1 ENS Live Breaking News

సింహాద్రి అప్పన్నకు జిల్లా కలెక్టర్ పూజలు..

విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా వచ్చిన  ఏ.మల్లికార్జున  బాధ్యతలు చేపట్టేముందు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి(అప్పన్న)వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ సూర్యకళ, ఏఈఓ రాఘవ కుమార్, అధికారులు కలెక్టర్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్ కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. జిల్లా కలెక్టర్ గా విజయవంతంగా పనిచేయాలని, ఎన్నో మంచి పనులు చేయాలని   అర్చకులు దీవించారు. కలెక్టర్ మల్లికార్జునకు కళ్యాణ మండపాన్ని కూడా చూపించి..ఆర్జిత సేవల గురించి ఈఓ సూర్యకళ వివరించారు.

Simhachalam

2021-07-28 13:50:02

అప్పన్నకు విశాఖవాసి రూ.1,00,116 విరాళం

విశాఖ మధురవాడకు చెందిన  విశ్వనాధ శివ శంకర్ శ్రీనివాస్, సుబ్బలక్ష్మి దంపతులు శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి(అప్పన్న)వారి నిత్యాన్నదాన పథకానికి  లక్షా నూట పదహారు రూపాయలు  (1,00,116) విరాళం అందించారు. ఫిబ్రవరి 22న  తమపెళ్లి రోజు సందర్భంగా స్వామివారి సన్నిధిలో అన్నదానం చెయ్యాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆలయ పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల చెక్కును అందించారు. అనంతరం దాతలు స్వామివారి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు దాతలకు తీర్ధ ప్రసాదాలు అందించగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు.

Simhachalam

2021-07-28 13:44:10

విశాఖజిల్లా కలెక్టర్ గా డా.ఎ.మల్లిఖార్జున..

విశాఖ జిల్లా కలెక్టరుగా  డా. ఎ . మల్లిఖార్జున బుధవారం ఉదయం  బాధ్యతలు స్వీక రించారు. ఈ సందర్భముగా జిల్లా జాయింట్ కలెక్టర్ లు  ఎం.వేణు గోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, కల్పనా కుమారి, ఆర్.గోవింద రావు, పలువురు జిల్లా అధికారులు కలెక్టరు ను  మర్వాద  పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  తదుపరి కలెక్టరు జాయింట్ కలెక్టర్ లతో సమావేశమైయి పలు అంశాలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టరు డా. ఎ. మల్లిఖార్జున   విలేఖరులతో మాట్లాడుతూ  జిల్లాలో    ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికి  అందేలా కృషి చేస్తానన్నారు. ఎల్ల వేళలా అందుబాటు లో ఉంటూ  అధికారులందరి సమన్వయంతో   పట్టణ,  గ్రామీణ, గిరిజన ప్రాంతాలన్నింటికి సమ ప్రాధాన్యత నిచ్చి ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకంతో జిల్లాని రాష్ట్రంలోనే అభివ్రుద్ధి పధంలో ముందువరుసలో నిలబెడతానని చెప్పారు.

Visakhapatnam

2021-07-28 13:21:49

ఇకపై ఒక రేషన్ కార్డుకి ఒకే పింఛను..

ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు.  మంగళవారం  ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల  పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.  తొలుత ఒక మహిళ మంత్రిని కలిసి తన సమస్య తెలిపింది. తన తండ్రి చనిపోయారని తన తల్లికి పింఛన్ కావాలని తన తల్లి అత్తగారు పింఛన్  పొందుతున్నారని వీరంతా ఒకే రేషన్ కార్డులో ఉన్నారని  ఈ ఇరువురిని రేషన్ కార్డులో వేరు చేస్తే రెండు పింఛన్ లు పొందవచ్చని ఆశపడుతున్నట్లుగా ఆమె తెలిపింది. ఈ విషయమై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటుంటే ఒక పింఛన్ను రద్దు కాబడుతుందన్నారు. ఆధార్ కార్డు, ప్రజాసాధికార సర్వేల ఆధారంగా రాష్ట్రంలో ఒకే రేషన్ కార్డు మీద రెండు పింఛన్లు పొందుతున్న వారి వివరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించిందని  ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటే ఒక పింఛన్ను రద్దు చేయనున్నదని చెప్పారు. దివ్యాంగ, కిడ్నీ వ్యాధిగ్రస్తుల (డయాలసిస్ రోగులు), డీఎమ్హెచ్వో(క్యాన్సర్, థలసీమియా, పక్షవాతం) పింఛన్లకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. ఆధార్లో వయసు మార్పు చేసినవారు.. రేషను కార్డును పింఛనుకు అనుసంధానం చేయని వారు... ఒకే రేషన్కార్డు ద్వారా కుటుంబంలో రెండు లేదా అంతకు మించి పింఛన్లు ఉన్న వారిని గుర్తించి అనర్హులను క్షేత్ర స్థాయిలోనూ, సాంకేతికంగానూ పరిశీలించాకే తొలగింపు ఉంటుందని మంత్రి  చెప్పారు. తద్వారా మరికొంత మంది అర్హులకు పింఛన్లు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. 
        మచిలీపట్నం మండలంలోని ఎన్. గొల్లపాలెం గ్రామానికి చెందిన కుక్కల కుమారి మంత్రిని కలిసింది. తనకు అసైన్డ్ భూమి ఉందని  రైతు కర్షక్ లోన్  6 లక్షల ఇప్పించాలని అభ్యర్ధించింది. భూమి స్వంతం కాకపోతే , ఆ రుణం రాదనీ, ప్రభుత్వం ఇచ్చిన పట్టా    భూమిని సాగు చేస్తే మాత్రం పంట రుణం ఇస్తారని ఆమెకు మంత్రి పేర్ని నాని వివరించారు. మచిలీపట్నం లోని  పాత రామన్నపేటకు చెందిన అచ్యుత మాధవి,  సర్కిల్ పేటకు చెందిన పుప్పాల సుధలు మంత్రిని కలిసి తమకు విద్యుత బిల్లులు అధికమొత్తంలో వస్తున్నాయని చెప్పారు.  రెండు నెలలకు 1085 యూనిట్లు విద్యుత్ బిల్లు వచ్చిందని 7, 462  రూపాయల చెల్లించమంటున్నారని, ఈలోపున మరో బిల్లు సిద్ధమైందని 349 యూనిట్లకు 2, 980 రూపాయలు మొత్తం 10, 444 చెల్లించాలని విద్యుత్ శాఖాధికారులు వత్తిడి తెస్తున్నారని మాధవి మంత్రికి చెప్పారు. తనకు అధిక మొత్తంలో కరంట్ బిల్లు  9,392 రూపాయలు వచ్చిందని ఆ మొత్తం చెల్లించమని విద్యుత్ అధికారులు అంటున్నారని మంత్రికి సుధ అనే మహిళ వివరించింది.    
           స్థానిక లక్ష్మణరావుపురం దిమ్మల సెంటర్ కు చెందిన పాస్టర్ మట్టా మేరీ పాల్ మంత్రి వద్ద తన ఇబ్బంది చెప్పుకొన్నారు. 2013 తాను ఒకరి వద్ద ఇల్లు కొని రిజిస్ట్రేషన్ తన పేర చేయించుకున్నానని ఇంటి పన్ను సైతం కటుతున్నానని, ఇటీవల ఇంటి పన్ను తన పేరున కాక ఇంటి పన్ను పాత యజమాని కుమారుని పేరున వచ్చిందని వాపోయారు. 

Machilipatnam

2021-07-27 16:53:37

సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలి..

శ్రీకాకుళం జిల్లాలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ వర్షాకాలం రావడంతో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా మున్సిపల్ కమీషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా మలేరియా అధికారి, వైద్యఆరోగ్య శాఖాధికారి మరియు గ్రామీణ నీటి సరఫరా విభాగాధిపతులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమలు వలన వచ్చే సీజనల్ వ్యాధులను నివారించేందుకు ప్రతీవారం క్లోరినేషన్ మరియు ఫాగింగ్ ఖచ్చితంగా చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి మునిసిపల్ పరిధిలో తాగునీటిని క్లోరినేషన్ చేసి నీటి నిల్వలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే గ్రామస్థాయిలో నీటి కొళాయిలు దెబ్బతిని నీటి నిల్వలు ఏర్పడినట్లయితే తక్షణమే అధికారులు స్పందించి మరామ్మతులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వలపై అధికారులు నిర్లక్ష్యధోరణి కనబరచరాదని, తద్వారా మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యూ, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే అవకాశముందని చెప్పారు. ప్రస్తుతం గ్రామ, వార్డుస్థాయిలో వాలంటీర్ల వ్యవస్థ ఉన్నందున వారి ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.  ప్రతీ పి.హెచ్.సి కేంద్రాల్లో మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి టెస్టులు చేసేందుకు వీలుగా కిట్లను మరియు మందులను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధిపతులు ప్రతీ వారం చేపట్టిన ప్రగతి నివేదికలను తమకు సమర్పించాలని ఆదేశించారు. డెంగ్యూ, చికెన్ గున్యూ, జికా వైరస్ ఎడిస్ దోమ వలన వస్తుందని, గంబూషియా చేపల ద్వారా ఈ ఎడిస్ దోమలను లార్వా దశలోనే నివారించాలని సూచించారు. సీజనల్ వ్యాదులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యల డాక్యుమెంటరినీ వాట్సాప్ గ్రూపు ద్వారా  గ్రామ, వార్డు వాలంటీర్లకు పంపి అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున మునిసిపల్ కమీషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పారిశుద్ధ్యం పనులతో పాటు క్లోరినేషన్, ఫాగింగ్ ప్రతీ వారం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తొలుత జిల్లా మలేరియా అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్ కమీషనర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం చేపడుతున్న ప్రగతిని కలెక్టర్ కు వివరించారు.

          ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఐటిడిఏ ప్రోజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాథరావు, జిల్లా మలేరియా అధికారి , జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ ఓబులేసు, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, పాలకొండ, రాజాం, ఇచ్చాపురం మునిసిపల్ కమీషనర్లు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-27 16:50:23

రూర్బన్ పనులపై దృష్టి సారించాలి..

సోంపేట క్లస్టర్ లో రూర్బన్ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. రూర్బన్ కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మంగళ వారం సమీక్షించారు. తాగు నీటి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సమగ్ర శిక్ష అభియాన్ క్రింద పనులు బాగా జాప్యం జరుగుతోందని వాటిపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. పి.ఎం.ఏ.జి.వై క్రింద లావేరు, వీరఘట్టం, రాజాం, రణస్థలం మండలాల్లో మంజూరైన పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక అధికారులు పనుల పై దృష్టి సారించి మంజూరు నుండి పూర్తి అయ్యే వరకు పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి  మాట్లాడుతూ ఇంజినీరింగ్  పనుల్లో 107 పూర్తి అయ్యాయని, 43 పనులు ప్రగతిలో ఉన్నాయని, 14 ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. పి.ఎం.ఏ.జి.వై క్రింద చేపడుతున్న పనులకు ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల మేర నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, డిపిఓ వి.రవి కుమార్, డిఆర్డిఏ పిడి బి. శాంతి శ్రీ, పంచాయితీ రాజ్ ఎస్ఇ కే.బ్రహ్మయ్య, వ్యవసాయ శాఖ జేడి కే.శ్రీధర్, ఏపిఇడబ్లుఐసి ఇఇ కే. భాస్కర రావు తదతరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-27 16:48:02

కలెక్టర్ వినయ్ చంద్ కు ఘన సత్కారం..

విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ను జిల్లా ఉద్యోగులు ఎప్పటికీ మరిచిపోరని సీతమ్మధార తహశీల్దార్ జ్నానవేణి అన్నారు. పదోన్నతిపై వెళుతులుతున్న కలెక్టర్ ను మంగళవారం తహశీల్దార్, సూపరింటెండెంట్ లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాని అభివ్రుద్ధి పధంలో నడిపించడానికి తమకు మంచి అవకాశం కల్పించి, ఆయనతోపాటు పనిచేసే అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అదే విధంగా మంచి అధికారి ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నందుకు కాస్త బాధగా కూడా ఉందన్నారు. కాకపోతే బదిలీలు ఉన్నతాధికారులకు సహజమని.. కానీ రెండేళ్లపాటు మంచి అధికారితో పనిచే అవకాశం రావడం, మంచి కార్యక్రమాలు ఆయనతో కలిపి చేయడం ఉద్యోగులమంతా మరిచిపోలేని అంశమని అన్నారు.

విశాఖ సిటీ

2021-07-27 16:42:46

మొక్కలు నాటాలి -పచ్చదనం పెంచాలి..

మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు అనువైన సమయమని, మొక్కలు నాటి అవి బ్రతుకుటకు విధిగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు దృష్టి సారించాలని ఆయన సూచించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని ఆయన ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ లతో ముఖ్య మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయని, అయినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం పట్ల దృష్టి సారించాలని ఆయన సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రాదాన్యత క్రమంలో వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని ఆయన అన్నారు. మూడవ దశ ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి రైతు ఇ క్రాప్ లో నమోదు కావాలని ఆయన అన్నారు. గృహ పట్టాలకు దరఖాస్తు చేసిన వారికి వెంటనే జారీ చేయుటకు చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. గ్రామ స్థాయిలో భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు అధికం చేయాలని ఆయన అన్నారు. గ్రామ సచివాయాలను తనిఖీ చేయాలని ముఖ్య మంత్రి ఆదేశించారు.  పింఛన్లు, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు జారీ నిర్దేశిత సమయంలో జరగాలని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్లు ప్రభుత్వానికి కళ్ళు చెవులు అన్నారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉన్నది లేనిది పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఆగస్టులో నేతన్న నేస్తం 10వ తేదీన, విద్యా కానుక 16వ తేదీన, 20 వేలులోపు అగ్రీ గోల్డ్ పరిహారం  24 వ తేదీన, ఎం.ఎస్.ఎం.ఇలకు 27 వ తేదీన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

