1 ENS Live Breaking News

క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..

వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా వ్యర్ధాల నిర్వహణ సమర్ధవంతంగా జరిగినప్పుడు క్లీన్ ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఉదయం  గుంటూరు నగరపాలక సంస్థ శివారున ఓబులునాయుడు పాలెం లోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరక్టర్  ఎం మల్లిఖార్జున నాయక్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండీ సంపత్ కుమార్తో కలిసి పరిశీలించారు. ప్లాంట్లోని టిప్పర్ ఫ్లోర్, బాయిలర్ ఏరియా, టర్బైన్ కంట్రోల్ రూం ప్రాంతాలను మంత్రి, అధికారులు పరిశీలించారు. కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిందాల్  వేస్ట్ ఎనర్జీ  ప్రాజెక్టు వివరాలను జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్  లిమిటెడ్ ప్రాజెక్టు ప్రెసిడెంట్ ఎంఎం చారి పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ ద్వారా మంత్రివర్యులకు, శాసనసభ్యులకు అధికారులకు వివరించారు. ప్లాంట్ నిర్మాణం, మిషనరీ ఏర్పాటు పనులు నూరు శాతం పూర్తి అయ్యాయని, విద్యుత్ సబ్ స్టేషన్ కు అనుసంధానం పనులు, నీటి సౌకర్యం కల్పిస్తే 20 రోజులలో ప్లాంట్ను వినియోగంలోకి తీసుకువస్తామని ఎంఎం చారి తెలిపారు. దీనిపై మంత్రి బోత్స సత్యనారాయణ స్పందిస్తూ సబ్ స్టేషన్ అనుసంధాన పనులు వారంలో పూర్తి చేయాలని, నీటి సౌకర్యంకు సంబంధించి పైపులైను పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు అవసరమైన వ్యర్ధాలను పూర్తి స్థాయిలో సెగ్రిగ్రేషన్ చేసి అందించేందుకు స్వచ్చాంధ్ర కార్పోరేషన్ అధికారులు మున్సిపాల్టీలలోని క్షేత్రస్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి గృహాలలోనే సెగ్రిగ్రేషన్ జరిగేలా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ  వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు 2016 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జిందాల్ సంస్థతో  18 నెలల్లో ప్లాంట్ను ప్రారంభించేలా ఎంవోయు చేసుకుందన్నారు. గుంటూరు, విజయవాడతో పాటు 9 మున్సిపాల్టీలలో వ్యర్ధాలను ఇక్కడికి తీసుకువచ్చి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారన్నారు. అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 10 శాతం మాత్రమే ప్లాంట్ పనులు జరిగాయన్నారు. అప్పటి నుంచి ప్లాంట్ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవటంతో ప్రస్తుతం పనులు పూర్తి అయ్యి ప్రారంభ దశకు చేరుకుందన్నారు. ప్లాంట్కు సంబంధించిన పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పరిష్కరించేందుకు మున్సిపల్, ఇంజనీరింగ్, విద్యుత్ రాష్ట్రస్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ప్లాంట్ అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. 

ప్లాంట్కు అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ సబ్ స్టేషన్ అనుసంధాన పనులు పెండింగ్లో ఉన్నాయని వీటిని పదిహేను రోజుల్లో పూర్తి చేసి వచ్చే నెలలో ప్లాంట్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థతో పాటు తెనాలి, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తాడేపల్లి మున్సిపాల్టీల నుంచి సేకరించిన వ్యర్ధాల ద్వారా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో గంటకు 15 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందన్నారు. ఉత్పత్తి చేసిన విద్యుత్ను ప్రభుత్వం రూ.6.12 పైసలకు కొనుగోలు చేస్తుందన్నారు. గుంటూరుతో పాటు విశాఖ పట్ణణంలోను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా లేదా వర్చువల్ విధానంలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్లాంట్ వలన పర్యావరణానికి, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరిగిందన్నారు. జిల్లాలోని డోర్ టూ డోర్ వ్యర్ధాల సేకరణ కోసం స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ద్వారా 720 వాహనాలు అందించటం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచనల మేరకు ప్లాంట్ పరిధిలోని 5 కీమీ లోపు ఉన్న గ్రామాల నుంచి సేకరించిన వ్యర్ధాలను సైతం ఇక్కడకు తరలించే అంశంను పరిశీలిస్తామన్నారు.

