1 ENS Live Breaking News

ప్ర‌జా విన‌తులపై స‌త్వ‌రం స్పందించాలి..

గ్రామ వార్డు స‌చివాల‌యాల ద్వారా ప్ర‌జా సమ‌స్య‌ల ప‌రిష్కారం మ‌రింత వేగ‌వంతంగా జ‌ర‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి స‌చివాల‌య సిబ్బందిని ఆదేశించారు. ప్ర‌జ‌లు వివిధ సేవ‌ల‌కోసం అందించే విన‌తుల‌ను స‌చివాల‌య సిబ్బంది త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. డెంకాడ మండ‌లం మోద‌వ‌ల‌స గ్రామ స‌చివాల‌యాన్ని క‌లెక్ట‌ర్ గురువారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామ స‌చివాల‌య సిబ్బంది హాజ‌రు, ప్ర‌జ‌ల నుంచి ప‌లు సేవ‌ల నిమిత్తం, ప‌లు సంక్షేమ ప‌థ‌కాల మంజూరు కోరుతూ వ‌చ్చిన విన‌తుల ప‌రిష్కారం, సంక్షేమ ప‌థ‌కాల కోసం దర‌ఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల‌కు ఆయా ప‌థ‌కాలు ఏవిధంగా ఎంత కాలంలో అందిస్తున్నార‌నే అంశాల‌పై క‌లెక్ట‌ర్ స‌చివాల‌య సిబ్బందితో స‌మీక్షించారు. స‌చివాల‌య సిబ్బంది ఎవ‌రు ఏయే విధులు నిర్వ‌హిస్తున్న‌దీ అడిగి తెలుసుకున్నారు. స‌చివాల‌యంలోని రిజిష్ట‌ర్ల‌ను, వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి అర్హ‌త‌లు తెలిపే చిత్ర‌ప‌టాల‌ను ప‌రిశీలించారు. గ్రామంలో కోవిడ్‌ వ్యాక్సినేష‌న్ ప‌రిస్థితిపై ఆరా తీశారు. అర్హులై వుండి టీకాలు వేయించుకోని వారు ఎవ‌రైనా వున్నారా అని తెలుసుకున్నారు. అర్హులైన ప్ర‌తి  ఒక్క‌రికీ వ్యాక్సిన్ వేయించాల‌ని ఆదేశించారు.

మోదవలస

2021-10-14 08:26:28

అమ్మ‌వారి పండుగ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జెసి కిశోర్‌..

విజయనగరం శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వానికి జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు, జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్, గురువారం ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించారు. ఆయ‌న ముందుగా హుకుంపేట వెళ్లి, ఆల‌య ప్ర‌ధాన‌ పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు ఇంటివ‌ద్ద త‌యార‌వుతున్న అమ్మ‌వారి సిరిమాను, ఇరుసుమాను, ర‌థాల‌ను ప‌రిశీలించారు.  వెంక‌ట‌రావుతో చ‌ర్చించారు. ప‌నుల‌ను స‌కాలంలో పూర్తిచేయించాల‌ని కోరారు. అనంత‌రం పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య ప‌రిస‌ర‌ ప్రాంతాల‌ను,  సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి జెసి కిశోర్‌ సంద‌ర్శించారు. భ‌క్తుల‌కోసం ఏర్పాటు చేసిన‌ క్యూలైన్ల‌ను ప‌రిశీలించారు.  ఆల‌యం ఎదురుగా ఏర్పాటు చేస్తున్న కంట్రోల్ రూమును, విఐపి లాంజ్‌ను త‌నిఖీ చేశారు. అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.   ఈ ప‌ర్య‌ట‌న‌లో జెసి కిశోర్‌తోపాటు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర‌రావు, ఆల‌య అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-14 08:12:27

ఆర్అండ్ఆర్‌ కాల‌నీలో అన్ని స‌దుపాయాలు..