        ఈ వీడియో కన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్. కూర్మ రావు, వ్యవసాయ శాఖ జేడి కే. శ్రీధర్, సిపిఓ ఎం. మోహన రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ పి. కూర్మి నాయుడు, ఆర్ అండ్ బి ఎస్ఇ కే. కాంతిమతి, పంచాయతి రాజ్ ఎస్ఇ కే.బ్రహ్మయ్య, ప్రజా ఆరోగ్య శాఖ ఇఇ పి. సుగుణకర రావు తదతరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-27 13:47:25

మంచితో చెడును దూరం చెయ్యొచ్చు..

మంచితనంతో ఎంత పనినైనా చేయించగలమని,  అది అధికారుల మధ్య సఖ్యతను, ప్రేమను పెంచుతుందని పదోన్నతి  పొంది బదిలీ పై వెళ్తున్న కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.  స్థానిక కృషి భవన్ లో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల సంఘం కలెక్టర్ కు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  తనకు కలెక్టర్ కన్నా వ్యవసాయ శాఖ లో పని చేసినప్పుడే ఎక్కువ గుర్తింపు వచ్చిందన్నారు. వ్యవసాయం అంటే ఇష్టమని,  ఆ శాఖ లో పని చేసిన కాలం లో చేసిన  అనేక సంస్కరణలను  గుర్తు చేసుకున్నారు. మూడేళ్ళ పాటు జిల్లాలో పని చేసి అందరి అభిమానాన్ని మూట కట్టుకొని తీసుకు వెళ్తున్నానని అన్నారు. సంయుక్త సంచాలకులు ఆశ దేవి మాట్లాడుతూ జిల్లా చరిత్ర లో  పీపుల్ కలెక్టర్ గా హరి జవహర్ లాల్ నిలిచిపోతారని కొనియాడారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులు ఉమ మహేశ్వర నాయుడు, హరి కృష్ణ, తిరుపతి రావు, ఆత్మా పి డి లక్మన రావు, మార్కుఫెడ్, ఏ.పి సీడ్స్, ఆగ్రోస్ సంస్థల ప్రతినిధులు కలెక్టర్ గా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆడిట్ అధికారి హిమ బిందు కలెక్టర్ ను సన్మానించారు. స్టాండింగ్  ఒవేషన్ తో ఘనంగా వీడ్కోలు పలికారు.

Vizianagaram

2021-07-27 13:44:08

విజయనగరానికి విశేష సేవలందించారు..

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ గా డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ జిల్లాకు అమోఘ‌మైన సేవ‌ల‌ ను అందించార‌ని. ఆయ‌న పేరును జిల్లా ప్ర‌జ‌లు ఎన్న‌డూ మ‌ర్చిపోలేర‌ని ప‌లువురు కొనియాడారు. ఇంత‌వ‌ర‌కూ జిల్లాలో ఎంతోమంది క‌లెక్ట‌ర్లుగా ప‌నిచేసిన‌ప్ప‌టికీ, జిల్లాపై హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ వేసిన ముద్ర చెర‌గ‌రానిద‌ని పేర్కొన్నారు. ప‌దోన్న‌తిపై బ‌దిలీపై వెళ్తున్న క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ను,  స్థానిక డిఆర్‌డిఏ స‌మావేశ మందిరంలో డిఆర్‌డిఏ, బిసి, ఎస్‌సి, సాంఘిక సంక్షేమ‌శాఖ‌లు మంగ‌ళ‌వారం ఘ‌నంగా స‌న్మానించాయి. ఆయా శాఖ‌ల అధికారులు, సిబ్బంది క‌లెక్ట‌ర్‌ను దుశ్శాలువ‌ల‌తో స‌త్క‌రించి, పూల‌గుత్తెలు అందించారు. ఈ సంద‌ర్భంగా డిఆర్‌డిఏ పిడి కె.సునీల్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, త‌న ఉద్యోగ జీవితంలో డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఐఏఎస్ అధికారిని ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేని అన్నారు. సానుకూల దృక్ఫ‌థం, స‌హ‌నశీల‌త‌, నిరాడంబ‌ర‌త‌, ఓర్పు, అంద‌రికీ మంచిచేసే నైజం ఆయ‌న సొంత‌మ‌ని పేర్కొన్నారు. ఎటువంటి బేష‌జాలు, అధికార ద‌ర్పం లేని హ‌రిజ‌వహ‌ర్ లాల్ నుంచి, తాము ఎంతో నేర్చుకున్నామ‌ని అన్నారు. ప్ర‌జా క‌లెక్ట‌ర్‌గా, ప్ర‌గ‌తిశీల క‌లెక్ట‌ర్‌గా ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశార‌ని అన్నారు.