 ప్లాంట్కు అవసరమైన 0.15 ఎంఎల్డీ నీటిని సమీపంలోని వెంగళాయ పాలెం గ్రామం నుంచి పైపులైను ద్వారా సరఫరా చేయటం జరుగుతుందన్నారు. వెంగళాయపాలెంలో నగరపాలక సంస్థకు చెందిన 2.5 ఎంఎల్డీ వాటర్ ప్లాంట్ ఉందని, అక్కడి గ్రామ ప్రజలకు అవసరమైన నీటిని పూర్తి స్థాయిలో అందించిన తర్వాతే ప్లాంట్కు నీటి సరఫరా చేస్తామన్నారు. వెంగళాయపాలెం గ్రామం రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత నియోజకవర్గంలో ఉన్నందున మంత్రి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, నగరపాలక సంస్థ, పంచాయితీ అధికారులు గ్రామ ప్రజలతో చర్చించి వారికి ఇబ్బంది కలగకుండా ప్లాంట్కు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో మిగిలిన యూజీడీ పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఆవరణలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్ధాళి గిరిధర్, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు, నరసరావు పేట శాసనసభ్యులు డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర మధ్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ రెడ్డి, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శుభం బన్సాల్, మున్సిపల్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ చంద్రయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి, నరసరావుపేట కమిషనర్ రామచంద్రారెడ్డి, సత్తెనపల్లి కమిషనర్ శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాసులు, నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీరు దాసరి శ్రీనివాసరావు, గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి భాస్కర రెడ్డి, పశ్చిమ మండల తహశీల్దారు మోహనరావు, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరు బాల వజ్ర బాబు,  జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏజీఎం రామకృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-06-17 11:41:05

సేవా దృక్పథం గొప్ప సంస్కారం..

సేవా దృక్పథం గొప్ప సంస్కారం అని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటును జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా 350 పడకలకు నేరుగా ఆక్సిజన్ అందించగలిగేలా 500 ఎల్పీఎమ్ సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించడంపై జిల్లా కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ప్లాంటు ద్వారా లిక్విడ్ ఆక్సిజన్ నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్డిటి సంస్థ సేవా దృక్పథంతో వ్యవహరించడం గొప్ప విషయమన్నారు. ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు ఏర్పాటు వల్ల కరోనా సోకిన వారికి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆక్సిజన్ ను నిరంతరంగా అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా రూ.75 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు నిర్మాణం చేపట్టామని ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం డైరెక్టర్ అన్నే ఫెర్రర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. ఏ.సిరి, ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ విశాల ఫెర్రర్, ఆర్డీటీ హాస్పిటల్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-06-17 11:39:29

గురువారం చందన లభ్యత 28 కేజీలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి సమర్పించే  మూడో విడత చందనం అరగదీత ప్రక్రియ గురువారం సంప్రదాయంగా ప్రారంభమైంది. మొత్తం 28 కిలోల చందనం లభ్యమైనట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ రోజు నుంచి మరో నాలుగు రోజుల పాటు చందనం అరగదీత కార్యక్రమం నిర్వహించిన తరువాత  ఈ నెల 24వ తేదీ జ్యేష్ట పూర్ణిమ సందర్బంగా స్వామివారికి మూడో విడత చందన సమర్పణ సమర్పిస్తారు. అదే రోజు స్వర్ణ పుష్పార్చన, శ్రీమణవాళ మహామునుల మాస తిరునక్షత్రం ఉంటుందన్న ఈఓ స్వామివారికి చందనం సమర్పించాలనుకునే భక్తులు అరకిలోకి రూ.10,116 ,  కిలోకి 20,116 సమర్పించుకోవచ్చునన్నారు. అరకిలో చందన సమర్పణ చేసినవారికి 200 గ్రాముల చందనం చెక్క, కేజీ సమర్పించినవారికి 300 గ్రాముల చందనం ముక్కతోపాటు శేష వస్త్రం  ప్రసాదంగా ఇస్తారని వివరించారు. చందన సమర్పణకు ఆన్ లైన్లో సొమ్ము చెల్లించాక చిరునామా, గోత్రనామాలతో పాటు వివరాలను స్క్రీన్ షాట్ తీసి  6303800736 వాట్సప్ నంబర్ కు పంపించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అప్పన్న భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరారు.


Simhachalam

2021-06-17 11:22:32

భూసేకరణ వేగవంతం చేయాలి..

సోలార్ పార్కుల ఏర్పాటు, టేకులేడు ఇండస్ట్రియల్ ఏరియా, హెచ్ఎన్ఎస్ఎస్ కింద వివిధ రిజర్వాయర్ లకు సంబంధించి, నేషనల్ హైవే కింద చేపడుతున్న  రహదారులు తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి సోలార్ పార్కులు, టేకులేడు ఇండస్ట్రియల్ ఏరియా, హెచ్ఎన్ఎస్ఎస్ కింద వివిధ రిజర్వాయర్ లకు సంబంధించి, జాతీయ రహదారులు తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ విషయమై జిల్లాలోని ఆర్డీఓ లు, తహశీల్దార్ లతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ముదిగుబ్బ మండలంలో చేపడుతున్న సోలార్ పార్కుకు సంబంధించి ఈ నెల 22వ తేదీ లోపు భూ సేకరణ పూర్తిచేసి ప్రతిపాదనలు పంపించాలన్నారు. కంబదూరు మండలంలో చేపడుతున్న సోలార్ పార్కుకు సంబంధించి భూసేకరణ చేపట్టి పంపించిన ప్రతిపాదనల మీద లీజ్ అగ్రిమెంట్ లను వెంటనే పూర్తిచేయాలని, ఈ విషయమై సోలార్ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. ముదిగుబ్బ, కంబదూరు మండలాల్లో ఏర్పాటు చేస్తున్న సోలార్ పార్కులకు సంబంధించి భూసేకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మానిటర్ చేస్తున్నారని, భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలన్నారు.

