1 ENS Live Breaking News

తిరుమలలో ఆగస్టు 30న గోకులాష్టమి..

తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 30వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం  నిర్వహించనున్నారు.   శ్రీవారి ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు.  అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. అదేవిధంగా ఆగస్టు 31న తిరుమలలో ఉట్లోత్సవాన్ని పుర‌స్క‌రించ‌కుని సాయంత్రం 4 నుండి 5 గంటల వర‌కు శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హిస్తారు. కాగా, ప్ర‌తి ఏడాది తిరుమ‌లలో ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ హార‌తులు స్వీక‌రిస్తారు. యువకులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ఉట్లోత్సవంలో పాల్గొంటారు. కానీ కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో ఈ ఏడాది ఏకాంతంగా టీటీడీ నిర్వ‌హించనుంది.ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 31న శ్రీవారి ఆలయంలో నిర్వహించే వ‌ర్చువ‌ల్ సేవ‌లైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Tirumala

2021-08-28 10:30:16

రహదాలే అభివ్రుద్ధికి కీలకం..బెల్లాన

ర‌హ‌దారులే  అభివృద్దికి కీల‌క‌మ‌ని, విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. రోడ్ల‌ను నిర్మించ‌డం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ది వేగ‌వంత‌మ‌వుతుంద‌ని చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి గ్రామ స‌డ‌క్ యోజ‌న ప‌థ‌కం క్రింద చేప‌ట్ట‌నున్న‌ గ్రామీణ ర‌హ‌దారుల నిర్మాణంపై, పంచాయితీరాజ్ ఇంజ‌నీరింగ్ అధికారుల‌కు అవ‌గాహ‌నా స‌ద‌స్సు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో శ‌నివారం జ‌రిగింది. స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు కావ‌స్తున్న నేప‌థ్యంలో, దేశంలో నిర్వ‌హిస్తున్న అజాదీ కా అమ్రిట్‌ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ సెమినార్‌ను ఏర్పాటు చేశారు.  ఈ సెమినార్‌ను ప్రారంభించిన ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల‌కు ర‌హ‌దారి సౌక‌ర్యం క‌ల్పించేందుకు పిఎంజిఎస్ వై ప‌థ‌కం చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. ఈ ప‌థ‌కానికి కేంద్ర ప్ర‌భుత్వం 60శాతం, రాష్ట్ర ప్ర‌భుత్వం 40శాతం నిధుల‌ను కేటాయించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇప్ప‌టికే రెండు ద‌శ‌లుగా చేప‌ట్టిన పిఎంజిఎస్‌వై ప‌థ‌కం క్రింద వేసిన సుమారు 865 కిలోమీట‌ర్ల రోడ్ల ద్వారా, మారుమాల ప్రాంతాల‌కు ర‌హ‌దారుల సౌక‌ర్యం క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌స్తుతం మూడో ద‌శ ప‌నులు ప్రారంభం కానున్నాయ‌ని, దీనికోస‌మే ఈ సెమినార్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.  ముఖ్యంగా గిరిజ‌న‌ ప్రాంతాల‌పై ఎక్కువ దృష్టి పెట్టాల‌ని సూచించారు. క‌నీసం వంద మంది నివాసం ఉంటున్న‌ గిరిశిఖ‌ర గ్రామాల‌కు కూడా ర‌హ‌దారి సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు కృషి చేయాల‌ని ఎంపి కోరారు.  

                సెమినార్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, పంచాయితీరాజ్ ఎస్ఇ పి.విజ‌య్‌కుమార్‌, ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ ఎంవిఎన్ వెంక‌ట‌రావు, పిఏ టు ఎస్ఇ చీక‌టి దివాక‌ర్, ప‌లువురు డిఇఇలు, ఎఇఇలు, ఇత‌ర ఇంజ‌నీరింగ్ అధికారులు పాల్గొన్నారు.  ఉత్త‌మ ఇంజ‌నీర్ల‌కు ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేశారు.

Vizianagaram

2021-08-28 08:47:17

Simhachalam

2021-08-28 02:42:35

30న సెలవు కారణంగా స్పందన వుండదు..

శ్రీ కృష్ణాష్టమి పండుగ పర్వదినం సందర్భంగా ఆగష్టు 30 న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా కలెక్టర్  ఏ. సూర్యకుమారి తెలిపారు. ఈ కారణంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో  స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సెలవు సందర్భంగా స్పందన వుండదనే  ఈ విషయాన్ని గుర్తించి ఆరోజు వినతులు ఇచ్చేందుకు కలెక్టర్ కార్యాలయానికి  ప్రజలు ఎవరూ రావొద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

Vizianagaram

2021-08-27 15:55:19

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి.

సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా పై వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, మలేరియా సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జి. సృజన  ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై జివిఎంసి ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేకాదికారులతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ , దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్ జరపాలని, ప్రతీ రోజు జోనల్ స్థాయిలో అధికారులు వార్డులలో సందర్శించి, ప్రతీ శుక్రవారం “డ్రై డే” పాటించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వంనూతనంగా ప్రవేశపెట్టిన “సిటిజన్ అవుట్ రీచ్” కార్యక్రమంను పెద్దఎత్తున ప్రచారం చేసి, అందులో అమలవుతున్న 543 సేవలు, ప్రభుత్వం చేపడుతున్న పధకాల గూర్చి ప్రజలకు వివరించాలని, అందుకొరకు అధికారులు ప్రచార కార్యక్రమాలు పర్యవేక్షించాలని ఆదేశించారు. శనివారం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ లో ఒక లక్ష వ్యాక్సినేషన్లు వేయించాలని, అందుకు జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేకాదికారులు, కార్యదర్శులు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి, లక్ష్యాన్ని పూర్తీ చేయాలని, వాలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి 18 సం. ల పైబడిన వారికందరికీ కోవేగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ కొరకు వ్యాక్సినేషన్ వేయు సెంటర్లకు తీసుకొచ్చి వేయించాలని ఆదేశించారు. 

