1 ENS Live Breaking News

అనాధ పిల్లలకు అండగా ప్రభుత్వం..

విశాఖ జిల్లాలో కోవిడ్ మూలంగా తల్లితండ్రులను కాని, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన బాలలకు మహిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖ అండగా వుంటుంది జిల్లా బాలల సంరక్షణ అధికారి ఏ.సత్యనారాయణ తెలిపారు. జిల్లా మహిళాశిశు సంక్షేమ సంస్థ పి.డి. సీతామహాలక్ష్మి ఆదేశాల మేరకు అటువంటి బాలల గృహాలకు వెళ్లి పరామర్శించి వారికి భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. మధురవాడలో గల 8మంది బాలల గృహాలకు వెళ్ళి పిల్లలు యొక్క బాగోగులలో సంస్థ పాలుపంచు కుంటుందని అనాథ పిల్లల యొక్క సంరక్షకులకు తెలియజేశామన్నారు. సిబ్బంది జేసుదాసు తది తరులతో కలసి వెళ్లి వారికి సాంఘికరక్షణ, అవసరమైన తోడ్పాటు అందిస్తామని చెప్పామన్నారు.

Visakhapatnam

2021-06-17 13:49:04

రైతులకు సమాచారం అందించండి..

శ్రీకాకుళం జిల్లాలో  ఖరీఫ్ సీజనుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు  రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ జరుగుతుందని, ఈ సమాచారాన్ని రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని  సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవసాయ శాఖాధికారులు, మండల అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మండల తహశీల్ధారులు, మండల వ్యవసాయాధికారులతో ఆయన వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు సమన్వయంతో పని చేసి డా.వై. యస్.ఆర్.ఉచిత పంటల బీమా పథకంపై రైతులు వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రతీ రైతు ఇ - పంటలో నమోదయ్యేలా చూడాలని, ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న తర్వాత ఎంట్రీ సరిగా ఉందా లేదా అని సంబంధిత రైతులకు చూపించాలని చెప్పారు. తద్వారా ప్రభుత్వం అందించే నష్టపరిహారం, ఆర్థిక సహాయక కార్యక్రమాలకు అవకాశం ఉంటుందని చెప్పారు. రైతులు వద్దకు వెళ్లినప్పుడు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ఎన్ రోల్ చేసినట్లు రైతులకు ఎకనాలెడ్జ్ మెంట్ ఇవ్వాలని తెలిపారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా భూముల్లో పండించే పంటల వివరాలను తెలియజేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతీ మండలంలో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసినప్పటికీ జిల్లాలో కంచిలి, కవిటి, పాలకొండ, రాజాం, శ్రీకాకుళం మండలాలు కొంతమేర గ్రామసభలు నిర్వహించారన్నారు. మిగిలిన మండలాలు త్వరితగతిన పూర్తిచేయాలని, రానున్న వారం రోజులు విస్తారంగా గ్రామసభలు నిర్వహించి రైతులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. ఖరీఫ్ సీజనుకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీచేయబడుతుందని   ఈ విషయాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు. స్వంత భూమి కలిగిన రైతులే కాకుండా కౌలురైతులకు ఇది వర్తిస్తుందని, ఈ విషయాన్ని కూడా కౌలు రైతులకు చేరవేయాలన్నారు.  ఇ – క్రాప్ నమోదులో ఆన్ లైన్ లో తలెత్తిన సమస్యలను జె.సి దృష్టికి తహశీల్ధారులు తీసుకురాగా వాటిని టెక్నికల్ సిబ్బందితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీఇచ్చారు.

          ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు రాబర్ట్ పాల్ , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-06-17 13:47:10

పెండింగ్ బిల్లులు చెల్లింపు జరగాలి..

ఇండియన్ నేవి  రాంబిల్లిలో  చేపట్టిన  ఎన్ ఎ ఒ బి  ప్రాజెక్టు లో అర్హులైన  నిర్వాసితులకు, ప్రభావితులకు పెండింగ్ లో ఉన్న చెల్లింపులను సత్వరమే పూర్తి చేయాలని  జాయింట్ కలెక్టర్  ఎం .వేణుగోపాల రెడ్డి తెలిపారు.  గురువారం  స్థానిక  కలెక్టరేట్ సమావేశమందిరంలో  నేవి, రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ  ఎన్ ఎ ఒ బి  ప్రాజెక్టుకు సంబంధించి  అపరిష్కృతంగా  ఉన్న అన్ని సమస్యలపై  సంబందిత అధికారులు  క్షేత్రస్థాయిలో  తనిఖీ చేసి  తక్షణమే నివేదికను సమర్పించాలని  ఆదేశించారు. గతంలో  ప్రభుత్వం ప్రకటించిన మేరకు  అర్హులైన  లబ్దిదారులెవరికైనా  చెల్లింపులు  పెండింగ్ లో ఉంటే  సత్వరమే  పరిష్కరించాలని  కోరారు.  ఈ కార్యక్రమంలో  నేవి అధికారులు కెప్టెన్ ఆదినారాయణ, కెప్టెన్  టి.రాజశేఖర్,  కెప్టెన్ ఎస్. శివకుమార్,  ఆర్ డి ఓ లు సీతారామరావు, అనిత,  ఇరిగేషన్ ఎస్ ఇ సూర్యకుమార్,  ఎన్ ఎ ఒ బి , ఎస్ డి సి  జోసెఫ్, , మత్స్యశాఖ జెడి లక్ష్మణరావు,  రాంబిల్లి,  ఎస్.రాయవరం మండలాల  తహసిల్దార్లు, ఇతర  అధికారులు పాల్గొన్నారు. 

