1 ENS Live Breaking News

భారీ వ‌ర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

విజ‌య‌న‌గ‌రం ఈ నెల 17,18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని, అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న ద్వారా సూచించారు.  బంగాళాఖాతంలోని అండ‌మాన్ నికోబార్ దీవుల స‌మీపంలో  అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింద‌ని, ఇది నెమ్మ‌దిగా నైరుతి దిశ‌గా క‌దులుతోంద‌ని భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించిన‌ట్లు తెలిపారు. ఇది వాయుగుండంగా మారి, ఈనెల 18న మ‌న రాష్ట్ర తీరాన్ని తాకే అవ‌కాశం ఉంద‌న్నారు. అందువ‌ల్ల 17,18 తేదీల్లో భారీ వ‌ర్షాల‌తోపాటు, గంట‌కు 45-65 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ప్ర‌మాదం ఉంద‌న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మ‌త్స్య‌కారులు స‌ముద్రంలోకి వెళ్ల‌కూడ‌ద‌ని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు మ‌త్స్యకారుల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని, జిల్లా మ‌త్స్య‌శాఖ‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. భారీ వ‌ర్షాల‌ను, ఈదురు గాలుల‌ను దృష్టిలో పెట్టుకొని, ఆర్‌డిఓ, స‌బ్ క‌లెక్ట‌ర్‌తోపాటు అన్ని మండ‌లాల తాశీల్దార్లు, ఎంపిడిఓలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌గిన ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.  ఏదైనా అనుకోని సంఘ‌ట‌న జ‌రిగిన ప‌క్షంలో, త‌క్ష‌ణ‌మే క‌లెక్ట‌రేట్‌లోని కంట్రోల్ రూముకు స‌మాచారాన్ని అందించాల‌ని సూచించారు.

Vizianagaram

2021-11-15 15:50:25

మాస్కులేకుండా తిరిగిన వారిపై 166 కేసులు..

తూర్పుగోదావరి జిల్లాలో మాస్కులేకుండా తిరుగుతున్నవారిపై 166 కేసులు నమోదు చేసి 16వేల 600 రూపాయలు అపరాద రుసుము వసూలు చేసినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు తెలియజేశారు. దీనితో ఈ సంవత్సరం మార్చి 26  నుంచి నవంబరు 15వ తేదీ వరకూ ఒక లక్షా 69వేల 692 చాలనాలు విధించామన్నా ఎస్పీ వాటి ద్వారా ఒక కోటి 48 లక్షల 62 వేల 180 రూపాయలు అపరాద రుసుము వసూలు చేసినట్టు చెప్పారు. వాహనదారులు తప్పని సరిగా మాస్కుధరించి మాత్రమే ప్రయాణాలు చేయాలన్నారు. అలాకాకుండా నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు తప్పవని ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు హెచ్చరించారు.

Kakinada

2021-11-15 15:35:05

ఓ.టి.ఎస్ చెల్లింపుల వేగం పెంచాలి..కలెక్టర్

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ ప్రక్రియ ను వేగంగా జరిగే లా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి మండల  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్  ఎం పి డి ఓలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేకా ధికారులతో ఓ.టి.ఎస్ పై టీమ్ కాన్ఫరెన్స్ ద్వారా మండల వారీగా పురోగతి పై సమీక్షించారు. అనేక మండలాల్లో సున్నా ప్రగతి ఉందని, మంగళవారంలోగా ఎక్కడా  జీరో కనపడకూడదని, వి.ఆర్ ఓ లు తమ పనితీరు చూపించేలా లక్ష్యాలను చేరాలని  అన్నారు.  మండల ప్రత్యేకాధికారులు  గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల తో వెంటనే సమావేశం  ఏర్పాటు చేసి ఓ.టి.ఎస్. పై అవగాహన కల్పించి, గ్రామాల్లో ప్రచారం జరిగేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభ జరిపి ఓ.టి.ఎస్ విధి విధానాలను వివరించాలన్నారు. ఎంత  చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి  , దాని వలన లాభాలేంటి  అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నారు.  పట్టాలు, భూ  సమస్యలు ఉన్న చోట జె.సి రెవిన్యూ పరిష్కరిస్తారని, వారి దృష్టి లో పెట్టాలని అన్నారు. విజయనగరం అర్బన్, రూరల్ లో పురోగతి తక్కువ గా ఉందని, జె.సి రెవిన్యూ ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. 
సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ డేటా ఆమోదం అయితేనే చలానా  జెనరేట్ అవుతుందని,  అప్పుడే చెల్లింపులకు అవకాశం ఉంటుందని, ముందుగా క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ పూర్తి చేసి డేటా వెరిఫై చేయాలని సూచించారు. ఓ.టి.ఎస్ పై ముద్రించిన కరపత్రాలను వాలంటీర్ ల ద్వారా గ్రామాల్లో అందరికి అందేలా చూడాలని అన్నారు. ఓ.టి.ఎస్ చెల్లింపు చేసిన  వారి వివరాలను పత్రికల ద్వారా ప్రచారం జరగాలన్నారు.  గడువు లోగా లక్ష్యాలను  పూర్తి చేయడానికి ప్రత్యేకధికారులు పూర్తి గా బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ టీమ్ కాన్ఫరెన్స్ లో జె.సి రెవిన్యూ డా. కిషోర్ కుమార్,  హౌసింగ్ పి.డి కూర్మినాయుడు, హౌసింగ్ సహాయ ఇంజినీర్లు , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-11-15 09:18:52

బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ రవీంద్రనాధ్ బాబు..

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో సోమవారం జరుగుతున్న నగరపాలక సంస్థ ఉపఎన్నికల బందోబస్తును జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు స్వయంగా పరిశీలించారు. కాకినాడలోని 3, 9, 16, 30 డివిజన్ల కార్పోరేటర్ల ఎన్నికల వద్ద పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. ఏ డివిజన్ లో అయినా ఎన్నికల నియామవళిని ఎవరు ఉల్లంఘించినా తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బందోబస్తు అధికారులకు సూచించారు. ప్రశాంత వాతవారణంలో ఎన్నికలు పూర్తిచేయడానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన విధంగా భౌతిక దూరం పాటిస్తూ ఎన్నికల్లో పాల్గొనాలని ఎస్పీ ఈ సందర్భంగా ఓటర్లకు సూచించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-15 09:17:02

ఎస్పీ ఆఫీస్ కి ఐటీసీ 2 జనరేటర్లు వితరణ..

తూర్పుగోదావరి జిల్లాలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఐటిసీ సంస్థ రెండు పవర్ జనరేటర్లు వితరణ చేసిందని జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్ర నాధ్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఐటీసీ సంస్థ ప్రతినిధులు ఫణిభూషన్, రవికాంత్ లు వీటిని జిల్లా కార్యాలయంలో అందజేశారని చెప్పిన ఆయన వీటిని కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అందజేశారన్నారు. అత్యవసర సమయంలో ఈ పవర్ జనరేటర్లు జిల్లా కార్యాలయానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ ఈ సందర్భంగా వివరించారు. జనరేటర్లు అందించిన సంస్థ ప్రతినిధులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కరణం కుమార్ , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-15 08:57:13

శివనామ స్మరణతో మార్మోగిన కాకినాడ నగరం..

ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ స్మార్ట్ సిటి శివనామ స్మరణతో మార్మోగిపోయింది. కార్తీకమాసం రెండవ సోమవారం అందునా ఏకాదశి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శివలయాల్లో పూజలు నిర్వహించారు. భానుగుడి దగ్గర్లోని శివాలయంలో నందీశ్వరుడిని దర్శించుకొని శివుని అనుగ్రహం కోసం పూజలు చేపట్టారు. భోళా శంకరుడిని ప్రశన్నం చేసుకోవడానికి ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. సూర్యోదయ సమయంలో సాగర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివుడికి దీపోత్సవం నిర్వహించారు. క్షీరాభిషేకాలు చేసి హారతులు పట్టారు. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం రోజున శివునికి అభిషేకాలు చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని శివాలయ ప్రధాన పూజరి శ్రీనివాస శర్మ చెప్పారు. ఉదయం పూజలు చేసింది మొదలు సాయంత్రం వరకూ ఈరోజు భక్తులు ఉపవాసాలు ఉండి మళ్లీ సాయంత్రం శివునికి పూజలు చేస్తే ఉపవాస ఫలితం వుంటుందని పేర్కొన్నారు. తెల్లవారు జామున ఐదుగంటల నుంచే నగరంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. 

Kakinada

2021-11-15 07:54:13

గిరిజన యువత కోసం త్వరలోనే మెగా జాబ్ మేళా.. ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు

తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ఏఓబీ ప్రాంతంలోని గంజాయి సాగు, ఇతర వ్యవహారాల్లో చిక్కుకున్న గిరిజన యువతను సన్మార్గంలో పెట్టేందుకు త్వరలోనే మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు తెలియజేశారు. ఆదివారం కాకినాడలో తన కార్యాలయంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. గంజాయి స్మగ్లర్లు ఇచ్చే కొద్దిపాటి డబ్బుకు ఆశపడే గిరిజన యువత ఈ అక్రమ రవాణాకు సహకరించి వారి జీవితాలను నాశం చేసుకుంటున్నారని అన్నారు. పరివర్తన కార్యక్రమంలో భాగంగా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే గిరిజన ప్రాంతాలు ఆపైన ఏఓబీ ప్రాంతాల్లో వుండే గిరిజన యువత వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రయ పూర్తికాగానే త్వరలోనే జాబ్ మేళా నిర్వహించి గిరిజన యువతకు ఉపాది అవకాశాలు కల్పించనున్నట్టు ఎస్పీ వివరించారు. ఇప్పటికే జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఎస్ఐల తో మాదక ద్రవ్యాల మత్తు, వ్యాపారాలు వదిలిపెట్టే విధంగా యువతకు ప్రత్యేక కౌన్సిలింగ్ లు ఆయా స్టేషన్ ల ఎస్ఐ లద్వారా ఇప్పిస్తున్నామని ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు ఈ సందర్భంగా మీడియా కివివరించారు.

Kakinada

2021-11-14 17:15:28

సమాజానికి దిక్చూచి పాత్రికేయులే..