నిర్వాసితుల‌కోసం నిర్మించ‌నున్న కాల‌నీల్లో అన్ని మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ నున్నట్టు జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ అన్నారు. భోగాపురం అంత‌ ర్జాతీయ‌ విమానాశ్ర‌య నిర్వాసితుల‌కోసం, గూడెపువ‌ల‌స వ‌ద్ద ప్ర‌తిపాదించిన ఆర్అం డ్ఆర్ కాల‌నీలో ఇళ్ల‌ నిర్మాణానికి  శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం మొద‌ల‌య్యింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా, బొల్లింక‌ల‌పాలెం గ్రామానికి చెందిన ఇళ్లు కోల్పోయిన 55 మంది నిర్వాసితులు, గురువారం ఇక్క‌డ భూమిపూజ చేశారు.  నిర్వాసితులకు ఇంటి నిర్మాణానికి, ఒక్కొక్క‌రికీ 5 సెంట్లు చొప్పున స్థ‌లాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ, నిర్వాసితులకు ఇంటి నిర్మాణానికి, ఆర్అండ్ఆర్ కాల‌నీల్లో స్థలాలు కేటాయించడం జరిగిందని చెప్పారు. లబ్ధిదారుల స్వయంగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. ఒక్కొక్క ఇంటికి రూ. 9 లక్షల 20 వేలను, ఆర్ఆర్ ప్యాకేజీ కింద  కేటాయించడం జరుగుతుందని చెప్పారు. కాల‌నీలో రోడ్లు, కాలువలు, విద్యుత్, త్రాగునీరు త‌దిత‌ర అన్నిర‌కాల మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డం జరుగుతుంద‌ని జెసి చెప్పారు. ఆర్డిఓ బిహెచ్‌. భవాని శంకర్ మాట్లాడుతూ, లబ్ధిదారులకు నిధులను, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు.  లబ్ధిదారులు దళారులను నమ్మి మోస‌పోవ‌ద్ద‌ని సూచించారు. లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా, నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంత‌రం పోలిప‌ల్లి ఆర్అండ్ఆర్ లేఅవుట్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో తాశీల్దార్‌ రమణమ్మ, వైయస్సార్ పార్టీ మండల కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, గూడెపు వలస సర్పంచ్ అయ్యప్ప రామకృష్ణా రెడ్డి, ఎయిర్ పోర్ట్ అథారిటీ   భూసేక‌ర‌ణ స‌మ‌న్వ‌యాధికారి జి.అప్పలనాయుడు, ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Bhogapuram

2021-10-14 06:29:30

వీడియోజర్నలిస్టుల సంక్షేమానికి రూ.50వేలు విరాళం..

మహా విశాఖ నగరంలోని వైజాగ్ వీడియో జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు బుధవారం రూ.50వేలు విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు సూర్య, కార్యవర్గ సభ్యులుకి అందచేసారు.ఈ సందర్భంగా శ్రీనుబాబు  మాట్లాడుతూ, గతఏడాది స్మార్ట్ సిటీ  వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ కి 50 వేలు అందజేశామని, ఈఏడాది విశాఖ వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్  అసోసియేషన్ కి 50000 అందజేస్తామన్నారు. విడియో జర్నలిస్ట్స్ సభ్యులు సంక్షేమానికి ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తనవంతు సాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. విడియో జర్నలిస్ట్ లు సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే ప్రభుత్వంలోని పెద్దలను కలవనున్నట్టు శీనుబాబు చెప్పారు.

Visakhapatnam

2021-10-13 16:24:16

కాకినాడ మేయర్ ను తొలగిస్తూ ఏపీ గెజిట్ విడుదల..

