1 ENS Live Breaking News

ఐసోలేషన్ కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి..

గ్రామ స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ మండల అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వసతి సౌకర్యాలు మేరకు పాఠశాలలు, కళాశాలలలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో చిన్న గదుల్లో అందరు కుటుంబ సభ్యులు ఉండటం వలన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పటికీ వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. అటువంటి వారిని గ్రామ ఐసోలేషన్ కేంద్రాల్లో పెట్టాలని ఆయన సూచించారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులు బహిరంగ మలవిసర్జన వంటి కార్యక్రమాలకు బయటకు వస్తున్నట్లు సమాచారం ఉందని, గ్రామ ఐసోలేషన్ కేంద్రాల్లో పెట్టడం వలన అటువంటి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు. బయట తిరగటం వలన ఇతరులకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. గ్రామ స్థాయిలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పటిష్టమైన చర్యలు అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సర్పంచ్ అధ్యక్షతన గల గ్రామ స్థాయి యాజమాన్య కమిటీ అన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. గ్రామాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచుగా శుభ్రపరచుకోవడం అనే ప్రాథమిక అంశాలపై ఎక్కువగా అవగాహన ఉండాలని ఆయన వివరించారు. మాస్కు రక్షణ కవచంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. దీనిపై గ్రామస్థాయి కమిటీ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని, పలు కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఎటువంటి రాజీలేని ధోరణిలో వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొంటూ పారిశుద్ధ్య కమిటీ నిధులు లభ్యంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పనులకు పాజిటివ్ వ్యక్తులు హాజరు కాకుండా చూడాలని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలపై తగు దృష్టి కేంద్రీకరించాలని, కరోనా వ్యాప్తి నివారణకు అన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.   ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-22 07:11:10

రేపటి నుంచి 2వ డోసు వేక్సినేషన్..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో కోవేక్షిన్(Covaxin) 15000 సెకండ్ డోస్ లు, 7000 కోవిషీల్డ్ (Covisheild)2వ డోస్ లు వేయించుకోవలసినవారు  మొత్తంగా 23000 మంది ఉన్నారని, ఈ సెకండ్ డోస్ వేయించుకోవలసినవారి కొరకు జివిఎంసి కమీషనర్ డా. జి. సృజన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మే 22 నుంచి 25 వరకు ఉదయం 7 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు ప్రత్యేకంగా(డ్రైవ్) నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దానికోసం జివిఎంసీ వార్డుల్లోని అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మ్యాపింగ్ చేసినట్టు వివరించారు. ఈ క్రింది కొవిడ్ వ్యాకినేషన్ కేంద్రలలో కోవిషీల్డ్ 84 రోజులు పైబడిన వారు, కోవేక్షిన్ 28 రోజులు పైబడిన వారు మాత్రమే వ్యాకినేషన్ చేయించుకోవాలన్నారు. మొదటి డోస్ వ్యాకినేషన్  జూన్ మొదటి వారంలో మొదలు అవుతుందని చెప్పారు. ఈ క్రింది పేర్కొన్న వార్డ్స్ లో టోకెన్ల ప్రకారం కేంద్రానికి  వెళ్లి సెకండ్ డోస్ వ్యాకినేషన్ వేయించుకోవాలన్నారు. వ్యాకినేషన్ కేంద్రానికి వెళ్ళినప్పుడు  ఆదార్ కార్డు కానీ మరి ఏ ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు తో పాటు జివిఎంసీ SMS కూడా చూపించి కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలని కమిషనర్ కోరారు..

GVMC office

2021-05-21 14:51:47

విశాఖలో కోవిడ్ రోగులకు మరో 30 పడకలు..

విశాఖలోని రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు చేయాలని నోడల్ అధికారి, ఐటీడీఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పెదవాల్తేర్ రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిని శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈనెల22 నుంచి కోవిడ్ పేషేంట్లకు ఈ ఆసుపత్రిలో కోవిడ్ పేషేంట్లకు సేవలను అందిస్తామని చెప్పారు. అనంతరం ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు. ఆసుపత్రికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరగా రెండు అంబులెన్స్ లు  సమకూరుస్తున్నామని పీఓ హామీఇచ్చారు. ఆతరువాత రీజనల్ కంటి ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ కోవిడ్ పేషేంట్లకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో రాణి చంద్ర మణి దేవి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రీనివాసరావు, ఎపి  మైనారిటీ కార్పొరేషన్ ఈ డి ఆర్ డబ్ల్యూఎస్ ఈ ఈ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-21 14:36:37

