1 ENS Live Breaking News

ప్ర‌జల స‌హ‌కారంతోనే కోవిడ్ నియంత్ర‌ణ‌..

ప్ర‌జ‌ల స‌హ‌కారంతోనే కోవిడ్‌ను నియంత్రించ‌గ‌ల‌మని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ స్ప‌ష్టం చేశారు. ఈ మ‌హ‌మ్మారిని జిల్లా నుంచి త‌రిమికొట్ట‌డంలో, మున్సిప‌ల్ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ‌వంతు పాత్ర పోషించాల‌ని కోరారు. ప‌ట్ట‌ణాల అభివృద్దికి పంచ‌సూత్రాల‌ను అమ‌లు చేయాల‌ని కోరారు. మేయ‌ర్‌, మున్సిప‌ల్ ఛైర్మ‌న్లు, వైస్ ఛైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు, మున్సిప‌ల్ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ సోమ‌వారం టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.    ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, జిల్లాలో క‌రోనా నియంత్ర‌ణ‌కు నివార‌ణ‌, చికిత్స‌, కార్యాచ‌ర‌ణ అనే మూడంచెల వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. కోవిడ్ నివార‌ణకు ప్ర‌తీఒక్క‌రూ మాస్కుల‌ను ధ‌రించ‌డం, భౌతిక దూరాన్ని పాటించ‌డం, త‌ర‌చూ చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం అనే అంశాల‌ని ప్ర‌తీఒక్క‌రూ పాటించాల‌ని కోరారు. మ‌రోవైపు వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను కూడా కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు. వ్యాధి సోకిన‌వారికి అత్యుత్త‌మ చికిత్స‌ను అందించ‌డం ద్వారా న‌యం చేస్తున్నామ‌న్నారు. కోవిడ్ ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌వారిని హోం ఐసోలేష‌న్‌లో ఉంచి, వారికి కోవిడ్ కిట్ల‌ను అంద‌జేసి చికిత్స‌ను అందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఇళ్ల‌లో ఏకాంతంగా ఉండే అవ‌కాశం లేనివారిని కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు పంపించి చికిత్స చేస్తున్నామ‌న్నారు. అవ‌స‌ర‌మైన వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి, చికిత్స చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. వ్యాధిని ముందే గుర్తించేందుకు వీలుగా, ప్ర‌స్తుతం జిల్లా వ్యాప్తంగా ఫీవ‌ర్ స‌ర్వే జ‌రుగుతోంద‌ని, ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను కూడా చేస్తున్నార‌ని చెప్పారు. గ్రామాల్లో వ్యాధి నియంత్ర‌ణ‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితిలో కూడా కొంత‌మంది బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. మాస్కుల‌ను పెట్టుకోక‌పోవ‌డం, మార్కెట్ల‌లో, షాపుల‌వ‌ద్దా భౌతిక దూరాన్ని పాటించ‌క‌పోవ‌డం త‌దిత‌ర చ‌ర్య‌ల‌ను నివారించేందుకు ప్ర‌జాప్ర‌తినిధులు కృషి చేయాల‌ని, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాల‌ని సూచించారు.

             మున్సిప‌ల్ ప్రాంతాల అభివృద్దికి క‌లెక్ట‌ర్ పంచ‌సూత్రాల‌ను ప్ర‌క‌టించారు. టిఏటిఏఎస్ (టేంక్స్ క్లీనింగ్‌, ఎమిలిటీస్‌, ట్రీ ప్లాంటేష‌న్, అవేర్‌నెస్‌, శానిటేష‌న్) ఈ ఐదూ ప‌ట్ట‌ణాల అభివృద్దికి కీల‌క‌మ‌న్నారు. వ‌ర్షాలు ప్రారంభం కాక‌ముందే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని చెరువుల‌ను శుద్ది చేయాల‌ని, పేరుకుపోయిన చెత్తా, పూడిక‌, ప్లాస్టిక్ తొల‌గించాల‌ని, చెరువులోకి వ‌ర్ష‌పునీరు వెళ్లేవిధంగా కాలువ‌లు సిద్దం చేయాల‌ని, గ‌ట్ల‌ను ప‌టిష్టం చేసి, మొక్క‌ల‌ను నాటేందుకు అనువుగా తీర్చిదిద్దాల‌ని సూచించారు. ప‌ట్ట‌ణాల్లో త్రాగునీరు, రోడ్లు, కాలువ‌లు, వీధి దీపాలు త‌దిత‌ర మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డంపై దృష్టి పెట్టాల‌న్నారు. ట్రీ ప్లాంటేష‌న్‌లో భాగంగా, అవ‌కాశం ఉన్న ప్ర‌తీ ప్రాంతంలో మొక్క‌ల‌ను నాటాల‌ని, ప‌రిశ‌రాల‌ను ప‌చ్చ‌ద‌నంతో నింపాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల విధులు, బాధ్య‌త‌లు, ప‌రిశ‌రాల ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నం ప్రాధాన్య‌త‌ల‌ను వివ‌రిస్తూ బోర్డుల‌ను ఏర్పాటు చేసి, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించాల‌న్నారు. పారిశుధ్యానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని, రానున్న వ‌ర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

               విజ‌య‌న‌గ‌రం నుంచి కార్పొరేట‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, పార్వ‌తీపురం మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ బోని గౌరీశ్వ‌రి, నెల్లిమ‌ర్ల నుంచి కౌన్సిల‌ర్ సంధ్య క‌లెక్ట‌ర్‌తో మాట్లాడి, ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు.  ఈ టెలీకాన్ఫ‌రెన్స్‌లో విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, ఇత‌ర మున్సిపాల్టీల క‌మిష‌నర్లు, మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి, ఛైర్‌ప‌ర్స‌న్లు, వైఎస్ ఛైర్మ‌న్లు, కార్పొరేటర్లు, కౌన్సిల‌ర్లు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-17 13:38:13

క‌లెక్ట‌ర్‌గా మూడేళ్ల ప‌ద‌వీకాలనికి ప్రశంసలు..

