1 ENS Live Breaking News

కోవిడ్ లో అధికారుల సేవలు మరువలేనివి..

కోవిడ్ నియంత్రణలో వైద్యులు, అధికారులు పగలూరాత్రి సేవలు అందిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రశంసించారు.  సోమవారం మంత్రి భీమిలి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కరోనా నియంత్రణకు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. కరోనా పాజిటివ్ బారిన పడిన వారు హోమ్ ఐసోలేషన్ లో లేకుండా బక్కనపాలెంలో 800 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లో చేరవచ్చునని, INS కళింగ, భీమిలి ప్రభుత్వ హాస్పిటల్, పద్మనాభం కేంద్రీయ విద్యాలయాల్లో ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందవద్దని హోమ్ ఐసోలేషన్ చికిత్స పొందుతున్న వారు పూర్తిగా నయమయ్యేంత వరకు అక్కడే వుండొచ్చన్నారు.  మంత్రి ముందుగా అధికారులను ప్రస్తుత కరోనా పరిస్థితిని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  పి.హెచ్.సి. డాక్టర్లు,  సచివాలయ సిబ్బందితో విడివిడిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు భీమిలి హాస్పిటల్లో వ్యాక్సిన్ ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.  కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని,  మార్కెట్లో సామాజిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని భీమిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. భీమిలి లో నాలుగు వార్డుల్లో పూర్తి స్థాయిలో శానిటేషన్ జరగాలని భీమిలి జోనల్ కమిషనర్ ని ఆదేశించారు. త్వరలో ప్రతి వార్డులో పర్యటిస్తానని తెలిపారు. యాష్ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని రెవెన్యూ పోలీసు అధికారులు మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె.పెంచల కిషోర్, భీమిలి ఎంపిడీవో, జోనల్ కమిషనర్, భీమిలి నియోజకవర్గ ఇంచార్జి ముత్తంశెట్టి మహేష్, ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Bheemili

2021-05-24 13:13:30

తుఫాన్ ఎదుర్కోవడానికి జివిఎంసి సన్నద్దం..

తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన  “యాస్” తుఫాను తీవ్రతను ఎదుర్కోవడానికి జివిఎంసి అన్ని విధాలా సన్నద్ధంగా వుందని కమిషనర్ డా.జి.స్రిజన పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సంభిత విభాగాలతో సమీక్ష నిర్వహించారు. తుఫాను వలన అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా కాలువలు, గెడ్డలు  పొంగకుండా చూడాలని అవసరమైన చోట్ల, ముంపు ప్రాంతాలలో మోటార్లను ఉపయోగించాలని సూచించారు.  చెట్లు, కొమ్మలు తో పాటు ఎలక్ట్రికల్ పోల్స్ విరిగి రోడ్లపై పడిన వెంటనే వాటిని తొలగించుటకు అవసరమైన  రంపములను, వాహనములను సిద్ధంగా ఉంచుకోవాలని మొక్కల విభాగం,ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  పాత భవనాలలో నివసిస్తున్న వారిని శిధిలమైన గోడల ప్రక్కన నివసిస్తున్న వారిని అక్కడ నుంచి అనువైన  షెల్టర్ లోకి వెళ్ళే విధంగా చూడాలని ఆదేశించారు. నిరాశ్రయులను వెంటనే కోవిడ్ నిబంధనల ప్రకారం కమ్మ్యునిటీ హాల్స్, కళ్యాణ మండపంలు లాంటి షెల్టర్లకు తరలించి వారికి భోజనం, మంచినీటి సదుపాయాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని యుసిడి అధికారులకు సూచించారు. ప్రతీ సచివాలయ పరిధిలో ఉన్న  నివాసితుల ను అప్రమత్తంగా ఉండే విధంగా జోనల్ కమిషనర్లు సచివాలయంలో ఉన్న అందరు కార్యదర్శులను సిద్ధం చేయాలని ఆదేశించారు.  అత్యవసర పరిస్థితుల్లో ప్రజల రక్షణార్ధం అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాను వలన చెట్లు కొమ్మలు విరిగిపడ్డ,  గెడ్డలు పొంగి రహదారులపైకి, ఇండ్లలోనికి వరదనీరు చేరి ఇబ్బందులు తలెత్తితే కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009 లేదా 0891-2869100కి సమాచారం అందజేయాలని కమిషనర్ నగర వాసులను కోరారు.

