1 ENS Live Breaking News

19న అనంతాళ్వారు 969వ అవతారోత్సవం

శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 969వ అవతారోత్సవాన్ని ఫిబ్రవరి 19వ తేదీన తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్‌ బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తారు. 16 మంది పండితులు పాల్గొని ఉప‌న్య‌సించ‌నున్నారు.  సాధారణంగా అనంతళ్వారు జననం చైత్రమాసంలో తమిళనాడులో సంభవించినా తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా వారి వంశీకులు పరిగణిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా దేశవ్యాప్తంగా స్థిరపడిన‌ అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురశైవారి తోటలో (అనంతాళ్వారు తోట) కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచన‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

         పురాణాల ప్ర‌కారం శ్రీ అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా మరో శ్రీవైష్ణవ భక్తాగ్రేశ్వరుడు శ్రీరామానుజాచార్యులతో కలిసి అవిర్భవించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రామానుజాచార్యుని అభిమతానుసారమే శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణ‌ కథనాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఒకనాడు అనంతాళ్వారు నిండు గర్భిణియైన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూలతోటను ఏర్పాటు చేస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యాడు. తాను కాదన్నా తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యానవన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంతాళ్వారు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. 

మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్తస్రావం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపారభక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రుడయ్యాడు. నేటికీ స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్యగాథను స్ఫురింపచేస్తుంది. అదే విధంగా నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తోంది.

Tirumala

2023-02-08 17:11:33

కొత్తవలస హాస్టల్ ని సందర్శించిన కలెక్టర్

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి బుధవారం రాత్రి, కొత్తవలస బిసి బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రాత్రి సుమారు 9.15 గంటల సమయంలో ఆమె హాస్టల్ కి వచ్చారు. బాలికలతో మాట్లాడి, అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. మంగళవారం అస్వస్థతకు గురి అయి చికిత్స పొందిన బాలికలతో మాట్లాడారు. వారి అగోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. వారి సమస్యలపై ప్రశ్నించారు. బాగా చదువుకోవాలని కోరారు. ఈ పర్యటనలో జిల్లా బిసి సంక్షేమాధికారి యశోదనరావు పాల్గొన్నారు.

Kothavalasa

2023-02-08 16:25:37

అన్నవరం జాతీయ రహదారిపై కార్డన్ సెర్చ్..

అన్నవరం జాతీయ రహదారిపై ఎస్ఐ శోభన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు. అనుమానిత వాహనాలను తనిఖీ చేయడంతోపాటు, వాహనాల యొక్క పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లా డుతూ, వాహనదారులు ప్రయాణాలు చేసే సమయంలో ఖచ్చితంగా రికార్డులు తమ వద్దనే ఉంచుకోవాలన్నారు. ద్విచ క్రవాహన దారులు హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయకూడదన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు లేని వారితో వాహనాలు నడిపించకూడదన్నారు. మోటారు వాహ నాల చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2023-02-08 15:43:00

తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మరోసారి పెరిగిన విషయాన్ని ప్రకటించింది. తులం బంగారంపై రూ.250 నుంచి రూ.280 వరకు పెరిగింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 ఉంది. వెండి కిలో రేటు రూ.74,000లో ఎలాంటి మార్పు లేదు. కాగా గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు ప్రతీ మూడు రోజులకు ఒకసారి పెరుగుతూ వస్తుండటం మదుపరులపై ప్రభావం చూపిస్తున్నది.

2023-02-07 02:42:46

అప్పన్న నిత్యాన్నదానానికి రూ.101.116/- విరాళం

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి(సింహాద్రి అప్పన్న)వారి నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు కె.కోటపాడు  రొంగలి నాయుడుపాలెంకు చెందిన కొల్లి శివప్రసాద్, కృష్ణమ్మ దంపతులు సోమవారం రూ:101.116/- నగదు రూపంలో విరాళం ఇచ్చారు. ఆ మొత్తాన్ని ఆలయ ఇన్స్పెక్టర్ సిరిపరపు కనకరాజుకి ఆలయంలో అందజేశారు. అనంతరం దాతలు అంతరాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దాతలకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, సిబ్బంది వారికి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. 

సింహాచలం

2023-02-06 14:46:02

ఘనంగా శ్రీకోదండరామస్వామివారి పేటఉత్సవం

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి పేట ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి  మరుసటి రోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ. ఇందులో  భాగంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు బయల్దేరింది. ఉదయం 9.30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం ఊంజల్‌సేవ చేపట్టారు. ఆ తరువాత గ్రామోత్స‌వం నిర్వ‌హించి ఆలయానికి చేరుకున్నారు.

 ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టీటీడీ  హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.
 ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, టీటీడీ  శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో  మోహన్, సూపరింటెండెంట్‌   ర‌మేష్‌, అర్చకులు  ఆనందకుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు  కె.చలపతి,  సురేష్ పాల్గొన్నారు.

Tirupati

2023-02-06 11:38:14

కోటనందూరు స్కూలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కోటనందూరు పిహెచ్సీ ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న నాడు- నేడు కార్యక్రమం కింద చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, విద్యా బోధన, రైజ్ కార్యక్రమం అమలు తీరు, సైన్స్ ల్యాబ్, మరుగుదొడ్లు నిర్వహణ, మధ్యాహ్నం భోజనం తయారీ తదితరాలను పరిశీలించి అధికారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 8,9 వ తరగతి చదువుతున్న విద్యార్థులతో కలెక్టరు కృతికా శుక్లా ముచ్చటించి ఇటివల విద్యార్థులకు అందించిన ట్యాబ్స్ వినియోగం వివరాలు అడిగి తెలుసుకుని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రైజ్ కార్యక్రమం ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్న విశేషాలు విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహారీ గోడ, ఫైబర్ నెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ లంక ప్రసాదు, కలెక్టరు వెంట జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీధర్ రెడ్డి, పెద్దాపురం ఆర్డీవో జే సీతారామరావు, ఇంచార్జ్ డీఈవో ఆర్జే.డానియేల్ రాజు, కోటనందూరు తహసీల్దార్ జీ.బాలసుబ్రమణ్యం, ఎంపీడీవో ఎస్ఎస్.శర్మ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కె.వెంకట చౌదరి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Kotananduru

2023-02-06 10:38:42

జనసేన అధినేతను సీఎం చేయడమే మాలక్ష్యం..

విశాఖలో జనసేన దక్షిణ నియోజకవర్గంలో  32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు 
అల్లిపురం కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయకలయిక
ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ ఎంతో నిబద్ధత కలిగిన పార్టీ అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వచ్చిన కందులు నాగరాజుకి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి తామంతా కృషి చేస్తామని అన్నారు. కందుల నాగరాజు మాట్లాడుతూ, కెఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, రాబోయే రోజుల్లో ప్రజల సహకారంతో మరింత సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పసుపులేటి ఉషాకిరణ్, బొడ్డేపల్లి రఘు, సంకు వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

2023-02-05 14:31:17

క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలి

అరకు నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త తప్పకుండా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ అరకు నియోజకవర్గ సభ్యులు సోనియా అప్పలస్వామి సూచించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు కొండంత అండగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో జనసేన పార్టీ అధినేత అధినేత పవన్ కళ్యాణ్, కార్యకర్తల భరోసా కోసం ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి బాసటగా నిలవాలని రూ.5లక్షల ప్రమాద బీమాపథకం వర్తించే విధంగా ప్రణాళిక సిద్ధంచేసి కార్యకర్తలను ఆదుకుంటుందని ఈ సందర్భంగా అన్నారు. ఈనెల 10 నుండి 28 వరకు మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. జనసైనికులందరూ తప్పక నమోదుచేసుకోవాలన్నారు.

Munchingi Puttu

2023-02-05 14:01:43

బకాయి పడ్డ 2 నెలల జీతాలు తక్షణమే ఇవ్వాలి

అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల  స్థానిక కళ్యాణ మండపంలో శనివారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయలకు రెండు నెలల పాటు బకాయి పడ్డ జీతాలను చెల్లించాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కే శంకర్రావు మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, ఆయలకు గత రెండు నెలల నుండి జీతాలు చెల్లించకపోవడంతో ఆయా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమత పడుతున్నారని, కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి ఇవ్వాలని, పేష్ యాప్ ను రద్దుచేసి అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. అంగన్వాడి సిబ్బందికి పర్యవేక్షణ పేరుతో వేధింపులు గురి చేస్తున్నారని, 2017 నుంచి పెండింగ్లో ఉన్న టీఏడీఏ బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఈనెల 6న పాడేరు కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎం ఎం శ్రీను, రాందాస్, అంగన్వాడి కార్యకర్తలు భవాని, సుజాత, దేవి, ఆయాలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.