Collector Office

2021-06-17 13:45:43

జివిఎంసీకి దివీస్ మాస్కులు వితరణ..

దివీస్ సంస్థ జివిఎంసికి 15వేల మాస్కులను వితరణ చేసింది. గురువారం కార్యాలయంలో అదనపు కమిషనర్  డా. వి. సన్యాసిరావు కు మాస్కులను వాటిని సంస్థ సిబ్బంది అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్  మాట్లాడుతూ, కరోనా సమయంలో పారిశుధ్య సిబ్బంది కోసం మాస్కులు  దివీస్ సంస్థ అందించడం అభినందనీయమన్నారు. ఇవేకాకుండా ఇంకా 5 వేల మాస్కులు త్వరలో అందజేస్తుందని తెలిపారని అన్నారు. మొత్తం 20వేలు మాస్కులు జివిఎంసికి అందిస్తుందని, ఈ మాస్కులను ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్ నకు అందిస్తామని అదనపు కమిషనర్ తెలిపారు. దివీస్  సంస్థ సి.ఎస్.ఆర్ ఫండ్స్ నుంచి నిధులు కేటాయించారని, గత పన్నెండు రోజుల నుండి 12 మందికి ఉపాధి కల్పించి వారికి ఈ మాస్కులను తయారు చేయించారని తెలిపారు. సంస్థ మేనేజర్ వై.యస్.కోటేశ్వరరావు, సి.ఎస్.ఆర్. మేనేజర్ డి సురేష్ కుమార్ కు మాస్కులు అందించినందుకు అదనపు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.  ఇదే స్ఫూర్తితో ఇంకా మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి ఫ్రంట్లైన్ వారియర్స్ వారికి చేదోడుగా నిలవాలని పిలుపునిచ్చారు.  

Visakhapatnam

2021-06-17 13:42:53

కోవిడ్ బాధిత కుటుంబాలకు రుణాలు..

కుటుంబ ప్రధాన పోషకుడు కోవిడ్ కు గురై మృతి చెందిన వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాలకు రాయితీతో కూడిన రుణాలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం చైర్మన్ శ్రికేష లాఠకర్ అన్నారు. ప్రధాన పోషణకర్త కరోనా బారిన పడి చనిపోతే కుటుంబములోని తదుపరి పోషణకర్తకు బి.సి. కార్పోరేషన్ ద్వారా నేరుగా ఎన్.బి.సి.ఎఫ్.డి.సి నిధులతో స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేయడం జరుగతుందన్నారు. ఒక్కొక్క కుటుంబానికి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు స్వయం ఉపాధి పథకాలు 20 శాతం సబ్సిడీతో మంజూరు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. చనిపోయిన కుటుంబ పోషణకర్త 18 - 60 సంవత్సరముల వయసు కలిగిన వారుగా ఉండాలని, కుటుంబ సంవత్సర ఆదాయము రూ.3 లక్షలు లోపు ఉండాలని ఆయన చెప్పారు. ఆధార్ కార్డు, రేషన్, రైస్ కార్డు, కరోనా భారిన పడి చనిపోయిన మరణ ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము కలిగి ఉండాలని ఆయన వివించారు. ప్రతిపాదిత దరఖాస్తులు ఈ నెల 22వ తేదిలోపు బి.సి. కార్పోరేషన్ కార్యాలయానికి సమర్పించాలని ఆయన కోరారు. జిల్లాలో అందరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్లు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. మండల, మున్సిపాలిటీలలో కరోనా బారిన పడి చనిపోయిన బిసి కుటుంబములోని సభ్యులు తక్షణమే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్లకు ప్రతిపాదనలను అవరసరమైన ధ్రువ పత్రములతో సమర్పించాలని పేర్కొన్నారు.

Srikakulam

2021-06-17 13:39:08

పారదర్శకంగా ఫీవర్ సర్వే చేపట్టాలి..

