‌ కుప్ప కూలిపోవడంతో అందులో ఉన్న అల్లూరి చిత్రకళాఖండాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఆ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆ సమయంలో అందులో ఎవరూ లేక పెను ప్రమాదం తప్పిందన్నారు.2 నవంబర్‌ 2021న సమాధులపై ఉన్న శ్లాబు శిధిలం కావడంతో దీని పెచ్చులు క్రిందకు పడ్డాయి. ఆ సమయంలో సందర్శకులు ఎవరూ లేకపోవడం వల్ల ఏ ప్రమాదం జరగలేదన్నారు. ఇలా శిధిలావస్థకు చేరుకున్న చారిత్ర స్మారక భవనాలను నాటి నుంచి నేటివరకూ దానికి కోసం ఎవరూ పట్టించుకోలేదన్నారు. తెల్లవాడిపై పోరాటం చేసి భరతమాత కోసం  ప్రాణాలను వదిలిన అల్లూరి, ఆయన గుర్తుగా క్రిష్ణదేవీ పేటలో వున్న స్మారక మందిరాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివ్రుద్ధి చేయాలని ఆ ప్రకటనలో కోరారు. మీడియాకి విడుదల చేసిన ప్రకటనలను రాష్ట్రప్రభుత్వంలోని గిరిజన సంక్షేమశాఖలోని పలు విభాగాల అధికారులకు పంపినట్టు వీరభద్రరావు ఆ ప్రకటనలో తెలియజేశారు.

Kakinada

2021-11-18 10:17:38

పోలీసు వాహనాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ..

ఏపీ పోలీస్ రాష్ట్ర కార్యాలయం నుంచి తూర్పుగోదావరి జిల్లాకి కేటాయించిన రెండు ఐషర్ వాహనాలను జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ప్రారంభించారు. గురువారం ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వీటిని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా పోలీసు సిబ్బంది విధి నిర్వహణకు ఈ వాహనాల సేవలను ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కరణం కుమార్, డిఎస్పీ అంబికా ప్రసాద్, ఏఆర్ డిఎస్పీ అప్పారావు, ఆర్ఐ వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-18 07:19:57

అల్పపీడనం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల పాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవ‌కాశ‌మున్నందున క్షేత్ర స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాల‌ని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌.. అధికారుల‌ను ఆదేశించారు. బుధవారం క‌లెక్ట‌రేట్ నుంచి ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాల‌పై క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. జేసీ (ఆర్‌) సుమిత్ కుమార్, జేసీ (డీ) కీర్తి చేకూరి; ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ), జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్ విధానంలో ఐటీడీఏ పీవోలు, స‌బ్‌క‌లెక్ట‌ర్లు, ఆర్‌డీవోలు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలు, త‌హ‌సీల్దార్లు త‌దిత‌రుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ వ‌ర్షాల నేప‌థ్యంలో మండల ప్రత్యేక అధికారులు.. క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. విపత్తు నిర్వహణ ప్రణాళికల‌ను తు.చ‌. తప్పకుండా అమలు చేయాలన్నారు. జిల్లాలో ఆర్‌బీకేల ద్వారా ప్రారంభ‌మైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు మండల స్థాయిలో సమన్వయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. మిల్లర్లకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలను ఈ నెల19 నాటికి సమర్పించే విధంగా చూడాలన్నారు. జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందించేందుకు పంట నష్టం వివరాల సేకరణ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయాలన్నారు. వాస్తవ సాగుదారుల‌కు నష్టపరిహారం అందే విధంగా పారదర్శకంగా గణాంకాల సేకరణ చేపట్టాలన్నారు. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు కార్య‌క్ర‌మానికి సంబంధించి అయిదు ద‌శ‌ల ప్ర‌క్రియ పూర్తికి జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల స్థాయి అధికారులు స‌మ‌న్వ‌యంతో కృషిచేయాల‌న్నారు. జేసీ (ఆర్‌) సుమిత్ కుమార్.. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పంట నష్టం వివరాల సేకరణ, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, భూ రికార్డుల స్వచ్ఛీకరణ తదితర అంశాలపై సమీక్షించారు.
జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి.. సీజ‌నల్ వ్యాధులు, కోవిడ్ వ్యాక్సినేషన్, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, జగనన్న భూ హక్కు భూ రక్షా, గ్రామ/వార్డు స‌చివాల‌యాల్లో సేవ‌లు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు. అదే విధంగా ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ), జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ.. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు స‌ర్వే, జ‌గ‌న‌న్న చేదోడు రీవెరిఫికేష‌న్‌, జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌, వ‌స‌తి దీవెన‌, పింఛన్లు త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.
ఈ స‌మావేశంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిశోర్‌, రంపచోడవరం ఐటీడీఏ పీవో సీవీ ప్రవీణ్ ఆదిత్య, ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, సివిల్  స‌ప్ల‌య్స్ జోనల్ మేనేజర్ డి.పుష్ప‌మ‌ణి, జిల్లా మేనేజ‌ర్ ఇ.ల‌క్ష్మీరెడ్డి, డీఎస్‌వో పి.ప్రసాద‌రావు, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, సీపీవో పి.త్రినాథ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-11-17 17:12:35

కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ నోటా ఓట్లు 194

కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో నాలుగు నాలుగు డివిజన్ లలో 194 ఓట్లు నోటాకి ఓట్లు పోలవడం అధికారులకే ఆశ్చర్యాన్ని కలిగించింది. బుధవారం కాకినాడలో ఎన్నికల అధికారి ప్రకటించిన ఫలితాల్లో అత్యధికంగా  3వ డివిజన్ లో88, 9వ డివిజన్ లో 36, 30వ వార్డులో 45, 16వ వార్డులో 25 ఓట్లు నోటాకి పోలయ్యాయి. ఈ నోటా ఓట్ల పరంపర పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల వరకూ పోలవడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశం అవుతుంది. అభ్యర్ధులకి వచ్చిన మెజార్టీని ఏ విధంగా చెప్పుకుంటున్నారో..అదే స్థాయిలో నోటాకి పోలైన ఓట్ల సంగతి కూడా జిల్లా కేంద్రంలో అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kakinada

2021-11-17 16:59:15

రక్తదానం ప్రాణదానంతో సమానం..

రక్తదానం ప్రాణదానం అని సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కే. సూర్య ప్రభాకర్ అన్నారు. బుధవారం స్థానిక ఆదిత్య కళాశాల విద్యార్థులు రక్తదానం చేయుటకు ముందుకు వచ్చి తమ కళాశాలలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రభాకర్ హాజరయ్యారు. రక్త దానం చేయుటకు ముందుకు వచ్చిన యువతను ప్రశంసించారు. రక్త దానం సమాజంలో స్ఫూర్తి నింపుతుందని, యువత సామాజిక అంశాల పట్ల స్పందించడం మంచి పరిణామమని ఆయన అన్నారు. జిల్లాలో అవసరం ఉన్న యూనిట్ల కంటే తక్కువ నిల్వలు ఉన్నాయని తద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తాన్ని అందించడం కష్టమవుతుందని ప్రభాకర్ చెప్పారు. రెడ్ క్రాస్ సౌజన్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల కళాశాల యాజమాన్యంను ఆయన అభినందించారు.   ఆదిత్య కళాశాల కరస్పాండెంట్ గుప్త లడ్డు మాట్లాడుతూ ప్రతి ఏడాది రక్తదాన శిబిరాన్ని తమ కళాశాల నిర్వహిస్తూ కొంతమేరకు ప్రాణాలు కాపాడుటకు తోడ్పాటును అందిస్తున్నామనే ఆనందం పొందుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్, నెహ్రూ యువ కేంద్ర ఇంచార్జ్ డి. శ్రీనివాస్,  ఆదిత్య కళాశాల అధ్యాపకులు భాస్కర్, రెడ్ క్రాస్ ప్రతినిధి మరియు యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-17 16:44:45

జర్నలిస్టులకు ఆదివారం వన సమారాధన..