జగనన్నతోడు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జగనన్నతోడు పధకం అమలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగనన్న తోడు, పిఎం స్వానిధి పై జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(DCCB) సిఇఒ వర్మ, యుసిడి(ప్రాజెక్ట్ డైరెక్టర్)  వై. శ్రీనివాసరావు, 18 బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లు,  యుసిడి సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు, జూన్ 8వ తేదీన ప్రారంభమవుతుంది. కావున అర్హులైన లబ్ధిదారులకు జూన్ 2వ తేదీలోగా జగనన్న తోడు,  పీఎం కిసాన్ నిధి, క్రింద జీరో అకౌంట్ ఖాతాలను తెరవాలని యుసిడి(పిడి) వై.శ్రీనివాసరావు ఆదేశించారు. జూన్ 2వ తేదీ నాటికి 9381 ఖాతాలు తెరవాలని టార్గెట్ ఇవ్వడం జరిగిందని, అందుకు బ్యాంకులు  సహకరించాలని కమిషనర్ ఆదేశించారు. అర్హులైన పేద ప్రజలకు ఏవిధమైన అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఈ పథకం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎపిడి లు, డిఎంసి లు, వార్డు వెల్ఫేర్ కార్యదర్శులు పనిచేయాలని ఆదేశించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ  మీకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలన్నారు. జిల్లా కోపరేట్ సెంట్రల్ బ్యాంకు సిఇఒ వర్మ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ “జీరో” ఎకౌంటుతో ఖాతాలు తెరుస్తారని  అందుకు బ్యాంకులు కూడా సహకరిస్తాయని కమిషనర్ కు తెలిపారు. యుసిడి(పిడి) వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నాటికి  జగనన్న తోడు 5063 ఖాతాలు మరియు పీఎం స్వానిధి 4258 ఖాతాలు మొత్తం 9321 ఖాతాలు టార్గెట్ ఇవ్వడం జరిగిందని, ఇప్పటికే 1036 ఖాతాలు తెరవడం అయిందని, మిగిలినవి జూన్ 2వ తేదీ నాటికి నూరు శాతం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సిఎఒ వర్మ, యుసిడి(పి.డి)  వై. శ్రీనివాసరావు, ఎపిడిలు, డిఎంసిలు, 18 బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-05-21 14:30:52

కెజిహెచ్ లో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం..

విశాఖ కె.జి.హెచ్.లో నూతనంగా నిర్మించిన సహజ సిద్దమైన ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ శుక్రవారం ప్రారంభించారు. ప్లాంట్ అంతటిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.  ఆక్సిజన్ తయారీ విధానంగా గూర్చి కలెక్టర్ అడుగగా వాతావరణం నుండి సేకరించిన గాలి నుండి ఆక్సిజన్ నిల్వ, సరఫరా చేయు విధానం గూర్చి ఎలక్ట్రికల్ డి.ఇ. ఫణి కుమార్ వివరించారు.   కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను కె.జి.హెచ్.లోని నర్సింగ్ కళాశాల వసతి గృహంనకు ప్రక్కనే నిర్మించారు.  కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మిషనరీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సివిల్ పనులు కలిపి 3.4 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలిపారు.  రోజుకు 400 వందల ఆక్సిజన్ సిలిండర్లు (2 x 1000 LPM ప్లాంట్) ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, కె.జి.హెచ్. సూపరింటెండెంట్ డా. మైథిలి, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ. డి.ఎ. నాయుడు, ప్రొఫెసర్ డా. ఎం.విజయ శేఖర్, డా. మనోజ్ పాత్రుని, ఎలక్ట్రికల్ డి.ఇ. ఫణి కుమార్, డి.ఇ.ఇ. సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.  

King George Hospital

2021-05-21 13:38:01

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

విశాఖజిల్లాలో సైక్లోన్ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులందరూ అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు.  కలక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులు, సిబ్బందిని విధులలో వుంచాలని డి.ఆర్.ఒ.ను ఆదేశించారు. హాస్పటల్ డిజాస్టర్ ప్రణాళికను సిద్థం చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రులలో విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా బ్యాక్ అప్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. తహశీల్దారులకు 10-15 మంది లైన్ మెన్ లను అందుబాటులో వుంచాలన్నారు. విద్యుత్తు శాఖ ఇంజనీర్లతో ఈ విషయాలపై చర్చించి తగు ముందస్తు ఏర్పాట్లు  చేసుకొని తహశీల్దారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Collector Office

2021-05-21 13:33:03

కరోనాలో దాతల సహాయం మరువలేనిది..

