గ్రామసచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ఎప్పటికప్పుడు నవీకరించి, సవరిస్తూ ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. విశాఖజిల్లా రాంబిల్లి మండలంలో శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టర్ మట్లాడుతూ, రెండు రోజులలో ఈ జాబితాలను, రికార్డులను సమర్పించాలని ఈవో ఆర్ డి ని ఆదేశించారు. గ్రామ సచివాలయాలలో అనేక రకాల సేవలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సచివాలయంలో చాలా తక్కువగా సేవలు అందిస్తున్నారని, ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి మరిన్ని సేవలను అందుబాటు లోకి తేవాలని ఆదేశించారు. అక్కడి సిబ్బందితో వివిధ విషయాలపై చర్చించారు. దృవ పత్రాల జారీ, సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా నిర్వహిస్తున్నది పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాన్ని కూడా సందర్శించి అక్కడి సేవలను పరిశీలించారు. ఈ పర్యటనలో అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు లీలావతి, ఏ డి ఆర్, ఏఈ, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, తాసిల్దార్ ఇతర శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్ – 19 తగ్గిందని భావించి, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేసారు. శనివారం నాడు స్థానిక సర్క్యూట్ హౌస్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎటువంటి అవినీతికి తావు లేని పరిపాలన అందిస్తున్నామని తెలిపారు. సామాన్యుడు కూడా ఎటువంటి భయందోళనలు లేకుండా నిశ్చింతగా ఉండే విధంగా పరిపాలన జరుగుతుందని తెలిపారు. పేద ప్రజలకు ఎటువంటి వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని అన్నారు. 40 రోజుల క్రితం రుషికొండలోని గీతం విద్యా సంస్థల యాజమాన్యం సమక్షంలోనే ఆర్ డి ఓ , ఎమ్మార్వోలు సర్వే చేయించి, ప్రభుత్వ భూమి సరిహద్దులను నిర్థారించడం జరిగిందని తెలిపారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని, ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వాళ్లు స్వచ్చందంగా ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు.ప్రభుత్వ భూములను ఆక్రమించడం తప్పు అని, ఎవరైనా తెలిసో, తెలియకో ప్రభుత్వ భూమి తమ ఆధీనంలో ఉంటే, ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని, ఒక వేళ ఆ భూమి వారికి అవసరమని భావిస్తే, ప్రభుత్వానికి తగు విధంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు అదీప్ రాజు, తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో గీతం టుబీ డీమ్డ్ యూనివర్సిటీ ప్రహరీ గోడలను కూల్చి వేసినంత మాత్రాన గీతం సంస్థ చేసిన అక్రమాలు సరి చేసినట్లు కాదని AP ప్రజా సంఘాల జెఎసి అధ్యకులు జెటి రామారావు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.. సుమారుగా నాలుగు దశాబ్దాల నుండి విశాఖపట్నంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న గీతం యూనివర్సిటీ పై పూర్తిస్థాయిలో సి.బి.ఐ ,ఈ డి వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంస్థకు విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల అదాయం ఫీజులు , విరాళాల రూపంలో అర్దిక నేరాలకు పాల్పడ్డారని, మనీలాండరింగ్ ఇన్కమ్ టాక్స్ చట్టాల ద్వారా తనిఖీలు నిర్వహించాలని లేకుంటే రికార్డులు తారుమారు అవుతాయని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గీతం టుబీ డీమ్డ్ యూనివర్సిటీ ని స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాగే వర్సిటీ లోపల ఉన్న అధునాతన భవనాలు క్రికెట్ గ్రౌండ్ ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో నిర్మించారని వాటిని వెంటనే కూల్చి వేయాలన్నారు. సంస్థలో అనేక ఆత్మహత్యలు, సంఘటనలు జరిగినా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. ఒక్కోసారి ఈ సంస్థనుంచి ఇచ్చిన