తూర్పుగోదారి జిల్లాలోని ప్రతిష్టాత్మక కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ సుంకర పావనిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమెను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు ఏపీ గెజిట్ రూపంలో జారీ చేయడం చర్చనీయాంశం అవుతుంది. వాస్తవానికి ఈ విషయం ఏపీ హైకోర్టు పరిధిలో వుంది. 22వ తేదీ వరకూ కోర్టు గడువు కూడా ఉంది అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం సుంకర పావనీని తప్పిస్తూ గెజిట్ నువిడుద చేయడం విశేషం.  కాగా ఓటింగ్కు ముందే మేయర్ సుంకర పావని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు అవిశ్వాస తీర్మానంపై జరిగే సమావేశానికి అభ్యంతరాలు చెప్పలేదు. అయితే ఫలితాన్ని మాత్రం తుది తీర్పునకు లోబడి ఉండాలని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 22 వ తేదీకి వాయిదా వేసింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తనను మేయర్ పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై సుంకర పావని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పునకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపిస్తున్నారు. 22 వ తేదీన కోర్టు తీర్పు వెలువరించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు హైకోర్టు తీర్పును ధిక్కరించేందిగా ఉందంటూ పావని విమరిస్తున్నారు.దీంతో సుంకర పావని పదవీచ్యుతులు అయ్యారు. కాకినాడ నగర పాలక సంస్థకు 2017 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యతను సాధించి పాలక మండలని ఏర్పాటు చేసింది. అయితే 23 మంది కార్పొరేటర్లు మేయర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అవిశ్వాస తీర్మానంనకు ప్రతిపాదించి జిల్లా కలెక్టర్ హరికిరణ్ వినతి పత్రాన్ని అందించారు. ఈ అక్టోబర్ నెల 5 వ తేదీన జరిగిన ప్రత్యేక సమావేశంలో మేయర్ పావని, డిప్యూటీ మేయర్ సత్తిబాబులపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. పాలక మండలిలో ప్రస్తుతం మొత్తం 44 మంది కార్పొరేటర్లు ఉండగా వారిలో నుంచి మేయర్, డిప్యూటీ మేయర్లకు వ్యతిరేకంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటేశారు. దీంతో వారిద్దరిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ‌ప్ర‌భుత్వం కాకినాడ మేయ‌ర్‌ను తొల‌గిస్తూ గెజిట్‌ను విడుద‌ల చేసింది. దీనిపై మండిప‌డ్డ పావ‌ని, కేసు కోర్టు ప‌రిధిలో ఉండ‌గా రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఉన్న‌ప‌ళంగా మేయ‌ర్ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం కోర్టు ధిక్క‌ర‌ణ అవుతుంద‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం రాజ‌ప‌త్రం ద్వారా మేయ‌ర్ ప‌ద‌వినుంచి తొల‌గించిన‌ప్ప‌టికీ తాను మేయ‌ర్  హోదాలోనే కొన‌సాగుతాన‌ని పావని  చెబుతుండటం విశేషం..

Kakinada

2021-10-13 16:01:00

కనకదుర్గమ్మకు అన్నవరం పట్టువస్త్రాలు..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి అన్నవరం దేవస్థానం అధికారులు బుధవారం పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈఓ  వి.త్రినాధరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అమ్మవారి ఆలయానికి వెళ్లి వస్త్రాలు సమర్పించి వచ్చారు. ప్రతీఏటా నవరాత్రి సమయంలో జరిగే ఉత్సవాలకు దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితాగా వస్తుందని ఈఓ తెలియజేశారు. అమ్మవారికి వస్త్రాలు సమర్పించి రాష్ట్రం శుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు ఈఓ తెలియజేశారు.

Annavaram

2021-10-13 15:51:33

పేదల జీవన ప్రమాణాలు మెరుగు పడాలి..

