1 ENS Live Breaking News

చికిత్సతోపాటు కౌన్సిలింగ్ కూడా..

 కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి చికిత్సతో పాటు ప్రతిరోజూ కౌన్సిలింగ్ ఇవ్వాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ వైద్యాధికారులను ఆదేశించారు.  ఆదివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నోడల్ అధికారులు, వైద్యాధికారులతో జిల్లాలో కరోనా పరీక్షలు, చికిత్సలను గూర్చి క్షుణ్ణంగా సమీక్షించారు.  కరోనా పరీక్షలు మరింత ఎక్కువగా చేయాలన్నారు.  కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ఫోన్ చేసి తెలియజేయాలని, వారి ఆరోగ్య పరిస్థతిని గూర్చి తెలుసుకోవాలన్నారు.  వారి పరిస్థితిని బట్టి వెంటనే కంటంన్మెంట్ మేనేజ్ మెంట్ అధికారులకు, వైద్యాధికారులకు ఫోన్ చేసి వారిని కోవిడ్ కేర్ సెంటర్ ఆసుపత్రికి తరలించాలన్నారు.  పాజిటివ్ వచ్చిన వారి వివరాలను విశాఖ నగరానికి సంబంధించి జివియంసి కమిషనర్ జి.సృజన, డాక్టర్ దేవీ మాధవి, రూరల్ జిల్లాకు సబంధిరి జిల్లా పరిషత్ సిఈవో నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాలన్నారు.   ఐటిడిఎ పి.వో., సబ్ కలెక్టరు, ఆర్డీవోలు,  జోనల్ కమిషనర్లు, ఎంపిడివోల సహాయంతో వారిని దగ్గరలో నున్న కోవిడ్ కేర్ సెంటర్, పిహెచ్ సి, సిహెచ్ సి, యుహెచ్ సి లలో చేర్పించాలన్నారు. ఇంటిలో ఐసొలేషన్ లో వున్న వారికి  ప్రతి రోజూ ఫోన్ ద్వారా వారి పరిస్థతిని తెలుసుకోవాలని, వారిలో మనోధైర్యం నింపాలన్నారు. రోగుల కాంటాక్ట్ వ్యక్తులకు పరీక్షలు నిర్వహణ బాధ్యతలను గ్రామ, వార్డు సెక్రటరీలు చూసుకోవాలన్నారు.  

ఆక్సిజన్ లభ్యతను ప్రతిరోజూ తెలియజేయాలి
ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరతరాకూడదని, అవసరాలకు మించి ఆక్సిజన్ నిల్వ వుండేలా చర్యలు తీసుకోవాలని ఎపిఎమ్ఐడిసి ఈ.ఈ.  నాయడును ఆదేశించారు.  అవసరమయ్యే ఆక్సిజన్, సంబంధిత పరికరాల కొరత వుండకూడదని, అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్దం చేయాలన్నారు. 
ఎంపానెల్డ్  ఆసుపత్రులను తనిఖీ చేయాలి
నగరంలో గల ఎంపానెల్డ్ ఆసుపత్రులను వెంటనే తనిఖీచేసి వాటి సంసిద్దత, సేవల తీరుపై నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ లను కలెక్టరు ఆదేశించారు. ఆరోగ్యశ్రీలో ఏయే సేవలు అందస్తున్నారు. ఆసుపత్రులలో చికిత్సా విధానం, పడకల సదుపాయాలు, మొదలైన వివరాలతో నివేదికను పంపించాలని ఆదేశించారు. 
ఈ సమావేశంలో జివియంసి కమిషనర్ జి.సృజన, జాయింట్ కలెక్టరు పి.అరుణ్ బాబు, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్, జెడ్.పి. సిఈవో నాగార్జున సాగర్, పిడి డిఆర్ డిఎ విశ్వేశ్వరరావు, డిఎంఅండ్ హెచ్ వో డాక్టర్ సూర్యనారాయణ, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్లు డాక్టర్ భాస్కర్, డాక్టర్ రాజేష్, డాక్టర్ దేవీమాధవీ , డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ ఉమావతి తదితరులు పాల్గొన్నారు. 

విశాఖపట్నం

2021-04-25 13:36:13

ఎవరూ భయాందోళనలకు గురి కావద్దు..

కోవిడ్ పోజిటివ్ వచ్చిన  ఏ ఒక్కరూ భయాందోళనలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్  తెలిపారు.  కుటుంభం లో ఒకరికి పోజిటివ్ వస్తే ఆ కుటుంభం అంతా పోజిటివ్ గానే భావించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ఆదివారం కోవిడ్ పై  ప్రత్యేకాధికారి  సత్యనారాయణ ఆధ్వర్యం లో సంయుక్త కలెక్టర్లు, వైద్య  పోలీస్ శాఖల అధికారులతో కలెక్టర్ కోవిడ్ పరిస్థితులు, పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్దత,  వాక్సినేషన్ తదితర అంశాల పై సమీక్షించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ పోజిటివ్ వచ్చిన  వారు ఆసుపత్రులకు వెళ్లి ఆక్సిజన్ , ఇంజక్షన్  కావాలని ఆందోళన చెందవలసిన అవసరం లేదని,  ఎలాంటి కేసు కు ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలో వైద్యులు నిర్ణయిస్తారని తెలిపారు. మానసిక  ధైర్యంగా ఉండాలని,  ఆత్మ స్థైర్యాన్ని పెంచుకొని మందులు వాడితే వ్యాధి పోతుందని అన్నారు. ఎలాంటి దీర్ఘ కాలిక వ్యాధులు లేని వారైతే హోం ఇసోలేషణ్ లోనే ఉండి  మంచి ఆహారాన్ని తీసుకొని, యోగా, ధ్యానం లాంటివి చేస్తూ, కుటుంభ సభ్యులతో కలవకుండా  భౌతిక దూరాన్ని   పాటిస్తే సరిపోతుందని అన్నారు. కుటుంభ సభ్యులెవ్వరు కూడా బయట తిరగరాదని స్పష్టం చేసారు.  ఈ విషయం పై గ్రామాల్లో,  మున్సిపాలిటీ పరిధి లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఇందుకోసం సర్పంచ్ లు, వార్డ్ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేయాలనీ  అధికారులకు సూచించారు. 

