కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కే కవచమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు బుధ వారం ఏడు రోడ్ల కూడలి నుండి భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి సీదిరి అప్పల రాజు ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై నినాదాలతో స్వామి వివేకానంద కూడలి వరకు వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్ధ, అధికారులు, సిబ్బంది, వ్యాపార వర్గాలు, ప్రజలు ర్యాలీలో పాల్గొని నినదించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పల రాజు మాట్లాడుతూ గత ఏడు నెలలుగా కరోనాతో పోరాడుతున్నామన్నారు. రాష్ట్రంలో రోజుకు 70 వేల పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే ముందంజలో ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను దేశం నలుమూలల నుండి అందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. మౌళికసదుపాయాలు భారీగా ఏర్పాటు చేసుకున్నామని మంత్రి చెప్పారు. వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్ధ, వాలంటీరు వ్యవస్ధ కోవిడ్ ను ఎదుర్కొనడంలో కీలంకగా పనిచేసాయని అన్నారు. లాక్ డౌన్ ల విధింపుతో ఇంకా ఎంత కాలం బాధలు పడాలని ప్రజలు భావించే పరిస్ధితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తగ్గుముఖం పడుతోందని పేర్కొంటూ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో పండగలు నిర్వహించుకునే సమయమని, ఎక్కువగా గుమిగూడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. తద్వారా కేసులు పెరుగుదలకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా రెండవ దశ వ్యాప్తి ప్రారంభం అయినట్లు సర్వేలు చెపుతున్నాయని, ఇటుంటి దశ రాష్ట్రంలో రాకుండా ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని కోరారు. ప్రజల్లో ఇంకా నిర్లక్ష్యం నిర్లిప్తత భావన ఉందని అన్నారు. ప్రజలు చైతన్యవంతం కావాలని, అవగాహన పెంపొందించుకుని వైరస్ భారీన పడకుండా ఉండాలని కోరారు. ప్రజల్లో అవగాహన కలిగించుటకు గ్రామ సచివాలయం పరిధి నుండి జిల్లా స్ధాయి వరకు ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ కరోన వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కు కవచంలా పనిచేస్తుందన్నారు. అందుకే మాస్కే కవచం నినాదంతో ప్రజలను అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రజలు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంత అవగాహన రావాలని అన్నారు. కరోనా రహిత జిల్లా ఆవిర్భవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, నగర పాలక సంస్ధ కమీషనర్ పల్లి నల్లనయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు, సమగ్ర శిక్షా అభియాన్ ఏపిసి పి.వి.రమణ, వైద్య శాఖ అధికారులు కృష్ణ మోహన్, సి.హెచ్.మహాలక్ష్మి, నగర పాలక సంస్ధ ఆరోగ్య అధికారి ఎం.వెంకట రావు, ప్రత్యేక అధికారి ప్రసాద్, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు దువ్వాడ శ్రీనివాస్., డా.మంత్రి వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి మంగళవారం రాత్రి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి ఈవో కెఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి కలిసి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన గరుడసేవలో ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అదనపు ఈవో ప్రధాన న్యాయమూర్తికి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి ఈ వాహనసేవలో పాల్గొన్నారు. సీజె వెంట ఈవో డా. కెఎస్.జవహర్రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) సదా భార్గవి, బోర్డు సభ్యులు రామేశ్వరరావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మురళీకృష్ణ, డా. నిశ్చిత, జి.వి.భాస్కర్రావు, పుత్తా ప్రతాపరెడ్డి, శివకుమార్, శివశంకరన్, గోవిందహరి, డిపి.అనంత, కుమారగురు, రమేష్ శెట్టి, సిహెచ్.ప్రసాద్, దామోదర్రావు, పార్థసారధిరెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పి ఎ.రమేష్రెడ్డి, చీఫ్ ఇంజినీర్ రమేష్రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ప్రధమ స్థానమే లక్ష్యంగా శ్రమించి పనిచేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజున అధికారులను ఆదేశించారు. మంగళవారం విఎంఆర్డీఏ ఎరీనా చిల్ద్రెన్ ధియేటర్ లో శానిటరీ ఇన్స్పెక్టరులు, శానిటరీ కార్యదర్శుల సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ప్రధమ స్థానం సాధించాలంటే శానిటరీ ఇన్స్పెక్టరులు, వార్డు శానిటరీ కార్యదర్శులు ఇప్పటి నుండే పనిచేయాలని ఆదేశించారు. ఓడబ్ల్యూఎంఎస్ స్కానింగు గేట్స్ తక్కువుగా ఉన్న 10 వార్డులను గుర్తించి ఆయా వార్డు శానిటరీ ఇన్స్పెక్టరులకు షో కాజ్ నోటీసు ఇచ్చి 3 రోజులలోగా వివరణ తీసుకోవాలని అదనపు కమిషనర్ వి. సన్యాసి రావు ఆదేశించారు. మరల రిపీటు అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పలు వారులలోని స్కేనర్లు కనిపించక పోవడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తపరుస్తూ మొత్తం 1950 స్కేనర్లు ఉండాలని, కనిపించకుండా పోయిన స్కేనర్ల ను వెంటనే పోలీసు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి నంబరు తీసుకోవాలన్నారు. వార్డు కార్యదర్శులు ఉదయం 6గం.