 హెచ్ఎన్ఎస్ఎస్ కింద చేపడుతున్న తోపుదుర్తి రిజర్వాయర్ కు సంబంధించి బండ్ పోర్షన్ పనులను జూలై నెల ఆఖరి కల్లా పూర్తి చేయాలన్నారు. దేవరకొండ రిజర్వాయర్ బండ్ పోర్షన్ పనులను జూలై 15 లోపు పూర్తి చేసేలా చూడాలన్నారు. ముట్టాల రిజర్వాయర్ కు సంబంధించి జూలై నెలాఖరుకల్లా భూసేకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్ లకు సంబంధించి భూసేకరణ డిక్లరేషన్ ప్రతిపాదనలు వేగంగా పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు.

చిలమత్తూరు మండలంలోని టేకులేడు ఇండస్ట్రియల్ ఏరియా (ఎస్ఈజెడ్)కు సంబంధించి భూసేకరణ వేగవంతంగా చేపట్టాలని చిలమత్తూరు తహసీల్దార్ ను జేసీ ఆదేశించారు. టేకులేడు ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి రోడ్ విస్తరణకు కూడా భూసేకరణ చేయాలన్నారు. పది రోజుల్లోగా గుర్తించిన భూమికి సంబంధించి డాక్యుమెంట్ పరిశీలన చేయాలని ఏపీఐఐసీ జెడ్ఎంకు సూచించారు. అలాగే నేషనల్ హైవే కింద చేపడుతున్న ఎన్ హెచ్ 42 రహదారి, కదిరి బైపాస్ రోడ్డు, కళ్యాణదుర్గం - రాయదుర్గం మద్యం వేస్తున్న నేషనల్ హైవే 544 డిడి తదితర వాటికి సంబంధించి భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జెసి ఆదేశించారు. హెచ్ఎల్సీ కింద పిఏబిఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించి భూసేకరణ పనులు చేపట్టాలన్నారు. భూసేకరణ పనులు పూర్తి చేయడం వల్ల ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తవుతాయని, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ విషయమై తహశీల్దార్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్ఓ గాయత్రీ దేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరప్రసాద్, రవీంద్ర, నేషనల్ హైవేస్ ఎస్ ఈ మురళీమోహన్, ఎన్ హెచ్ఏఐ పిడి మీనా, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ వెంకటరమణ, హెచ్ఎల్సి ఎస్ఈ రాజశేఖర్, ఆర్అండ్బీ అధికారులు, వివిధ శాఖల ఈఈలు, డిఈ లు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-17 10:37:46

ప్రజలకు గ్రామాల్లో ప్రభుత్వ సేవలన్నీ..

సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు త్వరితగతిన అందించడంలో భాగంగా నిర్మించనున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ , బల్క్ మిల్క్ సెంటర్లు త్వరితగతిన ప్రారంభించుకునే విధంగా భవన నిర్మాణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్, కొమానపల్లిలో రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ల నిర్మాణ పనులకు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల్లో భాగంగా శాశ్వత భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లాలో ఈ నెల 17 వ తేదీ నుండి జూలై 2 వరకు 15 రోజులు భవన నిర్మాణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో పింఛను కోసం పంచాయతీ కార్యాలయాల వద్ద గంటల సమయం వేచియుండే పరిస్థితి ఉండేదని, అదేవిధంగా రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, తదితర సేవలకు తహసీల్దార్ లేదా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునే పరిస్థితులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు నేరుగా ఇంటి ముంగిటికే అందుతున్నాయని తెలిపారు. ప్రజలకు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వేగంగా, నాణ్యమైన సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి చక్కటి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని అన్నారు. చక్కటి వ్యవస్థకు శాశ్వత భవనాలను నిర్మించుకోవడం ద్వారానే మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందుతాయని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను బుక్ చేసుకునే సౌకర్యం ఏర్పాటు చేయడమే కాకుండా నాణ్యత లోపాలపై ఫిర్యాదులు చేసే విధానాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో టెస్టింగ్ సదుపాయంతో సహా  ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో అందే అన్ని వైద్య సేవలు అందుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ల ద్వారా పాలను సేకరించి, పేమెంట్స్ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 10  నియోజకవర్గాల్లో 90 శాతం భవన నిర్మాణాలు పూర్తి కావడం జరిగిందని, భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక, మెటీరియల్ సరఫరా, పేమెంట్ ప్రాసెసింగ్ అంశాలలో జాప్యం ఉండదని అన్నారు. గ్రామ స్థాయిలో ఇటువంటి భవనాలు నిర్మించుకోవడం గర్వకారణమని, రాబోయే రెండు మూడు నెలల్లో భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు.
      ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ  సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని అన్నారు. అదేవిధంగా రైతులకు వ్యవసాయ పరంగా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సేవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తూ, నాట్లు వేసే దగ్గర నుండి రైతు పండించిన పంటను అమ్ముకునే వరకూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుందని అన్నారు. పేదవాడి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామంలో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడమే కాకుండా, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ల ద్వారా పాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం అందుతున్న సేవలు మరింత మెరుగ్గా, వేగంగా అందాలంటే భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు సమన్వయంతోపనిచేసి ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
              భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలోని గేదెల్లంక గ్రామంలో 17.5 లక్షలతో నిర్మించనున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్, కొమానపల్లి గ్రామంలో 90.04 లక్షలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ భవన నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే, గ్రామ సర్పంచ్ లతో కలిసి శంఖుస్థాపన చేయారు.
        ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) జి.రాజకుమారి, ఆర్డీవో ఎన్ ఎస్ వి బి వసంత రాయుడు, జడ్పి సిఇఓ ఎన్ వి వి సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్, డ్వామా పిడి వరలక్ష్మి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిట్టిబాబు, గేదెల్లంక, కొమానపల్లి గ్రామ సర్పంచ్ లు ఎస్. పల్లయ్య, కె.ఇందిరా, మండల అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Mummidivaram

