1 ENS Live Breaking News

డబుల్ లేయర్ మాస్కుల ధారణ శ్రేయస్కరం..

కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న తరుణంలో ప్రజలంతా రెండు లేయర్లు ఉన్న నాణ్యమైన మాస్కులు ధరించడం ద్వారా కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం వుంటుందనే ప్రభుత్వ సూచనను పాటించాలని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి సూచిస్తున్నారు. ఆదివారం ఈ మేరకు విజయనగరంలో ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సాధారణ మాస్కుల కంటే రెండింతలు పటిష్టంగా ఉండే మాస్కు ధరించడం ద్వారా వైరస్ దరిచేరే అవకాశం తక్కువగా వుంటుందనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించాలన్నారు. బౌతిక దూరం పాటిస్తూ, ఎల్లప్పుడూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏ పనిచేసినా చేతులను సబ్బుతో కడుక్కోవడంతోపాటు, నాణ్యమైన శానిటైజర్లను వినియోగించడం ద్వారా చేతులకు తెలియకుండా అంటే వైరస్ ను నాశనం చేయడానికి అవకాశం వుంటుందన్నారు. అదేవిధంగా మత్స్యకారులెవరూ బయటకు రావొద్దని, ఏ అవసరం వున్నా మత్స్యకార మిత్రాలను సంప్రదించాలన్నారు. కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు గుంపులు గుంపులుగా చేరకూడదన్నారు. ప్రజలు ప్రభుత్వానికి స్వచ్చందంగా సహకరిస్తే అనుకున్న సమయం కంటే ముందుగానే కరోనా వైరస్ ను నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని నిర్మలకుమారి సూచిస్తున్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని, నిత్యం వేడి నీరు తీసుకుంటూ, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చునన్నారు. అదే విధంగా యోగా ప్రాణాయామం చేయడం ద్వారా ఆక్సిజన్ లెవల్స్ ను పెంచుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. 

Vizianagaram

2021-05-23 03:41:40

ప్రైవేటు సంస్థ ఉద్యోగులకూ కోవిడ్ టీకా..

ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే 45 సంవత్సరాలు దాటిన ఉద్యోగులకు ఈ నెల 24, 25, 26 తేదీలలో డివిజన్  కేంద్రాలో మొదటి డోస్ కోవిషీల్డ్ టీకాల పంపిణీ నిర్వహించనున్నామని జిల్లా కలక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేశారు. శనివారం రాత్రి జిల్లాకలెక్టర్ మురళీధరరెడ్డి జిల్లా, డివిజనల్ అధికారులతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల ఉద్యోగులకు తొలి విడత కోవిడ్ వాక్సిన్ నిర్వహణ గురించి ఆదేశాలు జారీ చేసారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సోమ, మంగ్ల, బుధ వారాలలో ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలలో పనిచేస్తున్న 45 ఏళ్లుదాటిన ఉద్యోగులకు కోవిడ్ తొలివిడత టీకాలు వేసేందుకు అన్ని డివిజన్ కేంద్రాలలో మూడు రోజుల పాటు ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు నిర్వహించాలని డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లను కోరారు. ఈ కేంద్రాలలో కేవలం 45 ఏళ్లు దాటిన ఉద్యోగులకు మాత్రమే టికాలు పంపిణీ చేయాలని, వారి కుటుంబ సబ్యులకు జూన్ మొదటి వారంలో మరో విడత పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఇందుకు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల అధికారులు, అధిపతులు ఆదివారం ఉదయం 10 గం.లలోపు అర్హులైన ఉద్యోగుల వివరాలను vaccinationeg@gmail.com  మెయిల్ ఐడికి , లేదా హార్డు కాపీ కలెక్టరేట్ లోని కోవిడ్ విభాగానికి తప్పని సరిగా అందజేయాలని తెలిపారు.  ఆదివారం సాయంత్రం 6 గం.లలోపు శాఖలు, సంస్థలకు రెడ్ కలర్ కూపన్లు అందజేయడం జరుగుతుందని, శాఖాధికారుల ద్వారా కూపన్లు పొందిన ఉద్యోగులు తమ శాఖాపరమైన ఫొటో ఐడి కార్డు, ఆధార్ కార్డు లతో ఆయా డివిజన్ కేంద్రాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాలలో టికాలు పొందాలని తెలిపారు. కార్యాలయ పనులకు విఘాతం లేకుండా మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పంపిణీకి ఒక్కక్క రోజన ఆయా శాఖల నుండి మూడో వంతు ఉద్యోగులను మాత్రమే హాజర్యేట్లు చూడాలని సూచించారు.   హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ సర్వీస్ లకు సంబంధించి 45 ఏళ్లు లోపు ఉద్యోగులు కూడా ఈ ప్రత్యేక పంపిణీకి హాజరు కావచ్చనని తెలిపారు.  ఏ కారణం చేతననై  ఈ మూడు రోజుల్లో హాజరు కాలేక పోయిన వారు ఆందోళన చెందనవసరం లేదని, అటువంటి వారు తమ రెడ్ కూపన్లతో రిగ్యులర్ గా మంగళ, శుక్రవారాల్లో జరిగే పంపిణీలో టీకా వేయించుకోవచ్చుని తెలిపారు. ఈ ప్రత్యేక టీకాల పంపిణీకి అర్హులైన ఉద్యోగులను మాత్రమే ప్రతిపాదించాలని, ఆయా డివిజనల్ కేంద్రాల వద్ద ప్రతి శాఖ నుండి ఒక సమన్వయ అధికారిని మూడురోజుల పాటు నియమించాలని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  తక్కవ వయసు వారు, ఉద్యోగులు కాని వారు వంటి  అనర్హులైన వారెవరైనా ఈ టీకాల పంపిణీకి హాజరైతే సంబంధిత అధికారులపై చర్య చేపడతామని స్పష్టం చేశారు.  ప్రభుత్వ శాఖలతో పాటు పోస్టల్, రైల్వేస్, ఎఫ్సిఐ, బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థలు, షాపులు, మాల్స్, మెడికల్ షాపులు, హొటళ్లు, రెస్టారెంట్లు, మేరేజి ఫంక్షన్ హాళ్ల తదితర సంస్థల ఉద్యోగులకు కూడా ఈ కేంద్రాలలో టీకాలు వేస్తారన్నారు.  అర్హులైన ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులు అందరూ ఈ ప్రత్యేక పంపిణీ సద్వినియోగం చేసుకునేలా చూడాలని అయా శాఖల, సంస్థల అధికారులను జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆర్) జి.లక్ష్మిశ, జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ)  జి.రాజకుమారి, సబ్ కలెక్టర్లు, ఆర్డ్ఓలు, మున్సిపల్ కమీషనర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-22 15:39:17