Visakhapatnam

2021-08-27 15:30:04

ఆర్.బి.కె ల ద్వారా 32 శాతం విక్రయాలు..

శ్రీకాకుళం జిల్లాలోని 820 రైతు భరోసా  కేంద్రాల ద్వారా ఆ గ్రామ రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేశారు.జిల్లాలో ఇప్పటి వరకు 713 రైతు భరోసా కేంద్రాల ద్వారా 6,570 టన్నులు యూరియా, 2,341 టన్నుల డి.ఏ.పి, 54 టన్నులు పొటాష్ ను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లావ్యాప్తంగా విక్రయాలలో 30% ఎరువులు రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అందించవలసి ఉందని అన్నారు. కాని ఇప్పటివరకు జిల్లాలో 21,985 మెట్రిక్ టన్నులు గాను 8,971 మెట్రిక్ టన్నులు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేసి విక్రయాల్లో 32% లక్ష్యాలను సాదించడం జరిగిందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. కావున శుక్రవారం వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.

Srikakulam

2021-08-27 14:30:05

తపాలా పథకాలను వినియోగించుకోవాలి..

శ్రీకాకుళం తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాలని తపాలా శాఖ పర్యవేక్షకులు అద్దేపల్లి కాంతారావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఛాంబరులో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఐపిపిబి ( ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ) ద్వారా తపాలా శాఖ ఖాతాదారులు  ఏ బ్యాంకు ఖాతాలోని నగదునైనా తమ ఇంటివద్దనే సంబంధిత పోస్ట్ మేన్ ద్వారా నగదు పొందేలా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. అలాగే పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికేట్లను ప్రతీ ఏడాది ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని, వారి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను కూడా ఇంటివద్దనే పొందేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తపాలా శాఖ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు ఏడాదికి కేవలం రూ.12/-లు చెల్లించి పి.ఎం.ఎస్.బి.వై (ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన) ద్వారా రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని, ఏడాదికి రూ.330/-లు చెల్లించి రూ.2 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని కూడా పొందవచ్చన్నారు. సుకన్య సమృద్ధి ఖాతా ద్వారా 10ఏళ్ల లోపు ఆడపిల్లలకు అత్యధిక వడ్డీని (7.6 శాతం) చెల్లించడం జరుగుతుందన్నారు. గ్రామీణ తపాలా జీవిత బీమా ద్వారా 19 సం.ల నుండి 45 సం.ల వయస్సు గల గ్రామీణ ప్రజలు  బీమా చేసుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలకు సరైన అవగాహన లేక తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవడం లేదని, ఇప్పటికైనా వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

Srikakulam

2021-08-27 14:24:25

నాడు-నేడు పనులు సకాలంలో పూర్తికావాలి..

శ్రీకాకుళం జిల్లాలో  ఆస్పత్రులలో జరుగుతున్న నాడు నేడు పనులు సకాలంలో పూర్తిచే యాలని రాష్ట్ర ఆసుపత్రుల మౌళిక వసతుల కల్పన సంస్థ మేనేజింగ్ డైరక్టర్  కె.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నాడు నేడు పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, ఆంధ్ర వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో జరుగుతున్న నాడు నేడు పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన 2022 జనవరి నాటికిపనులన్నీ పూర్తికావాలని ఆదేశించారు. ఇప్పటికే 70 శాతానికి పైగా పనులు పూర్తిచేసుకున్న ఆసుపత్రిల్లో మిగిలిన పనులను త్వరిగతిన పూర్తిచేయాలని అన్నారు. పూర్తయిన ఆసుపత్రులకు  తగిన రంగులు, మౌళిక వసతులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే విధంగా ఆసుపత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు తీర్చిదిద్దాలని కోరారు. నిధుల కొరతతో పనులు అసంపూర్తిగా వదలివేయ రాదని చేసిన ప్రతి పనికి కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించడం జరుగుతుందని అన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి తమకు పంపాలని కోరారు. అర్బన్ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు రానున్న నవంబర్ నాటికి పూర్తికావడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన ఇదే స్ఫూర్తితో మిగిలిన చోట్ల పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు.ఆసుపత్రుల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇసుక , ఐరన్ కొరత లేకుండా చూసుకోవాలని తెలిపారు. పూర్తయిన ఆసుపత్రుల వద్ద ఖర్చు చేసిన నిధుల వివరాలతో పాటు ఆసుపత్రిలో లభించే సదుపాయాల బోర్డులను ఏర్పాటుచేయాలని సూచించారు. థర్డ్ వేవ్ వస్తే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన విధంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. 

కొన్ని ఆసుపత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నప్పటికి కనెక్షన్లు ఇవ్వలేదని, కనెక్షన్లతో పాటు ఒకసారి పరీక్షించి సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే వర్కింగ్ ఇన్ గుడ్ కండిషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలకు ఎటువంటి కొరత లేకుండా చూడాలని, జిల్లా కలెక్టర్ కోరిన వాటిని తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆసుపత్రిలో చిన్న చిన్న పనులు చేసుకునేందుకు హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్ లేదా ఆరోగ్యశ్రీ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ప్రధాన కేంద్రంలో డిస్ట్రిక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటుకు స్థలం కోరారని వాటిని మంజూరుచేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.  కార్పొరేట్ సామాజిక భాద్యత (సీ.ఎస్.ఆర్) క్రింద జిల్లాలో పనులు బాగానే జరుగుతున్నాయని, ఇది అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బగాది జగన్నాధరావు, రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణవేణి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజినీర్ కాంతిమతి, ప్రజారోగ్య కార్యనిర్వాహక ఇంజినీర్ కె.సుగుణాకరరావు, ఇతర జిల్లా అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-27 14:20:23

చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం..

