తూర్పుగోదావరి జిల్లాలో 1,094 రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ యంత్రాల కస్టమ్ హైరింగ్ కేంద్రాల (సీహెచ్సీ)ను ఏర్పాటు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లోని కోర్టుహాల్లో వ్యవసాయ యంత్రాల సరఫరా సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులతో జేసీ సమావేశమయ్యారు. అదే విధంగా వర్చువల్ విధానంలో అన్ని డివిజన్లలోని ఏడీలతో పాటు మండల స్థాయి వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యమిస్తోందని, గ్రామాల్లో రైతులకు అవసరమైన అన్ని అధునిక యంత్రాలను అందుబాటులో ఉంచేందుకు ఒక్కో కేంద్రంలో గరిష్టంగా రూ.15 లక్షల విలువైన యంత్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కేంద్రాల ఏర్పాటుకు 1094 రైతు గ్రూపులను ఇప్పటికే గుర్తించామని, ఒక్కో గ్రూపులో అయిదుగురు రైతులు సభ్యులుగా ఉంటారన్నారు. ప్రభుత్వం 40 శాతం రాయితీని అందిస్తుందని, 50 శాతం బ్యాంకు రుణం మంజూరవుతుందని తెలిపారు. రైతు గ్రూపులు 10 శాతం మొత్తాన్ని భరిస్తే సరిపోతుందని వివరించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వచ్చే నెలలో గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ క్రమంలో సరఫరా చేయగల యంత్రాలు, ధరలు వివరాలతో పూర్తివివరాలను అందించాలని, రైతులకు గరిష్ట ప్రయోజనం కల్పించేలా నాణ్యమైన, అధిక ఉత్పాదకత కలిగిన యంత్రాలను అందించాలని యంత్రాల సరఫరా సంస్థల ప్రతినిధులకు జేసీ సూచించారు. గ్రూపులకు సంబంధించి ఖాతాలను తెరవడం, డీబీటీ పోర్టల్లో రిజిస్ట్రేషన్, ఏడీ నుంచి పర్మిట్ల జారీ తదితర పనులను ఈ నెల 25 నాటికి పూర్తిచేయాలని వ్యవసాయ అధికారులను జేసీ ఆదేశించారు.
నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు..
రైతులకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ఫలాలను అందించే క్రమంలో క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంవహిస్తే కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులకు అందుబాటులో ఉండి, కీలకంగా వ్యవహరించాలన్నారు. అత్యంత కచ్చితత్వంతో మార్చి 20 నాటికి 100 శాతం ఈ-క్రాప్ బుకింగ్ను పూర్తిచేయాలన్నారు. రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు తప్పులు లేకుండా చూడాలన్నారు. మద్దతు ధర, పంట ప్రమాణాల వివరాలను ప్రతి ఆర్బీకేలోనూ ప్రదర్శించాలని, ధాన్యం సేకరణతో పాటు ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఎస్వీ ప్రసాద్, డీడీలు రామారావు, మాధవరావు, డీసీసీబీ డీజీఎం పీఎస్ ప్రకాశం తదితరులతో పాటు వ్యవసాయ యంత్రాల సరఫరా సంస్థలు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.