యాష్ తుపాన్ ను ఎదుర్కోవడాని సన్నద్దం..

విజయనగరం జిల్లాలో యాష్ తుపాన్ ప్రభావం ఎదుర్కోవడానికి సన్నద్దంగా ఉన్నామని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి చెప్పారు. తుపానుపై ముందస్తు చర్యలల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ తో వీడియో కాన్ఫరెన్సు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో ఉన్న సముద్రతీర ప్రాంతాల్లోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని మత్స్యకారులను అప్రమత్తం చేయడానికి అన్ని మండలాల ఎఫ్ డీఓలకు సమాచారం అందించామన్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న గజఈతగాళ్ల సమాచారం కూడా సేకరించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా మరబోట్లను కూడా సిద్ధం చేయాలని తమ క్రిందిస్థాయి సిబ్బందికి సూచించామన్నారు.  ఆస్తి, ప్రాణ నష్టం జగకుండా ఉండేలా మత్స్యకార సంఘాల ప్రతినిధులకు హెచ్చరికలు జారీచేశామన్నారు. గ్రామాల్లోని మత్స్యకార మిత్రల ద్వారా మత్స్యకారులకు కూడా తుఫాను పై అప్రమత్తంగా ఉండేలా చేయాలని సూచించామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తున్నామన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లోని కంట్రోల్ రూమ్ లకు అత్యవసర పరిస్థితుల సమాచారం అందించే విధంగా మత్స్యకారులను చైతన్యం చేస్తున్నామన్నారు.

Vizianagaram

2021-05-22 15:17:19

యాష్ తుఫానుపై అప్ర‌మ‌త్తంగా ఉండండి..

యాష్ తుఫానుపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న‌ ముందస్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా త‌గిన జాగ్ర‌త్తలు వ‌హించాల‌ని సూచించారు. ప్రధానంగా లోత‌ట్టు, తీర ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని చెప్పారు. యాష్ తుఫాను నేప‌థ్యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, వివిధ విభాగాలు చేపట్టాల్సిన చ‌ర్య‌లపై మార్గ‌నిర్దేశం చేసేందుకు శ‌నివారం సాయంత్రం ఆయ‌న జిల్లా స్థాయి అధికారుల‌తో జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ విభాగాల వారీగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై మార్గ‌నిర్దేశం చేశారు. 23వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు తుఫాను ప్ర‌భావం ఉంటుంద‌ని ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండాల‌ని పేర్కొన్నారు. ముందుగా తీర ప్రాంతాల గ్రామ ప్ర‌జ‌ల‌ను, లోత‌ట్టు ప్రాంతాల్లో నివశించే వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌రలించాల‌ని రెవెన్యూ అధికారుల‌ను ఆదేశించారు. తుఫాను షెల్ట‌ర్‌ల ప‌రిస్థితిని స‌మీక్షించాల‌న్నారు. అలాగే గ‌జ ఈత‌గాళ్ల‌ను, మోటార్ బోట్ల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని ఫిష‌రీస్ ఉప సంచాల‌కుల‌ను ఆదేశించారు. స్థానికంగా మండ‌ల కేంద్రాల్లో స‌హాయక కేంద్రాలను ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. అన్ని విభాగాధిపతులు ఆయా విభాగాల సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయాల‌ని ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. 

ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌చారం చేయ‌టం ద్వారా అప్ర‌మ‌త్తం చేయాల‌ని సూచించారు. న‌ష్టాల వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు జిల్లా కంట్రోల్ రూమ్‌కు తెలియ‌జేయాల‌ని, రైన్ ఫాల్ వివ‌రాల‌ను ముందుగా అంద‌జేయాల‌ని సీపీవో విజ‌య‌ల‌క్ష్మిని ఆదేశించారు. ఒడిశా ప్రాంత రైన్ ఫాల్ కూడా అంద‌జేయాల‌ని, దీని ద్వారా నాగావ‌ళి న‌ది ఉద్ధృతిని అంచనా వేసి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ నాగావ‌ళి ఉద్ధృతిని అంచ‌నా వేస్తూ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. చెరువులు, ట్యాంకుల‌ను ముందుగా పరిశీలించి ఎలాంటి న‌ష్టం జ‌ర‌గకుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని డ్వామా, సాగునీటి పారుద‌ల శాఖ అధికారుల‌ను ఆదేశించారు. అలాగే తుఫాను ప్ర‌భావం ఉండే ఈ నాలుగు రోజుల్లో నిత్య‌వ‌స‌ర స‌ర‌కుల పంపిణీకి ఇబ్బంది రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీఎస్‌వో పాపారావుకు చెప్పారు. 24 గంట‌ల్లో గ్రామీణ ప్రాంతాల‌కు స‌ర‌కుల‌ను త‌ర‌లించేయాల‌ని ఆదేశించారు. వైద్య ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ముందుగానే అవ‌స‌ర‌మైన మందుల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని, సిబ్బందిని స్థానికంగా ఉండేలా చూడాల‌ని డీఎం & హెచ్‌వో ర‌మ‌ణ కుమారిని ఆదేశించారు. ఆరోగ్య ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వ‌కుండా మున్సిపాలిటీ, డీపీవో, పంచాయ‌తీ రాజ్ అధికారులు త‌గిన శానిటేష‌న్ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు. విద్యుత్ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ముందస్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఈపీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. పంట న‌ష్టం జ‌ర‌గ‌కుండా స్థానిక ఆర్బీకేల ద్వారా రైతుల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని, పంట‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించుకొనేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వ్య‌వ‌సాయ శాఖ జేడీకి సూచించారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా గ్రామీణ తాగునీటి పారుద‌ల అధికారులు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. హామ్ రేడియోల‌ను సిద్ధం చేయాల‌ని డీపీఎంకి సూచించారు. ఆర్టీసీ, అగ్నిమాప‌క త‌దిత‌ర శాఖ‌లు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఆస్తి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని చెప్పారు. త‌హిశీల్దార్ల ఆధ్వ‌ర్యంలో మండ‌లాల వారీగా న‌ష్టాల వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు జిల్లా కేంద్రానికి అంద‌జేయాల‌ని సూచించారు. అనంతరం ఒక్కో విభాగ అధికారి వారు తీసుకొనే చ‌ర్య‌ల‌ను వివ‌రించారు.

ఆక్సీజ‌న్ త‌ర‌లింపులో ఇబ్బంది రానివ్వ‌కండి

క‌రోనా రోగుల‌కు ఆక్సీజ‌న్ను త‌ర‌లిస్తున్న వాహనాల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు రాకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఎక్క‌డైనా చెట్లు కూలి లేదా ఇత‌ర కారణాల వ‌ల్ల ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డినా.. రాక‌పోక‌లు నిలిచిపోయినా స్థానిక పోలీసు, ఇత‌ర విభాగాల అధికారుల సాయంతో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని చెప్పారు. స్థానికంగా రెవెన్యూ అధికారుల ప‌రిధిలో జేసీబీల‌ను, ఇత‌ర స‌హాయక సామ‌గ్రిని అందుబాటులో ఉంచుకోవాల‌ని సూచించారు. ఫైర్ విభాగ అధికారులు రోప్‌ల‌ను, సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌ని చెప్పారు.

పున‌రావాస కేంద్రాల్లో ఏర్పాట్లు చేయండి

తుఫాను ప్ర‌భావం అయిన గ్రామాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌క్ష‌ణ‌మే త‌ర‌లించేందుకు త‌గిన విధంగా ముందుగానే సిద్దంగా ఉండాల‌ని చెప్పారు. స్థానికంగా ఉండే స‌చివాల‌య సిబ్బందిని వినియోగించుకోవాల‌ని ఆయా విభాగాల అధికారుల‌కు సూచించారు. పాఠ‌శాల‌లు, ఇత‌ర భ‌వనాల‌ను పున‌రావాస కేంద్రాలుగా సిద్ధం చేయాల‌న్నారు. అలాగే వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చాల‌ని సూచించారు. ఆహారం, తాగునీరు త‌దిత‌ర స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని ఆదేశించారు. 


స‌మావేశంలో జేసీలు కిశోర్ కుమార్‌, మ‌హేష్ కుమార్‌, వెంక‌ట‌రావు, పార్వ‌తీపురం స‌బ్‌క‌లెక్ట‌ర్ విధేహ్ ఖ‌రే, పీవో కూర్మ‌నాథ్‌, డీఆర్వో గ‌ణ‌ప‌తిరావు, ఆర్డీవో భవానీ శంక‌ర్‌, సీపీవో విజ‌య‌ల‌క్ష్మి, ఈపీడీసీఎల్ ఎస్ఈ విష్ణు, ఆర్‌.డ‌బ్ల్యూ.ఎస్‌. ఎస్ఈ ర‌వికుమార్‌, ఫిష‌రీస్ డీడీ నిర్మలా కుమారి, వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఆశాదేవి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ వ‌ర్మ‌, డీఎస్‌వో పాపారావు, హార్టిక‌ల్చ‌ర్ డీడీ శ్రీ‌నివాస‌రావు, త‌హిశీల్దార్లు, ఇత‌ర అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-05-22 14:47:55

కలెక్టరేట్ లో తుపాన్ కంట్రోల్ రూమ్..

