1 ENS Live Breaking News

ఈ కరోనాలో వైద్యుల పాత్ర చాలా కీలకం..

వైద్యులు కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మాత్యులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) వైద్యులకు దిశా నిర్దేశం చేశారు.  కె.జి.హెచ్.లోని కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న సేవలు, అడ్మిషన్లు, పడకలు, ఆక్సిజన్ సరఫరా, ప్రస్తుతం వున్న  వైద్యులు, తదితర సిబ్బంది, మందులు, తదితర అంశాలపై ఆయన జిల్లా ఇన్ చార్జ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి జి. సాయి ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణు గోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, కె.జి.హెచ్. వైద్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిచారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడకలు, ఆక్సిజన్ మేనేజ్ మెంట్ కు ఒక్కొక్క నోడల్ అధికారి ఉండాలన్నారు.  ఆసుపత్రిలో అవసరమైన ప్రతీ పేషెంట్ కు ఆక్సిజన్ సరఫరా ఖచ్చితంగా జరగాలని ఆయన ఆదేశించారు.  వైద్యులు, నర్సులు పేషెంట్ల బాగోగులు తెలుసుకొని ధైర్యం చెప్పాలన్నారు.  వారి సేవలు సి.సి. కెమేరాల్లో కె.జి.హెచ్. పర్యవేక్షకులు డా. మైథిలి పరిశీలించాలని ఆదేశించారు.  ఆక్సిజన్ సరఫరా ఆగకుండా నిరంతరాయంగా జరగాలని, సరఫరా స్థాయిని గమనించి మరో ట్యాంకర్ రప్పించాలన్నారు. ఆక్సిజన్ వృధా కాకుండా, వాడకంపై పేషెంట్లకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన సాంకేతిక సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.  ఆహారం నాణ్యతను మరింత పెంచాలన్నారు.  వైద్యులు మరింత శ్రమించి మానవతా దృక్పదంతో  సేవ చేయాలన్నారు..  డ్యూటీలో ఉన్న వైద్యులు, సిబ్బంది భోజనాలకు ఇళ్లకు వెలితే సమయం వృదా అవుతుందని, పేషెంట్లకు ఇచ్చే భోజనాలనే చేయాలని చెప్పారు. ఆసుపత్రుల వారీగా ఆక్సిజన్ మేనేజ్ మెంట్, తదితర అంశాలపైన వివరాలు తెలిపాలన్నారు.  కోవిడ్ విధుల్లో ఏ ఒక్కరూ నిర్లక్ష్యం, అలసత్వం కూడదన్నారు. కోవిడ్ తో కెజిహెచ్ కు వచ్చే ఏ పేషెంటుని వేచి ఉంచ వద్దని, అడ్మిషన్ చేయించుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో సంబంధిత అటెండెంట్ కు పేషెంటు యొక్క సమాచారంను హెల్ప్ డెస్క్ అందించాలన్నారు.  రెమిడెసివర్ పేషెంట్లకు అందేలా చూడాలని చెప్పారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల నుండి కెజిహెచ్ కు మెరుగైన వైద్యం కోసం వస్తారని,  వైద్యులు మరింత అంకిత భావంతో పనిచేసి, ప్రతి ఒక్క పేషెంటుకు పూర్తిగా వైద్య సేవలు అందించి పూర్తి ఆరోగ్యంగా కోలుకొని ఇంటికి పంపాల్సిన బాధ్యతను వైద్యులు తీసుకొని కెజిహెచ్ కు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు.  నోడల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి గతంలో ఉన్న సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలన్నారు.   కెజిహెచ్, విమ్స్, చెస్ట్, ఇ.ఎన్.టి. ఆసుపత్రులు వారీగా పడకలు, ఆక్సిజన్ సరఫరా, వైద్యులు, సిబ్బంది, తదితర అంశాలపై ఆయన సమీక్షించి ఆసుపత్రుల్లో ఉన్న సమస్యలను గూర్చి అడిగి తెలుసుకున్నారు.  
జిల్లా ఇన్ చార్జ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ జ్ఞానాపురంలో ఉన్న అంత్యక్రియల షెడ్లు మరిన్ని తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసేందుకు జివిఎంసి కమీషనర్ తో మాట్లాడి పెంచాలని జెసిలకు సూచించారు.  మరణించిన తర్వాత అంత్యక్రియలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు.  ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్ల సమాచారం బందువులకు తెలియజేయాలని ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కెజిహెచ్ లో సూపరింటెండెంట్ కు సహాయంగా మరొకరిని నియమించాలని ప్రత్యేక అధికారి జి. సాయి ప్రసాద్ కు సూచించారు.  శానిటేషన్ సిబ్బందికి జీతాలు విషయమై మంత్రి దృష్టికి తీసుకురాగా ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.  
 కోవిడ్ ప్రత్యేక అధికారి జి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ బెడ్ మేనేజ్ మెంట్, అడ్మిషన్లకు వచ్చే పేషెంట్లకు సమాధానం చెప్పేందుకు ఒక ప్రొఫెసర్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఇపిడిసియల్ సిఎండి నాగలక్ష్మిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఆక్సిజన్ మేనేజ్ మెంట్, ఆక్సిజన్ వృధాగా కాకుండా ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, ఎపిఎంఎస్ఐడిసి ఇఇ డి.ఎ.నాయుడు లు చూస్తారని తెలిపారు.  పేషెంట్లతో ఇంటరాక్షన్, తదితర విషయాలపై ఆయన మాట్లాడారు.  అంతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలు, పడకలు, ఆక్సిజన్ సరఫరా, తదితర విషయాలపై వివరించారు.    
  ఈ సమావేశంలో ఎ.పి.ఇ.పి.డి.సి.ఎల్. సిఎండి నాగలక్ష్మి, ఐటిడిఎ పి.ఓ. ఎస్. వెంకటేశ్వర్, ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, కె.జి.హెచ్ సూపరింటెండెంట్ డా. మైథిలి, డిఎంహెచ్ఒ సూర్యనారాయణ, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, విమ్స్ డైరక్టర్ రాంబాబు, చెస్ట్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, ఇఎన్ టి సూపరింటెండెంట్, తదితర వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
  అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) విలేఖరులతో మాట్లాడుతూ కెజిహెచ్ లో మొత్తం 840 పడకలు ఉన్నాయని, 1500 మంది వరకు వివిధ సిబ్బంది సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.  కోవిడ్ నివారణకు సిబ్బంది కొరత ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో తగు చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.  కెజిహెచ్ వరకు 18 టన్నుల ఆక్సిజన్  అవసరం అవుతుందన్నారు.  శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల నుండి వివిధ వైద్య సేవలు నిమిత్తం కెజిహెచ్ కు వస్తారని అలాంటి వారికి వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఆసుపత్రికి తగినన్ని నిధులు ముఖ్యమంత్రి కేటాయించినట్లు ఆయన వివరించారు.  పడకల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.  అంత్యక్రియల ప్లాట్ ఫారంలు పెంచమని తెలియజేసినట్లు పేర్కొన్నారు.  