Munchingi Puttu

2023-02-04 14:08:04

గిరిజనులకు రగ్గులు పంపిణీ చేసిన సీఆర్పిఎఫ్ జవాన్లు

అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం దారపల్లి గ్రామంలో శనివారం సిఆర్పిఎఫ్ 198బెటాలియన్ జవాన్లు130 మంది గిరిజనులకు చలి రగ్గులను పంపిణీ చేశారు. సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్ మాట్లాడుతూ,  ప్రతి సంవత్సరం మాదిరిగా ఈఏడాది కూడా గిరిజనులకు చలి రగ్గులును పంపిణీ చేసినట్టు చెప్పారు. సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా గతంలో రేడియోలు, గొడుగులు సైతం పంపిణీ చేశామన్నారు. యువత అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా.. సంఘవిద్రసక్తులకు దూరంగా ఉండి.. కేంద్ర ప్రభుత్వ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు యువత ముందుకి రావాలన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ సిబ్బంది, ఏఎస్ఐ తిరుపతి, స్థానిక సర్పంచ్ సుభాష్ చంద్ర, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముంచింగుపుట్టు

2023-02-04 10:40:14

జనసేనఅధినేత పవన్ కళ్యాణ్ టిడిపి సీనియర్ కార్యకర్త

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అని, యువగళం పేరుతో చంద్రబాబు సొంత కొడుకు రోడ్డు ఎక్కితే.. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ జెండాలు మోస్తూ వెట్టిచాకిరి చేస్తున్నాడని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. పెందుర్తి నియోజకవర్గంలో కోటి 60 లక్షల రూపాయలతో నిర్మించిన కాపు సామాజిక భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయంగా, ఆర్థికంగా కాపు సామాజిక వర్గానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చిందని అన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తరఫున 31 మంది కాపు అభ్యర్థులు పోటీ చేస్తే 27 మంది గెలిచారని ఆయన చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్లో 25 మంత్రులు ఉంటే అందులో ఐదుగురు మంత్రులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని ఆయన పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతను మరువరాదని మంత్రి అమర్నాథ్ అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు.. పార్టీని స్థాపించిన వారు దానిని సుదీర్ఘకాలం నడపాలనుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ.. వేరే వాళ్ల కోసం నడుపుతున్నాడు" అని అమర్నాథ్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 2011లో పార్టీ స్థాపించారని, 2019లో అధికారంలోకి వచ్చారని పార్టీ పెట్టిన తర్వాత ఎనిమిదేళ్లపాటు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని, పోరాటాలు సాగించి ప్రజా బలంతో అధికారంలోకి వచ్చారని అన్నారు. అదే పవన్ కళ్యాణ్ కు పార్టీని నడిపే శక్తి, తపన లేదని కాపులందరినీ తీసుకువెళ్లి తాకట్టు పెట్టాలనుకుంటున్నాడని అందుకు తాము సిద్ధంగా లేమని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
 సినిమాలలో అంతో ఇంతో సంపాదించిన పవన్ కళ్యాణ్ కాపులకు ఏంచేశారని ఆయన ప్రశ్నించారు. అటువంటి అప్పుడు కాపులు ఆయనకు ఎందుకు ఓటేయాలని అమర్నాథ్ ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేయలేని పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో? అని  ప్రశ్నించారు.

 ఈ అంశాలపై చర్చ జరగాలని కాపులంతా రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలను నిశితంగా పరిశీలించాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని తమ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తున్నది అమర్నాథ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడి సీనియర్ నేతలను కలుస్తున్న విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు అమర్నాథ్ సమాధానం చెబుతూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు.. దీనిని రాజకీయ అలజడి కింద చూడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదని, నోటా కి వచ్చే ఓట్లు కన్నా తక్కువే వస్తాయి అని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి ట్రెండ్.. 2024 లో కూడా కొనసాగుతుందని అమర్నాథ్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

Pendurthi

2023-02-04 10:29:01

ఉగాదినాటికి జగనన్న కాలనీల్లో గృహప్రవేశాలు జరగాలి

ఉగాది నాటికి జగనన్న కాలనీలో గృనిర్మానాలు పూర్తి చేసుకోవాలని మాకవరపాలెం ఎంపీడీవో అరుణశ్రీ లబ్ధిదారులకు సూచించారు. శనివారం మాకవరపాలెం తామరం, గిడుతూరు గ్రామాల్లో జరుగుతున్న జగనన్న కాలనీలో ఇల్లు నిర్మాణాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకొని కొత్త కాలనీల్లో గృప్రవేశాలు చేయాలన్నారు. ఆయా కాలనీల్లో మౌళిక సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ జేఈ రామలింగస్వామి, విద్యుత్ శాఖ జేఈ బాలకృష్ణ, గ్రామసచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు బాలకృష్ణ పాల్గొన్నారు.