విశాఖలోని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన ఏర్పడే తుఫాన్, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. ఒక ప్రకటనలో తెలియజేశారు. తుపాను వలన జరిగిన నష్టాలను పేర్కొన్న కంట్రోల్్ రూమ్ కి సమాచారం ఇవ్వడం ద్వారా రెవిన్యూ అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవడానికి వీలుపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాల్లోని తహశీల్దార్లను తుపాను ద్రుష్ట్యా అప్రమత్తం చేసినట్టు కలెక్టర ఆ ప్రకటనలో వివరించారు. అత్యవసర సమయంలో ప్రజలు కంట్రోల్ రూం నెంబర్లు 0891-2590102, 0891-2590100 లో సంప్రదించాలన్నారు.

Visakhapatnam

2021-05-22 14:39:18

జీవిఎంసీలో తుపాన్ కాల్ సెంటర్..

విశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన ఏర్పడే తుఫాన్, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉన్నందున జివిఎంసి అప్రమత్తం అయిందని జివిఎంసి  మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ వలన చెట్లు, కొమ్మలు విరిగిపడ్డా, గెడ్డలు పొంగి రహదారిపైకి ఇళ్ళలోనికి నీరు చేరి ఇబ్బందులు తలెత్తితే  కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబరు 1800 4250 0009 లేదా 0891-2869100 సమాచారాన్ని అందజేయాలని ఆమె కోరారు. జివిఎంసి సిబ్బంది ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు.  24 గంటలు సమస్యలు తీసుకోవడం కోసం జివిఎంసి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్టు ఆ ప్రకటనలో వివరించారు..

విశాఖ సిటీ

2021-05-22 14:31:20

కోవిడ్ నియంత్రణ సహాయం రూ.50.5లక్షలు..

కోవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌తో పాటు బాధితుల‌కు వైద్య‌, ఇత‌ర సేవ‌లు అందించేందుకు జిల్లా యంత్రాంగం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు తూర్పుగోదావ‌రి సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్ అసోసియేష‌న్ చేయూత నందించింది. శ‌నివారం అసోసియేష‌న్ ప్ర‌తినిధులు యార్ల‌గ‌డ్డ వీర్రాజు, దాట్ల దిలీప్‌, ద్వారంపూడి వీర‌భ‌ద్ర‌రెడ్డి.. రూ.50,50,000 చెక్కును కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి సమక్షంలో  క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు. రెండో ద‌శ కోవిడ్ ఉద్ధృతి నేప‌థ్యంలో సామాజిక బాధ్య‌త‌గా కోవిడ్ స‌హాయ నిధికి విరాళం అందించిన జిల్లా సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్ అసోసియేష‌న్‌కు క‌లెక్ట‌ర్‌, శాస‌న‌స‌భ్యులు అభినంద‌న‌లు తెలిపారు. జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కోవిడ్ విప‌త్తును ఎదుర్కోవ‌డంలో వివిధ కార్పొరేట్‌, వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు భాగ‌స్వాములు అవుతున్నాయ‌ని, ఇదే స్ఫూర్తితో మ‌రిన్ని సంస్థ‌లు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో జిల్లా మ‌త్స్యశాఖ జేడీ పీవీ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-22 14:23:18

ఇంజనీరింగ్ పనులు నాణ్యతతో చేపట్టాలి..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధి చేపట్టిన ఇంజనీరింగ్ పనులను నాణ్యతలో రాజీలేకుండా చేపట్టాలని కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని రెండవ జోన్ లోని 7వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మిదిలాపురి ఉడా కోలనీ లో రూ. 78.00 లక్షల తో నూతనంగా నిర్మించదలచిన డ్రైనేజి పనులను కూడా పరిశీలించి వాటికి అంగీకారం తెలిపారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేసి నివేదికలు సమర్పించాలన్నారు. ఆ తరువాత స్థానిక ప్రజలతో మాట్లాడారు.  రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పారిశుధ్య సిబ్బందికి తడి – పొడి చెత్తను వేరు వేరుగాచేసి ఇవ్వాన్న కమిషనర్ కాలువలలో చెత్త వేయరాదని సూచించారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజినీరు శ్యాంసన్ రాజు, రెండవ జోన్ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, కార్యనిర్వాహక ఇంజినీరు శంకర్, సహాయక ఇంజినీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.      

విశాఖ సిటీ

2021-05-22 13:23:17

రేపు విశాఖలో మాంసం అమ్మకాలు నిషేధం..

కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న ద్రుష్ట్యా  మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం మాంసం, చేపలు, రొయ్యలు  అమ్మకాలు నిషేధిస్తున్నాట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ప్రకటించారు. అధికంగా మాంసం దుకాణాల దగ్గర జనం అత్యధికంగా గుమిగూడుతున్నట్టు తమ ద్రుష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం  కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించినప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద చేరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఇకపై కర్ఫ్యూ సమయంలో ఎవరు బయట తిరిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని, కోరనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ వివరించారు.

