1 ENS Live Breaking News

వాతావరణ సమతుల్యతకై మొక్కలు నాటాలి..

వాతావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని స్థానిక శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం అంపోలు వద్ద గల జిల్లా జైల్ ఆవరణలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటి  కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన మేరకు అటవీ ప్రాంతం లేదని, తద్వారా వాతావరణంలో అనేక మార్పులు సంబవిస్తున్నాయని చెప్పారు. అందువలన ప్రతి ఒక్కరు మొక్కలను పెద్దఎత్తున నాటాలని, దీని వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయని వివరించారు. నానాటికీ పెరుగుతున్న ఉష్ణ తాపానికి కూడా అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. మొక్కలను నాటడంతోనే పని అయిపోదని,వాటిని సంరక్షించుకోవలసిన భాద్యత కూడా మనపై ఉందని తెలిపారు. మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తెరగాలని, మొక్కలను నాటడమే కాకుండా ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉందని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఎమ్.రాజు కుమార్, జైలర్లు దివాకర్ నాయుడు, ఉదయ్ భాస్కర్, డిప్యూటీ జైలర్ జోసెఫ్, రాష్ట్ర అగ్రిమిషన్ సభ్యులు గోండు రఘురాం, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ మూర్తి, మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాస్ రావు, సర్పంచ్ జయరాం, పీస శ్రీహరి, గోలివి వెంకట రమణ మూర్తి, అల్లు లక్ష్మీనారాయణ, పిఎసియస్ డైరెక్టర్ గోండు కృష్ణ, ఏమ్మార్వో జన్ని రామారావు, స్పెషల్ ఆఫీసర్ గుతి రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-06 16:12:23

శ్రీకాకుళం జిల్లాకి రాష్ట్ర మంత్రుల రాక..

శ్రీకాకుళం జిల్లా పర్యటనకు రాష్ట్ర మంత్రులు శనివారం రానున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శనివారం జిల్లాకు రానున్నారు. శని వారం ఉదయం విశాఖపట్నంలో బయలు దేరి పొందూరు చేరుకుంటారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనలో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ పొందూరులో జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొంటారు. పొందూరు కేంద్రంగా పని చేస్తున్న ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవనాన్ని సందర్శిస్తారు. అచ్చటనే ఖాదీ ప్రక్రియను పరిశీలిస్తారు. అచ్చట నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగే కార్య్రమంలో లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను ఆమె పరిశీలిస్తారు.  భోజనానంతరం బయలుదేరి విశాఖపట్నం వెళతారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి కూడా విశాఖపట్నం వెళతారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మబుగాం వెళతారు.

Srikakulam

2021-08-06 16:11:23

ఉద్యోగులకు అక్షయపాత్ర వితరణ..

కోవిడ్ నేపథ్యంలో సతమతమవుతున్న నిరుపేదలకు అక్షయ పాత్ర పంపిణీచేసే కిరాణా సరుకులను  సెక్రటేరియట్ హౌస్ కీపింగ్  ఉద్యోగులకు రాష్ట్ర  విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర  పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు శుక్రవారం అందజేశారు.  ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో సచివాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది హౌస్ కీపింగ్ ఉద్యోగులకు తొమ్మిది రకాల  కిరాణా సరుకులతో కూడిన సంచులను మంత్రులు పంపిణీ చేశారు.  బియ్యం, కందిపప్పు, పుట్నాలపప్పు, గోదుమ పిండి,  పంచదార, ఆయిల్, పసుపు, కారం, సాంబార్ పొడి తదితర తొమ్మిది రకాల కిరాణా సరుకులతో  కూడిన  సంచులను పంపిణీచేయడం జరిగింది.  ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అద్యక్షులు  కె.వెంకట్రామిరెడ్డి, అక్షయ  పాత్ర పౌండేషన్ వైస్ ప్రెసిడెంట్  శ్రీ వంశీధరరాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tadepalle

2021-08-06 16:10:30

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు ..

 పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు శానిటరీ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన నాలుగవ జోన్ 30వ వార్డులోని రెల్లి వీధి, అఫీషియల్ కోలనీ, కె.జి.హెచ్. తదితర ప్రాంతాలో పర్యటించారు. ఈ సందర్భంలో అదనపు కమిషనర్ మాట్లాడుతూ వార్డులో ఎక్కడా చెత్త కనిపించకూడదని, పారిశుధ్య కార్యక్రమాలు, బయోమెట్రిక్ హాజరు  అయిన వెంటనే ప్రధాన రహదారులు శుభ్రపరచిన తరువాత డోర్ టు డోర్ చెత్త సేకరించాలని, అనంతరం ప్రధాన కాలువలు, వీధి కాలువలు శుభ్రపరచాలని ఆదేశించారు. పారిశుధ్య సిబ్బంది చెత్త సేకరించే విధానాన్ని పరిశీలించి వారికి తగు సూచనలు ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని, చెత్త వేసే వారిపై నిఘావుంచి వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని, పక్కాగా యూజర్ చార్జీలు వసూలు చేయాలని, చెత్త తరలించే వాహనాలను మూడు ట్రిప్పులు తిరిగేటట్లుగా చూడాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, దోమలు ప్రబలకుండా ఉండేందుకు ఫాగింగు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితారులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-06 16:08:27

విశాఖలో గెడ్డలను ఆధునీక రించండి..

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని రానున్న వర్షాకాలన్ని ద్రుష్టిలో పెట్టుకొని గెడ్డలను చెత్త లేకుండా శుభ్రపరచి ఆధునీకరించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె 5వ జోన్ 43వ వార్డు పరిధిలోని మాదేటి గార్డెన్స్, అక్కయ్యపాలెం, పోస్ట్ ఆఫీస్ రోడ్డు, నందగిరి నగర్, శ్రీనివాస్ నగర్ తదితర ప్రాంతాలలో వార్డ్ కార్పొరేటర్ పి. ఉషశ్రీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డులోని ప్రధాన రహదార్లు సరిగా శుభ్రపరచడం లేదని, వెంటనే శుభ్ర పరచాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. కాలువల మీద ఉన్న పైపులైనులను ఒక క్రమ పద్ధతిలో కాలువల అంచున క్లిప్పుల ద్వారా బిగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వార్డులలో పలు చోట్ల త్రాగునీరు చాలా చిన్న దారగా వస్తుందని స్థానిక ప్రజలు తెలపగా కమిషనర్ స్పందిస్తూ పరిశీలించి దార వేగం పెంచాలని సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ ను ఆదేశించారు. జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం. కాలనీ దగ్గర బోరు పనిచేయడం లేదని, దానిని రిపేర్ చేయించాలని ఆదేశించారు. శ్రీనివాస నగర్, నందగిరి నగర్లో ఉన్న మూడు రహదరి వంతెనలు శిధిలావస్థలో ఉన్నందున, నూతనంగా నిర్మించుటకు అంచనాలు తయారు చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాత పోస్ట్ ఆఫీస్ రోడ్ లో ఉన్న గెడ్డపై చిన్న బ్రిడ్జిని 40 అడుగుల వెడల్పుతో పెంచాలని కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా కమిషనర్ దాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మూడు నెలల్లో వర్షాకాలంని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మలేరియా పై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సును పరిశీలించి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి,  ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, ఎ.శ్రీనివాస రావు, ఎసిపి మధుకుమార్, ఎఎంఒహెచ్ రాజేష్, శానిటరీ సూపర్వజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.     

Visakhapatnam

2021-08-06 16:07:39

ఇతర పంటల వైపు మొగ్గు చూపాలి..