తూర్పుగోదావ‌రి జిల్లాలో క‌రోనా క‌ట్ట‌డి, బాధితుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా వైద్య‌, ఇత‌ర సేవ‌లు అందించేందుకు, 104 అభ్య‌ర్థ‌న‌ల పూర్తిస్థాయి ప‌రిష్కారానికి క‌లెక్ట‌ర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం  ఆద‌ర్శ‌నీయ‌మైన వార్‌రూమ్ కాన్సెప్ట్ ను రూపొందించి, అమ‌లు చేస్తోంద‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ పేర్కొన్నారు. శుక్ర‌వారం ప్ర‌భుత్వ విప్‌, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, క‌లెక్ట‌ర్ డి.మురళీధ‌ర్‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి త‌దిత‌రుల‌తో క‌లిసి మంత్రి వేణుగోపాల‌కృష్ణ తుని ఏరియా ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. అక్క‌డి కోవిడ్ బాధితుల‌తో మాట్లాడి వైద్య‌, ఇత‌ర సేవ‌ల గురించి అడిగి తెలుసుకొని వారిలో ధైర్యం నింపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వేణుగోపాల‌కృష్ణ మాట్లాడుతూ ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు 104 కాల్స్ ప‌రిష్కారానికి అధిక ప్రాధాన్య‌మిస్తూ జిల్లా యంత్రాంగం ప్ర‌త్యేకంగా రోగుల‌కు ట్రాక్‌షీట్లు రూపొందించి, నిరంత‌రం వారి ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. పాజిటివ్ నిర్ధార‌ణ అయిన ద‌గ్గ‌రి నుంచి ఆక్సిజ‌న్ స్థాయిలు, ఔష‌ధాల వినియోగం ఇలా ప్ర‌తి అంశాన్నీ ప‌రిశీలిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం జిల్లాలో జేఎన్‌టీయూ, బోడ‌స‌కుర్రు, బొమ్మూరు కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఆరువేల వ‌ర‌కు ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, ఆందోళ‌న చెంద‌కుండా ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచిన అన్ని వ‌న‌రుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌పై ఉంద‌ని పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లా ఆసుప‌త్రి, జీహెచ్ఎల్, కిమ్స్ అమ‌లాపురం త‌దిత‌ర ఆసుప‌త్రుల‌తో పాటు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు అనే తేడా లేకుండా ఆక్సిజ‌న్ నిల్వ‌ల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు తెలిపారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కోసం, కోవిడ్ క‌ట్ట‌డికి నిరంత‌రం కృషిచేస్తున్నార‌ని.. జిల్లా యంత్రాంగం 24X7 ప‌నిచేస్తూ బాధితుల‌కు అవ‌స‌ర‌మైన సేవ‌లు అందించేందుకు కృషిచేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. జిల్లాలో రోజుకు దాదాపు ప‌దివేల వ‌ర‌కు ఫోక‌స్డ్‌గా, ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి ప‌రీక్ష‌లు చేయ‌డం వ‌ల్ల అధిక కేసులు న‌మోద‌వుతున్నాయ‌న్న వాస్త‌వాన్ని అర్థం చేసుకోవాల‌ని సూచించారు. అపోహ‌లు, వదంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని.. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితి కుదుట‌ప‌డుతోంద‌ని, ల‌క్ష‌ణాల‌ను వీలైనంత త్వ‌ర‌గా గుర్తించి, వైద్య సిబ్బంది సూచ‌న‌ల మేర‌కు మందులు ఉప‌యోగిస్తే హోం ఐసోలేష‌న్‌లోనే ఉండి కోలుకోవ‌చ్చ‌ని తెలిపారు. తుని ఏరియా ఆసుప‌త్రిలో 100 ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని.. కోవిడ్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించాల‌నే ఉద్దేశంతో ప‌ర్య‌ట‌న చేసిన‌ట్లు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ తెలిపారు.

దివీస్‌కు అభినంద‌న‌లు:
సామాజిక బాధ్య‌త‌గా బాధితుల‌కు సేవ‌లందించ‌డంలో త‌మ వంతు భాగ‌స్వామ్యం అందించాల‌నే ఉద్దేశంతో దివీస్ లేబొరేట‌రీస్ లిమిటెడ్ తాజాగా 60 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, ప్ర‌భుత్వ విప్‌, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, క‌లెక్ట‌ర్ డి.మురళీధ‌ర్‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి చేతుల‌మీదుగా వైద్యాధికారుల‌కు అందించింది. తుని ఏరియా ఆసుప‌త్రికి 50, తొండంగి, కోట‌నందూరు పీహెచ్‌సీల‌కు అయిదు చొప్పున కాన్సంట్రేట‌ర్ల‌ను పంపిణీ చేసింది. ఈ సంద‌ర్భంగా దివీస్ సంస్థ‌ను మంత్రి, ఎమ్మెల్యే, క‌లెక్ట‌ర్, జేసీ (డీ) త‌దిత‌రులు అభినందించారు. జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. దివీస్ ఇప్ప‌టికే ఈ నెల 19న జిల్లాకు 40 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించింది. కార్య‌క్ర‌మంలో దివీస్ లేబొరేట‌రీస్ లిమిటెడ్ అడ్మిన్ హెడ్ ఆర్‌.సుధాక‌ర్‌, మేనేజ‌ర్ బి.వాసుబాబు, డీసీహెచ్ఎస్ డా. ర‌మేష్‌కిశోర్‌, వైద్య‌, ఆరోగ్య అధికారులు, సిబ్బంది, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Tuni

2021-05-21 13:28:13

కోవిడ్ వైద్యసేవల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు..