విశాఖసిటీ

2021-05-22 13:21:38

వేక్సిన్ లేదనే మాట రావడానికి వీల్లేదు..

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అర్భన్ పీహెచ్సీల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందరికీ కోవిడ్ వేక్సినేషన్ చేయాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన, మేయర్ గొలగాని హరి వెంకట కుమారిలు స్పష్టం చేశారు. శనివారం నగరంలోని 8వ జోన్ పరిధిలో 95, 96వ వార్డుల్లోని అర్బన్  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ వేయించుకొనుటకు వచ్చిన ప్రతీ ఒక్కరికి రెండవ డోస్ వేయాలని సూచించారు. వ్యాక్సిన్ లేదని తిరిగి వెళ్ళ కూడదన్న వారు కొవీషీల్డ్ 84 రోజుల పైబడిన వారికి, కోవేక్షిన్ 28 రోజుల పైబడిన వారికి వేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు శనివారం నుంచి   తేది.25.05.2021వ తేది వరకు నగరంలో ప్రతి అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వేక్సినేషన్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ప్రస్తుతం రెండవ డోస్ మాత్రమె వేస్తున్నామన్న వీరు జూన్ మొదటి వారంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ మొదలు పెడతామని చెప్పారు.  మొదటి డోస్ ఏ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఇవ్వడం లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. వ్యాక్సినేషన్ సెంటర్లు రద్దీ దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా కడుగుకోవాలని సూచించారు. గోపాలపట్నం అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించాలని ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని ఆదేశించారు. ఈ పర్యటనలో8వ జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఎఎంఒహెచ్ లక్ష్మి తులసి, వై.సి.పి. నాయకులు బెహర భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.        

విశాఖ సిటీ

2021-05-22 13:19:06

కరోనా నియంత్రణకు మూడంచెల విధానం..

విజయనగరం జిల్లాలో క‌రోనా క‌ట్ట‌డి చేసే ల‌క్ష్యంతో,  వ్యాధి నివార‌ణ‌, చికిత్స‌, నియంత్ర‌ణా కార్య‌క్ర‌మాల‌కు వేర్వేరుగా వ్యూహాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నామ‌ని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ అన్నారు. శనివారం ఈ మేరకు జిల్లా అధికారులు, మీడియాతో జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యాధి సోక‌కుండా నివారించుకోవ‌డ‌మే అత్యుత్త‌మ‌ మార్గ‌మ‌ని, దీనికోసం ప్ర‌జ‌ల్లో విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించే చ‌ర్య‌ల‌ను చేప‌ట్టామ‌న్నారు. మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించ‌డం, భౌతిక దూరాన్ని పాటించ‌డం, త‌రచూ చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం ద్వారా వ్యాధి సోక‌కుండా అడ్డుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. అవ‌గాహ‌న పెంపొందించ‌డంతోపాటుగా, మ‌రోవైపు వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ముమ్మరం చేసిన‌ట్లు చెప్పారు. జిల్లాలో 63 కేంద్రాల్లో వేక్సినేష‌న్ జ‌రుగుతోంద‌ని, జిల్లా అవ‌స‌రాల‌కు త‌గినంత వేక్సిన్ కూడా స్టాకు ఉంద‌ని తెలిపారు.  

మూడు ర‌కాలుగా చికిత్స‌
            వ్యాధి సోకిన‌వారికి చికిత్స‌ను అందించేందుకు మూడు ప‌ద్ద‌తుల‌ను పాటిస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. అత్య‌ధిక శాతం మంది హోమ్ ఐసోలేష‌న్‌లోనే ఉండి చికిత్స పొందుతూ, సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా మారుతున్నార‌ని అన్నారు. ప్ర‌స్తుతం జిల్లాలో 8,659 ఏక్టివ్ కేసులు ఉండ‌గా, వీరిలో 7,270 మంది హోమ్ ఐసోలేష‌న్‌లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నార‌ని చెప్పారు. వీరంద‌రికీ కోవిడ్ కిట్ల‌ను అంద‌జేస్తున్నామ‌ని, 96శాతం మందికి కిట్ల‌ను పంపిణీ చేయ‌డం ద్వారా, రాష్ట్రంలోనే ప్ర‌థ‌మ స్థానంలో నిలిచామ‌ని చెప్పారు. ఇళ్ల‌లో విడిగా, ఏకాంతంగా ఉండ‌టానికి అవ‌కాశం లేని వారికోసం, జిల్లాలో ఏడు చోట్ల కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. వీటిల్లో మంచి భోజ‌న వ‌స‌తుల‌తోపాటు, ఆక్సీజ‌న్ స‌దుపాయాన్ని కూడా క‌ల్పించామ‌ని, మొత్తం 3,700 ప‌డ‌క‌ల‌కు గానూ, ప్ర‌స్తుతం 375 మంది చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు. అలాగే కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స‌ను అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 27 కోవిడ్ ఆసుపత్రుల‌ను ఏర్పాటు చేశామ‌ని, వీటిల్లో 2001 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ ప‌డ‌క‌ల్లో 208 వెంటిలేట‌ర్లు, 496 ప‌డ‌క‌ల‌కు ఆక్సీజ‌న్ స‌దుపాయం ఉంద‌న్నారు. వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స‌ను అందించేందుకు కావాల్సిన‌ మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు, 1014 మంది వైద్యులు, స‌రిపడినంత మంది న‌ర్సులు, సాంకేతిక సిబ్బందిని కూడా నియ‌మించామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం జిల్లాలో సుమారు 2017 రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్లు, అవ‌స‌రాల‌కు స‌రిప‌డా పిపిఇ కిట్లు, మందులు, మాస్కులు, శానిటైజ‌ర్లు కూడా ఉన్నాయ‌ని చెప్పారు. అర్హులైన‌వారంద‌రికీ ఆరోగ్య‌శ్రీ ద్వారా కోవిడ్‌కు ఉచిత‌ వైద్యాన్ని అందిస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 77 శాతం మంది ఆరోగ్య‌శ్రీ‌ని వినియోగించుకున్నార‌ని, ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయ‌డంలో కూడా మ‌న జిల్లా రాష్ట్రంలో మొద‌టి స్థానంలో ఉంద‌ని చెప్పారు.