సమాజానికి దిశ నిర్దేశ చేసేది పాత్రికేయులేనని, ప్రజా సమస్యల పరిష్కారంలో వారి కృషి ప్రశంసనీయమని విశాఖ మేయర్ గొలగాని హారి వెంకట కుమారి అన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆదివారం ఆంధ్రాయూనివర్సిటీ వైవీఎస్ మూర్తి ఆడిటోరియం ప్రాంగణంలో నిర్వహించిన మీడియా అవార్డుల ప్రధానోత్సవం, జర్నలిస్టుల పిల్లల ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిరంతరం సమాజానికి సేవలందించే జర్నలిస్టులను ప్రతిభకు ప్రోత్సాహం పేరిట గౌరవించుకోవడం అభినందనీయమన్నారు. దీని వల్ల జర్నలిస్టుల్లో మరింత ఉత్సాహం పెరిగి బాధ్యతా యుతంగా పనిచేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా వైజాగ్ జర్నలిస్టుల ఫోరం తమ సభ్యుల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న విఎంఆర్డిఏ చైర్ పర్సన్ విజయ నిర్మల, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పి వి జి డి ప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను గుర్తించి వారు తెలియజేయడం వల్ల అనేక సమస్యలను సకాలంలో పరిష్కరించడంతో పాటు ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాలు కలుగజేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఇటీవలే ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించిన వీజెఎఫ్ ఆ తరువాత దీపావళి, ఇప్పుడు ప్రతిభకు ప్రోత్సాహం పేరిట అవార్డులు ప్రధానం చేయడం, జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు అందించడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆదర్శనీయంగా నిలుస్తుందన్నారు. గౌరవ అతిధిగా హాజరైన మారిటైమ్ బోర్డ్ చైర్మన్, కాయల వెంకట రెడ్డి మాట్లాడుతూ,      నగరాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. సమాజంలో జర్నలిస్టులు చేస్తున్న కృషి వల్ల ప్రజలకు అనేక మంచి పనులు చేయగలుగుతున్నామన్నారు. జీవీఎంసీ పరంగా తాము చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు గుర్తు చేసి ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు నడిపిస్తున్న పాత్రికేయుల సేవలను ఈ సందర్భంగా మేయర్ అభినందించారు. పోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అవార్డుల ప్రధానోత్సవం, ఉపకార వేతనాలకు సంబంధించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అందరికి సమన్యాయం చేస్తున్నామన్నారు. సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, విద్య, వైద్యంతో పాటు క్రీడలకు, పండుగల నిర్వహణ చేపడుతున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే వైజాగ్ జర్నలిస్టుల ఫోరం లక్ష్యమని త్వరలోనే నార్లభవన్ ఆధునీకరించి లిఫ్ట్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో  సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జి ఎస్ ఎన్ రాజు, అవార్డుల కమిటీ చైర్మన్ అర్.నాగరాజుపట్నాయక్ అధ్వర్యంలో బీసీ కమిషన్ సభ్యులు పక్కి దివాకర్, ధ్యక్షులు టి. నానాజీ, జాయింట్ సెక్రటరీ డాడి రవికుమార్, కోశాధికారి పి.ఎస్.మూర్తి, పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


ఘనంగా మీడియా అవార్డుల ప్రధానోత్సవం..
కపిలగోపాలరావు అవార్డుతో పాటు వివిధ కేటగిరిల్లో విశేష ప్రతిభ కనబర్చిన 31 మంది పాత్రికేయులకు అతిధులు చేతులు మీదుగా ఘనంగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు అవార్డు గ్రహీతలు వారి కుటుంబ సభ్యులతో హాజరై అవార్డులను స్వీకరించారు. మీడియా అవార్డుల కమిటీ చైర్మన్ అర్. నాగరాజుపట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది.

ఉపకార  వేతనాలు పంపిణీ ..

జర్నలిస్టుల పిల్లలు విద్యలోనూ ఉన్నతంగా ఉన్నతంగా రాణించి అనేక మందికి ఆదర్శనీయంగా నిలిచారు. దీంతో ప్రతిఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జర్నలిస్టుల పిల్లలకు సంబంధించి సుమారు 120 మందికి ఉపకార వేతనాలను అతిధులు చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఎల్.కె.జీ నుంచి బీటెక్ వరకు ఈ ఏడాది ఉపకార వేతనాలు అందజేశారు. ప్రతిభను గుర్తించాలన్నదే తమ లక్ష్యమని ఫోరం అధ్యక్షులు, స్కాలర్షిప్ కమిటీ చైర్మన్ గంట్ల శ్రీనుబాబు తెలిపారు.

అలరించిన విదేశీయ సాంస్కృతిక కార్యక్రమాలు..
ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమంలో ఈ ఏడాది విదేశీయ కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. శ్రీలంక నుంచి విచ్చేసిన ప్రత్యేక బృందం ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అదే విధంగా మహారాష్ట్ర, రాజస్థాన్తో పాటు ఒడిషా కళాకారులు, స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రశంసనీయంగా సాగాయి.

Andhra University

2021-11-14 13:18:04

ఉత్తరాంధ్రను వెక్కిరిస్తే చూస్తూ ఊరుకోం..