King George Hospital

2021-05-14 15:06:11

త్వరలోనే అందుబాటులోకి తాత్కాలిక ఆసుపత్రి..

తాడిపత్రి సమీపంలో అర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు చేస్తున్న 500 ఆక్సిజన్ పడకల తాత్కాలిక ఆసుపత్రి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్ణీత సమయానికి ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టరును మరియు సంబంధిత అధికారులను అదేశించారు. నేటి నుంచి పదిరోజుల్లో ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిగా ఆనంతపురము ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డిని నియమించారు. రేయింబవళ్లు నిర్మాణ పనులు కొనసాగేలా చూడాలని అవసరమైతే మరింత మంది సిబ్బందిని నియమించుకోవాలన్నారు. పర్యవేక్షణ అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాడిపత్రి వద్ద తాత్కాలిక ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. పేరుకు మాత్రమే ఇది తాత్కాలిక ఆసుపత్రి అని, ఒక పూర్తిస్థాయి ఆసుపత్రిలో ఉండే అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. వైద్యులు, నర్సులు, కోవిడ్ ను ఎదుర్కొనేందుకు మందులు, కోవిడ్ బాధితులకు భోజనం-నీటి వసతి, శౌచాలయాలు, వైద్య సిబ్బందికి కావాల్సిన వసతి సౌకర్యాలు అన్నీ ఉండనున్నాయన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ఖర్చుకు వెనకడకుండా ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నాయన్నారు. ఈ పర్యవేక్షణలో జిల్లా కలెక్టరుతో పాటు జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్(రెవెన్యూ), ట్రైనీ కలెక్టర్ సూర్య తేజ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

Tadipatri

2021-05-14 15:00:04

ప్రణాళికా బద్దంగా కోవిడ్ వ్యాక్సినేషన్..

కోవిడ్ నుంచి రక్షణ కల్పించేందుకు  జిల్లాలో 2వ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి జిల్లాలో కోవిషీల్డ్ తో బాటు కొవేక్షిన్ టీకా కూడా వేయడం జరుగుతుందని తెలిపారు. కోవెక్సిన్ రెండో డోసు కోసం ఇటీవలే జిల్లా వ్యాప్తంగా  23 కేంద్రాలను, కోవిషీల్డ్ కోసం 43 కేంద్రాలను పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కేంద్రాలలో శనివారం వేక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. నిపుణుల కమిటీ ను సంప్రదించిన తరువాత కేంద్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ కాల వ్యవధిని తాజాగా పెంచిందన్నారు.  దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కోవిషిల్డ్ కు  12 -16 వారాల కాలవ్యవది మధ్య,  అలాగే కోవాక్సిన్  కు 4 వారాలు దాటిన వారు 2వ డోస్ వేసుకోవాలన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా  కోవిన్ సాఫ్ట్ వేర్ ను మార్పు చేసి తిరిగి ఈ నెల  15వ తేదీ ( శనివారం) నుండి జిల్లాలో 2వ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.  ఏ రోజు ఎవరికి టీకా వేస్తారో , ఏ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలో..  నిర్దిష్టంగా 24 గంటల ముందే ఫోను కాల్, ఎస్.ఎం.ఎస్. ద్వారా..   జిల్లా యంత్రాంగం సమాచారం అందిస్తుందన్నారు. ఆలాగే వాలంటీర్లు, ఆశా వర్కర్ల ద్వారా  వాక్సినేషన్ స్లిప్ ను  అందచేయడం జరుగుతుందన్నారు.  సదరు సమాచారం అందుకున్న వారే సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి   సంయమనం, సామాజిక, భౌతిక దూరం పాటిస్తూ.. ఫేస్ మాస్కులు, ధరించి.. స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ  టీకాలు వేయించుకోవాలన్నారు.  మిగిలిన వాళ్లకు అవకాశం వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సదరు సమాచారం అందుకున్న వారే వ్యాక్సినేషన్ కేంద్రానికి హాజరవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ కోవిషీల్డ్ వేసుకొని 84 రోజులు, కోవెక్సిన్ వేసుకొని 28 రోజులు దాటిపోయినవారికి, సమాచారం రాకపోయినప్పటికీ, వేక్సిన్ కేంద్రానికి వెళ్లవచ్చని సూచించారు.

Vizianagaram

2021-05-14 14:52:48

మ‌నోధైర్య‌మే..మ‌హాబ‌లం..