2021-06-17 10:02:33

ఆ రైతులకు నష్టపరిహారం అందిస్తాం..

చిత్తూరు జిల్లాలోని కౌండిన్య వైల్డ్ లైఫ్ విభాగం ఉన్న ప్రాంతాలలో బారీగా ఏనుగులు సంచరిస్తున్నాయని, వాటి నుంచి ప్రజలను కాపాడేందుకు స్వల్ప వ్యవధిలో  కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తే ప్రభుత్వానికి పంపుతామని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ పేర్కొన్నారు.. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు అటవీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమై  జిల్లాలో ఏనుగుల మరణాలు , రైతులకు జరిగిన నష్టం పై సమీక్షించారు. ఈ సంధర్భంగా  వెస్ట్ డి.ఎఫ్.ఓ రవి శంకర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతలైన పలమనేరు,పుంగనూరు, కుప్పం, చిత్తూరు అటవీ ప్రాంతాలను కలుపుకుంటూ సుమారు ఆరు వేల హెక్టార్ లలో కౌండిన్య ఎలీఫేంట్ జోన్ ఉందని ఈ ప్రాంతంలో 2012 లో ఎనిమిది ఏనుగులు సంచరించేవని, ప్రస్తుతం 70 నుంచి 90 ఏనుగులు ఉన్నాయని, 2013 నుండి ఇప్పటి వరకు 9 ఏనుగులు వివిధ కారణాలతో  మరణించడం జరిగిందని,  ఏనుగుల దాడులలో 10 మంది వ్యక్తులు మరణించారని, 37 ఆవులు మరణించగా, 9 మంది మనుషులను గాయ పడ్డారని తెలిపారు . పలమనేరు ప్రాంతంలో 4,610 హెక్టార్లకు గాను 3,426.8 హెక్టర్లు ఫెన్సింగ్ వేయడం జరిగిందని, మిగతా ప్రాంతంలో ఫెన్సింగ్ లేక పోవడం వల్ల ఈ ప్రాంతాలలో ఏనుగులు ఎక్కువగా సంచరించడం జరుగుతున్నదని తెలిపారు. ఇటీవల కాలంలో గ్రూపులుగా ఉన్న ఏనుగులు విడిపోవడం వల్ల అవి భయంకరంగా మారి స్వభావం మార్చుకొని దాడులకు పాల్పడుతున్నాయన్నారు. అటవీ ప్రాంతoలో అనేక చెరువులు మరియు మేతగా కొన్ని రకాల వృక్షాలు ఉన్నాయని, అయితే అప్పుడప్పుడు అటవీ ప్రాంతం సమీపంలో గల చెరుకు, వరి, అరటి, మామిడి, బీన్స్ వంటి పంటల రుచులు చూడడం వల్ల ఎక్కువగా పంటల పై దాడులు చేస్తూ అడ్డం వచ్చినప్పుడు వ్యక్తుల పై దాడులకు పాల్పడుతున్నాయన్నారు. 