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల స్థాయిలో ఫీవ‌ర్ స‌ర్వేల‌ను అత్యంత క‌చ్చిత‌త్వంతో నిర్వ‌హించేలా చూడాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం జాయింట్ క‌లెక్ట‌ర్లు డా. జి.ల‌క్ష్మీశ‌, కీర్తి చేకూరి, జి.రాజ‌కుమారి త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. వ‌ర్చువ‌ల్ విధానంలో జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల స్థాయి అధికారులతో ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల ప్ర‌గ‌తిపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌తి వారం సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు స‌చివాల‌యాల స్థాయిలో వాలంటీర్లు, ఆశాలు ఫీవ‌ర్ స‌ర్వేను నిర్వ‌హించి, వైర‌స్ ల‌క్ష‌ణాలున్న వారిని గుర్తించాల‌న్నారు. ఫీవ‌ర్ స‌ర్వేలో నిర్ల‌క్ష్యం చూపిన 33 మంది వాలంటీర్ల‌ను ఇప్ప‌టికే తొల‌గించామ‌ని.. అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించిన సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. కోవిడ్ విప‌త్తుకు సంబంధించి ఏ చిన్న నిర్ల‌క్ష్య‌మైనా పెద్ద స‌మ‌స్య‌కు దారితీస్తుంద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు చేసి, ఫీవ‌ర్ స‌ర్వే స‌మ‌ర్థ‌వంతంగా జ‌రిగేలా చూడాల‌ని, ఈ నెలాఖ‌రుకు పాజిటివిటీ రేటును ఒక‌టి కంటే త‌క్కువ‌కు ప‌రిమితం చేసేందుకు కృషిచేయాల‌ని సూచించారు. రోజుకు ప‌దివేల ప‌రీక్ష‌ల‌ను ఫోక‌స్డ్‌గా చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కోవిడ్ ఆసుప‌త్రుల్లో వైద్య సేవ‌ల‌పై నిరంత‌ర ప‌రిశీల‌న‌లు కొన‌సాగించాలని.. బాధితుల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందేలా చూడాల‌ని నోడ‌ల్ ఆఫీస‌ర్ల‌కు సూచించారు. డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ కింద పూర్తిస్థాయిలో సేవ‌లందేలా చూడాల‌ని, నాన్ ఆరోగ్య‌శ్రీ విష‌యంలో ఆసుప‌త్రులు ప్ర‌భుత్వం నిర్దేశించిన ఫీజుల‌ను మాత్ర‌మే వ‌సూలు చేసేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. 
మూడో వేవ్ ముప్పు పొంచి ఉంద‌న్న సూచ‌న‌ల నేప‌థ్యంలో ముంద‌స్తు స‌న్న‌ద్ధ‌త‌తో ఆసుప‌త్రుల్లో మౌలిక వ‌స‌తులు, సిబ్బంది నియామ‌కాలు, శిక్ష‌ణ ప్ర‌క్రియ‌కు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. 

ప‌క్షోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాలి:
గ్రామ స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ యూనిట్ల శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసే ల‌క్ష్యంతో జూన్ 17 నుంచి జులై 2 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న భ‌వ‌న నిర్మాణ ప‌క్షోత్స‌వాల‌ను ప్ర‌ణాళిక ప్ర‌కారం విజ‌య‌వంతం చేసేందుకు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. రూ.60 ల‌క్ష‌ల నుంచి రూ.80 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మిస్తున్న భ‌వ‌నాల‌కు సంబంధించి ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారంతో జూన్ చివ‌రినాటికి 100 శాతం గ్రౌండింగ్ పూర్త‌య్యేలా చూడాల‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు పూర్త‌యిన భ‌వ‌నాలకు ప్రారంభోత్స‌వాలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గ్రామ స‌చివాల‌యాల‌కు అనుసంధానంగా డిజిట‌ల్ లైబ్ర‌రీల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన స్థ‌ల సేక‌ర‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించి, పంపాల‌న్నారు. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు లేఅవుట్ల‌లో ఇళ్ల నిర్మాణాల‌ను శ‌ర‌వేగంగా చేప‌ట్టేలా చూడాల‌ని.. హౌసింగ్‌, రెవెన్యూ, ఆర్‌డ‌బ్ల్యూఎస్, పంచాయ‌తీరాజ్‌, విద్యుత్ త‌దిత‌ర శాఖ‌ల‌న్నీ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి, ల‌బ్ధిదారుల‌కు అందుబాటులో ఉండి గ్రౌండింగ్ జ‌రిగేలా చూడాల‌ని ఆదేశించారు. ఖ‌రీఫ్ స‌న్న‌ద్ధ‌త‌కు సంబంధించి ఆర్‌బీకేల‌లో విత్త‌నాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉండేలా చూడాల‌ని.. ఆర్‌బీకేలు రైతుల‌కు వ‌న్‌స్టాప్ కేంద్రంగా ఉండాల‌నే విష‌యాన్ని గుర్తించి, సేవ‌లందించాల‌ని వ్య‌వ‌సాయ అధికారులు, సిబ్బందికి సూచించారు. ఈ-క్రాప్ బుకింగ్‌కు అత్యంత ప్రాధాన్య‌మిచ్చి, 100 శాతం న‌మోదు ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌న్నారు. పంట ప్ర‌ణాళిక‌, వైవిధ్యంపై స‌ల‌హా బోర్డుల స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేయాల‌న్నారు. 343 రైతు గ్రూపుల‌కు రూ.15 లక్ష‌ల చొప్పున ప్రాజెక్టు వ్య‌యంతో క‌స్ట‌మ్ హైరింగ్ కేంద్రాల‌ను అందుబాటులోకి తీసుకురానున్న నేప‌థ్యంలో, పెండింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. 

జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ పంట‌సాగుదారు హ‌క్కు కార్డుల (సీసీఆర్‌సీ) జారీకి సంబంధించి గ‌తంలో జారీచేసిన ల‌క్ష కార్డుల‌కు అద‌నంగా ఈసారి మ‌రో రెండు ల‌క్ష‌ల కార్డుల‌ను జారీచేసి జిల్లాను ముందు వ‌రుస‌లో నిలిపేందుకు కృషిచేయాల‌ని సూచించారు. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల లేఅవుట్ల‌లో లెవిలింగ్ ప‌నులు పెండింగ్ లేకుండా చూడాల‌ని ముఖ్య‌మంగా అమ‌లాపురం, రామ‌చంద్రాపురం డివిజ‌న్లు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పెండింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని ఆదేశించారు. అదే విధంగా ఖ‌రీఫ్ స‌న్న‌ద్ధ‌త‌, 90 రోజుల్లో ఇళ్ల ప‌ట్టాల‌కు సంబంధించి కొత్త‌గా సేక‌రించాల్సిన భూమి త‌దిత‌రాల‌పై జేసీ అధికారుల‌కు మార్గ‌నిర్దేశ‌నం చేశారు. కోవిడ్ నియంత్ర‌ణ‌, నివార‌ణ చ‌ర్య‌లు; స‌చివాల‌యాల వారీగా ఫీవ‌ర్ స‌ర్వేలు, క్లినిక్‌ల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి సూచ‌న‌లు చేశారు. వైఎస్సార్ చేయూత‌, బీమా త‌దిత‌ర ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌స్తుతం స‌చివాల‌యాల స్థాయిలో చేయాల్సిన ప‌నుల‌తో పాటు భ‌వ‌న నిర్మాణాల ప‌క్షోత్స‌వాల‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి స‌మావేశంలో వివ‌రించారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, జేడీ (ఎ) ఎన్‌.విజ‌య్‌కుమార్‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, ఎస్ఈ పీఆర్ బీఎస్ ర‌వీంద్ర‌, హౌసింగ్ పీడీ జి.వీరేశ్వ‌ర ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-17 13:37:33

పశుసంవర్ధక శాఖ జెడిగా కిషోర్..

శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులుగా  డాక్టర్ ఎం.కిషోర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ కిశోర్ విశాఖపట్నంలో వీర్య ఉత్పత్తి కేంద్రంలో ఉపసంచాలకులు గా పని చేస్తూ పదోన్నతి పై శ్రీకాకుళం సంయుక్త సంచాలకులుగా వచ్చారు. అంతకుముందు విశాఖపట్నం జిల్లా పాడేరులో ఉప సంచాలకులుగా, జీల్లా లైవ్  స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పలు హోదాల్లో పనిచేశారు. ఇప్పటి వరకు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డా. ఏ.ఈశ్వరరావు నుండి జెడిగా బాధ్యతలు స్వీకరించారు.  సంయుక్త సంచాలకులు బాధ్యతలు స్వీకరించిన కిశోర్ కు ఉప సంచాలకులు ఈశ్వర రావు, సహాయ సంచాలకులు నారాయణ రావు ఇతర సిబ్బంది అభినందించారు.

Srikakulam

2021-06-17 13:35:20

గురుకుల విద్యాలయాలకు దరఖాస్తులు..

శ్రీకాకుళంజిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2021–2022 విద్యా సం.లో 5వ తరగతి మరియు ఇంటర్ ప్రధమ సంవత్సరం నందు ప్రవేశాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా సమన్వయకర్త వై.యశోధలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీచేసారు. 5వ తరగతి మరియు నీట్ ఐఐటి అకాడమీలందు, ఇంటర్ ప్రథమ సంవత్సరం    ( ఇంగ్లీష్ మీడియం ) ప్రవేశాలకు చేరగోరు బాలురు, బాలికలు తమ దరఖాస్తులను సమర్పించుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షా ఎంపిక ద్వారా ప్రవేశాలు జరుగుతాయని, ఆసక్తి గల విద్యార్ధులు నేటి నుండి జూలై 7వ తేదీలోగా ఆన్ లైన్ నందు సమర్పించాలని చెప్పారు. 5వ తరగతి ప్రవేశాల కొరకు  http://apgpcet.apcfss.in/ వెబ్ సైటు నందు అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరం కొరకు http://apgpcet.apcfss.in/Inter/వెబ్ సైటు నందు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. జూలై 7 తరువాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవని, దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు. ఒక విద్యార్ధి ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకున్న తదుపరి ఎటువంటి మార్పులు చేయుటకు అవకాశం ఉండబోదని, కావున విద్యార్ధులు దీన్ని గమనించాలని కోరారు. ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన మార్కులు ఆధారంగా సీట్లు కేటాయించబడతాయని, ప్రవేశ పరీక్ష తేదీని దరఖాస్తుదారుల రిజిష్టర్ మొబైల్ నెంబరుకు మెసేజ్ రూపంలో గాని, పత్రికా ప్రకటన ద్వారా గాని తెలియజేయబడుతుందని ఆమె ఆ ప్రకటనలో తెలిపారు.