పీజో మీటర్ల ద్వారా భూగర్భ జల మట్టం లోతు పరిశీలిస్తున్నామని భూగర్భ జలం, జల గణన శాఖ ఉపసంచాలకులు సి.ఎస్.రావు అన్నారు. భూగర్భ జలం, జల గణన శాఖ స్వర్ణోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం ఉప సంచాలకుల కార్యాలయంలో బుధ వారం అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పీజోమీటరు ద్వారా భూగర్భ జలమట్టం ఎంత లోతులో వుందో తెలుసుకోటానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బోరు బావి వంటిదని అన్నారు. పీజోమీటర్లను రాష్ట్రంలో భూగర్భజల పరిస్థితిని ప్రతిబింబించేలా నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు సహకారంతో 1254 ప్రాంతాల్లో ఏర్పాటు చేయగా జిల్లాలో 68 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో రాతి పొరల్లో వున్న భూగర్భ జలం ఎంత పరిమాణంలో వుందో తెలుసుకోవటంతో పాటు బావులు లేదా బోరు బావులలో ఎంత లోతులో వుందో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. భూగర్భ జల లభ్యతా పరిమాణం ఎంత ముఖ్యమో అది అందుబాటులో వుండే లోతు కూడా అంతే ముఖ్యమని పేర్కొంటూ ఎండా కాలంలో బావులు లేదా బోర్లలో నీళ్లు బాగా క్రింది స్ధాయిలో ఉంటాయని, వానాకాలంలో పైకి వస్తాయని అందరికీ తెలిసిన విషయమే అయినా అవి ఖచ్చితంగా ఏ కాలంలో ఎంత లోతులో వున్నాయి, కాలానుగుణంగా ఏ రకమైన మార్పులకు లోనవుతున్నాయి అని శాస్త్రీయంగా తెలుసుకొనుటకు పిజో మీటర్లు ఉపయోగపడతాయని వివరించారు. పీజోమీటర్ల ద్వారా తమ ప్రాంతంలోని వాటర్ లెవల్ ను ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన స్మార్ట్ ఫోన్ ద్వారా ఎవరైనా తెలుసుకోవచ్చుని, ఇంటర్ నెట్ సౌకర్యం కలిగిన మీ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లో http://www.apwrims.ap.gov.in, http://www.apsgwd.ap.gov.in వెబ్ సైట్ల ద్వారా మరియు సి.యం. డ్యాష్ బోర్డు (https://core.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో వాటర్ లెవల్ 2020-21 జల సంవత్సరంలో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండు వాటర్ లెవల్ బాగా పెరిగిందని, 2020 జూన్ నుండి ప్రారంభమైన నైరుతి ఋతుపవన వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ఇప్పటి వరకు 787 మి.మీ. వర్షం కురవాల్సి వుండగా 1017 మి.మీ. వర్షం కురిసిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 6.3 మీటర్ల లోతులో నీటి నిల్వల స్ధాయి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూగర్భ జల శాఖ సహయ సంచాలకులు డి.లక్ష్మణ రావు, జిల్లా నీటియాజమాన్య సంస్ధ సహాయ సంచాలకులు ఏ.లక్ష్మణ రావు, టెక్నికల్ అసిస్టెంట్ ఏ.జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
రెడ్క్రాస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీని, జిల్లా కలెక్టర్, రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ బుధవారం కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. రెడ్క్రాస్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. ఈ నెల 16న శ్రీకాకుళం జిల్లాలో మొదలైన ఈ సైకిల్ ర్యాలీ, విజయనగరం మీదుగా బుధవారం సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుంటుంది. రెడ్క్రాస్ స్థాపన వెనుక ఉన్న ఏడు ప్రధాన లక్ష్యాలను ఈ ర్యాలీలో వివరిస్తారు. ముఖ్యంగా రక్తదానం, మొక్కల పెంపకం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ, వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెడ్క్రాస్ లక్ష్యాలను వివరించేందుకు, వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమలో సైకిల్ ర్యాలీ ఒకేసారి మొదలయ్యిందని, ఈ నెల 25 నాటికి విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. ఆరోజు జరిగే ముగింపు కార్యక్రమానికి గవర్నర్ హాజరవుతారని చెప్పారు. సమాజంలో సేవాతత్వాన్ని పెంపొందించేందుకు, ముఖ్యంగా రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు రెడ్ క్రాస్ విశేషంగా కృషి చేస్తోందని చెప్పారు. ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో భాగస్వాములు అయినందుకు రెడ్క్రాస్ సభ్యులు గర్వపడాలని అన్నారు. రెడ్క్రాస్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని జెసి కోరారు.