పేద కుటుంబాల్లో పేదరికం రూపుమాపాలని ముఖ్య మంత్రి ధ్యేయమని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని పొందూరులో వైయస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన సభ స్పీకర్ తమ్మినేని పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డ్వాక్రా మహిళలకు నమూనా చెక్కులను స్పీకర్ అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ వైయస్సార్ ఆసరా రెండో విడతలో భాగంగా పొందూరు మండలంలోని 1319 సంఘాలకు 9 కోట్ల 54 లక్షల రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది గా ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. పేదరికం పోయి జీవన ప్రమాణాలు మెరుగు పడాలన్నారు. అవినీతి లేని పాలన అందించి పేదరికాన్ని పారద్రోలుతానని ప్రమాణ స్వీకారం రోజే చెప్పారని ఆయన తెలిపారు. రైతులకు వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించారని, రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చి రుణమాఫీ చేశారని అదేవిధంగా  ఉచిత విద్యుత్తును అమలుపరిచారని గుర్తుచేశారు. సుదీర్ఘ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి నెరవేర్చుతూ ముఖ్య మంత్రి మంచి పాలన అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ముందు నిలబడి హామీ ఇచ్చామంటే అది ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ కన్నా గొప్పది అని ఆయన అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పిల్లలకు మంచి విద్యని అందించాలని దానికి కావాల్సిన మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారని వివరించారు. పేదవానికి ఇళ్ళు ఇవ్వాలని ముఖ్య మంత్రి ఆశించారని, అయితే వివిధ కారణాల వలన జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. మహిళలు, రైతులు ఆర్థికంగా బలపడాలని వ్యాపారవేత్తగా తయారవ్వాలని ఆయన ఆకాంక్షించారు. 
 ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి బి.శాంతిశ్రీ, తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపీపీ కిల్లి ఉషారాణి, వైస్ ఎంపీపీ వండన శ్రీదేవి, జెడ్పీటీసీ లోలుగు కాంతారావు, కొంచాడ రమణ మూర్తి,  గాడు నాగరాజు, పొందూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ రేగిడి లక్ష్మి , మార్కెట్ కమిటీ చైర్మన్ బడాణ సునీలు, లోలుగు శ్రీరాముల నాయుడు, గంట్యాడ రమేష్,  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-13 15:19:14

గౌతు లచ్చన్న పై తపాలా కవర్ విడుదల..

స్వాతంత్య్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న పై తపాలా కవర్ విడుదల చేశారు. శ్రీకాకుళంలో బాపూజీ కలామందిర్ లో తపాలా శాఖ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సయుక్తంగా తపాలా కవర్ విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్  తపాలా కవర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ లచ్చన్న మహోన్నత వ్యక్తి అన్నారు. కొన్ని పరిస్థితుల రీత్యా కొంత మందికి అనుకున్న పేరు ప్రఖ్యాతులు రాకపోవచ్చు అన్నారు. లచ్చన్న గురుతుల్యులు, త్యాగ శీలి అన్నారు. రంగాను శ్రీకాకుళం జిల్లా నుండి పోటీ చేయించుట తన పదవిని త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉందని ఆయన వివరించారు. పోస్టల్ స్టాంప్ విడుదల వలన దేశ విదేశాల్లో గౌరవం లభిస్తుందని తద్వారా జిల్లా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని పేర్కొన్నారు. లచ్చన్న పూర్తిగా ప్రజా జీవితంలో ఉన్నారని, లచ్చన్నకు సర్దార్ బిరుదు రావడం జిల్లాకు గౌరవం దక్కిందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి లచ్చన్న అన్నారు. ప్రజా జీవితంలో కుంచితత్వంతో ఉండరాదని సూచించారు. లచ్చన్న చిన్న రాజకీయ నాయకులు కాదని కృష్ణ దాస్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లచ్చన్న విగ్రహాలు ఎక్కువగా ఉండడం ఆయన సేవల విలువ తెలుస్తోందని చెప్పారు. లచ్చన్న పోరాట యోధుడు, ఆదర్శవంతమైన నాయకుడు అన్నారు.

పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎర్రన్నాయుడు లచ్చన్నను ఆదర్శంగా తీసుకున్నారు. మన చరిత్ర, సంస్కృతిని, సాంప్రదాయాలను తెలుసుకునే అవకాశం అజాది కా అమృత్ మహోత్సవం పెట్టడం జరిగిందన్నారు. యువత అవగాహనకు ఇది దోహదం చేస్తుందన్నారు. లచ్చన్న విలువలు అపారమని, యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన యోధుడు అని పేర్కొన్నారు. చరిత్రను గుర్తిస్తే అది మనలను రక్షిస్తుందని ఆయన చెప్పారు. రైతుల కోసం మహాపోరాటం చేశారని ఆయన తెలిపారు. శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ చరిత్రలో కనుమరుగైన నాయకులను వెలుగులోకి తీసుకురావడానికి ప్రధాన మంత్రి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. బడుగు వర్గాలు, అక్షరాస్యత తదితర అంశాలపై పోరాడి వ్యక్తి లచ్చన్న అన్నారు. పోస్ట్ మాస్టర్ జనరల్ డా.ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అజాది కా అమృత్ మహోత్సవం, స్టాంపుల సేకరణలో భాగంగా తపాలా కవర్ విడుదల చేస్తున్నామన్నారు. స్వాతంత్ర యోధుల చరిత్రను భావితరాలకు తెలియజేయుటకు ఎంతో ఉయోగపడుతుందని చెప్పారు. రవి అస్తమించని బ్రిటీష్ దేశాన్ని స్వాతంత్ర సమర యోధులు గడ గడలాడించారని ఆయన పేర్కొన్నారు. బడుగు వర్గాల కోసం గౌతు లచ్చన్న ఎంతో పాటుపడ్డారని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రలో గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలకు, వారసత్వానికి నిలయమని ఆయన వివరించారు. శ్రీముఖలింగం, శ్రీకూర్మం, తెలినీలాపురం వంటి చారిత్రక ప్రసిద్ధి పొందిన ప్రదేశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

పోస్టల్ సూపరింటెండెంట్ కె.కాంతారావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుని తపాలా కవర్ విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. లచ్చన్న కార్యదక్షతకు వచ్చిన బిరుదు సర్దార్ అని చెప్పారు. పోస్టల్ స్టాంప్ దేశ విదేశాలకు వెళుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, శాసన సభ్యులు కింజరాపు అచ్చన్నాయుడు, డా.బెందాళం అశోక్, మాజీ శాసన సభాపతి కే.ప్రతిభా భారతి, గౌతు లచ్చన్న కుమారులు గౌతు శ్యామ సుందర శివాజీ, మాజీ శాసన సభ్యులు కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీ దేవి, కూన రవి కుమార్, గ్రంధాలయ మాజీ అధ్యక్షులు పిరికట్ల విఠల్, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు చౌదరి బాబ్జీ, పి.శివ నాగేశ్వర రావు, గౌతు లచ్చన్న కుటుంబ సభ్యులు, పోస్టల్ సూపరింటెండెంట్ జనపాల ప్రసాద్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-13 09:20:25

తిరుమలలో టిటిడి ఈవో విస్తృత తనిఖీలు..

టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి బుధ‌వారం ఉద‌యం అధికారుల‌తో క‌లిసి తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా లేపాక్షి స‌ర్కిల్ వ‌ద్ద గ‌ల ఫిల్ట‌ర్ హౌస్‌ను ప‌రిశీలించారు. తిరుమ‌ల‌లోని వివిధ డ్యాంల నుండి వ‌చ్చే నీటిని ఏవిధంగా శుద్ధి చేస్తున్నారు, పంపింగ్ సిస్ట‌మ్ గురించి అధికారులు ఈవోకు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌తి గంట‌కోసారి శుద్ధి చేసిన నీటిని ప్రయోగశాలలో ప‌రీక్షించి స‌ర‌ఫ‌రా చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఫిల్ట‌ర్ హౌస్ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని, నిరుప‌యోగంగా ఉన్న ఇంజినీరింగ్ ప‌రిక‌రాల‌ను తొల‌గించి ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించాల‌న్నారు. అనంత‌రం ఎఎన్‌సి, బాలాజి బ‌స్టాండ్‌, ఎస్ఎమ్‌సి ప్రాంతాల్లోని రోడ్లు, కాటేజిల వ‌ద్ద పారిశుద్ధ్య ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఎస్ఎమ్ సి, లేపాక్షి స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న స‌బ్ వేల‌ను, ముల్ల‌గుంట, శంఖుమిట్ట విశ్రాంతి భ‌వ‌న‌ము వ‌ద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతాల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.  అదేవిధంగా భ‌క్తుల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉండేలా, ట్రాఫిక్ స‌మ‌స్య‌లు లేకుండా రోడ్ల‌ను అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. ముల్ల‌గుంట కారు పార్కింగ్ ప్రాంత‌లో ఉన్న బ్యారికేడ్లు, కాంక్రీట్ వ్య‌ర్థాల‌ను తొల‌గించాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. శంఖుమిట్ట, శేషాద్రి న‌గ‌ర్, ఎఎమ్‌సి ప్రాంతాల్లో భ‌క్తులు న‌డ‌వ‌డానికి వీలుగా కాళీగా ఉన్న ప్రాంతాల్లో టైల్స్ ఏర్పాటు చేయాల‌న్నారు. శంఖుమిట్ట నామాల పార్కు క్రింద ఉన్న ఖాళీ ప్రాంతంలో ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించి మ‌రింత అహ్లాద‌క‌రంగా తీర్చిదిద్ధాల‌ని డిఎప్‌వో  శ్రీ‌నివాసులు రెడ్డిని ఆదేశించారు. తిరుమ‌ల‌లో వివిధ ప్రాంతాల్లో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులు, అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ల‌ను ఇంజినీరింగ్ అధికారులు ఈవోకు వివ‌రించారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో  గోపినాధ్ జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌  నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, విజివో  బాలిరెడ్డి, డెప్యూటీ ఈవోలు  భాస్క‌ర్‌,  లోక‌నాధం, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీ‌దేవి, ఇఇ  శ్రీ‌హ‌ర్ష‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-13 06:39:14

అక్రిడేటెడ్ జర్నలిస్టులందరూ హెల్త్ స్కీమ్ లో నమోదుకావాలి..

విశాఖజిల్లాలో అక్రిడిటేషన్ పొందిన విలేఖరులు అందరూ హెల్త్ స్కీమ్ లో చేరాలని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లికార్జున పిలుపునిచ్చారు.  మంగళవారం తన ఛాంబర్లో జరిగిన జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్రిడేషన్ పొందిన ప్రతి ఒక్క జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ప్రీమియం చెల్లించి కార్డు పొందవలసిందిగా వారికి అవగాహన కలిగించాలని సమాచార శాఖ డిడి వి. మణి రామ్ ను  ఆదేశించారు. సమావేశంలో మరో 223 మంది పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అక్రిడేషన్ లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.  వీరిలో వివిధ దిన పత్రికల కు చెందిన 135 మంది ఎలక్ట్రానిక్ మీడియా 52 మంది వెటరన్ జర్నలిస్టులు 15 మంది ఫ్రీలాన్స్ జర్నలిస్టులు 12 మందికి అక్రిడేషన్ లో మంజూరు చేయగా, జీఎస్టీ లేని దిన పత్రికలు వార మాస పత్రికలు వారికి తొమ్మిది తాత్కాలిక అక్రిడేషన్ లు మంజూరు చేయడం జరిగిందన్నారు.  ఈ సమావేశంలో సమాచార శాఖ ఉపసంచాలకులు వి మణిరామ్, ఏసిటిఓ శ్వేత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎల్లాజీ రావు గృహ నిర్మాణ శాఖ ఏఈ జోగారావు డివిజినల్ పిఆర్ఓ సాయిబాబా ఏపీఆర్వో రాములు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-12 16:10:07

భారతీయ యోగాను విశ్వవ్యాప్తం చేయాలి..

