1 ENS Live Breaking News

విజయనగరంలో కలెక్టరమ్మ మార్కు..

విజయనగరం జిల్లాలో కలెక్టరమ్మ సూర్యకుమారి మార్కు వైఎస్సార్ పెన్షన్ కానుకలోనే జిల్లాకి తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పించన్ల పంపిణీలో విజయనగరం జిల్లాను తొలిస్థానంలో నిలుచోబెట్టి అందరి ద్రుష్టినీ ఆకర్షించారు. కానీ ఇది కలెక్టరమ్మ మార్కు విజయంలో చాలా చిన్నఅంశం. ఏ పనిచేపట్టినా కలెక్టరమ్మ తనదైన భాణీలో  దూసుకు వెళుతుంటారు. ఈమె దుర్గగుడి ఈఓగా పనిచేసే కాలంలో కూడా ఎవరూ చేయని సంస్కరణలు చేపట్టి ప్రక్షాళన చేసిన తీరు రాష్ట్రం మొత్తం చూసింది. అదొక్కటే కాదు.. ఎక్కడ పనిచేసినా ఆ పనిలోనూ..అక్కడి ప్రగతిలోనూ కలెక్టరమ్మపేరే కనిపిస్తుంటుంది. హంగు ఆర్బాటాలు ఉండవు.. కానీ పనిమాత్రం అందరికంటే ముందుగా తొలిస్థానంలోనే ఉంటుంది. ఇలాంటి ఫస్ట్ మార్కు విజయాలు మరిన్ని విజయనగరం వాసులు, అధికారులు చూడబోతారనడంలో ఎలాంటి సందేహం లేదు..

Vizianagaram

2021-08-01 14:08:25

స్పంద‌న‌ ను స‌ద్వినియోగం చేసుకోవాలి..

రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఈ నెల 2వ తేదీన సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని  నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ తెలిపారు. ఈ మేర‌కు ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. క‌లెక్ట‌రేట్‌లోని స్పంద‌న హాల్‌లో ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి నిర్వహించే జిల్లాస్థాయి స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయన సూచించారు. స్పంద‌న కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి అర్జీల‌ను క‌లెక్ట‌ర్, జిల్లాస్థాయి ఉన్న‌తాధికారులు నేరుగా స్వీకరిస్తారని, సదరు అర్జీల సత్వర ప‌రిష్కారానికి తక్షణ చ‌ర్య‌లు తీసుకోవడం జరుగుతుందని క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

Kakinada

2021-08-01 13:49:27

కలెక్టరేట్ విభాగాలు తనిఖీ చేసిన కలెక్టర్..

మాన‌వ వ‌న‌రుల స‌మ‌ర్థ వినియోగం, విధుల నిర్వ‌హ‌ణ‌లో క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌మ‌య‌పాల‌నతో ప‌నిచేసేచోట మెరుగైన ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. శ‌నివారం జిల్లాకు కొత్త‌గా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన హ‌రికిర‌ణ్ ఆదివారం జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్‌లోని వివిధ విభాగాల‌ను సంద‌ర్శించారు. ఏ-హెచ్ సెక్ష‌న్ల‌ను సంద‌ర్శించి, ఆయా సెక్ష‌న్ల ప‌నితీరును త‌నిఖీ చేశారు. అదే విధంగా రికార్డు గ‌దులను ప‌రిశీలించి వాటి భ‌ద్ర‌త‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను సూచించారు. పెస్ట్ కంట్రోల్ చ‌ర్య‌ల‌తో పాటు అగ్ని ప్ర‌మాదాలు చోటుచేసుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఎన్నిక‌లు, ఈ-గ‌వ‌ర్నెన్స్‌, ఎన్ఐసీ, డ్వామా, ప్రణాళిక‌, వికాస, స్పంద‌న త‌దిత‌ర విభాగాల‌ను ప‌రిశీలించారు. క‌లెక్ట‌రేట్‌లో అధికారులు, సిబ్బంది ఖాళీలపై నివేదిక స‌మర్పించాల‌ని ఆదేశించారు. నైపుణ్య శిక్ష‌ణ‌కు స‌మాంత‌రంగా యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వికాస అధికారుల‌కు సూచించారు. క‌లెక్ట‌రేట్‌కు వ‌చ్చే వివిధ ర‌కాల ద‌ర‌ఖాస్తుల త‌క్ష‌ణ ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాలని క‌లెక్ట‌ర్ అధికారుల‌ను ఆదేశించారు.

Kakinada

2021-08-01 13:48:27

సమన్వయంతో పనులు పూర్తిచేయాలి..

