1 ENS Live Breaking News

మాతా శిసు మరణాలు పూర్తిగా తగ్గించాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వైద్యారోగ్య‌శాఖ సేవ‌ల‌ను మ‌రింత మెరుగుప‌ర్చాల‌ని వైద్యాధి కారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. వైద్యారోగ్య‌శాఖపై త‌న ఛాంబ‌ర్‌లో శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్షించారు. శాఖా పరంగా అందిస్తున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. జిల్లాలో పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, బ్ల‌డ్ బ్యాంకులు, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లు ద్వారా అందుతున్న సేవ‌ల‌ను తెలుసుకున్నారు. ముఖ్యంగా గిరిజ‌నుల‌కు, మ‌హిళ‌ల‌కు అందిస్తున్న వైద్య సేవ‌ల‌పై ప్ర‌శ్నించారు. ఆసుప‌త్రుల ప‌నితీరు, స‌దుపాయాలు, మందులు, వైద్యులు,  సిబ్బంది ల‌భ్య‌త‌ను తెలుసుకున్నారు. ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణ‌ప‌నుల‌పై ప్ర‌శ్నించారు.  జిల్లాలో మ‌లేరియా వ్యాప్తి, చికెన్ గున్యా, ఇత‌ర సీజ‌నల్ వ్యాధుల‌పైనా ఆరా తీశారు.  జిల్లాలో మాతృ, శిశు మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. దీనికోసం స్త్రీశిశు సంక్షేమ‌శాఖ‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించారు. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో ఆశా కార్య‌క‌ర్త‌లు, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఉండేలా చూడాల‌న్నారు.  కోవిడ్ నియంత్ర‌ణ‌పై చ‌ర్చించారు. టెస్టులు, కోవిడ్ ఆసుప‌త్రులు, ప‌డ‌క‌లు, ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా, వేక్సినేష‌న్‌, మందులు,  స‌దుపాయ‌ల‌ను తెలుసుకున్నారు.  అన్నివిధాలా ఆసుప‌త్రుల‌ను సంసిద్దంగా ఉంచాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

                  ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, డిఐఓ డాక్ట‌ర్ గోపాల‌కృష్ణ‌, కేంద్రాసుప‌త్రి సూప‌రింటిండెంట్ డాక్ట‌ర్ సీతారామ‌రాజు, ఎపిఎంఐడిసి ఇఇ ఎం.స‌త్య‌ప్ర‌భాక‌ర్ త‌దిత‌ర అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం

2021-07-30 15:57:11

శ్రీ సత్యదేవ నీ సమాచారం ఎక్కడ..?

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట స్వామివారి దేవస్థానానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం బాహ్య ప్రపంచానికి తెలియడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అంత స్థాయిలో ఇక్కడ సత్యేదేవుడిని కూడా భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. పైగా నేషనల్ హైవేకి దగ్గరగా ఉండటం, స్వామివారి ఆలయం మీదుగానే అన్ని వాహనాలు వెళ్లడం అందరికీ కలిసొచ్చే అంశం. ఎలా చూసినా స్వామివారు భక్తులకు చాలా దగ్గరగా ఉంటారు. ఇంతవరకూ బాగానే వున్నా స్వామివారికి చెందిన ముఖ్య సమాచారం దేవస్థాన అధికారులు బయటకు చెప్పడం లేదు. ఇక్కడ దేవస్థానానికి అధికారిక పీఆర్వోఓ(పత్రికా సంబంధాల అధికారి) లేకపోవడం.. ఇక్కడ పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ కి ఈ బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించడంతో స్వామి సమాచారం బయటకు రావడం లేదు. వాస్తవానికి శ్రీ సత్యదేవుని ఆలయంలో విశేషమై పూజలు, ముఖ్యపర్వదినాల్లో దర్శనాలు, కార్యక్రమాలు, ఆలయ అభివ్రుద్ధి, ప్రముఖుల సందర్శన, స్వామికి వారికి చెందిన పూజలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం, అన్నింటికంటే మించి కానుకల సమర్పణ, విరాళాలు, దాతలు ఎవరైనా ముందుకి వచ్చి ఏమైనా సహాయం అందించాలన్నా ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి. దీనితో స్వామివారికి చాలా ఆదాయం చేరకుండా పోతుంది. చిన్న చిన్న దేవస్థానాలు సైతం ఆలయాల్లో ప్రత్యేకంగా పీఆర్వోలను ఏర్పాటు చేసుకొని స్వామి వైభవాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఆదాయాన్ని, దాతల నుంచి సహాయాన్ని ఆర్జిస్తున్నారు. పెద్ద పెద్ద దాతల సహాయంతో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. 