GVMC office

2021-05-24 12:57:03

తీరప్రాంత వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి..

తూర్పు మధ్య బంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర తుఫాన్ గా మారనున్న దృష్ట్యా తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని  జిల్లా కలెక్టర్ ఎం. హరి జవాహర్ లాల్ తెలిపారు.  సోమవారం  పూసపాటి రేగ  మండలం కోనాడ గ్రామం  సముద్ర తీరం వరకు నడుచుకుంటూ  వెళ్ళి అక్కడి ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులతో మాట్లాడుతూ   ఎవ్వరూ సముద్రం లోనికి వెళ్లరాదని, తుఫాన్ తీరం దాటే  సమయం లో  గాలులు, భారీ వర్షాలు ఉంటాయని,  తుఫాన్ తీరం దాటే వరకు జాగ్రత్తగా ఉండాలని, సముద్రపు అలలు పెరిగిన, గాలులు వీచినా, ఏదైనా విపత్తు జరిగినా వెంటనే తెలియజేయాలని అన్నారు.  అధికారులు కూడా తీరం దాటే  వరకు తీర ప్రాంతాల్లోనే ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని తమ దృష్టి లోకి తేవాలని ఆదేశించారు. అనంతరం  సమీపాన ఉన్న తుఫాన్ షెల్టర్ ను సందర్శించారు.  తుఫాన్ సమయం లో నిత్యవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షెల్టర్ లో నిల్వలు ఉంచాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. యాస్ తుఫాన్  ప్రభావిత ప్రాంతాల్లో  ఆస్తి , ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు  జాగ్రత్తలను తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు.  ఈ పర్యటనలో సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, రెవెన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్ , ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Pusapatirega

2021-05-24 12:45:47

కోవిడ్ ఖైదీ బెయిల్ పై విడుదల..

కోవిడ్ బారిన ప‌డ్డ ఒక ఖైదీని, జిల్లా జైలు అధికారులు బెయిలుపై విడుద‌ల చేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశాల మేర‌కు, విజ‌య‌న‌గ‌రం స‌బ్‌జైలులోని అండ‌ర్ ట్ర‌యిల్‌ ఖైదీలు, సిబ్బందికి ఈ నెల 21న కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. మొత్తం 28 మంది ఖైదీలు, 10 మంది సిబ్బందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, వీరిలో ఒక్క ఖైదీకి మాత్ర‌మే పాజిటివ్ రిజల్ట్ వ‌చ్చింది. ఆ ఖైదీని బెయిలుపై విడుద‌ల చేసి, హోమ్ ఐసోలేష‌న్‌కు పంపించిన‌ట్లు జైలు సూప‌రింటిండెంట్ దుర్గారావు తెలిపారు.

Vizianagaram

2021-05-24 12:43:27

యాస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి..