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు.  శుక్రవారం వైశ్యరాజు కళ్యాణ మండపంలో 27 నుండి  29వ తేదీ వరకు ఏర్పాటు చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రారంభించారు.  చేనేత కార్మికులకు సహాయ పడాలని చెప్పారు.  ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల సానుకూలంగా ఉందన్నారు.  కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్నారు.  తెలంగాణాలోని సిరిసల్ల వెళ్లి చేనేత కార్మికుల సమస్యలు ఏవేవి ఉన్నాయో తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.  చేనేత కార్మికులకు మెరుగైన సేవలు అందించించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నదన్నారు.  ప్రతి సోమవారంలో ఒక సోమవారం చేనేత వస్ర్తాలు ధరించడానికి జిల్లా కలెక్టర్ చెప్పినట్లు తాను కూడ ధరిస్తానని, తన మిత్రులు చేనేత వస్త్రాలు ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉత్పత్తి చేస్తున్న చేనేత వస్త్రాలకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు.  నెలలో మొదటి సోమవారం జిల్లా అధికారులు చేనేత వస్త్రాలను ధరించాలని ఉత్తర్వవులు జారీ చేసినట్లు వెల్లడించారు.  చేనేత కార్మికులు అందరూ సమన్వయంతో, ఒకరితో ఒకరి సహాయ సహకారాలు అందించుకోవాలన్నారు.  జిల్లాలో తయారు చేస్తున్న వస్త్రాలకు మార్కెటింగ్ చేస్తే మంచి వ్యాపారం జరుగుతుందని చెప్పారు. మార్కెటింగ్ పై దృష్టి సారించాలని చెప్పారు.

          కళింగ వైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికులను గుర్తించి ప్రభుత్వం అవార్డులతో పాటు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు.  చేనేత కార్మికులు మాట్లాడుతూ నేతన్న నేస్తం కింద 24 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని, ఇంత వరకు 72 వేల రూపాయలు వచ్చినట్లు చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.  అంతకు ముందు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాల స్టాల్స్ ను పరిశీలించారు. బిసి సంక్షేమం కార్యనిర్వాహక అధికారి రాజారావు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-27 14:14:59

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు..

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు.  శుక్రవారం కంపోస్టు కాలనీ వద్ద సిటిజన్ అవుట్ రిచ్ కాంపెయిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. శ్రీనివాసులు, కళింగ వైశ్య, కాపు కార్పొరేషన్ల అధ్యక్షులు అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాలు, పట్టణాల్లో నెలలో 4వ శుక్ర, శనివారాలలో సచివాలయాల పరిధిలో ఉన్న ప్రజలకు ఇంటింటికి వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది వెళ్లి ప్రభుత్వ పథకాలు గూర్చి తెలియ జేస్తారని చెప్పారు.  గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా పరిపాలన నడుస్తోందన్నారు. గతంలో ఏనాడు జరగని విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నాయని చెప్పారు.  సచివాలయాల పరిధిలోని సమస్యలను సిబ్బంది దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ, ఇతర కులాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ స్కూల్స్ లలో పేద వారు చదవలేరని, వారికి కోసం ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడం జరిగిందని పేర్కొన్నారు.  కరోనాను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, దిశ చట్టం ప్రవేశ పెట్టి మహిళలకు రక్షణ కల్పించినట్లు చెప్పారు.  అన్ని సామాజిక వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు.  అధికారం చేపట్టిన వెంటనే ఏ విధమైన సిఫార్సులు లేకుండా పారదర్శంగా 4 లక్షల ఉద్యోగాలు కల్పించడమైనదని తెలిపారు. 

          జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివిధ సర్వీసులను అందిస్తున్నట్లు చెప్పారు.  గతంలో ఒక పథకం కోసం కలెక్టర్ కు, మున్సిపాలిటీలకు ధరఖాస్తు పెట్టుకొని, అది ఏమైందో తెలుసుకొనేవారన్నారు.  ప్రతి గ్రామంలో సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ఉందుబాటులో ఉందని, ఆ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.  గ్రామ/వార్డు సచివాలయాల్లో అన్ని శాఖలకు సంబంధించిన వారు ఒకరు ఉంటారని చెప్పారు.  ఆ శాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాల సమాచారంను తెలియజేస్తారని, అర్హులైన లబ్దిదారుల జాబితాను సచివాలయాల్లో బయటే డిసిప్లే చేస్తారని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు రాకుంటే వారు దరఖాస్తు చేసుకుంటే పథకం వస్తుందని తెలిపారు.  ప్రజలంతా ప్రభుత్వ పథకాలలో భాగస్వాములు కావాలన్నారు. సూచనలు, సలహాలు ఉంటే తెలియజేయాలని పేర్కొన్నారు.  జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ నగరాలు / పట్టణాలలో సచివాలయాల ద్వారా అందిస్తున్న సర్వీసులు సిబ్బంది తెలియజేస్తారన్నారు.  ప్రతి నెల 4వ శుక్ర, శనివారాలలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గూర్చి సచివాలయాల సిబ్బంది తెలియజేస్తారని చెప్పారు.  అనంతరం ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ పథకం వస్తుందో తెలియజేసే కేలండర్ ను ఆవిష్కరించారు.  అంతకు ముందు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు ఎం.వి. పద్మావతి, కమీషనర్ ఓబులేసు, తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-27 14:11:49

అమ్మా మీకు పథకాలు అందుతున్నాయా లేదా..