కార్యక్రమంలో రెడ్క్రాస్ స్టేట్ ఛైర్మన్ డాక్టర్ ఏ.శ్రీధర్రెడ్డి, వైస్ ఛైర్మన్ జగన్మోహనరావు, కోశాధికారి డాక్టర్ వెంకటరెడ్డి, జిల్లాశాఖ ఛైర్మన్ కెఆర్డి ప్రసాదరావు, కార్యదర్శి సత్యం, జూనియర్ రెడ్క్రాస్ జిల్లా సమన్వయకర్త ఎం.రామ్మోహనరావు, రెడ్క్రాస్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, ఎన్సిసి జిల్లా కో-ఆర్డినేటర్ కల్నల్ అజయ్కుమార్, బాలల హక్కుల కమిషన్ సభ్యులు కేసలి అప్పారావు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు ఇ.విజయ్కుమార్, రెడ్క్రాస్ ఎపిఆర్ఓ ఎం.రాము, డిఎఫ్ఓ పి.గౌరి, ఎన్.చంద్రరావు, డాక్టర్ వెంకటేశ్వర్రావు, డాక్టర్ ఎన్వి సూర్యనారాయణ, డాక్టర్ సుభద్రదేవి, అచ్చిరెడ్డి తదితర ప్రముఖులు, పలువురు రెడ్క్రాస్ శాశ్వత సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఎందరో మహానుభావులు మన దేశానికి స్వాతంత్రం సిద్ధించేందుకోసం సర్వం త్యాగం చేశారని, వారి త్యాగ ఫలాలను గుర్తుంచుకుని దేశం కోసం మనమేం చేస్తున్నామో అనేది ఆలోచించాలని, దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో నెహ్రూ యువ కేంద్రం మరియు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో 75 వ స్వాతంత్ర్య భారత సంబరాల్లో భాగంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ, టవర్ క్లాక్ వద్ద మానవ హారం కార్యక్రమాన్ని మరియు దేశంలో రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభించి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వాకథాన్, సైక్లథాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి తదితరులు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ భరతమాతను విదేశీ పాలనను విముక్తి చేయడానికి చాలామంది తమ ఆస్తులు, ప్రాణాలు, కుటుంబ సభ్యులను పోగొట్టుకుని నిలబడి త్యాగాలను చేయడంవల్ల మనకు స్వతంత్రం సిద్ధించిందని, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, నెహ్రు తదితర అమరవీరుల త్యాగాల వల్ల మనకు స్వతంత్రం వచ్చిందన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతోందని, ఈ సందర్భంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని, స్వతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని తలుచుకుంటూ వారికి ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేసినప్పుడే మహానుభావులు చేసిన త్యాగాలకు విలువ ఉంటుందని, ఏదో విధంగా దేశానికి మంచి చేసి గౌరవం తీసుకురావాలన్నారు.
దేశంలో 1920వ సంవత్సరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని ప్రారంభించడం జరిగిందని, అప్పటినుంచి ఇప్పటివరకు వందేళ్లలో రెడ్ క్రాస్ సంస్థ ఎంతో సేవ చేయడం జరిగిందన్నారు. మానవ జాతికి సేవ చేయాలి, మానవత్వాన్ని వికసింపజేయాలని, మానవజాతి మనుగడకు రెడ్ క్రాస్ సంస్థ కృషి చేస్తోందని, కరోనా సమయంలో ఎంతో సేవ చేయడం జరిగిందని, రక్తదానం చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందన్నారు. జిల్లా యంత్రాంగం కూడా తమకు ఎంతగానో సహకారం అందిస్తోందన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి మాట్లాడుతూ ఎంతోమంది త్యాగమూర్తులు సర్వం త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చారన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మంచి సమాజాన్ని ఇవ్వడం కోసం, సమాజాన్ని కాపాడుకోవడం కోసం, విద్యార్థులను ఇలాంటి కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేసి అవగాహన కల్పించాలన్నారు. దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనం ఎలాంటి సేవ చేస్తున్నామని పిల్లలు మరిచిపోతున్నారని, ప్రతి ఒక్కరు దేశ సేవ చేయాలన్నారు. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్థాపించి 100 ఏళ్లు అయిన సందర్భంగా ఎన్జీవోలు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని, కులానికి, మతానికి, వర్గానికి అన్నింటికీ అతీతంగా రెడ్ క్రాస్ సేవలు ఉంటున్నాయన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాలు, చెట్ల పెంపకం ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. స్వతంత్రం సిద్ధించింది అనేందుకు గుర్తుగా నిర్మించిన టవర్ క్లాక్ వద్ద ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మానవహారం చేయడం జరిగిందని, స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికి సిద్ధించి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు.