యాస్ తుపాను పట్ల  చాలా అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి మత్స్యకారులకు సూచించారు. సోమవారం పూసపాటిరేగ మండలంలోని సముద్ర తీర ప్రాంతాలైన చింతపల్లి, పతివాడ బుర్రిపేట, తిప్పలవలస, ముఖం, పెద్దకొండరాజుపాలెంలోని  ఆమె స్వయంగా పర్యటించి మత్స్యకారులకు తుపాను వచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అవగాహన కల్పించారు.  అదేసమయంలో గజఈతగాళ్లంతా సిద్దంగా ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. మత్స్యకార ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లను కూడా ఆమె పరిశీలించారు. తుపానును ఎదుర్కోవడానికి  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు  పేర్కొన్నారు. మత్స్యశాఖ కార్యాలయంతోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారని, ఎప్పుడు ఏ అత్యవసర సమయం వచ్చినా ఆ నెంబర్లుకు ఫోన్లు చేసి సమాచారం అందించాలన్నారు. అదేవిధంగా మత్స్యకారులంతా వేటకు వెళ్లే బోట్లను తీర ప్రాంతానికి తీసుకొచ్చి భద్రపరుచుకోవాలన్నారు. మత్స్యకారులకు రక్షణ కల్పించేందుకు తుపాను రక్షిత ప్రాంతాలను కూడా సిద్ధం చేశామన్నారు. తుఫాను హెచ్చరికలు వాతావరణ కేంద్రం సూచించిన నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. మత్స్యకారులు ఎవరూ ఈ సమయంలో వేటకు వేళ్లకూడదని హెచ్చరించారు. గ్రామాల్లోని సాగర మిత్రాల ద్వారా సమాచారం  కాల్ సెంటర్లకు చేరవేయడం ద్వారా సత్వరమే సహాయక చర్యలు అందించడానికి వీలుపడుతుందని సూచించారు.  ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Pusapatirega

2021-05-24 12:37:18

ఆక్సిజన్ మిషన్లు వితరణ చేసిన యువత..

తూర్పు గోదావరిజిల్లా క‌లెక్ట‌రేట్‌లోని వికాస (శిక్ష‌ణ‌, ప్లేస్‌మెంట్ సేవ‌లు) విభాగం ద్వారా వివిధ సంస్థ‌ల్లో ఉద్యోగాలు పొందిన యువ‌త కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు త‌మ వంతు సాయం అందించే ఉద్దేశంతో రెండు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు సోమ‌వారం వికాస ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్‌, సిబ్బంది దాదాపు రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ‌చేసే 9 లీట‌ర్ల సామ‌ర్థ్యంగ‌ల రెండు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జేసీ (డీ) కీర్తి చేకూరి త‌దిత‌రులకు అంద‌జేశారు. వికాస నిర్వ‌హించిన జాబ్‌మేళాల ద్వారా రిటైల్, ర‌వాణా, మార్కెటింగ్‌, ఐటీ త‌దిత‌ర సంస్థ‌ల్లో ఉపాధి అవ‌కాశాలు పొందిన యువ‌తీయువ‌కులు రోగులకు ప్రాణ వాయువును అందించే కాన్సంట్రేట‌ర్ల‌ను అందించ‌డం గొప్ప విష‌య‌మ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌, జీజీహెచ్ కోవిడ్ నోడ‌ల్ అధికారి సూర్య‌ప్ర‌వీణ్‌చాంద్‌, వికాస పీడీ కె.ల‌చ్చారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-24 08:37:21

హేచరీస్ అసోసియేషన్ సహాయం రూ.50లక్షలు

 కోవిడ్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌తో పాటు రోగుల‌కు వైద్య‌, ఇత‌ర సేవ‌లు అందించేందుకు జిల్లా యంత్రాంగం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలకు త‌మ వంతు సాయం అందించేందుకు తూర్పుగోదావ‌రి జిల్లా రొయ్య‌ల హేచ‌రీల అసోషియేష‌న్ ముందుకొచ్చింది. సోమ‌వారం కోవిడ్ స‌హాయ నిధికి జిల్లా రొయ్య‌ల హేచ‌రీల అసోషియేష‌న్ అధ్య‌క్షులు ఎస్‌.వీర్రెడ్డి, అఖిల భార‌త రొయ్య‌ల హేచ‌రీల అసోషియేష‌న్ కార్య‌ద‌ర్శి మ‌ధుసూధ‌న్‌రెడ్డి.. కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి స‌మ‌క్షంలో రూ.50 ల‌క్ష‌ల చెక్కును క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు. రెండోద‌శలో కోవిడ్ ఉద్ధృతి నేప‌థ్యంలో సామాజిక బాధ్య‌త‌గా కోవిడ్ స‌హాయ నిధికి విరాళం అందించిన జిల్లా రొయ్య‌ల హేచ‌రీల అసోషియేష‌న్‌కు క‌లెక్ట‌ర్ అభినంద‌న‌లు తెలిపారు. జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున అసోసియేష‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి మాట్లాడుతూ విప‌త్తు స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు ముందుకొచ్చి, విరాళం అందించిన తూర్పుగోదావ‌రి జిల్లా రొయ్య‌ల హేచ‌రీల అసోషియేష‌న్‌కు జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సాయ‌మందించేందుకు ఇప్ప‌టికే ప‌లు కార్పొరేట్‌, వాణిజ్య‌, వ్యాపార సంస్థ‌లు విరాళాలు, ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, వైద్య ప‌రిక‌రాలు వంటివి అందించాయ‌ని, మ‌రింత మంది దాత‌లు ముందుకొచ్చి కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగ‌స్వాములు కావాల‌ని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో జిల్లా మ‌త్స్య‌శాఖ జేడీ పీవీ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-24 08:31:45