 ప్రభుత్వ, ప్రైవేటు  ఆసుపత్రులలో రోజు వారి బెడ్స్ అందుబాటు పై మీడియా లో బులిటెన్ ప్రతి రోజు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.  ప్రతి రోజు ఎంత మంది  పేషెంట్స్ జాయిన్ అయ్యారు, ఎంత మంది డిస్చార్జ్  అయ్యారు, ఎన్ని బెడ్స్  ఖాళీ  గా ఉన్నాయో వివరాలను ప్రతి ఆసుపత్రి ముందు డిస్ప్లే చేయాలనీ, ఆ సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ కు, మీడియా కు అందజేయాలని సూచించారు.   వ్యాధి లక్షణాలు ఉన్న వారికీ, దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాలని, శాంపిల్ కలెక్షన్ ,  ఫలితాల వెల్లడి, ఆన్లైన్  నమోదు  వేగంగా జరిగేలా  చూడాలని అన్నారు.  
 కోవిడ్ వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే వారి పై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.  ధరల వివరాలను ఆసుపత్రుల్లో డిస్ప్లే చేయాలనీ సూచించారు. మే నెలలో  శుభ కార్యాలు ఎక్కువగా  జరిగే అవకాశం ఉన్నందున  కళ్యాణ మండపాలకు అనుమతుల విషయం లో రెవిన్యూ, పోలీస్ శాఖ ల వారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.  కోవిడ్ కారణంగా ఫంక్షన్ హాల్స్  ధరలు పెంచినట్లయితే వారి పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.   కరోనా విధులకు, పారిశుధ్యం, అవగాహన తదితర విధులలో సచివాలయ సిబ్బందిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వెంకటేశ్వర రావు కు  సూచించారు. 

సోమవారం నుండి  జిల్లాలో మరో 30 వేల మందికి కోవీ షీల్డ్ వాక్సిన్ వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.  ఈ వాక్సిన్  మొదటి, రెండవ డోస్ లకు వేస్తారని,  ప్రతి సి.హెచ్.సి, , ఫై. హెచ్.సి ల పరిధి లోను అందుబాటు లో ఉంటుందని తెలిపారు.  45 ఏళ్ళు నిండిన వారు ఈ వాక్సిన్  వేయించుకోవాలని తెలిపారు.  ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్లు  డా. జి.సి.కిషోర్ కుమార్,  డా. మహేష్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎస్.వి. రమణ కుమారి,  అదనపు ఎస్.పి సత్యనారాయణ, ఆసుపత్రుల సమన్వయా ధికారి  డా. నాగభూషణ, సూపరింటెండెంట్ డా. గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం

2021-04-25 09:26:53

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు..

ప్రభుత్వ రంగ సంస్థ, ప్రజలకు ప్రాణవాయునిచ్చే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే యోచన విడనాడాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు, ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జేఏసి చైర్మన్ ఏవీ నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. శనివారం విశాఖలోని కూర్మన్నపాలెం స్టీలు ప్లాంట్ గేటువద్ద స్టీలు ఉద్యోగులు ఏర్పాటు చేసిన  పాల్గొని స్టీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతోమంది ప్రాణాలు దారపోసి విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంలో సాధించుకున్న స్టీలు ప్లాంటును కేంద్రం ఇపుడు ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కేంద్రం తన ప్రైవేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన మరింత ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ సెంటిమెంట్ విశాఖ ఉక్కు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. అభివ్రుద్ధి చేయడానికి ఎంతో అవకాశం వున్న ఈ సంస్థను ఖాయాలపడిన కేంద్ర సంస్థగా గుర్తించడం చాలా దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి.దయామణి, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి కె.జగన్మోహనరావు, ఏపీ యునైటెడ్ విలేజ్ హెల్త్  సెక్రటేరియట్ అసోసియేషన్ ప్రతినిధులు మోహిని, రాజ్యలక్ష్మి, నాగమణి, రాణి, విజయకుమారి   తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

2021-04-25 09:17:05

2వ డోస్ వాక్సిన్ వేయించుకున్న స్పీకర్..

కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్న జన సమూహాలు, సామూహిక మార్కెట్ నిర్వహణను వికేంద్రీకరణ చేసేందుకు రాష్ర పశుసంవర్దక, మత్స్య శాఖ మంత్రి  డా. సీదిరి అప్పల రాజు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. గురువారం ఉదయం 6:30 గంటలకు అధికారులు, పోలీస్ సిబ్బందితో కలిసి పట్టణ ప్రధాన రహదారులలో పారిశుద్య పనులు, మార్కెట్ ను మంత్రి పరిశీలించారు. పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి కాశీబుగ్గ మార్కెట్ లో పరిశీలించి జన సమూహాలను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుండే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ మార్కెట్ ను బంకేశ్వరి ఆలయం నుండి కాశీబుగ్గ పెట్రోల్ బంక్ వైపు రోడ్లకు ఇరు వైపులా తరలించి మార్కెట్ ను వికేంద్రీకరించాలన్నారు. చిరు వ్యాపారులు దీనిపై పరిశీలించాలని కోరినప్పటికి కోవిడ్ నియంత్రణ దృష్ట్యా మార్కెట్ ను తరలించి వికేంద్రీకరణ చేయడం తప్పదని దీనిని అర్థం చేసుకోవాలని మంత్రి వారికి తెలియజేయడంతో సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బందికి సూచన చేస్తూ మార్కెట్ తరలింపుపై వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలంతా గమనించాలని బంకేశ్వరి ఆలయం దగ్గరకు మార్కెట్ ను తరలించిన విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేసారు. నిత్యావసరాల కొనుగోలుకు ఇంటి నుండి ఒక్కరు మాత్రమే మార్కెట్ కు రావాలని, అనవసరంగా రోడ్లపై ఎవరు తిరగవద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ నియంత్రణ మాత్రమే మనల్ని రక్షిస్తుందని అన్నారు. ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండి కోవిడ్ నియంత్రణకు సహకరించాలని, తప్పని సరిగా మస్కులు ధరించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

శ్రీకాకుళం

2021-04-22 13:05:11

కోవిడ్ నివారణకు సహకరించాలి..