ఇప్పటికే జిల్లాలో ఫెన్సింగ్ మరియు కందకాలు తవ్వడం జరిగిందని అయితే ఫెన్సింగ్ గ్యాప్ ఉన్న చోట బయటకు వస్తున్నాయని అదే విధంగా కందకాలలో కొన్ని చోట్ల రాళ్ళు రావడం వల్ల ఆపివేయడం జరిగిందని అటువంటి ప్రదేశాలలో జనావాసాల వైపు దూసుకొస్తున్నాయన్నారు. ఇటీ వల కరోనా పరిస్థితుల వల్ల జాతీయ రహదారుల పైన ట్రాఫిక్ లేక పోవడంతో  రోడ్ల పైకి కూడా వస్తున్నాయన్నారు. ఈస్ట్ డి.ఎఫ్.ఓ నరేంధిర న్ మాట్లాడుతూ కౌండిన్య ఎలిఫాంట్ జోన్ లో తిరుమల కొండలు ఉన్న శ్రీ వేంకటేశ్వర అభయా అరణ్యం, శేషాచల కొండలు కలసి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో జాతీయ రహదార్లు ఉండడం వల్ల తరచూ రోడ్ల పైకి వస్తున్నాయని, ఈ ప్రాంతంలో సంచరిస్తూ మంచి ఆహారం దొరుకుతుండడo వల్ల వ్యవసాయ పొలాల పైన దాడులు చేస్తున్నాయన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఏనుగులు ఎక్కువగా ఉండడం మన అటవీ ప్రాంతాలు ఈ ప్రాంతాలతో కలిసి ఉండడం వల్ల  అక్కడ్నుంచి మన ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. ఏనుగులు  నుండి తమ పంటలను కాపాడుకోవాలని రైతులు భావించడం వల్ల ఏనుగుల పై దాడులకు వెళ్తున్నారని పలితంగా  మరణిస్తున్నారని, వీరికి నష్ట పరిహారం ఎప్పటికప్పుడు చెల్లిస్తూ న్నామన్నారు.  అయితె రైతులు నష్ట పరిహారం సరిపోదని తెలుపుతున్నారని  చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఏనుగులు సంచరించే ప్రాంతాలలో ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానికి సంబందించి నివేధిక తయారు చేయాలని, అదే విధంగా వ్యవసాయ పంటలను కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం గురించి, ఫెన్సింగ్, కాంద కాలతో పాటు శాశ్వతమైన చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు  వ్వ్యవసాయ అనుబంధ శాఖాధికారుల తో సమావేశమై ఒక వారం లోపు ప్రణాళికలు సిద్దం చేయాలని ,వాటిని పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. అదే విధంగా జాతీయ ఉపాధి హామీ కింద  అటవీ  శాఖ సమన్వయం తో పనులు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.  ఈ  సమావేశంలో ఫారెస్ట్ అధికారి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Chittoor

2021-06-17 09:59:00

కోవిడ్19 థర్డ్ వేవ్ ను ఎదుర్కోవాలి..

కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని సంయుక్త క‌లెక్ట‌ర్ ఆర్‌. మహేష్ కుమార్ వైద్యుల‌ను ఉద్దేశించి అన్నారు. ఒక‌టి ద‌శ‌లో క‌న్నారెండో ద‌శ‌లో ఎక్కువ విపత్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నామ‌ని, ఎక్కువ న‌ష్టాల‌న చ‌విచూశామ‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. గ‌త రెండు ద‌శ‌ల్లో జరిగిన ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకొని మూడో ద‌శ‌లో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను ముందుగానే ఊహించి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు. థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో ఒక వేళ‌ పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే ఎలాంటి వైద్యం అందించాల‌నే అంశంపై మిమ్స్‌లో గురువారం నిర్వ‌హించిన ఒక రోజు అవ‌గాహ‌న స‌ద‌స్సును ఆయ‌న ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోనే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఇలాంటి ముంద‌స్తు అవ‌గాహ‌న‌ స‌ద‌స్సు ఏర్పాటు చేయ‌టం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కోడానికైనా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాల‌ని, పిల్ల‌ల‌కు అందించ‌బోయే వైద్య విధానంపై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు. 18 నుంచి 45 వ‌య‌సుల వారికి, 45 నుంచి 60 ఏళ్ల వ‌య‌స్సు వారికి వ్యాక్సినేష‌న్ అంద‌జేశామ‌ని గుర్తు చేశారు. 18 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు వారికే ఇంకా వ్యాక్సినేష‌న్ చేయ‌లేదుకాబ‌ట్టి మూడో ద‌శ‌లో వారిపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. కావున పిల్ల‌ల ఆరోగ్యంపై త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త వ‌హించాల‌ని, ఒక వేళ వ్యాధి సోకితే ముందుగానే ల‌క్ష‌ణాలను గుర్తించేలా వైద్యులు అంద‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల‌ను లేనిపోని అపోహ‌ల‌కు గురి చేయ‌వ‌ద్ద‌ని థ‌ర్డ్ వేవ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌టం ద్వారా వారిలో ధైర్యం నింపాల‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో డీసీహెచ్ఎస్ డా. నాగ‌భూష‌ణ‌రావు, మిమ్స్ డైరెక్ట‌ర్ డా. భాస్క‌ర‌రాజు, స్పెష‌ల్ ఆఫీస‌ర్ హ‌రికిష‌న్ కుమార్‌, డా. వెంక‌టేశ్వ‌రరావు, వివిధ విభాగాల‌కు చెందిన ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు వైద్యులు, న‌ర్శింగ్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-17 06:57:57

అప్పన్నకు మంత్రి వెల్లంపల్లి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ ను రూపుమాసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. కళ్యాణమండపాన్ని సందర్శించి శిల్పాలకు ప్రత్యేక తైలంతో శుద్ధిచేసిన కార్యక్రమాన్ని ప్రశంసించారు. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు.  ఈఓ మంత్రికి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-17 06:29:59