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ గొప్ప పాల‌నాద‌క్షులే కాకుండా, ఉన్న‌త వ్య‌క్తిత్వం క‌ల‌వార‌ని ప‌లువురు అధికారులు కొనియాడారు. ఆయ‌న నాయ‌క‌త్వ ప‌ఠిమ కార‌ణంగా జిల్లా ఖ్యాతి ఇనుమ‌డించింద‌ని, ప‌లు జాతీయ‌, రాష్ట్ర‌స్థాయి అవార్డులు వ‌రించాయ‌ని ప్ర‌శంసించారు. జిల్లా క‌లెక్ట‌ర్ గా మూడేళ్ల ప‌ద‌వీకాలం పూర్త‌యిన సంద‌ర్భంగా, ప‌లువురు ఉన్న‌తాధికారులు, జిల్లా అధికారులు, నాయ‌కులు, సోమ‌వారం ఏర్పాటు చేసిన జూమ్ కాన్ఫ‌రెన్స్‌లో క‌లెక్ట‌ర్‌ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.
           జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఈ మూడేళ్లూ అంద‌రినీ క‌లుపుకొని, జిల్లాను అభివృద్ది ప‌థాన న‌డిపార‌ని అన్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో సైతం జిల్లా పేరు మారుమ్రోగిందంటే, దానికి క‌లెక్ట‌ర్ కృషే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. జిల్లాపై ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేశార‌ని, జిల్లా చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని అన్నారు. ఆయ‌న మాట‌తీరు, న‌డ‌వ‌డిక‌, వ్య‌వ‌హార శైలి, మృదు స్వ‌భావం త‌మ‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని అన్నారు. హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ హ‌యాంలో ప‌నిచేయ‌డం త‌మ అధృష్ట‌మ‌ని ప‌లువురు అధికారులు పేర్కొన్నారు. ప‌నులు ఎలా పూర్తి చేయాలో, ప్ర‌ణాళిక‌ల‌ను ఎలా త‌యారు చేయాలో, తాము క‌లెక్ట‌ర్‌ను చూసి నేర్చుకున్నామ‌న్నారు. చెర‌గ‌ని చిరున‌వ్వుతో, క‌లుపుగోలుత‌నంతో, ఎనాడూ ఎవ‌రికీ ఎటువంటి హానీ చేయ‌ని గొప్ప సంస్కారం క‌లెక్ట‌ర్ సొంత‌మ‌ని కొనియాడారు.
         జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, ఐటిడిఏ ఆర్‌.కూర్మ‌నాధ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, తాశీల్దార్లు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, మండ‌ల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయ‌కులు,  క‌లెక్ట‌ర్ కు జూమ్ కాన్ఫ‌రెన్స్‌లో అభినందన‌లు తెలిపారు.

స‌మిష్టి కృషే విజ‌యాల‌కు కార‌ణం ః డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జిల్లా క‌లెక్ట‌ర్‌
         జిల్లా క‌లెక్ట‌ర్‌గా తాను సాధించిన విజ‌యాల‌కు స‌మిష్టి కృషి, ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కార‌మే కార‌ణ‌మ‌ని క‌లెక్ట‌ర్ అన్నారు. మూడేళ్ల‌పాటు క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హించే అరుదైన‌ అవ‌కాశాన్ని త‌న‌కు ఇచ్చినందుకు ముఖ్య‌మంత్రికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మూడేళ్ల‌లో సాధించిన విజ‌యాల‌ను మ‌రోసారి గుర్తుకు తెచ్చుకున్నారు. వివిధ ర‌కాల ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించామ‌ని, ప్ర‌కృతి విప‌త్తుల‌ను ఎదుర్కొన్నామ‌ని, క‌రోనాను మొద‌టి ద‌శ‌లో విజ‌య‌వంతంగా క‌ట్ట‌డి చేశామ‌ని చెప్పారు. ప్ర‌స్తుత రెండోద‌శ‌ను కూడా ఇదే ప‌ద్ద‌తిలో నియంత్రించి, జూన్ 17 నాటికి పూర్తిగా అదుపు చేయాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌ణాళిక‌ను రూపొందించామ‌ని చెప్పారు.
         ఒక్కోసారి మ‌నం ఎంతో క‌ష్ట‌ప‌డినా, నింద‌లు, అప‌వాదులు వ‌స్తుంటాయ‌ని, వాటికి కృంగిపోకుండా, లోపాల‌ను అధిగ‌మించి, ముందుకు పోవాల‌ని కోరారు. సానుకూల దృక్ఫ‌థంతో ముందుకు వెళ్లాల‌ని సూచించారు. త‌న కుటుంబ నేప‌థ్యం, వైద్య విద్య‌, ఇంత‌కుముందు చేసిన ఉద్యోగాల అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకొని, జిల్లాలో విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల‌కు అధిక ప్రాధాన్య‌త‌నివ్వ‌డం జ‌రిగింద‌న్నారు. శ‌తాయుష్షుకు విజ‌య‌న‌గ‌రం జిల్లా చిరునామాగా మారాల‌ని, దానికోసం ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నం, ప‌రిపూర్ణ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

Vizianagaram

2021-05-17 13:36:31

రైతులూ దళారులను నమ్మి మోసపోవద్దు..

రైతులు రబీ సీజనలో పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాలను సంప్రతించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పొందాలని జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ కోరారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రెస్ మీట్ నిర్వహించి రైతుల రబీ ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు చేపట్టిన చర్యలను మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని తక్కవ ధరలకు దళారులు అమ్మి నష్టపోకుండా మద్దతు ధర పొందేందుకు జిల్లా వ్యాప్తంగా 885 రైతు భరోసా కేంద్రాలు, 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.  2020-21 రబీ సీజనుకు రైతులు పండించిన  ఏ గ్రేడు ధాన్యానికి క్వింటాలుకు 1888 రూపాయలు (75 కేజీల బస్తాకు 1416 రూపాయలు), సాధారణ రకానికి క్వింటాలుకు 1868 రూపాయలు ( 75 కేజీల బస్తాకు 1401 రూపాయలు) చొప్పున ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించిందని, జిల్లాలో ఇప్పటి వరకూ 355 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా 2 లక్షల 14 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలోని 885 రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం తేమ శాతం కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచామని, రైతులు తమ ధాన్యంలో తేమ శాతాన్ని సమీప ఆర్ బి కే లలో ఉచితంగా తెలుసుకోవచ్చనన్నారు.  తమధాన్యానికి  17 శాతం లోపు తేమ, 3 శాతం లోపు వ్యర్థాలు ఉండేలా చూసుకుని, ఆర్ బి కె లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంప్రతించి కూపన్లు పొంది, 24 గంటలలో మద్దతు ధరకు విక్రయించుకోవచ్చనని తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, విఆర్ఓలు, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, పిపిసి కేంద్రాల సిబ్బంది రైతులకు మద్దతు ధరలు గురించి వివరించి, దళారుల బారిన పడకుండా చర్యలు చేపడుతున్నారన్నారు.  జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కప్పి కాపాడుకోవాలని, దళారుల మాటలు నమ్మి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దని ఆయన తెలిపారు.  ధాన్యం సేకరణకు సంబంధించి రైతులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో 8886613611 నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.  ప్రభుత్వ కనీస మద్దతు ధర పొందడంలో దళారులు, ఇతరుల నుండి సమస్యలు వస్తే ఈ కంట్రోల్ రూమ్ నెంబరుకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ రైతులకు తెలియజేశారు. 