                  జిల్లా బిసి కార్పొరేష‌న్ ఇడి ఆర్.వి.నాగ‌రాణి, ఎస్‌సి కార్పొరేష‌న్ ఇడి ఎస్‌.జ‌గ‌న్నాధ‌రావు, ఎపిఇడ‌బ్ల్యూఐడిసి ఇఇ ఎం.శ్యామ్యూల్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్దికి క‌లెక్ట‌ర్ చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ఆయ‌న హ‌యాంలో జిల్లాకు సుమారు 20కి పైగా జాతీయ‌, అంత‌ర్జాతీయ అవార్డులు వ‌రించాయ‌ని చెప్పారు. క‌లెక్ట‌ర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో తమ శాఖల‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్దామ‌ని అన్నారు. ఆయ‌న హ‌యాంలో ప‌నిచేయ‌డం త‌మ అదృష్ట‌మ‌ని పేర్కొన్నారు.
 
                   డిఆర్‌డిఏ ఏపిడి ఎం.సావిత్రి, వివిధ విభాగాల ప్ర‌తినిధులు మాట్లాడుతూ, క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ జిల్లాను హ‌రిత విజ‌య‌న‌గ‌రంగా మార్చి, త‌న పేరును సార్థ‌కం చేసుకున్నార‌ని అన్నారు. చెరువుల‌ను శుద్దిచేసి, భూగ‌ర్భ‌జ‌లాల‌ను పెంచ‌డం ద్వారా జిల్లా ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చార‌ని అన్నారు. ఒక సాధార‌ణ వ్య‌క్తికి సైతం అందుబాటులో ఉండే క‌లెక్ట‌ర్‌ను తాము ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌ని అన్నారు.

అభివృద్దిని కొన‌సాగించాలి ః డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జిల్లా క‌లెక్ట‌ర్‌.
               త‌న హ‌యాంలో జ‌రిగిన అభివృద్దిని, భ‌విష్య‌త్తులో కూడా కొన‌సాగించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. తాను జిల్లాకు ఎంతో రుణ‌ప‌డి ఉంటాన‌ని, భ‌విష్య‌త్తులో కూడా జిల్లా అభివృద్దికి త‌న‌వంతుగా పూర్తి స‌హ‌కారాన్ని అందిస్తాన‌ని అన్నారు. స‌న్మానం అనంత‌రం ఆయ‌న ఉద్వేగ‌భ‌రితంగా ప్ర‌సంగించారు. తాను మునిపంపుల అనే ఒక మారుమూల గిరిజ‌న తండాలో పుట్టిన‌ప్ప‌టికీ, ఒక ఐఏఎస్ అధికారిగా ముస్సోరీలో శిక్ష‌ణ పొందే స్థాయికి ఎదిగానంటే, దానికి కార‌ణం మ‌హిళ‌లేన‌ని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అత్యంత వెనుక‌బడిన కుటుంబంలో పుట్టిన‌ త‌న‌ను, త‌న త‌ల్లి తీర్చిదిద్దింద‌ని, డిఆర్‌డిఏ పిడిగా పనిచేసిన స‌మ‌యంలో మ‌హిళ‌ల నుంచి, ఓర్పు, స‌హ‌నం నేర్చుకున్నాన‌ని చెప్పారు. తాను చిన్న‌త‌నంలో ఎదుర్కొన్న ప్ర‌తీ అవ‌మానాన్నీ, ఆయుధాలుగా మార్చుకొని త‌న ఎదుగుద‌ల‌కు బాట‌లు వేసుకున్నాన‌ని అన్నారు. వృత్తిరీత్యా తొలుత డాక్ట‌ర్ కావ‌డం వ‌ల్ల స‌హ‌న‌శీల‌త అల‌వ‌డింద‌న్నారు. ఎన్న‌డూ తాను అవార్డులు కోసం ప్రాకులాడ‌లేద‌ని, క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే, అవే వ‌స్తాయ‌ని చెప్పారు. జిల్లా ప్ర‌జ‌లు త‌న‌ప‌ట్ల చూపించిన అభిమానం, ఆద‌ర‌ణ‌ను ఎన్న‌డూ మ‌ర్చిపోలేనని అన్నారు.
             ఈ కార్య‌క్ర‌మంలో సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, డిఆర్‌డిఏ, వైకెపి ఏపిఎంలు, ఏరియా కో-ఆర్డినేట‌ర్లు, డిపిఎంలు, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఘ‌నంగా స‌న్మానించిన‌ వైద్యారోగ్య‌శాఖ‌
            జిల్లా క‌లెక్ట‌ర్‌గా విశేష‌మైన సేవ‌లందించి, ప‌దోన్న‌తితో బ‌దిలీపై వెళ్తున్న డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను వైద్యారోగ్య‌శాఖ ఘ‌నంగా స‌న్మానించింది. ఆశాఖ స‌మావేశ మందిరంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, ఇత‌ర అధికారులు, మాట్లాడుతూ క‌లెక్ట‌ర్ గా హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ చేసిన‌ సేవ‌ల‌ను కొనియాడారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో ప‌నిచేయ‌డం త‌మ అధృష్ట‌మ‌ని పేర్కొన్నారు. ప‌లువురు వైద్యులు, వివిధ సంఘాలు కూడా క‌లెక్ట‌ర్‌ను దుశ్శాలువ‌ల‌తో స‌త్క‌రించాయి.