3వ విడత చందన అరగదీత ప్రారంభం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి సమర్పించే  మూడో విడత చందనం అరగదీత ప్రక్రియ గురువారం సంప్రదాయంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొని స్వామివారి కోసం గందాన్ని అరగదీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీన జ్యేష్ట పూర్ణిమ సందర్బంగా స్వామివారికి మూడో విడత చందన సమర్పణ చేయనున్నారు. ఈనేపథ్యంలో చందనం చెక్కల అరగదీతను ఉద్యోగులు మొదలుపెట్టారు. బేడామండపంలో ఏర్పాటు చేసిన సానల ( రాళ్లు ) పై నాలుగు రోజుల పాటు ఉద్యోగులు చెక్కలను అరగదీసి పచ్చి గంధాన్ని తీస్తారు. రోజువారీ తీసిన గంధాన్ని తూకం వేసి అర్చకులు స్వాధీనం చేసుకుంటారు. వాటిని స్వామివారి భండాగారం భద్రపరిచిన గంధంలో సుగంధ ద్రవ్యాలను కలిపి జ్యేష్ట పున్నమినాడు స్వామివారికి సమర్పణ చేస్తారు. చందన సమర్పణలో భాగస్వాములు కావాలనుకునే భక్తులు అరకిలోకి రూ.10,116 ,  కిలోకి 20,116 సమర్పించుకో వచ్చునని అధికారులు ప్రకటించారు. అరకిలో చందన సమర్పణ చేసినవారికి 200 గ్రాముల చందనం చెక్క, కేజీ సమర్పించినవారికి 300 గ్రాముల చందనం ముక్కతోపాటు శేష వస్త్రం  ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. చందన సమర్పణకు ఆన్ లైన్లో సొమ్ము చెల్లించాక చిరునామా, గోత్రనామాలతో పాటు వివరాలను స్క్రీన్ షాట్ తీసి  6303800736 వాట్సప్ నంబర్ కు పంపించాలని తెలిపారు.

Simhachalam

2021-06-17 06:14:04

అప్పన్నకు ఎమ్మెల్సీ బుద్దా పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ కుటుంబంలో త్వరలో వివాహం జరగబోతోందని, స్వామివారి ఆశీస్సులకోసం దేవాలయానికి వచ్చానని బుద్ధాతెలియజేశారు. సింహాద్రి అప్పన్నకు శుభలేక అందించానని విరించారు అంతకు ముందు అర్చకులు వేద ఆశీర్వాదాన్ని అందించారు. ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ ప్రసాదాన్ని అందించారు. 

Simhachalam

2021-06-17 05:38:58

జీవిఎంసీలో అధికారుల జూ.. లకటక..!