దేశంలో అవసరాలకు మించిన ఉత్పత్తి వరి లో వస్తుందని, కనుక వరి నుంచి ఇతర పంటల  వైపు రైతులు మొగ్గు చూపాలని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. వరికి బదులుగా మొక్క జొన్న, సోయా, నూనె గింజలు లాంటి పంటలు సాగు చేయాలని సూచించారు. మారుతున్న పరిస్థితులు తగ్గట్టుగా రైతులు కూడా మారాలని, దానికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు ఆయా ప్రాంతాల రైతులకు కొత్త పంటల కోసం తెలుపుతూ.. మెలకువలు నేర్పడం, భూమిని సారవంతం చేయడం వంటి చర్యలు చేపట్టాలని అని అన్నారు. శుక్రవారం అంపోలు  వ్యవసాయ మార్కెట్ కమిటీలో రూ.40లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ కమిటీ కార్యాలయం భవనం మొదటి అంతస్థు పనులకు, రూ.27 లక్షలతో నిర్మిస్తున్న   బీ. టి రోడ్డు పనులకు శాసనసభ్యులు  ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  ధర్మాన మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ కమిటీకి స్థలం కేటాయించి, కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతు సంక్షేమం, వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగా ఇన్ని పథకాలు అందిస్తున్నమన్నారు. పంట వేసే దశ నుంచి పంట అమ్ముకునే దశ వరకు పలు రకాల పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. గ్రామంలోనే ఆర్బీకే లు ఏర్పాటు చేసి రైతులకు కల్తీలేని నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. వంశధార రెండో ఫేజ్ పూర్తయితే మండు వేసవిలో నీరు అందించి, తద్వారా వరి తో పాటుగా ఇతర పంటలు కూడా పండించవచ్చని తెలిపారు, ఒడిశా తో ఉండే వివాదం కొలిక్కి రావడం, ట్రిబ్యునల్ తీర్పు అనుకూలంగా రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చాలా పట్టుదలతో ఉండడంతో నెరడీ బెరేజీ పూర్తవుతుందని అన్నారు.  నాటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.ఆర్ ప్రారంభించిన వంశధార ప్రోజెక్టు ను పూర్తి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏమ్మార్వో జన్ని రామారావు, ఎంపిడివో రాం మోహన్, ఎడీఎ రవి ప్రకాష్, మండల ప్రత్యేక అధికారి గుత్తి రాజారావు.ఏఎంసీ చైర్మన్ ముకళ్ల తాత బాబు, అగ్రి మిషన్ సభ్యులు గోండు రఘు రాం, తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్, జెడ్పి మాజీ చైర్మన్ వై.వి సూర్య నారాయణ, డిసిఎంయస్ మాజీ చైర్మన్ గోండు కృష్ణ మూర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎమ్.వి పద్మావతీ, మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాసరావు, మాజీ ఎఎంసి చైర్మన్ బోరా చిన్నంనాయుడు, ఎఎంసి వైస్ చైర్మన్ లాలబహుధుర్ శాస్ట్రీ, చల్లా శ్రీనివాసరావు, కొనర్క్ శ్రీనివాసరావు, సుంకరి కృష్ణ కుమార్, సర్పంచ్ గోండు జయరాం, బరాటం రామ శేషు, పీస శ్రీహరి, యాల్లా నారాయణ, అల్లు లక్ష్మీ నారాయణ, చిట్టి రవికుమార్, చాంగల్ రావు, బాన్నా నర్సింగరావు, పొన్నాడా ఋషి, యజ్జల గురుమూర్తి, బొచ్చెన రాజేష్, నాయుడు, ఎఎంసి సెక్రటరీ రవి కిరణ్, ఎఎంసి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Srikakulam

2021-08-06 15:07:31

ఆర్బీకేల ద్వారానే సలహాలు, సూచనలు..