మందులు క‌న్నా.. మాత్ర‌ల క‌న్నా.. మ‌నోధైర్య‌మే గొప్ప‌ది.. దాన్ని కోల్పోకండి.. ధైర్యంగా ఉండండి.. అంటూ క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ క‌రోనా రోగుల‌కు ధైర్యం చెప్పారు. వారిలో ఆత్మ‌విశ్వాసం నింపేందుకు ప్ర‌య‌త్నించారు. మీకేం కాదు.. మీ వెంట మేమున్నాం అని భ‌రోసా ఇచ్చారు. జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల్లో మ‌నోధైర్యం నింపేందుకు క‌లెక్ట‌ర్ శుక్ర‌వారం జూమ్ యాప్ ద్వారా వారితో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని మ‌హారాజా, మిమ్స్ ఆసుప‌త్రుల్లో కోవిడ్‌ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య‌సేవ‌లు, భోజ‌న వ‌స‌తి, టాయిలెట్ల ప‌రిశుభ్ర‌త త‌దిత‌ర అంశాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయా ఆసుప‌త్రుల్లోని వార్డుల్లో వైద్య సేవ‌లందిస్తున్న వైద్యుల సాయంతో చికిత్స పొందుతున్న రోగుల‌తో మాట్లాడారు. ముందుగా స్థానిక మ‌హారాజ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఎం. జ‌గదీష్‌, హ‌రిదుర్గ‌, మ‌రొక మ‌హిళ‌తో కాసేపు మాట్లాడారు. అక్క‌డ అందుతున్నసేవ‌ల‌పై ఆరా తీశారు. టాయిలెట్లు శుభ్రంగా ఉండ‌టం లేద‌ని ఒక వ్యాధిగ్ర‌స్తురాలు తెలుప‌గా వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా. సీతారామ‌రాజుని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. అనంత‌రం మిమ్స్ ఆసుప‌త్రిలో ఉన్న మ‌రో ముగ్గురు రోగుల‌తో మాట్లాడి అక్క‌డ ప‌రిస్థితిని స‌మీక్షించారు. చిన్న పిల్ల‌ల వార్డులో ఉన్న డా. అనూష శ్రీ‌ని అక్క‌డ వ‌స‌తుల గురించి అడిగి తెలుసుకున్నారు. మందులు ఇండెంట్ ప్ర‌కారం రావ‌టం లేద‌ని ఆమె చెప్ప‌గా ఉన్నతాధికారుల‌తో మాట్లాడి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుతామ‌ని జేసీ మ‌హేష్ కుమార్ బ‌దులిచ్చారు. అలాగే వైద్యులు రోజూ వ‌చ్చి బోర్లా ప‌డుకోబెడుతున్నారా అని మిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎన్‌. త్రినాథ్‌ని అడిగి తెలుసుకున్నారు. అక్క‌డ అందుతున్న సేవ‌లు ఎలా ఉన్నాయ‌ని ఆరా తీశారు.

కాన్ఫ‌రెన్స్‌లో కలెక్ట‌ర్‌, జేసీలతోపాటు డీఎం & హెచ్‌వో పి. ర‌మ‌ణ కుమారి, డీసీహెచ్ఎస్ నాగ‌భూష‌ణ‌రావు, మ‌హారాజ జిల్లా ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా. సీతారామ‌రాజు, మిమ్స్ డైరెక్ట‌ర్ డా. భాస్క‌ర రాజు, వైద్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-14 14:20:41

దాతలు మరింతగా ముందుకి రావాలి..

కోవిడ్ రెండోద‌శ ఉద్ధృతి నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించ‌డం సామాజిక బాధ్య‌త‌గా భావించి జిల్లాలోని ప‌లు వ్యాపార, వాణిజ్య సంస్థ‌లు ముందుకొచ్చి జీజీహెచ్‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం అభినంద‌నీయ‌మ‌ని, ఇదే స్ఫూర్తితో మ‌రికొంత‌మంది దాత‌లు ముందుకొచ్చి కోవిడ్ నివార‌ణ‌, నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ పిలుపునిచ్చారు. శుక్ర‌వారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్‌లో దేవీ ఫిష‌రీస్ లిమిటెడ్ ప్ర‌తినిధులు.. మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (డీ) కీర్తి చేకూరి త‌దిత‌రుల చేతుల మీదుగా దాదాపు రూ.21 ల‌క్ష‌ల విలువైన వైద్య సామాగ్రిని జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాల‌క్ష్మికి జేశారు. అదే విధంగా రిల‌యెన్స్ ఇండ‌స్ట్రీస్ రూ.35 ల‌క్ష‌ల వ్య‌యంతో ఏర్పాటు చేసిన ప‌ది కేఎల్ సామ‌ర్థ్య‌మున్న ఆక్సిజ‌న్ ట్యాంక్‌ను, ఈఎన్‌టీ బ్లాక్ వ‌ద్ద ఆధునికీక‌రించిన ట్ర‌యాజ్ సెంట‌ర్‌లోని 24 ప‌డ‌క‌ల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర‌స్తుతం దేశ‌మంతా కోవిడ్ భ‌యాందోళ‌న‌ల‌తో ఉంద‌ని, ఇలాంటి ప‌రిస్థితిలో గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆదేశాల‌కు అనుగుణంగా అత్య‌ధిక జ‌నాభా గ‌ల జిల్లాలో అధికార యంత్రాంగం ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌తో కోవిడ్ క‌ట్ట‌డికి, రోగుల‌కు మెరుగైన వైద్య స‌హాయం అందించేందుకు కృషిచేస్తోంద‌ని పేర్కొన్నారు. 24X7 ప‌నిచేస్తూ ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితినైనా ఎదుర్కొనేలా వైద్య‌, ఆరోగ్య శాఖతో పాటు వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నార‌న్నారు. జీజీహెచ్‌లో ఇప్ప‌టికే 20 కేఎల్ స్టోరేజ్ సామ‌ర్థ్య‌మున్న ఆక్సిజ‌న్ ట్యాంక్ ఉంద‌ని, ప్ర‌స్తుతం మ‌రో ప‌ది కేఎల్ సామ‌ర్థ్యమున్న ట్యాంక్ అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల ఆసుప‌త్రి మొత్తానికి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని వివ‌రించారు. ఈ కొత్త ట్యాంకును యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌ది రోజుల్లోనే ఏర్పాటుచేయ‌డం అభినంద‌నీయమ‌ని పేర్కొన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి సైతం జీజీహెచ్‌కు వైద్యం కోసం వ‌స్తున్నార‌ని, ఈ నేప‌థ్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్య‌త (సీఎస్ఆర్‌)గా సంస్థ‌లు ముందుకొచ్చి స‌హాయ‌మందించాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల్లో కోవిడ్‌పై ఉన్న భ‌యాందోళ‌న‌ల‌ను తొల‌గించి, అవ‌గాహ‌న క‌ల్పించి కోవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు స‌హ‌క‌రించాల‌ని మీడియాకు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ సూచించారు.