Vizianagaram

2021-07-27 13:42:11

ఎంతో ఆనందంతో వెళుతున్నాను..

పేదల దీవెనలు ఉంటేనే  మన  భవిష్యత్తు బాగుంటుందని, పేదల కోసం పని చేసే అవకాశాన్ని అదృష్టం గా  భావించాలని  బదిలీ పై వెళ్తున్న జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. సివిల్ సర్వెంట్లు  ప్రజలతో మమేకం అయితేనే  విజయం సొంతం చేసుకుంటారన్నారు.  అధికారులు వత్తిడిని అధిగమించడానికి కళలు, క్రీడలు ఉపయోగ పడతాయన్నారు. ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినందునే అంకిత భావం తో, ఉత్సాహంతో పని చేయగలిగానని ముఖ్య మంత్రి గారికి  కృతజ్ఞతతో ఉంటానన్నారు. అవార్డుల కోసం పని చేయలేదని, చేసిన పనిని గుర్తిస్తూ అవార్డు లు  వరించాయని అన్నారు. కొత్తగా వచ్చిన జె.సి లు చాలా ఉత్సాహంగా, వివేకంగా పని చేస్తున్నారని, అయితే  దేనికి ఎంత  ప్రాధాన్యత నివ్వాలో తెలుసుకొని ముందుకెళ్లాలని సలహా ఇచ్చా రు. జిల్లాతో  ఎన్నో మధుర జ్ఞాపకాలతో వెళ్తున్నానని, సంతృప్తిగా, సంతోషంగా ఉందని అన్నారు.

Vizianagaram

2021-07-26 16:41:57

కోవిడ్ టీకా అర్హులందరికీ వేయాలి..

కోవిడ్ 19 వాక్సినేషన్ కు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాక్సిన్ చేయించేలా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. మోగా వాక్సినేషన్ కార్యక్రమంలో  భాగంగా సోమవారం సాయంత్రం ఫిరంగిపురం మండలం తక్కెళ్ళపాడు గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ పరిశీలించారు. వాక్సినేషన్ జరుగుతున్న తీరును పరిశీలించి, గ్రామంలో ఇప్పటి వరకు కేటగిరిలు వారీగా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్యను జిల్లా కలెక్టర్ వైధ్యాదికారులను అడిగి తెలుసుకున్నారు. 45 సంవత్సరాలు వయస్సు దాటిన వారితో పాటు, గర్బీణీలకు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న మహిళలకు, ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కోవిడ్ వ్యాక్సినేషన్ నూరు శాతం అందించాలన్నారు.  వైద్యారోగ్యశాఖ అధికారలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు  గ్రామంలో డోర్ టూ డోర్ వెళ్ళి ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారి వివరాలు సేకరించి వెంటనే వాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే  మొదటి డోసు తీసుకున్న వారికి నిర్దేశిత సమయంలో సెకండ్ డోసు వేయించాలన్నారు.  కోవిడ్–19 వాక్సినేషన్ పై ఉన్న అనవసర అపోహలు తొలగించి  ప్రభుత్వం వాక్సినేషన్కు  అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకునే స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రజలను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసరు డా. వై సుబ్రహ్మణ్యం, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, ఎంపీడీవో శివప్రసాదు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ఫరీన్, గ్రామ సర్పంచి ఎం విజయలక్ష్మీ, వైద్యారోగ్య, పంచాయితీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఫిరంగిపురం

2021-07-26 16:12:16

3ఏళ్లలో జనరంజక పాలన అందించారు..