విచిత్రంగా అన్నవరం దేవస్థానంలో మాత్రం వీటికి విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ కొండపై బెదిరించేవారిదే రాజ్యం. అలాంటి వారికే దేవస్థాన అధికారులు కూడా సమాచారం తెలియజేస్తారనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. చిన్న ఉదాహరణ తీసుకుంటే ఇటీవల తూర్పుగోదావరి జిల్లాకే చెందిన ఒక బియ్యం వ్యాపారి కోట్ల రూపాయలు ఖర్చుచేసి పేదలకు ఉచితంగా వివాహాలు జరిపించడానికి ఒక పెద్ద కళ్యాణ మండపాన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆ విషయాన్ని దేవస్థాన అధికారులు ఒక వర్గం మీడియాకి మాత్రమే అందించారు. సత్యదేవుని రత్నగిరి కొండపై పెళ్లిళ్లు చేసుకుంటే వారి జీవితాలు బాగుంటాయనేది ఏన్నోఏళ్లుగా ప్రజలు నమ్ముతూ వస్తున్నారు. అలాంటి నిరుపేద ప్రజల కోసం కొండపై ఏ తరహా వసతులు ఉన్నాయో కూడా ఇక్కడ చెప్పే అధికారులు లేరు. కారణం వారికి వచ్చే సైడ్ ఇన్కం పోతుంది. అదే ప్రజలకు దేవస్థానంలోని ప్రతినిత్యం కాటేజీల వివరాలు, సదుపాయాలు, ఉచిత కళ్యాణ మండపాలు వివరాలు అన్ని మీడియా సంస్థలకుతెలియజేస్తే.. వాటిని పత్రికలు, టీవీలు, సామాజిక మాద్యమ మొబైల్ న్యూస్ యాప్ ల ద్వారా ప్రజలు తెలుసుకొని స్వామివారి సన్నిధికి రావడానికి, విశేషంగా కొండపైనే పెళ్లిల్లు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలా వస్తే దేవస్థాన అధికారులకు.. అక్కడ బ్రోకరేజీచేసేవారికి ఆదాయం ఒక్కసారిగా పడిపోతుంది. 

దీనితో కొండపై ఏం జరుగుతందనేది ఎవరికీ చెప్పడం లేదు.. చెప్పినా ఒక వర్గం మీడియాకి మాత్రమే చెబుతున్నారు. వారు కూడా ఇష్టమొస్తే దానిని మీడియాకి తెలియజేస్తారు లేదంటే అదీ లేదు. దీనితో సత్యదేవుని సమాచారం భక్తులకు గానీ ప్రజలకు గాని సకాలంలో మీడియాకి ద్వారా తెలియడం లేదు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ఆదాయం పెంచుకోవడానికి, స్వామివారిని భక్తులకు చేరువ చేయడానికి ఎన్నో ప్రచార కార్యక్రమాలు అవలంభించాయి ఒక్క అన్నవరం దేవస్థానం తప్పా. ముఖ్యంగా ఆన్ లైన్ లో సేవలు, ఆన్ లైన్ విరాళాలు, ఇలా చాలా కార్యక్రమాలపై ఇక్కడి అధికారులు అస్సలు ప్రచారం చేయడం లేదు. వాస్తవానికి దేవస్థానికి చెందిన ఏ ప్రచారమైనా మీడియా సంస్థల ద్వారా ప్రభుత్వం ఉచితంగానే చేపడుతుంది. విచిత్రంగా ఆ పనికూడా ఇక్కడి అధికారులు చేయరంటే బయట ఆదాయం పోతుందనే కోణంలో ఇక్కడి అధికారులు ఏస్థాయిలో ఆలోచిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్జేసి స్థాయి అధికారి దేవస్థానానికి ఈఓగా ఉన్నా.. స్వామి సమాచారం మాత్రం బయటకు పూర్తిస్థాయిలో రావడం లేదంటే ఇక్కడి అధికారులు, యాక్టింగ్ పీఆర్వో ఏవిధంగా పనిచేస్తున్నారో.. మీడియాకి సమాచారం ఏవిధంగా అందజేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.. ఇప్పటికైన సత్యదేవుని పూర్తిసమాచారం దేవస్థాన పీఆర్వో విభాగం ద్వారా మీడియాకి తెలియజేసినా, ఉచిత, నగదు కళ్యాణ మండపాల వివరాలు అనునిత్యం తెలియజేసినా స్వామివారికి ఆదాయం రావడంతోపాటు, ఆయన పాదాల చెంతనే పెళ్లిల్లు, పూజలు చేసుకోవాలన్న భక్తుల కోరికలు నెరవేరుతాయి. 