యాస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి..

 తూర్పు మధ్య బంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం   తీవ్ర తుఫాన్ గా మారనున్న దృష్ట్యా  జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని  జిల్లా ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు  జిల్లా కలెక్టర్ కు సూచించారు.  యాస్ తుఫాన్ పై  జిల్లా కలెక్టర్ ఏం. హరి జవాహర్ లాల్ తో  మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడుతూ జిల్లాలో తీసుకోవలసిన  జాగ్రత్తల పై పలు సూచనలు జారీ చేశారు.  తుఫాన్  ప్రభావిత ప్రాంతాల్లో  ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు  జాగ్రత్తలను తీసుకోవాలని అన్నారు.  అదేవిధంగా చెరువులకు గండ్లు పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.  ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కొడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్నారు.   తుఫాన్ నష్టాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రభావిత ప్రాంతాల, తీరప్రాంతాల ప్రజలను పురనరావాస కేంద్రాలకు  తరలించాలని అన్నారు. 

యాస్ తుఫాన్ సోమవారం  సాయంత్రానికల్లా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని,  దీని దిశ ను  ఎప్పుడైనా   మార్చుకోవచ్చునని,  ముందస్తుగా సర్వం సిద్ధం కావాలని ఆదేశించారు. 

Vizianagaram

2021-05-24 08:21:10

అందుబాటులోకి తుపాను కంట్రోల్ రూమ్..

 యాస్ తుఫాను నేప‌థ్యంలో త‌గిన స‌మాచారం, స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేసేందుకు క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు జిల్లాలోని ప‌లు చోట్ల కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గ‌ణ‌ప‌తిరావు తెలిపారు. ఈ మేర‌కు క‌లెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా క‌మాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆయ‌న సోమ‌వారం ప్రారంభించి సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాటు విజ‌య‌న‌గ‌రం ఆర్డీవో కార్యాల‌యంలో, మ‌త్స్య‌శాఖ విభాగంలో, పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ రం కార్యాలయంలో డివిజ‌న్ స్థాయి కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. అలాగే తీర ప్రాంత మండ‌లాలైన భోగాపురం, పూస‌పాటిరేగ త‌హిసీల్దార్ కార్యాల‌యాల్లో కూడా కంట్రోల్ రూమ్‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని ఆయ‌న వివ‌రించారు. తుఫానుకు సంబంధించిన‌ సమాచారం కావాల్సిన వారు.. స‌హాయ స‌హ‌కారాలు అవ‌స‌ర‌మైన వారు ఈ కింద పేర్కొన్ననెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సూచిస్తూ కంట్రోల్ రూమ్‌ల నెంబ‌ర్ల‌ను వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌రేట్ ఏవో దేవ్ ప్ర‌సాద్‌, డి-సెక్ష‌న్ సూప‌రింటెండెంట్ శ్రీ‌కాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కంట్రోల్ రూమ్ నెంబ‌ర్లు ః 

జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం                       ః  08922 236947
విజ‌య‌న‌గ‌రం, ఆర్డీవో కార్యాల‌యం       ః  98853 67237
పార్వ‌తీపురం, స‌బ్ కలెక్ట‌ర్ కార్యాల‌యం ః 08963 222236
విజ‌య‌న‌గ‌రం, మ‌త్స్య‌శాఖ కార్యాల‌యం ః 08922 273812
భోగాపురం, త‌హసీల్దార్ కార్యాల‌యం        ః 80744 00947
పూసపాటిరేగ‌, త‌హ‌సీల్దార్ కార్యాల‌యం    ః 70367 63036

Vizianagaram

2021-05-24 08:17:29

అర్హులందరికీ జగనన్న తోడు..