విజయనగరం, జులై 26:: జిల్లా కలెక్టర్ గా మూడేళ్లు జిల్లాలో పని చేసిన డా.ఎం.హరి జవహర్ లాల్  జనరంజక పాలనను అందించారని వక్తలు కొనియాడారు.  సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా అధికారులు, రెవిన్యూ అసోసియేషన్ అద్వర్యం లో అభినందన  వీడ్కోలు సభ నిర్వహించారు. కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించారు.  
ఈ సందర్బంగా జిల్లా జడ్జి జి. గోపి మాట్లాడుతూ ప్రకృతిని ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తిగా హరి జవహర్ లాల్ నిలిచిపోతారని తెలిపారు. కలెక్టర్ గా  జిల్లాలో పని చేసిన కాలం లో ఎన్నో చక్కని పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. తన కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శించక  అందరితో ఫ్రెండ్లీ కలెక్టర్ గా ఉన్నారన్నారు. అహంకారం, అసూయ తెలియని వ్యక్తి అని జిల్లా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. 
జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ మాట్లాడుతూ ఆయన నిరడంబరత తో,  ప్రశాంత వదనం తో  ప్రజలకు తొందరగా దగ్గరై పోతారని  అన్నారు. సంయుక్త కలెక్టర్  ఆసరా జె. వెంకట రావు మాట్లాడుతూ  కోవిడ్ కాలం లో ఆయన సమర్థతను చూశామని అన్నారు. 5వ బెటాలియన్ కమాండెంట్ విక్రమ్ పాటిల్ మాట్లాడుతూ అతి తక్కువ పరిచయం లొనే తనను స్నేహితునిగా చూసారన్నారు.  
సంయుక్త్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ  ముందుండి నడిపించిన నాయకుడని కొనియాడారు. వినయం, సంస్కారం కలగలిపిన మానవతా వాది అన్నారు. ప్రతీ రోజు ఎదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే  ఉంటామన్నారు. ఏ పని ఎప్పుడు, ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి యని, అందుకే మూడేళ్ళలో జిల్లాను ఉన్నత స్థానం లో నిలిపారని పేర్కొన్నారు. తన పాలనతో ప్రజలకు, అధికారులకు ప్రీతి పాత్రులైనారని అన్నారు.  సంయుక్త కలెక్టర్లు డా.మహేష్,   మాట్లాడుతూ పరిపాలన అనేది ఒక కళ అని, ఆ కళను ప్రదర్శించి అందరి మన్ననలు పొందారని పేర్కొన్నారు. మయూ ర్ అశోక్ మాట్లాడుతూ విజయనగరం వెళ్తున్నామంటే అక్కడ హరి జవహర్ లాల్ కలెక్టర్  ఉంటారు, మీకు అన్ని విధాలా ప్రోత్సహిస్తారని చెప్పారని , వచ్చిన తర్వాత  అనేక విషయాలను తెలుసుకున్నానని అన్నారు.  ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి  ఆర్.కుర్మానాధ్,  సబ్ కలెక్టర్  భావన, సి.పి.ఓ విజయ లక్ష్మి, డిడి సోషల్ వెల్ఫేర్ సునీల్ రాజ్ కుమార్ తదితరులు కలెక్టర్ సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా మూడేళ్ళ కలెక్టర్ పాలన పై జిల్లా అధికారులు చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ గణపతి రావు, ఆర్.డి.ఓ భవాని శంకర్, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మలకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-26 15:27:14