నకిలీ డిగ్రీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. హుదూద్ సమయంలో పెద్దలకు దక్కాల్సిన నష్ట పరిహారం సుమారు 50 కోట్ల రూపాయల పైన రాజకీయ పలుకుబడితో దక్కించుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీని పథకం ప్రకారం నిర్వీర్యం చేసి అంతర్జాతీయ స్థాయిలో తన సామ్రాజ్యాన్నివిస్తరించిందన్నారు. ఎటువంటి వుడాGVMC అనుమతులు లేకుండానే అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణాలు చేసిందన్నారు. గతంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా సర్వర్ ప్రాబ్లం తో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అలాగే ఈ కామర్స్ సంస్థలు అమెజాన్ గూగుల్ వంటి వాటిని కూడా ముంచారని అన్నారు. సంవత్సరానికి 20 లక్షల రూపాయల ఫీజులతో సుమారుగా 15 వేల మంది విద్యార్థులను నలభై సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతున్న ఇంతవరకూ ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదని,తాము అనేక వినతులు, ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, కాని CM Y S జగన్ ఎటువంటి రాజకీయ వత్తిడిలకు లొంగకుండా అయన తీసుకున్న కూల్చివేత చర్యలు కు అభినందనలు తెలుపుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఇటీవల నియమించ బడిన వివిధ కార్పొరేషన్ లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్ లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి పనిచేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఆయనను కలిసిన వారిలో గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేటి ప్రసాద్, నాగవంశీ కార్పొరేషన్ చైర్ పర్సన్ కొండమ్మ, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మ, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ టి. రాము, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ సబీరా బేగం, సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ బషీరున్నీసా బేగం, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ రవికుమార్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్, మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ విజయచందర్ ఉన్నారు.
మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ అన్నీ కోవిడ్ నియమావళిని అనుసరిస్తూ వారి వ్యాపారాలు సాగించాలని అదనపు జివిఎంసి కమిషనర్ డా. వి. సన్యాసి రావు స్పష్టం చేశారు. శనివారం, జివిఎంసి లో హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ యజమానులు ప్రతినిధులతో సమీక్ష నర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 పై ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అవగాహన సదస్సు నిర్వహిస్తుందని, ప్రభుత్వానికి పూర్తీగా సహకారం అందించాలన్నారు. కోవిడ్ నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటించి వ్యాపారాలు చేయాలన్నారు. మాస్కులు, శానిటైజర్స్ ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ హోటల్ ముందు వచ్చే వినియోగదారులు పర్యాటకులకు కనిపించేలా కోవిడ్ నియమావళి తెలిపే బ్యానర్ పెట్టాలని, ప్రధాన గేటు వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయాలన్నారు. హోటల్, రెస్టారెంట్స్ లలో సిట్టింగ్స్ తగ్గించి బౌతిక దూరం ఉండేలా చూడాలన్నారు. డిస్ప్లే బోర్డులు, “నో మాస్క్ – నో ఎంట్రీ” బోర్డులు, ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించి ప్రజలకు మీవంతు అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ మరల రెండో దశ మొదలైందని, తగు జాగ్రత్తలు పాటించి వ్యాపారాలు చేసుకోవాలన్నారు. హోటల్, రెస్టారెంట్స్ లకు వచ్చే వినియోగదారుల యొక్క లగ్గేజ్ ను శానిటైజర్ చేసి వారికి కేటాయించే గదులను, బాత్ రూములను హైపో క్లోరేట్ తో శుభ్రపరచాలన్నారు. ప్రతీ రోజూ వినియోగదారునితో పాటు మీ సిబ్బందిని కూడా థర్మల్ స్క్రీనింగ్ చేయాలని, అనుమానం ఉంటే, లోనికి అనుమతి ఇవ్వకూడదన్నారు. వీలైనంతవరకు స్కేనర్ వాటర్ ట్యాప్ లు ఏర్పాటు చేయాలని, మా సిబ్బంది తనిఖీ నిమిత్తం వచ్చినప్పుడు, మీరు వారికి సహకరించాలన్నారు. అనంతరం జివిఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గాదర్సాకాలను పాటిస్తూ మీ వ్యాపారాలు చేయాలని, ప్రతీ హోటల్, రెస్టారెంట్స్ లలో అవగాహన కోసం బోర్డులు ఏర్పాటు చేయాలని, మాస్కులు లేకుండా ఎవరికీ ఇవ్వకూడదని, వంటగదులు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ యజమానులు, జివిఎంసి ఏ.ఎం.ఓ.హెచ్. డా. జయరాం తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఘన వ్యర్దాల నిర్వహణ నియమాలు 2016ను అనుసరించి ప్రజలు తమ ఇంటి వద్దే చెత్తను తడి చెత్తతో సంపద తయారు చేసుకునేవిధంగా జీవిఎంసీ ప్రణాళికలు రూపొందిస్తుంది. నగర ప్రజలు తమ ఇంటి వద్దే ఎరువులు తయారు చేసే విధముగా ప్రజలకు సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, ఆర్.పి ల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహిస్తున్నారు. 2020 సంవత్సరానికిగాను నగరంలో 14,600 ఇళ్ళలో హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని అమలు చేస్తుండగా 2021 లో దానిని 48,000 ఇళ్ళలో హోమ్ కంపోస్టింగ్ చేయించాలని లక్ష్యంగా మహా విశాఖ పట్నం నగర పాలక సంస్థ పనిచేస్తుంది. అలాగే నగరంలోగల 101 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, 186 బల్క్ వేస్ట్ జనరేటర్లుతో కూడా వారి ప్రాంగణంలోనే 100% తడి చెత్తను ఎరువులుగా తయారీ చేయించే విధంగా ప్రణాళికలు సిద్ధంచేసి అమలు చేస్తున్నారు. ఇలాగే రాబోయే స్వచ్ఛ్ సర్వేక్షన్ - 2021 లో ప్రజలను భాగస్వాములను చేసుకొన్న సిటిజెన్ కేటగిరీ బలోపేతం చేసుకొని మెరుగైన స్థానాన్నికై కృషి చేస్తామని మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ డా. జి. సృజన తెలియచేసారు. స్వచ్ఛ భారత్ నినాద స్పూర్తితో స్వచ్ఛ విశాఖపట్నం నిర్మించే దిశగా అడుగులు వేస్తున్న మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 2020 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 10 లక్షల కన్న ఎక్కువ జనాభా గల నగరాల కేటగిరీలో 9వ స్థానం సాధించిన విషయం విదితమే. ఇప్పటికే మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 2021 సంవత్సరలో స్వచ్ఛ్ సర్వేక్షన్ లో మరింత మెరుగైన స్థానాన్ని సాధించాలని లక్ష్యంగా ఇప్పటికే పలు కార్యక్రమలు ప్రారంభించింది.
సాంకేతికతతో అనుసంధానం కావడం ద్వారా పోలీసు వ్యవస్థలో సుపరిపాలన సాధ్యం కాగలదని పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా జాతి నిర్మాణంలో పోలీసు పాత్ర అనే అంశంపై శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతి నిర్మాణంలో పోలీసు పాత్ర కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయడం ద్వారా స్పూర్తిదాయక సేవలు అందించడం అవసరమని ఆయన పేర్కొన్నారు. సామాన్య మానవుని సంతృప్తి మేరకు పనిచేయడమే గొప్ప జాతి నిర్మాణం కాగలదని చెప్పారు. 1947 నుండి పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. సమాజంలో సామాజిక, సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులను పరిగణనలోకి తీసుకొని మార్పులు తీసుకురావలసి ఉంటుందని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వలన వ్యవస్థ బలోపేతం కాగలదని చెప్పారు. జనాభాకు అనుగుణంగా పోలీసు సంఖ్య ఉండడం ద్వారా వేగవంతమైన, ఉత్తమమైన సేవలు అందించేందుకు దోహదం చేస్తుందని వివరించారు. శాంతిభద్రతల అమలు చేసే శాఖగా అంకిత భావం, చిత్తశుద్ధి అవసరం అన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని గుర్తించాలని సూచించారు. పోలీసు వ్యవస్థ బలోపేతం చేయడంలో భాగంగా ప్రజల సహకారం అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. పోలీసు సిబ్బందిలో