Annavaram

2021-07-30 03:00:09

విజయనగరం జిల్లాలో 57,545 మందికి ల‌బ్ది..

విద్యాదీవెన ప‌థ‌కం క్రింద‌ జిల్లాలో  57,545 మంది విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో రూ.30.02 కోట్లు జ‌మ అయ్యింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంనుంచి గురువారం విద్యాదీవెన రెండో విడ‌త నిధుల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, ఎంఎల్ఏలు శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, విజ‌య‌న‌గ‌రం మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, జాయింట్ క‌లెక్ట‌ర్(సంక్షేమం) జె.వెంక‌ట‌రావు, సాంఘిక సంక్షేమ‌శాఖ డిడి కె.సునీల్ రాజ్‌కుమార్‌, డిబిసిడ‌బ్ల్యూఓ కీర్తి,  మైనారిటీ సంక్షేమాధికారి బి.అరుణ‌కుమారి, కార్పొరేట‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విద్యాదీవెన మొత్తానికి సంబంధించిన చెక్కును, విద్యార్థుల త‌ల్లితండ్రుల‌కు,  ఉప ముఖ్య‌మంత్రి పుష్ప శ్రీ‌వాణి లాంఛ‌నంగా అంద‌జేశారు.

జిల్లాలో 57,545 మందికి ల‌బ్ది
డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్‌
                  విద్యాదీవెన ప‌థ‌కం ద్వారా జిల్లాలో సుమారు 57,545 మందికి  ల‌బ్ది చేకూరుతోంద‌ని జిల్లా ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ అన్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఆయ‌న ముఖ్య‌మంత్రితో మాట్లాడుతూ, విద్యాదీవెన ప‌థ‌కం క్రింద జిల్లాకు రూ.30.02 కోట్లు విడుద‌లవుతుంద‌ని చెప్పారు. ఈ ప‌థ‌కం ద్వారా సాంఘిక సంక్షేమశాఖ విద్యార్థులు 5,419 మంది, గిరిజ‌న సంక్షేమ‌శాఖ ద్వారా 3,708 మంది, బిసి సంక్షేమ‌శాఖ ద్వారా 44,220 మంది, ఇబిసిలు 3,001 మంది, ముస్లిం మైనారిటీలు 227 మంది, కాపు విద్యార్థులు 929, క్రిష్టియ‌న్‌లు 41 మంది ల‌బ్ది పొందుతున్నార‌ని వివ‌రించారు.

మేన‌మామ‌గా బాధ్య‌త తీసుకున్నారు
చిప్పాడ లావ‌ణ్య‌, విద్యార్థిని త‌ల్లి
                ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ఒక మేన‌మామ‌లా, తమ పిల్లల చ‌దువుల బాధ్య‌త‌ను తీసుకున్నార‌ని, విద్యార్థిని జ్యోతిక త‌ల్లి చిప్పాడ లావ‌ణ్య అన్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా  ఆమె ముఖ్య‌మంత్రితో మాట్లాడుతూ, విద్యాదీవెన విడుద‌ల చేసినందుకు,  జిల్లాలోని విద్యార్థులు, త‌ల్లుల త‌ర‌పున ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మ‌కు స్థోమ‌త లేన‌ప్ప‌టికీ,  విద్యాదీవెన ప‌థ‌కం వ‌ల్లే త‌మ ఇద్ద‌రు పిల్ల‌లూ చ‌దువుకోగ‌లుగుతున్నార‌ని ఆమె చెప్పారు. ఇద్ద‌రూ ఉన్న‌త చ‌దువులు చ‌దువుకుంటుండ‌టంవ‌ల్ల‌, వారు మంచి ఉద్యోగాల్లో స్థిర‌ప‌డ‌తార‌న్న ధీమా క‌లుగుతోంద‌న్నారు. త‌మ పిల్ల‌ల‌కు వ‌స‌తి దీవెన వ‌చ్చింద‌ని, త‌మ కుటుంబానికి జ‌గ‌న‌న్న ఇళ్లు కూడా మంజూర‌య్యింద‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. త‌న‌ అత్తకు వృద్దాప్య పింఛ‌న్ కూడా వ‌స్తోంద‌ని, త‌మ కుటుంబంలో ప్ర‌భుత్వం వెలుగులు నింపింద‌ని ఆమె ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