సాక్షాత్తూ జిల్లా క‌లెక్ట‌ర్ నేరుగా వార్డులోని ఇళ్ల‌కు వెళ్లి కుటుంబ స‌భ్యుల‌తో సంభాషించి వారి బాగోగుల‌ను, ప్ర‌భుత్వ ప‌థ‌కాల స‌మాచారం వారికి అందుతున్న‌దీ లేనిదీ, ఆయా ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు వారికి అందుతోందీ లేనిదీ తెలుసుకునేందుకు వేసిన ప్ర‌శ్న‌లివి.  రాష్ట్రంలోని ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సిస్తున్న‌ కుటుంబాల‌కు ప్ర‌భుత్వం ద్వారా ప‌థ‌కాలు అందుతున్న తీరు, వలంటీర్ల ద్వారా ఆయా కుటుంబాల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల స‌మాచారం ఏవిధంగా అందుతున్న‌దీ ప‌రిశీలించి, వారిలో  ఆయా ప‌థ‌కాల‌పై ఏమేర‌కు అవ‌గాహ‌న ఉన్న‌దీ తెలుసుకునేందుకు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అన్ని కుటుంబాల్లో అవ‌గాహ‌న క‌ల్పించి అర్హులంతా ఆయా ప‌థ‌కాలు పొందేందుకు తోడ్పాటు అందించే కార్య‌క్ర‌మ‌మే సిటిజెన్స్ ఔట్ రీచ్‌. రాష్ట్రంలోని అన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో శుక్ర‌వారం నుంచి ఈ కార్య‌క్ర‌మం ద్వారా స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లు బృందాలుగా ఏర్ప‌డి ఆయా స‌చివాల‌య ప‌రిధిలోని ప్ర‌తి ఇంటికి వెళ్లి, ప్ర‌తి కుటుంబాన్నీ క‌ల‌సి వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, అర్హులైన వారు ఎవ‌రైనా  ఆయా ప‌థ‌కాలు పొంద‌లేక‌పోతే వారితో ద‌ర‌ఖాస్తు చేయించ‌డం, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఆయా కుటుంబాల‌కు ఏ మేర‌కు అందాయో తెలుసుకోవ‌డం ఈ కార్య‌క్ర‌మ ల‌క్ష్యం. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి శుక్ర‌వారం న‌గ‌రంలోని 14వ వార్డు ప‌రిధిలోని కొత్త‌పేట కుమ్మ‌రివీధి, 5వ వార్డు ప‌రిధిలోని బాబామెట్ట ప్రాంతాల్లో మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్‌.ఎస్‌.వ‌ర్మ‌తో క‌ల‌సి ప‌ర్య‌టించారు. ఆయా వార్డుల్లోని ప‌లు ఇళ్ల‌కు వెళ్లి వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఏవిధంగా అందుతున్న‌దీ, వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ఏ మేర‌కు అవ‌గాహ‌న ఉన్న‌దీ తెలుసుకున్నారు. వార్డు వలంటీర్లు ఆయా ఇళ్ల‌ను త‌ర‌చుగా సంద‌ర్శించి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల స‌మాచారాన్ని తెలియ‌జేస్తున్న‌దీ లేనిదీ ఆరా తీశారు. ఆయా కుటుంబాల‌కు చెందిన వారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న‌దీ లేనిదీ తెలుసుకున్నారు. కొత్త‌పేట కుమ్మ‌రివీధికి చెందిన వృద్దుడు సూర స‌న్యాసిరావు ఇంటికి వెళ్లి ఆయ‌న బాగోగుల‌ను అడిగి తెలుసుకున్న క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి, ఆయ‌న‌కు ప్ర‌తినెలా ఫించ‌ను వ‌స్తున్న‌దీ లేనిదీ అడిగారు. ప్ర‌తినెలా రూ.2250 ఫించ‌ను మొత్తం అందుతోంద‌ని ఆయ‌న చెప్పారు. త‌న‌కు కొంత పొలం వుంద‌ని, అందుకు రైతుభ‌రోసా స‌హాయం కూడా అందుతోంద‌ని వివ‌రించారు. తాను త‌న కుటుంబ స‌భ్యులూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న‌ట్టు క‌లెక్ట‌ర్‌కు తెలిపారు.