Kakinada

2021-05-17 13:15:28

దాతల సహాయం కోవిడ్ ప్రాణులకు భరోసా..

కరోనా సమయంలో దాతలు చేసే సహాయం కోవిడ్ రోగుల ప్రాణాలకు భరోసా కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ డి.మురళీ ధరరెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం కాకినాడ‌ క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ను కలిసి డార్విన్ ఫార్మా (విజ‌య‌వాడ‌) సంస్థ ప్ర‌తినిధి ఎస్‌సీవీ ర‌త్నారెడ్డి.. అయిదు స్ట్రాట‌స్ ఫైవ్ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించారు. కోవిడ్ బాధితులకు అవ‌స‌ర‌మైన ప్రాణ వాయువును అందించేందుకు ఉప‌యోగ‌ప‌డే 10 ఎల్‌పీఎం సామ‌ర్థంగ‌ల ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు వితరణ చేశారు. డార్విన్ ఫార్మాకు క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కోవిడ్ విప‌త్తు స‌మ‌యంలో బాధితుల‌కు అండ‌గా ఉండాల‌నే ఉద్దేశంతో డార్విన్ ఫార్మాకు చెందిన డా. వి.ర‌వికుమార్‌, డా. ఎన్‌.ముర‌ళిలు యూఎస్ ఇండియా ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఫౌండేష‌న్‌, వెస్ట్ టెక్సాస్ ఇండియ‌న్ డాక్ట‌ర్స్ గ్రూప్ స‌హ‌కారంతో ఒక్కోటి రూ.లక్షా ప‌దివేలు విలువైన అయిదు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన‌ట్లు ర‌త్నారెడ్డి తెలిపారు. రెండు వెంటిలేట‌ర్ల‌ను కూడా స‌మ‌కూర్చిన‌ట్లు వెల్ల‌డించారు. కోవిడ్ బాధితుల‌కు ఉప‌యోగ‌ప‌డే స్ట్రాట‌స్ ఫైవ్ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు అందించిన డార్విన్ ఫార్మా సంస్థ‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి అభినంద‌న‌లు తెలియజేశారు.

Kakinada

2021-05-17 13:10:50

కోవిడ్ సమయంలో దాతల సహాయం మరువలేనిది..

కోవిడ్ ప్ర‌భావం అధికంగా ఉన్న నేప‌థ్యంలో సామాజిక బాధ్య‌త‌తో కార్పొరేట్‌, వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు స‌హాయం చేసేందుకు ముందుకు వ‌స్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌ని, ఇదే స్ఫూర్తితో విప‌త్తును ఎదుర్కోవ‌డంలో మ‌రిన్ని సంస్థ‌లు భాగ‌స్వామ్యం కావాల‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగ సంస్థ గ్రీన్‌కో ఆధ్వ‌ర్యంలోని  గ్రీన్‌కో ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి దాదాపు రూ.15 లక్ష‌ల విలువైన 20 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, ఎనిమిది ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను అందించారు. కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి స‌మక్షంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ విప‌త్తు స‌మ‌యంలో త‌మ వంతు స‌హాయం అందించేందుకు ముందుకొచ్చిన గ్రీన్‌కో ఫౌండేష‌న్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. కోవిడ్ వైర‌స్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఈ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు ఉప‌యోగ‌ప‌డతాయ‌ని, అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల్లో వీటి పాత్ర కీల‌క‌మ‌ని క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ బాధితుల‌కు ఉప‌యోగ‌ప‌డే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు అందించిన గ్రీన్‌కో ఫౌండేష‌న్‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి అభినంద‌న‌లు తెలియజేశారు.
 
       కాకినాడ అర్బ‌న్ శాస‌న‌స‌భ్యులు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి మాట్లాడుతూ గ్రీన్‌కో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్ అయిన చ‌ల‌మ‌ల‌శెట్టి అనిల్‌కుమార్ జిల్లా వాసి అని, ప్ర‌స్తుత కోవిడ్ విప‌త్తు స‌మ‌యంలో జిల్లా ప్ర‌జ‌ల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించాల‌నే ఉద్దేశంతో ఆక్సిజ‌న్ కాన్సంట్రేటర్లు, సిలిండ‌ర్ల‌ను అందించార‌ని తెలిపారు. ఇంకా స‌హాయం ఏదైనా కావాలంటే అందించేందుకు హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న గ్రీన్‌కో ఫౌండేష‌న్ సిద్ధంగా ఉంద‌ని, జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున సంస్థ‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి పేర్కొన్నారు. రెండో వేవ్ ఉద్ధృతి నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, స్వీయ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు పాటించాల‌ని ఎమ్మెల్యే సూచించారు. కార్య‌క్ర‌మంలో గ్రీన్‌కో డైరెక్ట‌ర్లు తోట శ్రీధ‌ర్‌, తుమ్మ‌ల మోహ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-17 13:04:18

కోవిడ్ కి ఆరోగ్యశ్రీలో వైద్యం అందించాలి..

ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ క్రింద క్యాష్ లెస్ ట్రీట్ మెంట్లు నిబంధనల ప్రకారం జరగాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోవిడ్ సేవలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పడకలు కేటాయింపు పై సోమవారం ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటగిరి ‘ ఎ ’  మరియు కేటగిరి ‘ బి ‘ ఎంప్యానెల్ ఆసుపత్రులలో ఆ మేరకు పడకలు ఖచ్చితముగా కేటాయింపు జంగాలన్నారు.  పడకల వివరాలను ఖచ్చితముగా ఆసుపత్రుల నోడల్ అధికారులు, ఆసుపత్రుల యాజమాన్యాలు డిఆర్డిఎ ప్రాజెక్టు డైరక్టరుకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని పేర్కొన్నారు.  I C U, వెంటిలేటర్ పడకలు, ఆక్సిజన్ పడకలు మొదలగు కేటగిరీల వారీగా పడకలు ఆరోగ్య శ్రీ క్రింద కేటాయింపు గావించి తెలియజేయాలని ఆదేశించారు.   ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఆరోగ్య శ్రీ క్రింద క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ జరగాలి, కాని  పేషెంట్లు సెల్ఫ్ ఫైనాన్స్ తో ట్రీట్మెంట్  పొందుట జరుగుతోందని, ఇది సరికాదన్నారు.  ప్రభుత్వ ఉత్తరువులు  జి.ఒ.నెం.210 ప్రకారము ఆరోగ్యశ్రీ క్రింద పడకలు కేటాయింపును అమలు చేయాలని స్పష్టం చేశారు.                                                       
          నిబంధనల ప్రకారము ఆరోగ్యశ్రీ బెడ్స్ కేటాయింపు చేయాలని, నిబంధనలు పాటించని ప్రవేటు ఆసుపత్రులకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని. (డి.ఎమ్.హెచ్.ఒ., ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ లను ప్రశ్నించారు.   విశాఖపట్నంలో ఆసుపత్రులు, అధికంగా వున్నాయని,  అయినా 104లో టిక్కెట్లు పెండింగు వుండటం శోచనీయమని పేర్కొన్నారు.    జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు ప్రైవేటు ఆసుపత్రులు, ఆరోగ్య శ్రీ బెడ్స్ కేటాయింపు విషయముపై పనిచేయాలన్నారు.  ఆర్.డి.ఒ. విశాఖపట్నం పెంచల కిషోర్ ప్రైవేటు ఆసుపత్రులను రెవెన్యూ యంత్రాంగముతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.  జిల్లా కలెక్టరు అనుమతి తేకుండా ప్రైవేటు ఆసుపత్రులు కోవడ్ ట్రీట్ మెంటు ఇవ్వరాదని వెల్లడించారు.    ప్రైవేటు ఆసుపత్రుల పైన పూర్తిగా దృష్టి సారించాలని ఎ.డి. సర్వే మనీషా త్రిపాఠిని ఆదేశించారు.   ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలకు  సంబంధించిన వివరాలను ఒక ప్రొఫార్మాలో తక్షణమే అందజేయాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటరు రాజేష్ ను ఆదేశించారు.    నోటిఫై కాబడిన ప్రైవేటు ఆసుపత్రులు అన్నీ ఆరోగ్యశ్రీ క్రింద బెడ్స్ కేటాయించి కోవిడ్  సేవలు ఖచ్చితముగా అందించాలన్నారు.  ఆసుపత్రుల  నోడల్ అధికారులు ఆసుపత్రుల్లో ఉండి ఆరోగ్యశ్రీ పడకలు,  కేటాయింపు పై దృష్టి సారించి వివరాలు తెలపాలని స్పష్టం చేశారు.   డిఎమ్ హెచ్ ఒ ప్రతిరోజు ఉదయం 5 ఆసుపత్రులు, మధ్యాహ్నం 5 ఆసుపత్రులను తనిఖీలు చేసి నివేదికలను ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు.  కోవిడ్  పాజిటివ్ రిపోర్టు లేదని అడ్మిషన్ నిరాకరించరాదని,  కేటగిరి  బి ఆసుపత్రుల ఎంప్యానెల్మెంటు (పర్మనెంటు / తాత్కాలికము) పూర్తి గావించాలని  డి.ఎం .హెచ్.ఒ.ను ఆదేశించారు.
                 ఆసుపత్రులలో పడకల వివరాలు, కేటాయింపు విషయముపై ఒక సాఫ్టవేర్  ఎన్.ఐ.సి. అధికారిచే తయారు చేయించాలని, పడకల  పొజిషన్ నిర్దిష్టంగా ఎప్పటికప్పుడు సాఫ్టవేర్ /యాప్ ద్వారా తెలపాలన్నారు.
 డి.ఎమ్.హెచ్.ఒ., ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటరు ప్రైవేటు ఆసుపత్రులు, బెడ్స్ కేటాయింపు విషయముపై సీరియస్ గా పనిచేయాలని ఆదేశించారు.   డి.ఎం..హెచ్.ఒ.  తే 18.5.2021 దిన కేటగిరి  ఎ ఆసుపత్రులతో వెబినార్  నిర్వహించాలని,  పి.డి. డి.ఆర్.డి.ఎ. వద్ద పెండింగులో వున్న 240 బెడ్స్ ఒక్కరోజులో పూర్తి కావాలన్నారు.  వెంటిలేటర్స్ పై ఆడిట్ నిరహించాలన్నారు.   ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, డిఎంహెచ్ ఒ సూర్యనారాయణ, ట్రైనీ కలెక్టర్ అతిథి సింగ్, ఆర్డిఓ పెంచల కిషోర్,  సర్వే శాఖ ఎడి మనీషా త్రిపాఠి, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ రాజేష్,సిపిఒ శ్రీనివాస్, డా. మురళీ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
 
 

Collector Office

2021-05-17 12:59:15

ఆసుపత్రుల్లో జర్మన్ హాంగర్స్ ఏర్పాటు చేయాలి..

