వైద్యులు, వైద్య సిబ్బంది కోవిడ్ - 19 రోగులకు అందించిన వైద్య సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలతో బుధవారం ముఖ్య మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, నర్సులు, వైద్యసిబ్బంది, తదితరు లందరూ ఆసుపత్రుల్లో కోవిడ్ సేవలు చాలా బాగా అందించారన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా, మందులు, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ, తదితర కోవిడ్ అంశాలపై సమీక్షించారు. కోవిడ్ నివారణ, NREGS, అర్బన్ క్లినిక్ లు, హౌసింగ్, ఇళ్ల పట్టాలు, రానున్న ఖరీఫ్ లపైన, ఈ నెలలో ప్రారంభించనున్న జగనన్న తోడు, వాహనమిత్ర తదితర పథకాల పై ఆయన సమీక్షించారు.
కె.జి.హెచ్.లో కోవిడ్-19 పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలు గూర్చి స్టాఫ్ నర్సు జి. విజయలక్ష్మి ముఖ్య మంత్రికి వివరిస్తూ సంవత్సరంన్నర నుండి కోవిడ్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 500 మంది వరకు కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని, కోవిడ్ తో ఆసుపత్రిలో చేరడానికి వచ్చిన పేషెంట్లకు 15 నుండి 20 నిమిషాలలో పడక కేటాయిస్తున్నట్లు ఆమె వివరించారు. క్యాస్ లెస్ వైద్య సేవలు అందించడం జరుతోందని, రెమిడెసివర్ ఇంజక్షన్లు పేషెంట్లకు వాడుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య శ్రీ లోనూ కోవిడ్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ రోజు పేషెంట్లు వద్దకు వెళ్లి వారిని పలుకరించి వారి బాగోగులు తెలుసుకొని, శానిటేషన్ చేయించి బెడ్ షీట్లు మార్పిస్తున్నట్లు తెలిపారు. ఎపి టూరిజం నుండి సమయానికి నాణ్యమైన ఆహారం సరఫరా చేస్తున్నారని వివరించారు. పేషెంట్లు ఆక్సిజన్ వృధా చేయకుండా ఆక్సిజన్ వాడకం పై అవగాహన పర్చుతున్నామని చెప్పారు. కోవిడ్ - 19 పేషెంట్లైన 300 మంది గర్భిణులకు ప్రసవాలు చేసినట్లు తెలిపారు. సిబ్బందికి ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళితే సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు గా వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయించారని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ మీరు చేస్తున్న సేవలు ఎవరూ చేయరని, ప్రాణాలను లెక్క చేయకుండా, కోవిడ్ వస్తుందని భయం లేకుండా ధైర్యంగా సేవలందిస్తున్న సిబ్బంది అందరని అభినందించారు. తనవంతు ఎలాంటి సహాయ, సహకారాలు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి యాస్ తుఫాన్ పరిస్థితి పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో చర్చించారు. ఎలాంటి పరిస్థితి నైనా పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సర్వ సన్నద్దతతో ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి కి వివరించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎస్పి బి. కృష్ణారావు, జివిఎంసి కమిషనర్ జి. సృజన, విఎంఆర్డీఎ కమిషనర్ కోటీశ్వరరావు, జెసి లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు,ఐటిడిఎ పిఓ ఎస్. వెంకటేశ్వర్, జెసి-3 ఆర్. గోవిందరావు, ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి, డిఎంహెచ్ఓ సూర్యనారాయణ, డ్వామా పీడీ సందీప్, ఎస్ఇ పిఆర్ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.