 అర్హులంద‌రికీ జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం ద్వారా ల‌బ్ది చేకూర్చాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. వైఎస్ఆర్ బీమా న‌మోదును వేగ‌వంతం చేయ‌డం ద్వారా, పేద‌ల జీవితాల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని కోరారు. జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత‌, వైఎస్ఆర్ పింఛ‌న్ కానుక ప‌థ‌కాల‌పై టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా సోమ‌వారం క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. అర్హులైన ప్ర‌తీఒక్క‌రికి జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం క్రింద రుణాల‌ను మంజూరు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. దీనికోసం వాలంటీర్ల ద్వారా ద‌ర‌ఖాస్త‌ల‌ను సేక‌రించాల‌న్నారు. అలాగే  గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో తిర‌స్క‌ర‌ణ‌కు గురైన ద‌ర‌ఖాస్తుల‌ను పునఃప‌రిశీలించాల‌ని, ల‌బ్దిదారుల అభిప్రాయం తెలుసుకొని, వారి అంగీకారం మేర‌కు రుణాన్ని మంజూరు చేయాల‌ని సూచించారు. ప్ర‌స్తుత క‌రోనా క‌ష్ట‌కాలంలో తోడు ప‌థ‌కం చిరువ్యాపారుల‌కు ఎంత‌గానో ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని అన్నారు. వైఎస్ఆర్ పెన్ష‌న్ కానుక కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, అర్హుల‌కు పింఛ‌న్ మంజూరుకు సిఫార్సు చేయాల‌ని ఆదేశించారు. దీనిపై మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపిడిఓలు ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపాల‌ని సూచించారు.

                వైఎస్ఆర్ బీమా న‌మోదును వేగ‌వంతం చేయాల‌న్నారు. గ‌త ఏడాది జాబితాల‌ను రెన్యువ‌ల్ చేయ‌డంతోపాటుగా, ఈ ఏడాది కొత్త‌గా అర్హుల‌ను గుర్తించి, వారికి ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయాల‌న్నారు. గ‌తేడాది ప‌థ‌కం న‌మోదులో విజ‌య‌న‌గ‌రం జిల్లా రాష్ట్రంలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించిన విష‌యాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప‌నిచేసి, ఈ ఏడాది కూడా న‌మోదు ప్ర‌క్రియ‌ను ఈ నెలాఖ‌రులోగా పూర్తి చేయాల‌న్నారు. ఎస్‌బిఐ, ఎపిజివిబి, ఐఓబి బ్యాంకుల్లో త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌న్నారు. బీమా న‌మోదుకు ప్ర‌తిరోజూ ఉద‌యం 12 నుంచి 2 గంట‌లు వ‌ర‌కూ బ్యాంకులు స‌మ‌యాన్ని కేటాయించాయ‌ని, ఆ స‌మ‌యాన్ని వెలుగు సిబ్బంది వినియోగించుకోవాల‌ని సూచించారు. వైఎస్ఆర్ చేయూత క్రింద, ల‌బ్దిదారుల చేత‌ స్వ‌యం ఉపాధి యూనిట్ల‌ను త్వ‌ర‌గా ప్రారంభింప‌జేయాల‌ని కోరారు. ఎంపిడిఓలు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు జ‌గ‌న‌న్న కాల‌నీల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