విద్య‌, వైద్యానికి అధిక ప్రాధాన్య‌త‌
ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి
               త‌మ ప్ర‌భుత్వం విద్య‌. వైద్యానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పిల్ల‌లంద‌రూ చ‌దువుకొని, విద్యావంతులు కావాల‌న్న‌దే ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌నరెడ్డి ల‌క్ష్య‌మ‌న్నారు. రాష్ట్రంలో విద్య‌, వైద్య రంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టి, వాటిని ప్ర‌జ‌లంద‌రికీ అందించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కింద‌న్నారు. ముఖ్య‌మంత్రి ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌న్నీప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు జిల్లా అధికారులు బాధ్య‌తాయుతంగా కృషి చేస్తున్నార‌ని, వారికి త‌మ‌వంతుగా సంపూర్ణ స‌హ‌కారాన్ని అందిస్తున్నామ‌ని చెప్పారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా, పార‌ద‌ర్శ‌కంగా ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని స్వామి చెప్పారు.

Vizianagaram

2021-07-29 17:09:04

ఆర్ అండ్ ఆర్‌ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వివిధ ప్రాజెక్టుల‌కు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప‌నులను వేగ‌వంతం చేయాల‌ని జిల్లా ఇన్ ఛార్జి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌, పున‌రావాసం త‌దిత‌ర అంశాలపై క‌లెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌యం, తోట‌ప‌ల్లి, గ‌జ‌ప‌తిన‌గ‌రం బ్రాంచ్ కెనాల్‌, తార‌క‌రామ‌తీర్ధ‌సాగ‌ర్‌, వెంగ‌ళ‌రాయసాగ‌ర్‌, నాగావ‌ళి ఫ్ల‌డ్ బ్యాంకు, కంచ‌ర‌గెడ్డ‌, అడారుగెడ్డ‌, క‌ర్రిగెడ్డ‌ త‌దిత‌ర ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా  ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్ కిశోర్ మాట్లాడుతూ, నిర్వాసితుల పున‌రావాసం పై దృష్టిపెట్టాల‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. అలాగే ప‌లు ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ ఇప్ప‌టికీ కొన్నిచోట్ల పెండింగ్‌లో ఉంద‌ని, దానిని త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌న్నారు. కోర్టు కేసుల‌కు సంబంధించి, న్యాయప‌రంగా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించి, గూడెపువ‌ల‌స‌, కంచేరు, రావాడ‌, స‌వ‌రివిల్లి త‌దిత‌ర గ్రామాల్లో జ‌రుగుతున్న భూసేక‌ర‌ణ‌పై గ్రామాల‌వారీగా స‌మీక్షించారు. ఎయిర్‌పోర్టు ఎప్రోచ్ రోడ్డు, ట్రంపెట్ బ్రిడ్జి త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌శ్నించారు. విమానాశ్ర‌యానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని, నిర్లిప్త‌త‌ను విడ‌నాడి, ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఈ స‌మావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్లు వెంక‌టేశ్వ‌ర్లు, హెచ్‌వి జ‌య‌రామ్‌, టిటిపిఆర్ ఇఇ తిరుప‌తిరావు, తోట‌ప‌ల్లి ప్రాజెక్టు ఇఇ రామ‌చంద్ర‌రావు,  క‌లెక్ట‌రేట్ జి.సెక్ష‌న్ సూప‌రింటిండెంట్ జి.సూర్య‌ల‌క్ష్మి,  ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.        

Vizianagaram

2021-07-29 17:05:00

వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలి..