కోవిడ్ వ్యాప్తి నివారణకు సహకరించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్ అన్నారు. శ్రీకాకుళం నగర వర్తకులతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో కేసులు అధికంగా పెరుగుతున్నాయని అన్నారు. బుధవారం ఉదయం నివేదిక ప్రకారం 1,444 కేసులు జిల్లాలో నమోదు అయ్యాయని తెలిపారు. సెకండ్ వేవ్ మ్యుటేషన్ విభిన్నంగా ఉందని ఆయన చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఏ విధమైన చర్యలు చేపట్టాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వర్తక, వాణిజ్య రంగాలు సహకరించి కేసుల తగ్గుదలకు ప్రయత్నం చేయాలని కోరారు. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు సమయాన్ని నియంత్రించేందుకు కృషి చేయాలని అన్నారు. మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గూర్చి ఆలోచించాలని ఆర్.డి.ఓ పేర్కొన్నారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులు విధిగా మాస్కు ధరించాలని ఆయన స్పష్టం చేసారు. కోవిడ్ నిబంధనలు ప్రతి దుకాణం విధిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. నిర్దేశించిన సమయం ప్రతి రంగానికి వర్తిస్తుందని ఆయన స్పష్టం చేసారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం10.30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వ్యాపార వర్గాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 

డిఎస్పీ ఎం.మహేంద్ర మాట్లాడుతూ వ్యాపార వర్గాలు మనస్ఫూర్తిగా సహకరించాలని కోరారు. అందరూ ఒకే మాటపై ఉండాలని సూచించారు. నగర పాలక సంస్థ కమీషనర్ కె.శివప్రసాద్ మాట్లాడుతూ గత వారం రోజుల్లో వెయ్యి కేసులు నమోదయ్యాయని తెలిపారు. మార్చి 1 నుండి నగరంలో 16 వందల కేసులు నమోదు అయ్యాయని ఆయన చెప్పారు. మంగళవారం 297 కేసులు నమోదయ్యాయని చెప్పారు. జిల్లాలో ఎక్కువ కేసులు శ్రీకాకుళం నగరంలో వస్తున్నాయని ఆయన వివరించారు. ఓబిఎస్ మార్కెట్ ను 80 ఫీట్ రోడ్ లోకి మార్చడం జరిగిందని, లక్ష్మీ టాకీస్ వద్ద మార్కెట్ ను కోడి రామమూర్తి స్టేడియంలోకి మార్చడం జరిగిందని ఆయన వివరించారు. ఇతర మార్కెట్లను మార్పు చేయుటకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వ్యాపార వర్గాల ప్రతినిధులు పి.వి.రమణ, కోరాడ రమేష్, కోరాడ హరగోపాల్ మాట్లాడుతూ వ్యాపార వర్గాలు సహకరించుటకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు అవకాశం కల్పించాలని కోరారు. మార్కెట్లు విశాల ప్రాంతాల్లోకి మార్చునపుడు అచ్చట సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో పోలీసు ఇన్స్పెక్టర్ అంబేద్కర్, ఎస్.ఐ లు విజయ్ కుమార్, సిద్దార్థ కుమార్ , వ్యాపార వర్గాలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2021-04-21 13:53:24

సెకెండ్ డోసుకోసం ప్రత్యేక డ్రైవ్..

కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకోవలసిన వ్యక్తుల కోసం రేపు అనగా గురువారం జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్  నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టరు వి.వినయ్  చంద్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో కోవిడ్  వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకోవలసిన వ్యక్తులు 39,111 మంది వున్నారని తెలిపారు.  వీరిలో కోవీ షీల్డ్ రెండవ డోసు తీసుకోవలసిన వారు 32,352 మంది వున్నారని తెలిపారు.  కో వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకోవలసిన వారు 6,759 మంది వున్నారని తెలిపారు. కోవీ షీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 6 నుంచి 8 వారాల మధ్య రెండవ డోసు తీసుకోవలసి వుంటుందన్నారు.  కో వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 4 వారాల తరువాత రెండవ డోసు తీసుకోవలసి వుంటుందన్నారు.  అందువలన రేపు ఉదయం 7.30 నుంచి రెండవ డోసు వేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.  కాబట్టి మొదటి డోసు వేసుకొని నిర్ణీత సమయం పూర్తి అయిన వ్యక్తులు గురువారం నాడు అదే వ్యాక్సిన్ రెండవ డోసు జిల్లాలో ఎక్కడైనా వేసుకోవచ్చునని వివరించారు.  మొదటి డోసు ఏ వ్యాక్సిన్ వేసుకుంటే,  రెండవ డోసు కూడా అదే వ్యాక్సిన్ వేసుకోవాలని, ప్రజలందరూ ఇది గమనించాలని తెలిపారు. కొవీ షీల్డ్  వ్యాక్సిన్ నగరంలోని కె.జి.హెచ్., ఛాతీ ఆసుపత్రి, మానసిక వైద్య శాల, ఘోషా ఆసుపత్రి, జి.వి.యం.సి. పరిధిలోని 72 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, నర్సీపట్నం మున్సిపాలిటిలోని 3 అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, యలమంచిలి మున్సిపాలిటి లోని 2 అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, గ్రామీణ  ప్రాంతంలోని 47 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో,  ఏజెన్సీ లోని 36 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, ఇంకా జిల్లా అంతటా వున్న 16  వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో  వేస్తారు.