               అంత‌కుముందు డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ కె.సుబ్బారావు మాట్లాడుతూ, జిల్లాలో ఈ ప‌థ‌కాల ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రించారు. జిల్లాలో సుమారు 7,17,854 మంది తెల్ల‌కార్డుదారులు ఉన్నార‌ని, వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 6,15,482 కార్డుల స‌ర్వే పూర్త‌య్యింద‌ని చెప్పారు. వీరిలో 4,17,851 మంది పేర్ల‌ను న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కానికి సంబంధించి గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో 16,146 ద‌ర‌ఖాస్తుల‌ను తిర‌స్క‌రించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. వీటిని పునఃప‌రిశీలించి, వారి అంగీకారం మేర‌కు రుణాలు మంజూరు చేస్తామ‌న్నారు. చేయూత ల‌బ్దిదారుల‌చేత యూనిట్ల స్థాప‌న‌కు కృషి చేయ‌డం జ‌రుగుతోంద‌ని వివ‌రించారు.

                ఈ టెలీకాన్ఫ‌రెన్స్ లో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, ఎల్‌డిఎం కె.శ్రీ‌నివాస‌రావు, ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ జెడి వైవి ర‌మ‌ణ‌, వివిధ బ్యాంకుల అధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపిడిఓలు, డిఆర్‌డిఏ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-24 07:17:04

కరోనాలో మంచి మనసుల సహాయం..

కరోనా వైరజ్ విజ్రుంభిస్తున్న సమయంలో మనసున్న దాతలు వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు చేసే ఖర్చులను అనాదలు, ఆపన్నుల ఆకలి తీర్చడానికే వినియోగిస్తున్నారు. నా అనుకునేవారికి దూరమై ఆశ్రమాల్లో ఉంటున్నవారికి చిరు సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖలోని మర్రిపాలెంకు చెందిన హరిహరన్ కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా సింహాచలం శ్రీనివాస నగర్ లోవున్న శ్రీ బంగారుతల్లి వ్రుద్ధాశ్రమంలోని వ్రుద్ధులకు పండ్లు పౌష్టిక ఆహారాన్ని అందించారు. ఈ ప్రాంతంలో సేవాకార్యక్రమాలు నిర్వహించే సామాజిక వేత్తర విజినిగిరి బాలభానుమూర్తి ఆధ్వర్యంలో ఈ వితరణ కార్యక్రమం చేపట్టారు దాతలు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో దాతలు చేసే సహాయం తమ పరిధిలో ఇలాంటి ఆనాధలకు చేయడం ద్వారా వ్రుద్ధులకు మేలు చేసినవారవుతారని అన్నారు.  ఈ కార్యక్రమంలో తంగుడు పవన్ కుమార్, ఎల్.గణేష్, పుష్పలత, నదీమ్ తదితరు పాల్గొన్నారు.

Simhachalam

2021-05-23 14:28:30

ఘనంగా హస్తా నక్షత్రేష్టి మహాయాగం..

ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం తిరుమల ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో హస్తా నక్షత్రేష్టి మహాయాగం నిర్వహించారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన హస్తా నక్షత్రేష్టి మహాయాగంలో విశేషమైన హోమం చేపట్టి అధిష్టాన దేవతను ప్రార్థించారు.  మే 9న ప్రారంభమైన నక్షత్రసత్ర మహాయాగం జూన్ 15వ తేదీ వరకు జరుగనుంది. కృత్తికా నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు అభిజిత్ నక్షత్రం సహా 28 నక్షత్రాల అధిష్టాన దేవతలకు  శ్రౌతయాగాలు నిర్వహిస్తున్నారు.  ఆ తరువాత చంద్రుడు, అహోరాత్రములు, ఉషఃకాలం, నక్షత్ర సామాన్యము‌, సూర్య భగవానుడు, దేవమాత అయిన అదితి, యజ్ఞ స్వరూపుడైన విష్ణువుకు శ్రౌతయాగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని ప్రజలందరూ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటారు. ఈ యాగాల ద్వారా ఆయా అధిష్టాన దేవతలు తృప్తి చెంది విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తారని పండితులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో పీఠం ప్రిన్సిపాల్  కెఎస్ఎస్ అవధాని ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