ప్రతీ రైతు బరోసా కేంద్రం పరిధిలో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటు పూర్తి చేయాలని ఇన్ ఛార్జి కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ వ్యవసాయాధికారులకు ఆదేశించారు.    గురువారం తన ఛాంబరులో పలు వ్యవసాయ కార్యక్రమాలపై సమీక్షించారు.  జిల్లాలో 634 వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు కావల్సివుండగా ఇప్పటి వరకు 622  బోర్డులు ఏర్పాటు అయ్యాయని,  ఇంకను 12 బోర్డులు ఏర్పాటు కావల్సివుందని వాటిని వెంటనే  ఏర్పాటు చేయాలని సూచించారు.   ప్రతీ 1, 2, 3  శుక్రవారాలలో గ్రామ, మండల, జిల్లా స్థాయి సమానేశాలు తప్పని సరిగా జరిగేలా చూడాలన్నారు.  ఈ క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని, ఇందుకోసం వ్యవసాయ, ఉద్యాన శాఖల డిడిలు, ఎడిలతో పర్యవేక్షణ బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని జె.డి.కి సూచించారు.  ఆర్.బి.కె.లలో అందించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నాణ్యతను తనిఖీలు చేయాలని, తనిఖీ చేసిన నివేదికను ఆర్.బి.కె.లలో ప్రదర్శించాలని సూచించారు.  ప్రతీ ఆర్.బి.కె.ను బ్యాంకులకు మ్యాపింగే చేయాలన్నారు.  కౌలు రైతులందరకు  ఆగష్టు 15లోగా రుణాలు అందజేయాలని ఆదేశించారు.   విత్తనాలు, ఎరువుల అక్రమ సరఫరాలను అరికట్టాలని, దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమంగా అమ్మేవారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలన్నారు.  చెక్ పోస్టుల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు.  ఎరువులు, విత్తనాలు జిల్లా సరిహద్దులు దాటి బయటకు వెళ్లకుండా నియంత్రించేలా పోలీసు బందోబస్తు కోరాలని ఆ మేరకు జిల్లా ఎస్.పి.కు లేఖ వ్రాయాలని, ప్రతిని  వ్యవసాయ కమిషనర్ కు మార్క్ చేయాలని సూచించారు.  ఈ సమావేశంలో  ఆర్.డి.ఓ. భవానీ శంకర్, వ్యవసాయ శాఖ జెడి ఆషాదేవి, డిడిలు, ఎడిలు, ఉద్యాన వన శాఖాధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-29 17:02:04

సంక్షేమ పథకాలపై అవగాహనుండాలి..

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పై సచివాలయ ఉద్యోగులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్  డా.ఏ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు.  గురువారం ఆయన స్వర్ణభారతి స్టేడియం వద్దగల పాత రేసపువానిపాలెం 24వ వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని, వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను  ప్రదర్శించే బోర్డులను పరిశీలించారు. సచివాలయ ఉద్యోగుల తో మాట్లాడుతూ వారి పని వివరాలు, ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు విషయమై అడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానం రానందున సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నింటిపైనా పునశ్చరణ శిక్షణ ఏర్పాటు చేయాలని యు.సి.డి. పథక సంచాలకులు శ్రీనివాస్ ను ఆదేశించారు. లబ్ధిదారులకు ఉండవలసిన అర్హతల గురించి క్షుణ్ణంగా   తెలుసుకోవాలన్నారు.  విధి నిర్వహణలో మంచి ప్రావీణ్యం సంపాదించాలని చెబుతూ వారికి సలహాలు సూచనలు ఇచ్చారు.  అనంతరం కలెక్టర్ అర్బన్ హెల్త్ క్లినిక్ ను తనిఖీ చేశారు.

విశాఖ సిటీ

2021-07-29 16:59:12

వికలాంకులకు ప్రత్యేక సదుపాయాలు..

సింహాచలం దేవస్థానంలో వికలాంగులకు ఉచితంగానే వీల్ ఛైర్, లిఫ్ట్ అన్ని సమకూర్చి దేవదేవుని దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. ఈ మేరకు ఈఓ సూర్యకళ ఆదేశాలతో ఈ సేవ అమల్లోకి వచ్చింది. గురువారం బరంపురం నుంచి వచ్చిన ఒక వికలాంగురాలు సాయంత్రం వచ్చిన ఈ జంటకు వీల్ ఛైర్ ఇచ్చి, లిఫ్టులో పైకి తీసుకెళ్లి దర్శనం చేయించారు సిబ్బంది.  తన భార్యకు కాలి సమస్య ఉందని.. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించి ఆపరేషన్ చేయించి స్వామివారి చెంతకు తీసుకొచ్చానని చెప్పారు బరంపురంవాసులు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, వికలాంగులు, నడవలేని వయస్సు మళ్లిన వారు దర్శనానికొస్తే సెక్యూరిటీ సహా సిబ్బంది సహకరించి సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సూచించారు.  వీల్ ఛైర్ లు పీఆర్వో ఆఫీసులో ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు..

Simhachalam

2021-07-29 16:53:01

సింహాద్రి అప్పన్నకు రూ.1,00,116 విరాళం..

విశాఖ  బాపూజీనగర్ కు చెందిన దాసరి పృధ్వీ రెడ్డి సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(అప్పన్న)స్వామి నిత్య అన్నదాన పథకానికి   లక్షా నూట పదహారు రూపాయలు (1,00,116)  విరాళమిచ్చారు. ఆ మొత్తాన్నిచెక్కు రూపంలో గురువారం పీఆర్వో కార్యాలయంలో  అందించారు . తన జన్మదినోత్సవమైన మే 20న స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని దాతలు కోరారు. దాతలకు  టెంపుల్ ప్రొటోకాల్ ప్రకారం స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు అధికారులు. వారు స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టి, కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం కల్పించారు.  టెంపుల్ ఏఈఓ ప్రసాదాన్ని అందించారు. 