సర్పంచులు, నాయకులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్.హెల్త్ క్లినిక్ లను పూర్తిచేయాలని సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కెశ్రీనివాసులు వెనుకబడిన 10 మండలాల పంచాయతిరాజ్ ఇంజినీర్లు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్లు,ఎం.పి.డి.ఓలు, తహశీల్దార్లును ఆదేశించారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్.బి.కె, పంచాయతీ భవనాలు, హెల్త్ క్లినిక్ నిర్మాణాలపై సమీకా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  జె.సి మాట్లాడుతూ జిల్లాలో  చేపడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు నిర్మాణాలో సోంపేట, ఆమదాలవలస, వీరఘట్టం, నందిగాం, జలుమూరు,మెలియాపుట్టి,కవిటి,కంచిలి,ఇచ్చాపురం మరియు పొందూరు మండలాలు పురోగతిలో చివరి స్థానంలో ఉన్నాయన్నారు. ఈ పది మండలాలు కేవలం 29.82 శాతం మాత్రమే నిధులు ఖర్చుచేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.నిర్మాణాలలో స్థానికంగా తలెత్తిన ఇబ్బందులను అధిగమించి త్వరితగతిన నిర్మాణాలను పూర్తిచేయాలని కోరారు. రానున్న వారం రోజుల్లో ఆయా మండలాల్లోని పనులు పూర్తిచేసి మొదటి స్థానంలోకి రావాలని కోరారు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తే సర్పంచులు, స్థానిక నాయకులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని కోరారు.

 అలాగే ప్రభుత్వం తరపున తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జె.సి.హామీ ఇచ్చారు.  నిర్మాణ స్థలాలన్ని జియో ట్యాగింగ్ అయినందున ప్రభుత్వం నిర్ణయించిన స్థలంలో నిర్మాణాలు పూర్తిచేయా ల్సిందేనని, ఇందులో ఎటువంటి ఒత్తిడిలకు గురికావద్దని జె.సి తెలిపారు. అలాగే నిర్మాణాలలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు,ఏజన్సీలకు బిల్లులు చెల్లింపులు జరగలేదని కొన్నిచోట్ల నిర్మాణాలు నిలిపివేయడం జరిగిందని, వారి బిల్లులు ఆన్ లైన్ నందు నమోదు చేయకపోవడంతో బిల్లులు చెల్లింపులు జరగలేదని జె.సి తెలిపారు. కాంట్రాక్టర్లు, ఏజెన్సీ లను  చైతన్యపరచి ఇంతవరకు ఖర్చు చేసిన నిధులకు చెందిన బిల్లులను తక్షణమే ఆన్ లైన్ నందు నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని జె.సి తేల్చిచెప్పారు. అలాగే ఏ రోజు జరిగిన పనులు ఆరోజే ఆన్ లైన్ నందు నమోదు చేయాలని  చెప్పారు. అధికారులు ప్రతి రోజు దిన చర్యగా ఆన్ లైన్ నందు స్థానాన్ని పరిశీలించు కొని, మిగిలిన ప్రాంతాలతో పోల్చి చూసుకొని చేపట్టాల్సిన పనులు గురించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తద్వారా త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రథమ స్థానానికి రావాలని జె.సి ఆకాక్షించారు. ఈ సమావేశంలో   పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీర్ గుర్రం బ్రహ్మయ్య, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా నీటియాజ మాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మనాథ్,మండలాల పంచాయతిరాజ్ ఇంజినీర్లు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్లు,ఎం.పి.డి.ఓలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-01 12:56:33

క్రిష్ణా వరదనీటి ఉదృతిని ఎదుర్కోవాలి..

నాగర్జునసాగర్ ప్రాజెక్టు నుండి భారీ మొత్తంలో నీటి విడుదల కారణంగా కృష్ణానదిలో వరదనీటి ఉదృతి పెరగనున్న నేపథ్యంలో జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల గ్రామాలలో, లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడకుండా అవసరమైన సహాయకచర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నది పరివాహక ప్రాంతాల్లోని ముంపు గ్రామాలు, లోతట్టు గ్రామాలలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి తో కలిసి రెవెన్యూ, పంచాయితీ, వ్యవసాయ, పశుసంవర్థక, ఇరిగేషన్, విద్యుత్, వైద్య,ఆరోగ్యశాఖ, పోలీస్ అధికారులతో టెలికాన్ఫర్ ద్వారా ఆదివారం మధ్యాహ్నానం సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదిలో వరదనీటి ఉధృతి పెరుగుతుందని ఆదివారం అర్ధరాత్రి కి ఐదులక్షల క్యూసెక్యుల వరద నీరు నాగర్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలే అవకాశం ఉందన్నారు. నాగర్జునసాగర్ నుంచి విడుదలైన వరద నీరు పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మీదుగా ప్రవహిస్తున్నందున కృష్ణానదికి సమీపంలో గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో మాచర్ల, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, రెంటచింతల, మాచవరం, గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో అచ్చంపేట, బెల్లంకొండ, అమరావతి, తుళ్ళూరు, తాడేపల్లి,  తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపర, బట్టిప్రోలు, రేపల్లే మండలాలోని గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందన్నారు. 

వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లు, మండల, డివిజన్ స్థాయిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.   వరద నీటి ముంపుపై సంబంధిత గ్రామ ప్రజలను, స్థానిక ప్రజాప్రతినిధులను ముందస్తుగా అలెర్టు చేయాలన్నారు.   కృష్ణానదికి సమీపంలో ఉన్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాలలోకి వరదనీరు చేరే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు.  కృష్ణానది వరద నీటి ఉధృతికి కరకట్టకు గతంలో గండ్లు పడిన ప్రాంతాలను  ఇరిగేషన్, పంచాయితీ, రెవెన్యూ,పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి నిరంతరం పర్యవేక్షించాలని, గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ముందు జాగ్రత్త చర్యలలో బాగంగా బలోపేతం చేయాలని, గండ్లు పడిన వెంటనే పూడ్చేందుకు అవసరమైన ఇసుక సంచులు ఇతర సామగ్రి కూలీలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. కృష్ణానదిలో వరద నీటి ఉధృతి కొనసాగుతున్నందున చేపలు పట్టేవారిని, ఈతకు వెళ్ళేవారిని, పశువులను మేపే వారిని నది వైపుకు వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు, లోతట్టు గ్రామాల వారికి  పంపిణీ కోసం అవసరం మేరకు నిత్యావసర సరుకులు సిద్దం చేయాలన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాలలోని పంట పొలాల సశ్యరక్షణ చర్యలకు వ్యవసాయం అధికారులు ప్రణాళికలు ముందుగానే రూపొందించాలన్నారు. 

గ్రామాల్లో వరద నీటి వలన పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడకుండా పంచాయితీ అధికారులు ముందస్తుగా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలన్నారు. లోతట్టు, ముంపు గ్రామాలలో వరద నీరు చేరితే వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు అవసరమైన పడవలను మత్య్స శాఖ అధికారులు సిద్దంగా ఉంచుకోవాలన్నారు. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు ముంపు, లోతట్టు గ్రామాల పునరావాస కేంద్రాల వద్ద ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను, సమీపంలోని పీహెచ్సీలలో అత్యవసర వైద్యసేవలను అందించేందుకు వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు. నాగర్జునసాగర్ నుంచి, పులిచింతల ప్రాజెక్టు నుంచి, ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రవహిస్తున్న వరదనీటి వివరాలను, కృష్ణానది పై ప్రకటిస్తున్న ప్రమాద హెచ్చరికలను ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు రియల్టైంలో జిల్లా అధికారులకు అందించాలన్నారు. వరదనీటి ప్రవాహం పై జిల్లా కేంద్రం నుంచి అందుతున్న సూచనలను గ్రామ స్థాయిలోని ప్రజలకు నిరంతరం చేరేవేసేందుకు సచివాలయ, రైతు భరోసా కేంద్రం ఉద్యోగులు, వాలంటీర్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విపత్కర పరిస్థితులలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో కృష్ణానది వరద నీటి ఉధృతి వలన ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై డివిజన్ స్థాయిలోని అధికారులు మండల, గ్రామ స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన ముందస్తు ప్రణాళికలు పక్కాగా రూపొందించి అమలు చేయాలన్నారు.

సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ వరదనీటి ఉధృతిని పర్యవేక్షించే ముంపు, లోతట్టు మండలాల అధికారులకు నిరంతరం  సమాచారం అందించేందుకు జిల్లా స్థాయిలో కలెక్టరేట్లోను, గుంటూరు, గురజాల, తెనాలి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోను ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. వరద నీటి వలన తొలుత మునిగిపోయే గ్రామాలను ముందస్తుగానే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ముంపు గ్రామాలకు అవసరమైన నిత్యావసర సరుకులను సమీపంలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో సిద్ధంగా ఉంచుకోవాలని సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులకు సూచిచటం జరిగిందన్నారు.

సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి మాట్లాడుతూ కృష్ణానది ఎగువ, దిగువ ప్రాంతాల్లోని ముంపు గ్రామాల్లోని సచివాలయ సిబ్బంది కృష్ణానదిలో  వరదనీటి ఉధృతి తగ్గేవరకు సచివాలయ ఉద్యోగులు 24 గంటలు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు. నీరు ప్రవహించే లో లెవల్ కల్వర్టుల వద్ద ప్రజలు రాకపోకలు లేకుండా పోలీస్, పంచాయితీ ఇంజనీరింగ్ అధికారులతో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యవసర వైద్యసేవలకు అనుగుణంగా అవసరమైన మందులను వెద్యారోగ్యశాఖ అధికారులు సిద్ధంగా ఉంచుకొన్నారన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ బాబురావు, నాగర్జున సాగర్ కెనాల్ ఎస్ఈ గంగరాజు, పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ రమేష్ బాబు, కృష్ణారివర్ కన్జర్వేటర్ ఈఈ స్వరూప్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పంచాయితీ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-08-01 12:54:39

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాలి..

కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, అందుబాటులో ఉన్న డోసులు ఆధారంగా స‌చివాల‌యాల వారీగా ల‌బ్ధిదారుల‌ను గుర్తించి టీకా పంపిణీ చేయాల‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ అధికారుల‌ను ఆదేశించారు. ఆదివారం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్‌లో జిల్లా వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో స‌మావేశ‌మైన క‌లెక్ట‌ర్‌.. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వైర‌స్ వ్యాప్తి ప‌రిస్థితి, వైర‌స్ క‌ట్ట‌డి కార్యాచ‌ర‌ణ‌, ఆసుప‌త్రుల్లో వ‌స‌తుల క‌ల్ప‌న ప‌రంగా లోపాల‌ను స‌వ‌రించి అభివృద్ధికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, వ్యాక్సినేష‌న్‌, మూడో వేవ్ స‌న్న‌ద్ధ‌త‌పై స‌మీక్షించారు. తొలుత జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి.. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ‌, గిరిజ‌న ప్రాంతాల్లో న‌మోద‌వుతున్న కేసులు; డివిజ‌న్ల వారీగా పాజిటివిటీ ట్రెండ్‌, కోవిడ్ కేసుల మేనేజ్‌మెంట్‌, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌, మూడో వేవ్ స‌న్న‌ద్ధ‌త కార్యాచ‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా గ‌త నెల 26న జిల్లా వ్యాప్తంగా చేప‌ట్టిన మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ద్వారా రాష్ట్రంలోనే అత్య‌ధికంగా ఒక్క‌రోజులోనే 1,91,850 డోసుల‌ను పంపిణీ చేసిన‌ట్లు వివ‌రించారు. కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న స‌మ‌యంలో రోజుకు ప‌దివేల వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, ప్ర‌స్తుతం రోజుకు ఆరువేల వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. మూడో వేవ్ ముప్పు హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఆసుప‌త్రుల్లో ప్ర‌త్యేకంగా పీడియాట్రిక్ ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేస్తుండ‌టంతో పాటు ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు అమ‌లాపురం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోనూ వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ప్ర‌ణాళిక‌ను అమ‌లుచేస్తున్న‌ట్లు జేసీ (డీ) వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ మాట్లాడుతూ టీకా డోసుల ల‌భ్య‌త‌నుబ‌ట్టి వీలైనంత త్వ‌ర‌గా 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి వ్యాక్సినేష‌న్ పూర్తిచేయాల‌ని.. రెండుమూడురోజుల్లో 90 శాతం ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని ఆదేశించారు. తొలుత రెండోడోసు ల‌బ్ధిదారుల‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని, అనంత‌రం మొద‌టి డోసు పంపిణీ చేయాల‌న్నారు. జ‌నాభాకు అనుగుణంగా పీహెచ్‌సీల వారీగా టెస్టింగ్‌కు సంబంధించి శాంపిల్ సేక‌ర‌ణ ల‌క్ష్యాల‌ను నిర్దేశించి, వాటిని చేరుకునేలా ప్రోగ్రామింగ్ అధికారులు చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ల‌క్ష్యాల‌ను చేరుకున్న‌, చేరుకోని పీహెచ్‌సీల నివేదిక‌ల‌ను (exception report) ఎప్ప‌టిక‌ప్పుడు పంపాల‌ని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియను అంతా ఒకే గొడుకు కింద‌కు తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పాజిటివ్ కేసుల కంటైన్‌మెంట్ విష‌యంపై దృష్టిసారించాల‌ని.. ప్ర‌స్తుతం పాజిటివిటీని దృష్టిలో ఉంచుకొని ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ జాగ్ర‌త్త‌లు, నిబంధ‌న‌ల‌ను పాటించేలా చూడాలన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉల్లంఘ‌న జ‌ర‌క్కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకు పోలీసు శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు.
మూడో వేవ్ స‌న్న‌ద్ధ‌త‌లో భాగంగా ఆసుప‌త్రుల్లో ఏర్పాటుచేస్తున్న ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉండేలా చూడాల‌ని, ప్ర‌తి ప‌డ‌క వ‌ద్ద ప్రెజ‌ర్ అబ్జ‌ర్వేష‌న్‌కు ఏర్పాట్లు చేయాల‌న్నారు. ప్ర‌స్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న దాదాపు 1400 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల ప‌నితీరును ప‌రిశీలించి, ఏవైనా మ‌ర‌మ్మ‌తులు అవ‌స‌ర‌మైతే వెంట‌నే చేయాల‌న్నారు. ఆక్సిజ‌న్ పీఎస్ఏ ప్లాంట్లు, లిక్విడ్ మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ట్యాంకుల స‌మ‌ర్థ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌న్నారు. కోవిడ్ ఆసుప‌త్రుల‌పై ఒత్తిడిని త‌గ్గించేందుకు వీలుగా ట్రాన్సిట్ ఆసుప‌త్రుల ఏర్పాటుపై ప‌రిశీల‌న చేయాల‌న్నారు. ప్ర‌ధానంగా కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, అమ‌లాపురం, రాజోలు త‌దిత‌ర ప్రాంతాల నుంచి విదేశాల‌కు రాక‌పోక‌లు సాగించే వారిపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించి వీసా వ్యాలిడిటీ ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాల‌క్ష్మి, ఇన్‌చార్జ్ డీఎస్‌వో డా. నాగ‌భూష‌ణం, డీసీహెచ్ఎస్ డా. ర‌మేష్ కిశోర్‌, కాకినాడ ల్యాబ్ ఉన్న‌తాధికారి డా. మూర్తి, డీఐవో డా. భ‌ర‌తల‌క్ష్మి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-08-01 12:37:57