104 సేవ‌ల విస్త‌ర‌ణ‌కు కృషి: క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి:
క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ రెండోద‌శ ప్రారంభ‌మైన త‌ర్వాత అత్య‌ధికంగా ప్ర‌స్తుతం రోజుకు దాదాపు 3,500 పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని,  దాదాపు 30 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయ‌న్నారు. ఈ నేప‌థ్యంలో అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌ను అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని, అవ‌స‌రం మేర‌కు వివిధ ప్రాంతాల్లో కోవిడ్ చికిత్స‌కు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఇటీవ‌ల రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఈఎస్ఐ ఆసుప‌త్రిని సంద‌ర్శించామ‌ని, సోమ‌వారం నాటికి క‌నీసం 50 ప‌డ‌క‌ల‌ను అందుబాటులోకి తేవాల‌నే ల‌క్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని కోవిడ్ ఆసుప‌త్రుల్లోనూ అనుభ‌వ‌మున్న జిల్లాస్థ‌యి అధికారుల‌తో ఇటీవ‌ల త‌నిఖీలు నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని, ప్ర‌ధానంగా ఆరోగ్య‌శ్రీ ద్వారా 50 శాతం ప‌డ‌క‌లు, రెమ్‌డెసివిర్ స‌క్ర‌మ వినియోగం, నాన్ ఆరోగ్య‌శ్రీ రోగుల నుంచి ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఫీజుల వ‌సూలు త‌దిత‌ర అంశాల‌ను క్షుణ్నంగా త‌నిఖీ చేసిన‌ట్లు తెలిపారు. నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు  పాల్ప‌డేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి వెనుకాడ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. 104 కాల్‌సెంట‌ర్ సేవ‌ల‌కు సంబంధించి రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా జిల్లాలో రోజుకు 1500 వ‌ర‌కు ఫోన్‌కాల్స్ వ‌స్తున్నాయ‌ని, తాజాగా 104 సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించేందుకు వీలుగా మ‌హిళా పోలీసుల‌కు శిక్ష‌ణ ఇచ్చామన్నారు. పాజిటివ్ వ‌చ్చిన ప్ర‌తి రోగితో మాట్లాడి వారి ఆరోగ్య ప‌రిస్థితికి అనుగుణంగా ఐసోలేష‌న్‌కిట్ అందించ‌డం లేదా సీసీసీ, ఆసుప‌త్రి అడ్మిష‌న్ త‌దిత‌ర సేవ‌లు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. డివిజ‌న్ స్థాయిలోనూ కాల్‌సెంట‌ర్ల‌ను ఏర్పాటుచేసి, కోవిడ్ బాధితుల్లో మ‌నోధైర్యం నింపి, వేగంగా కొలుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు కోసం వ‌చ్చేవారికి ప‌డ‌క‌లు అందుబాటులో ఉండేలా ఎప్ప‌టిక‌ప్పుడు రోగుల ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షించి, ఆరోగ్యం బాగున్న‌వారిని డిశ్చార్జ్ లేదా సీసీసీకి పంపించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రోగుల బంధువులు కూడా ఈ విష‌యంలో స‌హ‌క‌రించాల‌ని కోరారు. ముంబ‌యి కార్పొరేష‌న్‌లో కోవిడ్ క‌ట్ట‌డి, రోగులకు వైద్య, ఇత‌ర సేవ‌లు అందిస్తున్న తీరును అధ్య‌య‌నం చేశామ‌ని.. సాధ్యాసాధ్యాల‌ను బ‌ట్టి జిల్లాలోనూ ముంబ‌యి మోడ‌ల్ అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. అనంత‌రం జీజీహెచ్‌లో కోవిడ్ సేవ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్న హెడ్‌న‌ర్స్‌, స్టాఫ్‌న‌ర్స్‌, ఫార్మ‌సిస్టు, ఇత‌ర సిబ్బంది మొత్తం 19 మందిని మంత్రి, క‌లెక్ట‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ శాలువాల‌తో స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ట్రెయినీ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లిశ‌ర్మ‌, జీజీహెచ్ కోవిడ్ నోడ‌ల్ అధికారి సూర్య ప్ర‌వీణ్‌చాంద్‌, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాలక్ష్మి, ఆర్ఎంవో డా. ఇ.గిరిధ‌ర్‌, ఆసుప‌త్రి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-05-14 14:15:46

రేపు కోవ్యాక్సిన్ రెండవ డోసు మాత్రమే..

శ్రీకాకుళం జిల్లాలో శనివారం కోవాక్సిన్ టీకా ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.సి.చంద్ర నాయక్ మరియు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కే.అప్పారావు సంయుక్తంగా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ కో వ్యాక్సిన్ రెండవ డోసుకు అర్హులైన వారికి మాత్రమే శనివారం రెండవ డోసు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన హెల్త్ వర్కర్లు,  ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 సంవత్సరాల వయసు పైబడిన సాధారణ ప్రజానీకం ఈ టీకాను తీసుకోవచ్చని వారు కోరారు. టీకాను శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతర్ల పల్లి,  పొగిరి, పొన్నాడ, పొలాకి పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో పాఠశాలలు, కళాశాలల్లో టీకా ఇవ్వడం జరుగుతుందని వారు వివరించారు. రోజుకు వంద మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, ఆ వంద మందికి ముందుగా సమాచారం అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. కోవిషీల్డు వ్యాక్సిన్ అందుబాటులో లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.

Srikakulam

2021-05-14 14:06:25

సోంపేట తహశీల్దార్ సేవలు ప్రశంసనీయం..

సోంపేట తహశీల్దార్ గురు ప్రసాద్ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. శుక్రవారం సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ మంచి పని చేస్తున్నారని ఆయన పేర్కొంటూ సోంపేట తహశీల్దార్ సకాలంలో స్పందించి అంబులెన్స్ డ్రైవర్ గా మారి ఆస్పత్రికి కోవిడ్ బాధితుని చేర్చడం ఎంతో ఊరట ఇచ్చిన అంశమని అన్నారు. కోవిడ్ లో అందిస్తున్న సేవలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని, ఇతరులకు స్పూర్తిదాయకంగా ఉంటాయని ఆయన అన్నారు. ప్రస్తుతం అందరూ మంచి పనితీరును కనబరుస్తున్నారని అయితే కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించడంలో విఫలమైతే ఇప్పటి వరకు పడిన కష్టం  వృథా అవుతుందని ఆయన అన్నారు. కర్ఫ్యూ సమయంలో కేసులు తగ్గాయని, ఇదే సమయాన్ని అదునుగా తీసుకోవాలని ఆయన సూచించారు.  ప్రతి మండలంలో కనీసం 30, 40 మంది వరకు కరోనా లక్షణాలతో ఉండేవారు ఉంటారని వారిని గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడంలో విఫలమైతే మిగతా వారికి వ్యాప్తి చేసే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించాలని ఆయన పేర్కొన్నారు. 