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు, సలహాలు ఇస్తారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్ మేషన్ ప్రాజెక్టు రెండు రోజుల కన్సల్టేటివ్ వర్క్ షాప్ లో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనేజ్ అనే సంస్థ తో వ్యవసాయ శాఖ భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. రైతులు ఎలాంటి వంగడాలు వేయాలి, విత్తనాలు వేయాలనే సమాచారం ఇస్తాయని పేర్కొన్నారు. దీని వలన పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు.  యాంత్రీకరణ పరికరాలు, తదితర వాటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పండించే పంటలు నష్టపోతే రైతు భీమా పథకం ఉందన్నారు.  పండించే పంటలకు సరియైన ధర రాకపోవడం వలన రైతుల్లో అసంతృప్తి ఉందని తెలిపారు. వ్యవసాయం అనేది వ్యాపారం, లాభసాటిగా ఉండాలన్నారు. ప్రతి గ్రామ పరిధిలో రైతుల కోసం గొడౌన్లు, పండించే పంటలు ఆరబెట్టుకోడానికి ప్లాట్ ఫారం లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మార్కెట్ లో డిమాండ్ కు అనుగుణమైన పంటలు పండించే విధంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం నుండి ఎఫ్.పి.ఓ.లకు కావలసిన సహాయ సహకారాలు ఉంటాయన్నారు.  మేలైన వంగడాలు, విత్తనాలు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.  ఎఫ్. పి. ఓ లుగా గురించిన వారికి 90 శాతం సబ్సిడీతో ప్రాసెసింగ్ యూనిట్లు ఇస్తామన్నారు.  రైతులకు శిక్షణ తో పాటు క్షేత్ర స్థాయి సందర్శన ఉంటుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్ మేషన్ ప్రాజెక్టు సంచాలకులు కె. సి. గుమ్మ గోల్ నాథ్ రోల్ మోడల్, ఎఫ్.పి.ఓ.లు మంచి వ్యాపార అనుసంధానాలు పై వివరించారు. వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో మార్కెటింగ్ పై ఉన్న డిమాండ్ కు అనుగుణంగా ఉన్న పంటలను పండించాలన్నారు. ఉత్పత్తి దారులు దీనిపై దృష్టి సారించాలని చెప్పారు. ఫైనాన్స్ మేనేజ్ మెంట్, మార్కెటింగ్ అప్రోచ్ లపై వివరించారు.

కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస నుండి వచ్చిన చిన్నంనాయుడు మార్కెట్ యొక్క ప్రాముఖ్యత, కెపాసిటీ బిల్డింగ్ గూర్చి, నాబార్డు బిడిఎం హరీష్ రావు బిజినెస్ ఓరియంట, ఎఫ్. పి. ఓ  మోటివేషన్, ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ పైన మాట్లాడారు. రెండు రోజు ల అధ్యాపకులు బిజినెస్ ఎక్స్పెర్ట్, బెంగుళూరు ప్రొ. వెంకటరెడ్డి, ఎన్. ఐ. ఆర్ డి, హైదరాబాద్ ఫ్యాకల్టీ సభ్యులు ఆర్. దివాకర్, మేనేజ్ అధ్యాపకులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఎఫ్ పిఓ సిఇఓ లు, నాబార్డు ఎజిఎంలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
 

Srikakulam

2021-08-06 15:05:49

సిబ్బంది సమయపాలన పాటించాల్సిందే..

అనంతపురము నగర పాలక సంస్థ పరిధి లోని 22, 23 సచివాలయలను  నగరపాలక సంస్థ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇందులో  బాగంగా  కోవిడ్ వాక్సినేషన్ డ్రైవ్, వాక్సినేషన్ మీద ప్రజలు అపోహలు తొలిగింపు పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క సచివాలయం సిబ్బంది బయో మెట్రిక్ హాజరు ను తప్పని సరిగా వేయాలని సూచించారు,  పలు రికార్డ్ లను తనిఖీ చేశారు, , శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, సచివాలయం సిబ్బంది సమయ పాలన పాటించాలని హెచ్చరించారు. నగరం లో మనం ఏమి పని చేస్తున్నాం, ఏమి మార్పు తెస్తున్నాం అని ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలిపారు, అంతే కాక ప్రతి కార్యదర్శి వారి యొక్క “జాబ్ చార్ట్ “ నియమాల ప్రకారం ప్రతి రోజు ఉదయం మరియు సాయంకాలం రెండు లేదా ఒక గంట పాటు పర్యటన చేస్తేనే వార్డు లోని సమస్యలు , ప్రగితి ఇతర విషయాలతో పాటు ప్రజలలో మమేకమయ్యే అవకాశం వస్తుందని అప్పుడే తమ తమ వ్రుత్తి కి న్యాయం చేసిన వారు అవుతారన్నారు... కార్యక్రమములో వార్డు కర్పోరటర్ మల్లికార్జున గారు, డి ఈ సుధారాణి , ఎ.ఈ నాగజ్యోతి మరియు తదితరులు పాల్గొన్నారు..