ఆసుపత్రులలో అదనంగా కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందించడానికి గాను ప్రభుత్వ ఆసుపత్రులైన కె.జి.హెచ్., విమ్స్, ఛాతీ ఆసుపత్రులలో  జర్మన్ హాంగర్స్ ను సత్వరమే ఏర్పాటు గావించాలని  ఎస్.ఇ. ఆర్.ఎండ్.బి సుధాకర్ ను జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు. సోమావారం ఈ విషయము పై కలెక్టరు, వైద్యాధికారులు, ఎస్.ఇ. ఆర్.ఎండ్.బి.అధికారులతో కలెక్టరు సమావేశము నిర్వహించారు. ఈ విషయముపై ఎస్.ఇ.,ఆర్.ఎండ్.బి.సుధాకర్ మాట్లాడుతూ ఇందుకు గాను ఇప్పటికే  ఇ.టెండర్లు ఆహ్వనించడమైనదని, 20వ తేదీన  బెడ్స్ తెరచి పనులకు ఉత్తర్వులు మంజూరు గావించడం జరుగుతుందని  వివరించారు. కెజిహెచ్ లో 100 పడకలు, విమ్స్ లో 100 పడకలు,  ఛాతీ ఆసుపత్రిలో 50 పడకలకు ఏర్పాట్లు గావించాలని కలెక్టరు సూచించారు.  పనులు మొదలు పెట్టిన తదుపరి ఒక రోజులో ఏర్పాట్లు పూర్తి గావించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు-2,పి.అరుణ్ బాబు, ఎ.ఎమ్.సి. ప్రిన్సిపాల్ డా.సుధాకర్, డి.ఎం .హెచ్.ఒ.డా.సూర్యనారాయణ, ఎస్.ఇ. ఆర్.ఎండ్.బి సుధాకర్ , ఇ.ఇ. ఎస్.ఇ. ఆర్.ఎండ్.బి ప్రశాంత్ పాల్గొన్నారు.

Collector Office

2021-05-17 12:52:57

ప్రకాశం ఇన్చార్జి డిపిఓగా విశ్వనాధశ్రీనివాస్..

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు మరింతగా అందేలా చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఇన్చార్జి డిపిఓగా నియమితులైన తూతిక విశ్వనాధ శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ పోల బాస్కర్ ఉత్తర్వుల మేరకు ఆయన ఇన్చార్జి డిపీఓగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డిపిఓ నారాయణరెడ్డి కోవిడ్ భారిన పడటంతో ఆ బాధ్యతలను ఈయనకి అప్పగించారు. ఇటీవలే ఎస్సీకార్పోరేషన్ ఈడిగా శ్రీనివాస్ విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రామస్థాయిలోనే ప్రజలకు సేవలందించడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటైందని..దాని ద్వారా పూర్తిస్థాయిలో సేవలందితే ప్రజలు జిల్లాకార్యాలయాల వరకూ వచ్చే పరిస్థితి ఉండదన్నారు. సచివాలయాల్లో అందే అన్నిసేవలపైనా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని  వివరించారు. అనంతరం కార్యాల సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి ఇన్చార్జి డీపీఓకి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా విధినిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే ఈయనను జిల్లాకలెక్టర్ గర్తించి డిపీఓ బాధ్యతలు అప్పగించడం విశేషం.

Ongole

2021-05-17 07:32:53

అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజల పాట్లు..

తూర్పుగోదావరి జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు చాలా ఎక్కువగా అమలవుతున్నాయి. రాత్రి సమయంలో పూర్తిగా విద్యుత్ నిలుపుదల చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. జిల్లాలో చాలా మండలాల్లో అరకొరగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. కరోనా కర్ఫ్యూ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతున్న వేళ విద్యుత్ కోతలు ఎంతగానో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని ప్రముఖ దేవస్థానాలు ఉన్న ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగడం లేదు. పూర్తిగా లోఓల్టేజి సమస్య తలెత్తు తుంది. దీనితో మంచినీటిమోటార్లు, విద్యుత్ బల్బులు, టీవీలు కాలిపోతున్నాయి. అదే సమయంలో విద్యుత్ బిల్లులు చాలా అధికంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోఓల్టేజీ సమస్యపై అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోతుంది. దీనితో ఓ పక్క అప్రకటిత విద్యుత్ కోతలు, మరోపక్క లోఓల్టేజి సమస్యతో జిల్లా వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలోనైనా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

Kakinada

2021-05-17 02:44:14

9మంది గ్రామ వాలంటీర్లు తొలగింపు..

శ్రీకాకుళం  జిల్లాలో చేపట్టిన ఆరో విడత ఫీవర్ సర్వే లో నిర్లక్ష్యం వహించిన తొమ్మిది మంది వాలంటీర్లను తొలగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఫీవర్ సర్వే లో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి అన్ని తప్పులు తడకలు రిపోర్టులను సమర్పించారని ఆయన తెలిపారు. తొలగింప బడిన వారిలో టెక్కలి మండలం టెక్కలి ఐదవ సచివాలయ పరిధికి చెందిన దండాసి డిల్లేశ్వర రావు,  దాసరి భారతి, దేవాది రామకృష్ణ, తోట వెంకటేష్,  బొడ్డు తులసి,  గండి రాజారెడ్డి.,  రణస్థలం మండలం నారువ సచివాలయ పరిధికి చెందిన పడగల రమణ,  భామిని మండలం బాలేరు 2 గ్రామ సచివాలయ పరిధికి చెందిన ఏ. రాజారావు,  లావేరు మండలం గుమడ గ్రామ సచివాలయానికి చెందిన గంగవరపు అప్పారావులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ తొమ్మిది మందిని తొలగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలియజేస్తూ ఫీవర్ సర్వేను జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, అంకితభావంతో నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. వాలంటీర్, ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆయన పేర్కొంటూ అనేక మంది ఇంటింటికి సర్వేకు వెళ్లకుండా నివేదికలు సమర్పిస్తున్నట్లు తెలియవచ్చిందని అందులో భాగంగా తొమ్మిదిమందిని తొలగించడం జరిగిందని అన్నారు. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో అటువంటి వారిని తొలగించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. మండల సర్వేలియన్స్ అధికారులు పరిస్థితులను గమనించాలని ఆయన పేర్కొంటూ అవసరమైతే మండల సర్వేలియన్స్ అధికారులపై చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

Srikakulam

2021-05-16 16:59:11

కోవిడ్ బాధితులకు ప్రగతి భారత్ భరోసా..