Simhachalam

2021-07-29 16:40:18

అప్పన్నకు హాల్ డైరెక్టర్లు పూజలు..

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) సీఎండీ , డైరెక్టర్ల కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎండీ ఆర్ మాధవన్ కుటుంబ సభ్యులు, సీఈఓ మైథీ , డైరెక్టర్లు అనంతకృష్ణన్, ఎంఎస్ వెలపరి, అలోక్ వర్మ, అరూప్ చటర్జీ కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. వారందరికీ వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. అంతముందు వీరంతా స్వామివారి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ విశేషాలను దేవస్థాన సిబ్బంది హాల్ డైరెక్టర్ల బ్రుందానికి తెలియజేశారు. కార్యక్రమంలో దేవస్థాన అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-07-29 16:39:26

అధికారులకు స్థానిక నివాసం తప్పనిసరి..

గుంటూరు జిల్లాలోని అన్నిశాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు వారు విధులు నిర్వహిస్తున్న ప్రదేశాలలోనే ఖచ్చితంగా నివాసం ఉండాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ నేడోక ప్రకటనలో ఆదేశించారు. ఆ విధంగా వారి కార్యస్థానంలో నివాసం ఉండని అధికారులపై శాఖాపరమైన  క్రమశిక్షాణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారుల పనితీరుపై అసనం వ్యక్తం చేసిన తరుణంలో జిల్లా కలెక్టర్ స్థానిక నివాసం ఆదేశ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

Guntur

2021-07-29 16:31:32

సచివాలయాలు తనిఖీచేసిన కమిషనర్..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ డా. జి. సృజన గురువారం 6వ జోన్ 70వ వార్డు శ్రామిక నగర్, డ్రైవర్స్ కోలనీలో ఉన్న 1086417, 418, 420, 421 సచివాలయాలను సందర్శించి కార్యదర్శుల బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. సచివాలయాలలో ప్రభుత్వ సేవలు వివరాల పట్టిక, సూచిక బోర్డులను, అత్యవసర సేవల ఫోన్ నెంబర్ల వివరాలను, కోవిడ్ నియంత్రణ నియమావళి పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, సేవలు పౌరులకు అందాలనే ఉద్దేశ్యంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని, దానిని నిర్వీర్యం చేయరాదని, కార్యదర్శులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం స్థానికంగా నివాసం ఉండాలని తెలియజేశారు. వార్డ్ మ్యాపింగ్ లో ప్రతి ఇల్లు ట్యాగింగు చెయ్యాలని,  కార్యదర్శులు సెలవు పెట్టదలచినచో, ఏమైనా మీటింగులకు వెళ్ళవలసి వచ్చినప్పుడు జోనల్ కమిషనర్ కు తెలియపరచాలని, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలని, కార్యదర్శులు విధులపై బయటకు వెళ్ళినప్పుడు మూమెంట్ రిజిస్టర్ లో, డైరీలో పనియొక్క పూర్తి వివరాలు నమోదు చేయాలని, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను సకాలంలో నమోదు చేసి పై అధికారులకు పరిష్కారం కొరకు పంపాలని, నిర్ణీతకాలంలో ఆర్జీలను పరిష్కరించని యెడల వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్షేమ పథకాల కొరకు వచ్చిన అర్హులైన లబ్ధిదారులు నిరాశతో వెనక్కి వెళ్ళకూడదని, అలాగే ఆగష్టు 2వ తేది నుండి 18వ తేదీ వరకు జరిగే ఆన్ లైన్ శిక్షణా తరగతులకు విధిగా హాజరు అవ్వాలని కమిషనర్ సూచించారు. 

విశాఖ సిటీ

2021-07-29 16:30:20

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు..

కార్పొరేట్ ఆసుపత్రిలకి ధీటుగా జిల్లా ప్రధాన కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ( రిమ్స్ ) పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ వైద్యులకు సూచించారు. ఇక్కడ మంచి అనుభవజ్ఞులైన వైద్యులతో పాటు అన్ని మౌలిక వసతులు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే కార్పొరేట్ ఆసుపత్రికి తక్కువేమి కాదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ వైద్యులు అందించిన సేవలు అభినందనీయమని కొనియాడిన ఆయన వైద్యులు చేసేది వృత్తి కాదని, సేవగా భావించాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ఆరోగ్యకరంగా, సంతోషంగా వెళ్లాలని ఆ దిశగా వైద్యులు కృషిచేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి మరియు సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగింది.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ శాతం మంది ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులపై ఎక్కువ శాతం మంది ఆధారపడేలా ఆసుపత్రిని అభివృద్ధిచేయాలని చెప్పారు. ఇందుకు అవసరమైన వాటిని సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఆసుపత్రి, వైద్య కళాశాల ఉందని ఇందుకు నీటి అవసరం ఎంతైనా ఉందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు లేవని సభ్యులు తెలియజేయడం జరిగిందన్నారు. 