Tirupati

2021-05-23 12:53:56

ఏకాంతంగా అప్పన్న వైశాఖ పౌర్ణమి..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కి ఈ నెల 26 వైశాఖ పౌర్ణమిని ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈఓ ఎంవీ సూర్య కళ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం దేవస్థానం తరపున మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాలు, కోవిడ్ నిబంధనలు, అర్చకుల విన్నపం మేరకు వైశాఖ పౌర్ణమిని ఏకాతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా అదే రోజు శ్రీ స్వామివారికి రెండో విడత చందనం కూడా సమర్పిస్తారని చెప్పారు. స్వామికి జరిగే ఈ కార్యక్రమాలకు భక్తులకు 26న  సింహగిరిపైకి అనుమతి లేదని పేర్కొన్నారు. వైశాఖ పౌర్ణమికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశముండటంతో కిందినుంచే గేట్లు కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనావైరస్ ప్రభావం తగ్గేవరకూ  శ్రీవారి ఆరాధనాది కార్యక్రమములన్ని ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఆరోజు స్వామి కళ్యాణం జరపని కారణంగా భక్తులు కోనేరు వైపు కూడా వెళ్లకూడదని ఈఓ భక్తులను కోరారు. ప్రస్తుత పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకొని భక్తుల దేవస్థాన అధికారులకు సహరించాలన్నారు.

Simhachalam

2021-05-23 12:34:59

యాస్ తుపాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు..

శ్రీకాకుళం జిల్లాలో అన్ని మండలాల్లో  తహసిల్దార్ కార్యాలయాలలో తక్షణం 24 గంటలు పనిచేసే యాస్ తుపాన్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్  జె.నివాస్ అధికారులను ఆదేశించారు.  రెవిన్యూ, విద్యుత్, గ్రామీణ నీటి పారుదల, తదితర శాఖల ఉద్యోగులతో షిప్ట్ లు వారీగా విధులు నిర్వహించాలని అన్నారు. అత్యవసర సహాయం కొరకు కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ నెం 08942-240557 నంబరుకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. (e-mail id : cosklmsupdtd@gmail.com) ప్రదానమైన నీటి సరఫరా పథకాల వద్ద జనరేటర్ లు ఏర్పాటు చేసి నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా  చర్యలు తీసుకోవాలని ఆర్.డబ్ల్యు.ఎస్ పర్యవేక్షక ఇంజినీర్ టి.శ్రీనివాసరావు ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అవసరమైతే మంచినీటి కులాయిలు, బోర్ వెల్స్ మరమ్మతులు చేయించుటకు విడి పనిముట్లు సిద్దంగా ఉంచాలని పేర్కొన్నారు. విద్యుత్తు వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతుందని అందుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని పేర్కొన్నారు. విద్యుత్తు స్తంభాలను వెంటనే పునరుద్ధరణ చేయుటకు అవసరమైన రవాణా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. తుఫాన్ ప్రభావంగల ఇచ్చాపురం, మందస, కవిటి, సోంపేట, వజ్రపు కొత్తూరు,  సంతబొమ్మాలి,  పోలాకి,  గార,  శ్రీకాకుళం,  ఎచ్చెర్ల, రణస్థలం మండలాలలో అవసరానికి అనుగుణముగా వైద్య శిబిరాలు నిర్వహించుటకు కావలసిన అన్ని  మందులు, బావులు, బొర్ లను క్లోరినేషన్ చేయుటకు క్లోరిన్ టాబ్లెట్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అత్యవసర సేవలకు ఆటంకం కలుగ కుండా జనరేటర్ లు , విద్యుత్ ప్రత్యమ్నాయాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

తుఫాన్ ప్రభావిత గ్రామాలలో పారిశుధ్యం, బావులు, బోర్లు మొదలగు వాటిలో క్లోరినేషన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను తక్షణం కోసి భద్రపరచు కోవడం లేదా కోయకుండా ఉండటం చేయాలని అన్నారు. గ్రామాలలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు తగు సూచనలు చేయాలని ఆదేశించారు. జీడి, మామిడి, కొబ్బరి పంటలకు నష్టం కలుగుటకు అవకాశం వున్నందున రైతులకు తగు సలహాలు అందించారలని చెప్పారు. 