ల నుండే విధులలో హాజరు కావాలని అన్నారు. వార్డు కార్యదర్శులు స్థానికంగా ఉండాలని ఆదేశించారు. స్కేనింగు గేట్సు తక్కువుగా ఉన్న వార్డు పరిధిలోని సచివాలయాల శానిటరీ కార్యదర్శుల డైరీలను పరిశీలించారు. డైరీ లేకుండా వచ్చిన 36వ వార్డు శానిటరీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తపరుస్తూ సమావేశం నుండి బయటకు పంపించారు. ఉద్యోగంలో చేరి సంవత్సరకాలం పూర్తీ అయినప్పటికీ వార్డు శానిటరీ కార్యదర్శులు తమ విధులపై పూర్తీ అవగాహన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇకపై అలా జరగకూడదని హెచ్చరించారు.
అదనపు కమిషనర్ దా. వి. సన్యాసి రావు మాట్లాడుతూ సర్వీసు రిక్వెస్ట్ లు 40కి పైగా సచివాలయాలలో ఒక్కటీ నమోదు అవకపోవడం పై ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇక ప్రతీ వార్డులోని సర్వీసు రిక్వెస్ట్ నమోదు చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. సర్వీసు రిక్వెస్ట్ లో సమాదానం ఒకే పదంలో కాకుండా, 2 లేక 3 వాక్యాలలో ఉండాలని సూచించారు. సి.ఎమ్.ఓ.హెచ్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి మాట్లాడుతూ జాబ్ చార్టు ప్రకారం ఉదయం 6గం. ల నుండే శానిటరీ కార్యదర్శులు విధులలో ఉండాలని, డైరీలో ప్రతీ రోజూ చేసిన పని వివరాలు ఉండాలన్నారు. శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టరులు, వార్డు శానిటరీ కార్యదర్శులు, ఒక టీంగా కూర్చొని మైక్రో పోకెట్స్ వైజ్ పని వివరాలు చర్చించుకోవాలన్నారు. బయట ఏరియాలలో ఎక్కడ బడితే అక్కడ చేపల వ్యాపారం జరుగుతుందని, అలా జరగకుండా సచివాలయ శానిటరీ కార్యదర్శులు చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, సి.ఎమ్.ఓ.హెచ్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఏ.ఎం.ఓ.హెచ్.లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టరులు, వార్డు శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల విధి నిర్వహణకు సహకరించి మంచి సేవలు అందించేందుకు కృషి చేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధ వారం పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేసారు. 1959 సంవత్సరంలో ఇండియా – టిబెట్ దేశ సరిహద్దుల రక్షణలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల పట్ల చైనా దాడి చేయడంతో పలువురు పోలీసులు మృత్యువాత పడటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అప్పటి నుండి జాతీయ పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. పౌరుల రక్షణలోను, విపత్తుల వంటి సమయంలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసులు వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ఇటువంటి అమర వీరులను స్మరించడం మన విద్యుక్త ధర్మమని ఆయన చెప్పారు. ప్రజలు స్వేచ్చగా ఉండటానికి, ప్రాణాలు, ఆస్తులతో అభద్రతా భావం లేకుండా జీవించుటకు పోలీసుల సేవలు ప్రధానమన్నారు. కోవిడ్ 19 సమయంలో ప్రజల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టారని, కొంత మంది పోలీసు ప్రాణాలను వదిలారని, మరికొందరు కరోనా నుండి కోలుకుని తిరిగి విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. వ్యక్తిగత భద్రత, కుటుంబ భద్రతను కూడా విస్మరించి ప్రజల ప్రాణాలకు, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చి విధులు నిర్వహించడం ముదావహమన్నారు. అమర వీరులను స్మరించుకోవడం ద్వారా వారికి గౌరవాన్ని ఇవ్వాలని కోరారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మలకు శాంతి కలుగాలని కోరుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో మృత్యవాత పడిన వారి ఆత్మకు శాంతి కలుగాలని ప్రజలు, న్యాయవ్యవస్ధ తరపున శ్రద్ధాంజలి ఘటించారు. అమర వీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అమర వీరుల ఆశిస్సులతో కుటుంబాలు ధైర్యంగా, మనోస్ధైర్యంతో జీవించాలని ఆకాంక్షించారు. పోలీసులకు ప్రతి పౌరుడు సహాయ సహకారాలు అందించి, పోలీసుల విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకం కలిగించకుండా తోడ్పడాలని కోరారు.