ఎక్కడైతే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కోవిడ్ బాధితులను గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కోవిడ్ సర్వేలియన్స్ అధికారులతో డివిజనల్ అధికారులు సమావేశం నిర్వహించి ఫీవర్ సర్వే పరిస్థితులు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఐదు కంటే తక్కువ కేసులు గుర్తించిన వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అవసరమైతే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సచివాలయానికి వాలంటీర్లతో మేపింగ్ చేయాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని ఇంకా మెరుగైన పరిస్థితి కి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జిల్లాలో ఒక్క కేసును కూడా వదిలి పెట్టరాదని జిల్లా కలెక్టర్ చెప్పారు. మండల స్థాయిలో చేపడుతున్న కోవిడ్ సేవలను ప్రజలకు తెలియజేయాలని, తద్వారా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అంశాలను గూర్చి అందరికీ అవగాహన కలుగుతుందని అన్నారు.  జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ హొమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ బాధితులను పరిశీలించాలని అన్నారు. మెడికల్ కిట్లను అందజేయాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్  సూరజ్ ధనుంజయ గరోడా, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ. కిషోర్, టి.వి.ఎస్.జి.కుమార్,  మండల ప్రత్యేక అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-14 13:55:02

ఆన్ లైన్ లో సింహాద్రినాధుని అర్చనలు..

విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దేవస్థానంలో ఈనెల 16 నుంచి  ఆన్ లైన్లోనే అర్చనలు, పూజలు చేపడుతున్నట్టు ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు.  శుక్రవారం సింహాచలంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం స్వామివారికి ఆన్ లైన్ లో నే అర్చనలు, చేసి వాటి యొక్క వీడియోలను భక్తులకు తెలియజేస్తామని చెప్పారు. దానికోసం ప్రత్యేకంగా యూట్యూబు ఛానల్ ను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా స్వామివారి అర్చనలు ఆన్ లైన్ లోనే తిలకించవచ్చునని ఈఓ చెప్పారు. నిత్య కల్యాణం ( ప్రతి రోజూ ఉదయం 9:30 నుంచి 10:30), గురు- ఆదివారాల్లో జరిగే స్వర్ణపుష్పార్చన (8గంటలకు ఉదయం) , ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజు స్వాతి హోమం  (ఉదయం 8 గంటలకు),ప్రతి ఏకాదశి రోజు స్వర్ణతులసీదళార్చన ఆన్ లైన్లో వీక్షించవచ్చునని ఈఓ చెప్పారు. నిత్యకళ్యాణానికి 1,000(వెయ్యి రూపాయలు), స్వర్ణపుష్పార్చనకు రూ. 2,116 (రెండు వేల నూట పదహారు రూపాయలు), స్వాతి హోమానికి రూ.2,500 (రెండువేల ఐదు వందలు), స్వర్ణతులసీదళార్చనకు రూ.2,116( రెండువేల నూటపదహారు) చెల్లించాల్సి ఉంటుందన్నారు. మీ తరపున స్వామివారి కళ్యాణమండపంలో  గోత్రనామాలతో పూజలు, అర్చనలు వేద పండితులు నిర్వహిస్తారన్నారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN 0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-14 13:45:56

కరోనా రోగి భద్రతే ప్రధాన లక్ష్యం..

ప్ర‌గ‌తి భార‌త్ ఫౌండేష‌న్ ఆద్వ‌ర్యంలో విశాఖ‌ట‌పట్నంలో అత్యాధునిక హంగుల‌తో ఏర్పాటు చేసిన 300 ప‌డ‌క‌ల పూర్తి ఆక్షిజ‌న్ స‌దుపాయం కలిగిన కోవిడ్ కేర్ సెంట‌ర్ రాష్ట్రంలోని  కోవిడ్ కేర్ సెంట‌ర్లుకు ఆద‌ర్శ‌మ‌ని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీ‌నివాస్ (నాని) అన్నారు. విశాఖ‌ప‌ట్నం షీలాన‌గ‌ర్ లో వికాస్ కాలేజీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంట‌ర్ ను రాజ్య‌స‌భ స‌బ్యులు వి విజ‌య‌సాయి రెడ్డి, మంత్రులు క‌న్న‌బాబు, అవంతి శ్రీ‌నివాస్ ల‌తో క‌లిసి ఆయ‌న శుక్ర‌వారం  ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ ప్ర‌గ‌తి భార‌త్ ట్ర‌స్టు ఏర్ప‌టు చేసిన కోవిడ్ కేర్ సెంట‌ర్ అత్యాధునిక స‌దుపాయాలు గ‌ల‌ కోవిడ్ ఆసుప‌త్రిని త‌ప‌లించేవిధంగా ఉంద‌ని అన్నారు. అత్యున్నత ప్ర‌మాణాల‌తో తీర్చిదిద్దిన ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్ లోని మ‌ల్టీ టైర్ ఆక్షిజ‌న్(నాలుగు అంచెల) స‌ర‌ఫరా విధానం పేషెంటు కు ఆక్షిజ‌న్ అందించ‌డంలో పూర్తి భద్రత క‌ల్పిస్తుంద‌ని, ఎటువంటి ప‌రిస్థితిలు ఎదురైన అంత‌రాయం క‌ల‌గ‌డానికి ఆస్కారం లేద‌ని అన్నారు. రాష్ట్రంలోని అన్ని కోవిడ్ ఆసుప‌త్రులు ఈ విధానాన్ని పాటిస్తే ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని బాదాక‌ర‌ సంఘ‌ట‌న‌లు కూడా జ‌రిగి ఉండేవి కావ‌ని అన్నారు. గ‌తంలో కోవిడ్ బారిని ప‌డిన వారు పెద్ద‌గా ఆక్షిజ‌న్ అవ‌స‌రం లేకుండా కోలుకున‌నే వార‌ని  ,ప్రస్తుతం విస్తురిస్తున్న కోవిడ్ వ్యాది ప్ర‌జ‌ల ఆరోగ్యంపై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతున్న‌ద‌ని అన్నారు. గ‌తంలో కేవ‌లం 40 మెట్రిక్ ట‌న్నుల ఆక్షిజ‌న్ మాత్ర‌మే కోవిడ్ ఆసుప‌త్రుల‌ను అవ‌స‌ర‌మ‌య్యింద‌ని అయితే ప్ర‌స్థుతం సెకెండ్ వేవ్ లో 600 మెట్రిక్ ట‌న్నులు ఆక్షిజ‌న్ కూడా స‌రిపోవ‌డం లేద‌ని అన్నారు. కోవిడ్ వ్యాది ఉదృతంగా విస్తరిస్తున‌న్న నేప‌ద్యంలో ఆసుపత్రుల‌లో బెడ్స్ కొర‌త ఏర్ప‌డింద‌ని ఈ మేర‌కు ఇటువంటి కోవిడ్ కేర్ సెంట‌ర్ల సేవ‌లు ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని కోరారు.