తెలుగు అకాడమిని త్వరలోనే ఉద్ధరింస్తాం..

రాష్ట్ర తెలుగు అకాడమిని ఉద్దరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర తెలుగు అకాడమీ అధ్యక్షులు డా. నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలుగు అకాడమీ అధ్యక్షులు గురుగుబెల్లి లోకనాథం రచించిన గులోనా గుళికలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. తెలుగును బ్రతికించుటకు సంస్కృతాన్ని అకాడమీలో చేర్చారని చెప్పారు. తెలుగు ప్రాకృతంలో పుట్టిందని, పాళీ భాషలో అమరిందని అనేక భాషలను తనలో చేర్చుకుంటూ భాషలలో ప్రత్యేక భాషగా ఉద్భవించిందని ఆమె వివరించారు. ఉపనిషత్తుల ద్వారా సంస్కృతం దేవ భాషగా మారిందని, తెలుగు భాష సంస్కృతాన్ని ఇమిడించుకుందనీ ఆయన చెప్పారు. రెండు భాషలు లీనమైపోయాయని ఆమె తెలిపారు. భాష నిరంతర ప్రవాహం అన్నారు.సంస్కృతులు, సంప్రదాయాలు కలుపుకొని సాగే గుణం తెలుగు భాషకు ఉందనీ చెప్పారు. విశాలతత్వం తెలుగు భాషకు ఉందనీ ఆమె తెలిపారు. రాష్ట్రంలో పేదల కోసం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని అయితే తెలుగు విధిగా నేర్చుకోవాలని ఆమె పేర్కొన్నారు.నాసా సంస్కృతానికి పెద్ద పీట వేసిందని అన్నారు. గులోనా గుళికలు వ్యాస సంపుటి ఎంతో చక్కని, సమాజానికి  ఉపయోగడే అంశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్య అతిథి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రచనలు తరతరాలకు సూచికగా నిలుస్తాయన్నారు. సమాజాన్నిరచయితలు సంస్కరించాలని పిలుపునిచ్చారు. రచయితలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. రచనల ముద్రణకు తెలుగు అకాడమి ప్రయత్నించాలని సూచించారు. రచయితలకు మంచి స్థానం కల్పించాలని పేర్కొంటూ గులోన మరిన్ని రచనలు చేయాలని ఆకాక్షించారు. 