ఉత్తరాంధ్ర సంజీవినిగా పిల‌వ‌బ‌డుతున్న‌ షీలాన‌గ‌ర్ కోవిడ్ కేర్ సెంట‌ర్ ద్వారా కోవిడ్ భాదితులకు  భరోసా ల‌భిస్తుంది. అత్యాధునిక హంగుల‌తో, అత్యున్న‌త  ప్ర‌మాణాల‌తో ఎం.పి విజ‌య‌సాయి రెడ్డి సారథ్యంలోని ప్ర‌గ‌తి భార‌త్ ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో షీలాన‌గ‌ర్ లోని వికాస్ కాలేజీలో ఏర్పాటు చేసిన 300 ప‌డ‌క‌ల ఆక్సిజ‌న్ సదుపాయం గ‌ల కోవిడ్ కేర్ సెంట‌ర్ ప్రారంభించిన రెండవ రోజుకే 110 మందికి పైగా కోవిడ్ భాదితుల‌కు ఆక్షిజ‌న్ అందించి ఊర‌ట క‌ల్పిస్తుంది. మిగ‌తా కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు భిన్నంగా  కార్పోరేట్ ఆసుప‌త్రుల‌కు ధీటుగా మ‌ల్టీ టైర్ ఆక్సిజ‌న్ స‌రఫ‌రా విధానంతో పేషెంట్లకు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో పూర్తి భద్ర‌త క‌ల్పిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశ‌యాల‌కు అనుగుణంగా ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంట‌ర్లో పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం త్వ‌రిత గ‌తిన కోలుకునే విధంగా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.  చికిత్స పొందుతున్న కోవిడ్ భాదితుల యోగ క్షేమాలు రిసెప్షన్ వద్ద నుండే  తెలుసుకునే విధంగా సిసి కెమెరాలు,కంప్యూట‌ర్లు మెద‌ల‌గు ఏర్పాట్లపై భాదితుల స‌హాయ‌కులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.  శనివారం ఉదయం నుండి ఆదివారం సాయంత్రం నాటికి మెత్తం 111 మంది బాదితులు కోవిడ్ కేర్ సెంట‌ర్లో చేర‌గా అందులో 75 పురుషులు, మిగిలిన 36 మంది స్త్రీలు ఉన్నారు.  మెద‌టి రోజు 66 మంది భాదితులు చేర‌గా రెండ‌వ రోజు సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 45 మంది భాదితులు చేరారు. డాక్ట‌ర్ల సూచ‌న‌లు మేర‌కు ఆదివారం సాయంత్రం నాటికి మెత్తం 16 మంది కోవిడ్ రోగులను మెరుగైన చికిత్స కోసం విమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అంబులెన్స్ లో ఆక్సిజ‌న్ స‌దుపాయం క‌ల్సిస్తూ వైద్య సిబ్బంది ప‌ర్య‌వేక్ష‌ణ‌తో రోగుల‌ను విమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో 9 మంది పురుషులు కాగా మిగిలిన 7 మంది స్త్రీలు. శనివారం ఇద్ద‌రికి మాత్ర‌మే విమ్స్  ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా మిగిలిన 14 మందిని ఆదివారం డాక్ట‌ర్ల సూచ‌న‌ల మేర‌కు త‌ర‌లించారు.

Visakhapatnam

2021-05-16 16:14:41

ఆక్సిజన్ నిల్వలపై అపోహలు వద్దు..

ఆక్సిజన్ నిల్వలపై అపోహలు అవసరం లేదని పటిష్ట కార్యాచరణ తో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని జాయింట్ కలెక్టర్ హెల్త్ వీరబ్రహ్మం పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన ఆర్ డి ఓ  కనక నరసారెడ్డి తో కలిసి రీఫిలింగ్ కేంద్రాల యజమానులతో ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రస్తుతం సరఫరా అవుతున్న ఆక్సిజన్ క్వాంటిటీ పై దృష్టి సారించాలన్నారు.  జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్ లకు అనుగుణంగా ప్రాణవాయువును సరఫరా చేసేందుకు కు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ ఆస్పత్రులను రీఫిల్లింగ్ కేంద్రాలకు అనుసంధానం చేసి  ఆస్పత్రులకు తగినంత ప్రాణవాయువు నిరంతరాయంగా అందించాలని సూచించారు. ఆక్సిజన్ నిల్వలు , వినియోగం, వృధా పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఆక్సిజన్ మేనేజ్మెంట్ పై  నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసి మంగళవారం ఉదయం లోపు కలెక్టర్ కు  నివేదిక సమర్పించారు. ప్రస్తుతం అవసరానికి సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో అన్ని కోవేట్ కేర్ సెంటర్ లలోనూ ఆస్పత్రిలోనూ 18 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందన్నారు. జిల్లాకు ప్రతిరోజు 23 టన్నుల ఆక్సిజన్ ను ఇతర ప్రాంతాల  నుంచి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఆక్సిజన్ పై అనవసర అపోహలు వద్దని ప్రజలు ఈ విషయంపై భయపడాల్సిన పని లేదన్నారు.  ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ బాల ఆంజనేయులు , డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తన ,జిల్లాలోని కోవిడ్   ఆసుపత్రుల ప్రతినిధులు , రీఫిలింగ్ కేంద్రాల యజమానులు పాల్గొన్నారు.

Tirupati

2021-05-16 16:04:01

ప‌టిష్ట వ్యూహంతో మెరుగైన ఫ‌లితాలు..

క‌రోనా క‌ట్ట‌డికి ప‌టిష్ట‌మైన వ్యూహాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా జిల్లాలో మెరుగైన ఫ‌లితాల‌ను సాధిస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. అంద‌రి సమిష్టి కృషివ‌ల్లే ఇది సాధ్య‌ప‌డుతోంద‌ని ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. కోవిడ్ నియంత్ర‌ణ‌లో భాగంగా చేప‌ట్టిన చ‌ర్య‌ల్లో, ఇప్ప‌టికీ మ‌న జిల్లా మెరుగైన స్థానంలో ఉంద‌ని తెలిపారు.  విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌రోనా నియంత్రణ కు స‌మిష్టి కృషి జ‌రుగుతోంద‌ని తెలిపారు. రోజుకు 3,500 నుంచి 4 వేల వ‌ర‌కూ క‌రోనా నిర్ధార‌ణా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌న్నారు.  ఈ నెల మొద‌టి వారంలో 25,416 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌గా, 6,737 పాజిటివ్ కేసులు వ‌చ్చాయ‌ని, రెండో వారంలో 22,220 టెస్టులు నిర్వ‌హించ‌గా, 5,851 పాజిటివ్ కేసులు వ‌చ్చాయ‌ని తెలిపారు. మే నెల‌లో అత్య‌ధికంగా ఇన్‌ఫెక్ష‌న్ రేటు న‌మోదైన‌ప్ప‌టికీ, ప్ర‌స్తుతం కొద్దిగా త‌గ్గుముఖం ప‌డుతోంద‌ని చెప్పారు. ఏప్రెల్ నెల‌లో 77,352 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 9,183 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స‌ను అందించడంలో వైద్యులు, సిబ్బంది చూపిస్తున్న అంకిత‌భావం, చిత్త‌శుద్ది కార‌ణంగా, జిల్లాలో రిక‌వ‌రీ రేటు అత్య‌ధికంగా స‌గ‌టున 85.7 శాతం న‌మోదవుతోంద‌ని చెప్పారు. కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో 95.9 శాతం, హోమ్ ఐసోలేష‌న్‌లో 83.8 శాతం, ఆసుప‌త్రుల్లో 87.3 శాతం రిక‌వ‌రీ రేటు ఉండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు.