ఉన్నత విద్యలు కలిగిన వారు ఉండటం శుభసూచకమన్నారు. తద్వారా ఎదుటి వ్యక్తులను అర్ధం చేసుకోగలరని పేర్కొన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించడంలో స్నేహపూర్వక వాతావరణంలో పోలీసు పనితీరు ఉండాలని సూచించారు. అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో త్వరలో మరిన్ని మంచి విధానాలు రానున్నాయని వివరించారు. కోవిడ్ సమయంలో మంచి సేవలు అందించి, ప్రజల నుంచి మన్ననలు పొందారని అన్నారు. విశ్రాంత జిల్లా న్యాయమూర్తి పప్పుల జగన్నాథ రావు మాట్లాడుతూ ఎఫెక్టివ్ పోలీసింగ్ ద్వారా తప్పుడు ఫిర్యాదులు తగ్గుతాయన్నారు. తద్వారా పోలీసులు శాంతిభద్రతల అమలులో మరింత బలోపేతం కాగలదని అన్నారు.
మార్పు కార్యక్రమం ప్రత్యేక అధికారి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పి.రజనీకాంత రావు మాట్లాడుతూ సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో 72 మంది పోలీసులు ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడారని పేర్కొన్నారు. విద్యావిషయ నిపుణులు బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై అవగాహనకు ప్రాధమిక స్థాయి నుండి సిలబస్ లో చేర్చాలన్నారు. డిఎస్పీలు డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ సమాజంలో వివిధ రంగాల్లో ప్రభలే అశాంతిని సమర్థవంతంగా ఎదుర్కోవడం, యువతను మంచిదారిలో నడిపించడం వలన వ్యవస్థ బలోపేతం కాగలదని అన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు, ఇటీవల మృతి చెందిన జిల్లా పరిషత్ సిఇఓ జి.చక్రధర రావు ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు పి.సోమ శేఖర్, కె.శ్రీనివాసరావు, విద్యావిషయ నిపుణులు సురంగి మోహన్ రావు,డిఎస్పీ సి.హెచ్.జి.వి ప్రసాద్, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీలు చదివిన యువత ఉద్యోగాలు రాలేదని నిరుత్సాహ పడకుండా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపుతో స్వయం ఉపాది వైపు అడుగులు వేయడం అభినంద నీయమని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో పూర్తి స్థాయి సానిటైజేషన్ సిస్టమ్ తో ఏర్పాటు చేసిన ఐక్రీమ్ పార్లర్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జగనన్న ఇచ్చిన పిలుపు మేర స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ ఐ- క్రీమ్ అనే ఐస్ క్రీమ్ ,నార్త్ ఇండియన్ వంటకాల దుకాణంతో యువత నిరుద్యోగులకు మార్గదర్శిగా నిలవాలన్నారు. కరోనాలాంటి సమయంలో నిరుద్యోగులకు ఏదో ఒక రూపంలో ఉపాది కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూడా అనేక ఉపాది శిక్షణా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కొందరు స్వచ్ఛందంగా ఈ స్థాయి దుఖాణాలు ప్రారంభించి వారి టేలంట్ ను ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, కొట్టు విశాల్ హాజరై సానిటైజేషన్ టన్నెల్ ను ప్రారంభించారు. నిర్వహుకులు డి.ఆశిష్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో పంట నష్టాలను నిష్ఫక్షపాతం అంచనా వేయాలని జెసి(అభివ్రుద్ధి) రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని ఆత్మకూరు మండలం కరివేన సచివాలయ పరిధిలోని అధిక వర్షాల కారణంగా పాడైపోయిన పంటను జెసి పరిశీలించారు. ఈసందర్బంగా అక్కడ బాధిత రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అత్యధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన ప్రతీరైతుకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని చెప్పారు. అదేసమయంలో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టాలను రికార్డు చేయాలన్నారు. ఏరకం పంట ఎంత విస్తీర్ణంలో వేశారు, రైతులు, కౌలు రైతులు, పంటల భీమా, తదితర అంశాలను పరిగణలోనికి తీసుకొని విచారణ చేపట్టడంతోపాటు, రైతుల వివరాలను ఆధారాలతో నమోదు చేయాలన్నారు. ఎక్కడైనా సిబ్బంది బాధిత రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడినా దైర్యంగా స్థానిక గ్రామసచివాలయం ద్వారి ఫిర్యాదు చేయాలని కూడా జెసి రైతులకు సూచించినట్టు వివరించారు....