గులోనా గుళికలు రచయిత గురుగుబెల్లి లోకనాథం మాట్లాడుతూ సమాజంలో జరుగతున్న సంఘటనల సంపుటి ఈ రచన అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ హెచ్. లజపతిరాయ్, పాత్రికేయులు నల్లి ధర్మారావు, రచయిత అట్టాడ అప్పలనాయుడు, వైద్యులు దానేటి శ్రీధర్,  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-01 12:33:34

అప్పన్నకు రూ. 50వేలు విరాళం..

విశాఖఓల్డ్ డైరీ ఫారం (వెట్నరీ కాలనీ)కి చెందిన దుప్పల రామన్న సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(అప్పన్న) స్వామివారికి  50,000 (యాభై వేల రూపాయల) విరాళం అందించారు. తన పుట్టినరోజైన డిసెంబర్ 12వ తేదీన స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని కోరారు.   ఈ మేరకు ఇరువురూ పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల కౌంటర్లో చెక్ లు అందించారు. ఈ సందర్భంగా స్వామికి పూజలు చేసిన దాతలు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దేవస్థాన సిబ్బంది ప్రసాదాలు అందజేయగా, అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Simhachalam

2021-07-31 17:22:36

అప్పన్నకు రూ.1,00,116 విరాళం..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(అప్పన్న) స్వామివారికి  మధురవాడకు చెందిన  బండారు వెంకట రమణమ్మ లక్షా నూట పదహారు రూపాయలు ( రూ.1,00,116) విరాళమిచ్చారు. తన భర్త వర్ధంతి రోజైన సెప్టెంబర్16న స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని కోరారు. అనంతరం వారికి దేవస్థాన అధికారులు స్వామివారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా స్వామికి పూజలు చేసిన దాతలు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దేవస్థాన సిబ్బంది ప్రసాదాలు అందజేయగా, అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Simhachalam

2021-07-31 17:21:53

ఆర్డీగా డా.పతివాడ సూర్యానారాయణ..

విశాఖజిల్లా ప్రాంతీయ ఆరోగ్య సంచాలకులుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పతివాడ సూర్యనారాయణను ఇన్చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆర్డీగా వున్న డా.జి.సావిత్రి ఉద్యోగవిరణ చేయడంతో ఆ బాధ్యతలను ప్రభుత్వం డిఎంహెచ్ఓ కి అప్పగించింది. ఈమేరకు శనివారం సాయంత్రం ఆయన ఆర్డీగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా విధినిర్వహణ చేపడతానని చెప్పారు. ఆర్డీ పరిధిలోని అధికారులు, సిబ్బందితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి దిశ నిర్దేశం చేస్తామన్నారు.


Visakhapatnam

2021-07-31 16:47:20

5కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం..

ఆగష్టు 5న నిర్వహించనున్న జగన్న పచ్చతోరణం కార్యక్రమం క్రింద జిల్లాలో కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో జరపాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి  తెలిపారు.  శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో వన మహాత్సవంపై సమావేశం నిర్వహించారు.  ఆగష్టు 5న దాసన్నపేట హైస్కూలులో ప్రారంబోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ముందుగానే గోతులు తవ్వి ఆప్రాంతాన్ని సిద్దంగా వుంచాలని ఆదేశించారు.   జగన్న పచ్చతోరణంలో భాగంగా జగన్న కాలనీలలో, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, గ్రామ సచివాలయాలలో,రైతు బరోసా కేంద్రాలలో, ప్రభుత్వ, ప్రైవేట్  సంస్థల వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు.  మొక్కలకు అవసరమగు గోతులను ముందుగా తవ్వి సిద్దం చేసుకోవాలన్నారు.    వీలువున్నంతవరకు పండ్ల మొక్కలకు ప్రాధాన్యత  యివ్వాలన్నారు.  నాటిన ప్రతీ మొక్క  బ్రతికేలా నీటి వనరులను, ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు.   ప్రతీ మున్సిపాలిటీల్లో, ఇళ్ల ముందు, వీధిలలో, ఖాళీగా వున్న ప్రతీ చోట మొక్కలను నాటాలన్నారు.  విద్యా శాఖ, ఆర్ అండ్ బి, జాతీయ రహదారులు, డ్వామా, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, మార్కెటింగ్, హౌసింగ్, పరిశ్రమలు, పేపరు మిల్లులు, మున్సిపల్ తదితర శాఖలకు లక్ష్యాలను నిర్ణయించారు. 
    ఈ సమావేశంలో  సంయుక్త కలెక్టర్లు  డా.జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, డిఆర్ఓ గణపతిరావు, జిల్లా అటవీ అధికారి సచిన్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ జె.ఎస్.వర్మ, పంచాయితీరాజ్ ఇఇ విజయ్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి, నేషనల్ హైవే ప్రోజెక్టు డైరెక్టు, అటవీ శాఖ రేంజర్లు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-31 16:38:42

పటిష్ట ప్రణాళికతో అభివ్రుద్ధిలో అగ్రస్థానం..