ఆంద్రా మెడిక‌ల్ కాలేజీ స‌హ‌కారంలో ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్లో స్పెష‌లిస్టు  డాక్ట‌ర్ల‌ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని అన్నారు. ప్ర‌గ‌తి బార‌త్ ఫౌండేష‌న్ ద్వారా ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ దీని నిర్వ‌హ‌ణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్   ప్రభుత్వనికే అంద‌జేయాల‌న్న నిర్ణ‌యం అభినంద‌నీయ‌మ‌ని దీనికి,సంబందించి త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని అన్నారు. దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌తో పోలిస్తే కోవిడ్ నియంత్ర‌ణ‌లో ఆంద్ర‌ప్ర‌దేశ్ ఎంతో మెరుగ్గా ఉంద‌ని అన్నారు.   అంత‌కు ముందు రాజ్య‌స‌భ సభ్యులు, ప్ర‌గ‌తిభార‌త్ మేనేజింగ్ ట్ర‌స్టీ విజ‌యసాయి రెడ్డి మాట్టడుతూ  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆశ‌యాల‌కు అనుగుణంగా అత్యాధునిక హంగుల‌తో, పూర్తి సాంకేతిక‌త‌తో  ప్ర‌గ‌తి భార‌త్ ఫౌండేష‌న్ ఆద్వ‌ర్యంలో కోవిడ్ కేర్ సెంట‌ర్ ఏర్పాటు చేసామ‌ని అన్నారు. ఆక్షిజ‌న్ అంద‌క ఏ ఒక్క కోవిడ్ బాదితుడూ ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంలో విశాఖ ప్ర‌జ‌ల అవ‌స‌రాలు దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసామ‌ని అన్నారు. ఇటీవ‌ల కేజిహెచ్, మ‌రియు విమ్స్ ఆసుప‌త్రుల‌లోని కోవిడ్ వార్డులు సంద‌ర్శించ‌డంతో పాటు, వైరాల‌జీ ల్యాబ్, 104 కాల్ సెంట‌ర్ ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం కోవిడ్ కేర్ సెంట‌ర్ ఏర్పాటు చేయాల‌నే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అన్నారు. మ‌ల్టీ టైర్ ఆక్షిజ‌న్ స‌ర‌ఫ‌రా సిస్టం ద్వారా పేషెంటుకు ఆక్షిజ‌న్ స‌ర‌ఫ‌రాలో ఎట్టిప‌రిస్థితిలోనూ అంత‌రాయం క‌ల‌గ‌ద‌ని అన్నారు.  మ‌ల్టీ టైర్ ఆక్షిజ‌న్ స‌ర‌ఫ‌రా విధానిన్ని వివ‌రిస్తూ  ఒక్కొక్క‌టి 3750 క్యూబిక్ మీట‌ర్లు సామ‌ర్ద్యం గ‌ల రెండు అతిపెద్ద ఆక్షిజ‌న్ ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఆక్షిజ‌న్ ను పైపులైన్లు ద్వారా పేషెంటుకు నేరుగా అందిస్తామ‌ని అన్నారు. 

ట్యాంకుల ద్వారా స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డిన‌ట్లైతే  ఒక్కోక్క‌టి 60 లీట‌ర్లు సామ‌ర్ద్యం క‌లిగిన  200 సిలండ‌ర్లు ప్ర‌త్యామ్నాయంగా మెత్తం 2000 క్యూబిక్ మీట‌ర్లు సామ‌ర్ద్యంతో  ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని వాటి ద్వారా పైపులైన్ల‌కు స‌ర‌ఫ‌రాను వెంట‌నే పున‌రుద్ద‌రిస్తార‌ని అన్నారు. దానికి కూడా అంత‌రాయం ఏర్పాడితే ఒక్కో పేషెంటు బెడ్డు వ‌ద్ద 47 లీట‌ర్లు కెపాసిటి క‌ల్గిన సిలండ‌ర్ మెత్తం 1500 క్యూబిక్ మీట‌ర్లు సామ‌ర్ద్యంతో అందుబాటులో ఉండ‌చం జ‌రిగింద‌ని అన్నారు. మ‌రో ప్ర‌త్యామ్నాయంగా  అమెరికా నుండి తెప్పించిన‌ 250 ఆక్షిజ‌న్ కాన్సెంట్రేట‌ర్లు అందుబాటు ఉంచ‌డం జ‌రిగింద‌ని అన్నారు.   ఈవిధంగా మల్టీ టైర్ విధానాన్ని అవ‌లంబిస్తూ ఆక్షిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని అన్నారు. ఆక్షిజ‌న్ సాచురేష‌న్ 90 కంటే ఎక్కువ‌గా ఉన్న‌వారికే ఇక్క‌డ అడ్మిష‌న్ చేసుకుంటామ‌ని 90 కంటే త‌క్కువ ఉన్న‌వారిని వెంటిలేట‌ర్లు, ఐసియు అవ‌స‌రం ఉంటుంద‌ని అన్నారు. అయిటే అటువంటి రోగుల‌కు కేజిహెచ్ మ‌రియు విమ్స్ ఆసుప‌త్రుల‌కు త‌రించేందుకు అంబులెన్సులు కూడా అందుబాటు ఉంచామ‌ని అన్నారు. పేషెంటు ఆడ్మిష‌న్ కోసం వ‌చ్చిన‌పుడు రిషెప్స‌న్ వ‌ద్ద‌నే ఆక్షిజ‌న్ కాన్సెంట్రేట‌ర్లు స‌హాయంతో ఆక్షిజ‌న్ అందించి త‌దుప‌రి ప‌రీక్ష‌లు, టెస్టులు చేస్తామ‌ని అన్నారు. పేషెంటు వివ‌రాలు, బెడ్డు వివ‌రాలు రిసెప్స‌న్ వ‌ద్ద డిస్ ప్లే బోర్డు ఏర్పాటు చేసామ‌ని అన్నారు. పేషెంటు కుటుంబ స‌బ్యులు రిసెప్స‌న్ వ‌ద్ద ఏర్పాటు చేసిన‌ సిసి కెమేరా ద్వారా లోప‌ల చికిత్స పొందుతున్న త‌మ వారాకి చూడ‌వ‌చ్చ‌ని అన్నారు. ప్ర‌బుత్వం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స‌హాకారంతో పేషెంటుకు అన్ని ర‌కాల మందుకు ఉచితంగా అందిస్తామ‌ని అన్నారు. 