అమరావతి రైతుల పాదయాత్ర టీడీపీ చేయిస్తున్న దగా యాత్రగా మిగిలిపోయిందని, ఈ యాత్ర లక్ష్యం మిగతా ప్రాంతాలవారిని వెక్కిరించటం, రెచ్చగొట్టడంలా మారిపోయిందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతులకు విత్తనాలు ఇన్పుట్ పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకోవటం, చివరికి విశాఖపట్టణంలో ఏ ఒక్క నిర్మాణం జరగటానికి వీల్లేదని స్టేలు తీసుకురావటం ఉత్తరాంధ్ర ప్రయోజనాలమీద దండయాత్ర కాదా అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంటే చంద్రబాబు మాత్రం తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నష్టం రాకూడదని ఈ యాత్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి యాత్ర కాస్త భ్రమరావతి యాత్రగా మారిపోయిందనీ, యాత్రకు న్యాయస్థానం టూ దేవస్థానం అని పేరుపెట్టారు కానీ  దౌరజన్యం టూ దౌర్జన్యం అనో.. మోసం టూ మోసం అనో పేరు పెడితే బాగుండేదని చెప్పారు. పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబే నని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన కు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారని, మూడు ప్రాంతాల అభివృద్ధి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని కృష్ణదాస్ స్పష్టం చేశారు.

Narasannapeta

2021-11-14 13:03:45

జిల్లాలో టిబి కేసులు గుర్తించాలి..

శ్రీకాకుళం జిల్లాలో టిబి కేసులను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. క్షయ నివారణ పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విస్తృతంగా సర్వే నిర్వహించి క్షయవ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించాలని స్పష్టం చేశారు. గుర్తించడం వలన అవసరమైన మందులు అందించుటకు చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. టిబి నివారణ అధికారి ఎన్.అనురాధ మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధి గుర్తించుటకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలో 12 టిబి యూనిట్లు, 31 కఫ పరీక్ష కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. క్షయ వ్యాధి నివారణలో భాగస్వామ్యం అవుతున్న ఆశా కార్యకర్తలకు పారితోషికం కూడా అందించడం జరుగుతుందని అనురాధ తెలిపారు. సి బి నాట్ వాహనాల ద్వారా సర్వే చేయడం జరిగిందని చెప్పారు. 35 వేల 752 మందికి స్క్రీన్ చేయగా 245 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అందులో ఏడు కేసులు గుర్తించడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.జగన్నాథరావు, అదనపు డిఎంహెచ్ చ్ఓ కె. రామమూర్తి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కృష్ణ మోహన్, లీలా, అప్పారావు, జెమ్స్ ఆస్పత్రి ఆర్.ఎం. ఓ పి. తిరుపతిరావు, బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ఎమ్. ప్రసాదరావు, క్షయ వ్యాధి నివారణ కమిటీ గౌరవ కార్యదర్శి మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-12 14:27:10

స్కానింగ్ కేంద్రాలు నివేదికలను సమర్పించాలి..

శ్రీకాకుళం జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు విధిగా తమ స్కానింగ్ వివరాలను ఆన్ లైన్ లో సమర్పించాలని స్పష్టం చేశారు. స్కానింగ్ కేంద్రాల్లో నెలరోజుల్లోగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో బాలబాలికల నిష్పత్తి వ్యత్యాసం ఎక్కువగా ఉందని, ఇది భవిష్యత్తుకు మంచిది కాదని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉండటం సంతోషాన్ని కలిగించే విషయమని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాధ రావు మాట్లాడుతూ కంచిలి, ఆమదాలవలస, హిరమండలం, సరుబుజ్జిలి, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాల్లో బాలబాలికల నిష్పత్తి తక్కువగా ఉందని అన్నారు. స్కానింగ్ కేంద్రాల నిర్వహణపై దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కే.జయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కే. శ్రీనివాసులు, అదనపు ఎస్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కె. రామ్మూర్తి, లీల, కే.అప్పారావు, కృష్ణ మోహన్, బి.సూర్యారావు, జెమ్స్ ఆసుపత్రి టి.తిరుపతి రావు, యూత్ క్లబ్ అధ్యక్షులు ఎం. ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-12 14:23:27

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో న‌వ‌గ్ర‌హ హోమం..