మంచి ప్రణాళికలు పటిష్టంగా అమలు చేసి లక్ష్య సాధనలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ వివిధ శాఖల జిల్లా అధికారులను కోరారు.   శనివారం మద్యాహ్నం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించి జిల్లా స్థాయిలో ఆయా శాఖల పరమైన వ్యవస్థలను, వాటి కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది పనితీరు, సమర్థతకు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉందని, దానికి తగిన రీతిలో అందరూ దక్షతతో పనిచేసి అన్ని అంశాలలో జిల్లాను ముందు నిలపాలని కోరారు.  జిల్లా అధికారులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాని, శాఖల పరమైన అత్యవసరమైన ఏ విషయానైనా నేరుగా తనతో మాట్లాడ వచ్చునని తెలియజేశారు.  ఏ కారణం చేతైనా తాను ఫోన్ కు అందుకోలేక పోతో వాట్సాప్ సందేశం ద్వారా సమాచారం తెలియజేయాలని.  సాధారణ  ఫైళ్లను తప్పని సరిగా తమ తమ శాఖలను పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్ ద్వారా తనకు పంపాలన్నారు.  పనులు, ఫైళ్లను చివరి నిమిషం దాకా నాన్చవద్దని, ప్రతి అంశాన్ని ముందస్తు సంసిద్దతో ప్రణాళికాబద్దంగా నిర్వర్తించాలని సూచించారు.   ముఖ్యంగా కోర్టు కేసుల అంశంలో సకాలం కౌంటర్లు దాఖలు చేయాలని, కౌంటర్లు దాఖలు చేయని కారణంగా కంటెంప్ట్ అఫ్ కోర్టు  ఎదురైతే  అందుకు సదరు శాఖల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన తెలిపారు.  ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను విజయవంతం చేయాలని, వారికి తగిన ప్రొటోకాల్ మర్యాదలను ఖచ్చితంగా పాటించాలని కోరారు.   జిల్లా అగ్ర స్థానంలో నిలిచిన అంశాలలో సంబంధిత శాఖల అధికారులను అభినందిస్తూ అన్ని శాఖలు ఇదే స్పూర్తితో  పని చేయాలని ఆయన ఆధికారులను కోరారు. 
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆర్) డా.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (హెచ్) ఎ.భార్గవ్ తేజ, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2021-07-31 16:26:30

కలెక్టర్ గా చేరడం సంతోషంగా ఉంది..

మెట్ట‌, డెల్టా, అట‌వీ, తీర‌ప్రాంతాల‌తో భౌగోళిక వైవిధ్య‌మున్న అంద‌మైన తూర్పుగోదావ‌రి జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా రావ‌డం ఎంతో సంతోషంగా ఉందని.. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల ముంగిట‌కు తీసుకెళ్లేందుకు కృషిచేయ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ చేవూరి హ‌రికిర‌ణ్ అన్నారు. శుక్ర‌వారం రాత్రి జిల్లాకు చేరుకున్న హ‌రికిర‌ణ్ శ‌నివారం వేద పండితుల ఆశీర్వ‌చ‌నాల మ‌ధ్య క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చ‌ట్టం ప‌రిధిలో కారుణ్య నియామ‌కానికి సంబంధించిన ఓ ద‌స్త్రంపై తొలి సంత‌కం చేశారు. జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (హౌసింగ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌, ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ), డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ త‌దిత‌రులు కొత్త క‌లెక్ట‌ర్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అనంత‌రం స్పంద‌న హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ ఎస్‌సీ, ఎస్‌టీలు, రైతులు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త రెండేళ్లుగా అమ‌లుచేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ల‌బ్ధిదారుల‌కు చేరువ చేసేందుకు కృషిచేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. త‌న‌పై నమ్మకం ఉంచి జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా నియ‌మించినందుకు  ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రైతు భ‌రోసా, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు, స‌చివాల‌య వ్య‌వ‌స్థ సేవ‌లు త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌ర్థ‌వంతంంగా అమ‌లుచేస్తూ జిల్లాను ముందు వ‌రుస‌లో నిలిపేందుకు కృషిచేయ‌నున్న‌ట్లు తెలిపారు. 