పర్యావరణం, మానవ జీవనానికి హానికలిగిస్తున్న సింగల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు బదులు ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం, వై.ఎం.సి.ఏ.నకు ఎదురుగా బీచ్ రోడ్డులో జివిఎంసి ఇండియన్ యూత్ ఫర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వస్తువులను ఇవ్వండి. ప్రత్యామ్నయ వస్తువులను తీసుకొని వెళ్ళండి అనే నినాదం గల ప్లాస్టిక్ పార్లరును కోవిడ్-19 వలన గత కొంతకాలంగా మూసివేయబడిన దాన్ని పున:ప్రారంబోత్సవమును కమిషనరు చేసారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ తో పర్యావరణం కలుషితమౌతుందని జల, చర జీవరాసుల ప్రాణాలు కోల్పోతున్నాయన్నారు. ఎవరైనా, ఒక కేజీ ప్లాస్టిక్ వ్యర్ధాలను తీసుకొచ్చి ఒక కప్పు కాఫి సేవించి వెళ్ళడం అనే వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టిన ఇండియన్ యూత్ ఫర్ సొసైటీను కమిషనర్ అభినందించారు. ప్లాస్టిక్ నిరోధమునకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు కృషి చేయాలన్నారు. ఇటువంటి ప్లాస్టిక్ పార్లర్లు జివిఎంసి పరిధిలో నాలుగు చోట్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇండియన్ యూత్ ఫర్ సొసైటీ ప్రెసిడెంట్ వై. అప్పల రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పూర్తిగా సింగ్లీ యూజ్ ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నయ వస్తువులైన గుడ్డ, నార సంచులను వాడాలన్న అవగాహన కోసమై ఈ ప్లాస్టిక్ పార్లర్ ను ప్రారంబించామన్నారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జివిఎంసి వారి సౌజన్యముతో “గివ్ ప్లాస్టిక్స్ – గెట్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్” అనే నినాదంతో ప్రజలలో ప్లాస్టిక్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలే కాకుండా ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు, పాదరక్షలు, వస్త్రాలను కూడా ఈ పార్లరులో స్వీకరిస్తున్నామన్నారు. అనంతరం, 10వ వార్డు కె.ఆర్.ఎం. కోలనీలో డ్రై రిసోర్స్ సెంటరును సందర్శించారు. అక్కడ యంత్ర సామగ్రీని పరిశీలించి వాటి సామర్ధ్యాన్ని పెంచేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులతో ఆదేశించారు. సందర్శనకు గుర్తుగా మొక్కలను నాటారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఏ.ఎం.ఓ.హెచ్ జయరాం తదితర అధికారులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారిణి నెగిశెట్టి ఉషాను జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శుక్రవారం ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ లో ఘనంగా సత్కరించారు. విశాఖ వాసిగా అంతర్జాతీయ బాక్సింగ్ లో భారత ప్రభుత్వం ద్వారా జ్ఞానచంద్ అవార్డుతో పొందడం అభినందనీయమన్నారు. ఇదే ఉత్సాహంతో మరిన్ని పతకాలు సాధించి దేశానికి, విశాఖకు మరింత కీర్తి తీసుకు రావాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఇంతటి ప్రతిష్టకు కారణమైన గురువు ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వర్లును కూడా కమిషనర్ సత్కరించి ఆయన సేవలు కొనియాడారు. మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని, ఆమె మన విశాఖ వాసి కావడం అందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనరు అశాజ్యోతి, డా. వి. సన్యాసి రావు, ప్రాజెక్టు డైరెక్టర్ (యు.సి.డి.) వై. శ్రీనివాస రావు వారి ఇరువురిని అభినందించారు.