ఈ విషయమై నగరపాలక సంస్థ కమీషనర్ తో మాట్లాడటం జరిగిందని, ఇప్పటికే బోర్ వేసారని, పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే వేతనాల చెల్లింపుల్లో జాప్యం కారణంగా పారిశుద్ధ్యం కొంత లోపించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం వేరే సంస్థకు పారిశుద్ధ్య బాధ్యతలను అప్పగించడం వలన ఇకపై పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ లలో వైద్యులు, సిబ్బంది, వైద్య కళాశాల విద్యార్ధులు బాగా పనిచేసారని ఇదేస్పూర్తితో రానున్న థర్డ్ వేవ్ లో కూడా బాగా పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. దేశంలో థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయని, అందుకు తగిన విధంగా ఆసుపత్రిలో వసతులు సమకూర్చుకోవాలని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి మౌలిక వసతులను మరింత మెరుగుపరచుకోవలసిన అవసరం ఉందని, ఆ దిశగా వైద్యులు కృషిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. తొలుత ఆసుపత్రి ప్రగతి నివేదికను ఆసుపత్రి పర్యవేక్షకులు కలెక్టర్ కు వివరించారు.

శ్రీకాకుళం పురపాలక సంఘం మాజీ ఛైర్ పర్సన్ మరియు సలహా మండలి సభ్యులు యం.వి. పద్మావతి మాట్లాడుతూ  రిమ్స్ ప్రారంభమైన నాటి నుండి అభివృద్ధి చెందుతూ వస్తుందని అన్నారు. రిమ్స్ లో ఉండే సదుపాయాలు, వసతులు గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేదని, అందువలనే కార్పొరేట్ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, ప్రజల్లో ఈ అపోహను తొలగించాలని కోరారు. కోవిడ్ సమయంలో ఇక్కడి వైద్యులు మంచి సేవలు అందించారని కితాబిచ్చారు. వైద్యాన్ని వృత్తిగా కాకుండా సేవగా భావించాలని, అనారోగ్య సమస్యలతో వచ్చిన పేషెంట్లను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పంపించాలని వైద్యులను కోరారు. ఈ విషయమై వైద్యులు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని, తద్వారా విశాఖలోని కె.జి.హెచ్ కు ఎంత మంచి పేరు ఉందో  రిమ్స్ కు అంత మంచి పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉందని, ఇంత భారీస్థాయిలో నిర్మించిన ఆసుపత్రికి సరైన నీటి సదుపాయం, పారిశుద్ధ్యం లేదని ఫిర్యాదులు తమకు వచ్చినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 600 పడకల ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల ఇక్కడ ఉందని, విద్యార్ధులు, వైద్యుల క్వార్టర్స్ ఉన్నాయని, అందుకు తగిన విధంగా నీటి సదుపాయం లేదన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని నాడు – నేడు క్రింద ఆసుపత్రికి నీటి సదుపాయాన్ని కల్పిస్తే భవిష్యతులో నిరంతర నీటి సరఫరా ఉంటుందని  ఆమె కలెక్టర్ ను కోరారు.

మరో సభ్యులు వరుదు విజయకుమార్ మాట్లాడుతూ ఇక్కడ 250 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని, సంఘంలోని లోపాలు వలన సక్రమంగా పనిచేయడం లేదని, వాటిని సరిచేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయని, ఈ విషయాన్ని సామాన్య ప్రజలకు చేరవేస్తే మరింత సార్ధకత లభిస్తుందన్నారు. అలాగే ఆసుపత్రికి వచ్చే నిధుల్లో కొంత పారదర్శకత లోపించిందని, ఇప్పటికైనా సరిచేయాలని కలెక్టర్ ను కోరారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, డా. కె.శ్రీనివాసులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ఎ.కృష్ణమూర్తి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ.కృష్ణవేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, నగరపాలక సంస్థ కమీషనర్ సిహెచ్.ఓబులేసు, డి.సి.హెచ్.ఎస్ డా. బి.సూర్యారావు, ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి కార్యనిర్వాహక ఇంజినీర్ బి.ఎన్.ప్రసాద్, సలహా మండలి సభ్యులు లావేటి హేమసుందరరావు, డి.జగదీశ్వరరావు, కోరాడ లక్ష్మణమూర్తి, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-29 16:29:00

స్విమ్స్‌లో ఆరోగ్య‌శ్రీకి నూత‌న బ్లాక్..