ఈ సందర్భంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంపై విద్యార్థులు జాతీయ జెండా తీసుకొని అవగాహన ర్యాలీ, టవర్ క్లాక్ వద్ద మానవ హారం కార్యక్రమాన్ని నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద నుంచి సప్తగిరి సర్కిల్ కె ఎస్ ఆర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, తెలుగు తల్లి విగ్రహం, రుద్రంపేట, కళ్యాణ్ దుర్గం బైపాస్, పి టి సి ఫ్లైఓవర్, ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థుల సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్ పార్కు పక్కనున్న శిల్పారామంలో హస్తకళల ఎగ్జిబిషన్-2021, ప్రత్యేక చేనేత వస్త్రాల ఎక్స్పో-2021ను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ శిల్పారామం సీఈవో బి.జయరాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎగ్జిబిషన్, ప్రత్యేక ఎక్స్పోను మార్చి 17న సాయంత్రం అయిదు గంటలకు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమానికి విజయవాడలోని హస్తకళల అభివృద్ధి కార్యాలయ ఏడీ డా. మనోజ్ లంకా ప్రత్యేక అతిథిగా హాజరవుతారన్నారు. మార్చి 17 నుంచి 26 వరకు హస్తకళల ఎగ్జిబిషన్, మార్చి 30 వరకు ప్రత్యేక చేనేత వస్త్రాల ఎక్స్పో సెలవు రోజులతో సహా ప్రతి రోజూ ఉదయం 11 గం. నుంచి రాత్రి 9 గం. వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్, ఎక్స్పోలో కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, ఉదయగిరి కట్లరీ ఉడెన్ వస్తువులు, బంజారా చేతి ఎంబ్రాయిడరీ తదితర హస్తకళల ఉత్పత్తులతో పాటు మంగళగిరి, వెంకటగిరి రీ, చీరాల, మచిలీపట్నం, ఉప్పాడ తదితర చేనేత చీరలు, డ్రస్ మెటిరీయల్ ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు. ఎగ్జిబిషన్, ఎక్స్పోలను కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేస్తున్నట్లు బి.జయరాజ్ తెలిపారు.
వాణిజ్య బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు చారిత్రాత్మకమైనదని తొలి సారిగా దేశంలో క్రెడిట్ కార్డులు జారీ చేసిన బ్యాంక్ కూడా ఆంధ్రా బ్యాంకేనని మహనీయుని స్మృతిగా ఈ ప్రాంతంలోనే డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక మ్యూజియం ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రశంసించారు. వస్థాపక బ్యాంకు సందర్శించి ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ,1923 నవంబరు 20 న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రా బ్యాంక్ మచిలీపట్నంలో స్థాపించారని భారతీయ బ్యాంకింగ్ రంగానికి సాంకేతికతను పరిచయం చేసిన ఆంధ్ర బ్యాంక్ ఈ గడ్డ మీద జీవం పోసుకోందని అయితే , కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రా బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1 ఏప్రిల్ 2020 నుండి విలీనం అవుతోందని తెలిపారు. దీంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవతరించనుందన్నారు..
ఎంతో చారిత్రాత్మక నేపధ్యం కల ఆంధ్రా బ్యాంకు 1981లో క్రెడిట్ కార్డు లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను పరిచయం చేసిన ఘనత సైతం ఉందన్నారు 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించి, 2007 లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది ఆంధ్రాబ్యాంక్ మాత్రమే అని చెప్పారు దేశంలో తొలిసారిగా 1980 లో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు ప్రధానమైనదని ఇలా ఎన్నో రికార్డులను సృష్టించిన ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరిట ఒక స్మారక మ్యూజియంను మచిలీపట్నంలో ఏర్పాటుచేయడం ఇక్కడ ప్రజలకు కొంతమేరకు ఊరట కలిగిస్తుందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ కార్యక్రమంలో బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, యూనియన్ బ్యాంకు జనరల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి , డెప్యూటీ జనరల్ మేనేజర్ కె .వి. రావు, మచిలీపట్నం రీజినల్ సన్యాసి రాజు, డెప్యూటీ రీజినల్ హెడ్ నందగిరి గురుచరణ్, ఫౌండర్స్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన గొప్ప మహనీయుడు అమర జీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు (గ్రామ, వార్డ్ మరియు అభివృద్ధి) డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) గంగాధర గౌడ్, డిఆర్ఓ గాయత్రి దేవి తదితరులు శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణకు శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం కృషి ఎనలేనిదన్నారు. 1901 మార్చి 16న మద్రాసు జార్జి టౌన్ అణ్ణపిలై వీధిలో పొట్టి శ్రీరాములు జన్మించారని, ఆనాడు మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతం పట్ల ప్రదర్శిస్తున్న తీరును గమనించి మద్రాసు నగరంపై ఆంధ్రుల హక్కు ఉందని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ద్వారానే ఆంధ్ర జాతికి న్యాయం జరుగుతుందని భావించి 1952 అక్టోబర్ 19న తేదీన మద్రాసులోని మైలాపూరులో నిరాహార దీక్షకు పూనుకున్నారని తెలిపారు. చివరకు 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యారని, అంతేగాక స్వాతంత్ర ఉద్యమంలో కూడా శ్రీ పొట్టి శ్రీరాములు గాంధీ మార్గంలో నడిచి అనేక ఉద్యమాలలో ప్రముఖపాత్ర వహించి స్వాతంత్ర్య సమరయోధునిగా గుర్తింపబడ్డారని తెలిపారు. వీరి జీవితం అందరికీ ఆదర్శం అని అన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించి చరిత్రలో మహాపురుషునిగా నిలిచారని జాయింట్ కలెక్టర్ సిరి తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముఖ్య కారకులు అయ్యారని తెలిపారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు తన జీవితాంతం కృషిచేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు.