ఆసుపత్రులలో కోవిడ్ రోగులకు వైద్యం అందించడములో  అలసత్వాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టరు వి.వినయ్  చంద్ వైద్యాధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరు ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి మరియు ఇతర అధికారులతో కోవిడ్ వ్యాధి చికిత్స, ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ సరఫరా, వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు మొదలగు విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఆసుపత్రులలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఎల్లప్పుడు వార్డులలో తిరుగుతూ పేషెంట్లకు వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థతిని నిరంతరం పరిశీలిస్తూ వుండాలన్నారు. ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడు పర్యవేక్షిస్తూ వుండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి, ఇ.ఎన్.టి., ఆర్.ఇ.హెచ్, సైకియాట్రి మొదలగు టీచింగ్ ఆసుపత్రులలో సమస్యలపై చర్చించారు. ఛాతీ ఆసుపత్రి, ఇ.ఎన్.టి. ఆసుపత్రులకు  అవసరమైన స్టాఫ్ నర్సులు, నర్సులను నియమించాలని ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్ డా.పి.వి.సుధాకర్ కు సూచించారు.  ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలండర్స్ విషయంపై చర్చించారు. ఆక్సిజన్ పూర్తిగా అయిపోయినప్పుడు కాకుండ తగు స్థాయిలో వుండగానే మేల్కొని తెలియజేయాలని, ఈ విషయంలో ఆప్రమత్తంగా వుండాలన్నారు.
ఆక్సిజన్ స్థాయి 90-94 వరకు వున్న పేషెంట్లను టీచింగ్ ఆసుపత్రులలో తప్పని సరిగా ఎడ్మిట్ చేసుకొని వైద్య సేవలు అందించాలన్నారు.  ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని ఈ నాలుగు ఆసుపత్రులను పరిశీలించాలన్నారు. కేవలం  కోమార్పిడిటీస్ తో బాధపడుతున్న సీరియస్ కేసులను మాత్రమే కె.జి.హెచ్. విమ్స్ లకు పంపించాలన్నారు. అనస్థీషియా, టెక్నీషియన్ల నియమాకినికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వెంటిలేటర్లు అన్నింటినీ  ఒకే చోటకు తీసుకువచ్చి  సాంకేతిక నిపుణులతో అవసరమైన మరమ్మత్తులు గావించి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులకు కే.జి.హెచ్. లోనే ట్రీట్మెంట్ గావించాలన్నారు. కమిటీ పర్యవేక్షణలో వీరికి వైద్య సేవలు అందించాలన్నారు.  
ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీలు
  జిల్లాలో 57 ప్రైవేటు ఆసుపత్రులలో పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలు, బెడ్స్, తదితర విషయాలపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని కలెక్టరు ఆదేశించారు. జాయింట్ కలెక్టరు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఆర్.డి.ఒ.లు తనిఖీలు నిర్వహించాలన్నారు.
ఆసుపత్రులలో బెడ్స్ విషయమై ఇప్పటికే సూచించిన విధముగా సాఫ్ట్ వేరు ను త్వరగా తయారు గావించాలని ఎ.డి.(సర్వే) మనీషా త్రిపాఠి ను అదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరులు యం.వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, ఐ.టి.డి.ఎ.ప్రాజెక్ట్  అధికారి ఎస్.వెంకటేశ్వర్, ఎ.ఎమ్.సి. ప్రిన్సిపాల్ డా. సుధాకర్, కె.జి.హెచ్ సూపరింటెండెంట్  డా. మైథిలీ, డి.ఎం.హెచ్.ఒ. డా.సూర్యనారాయణ, ఆర్.సి.హెచ్, ఆర్.ఇ హెచ్., ఇ.ఎన్.టి, సైకియాట్రి ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఎ.డి (డ్రగ్స్)రజిత, జి.ఎం.డి.ఐ.సి.రామలింగరాజు, ఎపి.ఎం.ఎస్ ఐ.డి.సి, ఇ.ఇ, డి.ఎ.నాయుడు, తదితర అధికారులు హాజరయ్యారు.

Collector Office

2021-05-21 13:05:01

ఎస్ఆర్ పీకి అన్ని వర్గాలు మద్దు అవసరం..