అనంత‌రం అదే వార్డులోని నంద ర‌మాదేవి ఇంటికి వెళ్లిన క‌లెక్ట‌ర్ వారి కుటుంబం గురించి ఆరా  తీశారు. త‌మ పిల్ల‌ల‌కు అమ్మ ఒడి కింద స‌హాయం అందింద‌ని, త‌న భ‌ర్త టైల‌ర్ కావ‌డంతో ప్ర‌భుత్వం నుంచి రూ.10 వేలు స‌హాయం అందింద‌ని, త‌మ‌కు పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంలో కొండ‌క‌ర‌కాంలో ఇళ్లు కూడా మంజూర‌య్యింద‌ని ర‌మాదేవి క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన‌దీ లేనిదీ క‌లెక్ట‌ర్ అడిగారు.  ఇళ్ల నిర్మాణం త్వ‌ర‌గా ప్రారంభించాల‌ని, ప్ర‌భుత్వ ప‌రంగా పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. 5వ వార్డు బాబామెట్ట ప్రాంతంలోనూ క‌లెక్ట‌ర్ ప‌ర్య‌టించారు. ఆ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న ప‌లువురు వ్య‌క్తుల‌తో మాట్లాడి వారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. ఒక డోస్ వేయించుకున్న త‌ర్వాత వ్యాధికి గురి కావ‌డంతో రెండో డోసు వేయించుకోలేద‌ని ఒక వ్య‌క్తి తెలిపారు. ఏంటిబాడీస్ వున్నందున కొద్దిరోజుల త‌ర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటామ‌ని చెప్పారు. ఇదే కాల‌నీలో రిటైర్డ్ రెవిన్యూ అధికారి చంద్రుడు ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలోని హేమ‌ల‌త అనే మ‌హిళ‌తో మాట్లాడారు. వలంటీర్ త‌మ ఇంటికి త‌ర‌చూ వ‌చ్చి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై స‌మాచారం ఇస్తార‌ని హేమ‌ల‌త వివ‌రించారు. త‌మ కుటుంబంలోని వారంతా రెండు డోసులు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న‌ట్టు ఆమె తెలిపారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ న‌గ‌ర ప‌రిధిలో శ‌త‌శాతం వ్యాక్సినేష‌న్ పూర్తిచేసేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని క‌మిష‌న‌ర్ వ‌ర్మ‌ను ఆదేశించారు. న‌గ‌రంలో ఎంత‌మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు, మ‌రెంద‌రికి వ్యాక్సిన్ వేయాల్సి వుంద‌నే స‌మాచారం త‌న‌కు అంద‌జేసి వారికి వ్యాక్సిన్ ఏవిధంగా వేయ‌నున్న‌దీ ప్ర‌ణాళిక త‌న‌కు వివ‌రించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సిటిజెన్స్ అవుట్ రీచ్ కార్య‌క్ర‌మం అన్ని గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో జ‌రుగుతోంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌చివాల‌య సిబ్బంది, వలంటీర్లు బృందాలుగా ఇళ్లను సంద‌ర్శించి ఆయా కుటుంబాల‌ను క‌లుస్తున్నార‌ని, వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వివ‌రించ‌డంతోపాటు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నార‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో వార్డు కార్పొరేట‌ర్ ఎస్‌.వి.వి.రాజేశ్వ‌ర‌రావు, న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-27 14:06:12

నేడు జిల్లాలో మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని 18 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారంద‌రికీ కోవిడ్ టీకా వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ‌నివారం మెగా డ్రైవ్ నిర్వ‌హించ‌టం ద్వారా ప‌ట్ణ‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు ల‌క్ష మందికి వ్యాక్సిన్ వేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా శుక్ర‌వారం జేసీ మ‌హేష్ కుమార్ ఆధ్వ‌ర్యంలో వైద్యాధికారుల‌తో స‌మావేశం జ‌రిగింది. కోవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ప్ర‌తి ఒక్క‌రూ టీకా వేసుకోవాల‌ని, ఇదొక్క‌టే మ‌హమ్మారిని ఎదుర్కొనేందుకు మంచి మార్గ‌మ‌ని ఈ సంద‌ర్భంగా జేసీ పేర్కొన్నారు. మెగా డ్రైవ్‌లో అనుస‌రించాల్సిన విధానాల‌పై, ప‌ద్ధ‌తుల‌పై వైద్యాధికారుల‌కు మార్గ‌నిర్దేశం చేశారు. ప‌లు సూచ‌న‌లు జారీ చేశారు. పట్ట‌ణ ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించ‌టం ద్వారా అత్య‌ధిక మందికి వ్యాక్సిన్ వేయాల‌ని సూచించారు. ప్ర‌తి స‌చివాల‌యంలో, ఆరోగ్య కేంద్రాల్లో కేంద్రాల‌ను ఏర్పాటు చేసి కోవిడ్ టీకా వేయాల‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్కరూ స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి మెగా డ్రైవ్‌ను విజ‌య‌వంతం చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీన కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించ‌నున్నామ‌ని, దీనికి వైద్యాధికారులు, సిబ్బంది స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని జేసీ సూచించారు. ఈ సమావేశంలో డీఐవో డా. గోపాల కృష్ణ‌, ప‌లువురు వైద్యాధికారులు, వైద్య‌ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-27 14:02:09

అభివృద్దిలో య‌వ‌త భాగ‌స్వామిని చేయాలి..

యువ‌జ‌న సంఘాల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా స‌మాజాభివృద్దిలో యువ‌త‌ను భాగ‌స్వా ముల‌ను చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లోని యువ‌త‌ను ఏకం చేసి, వారి ఆస‌క్తి, అర్హ‌త‌లు, స‌మాజ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఏకీకృత నైపుణ్య శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని రూపొందించాల‌ని ఆదేశించారు.  జిల్లా స్థాయి యువ‌జ‌న కార్య‌క్ర‌మాల‌పై శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ గ్రామ‌, వార్డు స్థాయిల్లో యువ‌జ‌న సంఘాల‌ను ఏర్పాటు చేయడానికి త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు ప్రారంభించాల‌ని సూచించారు. దీనికోసం స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లు చేయాల‌న్నారు. వ్య‌వ‌సాయ, అనుబంధ రంగాలు, నైపుణ్యం ఆధారంగా, ఎటువంటి నైపుణ్యం లేని సాధార‌ణ వ్య‌క్తుల‌ను వేర్వురు విభాగాలుగా గుర్తించి, వారిచేత సంఘాల‌ను ఏర్పాటు చేయించాల‌న్నారు. స్థానిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా, అన్ని శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో వారికి అవ‌స‌ర‌మైన నైపుణ్య‌ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను రూపొందించాల‌ని సూచించారు. దీనికి ముందుగా ప్ర‌తీ గ్రామం నుంచి, ప‌ట్ట‌ణాల్లోని వార్డు నుంచి అర్హ‌త గ‌ల యువ‌త వివ‌రాల‌ను సేక‌రించాల‌ని ఆదేశించారు. ఈ యువ‌జ‌న సంఘాల‌ను ఏర్పాటు చేసి, ఎవెన్యూ ప్లాంటేష‌న్‌, వ‌న సంర‌క్ష‌ణ‌, ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌తోర‌ణం లాంటి ప్రభుత్వ ప్రాధాన్య‌తా కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాముల‌ను చేయ‌డం ద్వారా మంచి ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చ‌ని సూచించారు. 