శ్రీకాకుళంజిల్లాలో మెగా వర్చువల్ లోక్ అదాలత్ ను నవంబరు 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్ధ ,జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్ధ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కోర్టులో మంగళ వారం వివరాలు అందించారు. నవంబరు 9వ తేదీన న్యాయ సేవాధికార దినోత్సవం సందర్భంగా మెగా వర్చువల్ లోక్ అదాలత్ ను 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మెగా వర్చువల్ లోక్ అదాలత్ ను భారీ ఎత్తున జిల్లాలో నిర్వహించుటకు ప్రణాళికలు సిద్ధం చేసామని ఆయన వివరించారు. కక్షిదారులు, న్యాయవాదులు, ఇతర సంబంధిత శాఖలు, వ్యక్తులు మెగా వర్చువల్ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించాలని, అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం కావడానికి న్యాయాధికాలకు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేసారు.
విద్యార్థి దశలోనే ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహనా పెంచుకోవాలని లోక్ అదాలత్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే.కే.వి.బులి కృష్ణ అన్నారు. మంగళవారం న్యాయ సేవల సాధికార సంస్థ ఆధ్వర్యంలో విశాఖ రామకృష్ణా, శ్రీ రామకృష్ణా పాఠశాలల విద్యార్థులతో ఆన్లైన్లో నిర్వహించిన ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సులో అయన మాట్లాడారు. విద్యార్థులకు న్యాయమూర్తి ,రాజ్యాంగం, ప్రాధమిక న్యాయశాస్త్రాలపై అవగాహనా కల్పించారు. న్యాయమూర్తితోపాటు లోక్ అదాలత్ సభ్యురాలు సీనియర్ న్యాయవాది బి.పద్మజారాణి విద్యార్థుల హక్కుల గురించి వివరించారు. కన్స్యూమర్ కోర్ట్ న్యాయాయవాది యు.యెన్ రావు గారు విద్యార్థులకు కన్స్యూమర్ కోర్ట్ విధి విధానాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణా, శ్రీ రామకృష్ణా పాఠశాలల అధినేత ఎ. కృష్ణారెడ్డి గారు, ప్రిన్సిపాల్ జి.వి.రవీంద్రుడు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాస రావు, సోషల్ స్టడీస్ టీచర్ .ఐ.థామస్ , విద్యార్థులు పాల్గొన్నారు.
నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖలోని శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి మహా లక్ష్మీ హోమం, శ్రీ చక్ర నవావర్చన, మహా పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ,అమ్మలగన్న అమ్మ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి క్రుపతో కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణ జరగాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రభుత్వం గుర్తించే చేయాలని అమ్మవారిని కోరినట్టు చెప్పారు. కరోనా వైరస్ నుంచి విముక్తి కలిగి జర్నలిస్టు కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. కరోనా వైరస్ గతంలో పోల్చుకుంటే ఇపుడు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా సూచనల మేరకు జర్నలిస్టులు ప్రెస్ మీట్లు, అధికారిక కార్యక్రమాలకు కవరేజికి వెళ్లే సమయంలో సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పని సరిగా ధరించాలన్నారు. వీలైనంత వరకూ హేండ్ గ్లౌజ్ లు వేసుకోవాలన్నారు. అలా వీలు కాని పక్షంలో నాణ్యమైన శానిటైజర్లును వినియోగించాలన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వం నిర్ధేశించిన జాగ్రత్తలతోమాత్రమే విధులకు హాజరు కావాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమ మే ధ్యేయంగా తాను అహర్నిసలు పనిచేస్తున్నట్టు గంట్ల వివరించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అక్టోబరు 31వ తేదీ నాటికి వరదల్లో సంభవించిన నష్టాల వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. మానవత్వంతో ప్రతి అంశాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన ఆదేశించారు. నష్టపోయిన వారి జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని అన్నారు. తద్వారా జాబితాలో తప్పిన వారిని చేర్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నవంబరు 15 నాటికి నష్టపరిహారం అందించుటకు చర్యలు చేపడతామని అన్నారు. నష్టపరిహారం అందించడం వలన రైతులకు రబీ పంటలకు ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. కోవిడ్ రికవరీ రేట్ లో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్నామని చెప్పారు. కోవిడ్ తగ్గుముఖం పడుతుందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ వచ్చి వెళ్లిన తర్వాత గుండె, శ్వాస తదితర సమస్యలు తలెత్తుతున్నట్లు సర్వేలు చెపుతున్నాయని, దీనిని గమనించి తగిన విశ్రాంతి అవసరమని తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కోవిడ్ సమస్యలు ఉన్నవారు 104 నంబరుకు ఫోన్ చేయవచ్చని అన్నారు. ప్రతి ఆరోగ్య శ్రీ ఆసుపత్రిలో 15 రోజుల్లో హెల్ప్ డెస్క్ విధిగా ఉండాలని ఆయన స్పష్టం చేసారు. అచ్చట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, జేసీ పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. ఆరోగ్య మిత్ర లంచం అడిగితే ఉన్నత అధికారులకు తెలియజేయుటకు ఫోన్ నంబరు ఏర్పాటు చేయాలని అన్నారు. నవంబరు 2 నుండి బడులు తెరుస్తున్నామని, కోవిడ్ కు సంభందించిన అవగాహన పిల్లలకు కల్పించాలని ఆయన చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ ఏర్పాట్లు, మధ్యాహ్నం వరకు మాత్రమే బడులు ఉంటాయని చెప్పారు. పాఠశాలల్లో పిల్లల సంఖ్య ఆధారంగా ప్రత్యామ్నాయ దినాల్లో వివిధ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఎక్కడా నీరు నిలువ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ క్రింద మెటీరియల్ కాంపోనెంట్ పనులు వేగవంతం కావాలని ఆదేశించారు. సీసీ రోడ్లు, కాలువల పైన దృష్టి సారించాలని ఆదేశించారు. నాడు నేడు పనులు వేగవంతం కావాలని ఆయన ఆదేశించారు. నవంబరు 6న జగనన్న తోడు పథకం ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు వలన నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డీఆర్డీఏ పిడి బి.నగేష్, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, సిపిఓ ఎం.మోహన రావు, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్, డిఇఓ కె.చంద్రకళ, అదనపు డిఎంహెచ్ఓ డా.బి.జగన్నాథ రావు, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, జలవనరులు, ఇపిడిసిఎల్, పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీర్లు డోల తిరుమల రావు, ఎన్. రమేష్, ఎస్.రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