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం న‌వ‌గ్ర‌హ హోమం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మ‌వారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు. హోమ మ‌హోత్స‌వాల్లో భాగంగా న‌వంబ‌రు 13 నుండి 21వ తేదీ వ‌ర‌కు శ్రీ కామాక్షి అమ్మ‌వారి హోమం(చండీ యాగం) జ‌రుగ‌నుంది. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-11-12 08:39:20

తుపాను నష్టాన్ని కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలి..

విజయనగరం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని, అయితే ఇంతవరకూ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిశోర్ కుమార్ తెలిపారు.  మరో రెండు రోజులు తుఫాన్ హెచ్చరికలు ఉన్నందున మత్స్య కారులు వేటకు వెళ్లకూడదని అన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు తో కలసి జె.సి కిషోర్ కుమార్  శుక్రవారం కంట్రోల్ రూమ్ ను సందర్శించి   రియల్ టైం మాప్ ల ద్వారా, వర్ష పాతాన్ని, అల్ప పీడనం దిశ ను పరిశీలించారు.  అనంతరం మాట్లాడుతూ  రెవిన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని డి.ఆర్.ఓ కు సూచనలు జారీ చేశారు. తహశీల్దార్లు,  సచివాలయ సిబ్బంది   పని చేసే చోటే ఉండాలని అన్నారు. తుఫాన్ వలన ఎలాంటి సంఘటనలు జరిగినా  వెంటనే కంట్రోల్ రూమ్ కి సమాచారాన్ని అందజేయాలన్నారు. ఇప్పటికే కోత చేసి పొలాల్లో ఉన్న   వరి  పంట నష్టం జరగకుండా టార్పలీన్  కప్పాల న్నారు.  కోత దశ లో ఉన్నందున పొలంలో నీరు నిల్వ లేకుండా  చూడాలని, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కలిగించేలా చూడాలని జె.డి కి సూచించారు.  నూర్పు చేసిన ధాన్యాన్ని సమీప సేకరణ కేంద్రం అయిన రైతు భరోసా కేంద్రాల్లో  సంప్రదించి తేమ శాతాన్ని  తనిఖీ  చేసుకోవాలన్నారు.  గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో  శుక్రవారం ఉదయానికి అత్యధికంగా గరివిడి లో 27.2 మిమి లు, అత్యల్పంగా  కోమరాడ మండలం లో 5.2 మిమి ల  వర్షపాతం నమోదైందని తెలిపారు.

Vizianagaram

2021-11-12 08:17:10

విశాఖలో రేపు విజెఎఫ్‌ ప్రతిభకు ప్రోత్సాహం..

వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌.దుర్గారావులు తెలిపారు. శుక్రవారం విశాఖలోని డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  వీరు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఏయూ వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో వివిధ విభాగాలకు చెందిన జర్నలిస్టులకు అతిథులు చేతుల మీదుగా మీడియా అవార్డులను ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. కపిల గోపాలరావుతో పాటు,వివిధ కేటగిరీల్లో అవార్డులు ప్రధానం చేస్తామన్నారు. జర్నలిస్టుల పిల్లలకు సుమారు 120 మందికి ఉపకార వేతనాలను అందజేస్తామన్నారు. ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన పిల్లలకు నగదు,మెమోంటో, ప్రశంసాపత్రం అందజేస్తామన్నారు. 14వ తేది ఉదయం నుంచి మధ్యాహ్నాం విందు భోజనం వరకూ జరిగే ఆయా కార్యక్రమాల్లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని వీరు కోరారు.  జర్నలిస్టుల సంక్షేమానికి తమ పాలకవర్గం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఇటీవలే ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌ను విజయవంతంగా ముగించుకోవడం జరిగందని, ఆ తరువాత దీపావళి పండగను అత్యంత వేడుకుగా నిర్వహించామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.  మీడియా అవార్డుల కమిటీ చైర్మన్‌ ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ మాట్లాడుతూ అవార్డుల ఎంపికకు సంబంధించి వివిధ అసోసియేషన్ల సహకారం తీసుకున్నామన్నారు. అంతే కాకుండా చిన్న,పెద్ద పత్రికలతో పాటు ఫోటో,వీడియో, క్రైం జర్నలిస్టులకు, న్యూస్‌ రీడర్స్‌లకు ప్రాధాన్యతనివ్వడం జరిగిందన్నారు. అవార్డు పొందిన వారికి అతిధులు చేతుల మీదుగా సత్కరించడంతో పాటు, నగదు, జ్ఞాపికతో పాటు వివిధ రకాల బహుమతులు అందజేస్తామన్నారు. కపిలగోపాలరావు అవార్డుతో పాటు మరో 31 మందికి వేర్వేరు కేటగిరీల కింద అవార్డులను అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. ఈ సమావేశంలో విజెఎఫ్‌ జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌,కార్యవర్గ సభ్యులు ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌,ఇరోతి ఈశ్వరరావు, పైలా దివాకర్‌,డేవిడ్‌రాజు, గయాజ్‌, దొండా గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

DABA GARDENS

2021-11-12 08:14:00

ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఎలాంటి ఒత్తిడిలేదు..

ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నవి  అలా కొనసాగవచ్చని, ప్రభుత్వానికి అప్పగించాలని  ఎటువంటి వత్తిడి లేదని జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టరు ఈ విషయముపై జిల్లాలోని ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమన్యాలు/ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన  అవకాశమునును తప్పుగా అర్ధం చేసుకోవలదని సూచించారు.   విద్యా సంస్థలు, విద్యార్ధుల  ఇంటరెస్ట్ లను దృష్టిలో ఉంచుకుని మాత్రమే తగు చర్యలు  ఉంటాయని, ఎటువంటి వత్తిడి ఉండదన్నారు.  ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి  అయ్యే వరకు ఎటువంటి మార్పులు ఉండదన్నారు. అంగీకారం తెలిపిన పాఠశాలలోని  విద్యార్దులను అసౌకర్యం లేకుండా దగ్గరలోని పాఠశాలలలో మాత్రమే చేర్చడం జరుగుతుంది.   విద్యార్ధులకు, తల్లిదండ్రులకు ఎటువంటి  ఇబ్బందులు కలుగ నీయమని,   ఆందోళన చెందవద్దని తెలియజేశారు.  ఇప్పటికే అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యాసంస్థలు పునరాలోచించుకొని వారి నిర్ణయాన్ని తెలుప వచ్చన్నారు. 
ఈ విషయంలో ఎవరికైనా ఎటువంటి సందేహలున్నా  అడిగి నివృత్తి చేసుకోవచ్చన్నారు.  పాఠశాలల యాజమన్యాలెవరూ కూడా ప్రచారం  కోసం,  అశాంతిని కలుగజేసి సమస్యలు సృష్టించరాదని హెచ్చరించారు.  విద్యార్దులు వారి తల్లి దండ్రులలో పూర్తి నమ్మకం కలుగ జేయాలన్నారు. 
ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు వారిపై ఎటువంటి వత్తిడి లేదన్న విషయాన్ని గ్రహించాలని తెలిపారు.  వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రచారం కోసం ఎటువంటి వ్యాఖ్యానాలు చేసినా తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని హెచ్చరించారు. 
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, జిల్లా విద్యా శాఖాధికారి ఎల్. చంద్రకళ, జిల్లా వృత్తివిద్య అధికారి కె.అప్పలరాము, డిగ్రీ కళాశాలల కోఆర్డినేటర్ విజయకుమార్, 8 డిగ్రీ కళాశాలలు, 15 జూనియర్ కళాశాలలు, 32 పాఠశాలలుకు చెందిన ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-11-11 16:41:16