కో వ్యాక్సిన్ ను నగరంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రి, చెవి ముక్కు గొంతు ఆసుపత్రులలో, కె.జీ.హెచ్. లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్  లో, స్వర్ణ భారతీ ఇండోర్ స్టేడియంలో, అనకాపల్లిలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ లో , నర్సీపట్నంలోని  టిబి కంట్రోల్ సెంటర్ లో , పాడేరులోని జిల్లా ఆసుపత్రిలో వేస్తారు. నగరంలోని కె.జి.హెచ్. ఆసుపత్రిలో విడివిడిగా ప్రత్యేక బ్లాకులలో రెండు రకాల వ్యాక్సిన్ లు కోవీ షీల్డ్, కో వ్యాక్సిన్  వేస్తారని తెలిపారు. కాబట్టి  వ్యాక్సిన్ మొదటి డోసు  వేసుకున్న ప్రతీ ఒక్కరూ రేపు రెండవ డోసు తప్పని సరిగా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి  వెళ్లేటప్పుడు తమ అధార్ కార్డ్  ను వెంట తీసుకొని వెళ్లాలని కోరారు. జిల్లాలో ప్రస్తుతం 60 వేల డోసులు అందుబాటులో వున్నాయని, ఇంకా అదనంగా డోసులు రానున్నాయని తెలిపారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకి రికవరీ అయి 28 రోజులు గడిచిన వ్యక్తులు బ్లడ్, ప్లాస్మా దానం  చేయవచ్చునని, కాబట్టి అలాంటి వారు స్వఛ్చందంగా ముందుకు వచ్చి బ్లడ్, ప్లాస్మాను దానం చేసి, ఇతరుల ప్రాణాలను కాపాడాలని జిల్లా కలెక్టరు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమం లో జాయింట్  కలెక్టర్  పి.అరుణ్ బాబు, జి.వి.యం.సి. కమీషనర్ డా. జి.సృజన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.సూర్యనారాయణ,  ఆంధ్రా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.పి.వి.సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

2021-04-21 10:03:23

టిడ్కో గ్రుహాలకు బ్యాంకర్లు సహకరించాలి..

జివిఎంసీ పరిధిలో ఎ.పి. టిడ్కో వారు నిర్మిస్తున్న గృహాల నిర్మాణాలు చేపట్టడానికి లబ్దిదారులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఋణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని జివిఎంసి కమిషనర్ నాగలక్ష్మి .ఎస్ బ్యాంకు ప్రతినిధులను కోరారు. ఈ విషయమై జివిఎంసి  శుక్రవారం, ఎ.పి.టిడ్కో మేనేజింగ్ డైరక్టరు సి.హెచ్. శ్రీధర్, ఎస్.బి.ఐ. డి.జి.ఎం. రంగారాజన్ తో కలసి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ జివిఎంసి పరిధిలో 24,192 గృహాలను నిర్మిస్తున్నామని, అందులో 22,936 గృహాలను నాన్ స్లమ్ పరిధిలోను, 1256 గృహాలు స్లమ్ ఏరియాలోనూ నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం 300 చ. అడుగుల విస్తీర్ణం గల గృహాన్ని ఒక రూపాయికే లబ్ధిదారునికి అందిస్తామని, 365చ. అడుగుల విస్తీర్ణం గల గృహాల మంజూరుకు లబ్ధిదారుని వాట రూ.25,000.00లతో పాటు బ్యాంకు ఋణం రూ.3,15,000.00లు, 430 చ. అడుగుల విస్తీర్ణం గల గృహానికి లబ్ధిదారుని వాట రూ.50,000.00లతో పాటు బ్యాంకు ఋణం రూ.3,65,000.00లు చెల్లించవలసి ఉంటుందని కమిషనర్ బ్యాంకర్లకు వివరించారు.       అనంతరం, ఎ.పి. టిడ్కో మేనేజింగ్ డైరక్టరు సి.హెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పధకానికి బ్యాంకర్లు సహాయ సహాకారాలు అందించి లబ్ధిదారులకు ఋణాలను మంజూరు చేసినచో, గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు గృహాలను అందించుటకు అవకాశం గలదని బ్యాంకర్లకు తెలిపారు. బ్యాంకు ఋణాల మంజూరుకై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి బ్యాంకర్లకు సహాయ సహకారాలు అందించటానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ఋణమంజూరు విషయం లో ఎటువంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని తమ దృష్టికి తీసుకువచ్చినట్లైతే, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ద్వారా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లకు హామీ ఇచ్చారు. ఇంకా, ఈ సమావేశంలో అదనపు కమిషనర్ పి. ఆషాజ్యోతి, ఎస్.బి.ఐ., డి.జి.ఎం. రంగరాజన్, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ గృహా ఋణాల మంజూరుకు తగు సూచనలు చేసారు. ఈ సమావేశంలో జివిఎంసి అందరు జోనల్ కమిషనర్లు, ఎ.పి. టిడ్కో పర్యవేక్షక ఇంజినీరు మరియు సిబ్బంది, ఎ.పి.డి.లు, సి.ఓ.లు జివిఎంసి పరిధిలో గల 40 బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-03-19 20:33:33

APIIC, NAOBకి భూ సేకరణ వేగవంతం..