తిరుప‌తి స్విమ్స్ ఆసుప‌త్రిలో ఆరోగ్య‌శ్రీ పేషంట్ల‌కు నూత‌న బ్లాక్ నిర్మించి రోగుల‌కు మ‌రింత మెరుగైన సౌర్యాలు క‌ల్పించాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని చాంబ‌ర్‌లో గురువారం స్విమ్స్‌, టిటిడి అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ స్విమ్స్‌లో కార్పొరేట్ ఆసుప‌త్రుల త‌ర‌హాలో హెల్త్ ఇన్సూరెన్స్  కలిగిన పేషంట్ల‌కు క్యాష్‌లెస్ వైద్య సేవ‌లు అందించాల‌న్నారు.  రోగుల‌కు వేగ‌వంత‌మైన వైద్య సేవ‌లు అందించ‌డానికి మ‌రింత  విస్తృతంగా ఐటి సేవ‌లు వినియోగించుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పెండింగ్ లో ఉన్న సివిల్ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. హెచ్ఆర్ మేనేజ్మెంట్, హాస్పిటల్
మేనేజ్మెంట్ అప్లినేషన్లు రూపొందించాలని కోరారు.  ఆసుప‌త్రిలో రేడియాల‌జీ ఇమేజింగ్ సిస్ట‌మ్ (పిఏసిఎస్‌) ద్వారా ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ తీసుకున్న రోగుల స్కానింగ్ రిపోర్టులు సంబంధింత డాక్ట‌ర్ల‌కు ఆన్‌లైన్‌లో పంపేవిధంగా నూత‌న సాప్ట్‌వేర్  రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. అదేవిధంగా స్టూడెంట్స్ సాఫ్ట్‌వేర్ రూపొందించి టిటిడి విద్యాసంస్థ‌ల్లోని విద్యార్థుల వివ‌రాలు పొందుప‌ర్చాల‌న్నారు. రోగుల‌కు అహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం పెంపొందించేందుకు ఆసుప‌త్రి అవ‌ర‌ణంలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్దపీట వేస్తూ, ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనంతరం ఆరోగ్యశ్రీ వైద్యసేవలపై ఈఓ సమీక్షించారు.  స్విమ్స్ డైరెక్టర్ డాక్ట‌ర్ వెంగ‌మ్మ‌, సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ రామ్‌, సిఇ  నాగేశ్వ‌ర‌రావు, ఎఫ్ఎ అండ్ సిఎవో  బాలాజి, సిఏవో  ర‌విప్ర‌సాదు, ఐటి విభాగాధిప‌తి శేషారెడ్డి,  స్విమ్స్ ఐటి మేనేజ‌ర్ భావ‌న ఈ స‌మీక్ష‌లో పాల్గొన్నారు.  

తిరుపలి

2021-07-29 16:27:30

గరుడవారధి రూ.25 కోట్లు కేటాయింపు..

గరుడవారధి పనుల ప్రగతిపై టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి గురువారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టిటిడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పనుల కోసం రెండో విడతగా రూ.25 కోట్లు కేటాయించారు. దీంతో ఇప్పటివరకు టిటిడి రూ.50 కోట్లు విడుదల చేసినట్టయింది.  తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి నంది సర్కిల్ వరకు వారధి పనులు  పూర్తి కావచ్చాయని, ఆగస్టు నెలాఖరుకు యాత్రికులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈఓకు వివరించారు. ఈ సమీక్షలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గిరీష, స్మార్ట్ సిటి జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్  మోహన్, టిటిడి ఎఫ్ఏ అండ్ సిఏవో  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.

Tirumala

2021-07-29 16:19:32

ఆర్బన్ పీహెచ్సీకి మేయర్ శంకుస్థాపన..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి గురువారం 5వ జోన్ 41వ వార్డు లోని సుబ్బలక్ష్మి నగర్ లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంతనింగ్ మరియు జాతీయ ఆరోగ్య పథకం నిధుల నుండి 80 లక్షల అంచనా వ్యయంతో నేడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, పనులు వెంటనే ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రతి వార్డులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, పేద ప్రజల కొరకు నవరత్నాలులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, అయిదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్యనిర్వాహక ఇంజనీర్ పి. శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-07-29 15:10:29