జివిఎంసీ అమలు చేస్తున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, భారత ప్రభుత్వం (UNDP-GoI)ప్రాజెక్టులో భాగంగా కమిషనర్ డా. జి. సృజన సుస్థిరత మరియు స్థితిస్థాపకత (Sustainability and Resilience Programme(SRP))ను శుక్రవారం ప్రారభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ ఎస్ఆర్పీ కార్యక్రమానికి నోడల్ అధికారులుగా జివిఎంసి అదనపు కమిషనర్లు ఆషా జ్యోతి, డా. వి. సన్యాసి రావు, వ్యవహరిస్తారని కమిషనర్ తెలిపారు. ఇందులో జివిఎంసి పరిధిలో అందరు ఉన్నతాధికారులు, మేయర్,  కార్పొరేటర్లు ముఖ్య పాత్ర పోషిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం దీర్ఘకాలిక సుస్థిరత సాధించడానికి సంస్థాగత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. పరిపాలన వివిధ అభివృద్ధి కార్యకాలాపాలలో నగరానికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. ఈ సస్టైనబిలిటీ , రెసిలిఎన్స్ యూనిట్ (SRU) కార్యక్రమాన్ని , దాని రాబోయే సెల్ఫ్ ఎన్విరాన్మెంట్ సెల్, క్లైమేట్ సెల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, హ్యూమన్ రీసోర్సు డెవలప్మెంట్ సెల్ ద్వారా అమలు చేస్తుందని కమిషనర్ తెలిపారు. మేయర్, కార్పొరేటర్లను ప్రస్తుత, భవిష్యత్ అత్యవసర పరిస్థితులను మెరుగైన రీతిలో ఎదుర్కోవడానికి సస్టైనబిలిటీ మరియు రెసిలిఎన్స్ ప్రోగ్రాం బృందానికి మద్దతు ఇవ్వాలని కోరారు.  అంతేకాకుండా కోవిడ్-19 సెకండ్ వేవ్ , భవిష్యత్ సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని విపత్తుల ప్రమాదాన్ని తగ్గించడంలో కార్యకలాపాలను వార్డు స్థాయిలో సంబంధిత కార్పొరేటర్లు చేపట్టడానికి అవకాశం వుంటుందన్నారు. వార్డు సచివాలయాలు, ప్రజలు , ఇతర లబ్దిదారులు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తుందని వివరించారు. వ్యర్ధ పదార్ధాల నిర్వహణ, అవగాహన ,  అత్యవసర స్పందన  సామర్ధ్యం పెంపొందించడం మొదలైన కార్యక్రమాలు ఇందులో ఉంటాయని కమిషనర్ చెప్పారు.

GVMC office

2021-05-21 12:39:01

అప్పన్న ఆలయంలో ధన్వంతరీ హోమం..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)వారి దేవస్థానంలో  24న లోకకల్యాణార్ధం, ప్రజారోగ్యం కోసం ధన్వంతరి హోమం - సుదర్శన హోమం చేపడుతున్నట్టు ఈఓ ఎంవీసూర్య కళ చెప్పారు. శుక్రవారం ఈఓ దేవస్థానంలో మీడియాతో మాట్లాడుతూ, సమస్త ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో స్వామికి ఈ హోమాలు చేయడం ద్వారా ఆయన కరుణా కటాక్షాలు ప్రజలకు చేరతాయనే నమ్మకంతో అనాదిగా ఈ హోమాలు చేస్తూ వస్తున్నారని చెప్పారు. దీనికోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. లోక కళ్యాణార్ధం నిర్వహించే ఈ హోమంలో భక్తులు భాగస్వాములు కావచ్చునని చెప్పారు. దానికోసం భక్తులు దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-21 12:23:43

మరింతగా దాతలు ముందుకి రావాలి..

కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ఎంతో ముఖ్యమైనవని, ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందజేయడం ఎంతో గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కరోనా నేపథ్యంలో 10 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను హైదరాబాద్ కు చెందిన గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ మేనేజర్ ప్రభాకర్, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, తదితరులు జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాంటి పరిస్థితుల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కోసం ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక్కో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్ 1 లక్ష 50 వేల రూపాయల విలువ చేస్తాయన్నారు. కరోనాలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కోసం ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏయూపి సూర్య మోహన్, సీనియర్ మేనేజర్ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-21 12:06:02

బ్లాక్ ఫంగస్ పై ఆందోళన వద్దు..

బ్లాక్ ఫంగ‌స్ (నాసో ఆర్బిట‌ల్ మెనింగ్ మ్యుక‌ర్ మైకోసిస్‌) వ్యాధిపై ఎవ‌రూ అన‌వ‌స‌ర అందోళ‌న‌కు గురికావొద్ద‌ని.. భ‌య‌ప‌డ వ‌ద్ద‌ని జేసీ డా. ఆర్‌. మహేష్ కుమార్ అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని తెలిపారు. జిల్లా కేంద్రాసుప‌త్రిలో ముందు జాగ్ర‌త్త‌గా 20 ప‌డ‌క‌ల‌తో ప్ర‌త్యేక ఏర్పాటు ఏర్పాటు చేసి సేవ‌లందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. నిరంతరం వైద్య బృందం అందుబాటులో ఉంటుంద‌ని పేర్కొన్నారు. క‌రోనా నుంచి కోలుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ ఆ వ్యాధి సోక‌ద‌ని.. కావున అన‌వ‌స‌ర ఆందోళ‌న‌కు గురికావొద్ద‌ని ధైర్యం చెప్పారు. ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ర‌కాల చ‌ర్యలూ తీసుకుంటున్నామ‌ని, వ్యాధి సోకిన వారికి ప్ర‌భుత్వం ఉచితంగా ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తుంద‌ని వివ‌రించారు. ఈ మేర‌కు ఆయ‌న‌ జిల్లా కేంద్రాసుప‌త్రి సూపరింటెండెంట్ డా. సీతారామ‌రాజు, మైక్రోబ‌యోలిజిస్టు డా. శ్ర‌వంతిల‌తో శుక్ర‌వారం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెంద‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైన వైద్యుల‌ను, సిబ్బందిని, స‌రిప‌డా మందుల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని సూచించారు.