పొట్టి శ్రీరాములు జాతికి చేసిన సేవలు మరువరానివని జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ తెలిపారు. హరిజనోద్ధరణకు పొట్టి శ్రీరాములు ఎంతగానో కృషి చేశారని, అంతేగాక ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని శ్రీ పొట్టి శ్రీరాములు కార్యదీక్ష పరుని గా ఎదిగి అమరజీవి అయినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి దీపక్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గ ఎన్నికలకు రేపు నిర్వహించబోయే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టామని సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు తెలియజేశారు. స్థానిక జెఎన్టియూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఐఈటిఈ బ్లాకులో తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను సహాయ రిటర్నింగ్ అధికారి (ఏఆర్ఓ), డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులకు కౌంటింగ్ ఏర్పాట్లపై వివరిస్తూ, ఈ నెల 14వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగగా, మొత్తం 17,467 మంది ఓటర్లకు గాను, 16,054 మంది (91.91 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 11 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారని, రెండు జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను జెఎన్టియూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఐఈటిఈ బ్లాకులో స్ట్రాంగ్ రూమ్ లో పటిష్టమైన రక్షణలో బద్రపరచడం జరిగిందన్నారూ. బుధవారం ఉదయం 8 గం.ల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని, ఇందుకు 136 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించామన్నారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మంగళవారం ఓట్ల లెక్కింపు విధానంపై అవగాహన కల్పించామని తెలిపారు. కౌంటింగ్ నిర్వహణకు మొత్తం 10 టేబుళ్లు ఏర్పాటు చేశామని, ప్రాధమిక కౌంటింగ్ కు 12 రౌండ్లు, ప్రధాన కౌంటింగ్ కు 2 రౌండ్లు అవసరమౌతాయన్నారు. తొలుత బ్యాలెట్లన 25 చొప్పున కట్టలు కడతారని తెలిపారు. మిగిలిన ఎన్నికలకు భిన్నంగా ప్రిఫరెన్సియల్ ఓటింగ్ విధానంలో జరిగే ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు, అవసరమైనపుడు బదిలీ ద్వారా తదుపరి ప్రాధాన్యతా ఓట్లకు కూడా లెక్కించడం జరుగుతుందన్నారు. మొత్తం పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లను రెండుతో భాగించగా వచ్చిన సంఖ్యకు ఒకటి కలిపి విజేతను నిర్ణయించేందుకు అవసరమైన కోటా సంఖ్యను నిర్థారించడం జరుగుతుందన్నారు. ఎవరేని ఒక అభ్యర్థికి నిర్థేశిత కోటా సంఖ్య ఓట్లు వచ్చే వరకూ ఎలిమినేషన్ రౌండ్లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారని తెలిపారు. కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు సకాలంలో కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, తమ వెంట సెల్ ఫోన్ లు, ఏ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు లోనికి తీసుకు రాకూడదని తెలిపారు. కౌంటింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు మీడియా కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా రాత్రి వరకూ కూడా కొనసాగితే ఇబ్బంది లేకుండా అంతరాయం లేని విద్యుత్ సరఫరా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియను వీడియోగ్రఫీ పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
రెడ్ క్రాస్ సంస్థ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ప్రారంభమైన సైకిల్ యాత్ర విజయవంతం కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆశాభావం వ్యక్తం చేసారు. రెడ్ క్రాస్ సంస్థ శత జయంతిని పురష్కరించుకొని స్థానిక 80 అడుగుల రహదారి వద్ద సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని జిల్లా రెడ్ క్రాస్ సంస్థ మంగళవారం ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర రెడ్ క్రాస్ ఛైర్మన్ ఏ.