Anantapur

2021-08-06 15:03:53

వ్యాక్సినేషన్ ను పరిశీలించిన మేయర్..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్  గొలగాని హరి వెంకట కుమారి శుక్రవారం మల్కాపురం ఎఫ్.ఆర్.యు. కేంద్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు వాక్సినేషన్ చురుగ్గా జరగాలని మేయర్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. నేడు స్పెషల్ డ్రైవ్ ద్వారా జివిఎంసి పరిధిలోని అన్ని పట్టణ ప్రాథమిక కేంద్రాలలోనూ సచివాలయాలలో లక్ష మందికి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని, సాయంత్రానికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 45 సంవత్సరాలు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు, టీచర్స్ కు వేయడం జరుగుతుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకుని, వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద సిబ్బందికి సహకరించి, ఒక క్రమ పద్ధతిలో వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎఫ్.ఆర్.యు. కేంద్రంలోని పరిసరాలను, మరుగుదొడ్లను పరిశీలించి వాటిని ఉపయోగించిన వెంటనే శుభ్రపరచాలి శానిటరీ అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేదని వాటిని శుభ్రపరచి ఫినాయిల్ వాడాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పూర్ణశ్రీ,  పి.వి.సురేష్, గేదెల లావణ్య, ప్రధాన వైద్యాధికారి డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి,  జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు,  ఇతర అధికారులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-06 14:38:02

తల్లిపాలే బిడ్డలకు శ్రీరామ రక్ష..

తల్లిపాలే బిడ్డలకు శ్రీరామ రక్ష అని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. శుక్రవారం ఆరిలోవ  గాంధీ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ తల్లి పాలు పట్టడం వలన బిడ్డకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారిలో చురుకు తనము ఎదుగుదల బాగుంటుందని,  పాలు బిడ్డకు ఇవ్వడం వలన తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరవని, పిల్లలకు వైఎస్ఆర్ కిట్లు అందించడం జరుగుతుందని మేయర్  అక్కడికి హాజరైన  తల్లులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. అనితా, సి.డి.పి.ఓ. వెంకటరమణకుమారి తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-06 14:37:24

రేడియో సిటీఎఫ్ఎం కి ఐకాన్ అవార్డు..

విశాఖ లోని వివిధ వ్యాపార సంస్థలకు చెందిన వారికి శ్రోతలతో కాంటెస్ట్ నిర్వహించి వచ్చిన ఓట్ల ఆధారంగా రేడియో సిటీ ఐకాన్ అవార్డును నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ త్వరలో పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖను,  అభివృద్ధి చేయడంలో మీరంతా తోడ్పాటు అందించాలని,  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యాపార సంస్థల ప్రతినిధులు మేయర్ ఆలోచనలకు స్వాగతం పలికారు.  ఈ కార్యక్రమంలో రేడియో సిటీ ఆర్.జె. బాలు కుటుంబం మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-06 14:36:44

ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపిస్తాం..