భారతీయ యోగ విద్యను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. మంగళవారం ఏయూ పాలక మండి సమావేశ మందిరంలో ఏయూతో అష్టాంగ న్యూరో థెరఫి, ఆయుర్వేద అండ్‌ యోగా(ఏఎన్‌ఏవై) సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఏఎన్‌ఏవై నిర్వాహకులు చలసాని జుగేష్‌ చంద్ర గురునాథ్‌లు సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా ఏయూ సౌజన్యంతో ఏఎన్‌ఏవై సంస్థ ఆరు నెలల కాల వ్యవధితో డిప్లమో ఇన్‌ యోగా, యోగా సర్టిఫీకేట్‌ కోర్సులను నిర్వహించనున్నారు. ఒక్కో కోర్సులో 80 మందికి ప్రవేశం కల్పించనున్నారు. కోర్సుల నిర్వహణకు అవసరమైన సిలబస్‌, కోర్సు నిర్వహణను ఏయూ పర్యవేక్షిస్తుంది. యోగా విద్య, శిక్షణ, పరిశోధన రంగాలలో ఏయూతో ఏఎన్‌ఏవై సంస్థ పనిచేస్తుంది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించే దిశగా వర్సిటీ నిరంతరం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, యోగా కేంద్రం సంచాలకులు ఆచార్య ఓ.ఎస్‌.ఆర్‌యు భానుకుమార్‌, విభాగాధిపతి ఆచార్య కె.రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-12 15:37:18

జీవిఎంసీకి 672 చెత్త వాహనాలకు కేటాయింపు..

రాష్ట్ర ప్రభుత్వం మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కి కేటాయించిన చెత్తను తరలించే వాహనాలు జివిఎంసి పరిధిలోని వార్డులకు కేటాయింపు జరిగిందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. మంగళవారం బీచ్ రోడ్డులో డాక్టర్  వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన తో కలసి చెత్తను తరలించే కొత్త వాహనాలకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పధకంలో భాగంగా 672 చెత్త తరలించే వాహనాలు నగరానికి కేటాయించారని తెలిపారు. అందులో భాగంగా మొదటి విడతగా జివిఎంసికి 292 వాహనాలు వచ్చాయని, మిగిలిన వాహనాలు త్వరలోనే వస్తాయని తెలిపారు. వీటిని అన్ని వార్డులకు కేటాయించడం జరిగిందని, నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా చెత్తను ఎప్పటికప్పుడు డంపింగు యార్డుకు తరలించి విశాఖ నగరాన్ని స్వచ్ఛతా నగరంగా తీర్చిదిద్దుతామని, ఎప్పటికప్పుడు చెత్తను తరలించుతవలన ప్రజలను ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దగలమని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసన సభ్యులు ఆదీప్ రాజ్, అనకాపల్లి శాసన సభ్యులు జి. అమర్ నాద్, వై.సి.పి. నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె. రాజు, విఎంఆర్డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, డిప్యుటీ మేయర్లు జియ్యని శ్రీధర్, కె. సతీష్, కార్పొరేటర్లు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, జోనల్ కమిషనర్లు బి. రాము, శివ ప్రసాద్, బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, ఎఎంఒహెచ్ లు డాక్టరు రమణ మూర్తి, డాక్టరు కిషోర్, తదితర రాజకీయ నాయకులు మరియు జివిఎంసి అధికారులు  పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-10-12 14:04:07

ఈ క్రాప్, ఈకేవైసీ సత్వరమే పూర్తిచేయాలి..