అలాగే జిల్లాలోని ప్ర‌సిద్ది పొందిన బొబ్బిలి వీణ‌లు త‌దిత‌ర వాటిని ఈ సంఘాల ద్వారా త‌యారు చేయించి, దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేయించవ‌చ్చ‌ని అన్నారు. యువ‌త‌కు ఉద్యోగ క‌ల్ప‌న కంటే, స్వ‌యం ఉపాధి క‌ల్పించ‌డంవ‌ల్ల అధిక ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని చెప్పారు. జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ, యువ‌త‌లోని ఆస‌క్తి, నైపుణ్యంతో బాటుగా, స్థానిక అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా వారికి నైపుణ్య శిక్ష‌ణ ఏర్పాటు చేయాల‌న్నారు. ప్ర‌స్తుతం భారీ ఎత్తున జ‌రుగుతున్న గృహ నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని దృష్టిలో పెట్టుకొని, తాపీమేస్త్రి, రాడ్ బెండింగ్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ప్లంబింగ్ త‌దిత‌ర కోర్సుల్లో శిక్ష‌ణ ఇవ్వ‌డం వ‌ల్ల వారికి ఉపాధి దొర‌క‌డంతోపాటుగా, స‌మాజ అవ‌స‌రాలు కూడా తీర్చ‌వ‌చ్చున‌ని సూచించారు.

          జిల్లా యువ‌జ‌న స‌మ‌న్వ‌యాధికారి విక్ర‌మాధిత్య మాట్లాడుతూ, జిల్లాలో యువ‌జ‌న సంఘాల పాత్ర‌, వాటి కార్య‌క్రమాల‌ను వివ‌రించారు. యువ‌జ‌న సంఘాల‌కు ప్ర‌భుత్వం ఇస్తున్న స‌హ‌కారం, అమ‌లు చేస్తున్న కౌస‌ల్ వికాశ్ యోజ‌న‌, సంక‌ల్ప్ త‌దిత‌ర‌ ప‌థ‌కాలు గురించి తెలిపారు. జ‌న‌శిక్ష‌ణ సంస్థాన్ ద్వారా ఇస్తున్న నైపుణ్య శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు.  క్షేత్ర‌స్థాయిలో యువ‌త‌లోని ప్ర‌తిభ‌ను గుర్తించి, దానిని వెలికి తీసేందుకు యువ‌జ‌న సంఘాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. ఈ స‌మావేశంలో సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, డిపిఓ సుభాషిణి, జిఎం డిఐసి ప్ర‌సాద‌రావు, మెప్మా పిడి సుధాక‌ర‌రావు, సెట్విజ్ సిఇఓ విజ‌య‌కుమార్‌, నాబార్డ్ ఏజిఎం హ‌రీష్‌, డిఎల్‌డిఓ రామ‌చంద్ర‌రావు, వివిధ శాఖ‌లు, యువ‌జ‌న సంఘాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఆదర్శ పారిశ్రామిక‌వేత్త ధ‌ర‌ణి, త‌మ సంస్థ ద్వారా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

Vizianagaram

2021-08-27 13:59:55

డిసెంబరుకి హెల్త్ క్లినిక్ లు పూర్తికావాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిర్మాణంలో వున్న వై.ఎస్‌.ఆర్‌.హెల్త్ క్లినిక్‌లు, అర్బ‌న్ క్లినిక్ ల నిర్మాణాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తిచేసి అంద‌జేయాల్సి వుంటుంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌళిక స‌దుపాయాల సంస్థ ఎం.డి. డి.ముర‌ళీధ‌ర్ రెడ్డి చెప్పారు. ఈ క్లినిక్‌లలో ప‌నిచేసేందుకు సిబ్బంది నియామ‌క ప్రక్రియ‌ను ఇప్పటికే కుటుంబ సంక్షేమ క‌మిష‌న‌ర్ ప్రారంభించార‌ని, డిసెంబ‌రు నాటికి ఈ సిబ్బంది అంతా ఆయా ఆసుప‌త్రుల్లో చేర‌తార‌ని, అప్పటిక‌ల్లా ఈ భ‌వ‌నాలు పూర్తిచేయాల్సి వుంటుంద‌న్నారు. ఈ క్లినిక్‌ల ద్వారా ప్రజ‌ల‌కు గ్రామాల్లోనే వైద్య సౌక‌ర్యాలు ఏర్పడ‌తాయ‌ని, గ్రామంలోని క్లినిక్‌లో ఏవిధ‌మైన వైద్య స‌దుపాయాలు అందుబాటులో వున్నాయో అవ‌గాహ‌న క‌ల్పిస్తే వారు వైద్యం కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా త‌మకు స‌మీపంలోని వై.ఎస్‌.ఆర్‌.క్లినిక్‌ల‌లో స‌దుపాయాల‌ను వినియోగించుకుంటార‌ని చెప్పారు. జిల్లా ప‌ర్యట‌నకోసం శుక్రవారం న‌గ‌రానికి వ‌చ్చిన ఏ.పి.ఎం.ఎస్‌.ఐ.డి.సి. మేనేజింగ్ డైర‌క్టర్ ముర‌ళీధ‌ర్ రెడ్డి క‌లెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఆసుప‌త్రుల నిర్మాణం ప‌నులు, ఆసుప‌త్రుల్లో నాడు - నేడు, ఆసుప‌త్రుల్లో ఏర్పాటు చేసిన వైద్య ప‌రికరాలు, ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల‌ నిర్వహ‌ణ‌కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య మౌళిక స‌దుపాయాల సంస్థ ఇంజ‌నీర్లతో స‌మీక్షించారు. 