ద్రవిడ యూనివర్సిటీ లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్నవారి సమస్యలను పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకుంటామని జాతీయ బిసి కమిషన్ మెంబర్ అచారి తల్లోజు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ద్రావిడ యూనివర్సిటీ నందు ఉద్యోగస్తులు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో  రెక్టార్ ఆచార్య సి హెచ్ ఏ.రాజేంద్ర ప్రసాద్,రిజిష్ర్టార్ ఆచార్య కె.వేణుగోపాల్ రెడ్డి, వర్సిటీ బిసి లైజనింగ్ అధికారి ఆచార్య  మస్తాన్, లతో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  ముందుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాసులు మాట్లాడుతూ ద్రావిడ యూనివర్సిటీ లో గత 22 సంవత్సరాలుగా అవుట్ సోర్స్ అటెండర్ గా  ఉద్యోగం చేస్తున్నను నాకు పర్మినెంట్ చేయాలని  కమిషన్ మెంబర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సి. ఆర్. మోహన్  మాట్లాడుతూ నేను రజక కులానికి చెందిన వాడని గత 22 సంవత్సరాలుగా అటెండర్ గా పని చేస్తున్నాను.నాకు అన్ని అర్హతలు వున్నాను నాకు పదోన్నతి కల్పించలేదని,  కోర్టుకు తిరిగి కోర్టు  ఆర్డర్ ఇచ్చినను నాకు ప్రమోషన్ ఇవ్వలేదని, నకిలీ కుల ధృవ పత్రాలతో  ఉద్యోగాలు పొంది ప్రమోషన్లు పొందుతున్నారని, ఇలాంటివి ద్రావిడ యూనివర్సిటీ లో చాలా అవినీతి జరుగుతుందని దీనిపై ఎవ్వరు పటించుకోలేదని, నాకు కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలని దరఖాస్తు ను కమిషన్ మెంబర్ కు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో మదీన వల్లి మాట్లాడుతూ ద్రావిడ యూనివర్సిటీ లో 267 మంది గత 24 సంవత్సరాల గా సలిశాలని జీతంతో అవుట్సోర్సింగ్ గా పనిచేస్తున్న  మా గురించి కుటుంబాల గురించి యూనివర్సిటీ విసి, రిజిస్టర్,రెక్టర్ ఏ ఒక్కరు కూడా మా సమస్యను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఇక్కడ 267 మంది అవుట్సోర్సింగ్ లో పని చేస్తుంటే అందులో 167 మంది బీసీ కులాల వారు ఉన్నారని, 54 మంది మహిళలు ఉన్నారని మాపై దయవుంచి మాకు తగిన న్యాయం చేయాలని కమిషన్ మెంబర్ కు విన్నవించుకున్నారు.  విసి  మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి మీ సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు. ఉద్యోగుల,విద్యార్థుల నుంచి అర్జీలు స్వకరించి వారి సమస్యలను విన్న తర్వాత   జాతీయ బిసి కమిషన్ మెంబర్ మాట్లాడుతూ అన్ని చోట్ల బిసిలకు అన్యాయం జరుగుతుందని,బిసిలు  ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్య ఉద్దేశంతో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ బిసి కమిషన్ ఏర్పాటు చేయడం అందులో భాగంగానే ఈ రెండు సంవత్సరాల్లో దేశంలోనే సుమారు 50 విశ్వవిద్యాలయాలను కమీషన్ మెంబర్లు  పరిశీలించి అక్కడ  ఉద్యోగస్తులు విద్యార్థులు జరుగుతున్న సమస్యలను తెలుసుకొని కొంతవరకు పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఉన్న అధికారలను  బిసి కమిషన్ కు ఇవ్వాలని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లగా   ప్రధానమంత్రి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్న అధికారాలను బిసి కమిషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. 

చదువుకున్న మేధావుల వద్దే  బిసిలకు అన్యాయం జరుగుతుంటే వారు ఎవరికి చెప్పుకోవాలన్నారు. ఈరోజు ద్రావిడ యూనివర్సిటీ లో ఉద్యోగస్తుల సమస్యలను విన్న తర్వాత నిజంగానే ఇక్కడి సమస్యలు ఉన్నాయని విసి గారు నాకు చెప్పటం జరిగిందని తెలిపారు. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఈ యూనివర్సిటీ లోనే 24 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ లో ఉద్యోగాలు చేస్తున్న సమస్యలను ఆగస్టు 15 తర్వాత ఢిల్లీలో  జాతీయ బిసి కమిషన్ చెర్మన్ అధ్యక్షత న సంబంధిత శాఖ మంత్రి యూనివర్సిటీ విసిలు, రిజిస్టర్లలు,సమస్యలు తో ఉన్న ఉద్యోగుల తో  సమావేశం నిర్వహించి  సమస్యలను పరిష్కారం చేయుటకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ద్రావిడ యూనివర్సిటీ లో జరుగుతున్న దానిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భారతదేశంలో రిజర్వేషన్లు ద్వారా ఎక్కువ లబ్ధి పొందిన రాష్ట్రం తమిళనాడు అని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీరామారావు వచ్చిన తర్వాత కొంత వరకు బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు.  ఉద్యోగాలలో బిసి లకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉన్నను దీన్ని ఎవరు పాటించడం లేదని తెలిపారు. ఈ కమిషన్ వచ్చిన తర్వాత కేంద్ర విద్యాలయం లో సైనిక పాఠశాలలో విద్యార్థులకు  రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ యూనివర్సిటీ  ఉద్యోగుల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Kuppam