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌టప‌డ్డామురా దేవుడా అనుకునే స‌రికి కొత్తగా వ‌చ్చిన బ్లాక్ ఫంగ‌స్ వ్యాధి ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ వ్యాధిని అరిక‌ట్టడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇది వ‌ర‌కే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఖ‌రీదైన చికిత్స కాబ‌ట్టి ఒక వేళ ఎవ‌రికైనా బ్లాక్ ఫంగ‌స్ వ‌స్తే ఆరోగ్య శ్రీ ప‌థకంలో భాగంగా చికిత్స అందించేందుకు నిర్ణ‌యించింది. జిల్లాల్లో త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌జ‌ల  ప్రాణాలు కాపాడాల‌ని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌ ఆధ్వ‌ర్యంలో అధికార యంత్రాంగం త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతోంది. 20 ప‌డ‌క‌ల‌తో కూడిన‌ ప్ర‌త్యేక వార్డు, అందులో వైద్య నిపుణులు ఉండేలా ఏర్పాట్లు చేసింది. ప్ర‌స్తుతం అందిరిలోనూ భ‌యాందోళ‌న‌లు రేకెత్తిస్తోన్న ఈ బ్లాక్ ఫంగస్ ఎందుకు వ‌స్తుంది. ఎవ‌రికి వ‌స్తుంది. ల‌క్ష‌ణాలు ఏంటి. ఒక వేళ వ‌స్తే చికిత్స ఏంటి.. ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు అధికారులు, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకుందాం. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుందాం.

బ్లాక్ ఫంగ‌స్‌ ఎవ‌రికి వ‌చ్చే అవ‌కాశం ఉంది

నాసో ఆర్బిట‌ల్ మెనింగ్‌ మ్యుక‌ర్ మైకోసిస్ లేదా రీనో సెరిబ్ర‌ల్ మ్యుక‌ర్ మైకోసిస్‌గా పిలిచే బ్లాక్ ఫంగ‌స్ వ్యాధి ముదిరితే ప్రాణాపాయం వ‌ర‌కు తీసుకెళుతుంది. ముక్కు నుంచి కంటికి.. కంటి నుంచి మెద‌డుకు చేరుకొని అవ‌యవాల‌ను పాడుచేస్తుంది. నియంత్ర‌ణ లేని మ‌ధుమేహ రోగులకు ఎక్కువ‌గా ఈ ఫంగ‌స్ సోకే ప్ర‌మాద‌ముంద‌ని వైద్య నిపుణులు తేల్చారు. అలాగే సైన‌సైటిస్ ఉన్న వారికి ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్లు వైద్యులు ఇప్ప‌టికే గుర్తించారు. ఐసీయూలో ఎక్కువ కాలం ఉండి చికిత్స పొందిన వారికి ప్ర‌మాద‌ముంది. క‌రోనా సోకి ప‌రిస్థితి తీవ్ర‌మైన వారికి స్టెరాయిడ్స్ వాడ‌టం త‌ప్ప‌నిస‌రి. క‌రోనా త‌గ్గిపోవాల‌నే ఉద్దేశంతో మ‌ధుమేహ రోగుల‌కు విచ‌క్ష‌ణా ర‌హితంగా కొన్ని ఆసుప‌త్రుల్లో స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. స్టెరాయిడ్స్ ప్రాణాధార మందులే అయిన‌ప్ప‌టికీ మితిమీరి వాడ‌టం వల్ల వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. ఈ ఫంగ‌స్ గాలి పీల్చుకోవ‌టం ద్వారా ఎక్కువ‌గా ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వెంటిలేట‌ర్లు శుభ్రం చేయకుండా ఎక్కువ కాలం వాడ‌టం కూడా వ్యాధి సోక‌డానికి కార‌ణ‌మ‌ని పేర్కొంటున్నారు.

ల‌క్ష‌ణాలు ఏంటి...

క‌రోనా బారిన ప‌డి ఎక్కువ కాలం ఐసీయూలో చికిత్స పొందిన వారు స్టెరాయిడ్స్ వినియోగించిన వారిలో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉండొచ్చు. క‌రోనా చికిత్స అనంత‌రం 10 నుంచి 15 రోజుల్లోపు ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. అలాగే మొహం వాపు. కింటి గుడ్డు కింద ఎర్ర‌బడి దుర‌ద‌గా ఉండ‌టం. ముక్కులో దుర‌ద వేయ‌టం. ప‌దేప‌దే ముక్కును న‌లిపేయాలి అనిపించ‌టం. ముక్కు నుంచి న‌ల్ల‌టి ద్ర‌వం కార‌టం. క‌ళ్ల‌పైనా లేదా కింద చిన్న బొబ్బ‌లు రావ‌టం. ఉబ్బిన‌ట్లు అనిపించ‌టం. కంటి చూపు త‌గ్గిపోవ‌టం.. మ‌సక మ‌స‌క‌గా క‌నిపించ‌టం. దంతాల్లో నొప్పి, తిమ్మిరి, వాపు వంటితో పాటు మొద్దుబార‌టం కూడా వ్యాధి ల‌క్ష‌ణాలు. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే ఆల‌స్యం చేయ‌కుండా కేంద్రాసుప‌త్రిలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక వార్డులో ఉన్న వైద్య బృందాన్ని సంప్ర‌దించాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

ఎలాంటి చికిత్స అందిస్తారు...

ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. ఒక వేళ ఎవ‌రికైనా వ్యాధి సోకితే చికిత్స అందించేందుకు వైద్య బృందం సిద్ధంగా ఉంది. 20 కేసుల‌కు స‌రిప‌డా మందుల‌ను అందుబాటులో ఉంచుకున్నారు. వ్యాధి బారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి 21 రోజుల పాటు చికిత్స అవ‌స‌రమ‌ని డా. శ్ర‌వంతి తెలిపారు. అలాగే 21 రోజుల పాటు ఏంఫోటెరిసిన్ ఇంజెక్ష‌న్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని చెప్పారు. చికిత్స అనంత‌రం 45 రోజుల పాటు పోసోకానజోల్ మాత్ర‌లు వేసుకోవాల‌ని అప్ప‌డు వ్యాధి పూర్తిగా న‌య‌మవుతుంద‌ని వివ‌రించారు.  

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి..

ముందుగా క‌రోనా సోక‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. మాస్కు ధ‌రించుట‌, సామాజిక దూరం పాటించుట వంటి నియ‌మాలు పాటించాలి. ధూళి ఉన్న ప్ర‌దేశాల్లో, నిర్మాణాలు జ‌రిగే ప్రాంతాల్లో తిర‌గ‌కుండా ఉండాలి. ఒక వేళ క‌రోనా సోకితే.. సాధ్య‌మైనంత వ‌ర‌కు మామ్మూలు మందులతో న‌య‌మైపోయేలా చూసుకోవాలి. శ్వాసకు సంబంధించిన ఎక్స‌ర్‌సైజ్‌లు చేయాలి. మోతాదుకు మించి స్ట‌రాయిడ్స్ వాడ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఇమ్యునో మోడ్యులేటింగ్ డ్ర‌గ్స్‌ను నిలిపివేయటం. ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని అధికారులు, వైద్య నిపుణులు చెబుతున్నారు. 

జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

బ్లాక్ ఫంగ‌స్‌గా పిలిచే ఈ వ్యాధి జిల్లాలో ఏవ్వ‌రికీ సోక‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోద‌వ్వ‌లేదు. రాష్ట్రంలో సుమారుగా 20 కేసులు న‌మోదు కాగా..  ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో మాత్రం చాలా త‌క్కువ‌గా న‌మోద‌య్యాయి. శ్రీ‌కాకుళం నుంచి ఒక‌టి, విశాఖ‌ప‌ట్టణంలో అయిదు కేసులు న‌మోదయ్యాయి.   మ‌న జిల్లాలో ఒక్క కేసు కూడా న‌మోద‌వ్వ‌లేద‌ని డా. సీతారామ‌రాజు పేర్కొన్నారు. 

ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం
ః డా. ఆర్‌. మ‌హేష్ కుమార్‌, సంయుక్త క‌లెక్ట‌ర్‌

ఈ వ్యాధిపై ఇప్ప‌టికీ వైద్య నిపుణుల‌తో చ‌ర్చించాం. కేంద్రాసుప‌త్రి సూప‌రింటెండెంట్ ఆధ్వ‌ర్యంలో మ‌హారాజ ఆసుప‌త్రిలో ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు చేశాం. అందులో నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటారు. వ్యాధి ల‌క్ష‌ణాలు గుర్తించిన వెంట‌నే మ‌హారాజ ఆసుప‌త్రిలో ఏర్పాటు చేసిన సెల్‌లో సంప్ర‌దిస్తే వెంట‌నే వైద్య‌ప‌ర‌మైన సేవ‌లు అందిస్తాం. జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోద‌వ్వ‌న‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్త‌గా అన్ని ర‌కాల వైద్య ప‌రమైన ఏర్పాట్లు చేశాం. వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నాయి. దీనిపై ఎలాంటి భ‌యానికీ గురికావొద్ద‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నాం. అధికార యంత్రాంగం ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతోంది.

జాగ్ర‌త్త‌లు పాటిస్తే ఏం కాదు...
ః డా. సీతారామ‌రాజు, సూప‌రింటెండెంట్‌, మ‌హారాజ ఆసుప‌త్రి