స‌రిప‌డినంత‌గా ఆక్సీజ‌న్
          మొద‌టి ద‌శ‌తో పోలిస్తే, క‌రోనా రెండోద‌శ తీవ్రంగా ఉంద‌న్నారు.  ఎక్కువ‌మంది యువ‌కులు కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నార‌ని చెప్పారు. చికిత్స‌లో ఆక్సీజ‌న్ అవ‌స‌రం కూడా ఎక్కువ‌య్యింద‌న్నారు.  జిల్లాలో ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గినంత ఆక్సీజ‌న్ కూడా అందుబాటులో ఉంద‌న్నారు. జిల్లాలో రోజుకు సుమారుగా 8.7 మెట్రిక్ ట‌న్నుల ఆక్సీజ‌న్‌ను వినియోగిస్తున్నామ‌న్నారు. దీనిని విశాఖ‌ప‌ట్నం, శ్రీ‌కాకుళం జిల్లాల‌నుంచి తెప్పిస్తున్నామ‌ని, నిల్వ చేసేందుకు ఇటీవ‌లే జిల్లా కేంద్రాసుప‌త్రిలో 10 కిలోలీట‌ర్ల ఆక్సీజ‌న్ ట్యాంకును ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రిలో కూడా 6 కెఎల్ ట్యాంకును ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. ఇటీవ‌లే బొబ్బిలి ఆసుప‌త్రిలో ఆక్సీజ‌న్ ప‌డ‌క‌ల‌ను 6 నుంచి 10కి పెంచామ‌న్నారు. అవ‌స‌ర‌మైన చోట ఆక్సీజ‌న్ కాన్‌సెంటేట‌ర్ల‌ను అందిస్తున్నామ‌న్నారు. త్వ‌ర‌లో జిల్లాలో ఆక్సీజ‌న్ ప‌డ‌క‌ల సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. కోవిడ్ చికిత్స‌కు నిధులుకు కూడా కొర‌త లేద‌ని, ప్ర‌భుత్వం జిల్లాకు సుమారు రూ.14.65కోట్లు కేటాయించ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు రూ.4.5కోట్లు వ‌ర‌కూ ఖ‌ర్చు చేశామ‌న్నారు. త్వ‌ర‌లో జిల్లా కేంద్రాసుప‌త్రిలో జ‌ర్మ‌న్ హేంగ‌ర్ ప‌ద్ద‌తిలో 100 ప‌డ‌క‌ల‌తో ట్ర‌యాజ్‌ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు.

కంటైన్‌మెంట్ స్ట్రాట‌జీ
            కోవిడ్ వ్యాధి ఒక‌రినుంచి మ‌రొక‌రికి వ్యాప్తి చెంద‌కుండా, క‌ట్టుధిట్ట‌మైన నియంత్ర‌ణా చ‌ర్య‌ల‌ను చేప‌ట్టామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. వ్యాధి ఎక్కువ‌గా ఉన్న‌చోట కంటైన్‌మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. క‌రోనా క‌ట్ట‌డికి ఆయా గ్రామ స‌ర్పంచ్‌ల ఆధ్వ‌ర్యంలో గ్రామ స్థాయి క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 778 స‌చివాల‌యాలు ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం 25 స‌చివాల‌యాల ప‌రిధిలోని 143  గ్రామాలు, ఒక్క కోవిడ్ కేసు కూడా లేకుండా గ్రీన్‌జోన్‌లో ఉన్నాయ‌న్నారు.  వీటిని అలాగే ఉంచేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. ఆరెంజ్ జోన్‌లో,  1 నుంచి 10 కేసులు మ‌ధ్య న‌మోదైన స‌చివాల‌యాలు 426, 11-20 కేసులు న‌మోదైన స‌చివాల‌యాలు 199 ఉన్నాయ‌ని, ఈ గ్రామాల‌ను 21 రోజుల్లో గ్రీన్‌జోన్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. రెడ్ జోన్‌లో ఉన్న స‌చివాల‌యాల్లో 31 నుంచి 40 మ‌ధ్య కేసులు ఉన్న‌వి 220, 41-50 మ‌ధ్య కేసులు ఉన్న‌వి 12, 51-100 కేసులు ఉన్న‌వి 11, వంద‌కు పైబ‌డి కేసులు ఉన్న స‌చివాల‌యం ఒక‌టి ఉన్న‌ద‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు. రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు, ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్చేందుకు అవ‌స‌ర‌మైన స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందించిన‌ట్లు చెప్పారు.