2021-08-06 14:26:41

సంక్షేమ పథకాలపై అవగాహన ఉండాలి..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పధకాల పట్ల పూర్తి  అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . అరుణ్ బాబు సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు.  శుక్రవారం  పాత వెంకోజిపాలెం, రజక వీధి-1, దుర్గానగర్-1 సచివాలయాలను జాయింట్  కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ  సచివాలయంలో  పని చేస్తున్న సిబ్బంది  సంక్షేమ పధకాలను  పూర్తిగా తెలుసుకొని  లబ్దిదారులకు వివరించే విదంగా ఉండాలన్నారు. బయో మెట్రిక్ సమయ వేళలను పాటించాలన్నారు. సిబ్బంది  డ్రస్ కోడ్ నిబందనలను పాటించాలన్నారు.  స్పందనలో వచ్చిన ధరఖాస్తులను సంబందిత  కార్యాలయాలకు  నిర్ణీత సమయంలో  చేరే విదంగా చూడాలన్నారు. ప్రతి ఒక్కరు  కోవిడ్ నిబంధనలను  పాటించేలా  చర్యలు చేపడుతూ సామాజిక దూరాన్ని  పాటించాలన్నారు. రిజిష్టర్లను సక్రమంగా అమలు పర్చాలన్నారు. 
అర్బన్ హెల్త్ క్లినిక్ లను తనిఖీ చేసిన  జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పి .అరుణ్ బాబు చేపట్టిన ఆకస్మిక తనిఖీలో భాగంగా రజక వీధి , పాత వెంకోజిపాలెం, దుర్గానగర్ లకు సంబందించి అర్బన్ హెల్త్ క్లినిక్ల ను  ఆకస్మిక తనిఖీలు చేసి వ్యాక్సినేషన్ విదానాన్ని పరిశీలించారు.  వైద్య సిబ్బంది కోవిడ్ నిబంధనలను కచ్చితంగా  పాటించాలని  ఆదేశించారు. 45 సంవత్సరం లు దాటిన  ప్రతి ఒక్కరూ  వ్యాక్సినేషన్ వేసుకొనే విదంగాను అదే విదంగా  ఒక డోసు వేసుకున్నవాళ్లు రెండవ డోసు వేసుకొనే విదంగా  చర్యలు చేపట్టాలన్నారు. 

విశాఖ సిటీ

2021-08-06 14:22:57

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రికి ఘన స్వాగతం..

శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో రెండు రోజుల  పర్యటన నిమిత్తం  వచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి  నిర్మలా సీతారామన్ కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లబించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాద్,  ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ ఎస్ రావత్,  జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున, పార్లమెంట్ సభ్యులు  జి.వి.ఎల్ . నర్సింహరావు, బొడ్డేడ మాదవి, రామోహన్నాయుడు,  ఎం ఎల్ సి లు  పి.వి.ఎన్ .మాధవ్, సోము వీర్రాజు, కష్టమ్స్  చీఫ్ కమిషనర్ రమేష్, డి సి పి గౌతమ్ శాలిని, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ రంగయ్య,  ఆర్ డి ఓ పెంచల కిషోర్,  తదితరులు  కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. 

Visakhapatnam

2021-08-06 14:21:36

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం..

జాతీయ చేనేత దినోత్సవం ఈ నెల 7వ తేదీన అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 10.00 గంటలకు వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. చేనేతలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత ఎగ్జిబిషన్, ఉత్పత్తి ధరలకే అమ్మకాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా చీరాల, వేటపాలెం, అద్దంకి తదితర ప్రాంతాలలో చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కోవిడ్ పరిస్థితులలో చేనేతలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. నేత కార్మికులను ఆదుకోవడానికి ఈ నెల 7 నుంచి 18వ తేదీ వరకు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నేతన్నలను ఆదుకోవాలని ఆయన కోరారు.

ఒంగోలు

2021-08-06 14:15:35