వై.యస్.ఆర్ ఆరోగ్య శ్రీని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆరోగ్యశ్రీ కేలండర్ ను జిల్లా కలెక్టర్ జె నివాస్ తో పాటు జిల్లా అధికారులంతా మంగళవారం కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెలక్టర్ మాట్లాడుతూ, కేలండర్లో ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు, వాటి ఫోన్ నంబర్లు, ఆరోగ్య మిత్రల ఫోన్ నంబర్లు, లభించే స్పెషాలిటీ సేవల వివరాలు పొందుపరచడం జరిగిందన్నారు. వై. యస్.ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్టు ప్రచురించిన ఈ కేలండర్లను జిల్లాలో గల అన్ని సచివాలయాలకు ప్రజలకు సమాచారం అందించేందుకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పై గ్రామసచివాలయాల ద్వారా సిబ్బంది, వాలంటీర్లుకు ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. అత్యవసర సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూసే బాధ్యత సచివాలయ సిబ్బందిపైనే ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్ రవి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని సాగర్నగర్-ఎండాడ పెట్రోల్ బంక్ వరకూ రోడ్డు నిత్యం ప్రజలు నడిచేదని ఈ రోడ్డును వేయకుండా జివిఎంసి అధికారులు, ఇంజినీర్లు అక్కడ గల ప్రభుత్వ చెరువులోంచి ముందుగా ప్రైవేట్ లే అవుట్కు రూ.42లక్షలు అక్కడ వెచ్చించడం నిబంధనలకు విరుద్దమని సిపిఎం నగర కార్యదర్శి గంగారావ్ ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాగర్ నగర్- ఎండాడ ప్రజలు నడిచే దారిని వేసేందుకు 20 రోజులుగా మట్టిపోస్తున్నారే తప్ప తారు రోడ్డు వేయడం లేదన్నారు. అదే ప్రైవేట్ లే అవుట్ కోసం ఒక్క రాత్రికి రాత్రే అందమైన రోడ్డును జివిఎంసి వేయడం ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. ప్రైవేటు లేవుట్ లకోసం చూపించే శ్రద్ధ ప్రజాపయోగ పనులకు చేపట్టం లేదన్నారు. ప్రైవేట్ లే అవుట్ల కోసం జివిఎంసి ఇంజినీర్లు రోడ్డు వేయించే క్రమంలో లాంచాలకు పాల్పడే ప్రైవేటు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చుతున్నారన్నారు. అంతేగాక ప్రభుత్వ చెరువు గర్భం ఎకరా 62 సెంట్ల భూమిని కూడా ఆక్రమించినా రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధికి లబ్ధిచేకూర్చడం కోసమే చూస్తున్నారన్నారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సిహెచ్ నరసింగరావు, గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు ఆ రోడ్డుపై పరిశీలనకు వెళ్లగా స్థానికులు పలు ఫిర్యాదు చేశారనే విషయాన్ని గుర్తుచేశారు. తక్షణమే ప్రభుత్వం ఆ రోడ్డుకు మంజూరు చేసిన నిధులను నిలుపుదల చేసి, ప్రతిపాదించిన ఇంజినీర్లపై చర్య తీసుకుని, ఆక్రమణకు గురైన చెరువును రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు గంగారావ్..
ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆఈట్ పరీక్షల ఫలితాలను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సోమవారం విడుదల చేశారు. పరీక్షలు జరిగిన మూడు రోజుల్లో ఫలితాలు సిద్దం చేయడం పట్ల వీసీ హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడికి సమర్ధవంతంగా కృషిచేసిన ప్రవేశాల సంచాలకుల కార్యాలయం అధికారులను వీసీ ప్రసాద రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.వి రవీంధ్రనాథ్ బాబు, ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు, అసోసియేట్ డైరెక్టర్లు ఆచార్య ఎస్.బి పడాల్, డాక్టర్ సి.వి నాయుడు, సెట్ సభ్యులు డి.బి వెంకటాద్రి, డాక్టర్ ఎస్.పాల్ డగ్లస్, డాక్టర్ పి.వి లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎన్.సాలమన్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు. ఆసెట్ ప్రవేశ పరీక్షకు 17568 మంది దరఖాస్తు చేయగా, 14732 మంది హాజరయ్యారు. ఆఈట్ పరీక్షకు 1909 మంది దరఖాస్తు చేయగా 1259 మంది హాజరయ్యారన్నారు. కెమికల్ సైన్స్ విభాగంలో 93 మార్కులతో కోనాల అర్షిత భవ్య ఆసెట్లో టాపర్గా నిలచారు. ఆఈట్లో 80 మార్కులతో కె.శ్రీ క్రిష్ణ వెంకట సుబ్బారావు ప్రధములుగా నిలచారన్నారు. పరీక్షల ఫలితాలు ఏయూ ప్రవేశాల సంచాలకుల వెబ్సైట్ www.audoa.in లో పొందుపరిచారు. ఫలితాలు విడుదల అనంతరం వీపీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ త్వరలో కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేసి వెల్లడిస్తామన్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాలు సైతం రికార్డు సమయంలో కేవలం 20 రోజుల్లో అందించే దిశగా అధికారులు పనిచేస్తున్నారన్నారు.
విశాఖజిల్లాలో భూ ఆక్రమణలపై సిట్ దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసేందుకు దర్యాప్తు బృందానికి సమాచారం అందజేయాలని సిట్ బృందం అధ్యక్షులు విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సర్క్యూట్ హౌస్ లో సోమవారం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఇతర అధికారులతో ఆయన సమీక్షించారు. కరోనా నేపథ్యంలో సిట్ దర్యాప్తు కొనసాగలేదని దర్యాప్తును తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తు బృందం సభ్యులు వై.వి.అనూరాధ, రిటైర్డ్ జడ్జి టి. భాస్కరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, విశాఖపట్నం ఆర్డీవో పెంచల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.