శ్రీకాకుళంజిల్లాలో నాడు - నేడు కార్యక్రమంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోబోతున్నాయని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. నాడు – నేడు కార్యక్రమం పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ లావేరు మండలం తాళ్లవలస ఎం.పీ.పీ స్కూల్ ను శుక్రవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను నిశితంగా పరిశీలించిన ఆయన నాడు-నేడు పై ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు, సిబ్బందికి టీచర్స్ కి పలు సూచనలు చేస్తూ, సలహాలు ఇచ్చారు. అనంతరం తొమ్మిదో తరగతి చదివే విద్యార్థికి సోషల్ స్టడీస్ సబ్జెక్టుపై భూమి, భౌగోళం వంటి విషయాలపై విద్యార్థి పరిజ్ఞానం, చదవడాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పాఠశాలలోని గ్రానైట్ పై ఎటువంటి మరకలు ఉండరాదని, పుట్టి వర్క్ చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కిటికీ తలుపులను పరిశీలించిన ఆయన మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉండేందుకు పలు సూచనలు చేసారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్ లోని గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాము ఇంజనీరింగ్ చదివే సమయంలో కార్పోరేట్ పాఠశాలలు, పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు ఏ విధంగా ఉన్నాయో, నేడు ప్రభుత్వ పాఠశాలలు ఆ విధంగా మారేవిధంగా తీర్చిదిద్దుతామని సంకల్పించుకోవాలని ఇంజినీర్లకు సూచించారు. నిర్మాణపు పనులు జరుగుతున్న పనులను ఎప్పటికపుడు మోనటరింగ్ చేయాలని, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. పాఠశాలలకు అవసరమైన ఎలక్ట్రికల్ కన్సీల్డ్ వర్క్ తో పాటు నిర్మాణపు పనుల్లో నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్ధులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉయ్యాల, జారుడు బల్ల వంటివి ఆడుకునే విధంగా ఆకర్షణీయమైన ఆట వస్తువులను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. జిల్లాలోని డెమో స్కూల్స్ అయిన సింగుపురం, కింతలి, మురపాక పాఠశాలల్లో పాఠశాల కమిటీల ద్వారా ఏర్పాటుచేసిన సంగతిని తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ ఏ.పి.సి పైడి వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట కృష్ణయ్య, మండల తహశీల్ధారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిఎంఓ మోహన్ రావు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనే భావనతో నిర్లక్ష్యధోరణి పనికిరాదని, ప్రతీ ఒక్కరూ కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణపై పారిశ్రామిక వేత్తలతో సమీక్షా సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, అయితే ఇది సంతోషించవలసిన సమయం కాదని స్పష్టం చేసారు. రానున్న కాలంలో స్వీయ నియంత్రణ పాటించకపోతే మునుపటికంటే కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కావున ప్రతీ ఒక్కరూ ఆరుబయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్కును ధరించాలని, విధిగా శానిటైజేషన్ చేసుకోవాలని సూచించారు. దీనివలన కొంతమేర కరోనాను నియంత్రించవచ్చని చెప్పారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతీ రోజూ ఒక్కో రంగంతో సమావేశాన్ని ఏర్పాటుచేసి కరోనా నియంత్రణకై తీసుకోవలసిన చర్యలు గురించి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా నేడు పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో జనాభా ఉండే రంగం కార్మిక రంగం అని, కావున పరిశ్రమలలో పనిచేసే ప్రతీ ఒక్కరూ స్వీయ రక్షణ తీసుకోనట్లయితే కరోనా విజృంభించే అవకాశం ఉందని కలెక్టర్ స్పష్టం చేసారు. కరోనా నియంత్రణకై చర్యలు తీసుకోలేనట్లయితే పరిశ్రమలలో పనిచేసేవారితో పాటు వారి కుటుంబాలు కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందని అన్నారు. కావున ప్రతీ ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని వారు తిరిగే ప్రతీ చోట తప్పనిసరిగా మాస్కును ధరిస్తూ, శానిటైజేషన్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. జిల్లాలో కరోనా నియంత్రణకై ప్రతీ ఒక్కరూ సహకరించారని, ఇందుకు అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు స్వచ్చంధంగా ముందుకువచ్చి కరోనా నియంత్రణకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో విరాళాలు అందజేసారని కొనియాడారు. పారిశ్రామిక వేత్తలు, స్వచ్చంధ సంస్థలు ఇచ్చిన సహకారంతో కరోనా రోగులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు. కరోనా సమయంలో అరబిందో పరిశ్రమ రోజుకు 5వేల మంది వరకు భోజన సదుపాయాన్ని కల్పించిందని, అలాగే నాగార్జున ఆగ్రోటెక్ శానిటైజర్లను, షుగరి్ పారిశ్రామికవేత్తలు హైడ్రోక్లోరైడ్ వంటి వాటిని సమకూర్చడం జరిగిందని, వారి సహాయ సహకారాలు మరువలేనివని కొనియాడారు. ప్రతీ పరిశ్రమలో కరోనా నియంత్రణకు సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని, అలాగే కార్మికులు విధులు మారే సమయంలో తప్పనిసరిగా శానిటైజేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యాంటిన్లలో గుమిగూడకుండా ఉండేలా చూడాలన్నారు. పరిశ్రమల నుండి వెలువడే చెత్తను డీకంపోజ్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సాధ్యమైనంత మేర ఏ.సిల వాడకాన్ని తగ్గించాలని, ప్రతీ పరిశ్రమలో అత్యవసర మెడికల్ కిట్ ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. గతంలో జిల్లాలో 800 వరకు వచ్చే కరోనా కేసుల సంఖ్య నేడు 100కే పరిమితం మయిందన్నారు. దీనివలన కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందని భావించనవసరంలేదని, స్వీయరక్షణ పాటించకపోతే మరలా కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రజలు గుర్తించాలన్నారు. కళ్లు, ముక్కు, నోటి ద్వారానే కరోనా సోకే అవకాశమున్నందున ప్రతీ ఒక్కరూ వీటి నుండి రక్షణ పొందాలన్నారు. కొందరు మాస్కులను ధరిస్తూ, మాట్లాడే సమయంలో మాస్కులను తీసివేస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదని సూచించారు. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే కార్మికులు వారి విధులకు వెళ్లేసమయంలో తప్పనిసరిగా మాస్కును ధరించాలని, ఎప్పటికపుడు శానిటైజేషన్ చేసుకుంటూ , పరిశ్రమలలో కూడా భౌతికధూరం పాటించాలని అన్నారు. విధుల నుండి ఇంటికి చేరే సమయంలో తమపై ఒక కుటుంబం ఆధారపడి ఉందనే భావనతో మెలగాలని చెప్పారు. ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించడం వలన కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని వివరించారు. ఈ సమావేశంలో పారిశ్రామిక వేత్తలు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నగరపాలక సంస్థ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు రూ.26 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తికావాలని మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ఆకాంక్షించారు. శ్రీకాకుళం పట్టణ పరిధిలోని 30వ డివిజన్ నందు గల ఏ.పి.హౌసింగ్ బోర్డు కాలనీలో సిమెంట్ కాలువల శంకుస్థాపన కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ సాదారణ నిధులతో ఈ అభివృద్ధి పనుల నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగానే హౌసింగ్ బోర్డు కాలనీలోని 300ఎం.ఎం, 450ఎం.ఎం సిమెంట్ కాలువల నిర్మాణంతో పాటు యం.ఐ.జి 299 నుండి 318 వరకు 450 ఎం.ఎం సిమెంట్ కాలువ నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. వీటికోసం సుమారు రూ.26.00 లక్షలు నగరపాలక సంస్థ నిధులను వెచ్చిస్తుందని చెప్పారు. ప్రజల అవసరాలను తెలుసుకొని వాటిని ఎప్పటికపుడు పూర్తిచేసేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నిర్మాణపు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు. వర్షాకాలం కావడంతో పనులకు ఆటంకం లేకుండా చూసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పురపాలక సంఘం మాజీ అధ్యక్షురాలు మెంటాడ వెంకట పద్మావతి, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ కె.దక్షిణామూర్తి, సహాయ ఇంజినీర్ వెంకటరావు, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.