మహావిశాఖ నగర పాలక సంస్థలో అధికారంలో వున్న సిట్టింగ్ ప్రజాప్రతినిధుల సిఫార్సులన్నీ బుట్టదాఖలవుతున్నాయి.. తమ శాఖ మంత్రి చేసిన సిఫార్సులు, టిడిపి ప్రభుత్వంలోని ఓ మంత్రికి  వర్గానికి చెందిన వారు చేసే సిఫార్సులు తప్పా.. మిగిలిన అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సులు చెల్లుబాటు కావడం లేదు. పదేళ్లపాటు పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి ఏదో సహాయం చేద్దామని చేస్తున్న సిఫార్సులను జీవిఎంసీ అధికారులు  కావాలనే తోసిపుచ్చేస్తున్నారు.. వారి మట్టుకి వారు సిఫార్సు చేస్తే ఆ పోస్టు ఖాళీగా వున్నా.. అందులో సిబ్బందిని నియమించే అవకాశం వున్నా..వారికే ఎందుకివ్వాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మీరా కాస్త గట్టిగా అడిగితే ఆ స్థానాలు ఖాళీలు లేవని..అందులో సిబ్బంది పనిచేస్తున్నారని నాయకులను ఫోన్లోనే బురిడీ కొట్టించేస్తున్నారు.. దీనితో మంత్రుల సిఫారసులకు కూడా విలువ లేకుండా పోతే ఇక్కడ ఆ అధికారులు ఉంచాలా అనే వాదన బలంగా వినిపిస్తుంది.. అంతేకాదు  కావాలనే జోనల్ కమిషనర్ క్యాడర్ స్థాయి అధికారులను స్థాయి తగ్గించి చిన్న పోస్టుల్లో డిప్యుటేషన్ వేసి కూర్చోబెట్టి బలవంతంగా విధులు చేయిస్తున్నారు ఇక్కడి అధికారులు.  జీవిఎంసీలో కొన్నిస్థానాలను, పోస్టులను ఔట్ సోర్సిగ్ ద్వారా భర్తీచేసుకునే అవకాశం వున్నప్పకిటీ కావాలనే పనిచేస్తున్న సిబ్బందికే వాటి డిప్యుటేషన్లు బాధ్యత కట్టబెడుతున్నారు. దీనితో సదరు ఖాళీలలో అర్హతులుండీ బాగా పనిచేయగల సామర్ధ్యం ఉన్నవారిని ఆ ఖాళీల్లోకి తీసుకోవాలని ప్రజాప్రతినిధులు స్వయంగా ఫోన్ చేసిన చెప్పినా ఆ ఒక్కటీ అడక్కు అనే చందాన...ఆ పోస్టు ఖాళీగా లేదండీ ఖాళీ అయితే చూద్దామని తెగేసి చెప్పేస్తున్నారు. ఒక్కో అధికారికి రెండు మూడు విభాగాలు డిప్యుటేషన్లు వేస్తున్నారు..ఆ విషయాన్ని నేరుగా డిప్యుటేషన్ విధులు నిర్వహిస్తున్న వారే సహచర ఉద్యోగుల దగ్గర చెప్పి బోరున విలపిస్తున్నారు. పనిచేసేవారికే అదనంగా డిప్యుటేషన్లు వేయడంతో ప్రభుత్వం ద్రుష్టిలో ఆ పోస్టులు బర్తీచేయకుండా, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీచేసుకునే వీలుకూడా లేకుండా పోతుంది. చాలా కాలం తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ఇంత వరకూ కష్టపడి పనిచేసిన వారికి ఈ ప్రభుత్వంలో కూడా మనకి ఎలాంటి సహాయం దక్కేలా లేదు అనేట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగని అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఇతర విభాగాల్లో ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆయా సర్వీసుల నుంచి వచ్చేవారిని నియమిస్తున్నారా అంటే అదీలేదు.. ప్రజా ప్రతినిధుల సిఫార్సుల మేరకు రెవిన్యూ సర్వీసు కేడర్ పోస్టులో కోపరేటివ్ సర్వీసు ఉద్యోగులను నియమిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా జివిఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నప్పటికీ ఏ ప్రజాప్రతినిధి నోరు విప్పే పరిస్థితి లేదు. దీనితో జీవిఎంలోని కొందరు అధికారులు తమ అధికారం, పవర్ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్దే చూపిస్తున్నారు. ఈ విషయం కాస్త ఇక్కడి స్థానం కోసం ఎదురు చూస్తున్న కొందరు ఐఏఎస్ ల వరకూ చేరడంతో వారు జీవిఎసీకి వైపు చూస్తున్నారని తెలిసింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్టు సమాచారం. కాకపోతే తమ శాఖ మంత్రి తనకు పూర్తి వెన్నుదన్నుగా వున్నారనే ధీమా కూడా జివిఎంసీ అధికారుల్లో పెరిగిపోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది. అధికారంలో వున్న ప్రజాప్రతినిధుల ద్వారా పనులు జరగకపోతే ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే జిల్లా అధికారులు మంత్రుల సిఫార్సులకి విలువ ఇస్తున్నా..కేవలం జీవిఎంసిలో మాత్రం అవి చెల్లుబాటు కాకపోవడం కూడా ఇపుడు హాట్ టాపిక్ అవుతోంది..!

GVMC office

2021-06-17 04:53:00

బ్రిక్స్ సమావేశాల్లో బిఎంఎస్ కీలకం..

భారత దేశంలో బ్రిక్ సమావేశాల్లో బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్) కీలకం వ్యవహరించనుందని బిఎంఎస్, భారతీయ టెలీకాం ఎంప్లాయిస్ యూనియన్ నేషనల్ ప్రెసిడెంట్ వివిఎస్ సత్యన్నారాయణ అన్నారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై నెలలో జరగనున్న బ్రిక్ సమావేశాల్లో బిఎంఎస్ అన్ని విభాగాల డెలిగేట్స్ పాల్గొంటారని అన్నారు. ఇంతటి కీలకమైన సమావేశాల్లో బీఎంఎస్ కీలకంగా వ్యవహరించడం ద్వారా దేశంలో బిఎంఎస్ ప్రాముఖ్యత మరోసారి తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం అహర్నిసలు పనిచేస్తున్న బిఎంఎస్ ఇపుడు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడం ద్వారా దేశంలో ఏ యూనియన్ కి దక్కని గౌరవం దక్కుతుందన్నారు. ఈ విషయంలో విశేషంగా క్రుషిచేసిన జాతీయ నాయకులు, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న నేతలకు, డెలిగేట్స్ కు వివిఎస్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. బిఎంఎస్ భారతదేశ యూనియన్లంటికంటే అత్యంత కీలకమనే విషయం బ్రిక్స్ సమావేశాల ద్వారా మరోసారి నిరూపణ అవుతుండటం ఆనందంగా వుందన్నారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పనిచేసే బీఎంఎస్ కి బ్రిక్స్ సమావేశాల్లో కీలకంగా వ్యవహరించడం ద్వారా తమపై మరింత బాధ్యత పెరుగనుందని వివరించారు.