ధైర్యంతో ఎదుర్కోవాలి
            వ్యాధి సోకిన‌ప్పుడు ధైర్యంగా ఉంటే, త్వ‌ర‌గా కోలుకొనే అవ‌కాశం ఉంద‌న్నారు. జిల్లాలో మ‌ర‌ణాలు రేటు మొద‌టి ద‌శ‌తో పోలిస్తే, స్వ‌ల్పంగా పెరిగిన‌ప్ప‌టికీ, త‌క్కువ‌గానే ఉంద‌ని చెప్పారు. తొలిద‌శ‌లో 0.7శాతం మ‌ర‌ణాలు న‌మోద‌వ్వ‌గా, రెండో విడ‌త 1.02శాతం ఉన్నాయ‌ని అన్నారు. వైద్యులు చెప్పిన జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ, ఇంట్లో ఉండి కూడా వ్యాధినుంచి విముక్తి పొంద‌వ‌చ్చ‌ని  సూచించారు. వ్యాధిని ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే, అంత త్వ‌ర‌గా న‌యం చేయ‌డానికి వీల‌వుతుంద‌న్నారు. దీనికోసమే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఫీవ‌ర్ స‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఎవ‌రికైనా జ్వ‌రం ఉంటే, దాయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని, దానివ‌ల్ల న‌ష్ట‌మే ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌న్నారు. నూన్య‌తాభావాన్ని విడ‌నాడి, స్వ‌చ్ఛందంగా ప‌రీక్ష‌ల‌ను చేయించుకోవాల‌ని,  చికిత్స చేయించుకోవ‌డానికి ధైర్యంగా ముందుకు రావాల‌ని సూచించారు. ప్ర‌యివేటు ఆసుప‌త్రులు అక్ర‌మాల‌కు పాల్ప‌డితే, క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. దీనికోసం ప‌టిష్ట‌మైన నిఘావ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశామ‌ని,  ఫ్ల‌యింగ్ స్క్వాడ్స్తో పాటు, త‌ర‌చూ విజిలెన్స్ త‌నిఖీలు కూడా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ఇటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌తీఒక్క‌రూ సేవాభావంతో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. జిల్లాలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు ఇంత‌వ‌ర‌కూ న‌మోదు కాలేద‌ని, దానికి కూడా అవ‌స‌ర‌మైన మందులు, ప్ర‌త్యేక విభాగాన్ని సిద్దం చేశామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి ః ఎస్‌పి రాజ‌కుమారి
           జిల్లాలో కోవిడ్ నియంత్ర‌ణ‌కు ప్ర‌జ‌లనుం పూర్తి స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని జిల్లా ఎస్‌పి బి.రాజ‌కుమారి అన్నారు. ప్ర‌జ‌ల్లో ఈ వ్యాధి ప‌ట్ల విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పోలీసు శాఖ త‌ర‌పున 5 ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశామ‌ని, విజ‌య‌న‌గ‌రంలో రెండు, సాలురు, బొబ్బిలి, పార్వ‌తీపురం ఒక్కొక్క‌టి చొప్పున ప‌నిచేస్తున్నాయ‌ని చెప్పారు. వ్యాధి నియంత్ర‌ణ‌కు 92 కంటైన్‌మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేసి, రాక‌పోక‌ల‌ను నియంత్రించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. అలాగే  జిల్లా వ్యాప్తంగా 12 చెక్‌పోస్టుల‌ను పెట్టామ‌ని, ఉద‌యం 12 గంట‌లు త‌రువాత‌, అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తినిస్తున్నామని చెప్పారు. ఇవి కాకుండా ప్ర‌జ‌లు క‌ర్ఫ్యూ స‌మ‌యంలో విచ్చ‌ల‌విడిగా తిర‌గ‌కుండా 13 చోట్ల వాహ‌న త‌నిఖీ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. 41 పెట్రోలింగ్ పార్టీల ద్వారా, 24 గంట‌లూ పోలీసు ప‌హారా ఏర్పాటు చేసి, ఇప్ప‌టివ‌ర‌కూ 279 కేసుల‌ను న‌మోదు చేశామ‌న్నారు. క‌ర్ఫ్యూ ఉల్లంఘ‌న‌కు సంబంధించి 2,108 మందికి చ‌లానా వేశామ‌ని, 34 వాహ‌నాల‌ను, 207 షాపుల‌ను సీజ్ చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా కొంద‌రు మాస్కుల‌ను ధ‌రించ‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. ఇలాంటి 1,24,488 మందికి జ‌రిమానా విధించిన‌ట్లు తెలిపారు. జిల్లాలో గానీ, ఇత‌ర జిల్లాల‌కు గానీ క‌ర్ఫ్యూ స‌మ‌యంలో ఎవ‌రైనా ప్ర‌యాణం చేయాలంటే, త‌ప్ప‌నిస‌రిగా ఇ-పాస్ పొందాల‌ని సూచించారు.  క‌రోనా వ్యాధిని క‌ట్ట‌డి చేయాంటే, ప్ర‌జ‌లు పూర్తిగా స‌హ‌క‌రించి, ఇళ్ల‌లోనే ఉండాల‌ని ఎస్‌పి రాజ‌కుమారి కోరారు.