విశాఖజిల్లాలో ఎ.పి.ఐ.ఐ.సి., ఎన్.ఎ.ఒ.బి.ల కొరకు చేపట్టిన   భూ సేకరణ  పనులు వేగవంతం చేయాలని  జాయింట్ కలెక్టరు ఎం.వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో భూసేకరణ  సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఎ.పి.ఐ.ఐ.సి.నకు సంబంధించి రాజయ్యపేట, వేంపాడు, చందనాడ, డి.ఎల్.పురం గ్రామమునకు పెండింగ్ లో ఉన్న భూ సేకరణ విషయము మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. అవసరమైనచోట గ్రామ సభలు నిర్వహించి స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో  పెండింగ్ లో ఉన్న భూ సేకరణ, ఆర్. & ఆర్ ప్యాకేజి అంశములు పరిష్కరించాలన్నారు. ఎన్.ఓ.బి. ప్రాజక్ట్ నకు సంబంధించి పెండింగ్ ఆర్.ఆర్ ప్యాకేజి అంశములు ఏప్రిల్ 15తేది లోగా పూర్తీ చేయాలన్నారు. లబ్దిదారుల ఎంపికకు అనగా రెవిన్యూ, మత్స్యశాఖ, ఎన్.ఎ.ఓ.బి, తదితర శాఖల అధికారులతో బృందాలు వేసి అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ఎన్.మౌర్య, అనకాపల్లి, ఆర్.డి.ఓ సీతారామారావు,  విశాఖపట్నం,  ఎ.పి.ఐ.ఐ.సి. , స్టీల్ ప్లాంట్, ఎన్.హెచ్.16, ఎన్.ఎ.ఓ.బి.ల ప్రత్యేక ఉప కలెక్టర్లు, నక్కపల్లి, రాంబిల్లి, ఎస్. రాయవరం, తహసిల్దార్లు, విద్యుత్ శాఖ, ఆర్.&బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-03-19 20:25:04

తోడు, చేయూత యూనిట్లు ప్రారంభం కావాలి..

శ్రీకాకుళంజిల్లాలో  జగనన్న తోడు, చేయూత యూనిట్లు సకాలంలో ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ప్రతి శుక్రవారం నాటికి ప్రగతి నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు. జగనన్న తోడు, చేయూత పథకాలపై పశుసంవర్ధక శాఖ, బ్యాంకర్లు, డీఆర్డీఏ తదితర శాఖలతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. చేయూత క్రింద పశుసంపద యూనిట్లు జిల్లాకు లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. జగనన్న చేయూత క్రింద పాడిపశువుల యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాను ఆముల్ తో అనుసంధానం చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే వంద గ్రామాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి రోజు కనీసం మూడు యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. బ్యాంకులకు రుణాల మంజూరుకు దరఖాస్తులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సంతబొమ్మాలి, కంచిలి వంటి ప్రాంతాల్లో ఎపిజీవిబి శాఖలు స్పందించడం లేదని డీఆర్డీఏ సిబ్బంది తెలియజేయగా వెంటనే రీజనల్ మేనేజర్ దృష్టిలో పెట్టాలని ఆయన సూచించారు. యూనిట్ల ఏర్పాటులో పశుసంవర్ధక శాఖ ఎడిలు, వెలుగు ఏసిలు శ్రద్ద వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. లబ్ధిదారులు తమ వాటా మొత్తాన్ని వెంటనే చెల్లించుటకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. జగనన్న తోడు క్రింద ప్రభుత్వ లక్ష్యం పూర్తి చేయాలని కోరారు. బ్యాంకుల నుండి మంచి సహకారం లభిస్తుందన్నారు. చనిపోయిన దాదాపు వెయ్యి మందికి బీమా క్లెయిమ్ లు పరిష్కరించాలని ఆయన అన్నారు. జగనన్న తోడు క్రింద తీసుకున్న రుణాలను తిరిగి కట్టించాలని ఆయన ఆదేశించారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. జీవనోపాధులు కల్పించుటకు ప్రభుత్వం సదుద్దేశంతో తోడు పథకం క్రింద రుణాలు మంజూరు చేస్తున్న విషయాన్ని గ్రహించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. డీఆర్డీఏ సిబ్బంది దుకాణాలను పరిశీలించి లబ్ధిదారులకు పథకం వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, డీఆర్డీఏ పిడి బి.శాంతిశ్రీ, యూనియన్ బాంక్ రీజనల్ మేనేజర్ పి.కృష్ణయ్య, ఎల్.డి.ఎం జి.వి.బి.డి.హరిప్రసాద్, ఎస్బిఐ రీజనల్ మేనేజర్ తపోధన్ దేహారి, ఎపిజివిబి ఆర్.ఎం మహమ్మద్ రియాజ్ , డిసిసిబి సిఇఓ దత్తి సత్యనారాయణ, పశుసంవర్ధక శాఖ జెడి డా.ఏ.ఈశ్వర రావు, డిడి డా.మాదిన ప్రసాదరావు, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-03-19 19:26:23

పరిశ్రమలు వేసవి జాగ్రత్తలు పాటించాలి..