          గురుకుల విద్యాలయాల్లో యస్.సి విద్యార్ధులకు 75 శాతం, యస్.సి ( కన్వెర్టడ్ క్రిస్టియన్ ) వారికి 12 శాతం, యస్.టి విద్యార్ధులకు 6 శాతం అలాగే బి.సి విద్యార్ధులకు 5 శాతం, ఇతరులకు 2 శాతం సీట్లు కేటాయించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకునే యస్.సి., యస్.టి విద్యార్ధులు 2008 సెప్టెంబరు 1 నుండి 2012 ఆగష్టు 31 మధ్య జన్మించిన వారై ఉండాలని, ఓ.సి,బి.సి, యస్.సి (కన్వెర్టడ్ క్రిస్టియన్ ) , బి.సి-సి విద్యార్ధులు  2010 సెప్టెంబరు 1 నుండి 2012 ఆగష్టు 31 మధ్య జన్మించిన వారై ఉండాలని ఆమె స్పష్టం చేసారు. విద్యార్ధులు స్వంత జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, సంబంధిత జిల్లాలో 2019-20 విద్యా సం.లో 3వ తరగతి మరియు 2020-21లో 4వ తరగతి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి ఉండాలన్నారు. ఆదాయ పరిమితి రూ.1,00,000/-లకు మించి ఉందరాదని ఆమె ఆ ప్రకటనలో వివరించారు.

          ఇతర సమాచారం కొరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారి కార్యాలయ సిబ్బందికి గాని లేదా తమ సమీప సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులను గాని సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.

Srikakulam

2021-06-17 13:32:00

చేయూత రుణాలు మంజూరు చేయాలి..

వైయస్సార్ చేయూత మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ పథకాలపై బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వైయస్సార్ చేయూత పథకంకు శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకర్లు సహాయంతో దాదాపు అన్ని యూనిట్లకు ప్రాథమిక రుణ మంజూరు జరిగిందని అన్నారు. ఈ రుణాలను పూర్తి స్థాయిలో ఈ నెల 23వ తేదీ నాటికి మంజూరు చేసి చేయూత పోర్టల్ లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. రుణాలు మంజూరు చేయడం వలన వెనుకబడిన తరగతులకు చెందిన లబ్ధిదారులకు ప్రయోజనం ఉంటుందని, ఎటువంటి అలసత్వం చేయరాదని ఆయన స్పష్టం చేశారు. జగనన్న తోడు, టిడ్కో గృహ పథకాలకు ఋణాలు మంజూరు చేయాలని ఆయన పేర్కన్నారు.  గత సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలలో 68 శాతం సాధించడం జరిగిందని ఆయన అన్నారు. రు. 6900 కోట్లకు గాను రూ. 4,692 కోట్లు వ్యయం చేయడం జరిగిందని చెప్పారు. వివిధ ప్రభుత్వ  పథకాల క్రింద తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపులో లబ్ధిదారులు సుముఖంగా ఉండాలని, తిరిగి చెల్లింపులపై  ప్రభుత్వ అధికారులు బ్యాంక్ లకు సహకారం అందజేయాలని ఆయన సూచించారు. ఆధార్ కేంద్రాలు, బ్యాంకుల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారని దానిని అరికట్టాలని కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

     జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జి.వి.బి.డి.హరి ప్రసాద్ మాట్లాడుతూ 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు నిర్వహించిన వ్యాపార ఫలితాలను పరిశీలిస్తే మొత్తం డిపాజిట్లు రూ. 11,833.26 కోట్లు కాగా మొత్తం రుణాలు రూ. 13706.06 కోట్లు అని చెప్పారు. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలో 68 శాతం ఫలితాలు సాధించడం జరిగిందని దీనిపై కరోనా ప్రభావం అధికంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాధాన్యత రంగంలో 70 శాతం, రూ. 5,715 కోట్లలో  రూ.4,004 కోట్లు,  వ్యవసాయ రంగానికి సంబంధించి 80 శాతం, రూ.4174  కోట్లలో రూ.3,300 కోట్లు, ఎం.ఎస్.ఎం.ఇ రుణాలలో 66.36 శాతం, రూ.890.30 కోట్ల లక్ష్యంలో రూ.591 కోట్లను అందించామని అన్నారు.

       ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, డిసిసి కన్వీనర్ మరియు యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ కే.కృష్ణయ్య, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్ , డిఆర్డిఎ పిడి బి.శాంతిశ్రీ , ఎస్బిఐ రీజినల్ మేనేజర్ తపోధన్ దేహరి, ఏపీజివిబి రీజినల్ మేనేజర్ రియాజ్, డిసిసిబి సీఈఓ డి.సత్యనారాయణ,  సహాయం ఎల్.డి.ఎం ఎన్.వి.రమణ, లీడ్ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ కే.గిరిజాశంకర్ పాల్గొన్నారు.