Visakhapatnam

2021-06-17 02:41:17

సర్వీస్ రోడ్ పనులు పూర్తి చేయండి..

అనంతపురం లోని రాం నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బి, ట్రాన్స్ కో అధికారులకు మేయర్ వసీం సూచించారు. బుధవారం మేయర్ ఛాంబర్ లో తొలుత ఆయా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా రాం నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తైనా సర్వీస్ రోడ్ పనులు  అర్దాంతరంగా అపి వేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. సర్వీస్ రోడ్ తోపాటు డ్రైనేజీలు పనులు కూడా చేపట్టక పోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా రాం నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ లో విద్యుత్ అధికారులు విద్యుత్ స్తంభాలు,డి పి లను మార్చక పోవడంతో రోడ్ మధ్యలో వాహనదారులకు ఇబ్బంది గా మారాయని వాటిని కూడా వెంటనే మార్చాలని సూచించారు. దీనితోపాటు నగరంలో విద్యుత్ లైన్ లకు అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలను తొలగించి ఎక్కడివి అక్కడే రోడ్డుపై వదిలేసి వెళ్తున్నారని ఇకపై మీరు తొలగించిన కొమ్మలను మీరే తరలించాలని విద్యుత్ సిబ్బందికి మేయర్ సూచించారు. అనంతరం రాం నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ ప్రాంతంలో  మేయర్ వసీం తో పాటు నగర కమిషనర్ పివీవీఎస్ మూర్తి ట్రాన్స్ కో,ఆర్ అండ్ బి అధికారులు పర్యటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు అనీల్ కుమార్ రెడ్డి,బాబా ఫక్రుద్దీన్,డివిజన్ కన్వీనర్ ప్రకాష్ రెడ్డి, ఎస్ సి రమేష్ చంద్ర,ఈ ఈ రామ్మోహన్ రెడ్డి,ఆర్ అండ్ బి ఈ ఈ చంద్రశేఖర్ రెడ్డి , ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడిఈ ఉమాపతి, ఏ ఈ రవీంద్ర, కాంట్రాక్టర్ పద్మాకర్ బాబు రఘునాథ్ రెడ్డి,డి ఈ బాల సుబ్రమణ్యం,టౌన్ ప్లానింగ్ ఏసిపి రామలింగేశ్వర్,  సర్వేర్ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-16 15:44:43

అనాధపిల్లలకు ప్రభుత్వం అండ..

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం  విద్యుత్ గెస్ట్ హౌస్ లో కోవిడ్ తో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు 10,00000 రూపాయలు చెక్కును  మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ కారణంగా అనాధలైన పిల్లలను ఆదుకోవడానికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ఉదారంగా ఆలోచించారని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ  సిద్ధార్థ కౌశల్, ఐ.సి.డి.ఎస్ పి.డి.జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు

2021-06-16 15:41:46

కోవిడ్ లో ఖైదీల బాగోగుల‌పై ఆరా..

జైళ్లలో వివిధ ర‌కాల శిక్షలు అనుభ‌విస్తున్న ఖైదీలు బాగోగుల‌పై సీనియ‌ర్ సివిల్‌ జ‌డ్జి, జిల్లా న్యాయ‌సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి వి. ల‌క్ష్మీరాజ్యం ఆరా తీశారు. జిల్లా జైళ్ల సూప‌రింటెండెంట్ మ‌రియు జిల్లాలోని స‌బ్ జైళ్ల సూప‌రింటెండెంట్స్‌తో ఆమె బుధ‌వారం వ‌ర్చువ‌ల్ విధానంలో మాట్లాడారు. జైళ్లలో విధులు నిర్వ‌హించే సిబ్బంది, శిక్ష‌లు అనుభ‌వించే ఖైదీలు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూప‌రింటెండెంట్స్‌కు సూచించారు. వివిధ రకాల శిక్ష‌లు అనుభ‌విస్తున్న ఖైదీలు క్ర‌మ శిక్ష‌ణ‌తో కూడిన మంచి న‌డ‌వ‌డిక క‌లిగి ఉండాలని ఈ సంద‌ర్భంగా ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. అనంత‌రం ఉచిత న్యాయం, బెయిల్‌, ఆహారం త‌దిత‌ర స‌దుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం హై పవర్ కమిటీ ద్వారా సబ్ జైళ్లలోని శిక్ష పడిన ఖైదీలలో అర్హులైన కొందరిని బెయిల్, ఇండెర్స్ బెయిల్ ద్వారా విడుదల చేయ‌టం గురించి చ‌ర్చించారు. జిల్లాలో ఐదుగురు బెయిల్పై విడుదలకు అర్హ‌త సాధించార‌ని గుర్తు చేశారు. కార్య‌క్ర‌మంలో జిల్లా సబ్ జైళ్ల అధికారి మధుబాబు, విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, చీపురుప‌ల్లి, పార్వతీపురం సబ్ జైళ్ల సూపరింటెండెంట్‌లు టి. దుర్గారావు, ఎస్.కె. మదీన, కృష్ణ‌మూర్తి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-16 15:26:10