వేస‌విలో అధిక ఉష్ణోగ్ర‌త‌లు దృష్ట్యా ప‌రిశ్ర‌మ‌ల్లో అద‌న‌పు జాగ్ర‌త్త‌లు తీసుకునేలా పారిశ్రామిక యాజ‌మాన్యాల‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి అధికారులకు సూచించారు. తాగునీరు, ప్రాథ‌మిక చికిత్స వంటి ఏర్పాట్లు చేసేలా చూడాల‌న్నారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ పారిశ్రామిక ప్ర‌మాదాలు జ‌ర‌క్కుండా అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకునేలా మార్గ‌నిర్దేశ‌నం చేయాల‌ని ఆదేశించారు. శుక్ర‌వారం కాకినాడ‌లోని క‌లెక్ట‌రేట్ నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న జిల్లా పారిశ్రామిక, ఎగుమ‌తుల ప్రోత్సాహ‌క క‌మిటీ (డీఐఈపీసీ) స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి విధానం (2015-20) కింద సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా పారిశ్రామిక (ఎంఎస్ఎంఈ) యూనిట్ల‌కు వివిధ ప్రోత్సాహ‌కాలు అందిస్తున్నామ‌ని, తాజాగా 21 ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించి రూ.84,90,650 మేర మంజూరుకు డీఐఈపీసీ సిఫార్సు చేసిన‌ట్లు  తెలిపారు. పారిశ్రామిక యూనిట్ల‌కు ప్రోత్సాహ‌కాలు అందించేందుకు 2021, ఫిబ్ర‌వ‌రి 25, మార్చి 18న స్క్రుటినీ వెరిఫికేష‌న్ క‌మిటీ (ఎస్‌వీసీ) సమావేశాలు జ‌రిగిన‌ట్లు తెలిపారు.  ప్ర‌భుత్వ ప్రోత్సాహ‌కాలు పొందిన పారిశ్రామిక యూనిట్ల పురోగ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించి, అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు అందించాల‌ని దీనివ‌ల్ల ఆయా యూనిట్లు లాభాల బాట ప‌ట్టేందుకు అవ‌కాశ‌ముంటుంద‌ని పేర్కొన్నారు. ఏపీ సింగిల్ డెస్క్ పాల‌సీ కింద అనుమ‌తులు పొందేందుకు 2021, ఫిబ్ర‌వ‌రి 12 నుంచి మార్చి 18 వ‌ర‌కు 57 ద‌ర‌ఖాస్తులు అందాయ‌ని తెలిపారు. వీటిలో 29 ద‌ర‌ఖాస్తులు ఇప్ప‌టికే ఆమోదం పొందాయ‌ని.. మిగిలిన 28 ద‌ర‌ఖాస్తుల‌ను కూడా నిర్దేశ గ‌డువు (ఎస్ఎల్ఏ)లోనే ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. పీఎంఈజీపీ ప‌థ‌కం కింద ప్లాస్టిక్‌కు ప్ర‌త్యామ్నాయంగా పేప‌ర్, జ్యూట్ ఆధారిత ఉత్ప‌త్తుల త‌యారీకి వ‌చ్చిన 23 ద‌ర‌ఖాస్తుల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి, బ్యాంకు రుణాలు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం పేద‌ల గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్య‌మిస్తూ నిధులు కేటాయిస్తోంద‌ని, దీన్ని పారిశ్రామిక రంగ అభివృద్ధికి కూడా ఓ మార్గంగా ఉప‌యోగించుకునేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌న్నారు. లేఅవుట్ల‌లోనే ఇటుక‌లు వంటి నిర్మాణ సామ‌గ్రి త‌యారీ యూనిట్లు ప్రారంభించేలా ఔత్సాహికుల‌ను ప్రోత్స‌హించాల‌ని, వారికి అన్ని విధాలా స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని సూచించారు. దీనివ‌ల్ల త‌క్కువ ధ‌రకు నాణ్య‌మైన సామ‌గ్రి అందుబాటులోకి రావ‌డంతో ఇళ్ల ల‌బ్ధిదారులకు మేలు జ‌రుగుతుంద‌ని, అదే విధంగా అధిక డిమాండ్ కార‌ణంగా ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్నారు.  స‌మావేశంలో డీఐసీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ బి.శ్రీనివాస‌రావు, బీఐఎస్ (విశాఖ‌ప‌ట్నం) సైంటిస్ట్ సంధ్య‌, కాయిర్‌బోర్డ్ రీజ‌న‌ర‌ల్ ఆఫీస్ ఇన్‌ఛార్జ్ కె.ద‌శ‌ర‌థ‌రావు, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

East Godavari

2021-03-19 19:14:17

ఆర్ధికాభివృద్ధిలో పాడిప‌రిశ్ర‌మే కీల‌కం..