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, వై.ఎస్‌.ఆర్‌.క్లినిక్‌ల నిర్మాణం పూర్తయిన వెంట‌నే ఆయా భ‌వ‌నాల‌ను జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి అప్పగించాల‌ని ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి., రోడ్లు భ‌వ‌నాలు, ప్రజారోగ్య ఇంజ‌నీరింగ్‌, పి.ఆర్‌.ఇంజ‌నీరింగ్ విభాగాల‌ ఇంజ‌నీర్ల‌ను ఆదేశించారు. ఆసుప‌త్రి భ‌వ‌నాల నిర్మాణం పూర్తయిన త‌ర్వాత వాటికి అవ‌స‌ర‌మైన చిన్నచిన్న ప‌నుల‌ను స్థానిక సంస్థల నిధుల నుంచే చేప‌ట్టాలని స్పష్టంచేశారు. క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్లు, పి.హెచ్‌.సి.లు, వై.ఎస్‌.ఆర్‌.హెల్త్ క్లినిక్‌ల‌కు సంస్థ సూచించిన రంగుల‌నే వేయాల‌ని, ఎక్కడా మార్పులు చేయ‌డానికి వీల్లేద‌ని స్పష్టంచేశారు. ఆయా భ‌వ‌నాలు చూడ‌గానే ఆసుప‌త్రుల‌నే అంశాన్ని ప్రజ‌లు గుర్తించే విధంగా రంగులు వేయాల‌న్నారు. నాడు - నేడులో ఆధునీక‌రిస్తున్న‌ అన్ని ఆసుప‌త్రుల వ‌ద్ద గ‌తంలో ఆ భ‌వ‌నాలు ఎలా వుండేవి, ఇప్పుడెలా వున్నాయ‌నే ఫోటోల‌తో బోర్డులు ఏర్పాటు చేయాల‌న్నారు. ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణంకోసం నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ నుంచి నిధులు ఇస్తామ‌ని పేర్కొన్నారు.

కోవిడ్ సంద‌ర్భంగా జిల్లాలోని సి.హెచ్‌.సి.లు, ఏరియా ఆసుప‌త్రులు, జిల్లా ఆసుప‌త్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల నిర్వహ‌ణ‌ను ఆయా ఆసుప‌త్రుల అభివృద్ధి నిధుల నుంచే చేప‌ట్టాల్సి వుంటుంద‌న్నారు. 30 ప‌డ‌క‌ల కంటే అధికంగా బెడ్లు వున్న పి.హెచ్‌.సి.లు, సిహెచ్‌సిల‌కు త‌మ సంస్థ ద్వారా డీజిల్ జ‌న‌రేట‌ర్ సెట్లు, విద్యుత్ స‌ర‌ఫ‌రా నియంత్రణ‌కు ట్రాన్స్ ఫార్మర్‌లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. అన్ని ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వ్యవ‌స్థలు ఏర్పాటు చేస్తున్నందున విద్యుత్ స‌ర‌ఫ‌రా కార‌ణంగా ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా పాత విద్యుత్ స‌ర‌ఫ‌రా లైన్లను మార్పు చేయాల‌ని ఎం.డి. సూచించారు. ఆయా ఆక్సిజ‌న్ ప్లాంట్‌లు ఏజెన్సీల ద్వారా ఏర్పాట‌య్యాక అవి ప‌నిచేస్తున్నట్టు సంబంధిత ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్ లేదా మెడిక‌ల్ ఆఫీస‌ర్ లు స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సి వుంటుంద‌న్నారు.

జిల్లాలో ఆసుప‌త్రుల్లో నాడు - నేడు కింద ఆసుప‌త్రుల ఆధునీక‌ర‌ణ ప‌నులు, కొత్త ఆసుప‌త్రి భ‌వ‌నాల నిర్మాణంపై ఆ సంస్థ కార్యనిర్వాహ‌క ఇంజ‌నీర్ స‌త్యప్రభాక‌ర్ ఎం.డి.కి ప‌వ‌ర్ పాయింట్ ప్రజంటేష‌న్ ద్వారా వివ‌రించారు. జిల్లాలో 9 ఆసుప‌త్రుల్లో 81 ఐ.సి.యు., 338 నాన్ ఐ.సి.యు. ప‌డ‌క‌ల‌కు రూ.3.18 కోట్ల‌తో ఆక్సిజ‌న్ పైప్‌లైన్ ల ఏర్పాటుకు ప్రతిపాదించామ‌ని, వీటిలో ఇప్పటివ‌ర‌కు 51 ఐ.సి.యు, 213 నాన్ ఐ.సి.యు. ప‌డ‌క‌ల‌కు క‌ల‌సి మొత్తం 264 ప‌డ‌క‌ల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ఏర్పాటు చేశామ‌న్నారు. 9 ప‌నుల్లో 7  ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, మ‌రో రెండు ప‌నులు ప్రారంభం కావ‌ల‌సి వుంద‌ని చెప్పారు. మూడు ఆసుప‌త్రుల్లో పి.ఎస్‌.ఏ. ప్లాంట్‌లు, ఒక చోట ఆర్‌.టి.పి.సి.ఆర్‌. ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. క‌మ్యూనిటీ ఆసుప‌త్రులు, ఏరియా ఆసుప‌త్రుల్లో న‌బార్డు నిధుల‌తో 8 ప‌నులు రూ.58.10 కోట్ల ఒప్పంద విలువ‌తో న‌బార్డు నిధుల‌తో చేప‌ట్టామ‌ని, ఈ ప‌నుల‌న్నీ కొన‌సాగుతున్నట్టు వివ‌రించారు. ప్రభుత్వ వైద్య క‌ళాశాల ఏర్పాటుకు సంబంధించి నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుతం ముళ్ల కంప‌లు తొల‌గించే ప‌నులు జ‌రుగుతున్నట్టు పేర్కొన్నారు. పి.హెచ్‌.సి.ల అప్ గ్రెడేష‌న్ కింద 68 ప‌నుల‌ను రూ.48.24 కోట్లతో చేప‌ట్టామ‌ని వివ‌రించారు. కొత్తగా మ‌రో 12 పి.హెచ్‌.సిల ప‌నులు రూ.2.17 కోట్లతో చేప‌ట్టామ‌న్నారు. ఆసుప‌త్రుల్లో మ‌ర‌మ్మత్తుల‌కు సంబంధించి 56 ప‌నుల‌ను రూ.26.48 కోట్లతో చేప‌ట్టామ‌న్నారు.