                     జిల్లాలో ప్ర‌స్తుతం 6,662 మంది హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని, వీరిలో 6,115 మందికి కోవిడ్ కిట్ల‌ను పంపిణీ చేయ‌డం ద్వారా, 91.79శాతాన్ని సాధించి, మ‌న జిల్లా రాష్ట్రంలోనే ప్ర‌ధ‌మ స్థానంలో నిలిచింద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. జిల్లాలో ఫీవ‌ర్ స‌ర్వే జోరుగా జ‌రుగుతోంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 35.23 శాతం పూర్త‌య్యింద‌న్నారు. జిల్లాలో 7,47,312 వాసాల‌కు గానూ, ఇప్ప‌టివ‌ర‌కు 2,63,248 ఆవాసాల్లో స‌ర్వే పూర్త‌య్యింద‌ని తెలిపారు. జిల్లాలో మ‌రోవైపు వేక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా జ‌రుగుతోంద‌ని, దీనికోసం 67 కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. జిల్లాలో 44 కేంద్రాల్లో కోవిషీల్డ్‌, 23 కేంద్రాల్లో కోవేగ్జిన్ వేస్తున్నార‌న్నారు. జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 2,53,861 మందికి మొద‌టి డోసు, 102432 మందికి రెండో డేసు  వేయ‌డం జ‌రిగింద‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Vizianagaram

2021-05-16 11:29:21

అంటరాని తనమే నిశ్వార్ధ సేవ వైపు నడిపింది..

అమ్మ ఒడే అతని బడి.. అమ్మ గోరు ముద్దలు పెడ్తూ చెప్పిన  మంచి మాటలే అతని బుద్ది బలం.. అంతకు మించి పలకా బలపం పట్టింది లేదు.. తన నిజ జీవితంలో ఏ పుస్తకాలనూ చదవని అతని మస్తకం ప్రపంచాన్నిఎంతో చక్కగా చదివింది.. కళ్లముందు కదలాడిన అంటరాని తనం తనసేవకు తొలిమొట్టు అయ్యింది.. నాటి నుంచి నేటి వరకూ వెను తిరిగి చూడకుండా తన సేవలు కొనసాగిస్తూనే ఉన్నాడా ఆటోవాలా.. ఆ మంచి మనిషికోసం తెలుసుకుంటే.. తూర్పు గోదావరి జిల్లా శంఖవరంలో ఆటో డ్రైవర్ గా జీవనాన్ని గడుపుతూ "దళిత ప్రజా ఐక్య వేదిక సేవా సంఘం శంఖవరం" సభ్యునిగా తన ప్రాంత స్వజనులకు ఇతోధిక సేవలందిస్తున్న బూర్తి దుర్గాప్రసాద్ (9030117096)కు భారత రత్న డాక్టర్  భీమారావ్ రామ్ జీ అంబేద్కర్ " పే బ్యాక్ టు సొసైటీ " సిద్దాంతం బాగా వంట బట్టింది.. శంఖవరంలోని తన నివాసిత ప్రాంతమైన అంబేద్కర్ నగర్ పరిధిలోని ఏ గర్భిణీ మహిళనైనా సమయానుకూలతలతో సంబంధం లేకుండా తన ఆటోలో ఆస్పత్రులకు ఉచితంగా తరలించి, వెనుకకు తీసుకు వచ్చేందుకు ముందుకు వచ్చి తన ఉదారతను చాటు కుంటున్నాడు. శంఖవరంలోని అంబేద్కర్ నగర్ నుంచి శంఖవరం, రౌతులపూడి, కత్తిపూడి, తుని, పిఠాపురం, కాకినాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఉచితంగా గర్భిణీ స్త్రీలను తరలిస్తూ ఇప్పటికి నెల రోజులుగా ఉచిత సేవలను అందిస్తూ అభినందనలను అందుకున్నాడు. కరోనా వైరస్ తన విశ్వరూపం చూపిస్తున్న సమయంలో కూడా  తన ఈ ఉచిత సేవలు పొందగోరే వారి కోసం తన ఆటోపై ప్లెక్సీని ప్రదర్శించి మరీ సేవలు చేస్తున్నాడు.. ఇదే విషయమై దుర్గాప్రసాద్ ను కదిలించినపుడు తన హృదయాన్ని కదిలించిన ఓ సంఘటనను వివరించాడు. నాతవరం మండలంలోని ఓ కుగ్రామంలో ఓ దళిత గర్భిణీ మహిళను ఆస్పత్రికి తరలించేందుకు ఉన్నత సామాజిక వర్గాల ఆటో వాలాలు అంగీకరించలేదని అన్నారు. అ సమయంలో గత్యంతరం లేక ఆ గర్భిణీ పశువుల పాకలో నాలుగు చీర పరదాల మాటున ఓ అభినవ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటనను స్వయంగా చూసిన తనను ఎంతగానో కలచివేసిందన్నాడు.. నాడు ఆ తల్లి ఆ పశువులశాలో పడ్డ  ప్రసవ క(న)ష్టం తన దళితవాడలోని ఏ గర్భిణీకి రాకూడదనే స్థిర నిర్ణయంతో తాను ఈ సేవ చేయడానికి ముందుకి వచ్చానని చెప్పుకొచ్చాడు. 73ఏళ్ల స్వతంత్ర్య భారతదేశంలో ఇంకా అంటరాతి తనం ఉండటం కడు శోచనీయమని, మనుషులంతా ఒక్కటే నని అంతా భావించాలని కోరుతున్నాడు. సబ్ కా మాలిక్ ఏక్ హై..అని అంతా అనే రోజు రావాలని, అంభేత్కర్ కలలుగన్న భారత దేశాన్ని చూడాలని అనుకుంటున్నానని చెప్పాడు కళ్లు చమర్చుతూ..!