Srikakulam

2021-06-17 13:30:11

ఆక్వారైతులు మోసపోకూడదు..

ఆక్వా రైతులు మోసపోకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లాఠకర్ మత్య్స శాఖ జెడి ని ఆదేశించారు.  గురువారం జిల్లా స్థాయి చేపలు, రొయ్యల చెరువుల స్క్రూటిని అమలు చేయు కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ హాలులో జెసి సుమిత్ కుమార్ తో కలసి నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నీటి చేపలు పెంచే ప్రాంతాలను మరింత పెంచే విధంగా రైతులకు అవగాహన పరచాలని తెలిపారు. మత్స్యకారులకు అవసరమైన యాంత్రీకరణ పరికరాలు ఉన్నాయా లేదా అని జెడి అడుగగా మెటీరియల్ సరఫరా చేసేందుకు డీలర్లు ఉన్నట్లు జెడి వివరించారు. జిల్లాలో కోస్టల్ ప్రాంతం ఎక్కువగా ఉన్నందు వలన మత్య్స కారులకు అవసరమైన పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  చేప పిల్లల పెంచేందుకు ఆక్వా రైతులకు అధికంగా సరఫరా చేయాలని సూచించారు. ఇంకా ఏమి చేస్తే బాగుంటుందని రైతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పంపిణీ చేస్తున్న చేపల ఆహారం నాణ్యమైనదిగా ఉందో లేదో పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు. చేపలు, రొయ్యలకు తరచు ల్యాబ్ లో పరీక్షలు చేస్తూ ఉండాలని ఆదేశించారు.  చేపలు, రొయ్యలు చెరువుల కోసం  రైతులు సచివాలయాలు ద్వారా ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో చేపలు, రొయ్యలు చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన వాటిని జిల్లా స్థాయి కమిటీ లో 107 చెరువులకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీపతి, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, ఇరిగేషన్ డిఇ, మత్య్స శాఖ అధికారులు, మత్య్స కార రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-17 13:28:32

100% ఈ-క్రాపింగ్ నమోదు చేయాలి..

అనంతపురం  జిల్లాలో ఈ క్రాపింగ్ 100% నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు.  గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలకు ఆస్కారం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందించాలన్నారు. . విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి ఎకరంలోని పంట వివరాలు ఈ క్రాపింగ్ లో నమోదు చేయాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వంగడాల పై రైతులకు అవగాహన చేపట్టేలా మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ క్రాపింగ్ నిర్వహించే ఉద్యోగులకు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణం పనులను  వేగవంతంగా పంచాయతీ రాజ్ శాఖతో సమన్వయం చేసుకుని త్వరిత గతిన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. 

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారమే సమగ్ర విచారణ జరిపి త్వరిత గతిన నివేదిక అందించి రైతు కుటుంబాలకు ఆసరా కల్పించాలన్నారు.  ప్రతి గ్రామంలో బ్యాంకులకి సంబంధించిన అడ్వైజర్ కలిగే ఉండేవిధంగా వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన వివిధ శాఖలు వారివారి శాఖలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, ఉద్యాన శాఖ డీడీ సతీశ్, ఏపీ ఎమ్.ఐ.పీ పీడీ ఫిరోజ్ ఖాన్, పట్టు పరిశ్రమ జేడీ పద్మావతి, పశుసంవర్థక శాఖ వై.వేకంటేశు మరియు ఇతర అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-06-17 13:24:25

కమిషనర్ చెప్పడానికే కోవిడ్ నిబంధనలు..