శ్రీధర్ రెడ్డితో కలిసి సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ వంద సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సేవా ధృక్పథంతో పనిచేయడంలో రెడ్ క్రాస్ సంస్థ ముందంజలో ఉంటుందని కొనియాడారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో రెడ్ క్రాస్ సంస్థ వాలంటీర్లు అందించిన సేవలు అనిర్వచనీయమని, సేవా దృక్పథంతో అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. ముఖ్యంగా కోవిడ్ తో మృతిచెందిన వారిని వారి బంధువులు సైతం ముందుకురాని సమయంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు స్వచ్చంధంగా ముందుకు వచ్చి వారి అంత్యక్రియలు నిర్వహించిన సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. అలాగే వలస కార్మికులు భోజనాలు లేకుండా ఉన్న సమయంలో భోజనాలు అందించారని చెప్పారు. కోవిడ్ పేషెంట్ల కొరకు ప్లాస్మా అవసరమని జిల్లా ప్రజలకు పిలుపునివ్వగా రెడ్ క్రాస్ ముందు వరుసలో ఉండి ప్లాస్మాదానం చేసారని కలెక్టర్ తెలిపారు. ఇవేకాకుండా హోమ్ ఐసోలేషన్లో ఉండే కోవిడ్ పేషెంట్లకు మెడికల్ కిట్లు అందజేశారని కొనియాడారు. రక్తదానం చేయడంలోనూ, రక్తదానం సేకరించడంలోనూ రెడ్ క్రాస్ సంస్థ ముందంజలో ఉంటుందని చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తుందని కలెక్టర్ చెప్పారు. ఇన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నట్లే ఈ సైకిల్ యాత్ర కూడా విజయవంతం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, అత్యవసరాలకు సరిపడా రక్తనిధి నిల్వలు లేవని, కావున యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వలన మరింత ఆరోగ్యంగా ఉంటారని గుర్తుచేసారు. రక్తదానంపై చాలామందికి అపోహలు ఉన్నాయని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారు ప్రతీ 6 మాసాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని యస్.పి తెలిపారు. రాష్ట్ర రెడ్ క్రాస్ ఛైర్మన్ ఏ.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి లేదని, త్వరలో శ్రీకాకుళంలో క్యాన్సర్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెడ్ క్రాస్ సంస్థ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సైకిల్ యాత్రను ప్రారంభించడం జరిగిందని, సైకిల్ యాత్రలో అందరూ పాల్గొనవచ్చని చెప్పారు. సైకిల్ యాత్ర ఈ నెల 25వరకు కొనసాగుతుందని, ఈ యాత్రలో పాల్గొన్నవారందరికీ ఈ నెల 25న అమరావతిలో గౌరవ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రసంశా పత్రాలను అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రదేశాల్లో యాత్రా సభ్యులతో సభలు నిర్వహించి రక్తదానం, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం, మోటారు వాహనాల వినియోగం తగ్గింపు, కరోనా నివారణ చర్యలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
ఈ సైకిల్ యాత్ర కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు పి.జగన్మోహన్ రావు, రాష్ట్ర రెడ్ క్రాస్ ట్రెజరర్ వెంకటేశ్వరరావు , సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, డా.డి.విష్ణుమూర్తి, స్వచ్ఛంధ సంస్థల డైరక్టర్లు గీతా శ్రీకాంత్, నూక సన్యాసి రావు, రమణ మూర్తి, ఎం. ప్రసాద రావు, సామాజిక కార్యకర్త మంత్రి వెంకట స్వామి, ఫణి, డా.శ్రీరాములు, ఇంటాక్ కన్వీనర్ కె. వి. జె. రాధా ప్రసాద్, సురంగి మోహన్ రావు, నిక్కు అప్పన్న, బలివాడ మల్లేశ్వర రావు, గేదెల ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పౌరసరఫరాల శాఖకు సంబంధించి స్టేజ్ -1 మూమెంట్ ట్రాన్స్ పోర్టేషన్ టెండర్ ప్రక్రియలో లారీ ఓనర్స్ ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) జి లక్ష్మీ శ లారీ ఓనర్స్ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జేసి లక్ష్మి శ స్టేజ్ - 1 ట్రాన్స్ పోర్టేషన్ కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ ,సివిల్ సప్లై అధికారులు, లారీ ఓనర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ బఫర్ గోడౌన్ నుంచి మండల స్థాయి గోడౌన్ లకు బియ్యం పంపిణీలో లారీ ఓనర్స్ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు.బియ్యం తరలింపు ట్రాన్స్పోర్ట్ ,సివిల్ సప్లై అధికారులు, లారీ ఓనర్స్ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన తెలిపారు. స్టేజ్ -1 మూమెంట్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి లారీ ఓనర్స్ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని రెండు రోజుల్లోగా తమ నిర్ణయాన్ని తెలియపరచాలని జేసి లారీ ఓనర్స్ కు సూచించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై డీఎం ఈ లక్ష్మి రెడ్డి ,ఆర్టీవో ఆర్ సురేష్, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబ్జి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయానికి మహీధర కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ 10 లక్షలు విరాళంగా అందించింది. మంగళవారం ఉదయం సంస్థ ప్రతినిధి, పర్చేజ్ మేనేజర్ ఎం.సూర్య నారాయణ రాజు సంస్థ తరపున రూ 10 లక్షల చెక్ను ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్కు అందజేశారు. ఈ నిధులను ఏయూలో ఏర్పాటు చేస్తున్న ఇంక్యుబేషన్ సెంటర్లో యుటిలిటీ సెంటర్ ఏర్పాటుకు వెచ్చించాలని వీరు కోరారు. విశ్వవిద్యాలయం చేపడుతున్న విప్లవాత్మక కార్యక్రమాలకు తమ వంతు సహాకారంగా దీనిని అందించామన్నారు. భవిష్యత్తులో విద్యార్థులను ఆవిష్కర్తలుగా, యువ పారిశ్రామిక వేత్తలుగా నిలపే కార్యక్రమాలకు తాము సహకారం అందించడం ఆనందాన్నిచ్చిందన్నారు. తమ సంస్థ సామాజిక బాధ్యతగా ఉన్నత విద్యను, యువతను ప్రోత్సహించే ఉద్దేశంగా దీనిని అందించామన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ఉపయుక్తంగా నిధులు అందించడం శుభ పరిణామమన్నారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులకు వర్సిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సైతం మరింత సహకారం అందిస్తూ, వర్సిటీ ప్రగతిలో భాగం కావాలని కోరారు.
ప్రభుత్వ, అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లతో క్యాంప్ కార్యాలయం నుండి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధిహామీ పథకం, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, డా. వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్ లు (గ్రామీణ), ఇళ్లపట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాల ప్రారంభం పురోగతి, నాడు – నేడు, స్కూల్స్, అంగన్ వాడీ కేంద్రాలు, మల్టీ పర్పస్ వినియోగంపై భూ సేకరణ, వైద్య కళాశాలలు, రహదారులు, భవనాలు, వై.యస్ఆర్. భీమా, జగనన్న తోడు, వై.యస్.ఆర్. చేయూత మరియు వై.యస్.ఆర్ ఆసరా పురోగతి, రబీ ప్రొక్యూర్ మెంట్, ఖరీఫ్ ప్రిపరేషన్, జగనన్న విద్యా దీవెన, వాలంటీర్ ఫెసిలిటీస్, వాలంటీర్ ఫెలిసిటేషన్, తదితర అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, ఎస్.పి. బి. కృష్ణారావు, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఆర్. గోవిందరావు, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ జె.డి. రమణమూర్తి, వ్యవసాయ శాఖ జె.డి. లీలావతి, జిల్లా విద్యా శాఖాధికారి లింగేశ్వర్ రెడ్డి, మెప్మా పిడి శ్రీనివాసరావు, పంచాయితిరాజ్ ఎస్.ఇ. సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఘనంగా మంగళవారం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు వదిలిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అలాంటి మహానుబావులను బావి తరాలు స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఆర్. గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు రమణమూర్తి, డిసిఓ ఎండి మిల్టన్, కలెక్టర్ కార్యాలయ ఎఓ రామమోహనరావు, వివిధ విభాగాల పర్యవేక్షులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కొనియాడారు. ఆయన చేసిన త్యాగం చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, కలెక్టరేట్ ఆడిటోరియంలో శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, చరిత్ర పుటల్లో కొందరికి మాత్రమే శాశ్వత స్థానం లభిస్తుందని, అటువంటి అరుదైన వ్యక్తుల్లో పొట్టి శ్రీరాములు ఒకరని పేర్కొన్నారు. తెలుగువారి మనసులో శ్రీరాములు చిరస్మరణీయ స్థానాన్ని సముపార్జించారని కొనియాడారు. ఆయన ధైర్య సాహసాలు ఆదర్శనీయమన్నారు. అందుకే శ్రీరాములు పేరును నెల్లూరు జిల్లాకు పెట్టి గౌరవించుకోవడం జరిగిందన్నారు.
జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, బిసి కార్పొరేషన్ ఇడి ఆర్వి నాగరాణి, ఎస్సి కార్పొరేషన్ ఇడి ఎస్.జగన్నాధరావు, జిల్లా సహకార అధికారి ఎస్.అప్పలనాయుడు, సమాచార, పౌర సంబంధాల శాఖ ఎడి డి.రమేష్, డిప్యుటీ డిఎంఅండ్హెచ్ఓ జె.రవికుమార్, పర్యటకాధికారి పిఎన్వి లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ ఏఓ దేవ్ ప్రసాద్; ఇతర అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
మహా విశాఖ నగరపాలక సంస్థ మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నికలు మార్చి 18న జరుగనున్నాయని విశాఖజిల్లా కలెక్టరు,ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వి. వినయ్ చంద్ చెప్పారు. ఈ విషయమై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం జి.వి.యం.సి. సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. తేది.18-03-2021న ఉదయం 11గం. లకు నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. ఎన్నికైన వార్డు మెంబర్లు తప్పనిసరిగా తమ ఎన్నికల ధృవీకరణ పత్రంతో మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నికలకు హాజరుకావలసి ఉంటుందని కలెక్టరు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలక్టరు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల మేరకు మార్చి 18 వ తేదీన జి.వి.యం.సి.లో మేయరు, డిప్యూటీ మేయరు పదవులకు జరుగుచున్న ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన 98 మంది వార్డు మెంబర్లు మరియు 15 మంది ఎక్ష్అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 113 మంది ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు. ఈ ఎన్నికలలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలైన బి.జె.పి, సి.పి.ఐ, సి.పి.ఐ(ఎం), టి.డి.పి, వై.ఎస్.ఆర్.సి.పి.లు విప్ జారీ చేయవలసి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వివరాలతో కూడిన అనుబంధం పత్రాలు- 1, 2, 3 (Annexure – I, II & III) మరియు మేయరు, డిప్యూటీ మేయరు అభ్యర్ధులను నామినేట్ చేసేందుకు సంబంధించిన “ఎ” & “బి” ఫారాలును (Form “A”&“B”) నిర్ణీత సమయంలో సంబంధిత జి.వి.యం.సి. అధికారులకు అందజేయ వలసినదిగా కలెక్టరు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను సజావుగా నిర్వహించేటట్లు చూడాలని అదనపు కమీషనర్లు పి. ఆషా జ్యోతి, ఎ.వి. రమణిలను కలెక్టరు ఆదేశించారు. ఈ సమావేశంలో గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్. విజయానందరెడ్డి(బి.జె.పి), బి. గంగారావు, ఆర్.కె.ఎస్.వి.కుమార్ (సి.పి.ఐ.(ఎం). పాసర్ల ప్రసాద్ (టి.డి.పి.), తైనాల విజయ్ కుమార్ (వై.ఎస్.ఆర్.సి.పి), అదనపు కమీషనర్లు పి. ఆషాజ్యోతి, ఎ.వి.రమణి, వ్యయ పరిశీలకులు వై.మంగపతిరావు, సెక్రటరీ లావణ్య,, జి.వి.యం.సి. సలహాదారు జి.వి.వి.ఎస్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.