జిల్లాలో అనుభ‌వ‌జ్ఞులైన అధికారుల బృందం ఉంద‌ని, ఐఏఎస్‌లు ఉన్నార‌ని.. రెవెన్యూ, పోలీస్ త‌దిత‌ర అన్ని శాఖ‌లతో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ జిల్లాను అగ్ర‌స్థానంలో నిలిపేందుకు కృషిచేస్తామ‌న్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు.. ఇలా అందరి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ మీడియా వార‌ధిగా అంద‌రి స‌హ‌కారంతో ప్రజా సంక్షేమం ల‌క్ష్యంగా విధులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. 2011లో భ‌ద్రాచ‌లంలో స‌బ్ క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన స‌మ‌యంలో ప్ర‌స్తుతం జిల్లాలోని విలీన మండ‌లాల‌పై అవ‌గాహ‌న ఉంద‌న్నారు. బాల్య జీవితంలోని కొంత స‌మ‌యం జిల్లాతో ముడిప‌డి ఉంద‌ని.. ఇలాంటి జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా రావ‌డం అదృష్ట‌మ‌ని పేర్కొన్నారు. అందమైన తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌ర్యాట‌క విధానానికి అనుగుణంగా అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కోవిడ్ మూడో వేవ్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో వైర‌స్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల‌కు కీల‌క‌మైన కాకినాడ జీజీహెచ్ అభివృద్ధికి కృషిచేయ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు.
 
మీడియా స‌మావేశం అనంత‌రం జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ చేవూరి హ‌రికిర‌ణ్ క‌లెక్ట‌రేట్‌లోని మ‌హాత్మా గాంధీ విగ్ర‌హానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. కార్య‌క్ర‌మంలో రాజమహేంద్రవరం కమిషనర్ అభిషిక్త్ కిషోర్,  అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌; రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, రంప‌చోడ‌వ‌రం స‌బ్ క‌లెక్ట‌ర్లు ఇలాక్కియా, క‌ట్టా సింహాచ‌లం; ర‌ంప‌చోడ‌వ‌రం, చింతూరు ఐటీడీఏ పీవోలు సీవీ ప్ర‌వీణ్ ఆదిత్య‌, వెంకట  ర‌మ‌ణ‌; కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, రామచంద్రాపురం ఆర్‌డీవో సింధు సుబ్ర‌హ్మ‌ణ్యం, క‌లెక్ట‌రేట్ అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు తదిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-31 16:23:36

తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష..

విశాపట్నం జిల్లావ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పతివాడ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆగష్ట్ 1 నుండి 7వ తేది వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తల్లి పాలు ఇవ్వటాన్ని ప్రోత్సహించండి – ఇది మనందరి బాధ్యత అనే నినాదంతో ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. సాదారణ ,  సి –సెక్షన్ డెలివరీ రెండింటిలోనూ  డెలివరీ అయిన ఒక గంటలోపు తల్లి తమ బిడ్డకు తప్పకుండా పాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది తల్లికి బిడ్డకు ఆరోగ్యకరమని ఆయన చెప్పారు. తల్లి పాల వారోత్సవాలలో ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన వివరించారు.  గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరింత అవగాహన కల్పించనున్నట్టు డిఎంహెచ్ఓ వివరించారు.

Visakhapatnam

2021-07-31 15:59:45

దిశ యాప్ ప్రతీమహిళా డౌన్లోడ్ చేయాలి..

“దిశ” యాప్ ను ప్రతి ఒక్క మహిళ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని జవిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. శనివారం విశాఖ బీచ్ రోడ్లో పోలీస్ శాఖ వారు ఏర్పాటుచేసిన “దిశ” యాప్ కోసం మహిళలకు అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలపై ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, దానిని అరికట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి “దిశ” చట్టాన్ని తీసుకొచ్చారని, మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అన్నగా నిలబడ్డారని మేయర్ తెలిపారు. ఈ “దిశ” యాప్ గురించి పూర్తి వివరాలు ప్రతి సచివాలయంలోని మహిళా పోలీసుల వద్ద ఉన్నాయని కావున, ప్రతి ఒక్క మహిళ, కాలేజీ విద్యార్థులు మొదలైనవారు ఈ “దిశ” యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ తరుపున డిసిపి శాలి గౌతమ్, ఎసిపి(దిశ) డా. ప్రేమ్ కుమార్, టౌన్  సిఐ ఈశ్వర రావు “దిశ” చట్టం ఉపయోగం గురుంచి మహిళలకు అవగాహన కల్పించారు.    

Visakhapatnam

2021-07-31 15:54:33