Sankhavaram

2021-05-16 11:15:48

ఆ మంచిపనికి మేమూ సాయం చేస్తామన్నారు..

కరోనా విలయతాండవం చేస్తున్నవేళ రోగులకు ఒకపూట భోజనం పెట్టాలనుకున్న ఆ అన్నదాత ఆలోచనకు మరో నలుగురు యువకులు తోడయ్యారు.. అనుకున్నదే తడవుగా చేయి చేయి కలిపి 300 మందికి ఆకలి తీర్చారు.. ఈ అరుదైన అన్నదాన కార్యక్రమానికి  ఆదివారం కాకినాడ జనరల్ హాస్పిటల్ వేదికైతే.. ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ప్రధాన సాక్షిగా నిలిచింది..  కరోనాతో బాధపడుతున్న రోగులకు, వారికి సహాయం ఉండటానికి వచ్చిన వారికి, రోగులకు వైద్యసేవ చేసే ఆసుపత్రి సిబ్బందికి ఆహార పొట్లాలు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఆ యువకులు. ఎక్కువ మందికి అన్నదానం చేద్దామనుకున్న శంఖవరం గ్రామసచివాలయం-1లో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న వీర్ల సురేష్ కి మరో దాత శ్రీనివాస్ తోడయ్యారు. ఆదివారం ఆసుపత్రిలో అన్నదానం చేద్దామని శుక్రవారమే ప్లాన్ చేసుకున్నారు. దానికోసం భోజనాలు స్వయంగా చేయిద్దామని భావించి సతీష్ అనే వంటలు వండే వ్యక్తిని సంప్రదిస్తే.. మీరు నిరుపేదలకు ఆకలి తీర్చే మంచి కార్యక్రమం చేస్తున్నారు.. విపత్కర సమయంలో మీరు చేసే మంచిపనిలో నన్నూ భాగస్వామిని కానీయండంటూ ఆహారాన్ని మొత్తం ఉచితంగానే తయారు చేసి అందించాడాయన.. ఇపుడు వండిన ఆహారాన్ని ఆసుపత్రికి తరలించాలి.. ఆటో కోసం చూస్తున్న సమయంలో డ్రైవర్ వెంకట అప్పలనాయుడు తారస పడ్డాడు.. ఇన్ని అన్నం పొట్లాలు ఎక్కడ దించాలని అని ప్రశ్నించాడు ఆటో డ్రైవర్.. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు అన్నదానం చేస్తున్నాం టైమవుతుంది త్వరగా వెళ్లాలి అని చెప్పారు.. అంత మంది ఆకలి తీరుస్తున్నారు.. నేనూ మీ సేవకు తోడవుతాను నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వొద్దు, నేనూ కూడా మీతో పాటే అందరికీ అన్నం పంచుతాను నాకూ ఓ అవకాశం ఇవ్వండి అని అడిగాడు.. చక్కగా ప్యాకింగ్ చేసిన ఆహార పొట్లాలు మొత్తం నా ఆటోలో వేసేయండి నేనే తీసుకు వస్తానంటూ వండిన అన్నం ప్యాకెట్లు మొత్తం ఆసుపత్రికి హుటా హుటీన తరలించేశారు.. తీరా అక్కడ అన్నం అందరికీ పంచాలి.. ఆసుపత్రి సిబ్బంది అంతా విధుల్లో ఉన్నారు..కోవిడ్ కావడంతో ఎవరూ అందుబాటులో ఎవరూ లేరు.. సహాయం కోసం వెతుకున్న సమయంలో  రాబిన్ హుడ్ ఆర్మీ బ్రుందం సభ్యులు వి.రామ్, ఎ.లలిత్ సాయిలు వీరికి తోడయ్యారు.. అంతే చక చకా ఆసుపత్రిలో రోగులతోపాటు, సిబ్బందికి కడుపునిండా అన్నం పెట్టి దాహం తీర్చారు.. ఈ సమయంలో ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలు(మొహానికి మాస్కులు, చేతికి హేండ్ గ్లౌజులు, చూట్టూ శానిటషన్ మధ్య మధ్యలో శానిటైజర్ తోశుభ్రం) పాటించారు ఆ యువకులంతా.. అక్కడ ఆహార పొట్లాలు తీసుకున్న ప్రతీ ఒక్కరూ ఆ ఐదురుగురు యువకుల వైపు చూస్తూ మీరంతా చల్లగా ఉండాలి బాబు, కష్టకాలంలో కడుపునిండా అన్నం పెట్టారంటూ నిండైన హ్రుదయంతో దీవించారు. దానికి ఆ యువకులు బదులిస్తూ.. సీఎం వైఎస్. జగన్మోహనరెడ్డి అలుపెరగ కుండా ప్రజలను ఈ కరోనా వైరస్ నుంచి కాపాడటానికి ఎంతో శ్రమిస్తున్నారు.. వైద్యం అందిస్తున్నారు, అన్నం పెడుతున్నారు, వైద్యసిబ్బందితో సేవలు చేస్తున్నారు, అంతలా ఆయన శ్రమిస్తున్న తీరు మాలో స్పూర్తి నింపి ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రేరేపించింది అంటూ వారికి బదులిచ్చారు యువకులు.. ఐదుగురు యువకులు ఆసుపత్రిలో రోగుల  కడుపు నింపడం కోసం చేసిన అన్నదాన కార్యక్రమం విజయవంతం అయ్యింది.. ఈ అన్నదాన కార్యక్రమం, యువకులు సేవతో ముందుకి వచ్చిన తీరు అక్కడి అధికారులను, వెద్య సిబ్బంది,  కరోనా రోగుల సహాయకులను ఎంతగానో ఆలోచింపజేసింది. ఇంతటి మంచి కార్యక్రమాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net పాఠకుల ముందుకి తీసుకు వచ్చింది. ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మంచిని పాటించిన ఈ యువ అన్నదాతల స్పూర్తితో మరింత మంది ఈ కరోనా సమయంలో ముందికి వచ్చి సాయమందిలన్నదే ప్రధాన ఉద్దేశ్యం..జైహింద్..! 

Kakinada

2021-05-16 10:58:55