నేటి నుండి 9వ విడత ఫీవర్ సర్వే : కోవిడ్ ను గూర్చి మాట్లాడుతూ సోమవారం నుంచి 9వ విడత ఫీవర్ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఉపాధి హామీ పనులు కల్పించరాదని ఆయన ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు  సుమిత్ కుమార్, డాక్టర్ కె. శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్,  మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ మశిలామని, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-23 12:25:35

యాస్ తుపాను పై యంత్రాంగం అప్రమత్తం..

యాస్ తుఫాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రతి నిత్యం  అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసున్నారు. ఆదివారం కూడా యాస్ తుపాన్ పై సంబంధిత అధికారులతో  జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెక్కలి డివిజన్ మండలాలు అధికంగా తుఫానుకు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ పునరుద్ధరణ, వైద్య శిబిరాలు ఏర్పాటు తదితర అంశాలపై  పూర్తి సంసిద్ధత ఉండాలని ఆయన ఆదేశించారు. పంటల భద్రత గూర్చి రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. శాఖల వారీగా అధికారులు చేపట్టాల్సిన అంశాలపై ఆదేశాలు ఇచ్చారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేసారు. తుఫాన్ ప్రభావిత గ్రామాలలో దండోరా వేయించాలని ఆయన ఆదేశించారు. గ్రామాలలో తీవ్రమైన గాలులు వీచే అవకాశం వున్నందున, తప్పనిసరి పరిస్థితులలో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుటకు రవాణా సౌకర్యాలు సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. తుఫాను రక్షిత భవనములలో నీరు, విధ్యుత్ జనరటర్ మొదలగు సదుపాయాలను సిద్ధం చేయాలని అన్నారు. ఎం.ఎల్.ఎస్ పాయింట్స్, చౌక ధరల దుకాణాలలో ఉన్న నిత్యావసర సరుకులను పునరావాస కేంద్రాలకు అనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. పునరావాస కేంద్రాలు ఆహార పదార్థాలు తయారు చేయుటకు అంగన్వాడి వర్కర్స్ ను సంసిద్ధం చేయాలని, పునరావాస కేంద్రాలలలో చిన్న పిల్లలకు టెట్రా ప్యాక్ పాలు అందించు ఏర్పాటు చేయాలని సూచించారు. తుఫాను ఒడిసా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటనుందని దాని ప్రభావం టెక్కలి డివిజన్ మండలాలు -  ఇచ్చాపురం, సోంపేట, కంచిలి, మందస, వజ్రపు కొత్తూరు, సంతబొమ్మాలి వరకు గల మండలాలలో ఉంటుందని అన్నారు. వాటితో పాటు తీర ప్రాంత మండలాలు - శ్రీకాకుళం, గార, రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, పోలాకి మండలాల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో  టెలి కమ్యూనికేషన్స్ సంబంధిత టవర్స్ వద్ద జనరేటర్ లు, సరిపడ డిజిల్ నిల్వలు ఉండేటట్లుగా సంబంధిత నెట్వర్క్ ఏజెన్సీ లతో మాట్లాడి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో చెట్లు కూలితే వెంటనే రోడ్ క్లియరెన్స్ చేయుటకు అవసరమగు జె.సి.బిలను, విద్యుత్ రంపాలను సిద్ధం చేయాలని అన్నారు. ట్రాక్టర్ లు, డిజిల్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు.  పూరి గుడిసెలలో నివాసం ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుఫాన్ అనంతరం వరదలకు అవకాశం ఉంటుందని, నది పరివాహక మండలాలు,  గ్రామాలలో వి.ఆర్.ఓలు, వి. ఆర్.ఎ లు పోలీస్ లతో సమన్వయం ప్రజలు నదులు, వాగులు, వంకలు దాటకుండా చూడాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు  సుమిత్ కుమార్, డాక్టర్ కె. శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్,  మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ మశిలామని, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-23 12:15:56