ది కాకినాడ జర్నలిస్ట్ మ్యూచువల్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ, కాకినాడ రూరల్ పరిధిలోని జర్నలిస్టుల కుటుంబాలతో 21వ తేదీ ఆదివారం కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసినట్టు కార్యక్రమం కన్వీనర్ స్వాతి ప్రసాద్ తెలియజేశారు. ఈ మేరకు బుధవారం కాకినాడ రూరల్ లో ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కొవ్వాడ రైల్వే స్టేషన్ ప్రక్కన మురళిగారి తోటలో ఈ వన సమారాధన ఏర్పాటు చేశామన్నారు. జర్నలిస్టుల సంఘాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులంతా కుటుంబ సమేతంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి అధ్యక్షులుగా ఎల్.శ్రీనివాస్, ప్రోగ్రామ్ కో-కన్వీనర్ గా మంగా వెంకట శివరామక్రిష్ణలు వ్యవహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

కాకినాడ రూరల్

2021-11-17 15:38:23

నృసింహ దీక్షలను విజయవంతం చేయాలి..

విశాఖలోని సింహచలం శ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నృసింహ స్వామి అత్యంత మహిమాన్వితుడని, భక్తులు కోరుకొన్న కోర్కెలు తీర్చే స్వామిగా కీర్తింపబడుతున్నారని సింహచలం దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు  గంట్ల శ్రీనుబాబు అన్నారు. బుధవారం సింహద్రినాధుని దర్శించుకున్న అనంతరం జనవరి 13న జరగనున్న వైకుంఠ ఏకదశి ఏర్పాట్ల సమావేశంలో పాలొన్నారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మీడియాతో మాట్లడుతూ, సింహగిరిపై ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నృసింహ దీక్షలను విజయవంతం చేయాలని భక్తులను కోరారు. ఈ నెల18 నుంచి మండల దీక్షలు ప్రారంభమవుతాయని, అవి వచ్చే నెల 29 నాటికి ముగిస్తాయన్నారు. ఇక 32 రోజుల దీక్షలకు సంబంధించి ఈ నెల 26న ప్రారంభం కానున్నాయని,వచ్చే నెల 29తో ముగిస్తాయన్నారు.నృసింహదీక్షల భక్తులకు సంబంధించి ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనుబాబు తెలిపారు. కావున ఆయా దీక్షలకు దేశ వ్యాప్తంగా మరింత విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.హిందూ ధర్మ ప్రచారానికి ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిందేనన్నారు.వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి వరుసుగా రావడంతో అప్పన్న ఆలయానికి భక్తులు తాకిడి గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు.

Simhachalam

2021-11-17 10:01:11

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు..

విజయనగరం జిల్లాలో రైతు బజార్లో బోర్డు మీద ప్రకటించిన ధరలకు మాత్రమే  కూరగాయలను విక్రయించాలని, అంతకన్నా ఎక్కువగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్  తెలిపారు. బుధవారం ఆర్ అండ్ బి రైతు బజార్ ను జె.సి ఆకస్మికంగా  తనిఖీ చేశారు. రైతులతో కూరగాయల లభ్యత, ధరలు, తదితర అంశాల పై మాట్లాడారు. ఈ మధ్య  కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతినడం వలన బైట మార్కెట్ల నుండి తెప్పించడం జరుగుతోందని, అందువలన ధరలు అధికంగా ఉంటున్నాయని రైతులు తెలిపారు. ముఖ్యముగా టమాటా చిత్తూరు జిల్లా  మదనపల్లి, పలమనేరు నుండి వస్తున్నాయని, అక్కడ కూడా వర్షాలు పడడం వలన పంట నష్టం జరగడం తో అధిక ధరలకు కొంటున్నామని వివరించారు.  అయినప్పటికీ బహిరంగ మార్కెట్ల కన్నా 20 శాతం పై బడి తక్కువకే రైతు బజార్ ధరలు ఉన్నాయని అన్నారు.  జిల్లాలో కూరగాయల కొరత లేదని,  కృత్రిమ కొరతలు సృష్టించి, అధిక ధరలకు విక్రయించ వద్దని ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ   పరిస్థితుల్లో  చేయగలిగేది ఏమీ లేదని, మరో 15 రోజుల్లో  పరిస్థితులు చక్కబడి, దిగుబడి పెరగవచ్చు నని ఆశాభావం వ్యక్తం చేశారు. వినియోగ దారులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాలను అందుబాటు లో ఉండేలా చూడాలని సూచించారు.  జె.సి వెంట మార్కెటింగ్ సహాయ సంచాలకులు శ్యాం కుమార్, ఎస్టేట్ అధికారి సతీష్ పాల్గొన్నారు.

Vizianagaram

2021-11-17 07:56:38