విజ‌య‌న‌గ‌రం ‌జిల్లా భ‌విష్య‌త్తు అంతా పాడిప‌రిశ్ర‌మపైనే ఆధార‌ప‌డి వుంటుంద‌ని, ఈ రంగానికి బ్యాంకులు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చి పాడిప‌శువుల కొనుగోలుకు పెద్ద ఎత్తున రైతుల‌కు రుణాలు ఇవ్వాల్సి ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు.  వ‌చ్చే ఆరు నెల‌ల్లో జిల్లాలో పాడిప‌రిశ్ర‌మ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అభివృద్ధి చెందుతుంద‌న్నారు. ఇప్ప‌టికే గ్రామాల్లో 634 బ‌ల్క్ మిల్క్ కూలింగ్ సెంట‌ర్ల ఏర్పాటుకోసం భ‌వ‌నాల నిర్మాణాల‌కు స్థ‌ల సేక‌ర‌ణ పూర్తిచేసి అంద‌జేశామ‌న్నారు. అన్ని గ్రామాల్లో రైతుభ‌రోసా కేంద్రాల ప‌క్క‌నే ఇవి ఏర్పాట‌వుతాయ‌న్నారు. వీటి ఏర్పాటుతో బ్యాంకుల్లోనూ కార్య‌క‌లాపాలు అధికం అవుతాయ‌ని, డిపాజిట్లు కూడా పెరుగుతాయ‌ని అందువ‌ల్ల బ్యాంకుల‌న్నీ పాడిప‌రిశ్ర‌మ ప‌ట్ల చిన్న‌చూపు మానుకొని ఇప్ప‌టికైనా పాడిప‌శువుల కొనుగోలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాల‌న్నారు. పాడిప‌రిశ్ర‌మ విష‌యంలో బ్యాంకుల‌కు స‌రైన అవ‌గాహ‌న లేక‌నే ఈ ప‌థ‌కం ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నాయ‌ని, రైతుల‌కు పాడిప‌రిశ్ర‌మ ద్వారా ఎంత‌గానో స‌హాయం అందించే అవ‌కాశం ఉంద‌న్నారు. జిల్లాలో రైతుల ఆదాయాలు పెంచ‌డంలో ఈ పాడిప‌రిశ్ర‌మ ఎంత‌గానో తోడ్ప‌డుతుంద‌ని, ఏదైనా స‌మ‌యంలో వ్య‌వ‌సాయం వ‌ల్ల రైతు న‌ష్ట‌పోతే పాడిప‌శువులే ఆదుకుంటాయ‌న్నారు. అందుకే ఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంద‌న్నారు. జిల్లా వ్య‌వ‌సాయ ఆధారిత ఆర్ధిక‌వ్య‌వ‌స్థగా రూపొందుతుంద‌ని, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల అభివృద్ధికి జిల్లాలో అత్య‌ధిక ప్రాధాన‌త్య వుంటుంద‌న్నారు. జిల్లాలో సేంద్రీయ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల వినియోగం ప్రోత్స‌హించేందుకు వాటి మార్కెటింగ్‌కు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రైతు వ‌ల్లే స‌మాజం మ‌నుగ‌డ సాగిస్తోందని, మ‌న‌కు ఆహార భ‌ద్ర‌త చేకూరుతుంద‌నే విష‌యాన్ని బ్యాంక‌ర్లు గుర్తుంచుకొని అటువంటి రైతుల సంక్షేమం, వారి అవ‌స‌రాల‌ ప‌ట్ల నిర్ల‌క్ష్యం చూప‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల్సి వుంద‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో బ్యాంకు అధికారులు, జిల్లా అధికారుల‌తో కూడిన బ్యాంకుల స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అధ్య‌క్ష‌త‌న శుక్ర‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న‌న్న చేయూత ప‌థ‌కంలో పాడిప‌శువుల యూనిట్ల‌కు బ్యాంకుల నుండి త‌గిన స‌హ‌కారం అంద‌డం లేద‌ని ప‌శుసంవ‌ర్థ‌క శాఖ జె.డి. ఎం.వి.ఏ.న‌ర్శింహులు క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. బ్యాంకులు కోరిన ప‌త్రాల‌న్నింటినీ అంద‌జేస్తున్న‌ప్ప‌టికీ యూనిట్లు మంజూరు కావ‌డం లేద‌న్నారు. దీనిపై జిల్లా క‌లెక్ట‌ర్ స్పందిస్తూ లీడ్ బ్యాంకు అధికారి రానున్న రోజుల్లో అన్ని బ్యాంకుల కంట్రోలింగ్ అధికారుల‌తో మాట్లాడి మంజూరైన యూనిట్లు ఏర్పాట‌య్యేలా చొర‌వ చూపాల‌న్నారు. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం అమ‌లుపై కూడా క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. ఈ ప‌థ‌కం అమ‌లులోనూ బ్యాంక‌ర్ల స‌హ‌క‌రించాల్సి వుంద‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ఏయే బ్యాంకులు ఈ ప‌థ‌కం అమ‌లులో వెనుకంజ‌లో ఉన్నాయో గుర్తించి ఏ కార‌ణాల‌తో ద‌ర‌ఖాస్తులు తిర‌స్క‌రించారో తెల‌పాల‌ని బ్యాంక‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ కోరారు. ల‌బ్దిదారు వారీగా స‌మీక్షించి అర్హ‌త ఉన్న వారంద‌రికీ రుణాలు ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనే ఈ ప‌థ‌కం అమలు కొంత మంద‌కొడిగా సాగుతోంద‌ని వెంట‌నే మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో స‌మావేశం ఏర్పాటుచేసి రుణాల మంజూరు వేగ‌వంతం చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా.మ‌హేష్ కుమార్‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. రిజ‌ర్వు బ్యాంకు అధికారి సాయిచ‌ర‌ణ్ మాట్లాడుతూ నాబార్డు రూపొందించిన రుణ ప్ర‌ణాళిక స‌మాచారం మేర‌కు జిల్లాలో చిన్న‌ప‌రిశ్ర‌మ‌ల రంగానికి గ‌త ఏడాది బ్యాంకులు 20శాతం మాత్ర‌మే రుణాలు అంద‌జేయ‌డం పై ప్ర‌శ్నించారు. కోవిడ్ కార‌ణంగా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకోసం రుణాలు తీసుకొనేందుకు గ‌త ఏడాది ఎవ‌రూ ముందుకు రాలేద‌ని ప‌లువురు బ్యాంకు అధికారులు వివ‌రించారు. నాబార్డు రుణ సామ‌ర్ధ్య అంచ‌నా ప్ర‌ణాళిక విడుద‌ల‌       నాబార్డు 2021-22 సంవ‌త్స‌రానికి రూపొందించిన జిల్లా రుణ సామ‌ర్ధ్య అంచ‌నా( District Potential Linked Credit Plan 2021-22) ప్ర‌ణాళిక‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ విడుద‌ల చేశారు. వ్య‌వ‌సాయం, చిన్న ప‌రిశ్ర‌మ‌లు త‌దిత‌ర ప్రాధాన్య‌త రంగాల‌కు వ‌చ్చే ఏడాది రూ.6730.53 కోట్ల రుణాలు ఇచ్చేందుకు అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌ణాళిక‌లో వెల్ల‌డించారు. వ్య‌వ‌సాయ రంగానికి రుణ‌ ప్ర‌ణాళిక‌లో 64 శాతం, చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు 23శాతం రుణాలు కేటాయించే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌కు రూ.4297.84 కోట్లు, చిన్న ప‌రిశ్ర‌మ‌ల రంగానికి రూ.1544.74 కోట్ల రుణాలు, వ్య‌వ‌సాయానికి సంబంధించిన ఇత‌ర అవ‌స‌రాల‌కు రూ.887.98 కోట్ల రుణాలు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌ణాళిక‌లో తెలిపారు.   లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజ‌ర్ కె.శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ ఈ ఏడాది రూ.2652 కోట్ల ల‌క్ష్యానికి గాను రూ.2038 కోట్ల‌ పంట‌రుణాలు అంద‌జేశామ‌ని, వ్య‌వ‌సాయ టెర్మ్ రుణాలు రూ.680 కోట్లు ఇవ్వాల్సి ఉండ‌గా ల‌క్ష్యానికి మించి రూ.720 కోట్లు అంద‌జేశామ‌న్నారు. నాబార్డు ఏ.జి.ఎం. పి.హ‌రీష్ మాట్లాడుతూ వ్య‌వ‌సాయ రంగ నిపుణులు, బ్యాంక‌ర్లు త‌దిత‌ర అన్ని వ‌ర్గాల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌ర్వాతే రుణ సామ‌ర్ధ్య అంచ‌నా ప్ర‌ణాళిక రూపొందించామ‌న్నారు. స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, వ్య‌వ‌సాయ శాఖ జె.డి. ఆశాదేవి, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ సుబ్బారావు, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ జె.డి. న‌ర్శింహులు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ప‌లువురు జిల్లా అధికారులు, బ్యాంకుల జిల్లాస్థాయి కంట్రోలింగ్ అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-19 16:56:05