అంత‌కుముందు ఎం.డి. ముర‌ళీధ‌ర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని గాజుల‌రేగ వ‌ద్ద ప్రభుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణ ప్రాంతాన్ని జాయింట్ క‌లెక్టర్ డా.ఆర్‌.మ‌హేష్ కుమార్ తో క‌ల‌సి ప‌రిశీలించారు. ఏ.పి.ఎం.ఎస్‌.ఐ.డి.సి. అధికారులు ఎస్.ఇ. శివ‌కుమార్‌, ఇ.ఇ. స‌త్యప్రభాక‌ర్ త‌దిత‌రులు నిర్మాణానికి చేస్తున్న ఏర్పాట్లను వివ‌రించారు. క‌లెక్టరేట్ స‌మావేశంలో జాయింట్ క‌లెక్టర్ డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జిల్లా ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా.సీతారామ‌రాజు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.వి.ర‌మ‌ణ‌కుమారి, రోడ్లు, భ‌వ‌నాల శాఖ ఎస్‌.ఇ. విజ‌య‌శ్రీ‌, ప్రజారోగ్య ఇంజ‌నీరింగ్ ఎస్‌.ఇ. శ్రీ‌నివాస‌రావు, పంచాయ‌తీరాజ్ ఇ.ఇ. ఎం.ఇ.ఎన్‌.వెంక‌ట‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-27 13:56:55

ఏడువేల డోసుల పీసీవీ వేక్సిన్లు జిల్లాలో సిద్ధం..

న్యుమోనియా నుంచి చిన్న పిల్లలను రక్షించడానికి  న్యుమోకోకల్ కాంజుగేట్ టీకా (PCV) యూనిర్సల్ ఇమ్యునైజెషన్ ప్రోగ్రాం కు సంబందించి  చిన్నారులకు వేసేందుకు 7 వేల డోస్ లు సిద్దంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున  వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం వుడా చిల్డ్రన్స్ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.  వైద్యాధికారులు, సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాల మేరకు సాధించాల్సిన అవసరం ఉందన్నారు.  గ్రామీణ, పట్టణ మరియు ఏజెన్సీ ప్రాంత మండలాలలో మలేరియా,  డెంగ్యూ కేసుల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి  పెట్టాలన్నారు. 27 మండలాలలో మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు.  ఆయా ప్రాంతాలలో  యాంటీ మలేరియా ఆపరేషన్ లను నిర్వహించడం, ఫాగింగ్ చేయడం,  మురికి నీరు, నిల్వనీరు లేకుండా ఆయా పంచాయితీలలో పారిశుధ్యాన్ని  ప్రత్యేకంగా చేయాలన్నారు.  ఆయా ప్రదేశాలలో  ఆయిల్ బాల్స్ వేయడం తో పాటు మాపింగ్ చేయాలన్నారు.  ఇందుకు సంబందించి మలేరియా సిబ్బందితో  పాటు సర్పంచ్ లు  ప్రత్యేక శ్రద్ద కనపర్చాలన్నారు.  డాక్టర్లు సంబందిత సచివాలాయలకు తనిఖీలు చేయాలని ఫీవర్ కేసులు గుర్తిస్తే సచివాలయ సిబ్బంది ద్వారా డోర్ టు డోర్ సర్వే చేయడం  టెస్ట్ చేసిన రిపోర్టులను డి. ఎం. హెచ్ .ఓ కార్యాలయానికి పంపించి ట్రీట్ మెంట్ మొదలు పెట్టాలన్నారు.  ఏ వ్యక్తి కూడా మలేరియా డెంగ్యూ జ్వరాలకు చనిపోకుండా మొదటి దశలోనే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంచడం, ప్రసార మాధ్యమాల  ద్వారా విసృత ప్రచారం చేయాలన్నారు. జ్వరాల సీజన్ మొదలవక ముందే ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో  జిల్లా వైద్యాధికారి డా.సూర్యనారాయణ,  ఎ .ఎం .సి ప్రిన్సపాల్ డా.సుధాకర్, డి.సి.హెచ్.ఎస్. డా. ప్రకాషరావు, వైద్యాధికారులు హాజరైయారు.

Visakhapatnam

2021-08-27 13:40:04