క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత 10 నుంచి 15 రోజుల్లో వ్యాధి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. కావున క‌రోనా నుంచి చికిత్స పొందిన ఇంటికెళ్లిన త‌ర్వాత కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి. దుమ్ము, ధూళి, నిర్మాణ ప్రాంతాల్లో ఎక్క‌వ‌గా తిర‌గ‌కూడ‌దు. రోగ నిరోధ‌క శక్తి త‌క్కువ‌గా ఉన్న‌వారిపైనే దీని ప్ర‌భావం ఉంటుంది. కావున మంచి ఆహారం తీసుకోవాలి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలి. మాస్కు ధ‌రించుట‌, భౌతిక దూరం పాటించుట చేయాలి. నియ‌మాలు పాటిస్తూ ప‌రిశుభ్ర‌త పాటిస్తే ఈ వ్యాధి ద‌రిచేర‌దు. దీనిపై అన‌వ‌స‌రమైన ఆందోళ‌న చెంద‌వ‌ద్దు. క‌లెక్ట‌ర్‌, జేసీల సూచ‌న‌ల మేర‌కు జిల్లా కేంద్రాసుప‌త్రిలో ముందస్తుగా 20 ప‌డ‌క‌ల‌తో ప్ర‌త్యేక వార్డు ఏర్పాటు చేశాం. అందులో ఇద్ద‌రు వైద్య నిపుణులు, ఇద్ద‌రు ల్యాబ్ టెక్నీషియ‌న్స్‌, ప‌రీక్ష‌లు చేయించేందుకు గాను మైక్రోబ‌యోల‌జిస్టు డా. శ్ర‌వంతి అందుబాటులో ఉంటారు. ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వీరిలో ఎవ‌రిని సంప్ర‌దించినా వైద్య సేవ‌లు వెంట‌నే అందుతాయి. 

కలెక్టరేట్

2021-05-21 12:03:15

వేరుశనగ విత్తన పంపిణీని సజావుగా జరగాలి..

రైతులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లా వ్యాప్తంగా వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం సింగనమల మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విత్తన వేరుశెనగ పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు వేరుశనగ విత్తనం తీసుకునేలా రైతుల చేత రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పించేందుకోసం గ్రామాల్లో టాంటాం వేయించాలని వ్యవసాయ శాఖ జెడి, వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులకు నాణ్యమైన కె6 రకం వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎంతమంది రైతులు విత్తనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది రైతులకు విత్తనాన్ని పంపిణీ చేశారు అనే వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, గత ఏడాది కూడా పొలాల్లో విత్తనాలు వేశారా, మీకు ఎన్ని బస్తాల వేరుశనగ ఇస్తున్నారు అనే వివరాలను ఆరా తీశారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి చిన్నమ్మ మాట్లాడుతూ సింగనమల మండలంలో వేరుశెనగ విత్తన పంపిణీ చేస్తున్నామని, మండలంలో అర్హత కలిగిన రైతులు 3606 మంది ఉండగా, అందులో 427 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారికి వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. సింగనమల మండలానికి 5015 క్వింటాళ్ల వేరుశనగను కేటాయించడం జరిగిందని, మండలంలోని ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు వేరుశనగ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, అనంతపురం ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీనారాయణ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Singanamala

2021-05-21 10:24:58

కోవిడ్ రోగులకు తక్షణ వైద్య సహాయం..

కోవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు కమ్యునిటీ హెల్త్ సెంటర్ ను కోవిడ్ ఆసుపత్రిగా మర్పు చేసినట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం మంత్రి జిల్లా పర్యటనలో భాగంగా పుంగనూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ట్రయేజ్ సెంటర్ ను మంత్రి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్.రెడ్డప్ప, తంబళ్లపల్లి శాసన సభ్యులు పెద్ది రెడ్డి ద్వారకనాధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తో కలిసి ప్రారంబించారు. అనంతరం ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన పడకల సామర్ధ్యంను మంత్రి స్వయంగా పరిశీలించారు. వైద్య సేవలు అందించడంలో పూర్తి బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు (అభివృద్ది, సంక్షేమం) వి.వీరబ్రహ్మం, ఎన్.రాజశేఖర్, మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, మున్సిపల్ ఛైర్మన్ షేక్ ఆలీమ్ బాషా, డి.ఎం.హెచ్.ఓ డా.పెంచలయ్య, డి.సి.హెచ్.ఎస్.(ఇంచార్జ్) డా.అరుణకుమార్, ఎ.పి.ఎం.ఐ.డి.సి దనంజయరెడ్డి, కమ్యునిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ చిరమల, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

Punganur

2021-05-21 10:09:08

జైలులో ఖైదీలకు కరోనా పరీక్షలు..

విజయనగరంజిల్లాలో కోవిడ్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలను చేపట్టింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశాల మేరకు, విజయనగరం సబ్ జైలులో శుక్రవారం కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. జైలు లో ఉన్న 28 మంది అండర్ ట్రయిల్ ఖైదీలు, 10 మంది జైలు సిబ్బంది నుంచి స్వాబ్స్ తీసి, మిమ్స్ ఆసుపత్రిలోని ల్యాబ్ కి, పరీక్షల కోసం పంపించారు. జైలు సూపరింటెండెంట్ దుర్గారావు, డి.ఎస్.జె.ఓ మధుబాబు పర్యవేక్షణలో, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో, ప్రత్యేక వైద్య బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. జైలులో కూడా ప్రతీఒక్కరు మాస్కులను ధరించాలని, ఇతర కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా వైద్యులు కోరారు.

Vizianagaram

2021-05-21 10:00:07