ప్ర‌స్తుత ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించి రైతు భ‌రోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు) ప్ర‌ధాన ధాన్యం సేక‌ర‌ణ కేంద్రాలుగా కూడా సేవలందించ‌నున్న‌నేప‌థ్యంలో మొత్తం ప్ర‌క్రియ‌పై క్షేత్ర‌స్థాయి అధికారులు అవగాహ‌న పెంపొందించుకోవాల‌ని జాయింట్ కలెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జ.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్ నుంచి జేసీ (ఆర్‌) జి.ల‌క్ష్మీశ‌.. జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్ విధానంలో జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల‌స్థాయి అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు పురోగ‌తిపై చ‌ర్చించ‌డంతో పాటు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌కు మార్గ‌నిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌తలో భాగంగా ఈ-క్రాప్ బుకింగ్ వెరిఫికేష‌న్‌, ఈ-కేవైసీ ప్ర‌క్రియను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌ని ఆదేశించారు. కేవ‌లం ధాన్యం కొనుగోలుకే కాకుండా వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న వివిధ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌కు కూడా ఈ-క్రాప్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు. భూ రికార్డుల స్వ‌చ్ఛీక‌ర‌ణకు సంబంధించి జ‌రుగుతున్న ప‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నాణ్య‌తా త‌నిఖీలు చేయాల‌ని ఆదేశించారు. డ్రోన్ స‌ర్వేకు స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాల‌ను పూర్తిచేయాల‌న్నారు. ద‌శ‌ల వారీగా జిల్లా మొత్తం స‌మ‌గ్ర భూ స‌ర్వే జ‌ర‌గ‌నున్నందున అందుకు అధికారులు స‌న్న‌ద్ధంగా ఉండాల‌న్నారు. ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక స్పంద‌న ద్వారా అందుతున్న అర్జీల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని జేసీ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌.. సీజ‌న‌ల్ వ్యాధుల నియంత్ర‌ణ‌  గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో అమ‌ల‌వుతున్న పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలుపై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అదే విధంగా స‌చివాల‌యాల సిబ్బంది బ‌యోమెట్రిక్ హాజ‌రుపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని ఆదేశించారు. మండల స్థాయిలో జరుగుతున్న ఆసరా కార్యక్రమాలు విజయవంతం చేయడంతోపాటు చేయూత, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు కార్య‌క్ర‌మానికి సంబంధించి క్ల‌స్ట‌ర్ మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని భార్గ‌వ్‌తేజ ఆదేశించారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, పంచాయ‌తీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాస్‌, వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ జీ.వీరేశ్వరప్రసాద్, ఐసీడీఎస్ పీడీ జీవీ సత్యవాణి, డీఎస్వో పి. ప్రసాదరావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-10-12 14:00:14

అక్రమ మద్యం నిర్మూళన పటిష్టంగా జరగాలి..

తూర్పుగోదావరిజిల్లాలో అక్రమ మద్యం నిర్మూలనకు పోలీస్, అటవీ, ఎక్సైజ్, ఎస్ఈబీ శాఖల అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి జేసీ లక్ష్మీ శ.. పోలీస్, అటవీ, ఎక్సైజ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి తదితర శాఖల అధికారులతో అక్రమ మద్యం తయారీ, అమ్మకాలు తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ  మాట్లాడుతూ అక్రమ మద్యం, నాటు సారా తయారీ, అమ్మకాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలు ద్వారా క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకు ఎక్సైజ్, అటవీ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ ఆదేశించారు. అక్రమ మద్యం, నాటు సారా తయారీ వంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదుచేయాలన్నారు. అటవీ, సముద్ర తీర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని జేసీ లక్ష్మీశ అధికారులకు సూచించారు. ఈ వీసీలో కాకినాడ అడిషనల్ ఎస్పీ కె.కుమార్, డీఫ్ వో ఐకెవి రాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ ఎస్.లక్ష్మీకాంత్, డీఆర్డీఎ పీడీ కె.శ్రీరమణి సీపీవో పి.త్రినాథ్, ఇతర అధికారులు హాజరయ్యారు.

Kakinada

2021-10-12 13:55:25