ఈఎన్ఎస్ వార్తపై స్పందించిన ఎస్పీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో నియమించిన మహిళా పోలీసులను ముందు హోంశాఖ పోలీసులుగా గుర్తించండి..  మీరంతా వారిని మీతోపాటు సాధారణ పోలీసులుగా ఒప్పుకోండి.. మీకు ఇష్టం లేకపోయినా ఒప్పుకొని తీరాలి.. అంతే తప్పా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవద్దు అంటూ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ జిల్లాలోని అన్ని స్టేషన్ల ఎస్ఐలకు, కానిస్టేబుళ్లకు సూచించారు.. అంతేకాకుండా ఏ స్థాయి పోలీసు సిబ్బంది మహిళా పోలీసులను ఏ విధంగా చూస్తున్నారో తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. దీనితో ఈఎన్ఎస్ ఇటీవల ప్రచురించిన న్యూస్ కార్డ్..ఖాకీ చొక్కాలేదు.. చేతిలో లాఠీ అసలేలేదు.. అనేవార్తకు స్పందన వచ్చినట్టైంది. ఈ వార్తలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా  ప్రస్తావించిన అంశాలన్నీ ఎస్పీ ఈ వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల నుంచి ఎస్ఐలు, సచివాలయ మహిళా పోలీసులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వం వారిని పోలీసులుగా గుర్తిస్తూ జీఓ నెంబరు 59 విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ..దాని ప్రకారం వారంతా హోం డిపార్ట్ మెంటు పోలీసులేనని స్పష్టం చేశారు. అసలు దానికంటే ముందు వచ్చిన జీఓనెంబరు 129లోని మహిళా సంరక్షణా కార్యదర్శి(జిఎంఎస్కే) అనే పదాన్ని అన్నిస్టేషన్ల ఎస్ఐలు, కానిస్టేబుళ్లు మరిచిపోవాలని ఆదేశించారు. ఆ జీఓ ద్వారా అపుడు వారంతా జీఎంస్కేలు అయితే..జీఓనెంబరు 59 ద్వారా ఇపుడు వారంతా సాధారణ పోలీసులేనన్నారు. కాకపోతే మహిళలు కనుగా ప్రభుత్వం మహిళా పోలీసు అని నామకరణం చేసిందన్నారు. అంతే తప్పా వారంతా మనకి సంబంధం లేని ఉద్యోగులుగా చూడొద్దని పోలీసులను హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వం విడుదల చేసిన జీఓలపై స్టేషన్ ఎస్ఐలకు అవగాహ ఉండాలని.. దానిని వెంటనే సచివాలయ మహిళా పోలీసులకు వివరించి చెప్పాలన్నారు. విధినిర్వహణలో ఎవరు అవినీతికి పాల్పడినా..వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్ల  పరిధిలోని మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొందరు మహిళా పోలీసులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎస్పీ ద్రుష్టికి తీసుకెళ్లారు. మహిళా పోలీసులకు ఎలాంటి సమస్యలున్న తక్షణమే నోడల్ ఆఫీసరైన స్టేషన్ ఎస్ఐ ద్రుష్టికి తీసుకు వచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్సులో అన్ని  డివిజన్ల డిఎస్పీలు, సిఐలు, స్టేషన్ ఎస్ఐలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా పోలీసులు  పాల్గొన్నారు.

Kakinada

2021-07-26 14:25:11

మహిళల కోసమే భద్రతకే దిశ యాప్..

రాష్ట్ర ప్రభుత్వం ఆపదలో ఉన్న మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ యాప్ మహిళలకు రక్షణగా నిలుస్తుందని కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నగర  మేయర్ సుంకర పావని, జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కన్వెన్షన్ హాల్ లో దిశ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ  ప్రత్యేకంగా మహిళలు, బాలికల పట్ల జరిగే నేరాల సత్వర దర్యాప్తు కోసం ఏర్పాటు దీనిని ఏర్పాటు చేశారన్నారు. యాప్ మహిళల వద్ద వుంటే పక్కనే రక్షణ వున్నట్టేనన్నారు. ఇప్పటికే దిశ యాప్ అనేక ఫలితాలు సాధించి ఆపదలో వున్న మహిళలను రక్షిస్తున్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలో 3,44,015 మంది మహిళలు తమ ఫోన్ లలో దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. నెలాఖరు ఈ సంఖ్యను ఐదు లక్షలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 
రాష్ట్రం లోనే తూర్పుగోదావరి జిల్లా ను ప్రధమ స్థానం లో నిలపాలంటే అధిక స్థాయిలో మహిళలు, విద్యార్ధినిలు ఈ యాప్ ఇనిస్టాల్ చేసుకోవాలన్నారు.
 కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి  సూచనల మేరకు నగరంలో ఉన్న అందరితో దిశ యాప్ డౌన్లోడ్స్ చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ఈ దిశ పోలీస్ స్టేషన్ ను కాకినాడ లో తనతోనే ప్రారంభింప చేయించారని, ఇది తనకు చాలా సంతోషకర విషయమని.. ముఖ్యంగా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ఎలా పనిచేస్తుందో అనే ఉద్దేశంతో తను కాల్ చేయగా వెంటనే పోలీస్ వారు ఫోన్ చేసి అమ్మ మీరు ఏమైనా ఆపదలో వున్నారా అని అడిగారని, ఇంత వెనువెంటనే స్పందన రావడం చాల అశ్చర్యం కలిగించిందన్నారు. కుడా చైర్మన్  రాగిరెడ్డి దీప్తి చంద్రకళ, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులేటి వెంకటలక్ష్మి, ఐసిడిఎస్ అధికారి జివి సత్యవాణి, కాకినాడ స్మార్ట్ సిటీ  అల్లి రాజబాబు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 

Kakinada

2021-07-26 11:38:30