కరోనా వైరస్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న తరుణంలో మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులు చెప్పడానికే శ్రీరంగ నీతులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో కరోనా కేసులు తగ్గమంటే ఎలాతగ్గుతాయో జీవిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజనతో పాటు గురువారం సీఎంహెచ్ఓ జోనల్ కమిషనర్ ఫణిరాం, వెటర్నరి డాక్టర్ కిషోర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు గణేష్ బాబు, చిరంజీవి, శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజినీర్లు కనీసం ఒక మీటరు సామాజిక దూరం కూడా పాటించకుండా చేస్తున్న పర్యటనలపై విమర్శలు పెల్లుభికేలా చేశాయి. ఈ వార్తలోని ఫోటో చూస్తే మీకే అర్ధమవుతుంది కరోనా నిబంధన ప్రకారం ఏ స్థాయిలో భౌతిక దూరం పాటించేస్తున్నారో.. ఆదివారం చికెన్, మటన్ దుకాణాల దగ్గర జనం భారీగా గుమికూడటం వలన కోరానా వైరస్ వ్యాప్తి అధికంగా వస్తుందని ప్రచారం చేసిన కమిషనర్ నేరుగా అధికారులను అదే స్థాయిలో వెంటబెట్టుకొని ప్రజా క్షేత్రంలో తిరగడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. అసలే కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నా వైరస్ ప్రజలను వెంటాడుతున్న సమయంలో ప్రజలను కరోనా వైరస్ పై చైతన్యం తీసుకు రావాల్సిన అధికారులే ఈ విధంగా పర్యటనలు చేయడం విమర్శలకు తావిస్తుంది. సాధారణ జనం తిరిగితే..వారు చికెన్ షాపుల వద్దకు వెళితే కరోనా కేసులు వస్తాయన్న అధికారులు..అదే గుంపులు గుంపులుగా కమిషనర్ తో సహా దగ్గర దగ్గరగా తిరిగితే రావా అనే వాదన బలంగా వినిపిస్తుంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో జివిఎంసీ అధికారులే ఈ విధంగా గుంపులు గుంపులుగా తిరడంపై నగర ప్రజలు నవ్విపోతున్నారు. మీడియా ద్వారా కరోనా వైరస్ కోసం గొప్పలు చెప్పే అధికారులు ఉదయం వార్డుల్లోకి పర్యటకు వచ్చే సమయంలో ఒక్క అధికారి కూడా సామాజి దూరంగానీ, పరిశుభ్రత గానీ పాటించలేదనే విమర్శలు విశాఖలో హాట్ టాపిక్ గా మారాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అధికారులు  అత్యంత దగ్గరగా కలిసి వెళుతుండటం నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో సామాజిక దూరం పాటించే అధికారులు బాహ్య ప్రపంచంలో మాత్రం వాటిని గాలికొదిలేస్తున్నారనడానికి కమిషనర్ వార్డుల పర్యటనలే ప్రధాన సాక్షిగా కనిపిస్తున్నాయి. బహుసా జివిఎంసీ అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం నిర్ధేశించిన కరోనా నిబంధనలు పాటించకూడదనే ప్రత్యేక ఉత్తర్వులు ఉన్నాయో..లేదంటే అంత దగ్గరగా భౌతిక దూరం పాటించకుండా తిరిగా వారికి కరోనా వైరస్ సోకదేమో సాధారణ ప్రజలకు సోకినంత త్వరగా..!

విశాఖ సిటీ

2021-06-17 13:18:11

చెట్ల వ్యర్ధాలు ఎక్కడా కనిపించ కూడదు..

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని ఎక్కడా చెట్ల వ్యర్ధాలు కనిపించకూడదని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం  నాలుగవ జోన్ లోని 34వ వార్డు పరిధిలో కొబ్బరితోట, అచ్చయమ్మపేట  ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో  ఏపీఈపీడీసీఎల్ వారు విద్యుత్ వైర్ లకు ఆటంకం కలిగిన చెట్ల యొక్క కొమ్మలను తొలగించి  ఆ ప్రదేశంలోనే వదిలేస్తున్నారని వాటిని వారిచే ఆ వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు ప్రధాన కాలువలలోని చెత్తను తొలగించి, వాటి పలకలను వెంటవెంటనే మూసివేయాలని, డోర్ టు డోర్  చెత్తను సేకరించాలని, తడి-పొడి చెత్తను  వేరు వేరుగా తీసుకోవాలని, రోడ్లను సకాలంలో శుభ్రపరచాలని, డంపర్ బిన్ల వద్ద ఉన్న చెత్తను వెంటవెంటనే డంపింగ్ యార్డ్ తరలించాలని, డంపర్ బిన్ల చుట్టూ బ్లీచింగ్ జల్లించాలని, శానిటరి  అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా కాలువల్లో ఫాగ్గింగ్ చేయించాలని ప్రధాని వైద్యాధికారులను ఆదేశించారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారంలో ఒక రోజు “డ్రై” డే పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వెటర్నరి డాక్టర్ కిషోర్ ను ఆదేశించారు.  ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ ఫణిరాం, వెటర్నరి డాక్టర్ కిషోర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు గణేష్ బాబు, చిరంజీవి, శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.   

విశాఖ సిటీ

2021-06-17 12:52:54

ప్రతీఇంట్లోనూ కోవిడ్ వైద్యులుండాలి..

కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఇంట్లో ఒక వైద్యుడు తయారుగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.    కోవిడ్ వైద్యం, మందులు, నివరణా పద్ధతుల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఒక‌టో  ద‌శ‌లో క‌న్నా రెండో ద‌శ‌లో  ఎంతో మందిని కోల్పోయామని, 3వ దశ లో ఆ పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు.  రెండు ద‌శ‌ల్లో జరిగిన ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకొని మూడో ద‌శ‌లో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను ముందుగానే ఊహించి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు. థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో ఒక వేళ‌ పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే ఎలాంటి వైద్యం అందించాల‌నే అంశంపై మిమ్స్‌లో గురువారం నిర్వ‌హించిన ఒక రోజు అవ‌గాహ‌న స‌ద‌స్సు ముగింపు కార్యక్రమంలో వైద్యులను ఉద్దేశించి కాలెక్టర్  మాట్లాడారు.  ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కోడానికైనా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాల‌ని, పిల్ల‌ల‌కు అందించ‌బోయే వైద్య విధానంపై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు. 3వ దశ లో  పిల్లలకు  వ్యాధి సోకే      అవకాశం ఉందని, ముందుగానే  ల‌క్ష‌ణాలను గుర్తించేలా వైద్యులు అంద‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు.  కోవిడ్ థర్డ్ వేవ్ అకస్మాత్తుగా రావచ్చని, వేగంగా విస్తరించవచ్చని, ఎక్కువ కేసు లు నమోదయ్యే అవకాశం ఉండొచ్చని, అప్రమత్తత అవసరమని అన్నారు. జిల్లాలో  ఇప్పటికే 6 లక్షల మందికి వాక్సినేషన్ వేయడం జరిగిందని, వచ్ఛే నవంబర్ లోగా 18 లక్షల మందికి వాక్సినేషన్ వేయడానికి ప్రణాళికలు వేసామన్నారు.    ప్రజలు  భయన్దోళనలకు గురి కాకుండా వారిలో  మనో ధైర్యాన్ని నింపాలని అన్నారు. ముఖ్యముగా  పిల్లల తల్లి దండ్రులకు  అవగాహన కలిగించాలన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డీసీహెచ్ఎస్ డా. నాగ‌భూష‌ణ‌రావు, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డా.అప్పల రాజు, ఆర్.ఎం.ఓ డా.గౌరి శంకర రావు,  మిమ్స్ డైరెక్ట‌ర్ డా. భాస్క‌ర‌రాజు, స్పెష‌ల్ ఆఫీస‌ర్ డా. హ‌రికిష‌న్ కుమార్‌, డా. వెంక‌టేశ్వ‌రరావు, డా.శాంతి, పలు విభాగాల‌కు చెందిన ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు వైద్యులు, న‌ర్శింగ్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-17 11:47:06

ఎస్సీ, బీసిలకు రూ.5 లక్షల రుణాలు..

క‌రోనా కార‌ణంగా బీసీ, ఎస్సీ కుటుంబాల‌లో సంపాదించే వ్య‌క్తి చ‌నిపోతే వారి కుటుంబ స‌భ్యుల‌కు రూ.5 ల‌క్ష‌ల రుణ స‌దుపాయం క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని, దీనికి సంబంధించిన ప్ర‌క్రియ‌ను స‌మ‌న్వ‌యంతో నిర్వ‌హించాల‌ని జేసీ జె. వెంక‌ట‌రావు అధికారుల‌ను ఆదేశించారు. జీవ‌నాధారం కోల్పోయిన కుటుంబాల‌కు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు బాధిత కుటుంబీకుల‌ను గుర్తించే ప్ర‌క్రియ స‌క్ర‌మంగా చేప‌ట్టాల‌ని సూచించారు. సంబంధిత ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా మండ‌ల‌, మున్సిప‌ల్ కేంద్రాల‌కు అంద‌జేయాల‌ని చెప్పారు. రుణ మంజూరు ప్ర‌క్రియ‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసే నిమిత్తం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోల‌తో జేసీ గురువారం జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. బీసీ కార్పోరేష‌న్‌, ఎస్సీ కార్పోరేష‌న్ ఈడీల‌తో క‌లిపి నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో రుణ మంజూరు ప్ర‌క్రియ‌కు సంబంధించిన అంశాల‌ను వివ‌రించారు. అర్హ‌త‌లు, నిబంధ‌న‌లు తెలియ‌జేశారు. నిర్ణీత గ‌డువులోగా బాధిత కుటుంబీకుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని, ఇత‌ర ప్ర‌క్రియ‌లు పూర్తి చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

కాన్ఫ‌రెన్స్‌లో బీసీ కార్పోరేష‌న్ ఈడీ నాగ‌రాణి, ఎస్సీ కార్పోరేష‌న్ ఈడీ జ‌గ‌న్నాధ‌రావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అర్హ‌తలు.. ఇత‌ర నిబంధ‌న‌లు

@బీసీ, ఎస్సీ కుటుంబాల‌కు ఆధార‌మైన భార్య‌, భ‌ర్త (18 నుంచి 60 ఏళ్ల వ‌య‌సు)  ఏ ఒక్క‌రు క‌రోనాతో చ‌నిపోయినా ఈ రుణ సాయానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
@ఏడాదికి రూ. 3 ల‌క్ష‌ల లోపు ఆదాయం మాత్ర‌మే ఉండాలి.
@ఎస్సీ వ‌ర్గానికి చెందిన వారు ఈ నెల 20వ తేదీ లోపు, బీసీ వ‌ర్గానికి చెందిన వారు ఈ నెల 23వ తేదీ లోపు బియ్యం కార్డు, ఆధార్ కార్డు, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను ద‌ర‌ఖాస్తుకు జ‌త‌చేసి  గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో అంద‌జేయాలి.
@ప‌రిశీల‌న అనంత‌రం అర్హులైన ల‌బ్ధిదారుల‌కు రూ.5 ల‌క్ష‌ల రుణం మంజూరు చేస్తారు.
@రాయితీ రూ.1 ల‌క్ష వ‌ర‌కు ఉంటుంది.

Vizianagaram

2021-06-17 11:45:36