             ఈ ప్రెస్‌మీట్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, జె.వెంక‌ట‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, స‌మాచార‌, పౌర సంబంధాల‌శాఖ ఎడి డి.ర‌మేష్‌, వివిధ ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Vizianagaram Collectorate

2021-05-22 12:49:05

ఇలాగేనా ప్రజలకు సేవలు చేయడం..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలి తప్పితే గైర్హాజరు దోరణితో పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ గొలగాని హరివెంకట కుమారి హెచ్చరించారు. శనివారం నగరంలోని నాలుగవ జోన్ పరిధిలో 38, 39వ వార్డులలోని పలు సచివాలయాలను మేయర్  ఆకస్మికంగా తనిఖీ చేసారు. స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మేయర్ వెలంపేట-1, వేలంపేట-3, అంబుస్వరంగా వీధిలోని వార్డు సచివాలయాలను సందర్శించి హాజరు పట్టికను, మూమెంట్ రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రజలు పెట్టుకున్న ఆర్జీల రిజిస్టర్ ను తనిఖీ చేసి వాటి నిర్వాహణ సరిగా లేదని, చాల వరకు ఆర్జీలు పెండింగులో ఉన్నాయని వాటిని సరిగా నిర్వహించకపోతే తగు చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. కొంతమంది వార్డు కార్యదర్శులు విధులకు హాజఋ కాకపోవడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అన్ని సేవలు అందాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారని, పేద ప్రజలకు అందవలసిన అన్ని సంక్షేమ పధకాలు వారికి సకాలంలో చేరాలని మేయర్ కార్యదర్సులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాలుగవ జోన్ జోనల్ కమిషనర్ ఫణిరాం, సూపరింటెండెంట్  బాబురావు, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.      

Visakhapatnam

2021-05-22 12:09:30

హౌసింగ్ స్కీమ్ పనులు 90శాతం పూర్తి..

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలందరికీ ఇళ్లు(హౌసింగ్) పథకం పనులను సత్వరమే పూర్తిచేయాలని చీపురుపల్లి మండల ప్రత్యేక అధికారిణి ఎన్.నిర్మలకుమారి  అధికారులను ఆదేశించారు. శనివారం చీపురుపల్లి మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామక్రిష్ణరాజు , ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజయనగరం జిల్లాలో చీపురుపల్లి మండలం హౌసింగ్ లో తొలి స్థానంలో నిలిపేందుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్రుషిచేయాలన్నారు. మండలంలోని 16లేవుట్లలో ప్రతీ లేవుట్ కి రెండు ఇళ్లు చొప్పు 32 మోడల్ ఇళ్లను నెలాఖరు నాటికి ప్రారంభించాలని సూచించారు. 1612 మంది లబ్దిదారులకు సంబంధించిన ఇళ్లు మ్యాపింగ్ నూరుశాతం పూర్తిచేశామన్న ఆమె 1605 ఇళ్లకి జియోట్యాగింగ్ పూర్తికాగా,  1481 జాబ్ కార్డులను పంపిణీ చేసినట్టు వివరించారు.  1596 ఇళ్లకి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిచేశామన్నారు.  165 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తయిందని వివరించారు. త్వరలోనే హౌసింగ్ పనులు ప్రారంభిస్తారని అన్నారు.  లబ్దిదారులను సంప్రదించి మిగిలిఉన్న పనులు పూర్తిచేలని ప్రత్యేక అధికారి ఎన్.నిర్మలకుమారి కోరారు. కార్యక్రమంలో మడలంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Cheepurupalli

2021-05-22 09:40:08

అప్పన్న అన్నధాన పథకానికి భారీ విరాళం..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న) వారి దేవస్థానం శాశ్వత అన్నప్రసాద పథకానికి విశాఖ మాధవధారకు చెందిన ధవళ వెంకట రమణ కుటుంబ సభ్యులు రూ.1,11,111 (లక్షా పదకొండు వేల పదకొండు వందల పదకొండు రూపాయలు)  విరాళంగా ఇచ్చారు. ఈ చెక్కును దేవస్థానం అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి అన్నప్రసాదం ప్రతీ భక్తుడికీ చేరాలనే ఉద్దేశ్యంతో తమవంతుగా ఈ విరాళం సమర్పించినట్టు చెప్పారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-05-22 08:54:02

ఈరోజు అరగదీత చందనం 32 కిలోలు..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కు శనివారం 32 కిలోలు చందనం అరగదీత ద్వారా సమకూరినట్టు దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా  దేవస్థానంలో మీడియాతో మాట్లాడుతూ, స్వామివారికి 26వ తేదీన రెండవ విడత చందనాన్ని సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వివరించారు. అరగదీసిన చందనంతోపాటు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశామన్నారు. స్వామికి ఎవరైనా భక్తులు చందనం సమర్పించాలనుకుంటే దేవస్థాన అధికారులను సందప్రదించాలన్నారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు  మూడు, నాలుగో దఫాలుగా చందన సమర్పణలు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా స్వామివారికి చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-22 08:49:44