Makavarapalem

2023-02-04 07:23:13

ఎస్టీలోకి బోయ, బెంతుల చేర్పులను అడ్డుకుంటాం

ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక జనాభా కలిగిన బోయా, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వంటి కుతంత్రాలు ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని జనసేన అరకు పార్లమెంటు ఇన్చార్చి వంపూరు గంగులయ్య హెచ్చరించారు. శనివారం అల్లూరి జిల్లా పాడేరు జనసేనపార్టీ కార్యాలయంలో జి.ముంచంగిపుట్టు, పంచాయితీ కావురాయి,లింగపుట్టు గ్రామాల యువతతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనులకు ద్రోహంచేసే ఎలాంటి చర్యలనైనా జనసేన అడ్డుకుంటుందన్నారు. గిరిజన వ్యతిరేక చర్యలను మానుకోవాలని లేదంటే యావత్ గిరిజన జాతి దృష్టిలో జాతి ద్రోహులుగా మిగిలి పోతారన్నారు. తాత్కాలిక అవసరాలకోసం జాతి మనుగడ దెబ్బతీసే వైఎస్సార్సీపీ ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామన్నారు.

 అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగంపై కూడా గిరిజన యువతకు గంగులయ్య వివరించారు. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజరవాన వ్యవస్థ,ప్రజారోగ్యవ్యవస్తా,విద్యాశాఖ హాస్టల్ వసతి నిర్వహణ వ్యవస్థ,ఉపాధి కల్పన వ్యవస్థ ఇలా అనేక రంగాల్లో మనం వెనక బాటుకు గురౌతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారతను బలంగా కోరుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, జనసేపార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. ఏజెన్సీలో అభివృద్ధిం అంటే ఏమిటో చేసి చూపిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో పాడేరు మండలఅధ్యక్షులు నందోలి మురళి కృష్ణ,సీదారి సన్నిబాబు,సాలేబు అశోక్ కొర్ర రాంబాబు,మాదేలి నాగేశ్వరరావు,వంతల ఈశ్వర్ నాయుడు,సోమరాజు జి.మాడుగుల  నాయకులు మసాడి సింహాచలం,తల్లే త్రీమూర్తులు,టీవీ రమణ ,చందు తదితర జనసైనికులు పాల్గొన్నారు.

పాడేరు

2023-02-04 02:56:54

పిల్ల‌ల‌కు నాణ్య‌మైన ఆహారాన్ని అందించాలి

అంగ‌న్ వాడీ కేంద్రాల‌ ద్వారా, పాఠ‌శాల‌ల్లో అమ‌లు చేస్తున్న మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం ద్వారా పిల్ల‌ల‌కు నాణ్య‌మైన ఆహారాన్ని అందించాల‌ని రాష్ట్ర ఆహార క‌మిష‌న్ స‌భ్యుడు బి. కాంతారావు సంబంధిత అధికారుల‌ను, సిబ్బందిని ఆదేశించారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం ఎస్‌.కోట‌లో ప‌ర్య‌టించారు. అంగ‌న్ వాడీ కేంద్రాలు, ఎం.ఎల్‌.ఎస్‌. పాయింట్లు, పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించారు. ఆహార సంబంధిత ప‌థ‌కాల అమ‌లు తీరును ప‌ర్య‌వేక్షించారు. దీనిలో భాగంగా స్థానిక అంగ‌న్ వాడీ కేంద్రాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అక్క‌డ హాజ‌రు ప‌ట్టిక‌లో దిద్దుబాట్లు ఉండ‌టంపై ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. ఇలాంటి చ‌ర్య‌లు పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని ఆదేశించారు. 

పాఠ‌శాల‌ల్లో పిల్ల‌ల కోసం అందుబాటులో ఉన్న‌ మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. ఎం.ఎల్‌.ఎస్‌. పాయింట్ల ద్వారా ఎండీయూ వాహ‌నాల‌కు అందిస్తున్న రేష‌న్ స‌ర‌కుల వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్లో న‌మోదు చేయాల‌ని చెప్పారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఎస్‌. కోట‌లోని జిల్లా ప‌రిష‌త్ గ‌ర్ల్స్ హైస్కూల్ విద్యార్థుల‌తో కాసేపు మాట్లాడారు. విద్యాభ్యాసం, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లు త‌దిత‌ర అంశాల‌పై అడిగి తెలుసుకున్నారు. ఆయ‌న వెంట ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్ కావ్యారెడ్డి, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు ఉన్నారు.

S.Kota

2023-02-03 13:30:30