ఆర్ టి పిసి ఆర్, ర్యాపిడ్, హెచ్, సి జి మెద‌ల‌గు టెస్టు చేస్తామ‌ని అన్నారు. పేషెంట్ల‌కు, డాక్ట‌ర్లు, న‌ర్సుల‌కు, ఇత‌ర సిబ్బందికి పౌష్టికాహారం ప్ర‌తిరోజు అందిస్తామ‌ని అన్నారు. మెద‌టి అంత‌స్థుకు చేరుకోడానికి లిఫ్టు స‌దుపాయం క‌ల్పించ‌నున్నామ‌ని అన్నారు. ఒక్కో ఫ్లోర్ కి 20, బాత్ రూంలు, 20 టాయిల‌ట్లు ఏర్పాటు  చేయ‌డం జ‌రిగిందిని అన్నారు. విద్యుత్ అంతరాయం ఎర్పాడితే 2 అటో స్టాట్ జ‌న‌రేట‌ర్లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఈ కేంద్రంలో 30 మంది డాక్టర్లు, 60 మంది న‌ర్సులు మ‌రయు 8 మంది టెక్నిషియ‌న్లు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆంద్రా మెడిక‌ల్ కాలేజీ యాజ‌మాన్యం  ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్ కు కేటాయించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఈ మేర‌కు వారికి కృత‌జ్ఞ‌త‌ తెలియ‌జేసారు. 30 లమంది సానిటేష‌న్ వ‌ర్క‌ర్లు పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంత‌ర‌మూ ప‌నిచేస్తార‌ని తెలిపారు. 20 అగ్నిమాపక ప‌రిక‌రాలు అందుబాటు ఉంచామ‌ని వెల్లడించారు. ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్ ను ప్ర‌భుత్వం గుర్తింపు పొందిన కోవిడ్ కేర్ సెంట‌ర్ గా గుర్తించాల‌ని ఆరోగ్య శాఖా మంత్రిని కోరారు. రెమిడిస్ వేర్ మందు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌ నుండి కొనుగోలు చేసి అవ‌స‌ర‌మైన ప్ర‌తి పేషెంటుకు ఉచితంగా ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. ప్ర‌గ‌తి భార‌త్ ఫౌండేష‌న్ త‌రుపున 30 మంది అడ్మినిష్ట్రేటివ్ స్టాఫ్   ప‌నిచేస్తార‌ని అన్నారు.

 ఈ మేర‌కు ట్ర‌స్టు స‌భ్యులు గోపినాధ్ రెడ్డి, ఉమేష్, ర‌మ‌ణ మ‌రియు బాలాజీల కృషిని కొనియాడారు. విశాఖ‌జిల్లా ఇన్చార్జి మంత్రి మ‌రియు వ్య‌వ‌సాయ మంత్రి కుర‌సాల‌ క‌న్న‌బాబు మాట్లాడుతూ విప‌త్క‌ర‌ ప‌రిస్థితుల‌లో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి ముందుకు వ‌చ్చిన ప్ర‌గ‌తి భార‌త్ షౌండేష‌న్ స‌హ‌సోపేత నిర్ణ‌యాన్ని ఆయ‌న కొనియాడారు. గ‌తంలో కోవిడ్ సంక్షోబ స‌మ‌యంలో సుమారు 70 వేల కుటుంబాల‌కు  ట్ర‌స్టు ద్వారా నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు అంద‌జేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేసారు. ప‌ర్యాట‌న శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ విశాఖ జిల్లా ప్ర‌జ‌ల‌కు నేనున్నాన‌నే భ‌రోసా రాజ్య‌స‌భ స‌బ్యులు విజ‌యాసాయి రెడ్డి క‌ల్పిస్తున్నార‌ని విప‌త్క‌ర స‌మ‌యంలోనూ నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నార‌ని కొనియాడారు. కార్యక్రమంలో విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మేల్యేలు గుడివాడ అమర్నాథ్, కరనం ధర్మశ్రీ, పెట్ల ఉమ శంకర్ గణేష్, చెట్టి పాల్గున, భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీధర్, నగర అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళ విజయ ప్రసాద్, రెహమాన్, చింతలపూడి వెంకట్రామయ్య, ప్రగతి భారతి ట్రస్టు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Sheela Nagar

2021-05-14 11:25:48

ఆక్సిజన్ వినియోగంపై స్టేట్ కమిటీ ఏర్పాటు..

కోవిడ్ ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ నిల్వ సామ‌ర్థ్యం, అందుబాటులో ఉన్న ఆక్సిజ‌న్ ప‌రిమాణం, వినియోగం త‌దిత‌ర అంశాల‌పై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌కు రాష్ట్ర స్థాయిలో ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ఏర్పాటైంద‌ని, ఈ వ్య‌వ‌స్థ‌కు అనుసంధానంగా జిల్లా స్థాయిలోనూ స్పెష‌ల్ సెల్ ప‌నిచేస్తోంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం జిల్లాలోని కోవిడ్ ఆసుప‌త్రుల యాజ‌మాన్యాలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో జేసీ వ‌ర్చువ‌ల్ విధానంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఆసుప‌త్రుల్లో రోజువారీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను అందుబాటులో ఉంచి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌క్కుండా చూసేందుకు ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేసింద‌న్నారు. ఆసుప‌త్రుల యాజ‌మాన్యాలు ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి http://pranavayuvu.ap.gov.in వెబ్‌సైట్లో మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌కు సంబంధించిన రియ‌ల్‌టైమ్ స‌మాచారాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంద‌ని వివ‌రించారు. ఈ ప్ర‌క్రియ కోసం ప్ర‌త్యేకంగా లాగిన్‌లు అందించామని, ఈ స‌మాచారాన్ని రాష్ట్రస్థాయితో పాటు జిల్లాస్థాయిలోనూ స‌మీక్షించ‌డం ద్వారా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు అనే తేడా లేకుండా ప్ర‌తి కోవిడ్ ఆసుప‌త్రిలోనూ అవ‌స‌రం మేర‌కు ఆక్సిజ‌న్ అందుబాటులో ఉండేలా చూడొచ్చ‌ని పేర్కొన్నారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా సంస్థ‌ల రోజువారీ నిల్వ‌ల పైనా ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంద‌న్నారు. ఇప్ప‌టికే ఆక్సిజ‌న్‌పై ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌తి అయిదు ఆసుప‌త్రుల‌కు ఒక ప్ర‌త్యేక అధికారి ప‌నిచేస్తున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. సమావేశంలో జిల్లాలోని నోటిఫైడ్ కోవిడ్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-14 11:22:07

16నుంచి సింహాద్రి అప్పన్న దర్శనాలు..

విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దేవస్థానంలో దర్శనాలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు అనువంశిక ధర్మకర్త గజపతిరాజు సంచయిత, ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. శుక్రవారం ఈ మేరకు వీరు మీడియాతో మాట్లాడారు. స్వామి చందనోత్సవం వెళ్లిన రెండు రోజుల తరువాత అంటే ఈనెల 16వ తేది నుంచి ప్రతీ రోజు రెండు గంటల పాటు స్వామి దర్శనాలు కల్పించనున్నట్టు వివరించారు. ఉదయం 7.30 నుంచి 9.30 వరకూ మాత్రమే దర్శనాలు ఉంటాయన్నారు. భక్తులందరూ ప్రభుత్వం నిర్ధేశించిన కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయాన్ని సోడియం హైపోక్లోరైడ్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నట్టు వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాలేనివారు స్వామి ఈహుండీ ద్వారా, యుపీఐ ఐడీ ద్వారా మొక్కులు చెల్లించుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-14 11:19:29

ఏకాంతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహా లక్ష్మీ నృసింహ స్వామి(సింహాద్రి అప్పన్న) చందనోత్సవం వరుసగా రెండో ఏడాది ఏకాంతంగానే జరిగింది. శుక్రవారం స్వామివారి నుంచి చందనం ఒలుపులు తరువాత ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి రాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ రెండో దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సంచయిత మాట్లాడుతూ, స్వామివారి నిజరూప దర్శనం సర్వపాప హరమని, తమ పెద్దలు తరువాత స్వామివారిని తొలి దర్శనం చేసుకునే అవకాశం తనకు దక్కడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి ముత్తం శెట్టి మాట్లాడుతూ, సింహాద్రి అప్పన్నకు కుటుం సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కడం పూర్వజన్మ సుక్రుతంగా భావిస్తున్నానని అన్నారు. ఆ స్వామి ఉగ్రరూపం కరోనాను జయించే శక్తి ఇవ్వాలని, కోవిడ్ రోగులు సత్వరమే కోలుకోవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్టు చెప్పారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తొలి విడత చందనం సమర్పించారు.

Simhachalam

2021-05-14 09:10:18

విశాఖలో అరుదైన ఘట్టం..

విశాఖలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది.. సింహాచలంలోని అప్పన్న చందనోత్సవం, రంజాన్ పండుగ, అక్షర త్రుతియలు ఒకే రోజు మే 14న రావడం. అందునా అల్లాకి శుక్రవారం అంటే ఎంతో ప్రీతికరమైన రోజు రమ్ జాన్ రావడం, శుక్రవారం రోజునే శుభ సూచికంగా అప్పన్న చందనోత్సవ నిజరూప దర్శనం, అక్షర త్రుతియ రావడం కూడా ఒక గొప్ప విషయంగా చెబుతున్నారు. అయితే ఈ మూడు పండుగలను ప్రజలు జరుపుకునే పరిస్థితి లేదు. రమ్ జాన్ పండుగను ముస్లిం సోదరులు ఇంట్లోనే చేసుకోవడం, ఇటు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం, అక్షర త్రుతియ పూజలు కూడా భక్తులు ఇళ్లల్లో ఉండే జరుపుకోవాల్సి వచ్చింది.  ఈ కరోనా తెచ్చిన ముసలం వలనే ఈ పరిస్థితి దాపురించిందనే బాధను కూడా విశాఖ వాసులు వ్యక్తం చేయడం విశేషం..

Simhachalam

2021-05-14 04:04:54

కరోనాలోనూ ఆగని స్నేక్ రెస్క్యూ..

విశాఖలో స్నేక్ సేవర్ సొసైటీ తన సేవలను కరోనా వైరస్ అధికంగా ఉన్న సమయంలోనూ కొనసాగించడం పట్ల నగర వాసుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. అందరూ ఇంటి పట్టునే ఉన్న సమయంలో సర్పాలు వాహనాల్లోకి దూరిపోతున్నాయి. దీనితో నగర వాసులంతా స్నేక్ సేవర్ సొసైటీ నిర్వాహకు కిరణ్ ను 98491 40500 లో సంప్రదిస్తున్నారు. సర్పాల నుంచి ప్రజలను కాపడటం కోసం బాధితులు ఉండే ప్రాంతానికి వెళ్లి రెస్క్యూచేసి సర్పాలను, వాటి నుంచి ప్రజలను కాపాడుతున్నారు. శుక్రవారం సుజాతానగర్, స్టీల్ ప్లాంట్ టౌష్ లో స్కూటర్ లో దూరిన పామును చాకచక్యంగా బయటకు తీసి, దానిని క్షేమంగా అడవిలోకి విడిచి పెట్టారు. నగరపరిధిలో ఏ సమయంలోనైనా తమను సంప్రదించవచ్చునని స్నేక్ సేవర్ కిరణ కోరుతున్నారు.

Visakhapatnam Steel Plant

2021-05-14 04:01:49

మిడ్వెస్ట్ గ్రానైట్స్ సహాయం అభినందనీయం..

కరోనా బాధితులను ఆదుకునేలా సేవా గుణంతో ముందుకు రావటం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ అన్నారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకోసం మిడ్వెస్ట్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రకాశం భవనంలో కలెక్టర్‌కు అందజేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ, తీవ్ర కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారికి ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుత కష్టకాలంలో దాత లు అందిస్తున్న సహకారం మరువలేనిదని కలెక్టర్ కొనియాడారు. వీరి స్ఫూర్తితో మరింత మంది ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో మిడ్వెస్ట్ గ్రానైట్స్ ప్రైవేటు లిమిటెడ్ యజమాని కొల్లారెడ్డి రామచంద్ర, జనరల్ మేనేజర్ డి.వి. అనిల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ongole

2021-05-13 15:47:20