అలా చేస్తే పదిరెట్లు పెనాల్టీ వేయండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంటే కొందరు కావాలనే పథకాన్ని తప్పుదోవపట్టిస్టున్నారని తూర్పుగోదవరి జిల్లా కలెక్టర్(అభివ్రుద్ధి) కీర్తిచేకూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు, సేవలు, ఫిర్యాదులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జెసీ మాట్లాడుతూ, ప్రభుత్వమే రోగులకు ఉచితంగా వైద్యం చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే అందులోకూడా కొన్ని ఆసుపత్రులు డబ్బులుు వసూలు చేయడం క్షమించరాని నేరమన్నారు. ఈ విషయంలో ఆరోగ్యశ్రీ కోర్డినేటర్ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎక్కడైనా ఆరోగ్యశ్రీ రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తే దానికి పదింతలు సదరు ఆసుపత్రి, సిబ్బంది నుంచి పెనాల్టీలు వసూలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడే సిబ్బందిపైనా ఆసుపత్రులపైన కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఆయా ఆసుపత్రులను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకానికి లోబడి పనిచేయాలన్నారు. అలా పనిచేయని ఆసుపత్రులను గుర్తించాలన్నారు.ఇకపై ఎవరైనా ఆరోగ్యశ్రీ పథకంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే తొలుత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి (ఇన్చార్జి)డా. ప్రసన్న కుమార్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.పి రాధాకృష్ణ, రంపచోడవరం కోఆర్డినేటర్ డా పి.ప్రియాంక, జిల్లా మేనేజర్ కే నవీన్ పాల్గొన్నారు.

Kakinada

2021-03-19 16:54:27

సాంకేతిక సమస్యలను అధిగమించాలి..

వైఎస్సార్ చేయూత ప‌థ‌కం అమ‌ల్లో త‌లెత్తుతున్న సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి పురోగ‌తి సాధించాల‌ని జేసీ జె. వెంక‌ట‌రావు (ఆస‌రా) డీఆర్‌డీఏ అధికారుల‌ను ఆదేశించారు. వైఎస్సార్ చేయూత‌, జ‌గ‌నన్న తోడు ప‌థ‌కాల అమ‌లుపై డీఆర్‌డీఏ కార్యాల‌యంలో శుక్ర‌వారం జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ముందుగా స‌మావేశంలో వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన ఏసీలు, ఏపీఎంలు ఏపీఆన్‌లైన్‌లో త‌లెత్తుతున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. దీనిపై స్పందించిన జేసీ ప‌లు సూచ‌న‌లు చేశారు. వివ‌రాలు పొందుప‌ర‌చ‌టంలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లకు ప‌రిష్కార మార్గాల‌ను సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు డీఆర్‌డీఏ, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ అధికారులు స్వీక‌రించిన సుమారు 11వేల ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి ల‌బ్ధిదారులకు ప్ర‌యోజ‌నం క‌ల్పించాల‌ని చెప్పారు. బ్యాంకు అధికారుల‌తో మాట్లాడి లబ్ధిదారుల‌కు రుణాలు మంజూరయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అలాగే జ‌గ‌నన్న తోడు ప‌థ‌కం అమ‌లుపై ల‌బ్ధిదారుల‌కు పూర్తిస్థాయి అవ‌గాహ‌న క‌ల్పించ‌టంలో క్షేత్ర‌స్థాయి సిబ్బంది విఫ‌ల‌మ‌య్యార‌ని ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. ఇక‌నుంచైనా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి తోడు ప‌థ‌కం ద్వారా అందే రూ.10 వేలు రుణం మాత్ర‌మే అని.. తిరిగి చెల్లించాల్సి ఉంటుంద‌ని అవ‌గాహ‌న కల్పించాల‌ని ఆదేశించారు. క్షేత్ర‌స్థాయి సిబ్బంది చేయించిన రుణాల మంజూరు త‌దిత‌ర అంశాల‌పై రోజు వారీ నివేదిక తెప్పించుకోవాల‌ని డీఆర్‌డీఏ అధికారుల‌కు సూచించారు. చేయూత‌, తోడు ప‌థ‌కాల అమ‌ల్లో వెనుక‌బ‌డి ఉన్నామ‌ని అంద‌రూ స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి పురోగ‌తి సాధించాల‌ని పేర్కొన్నారు. స‌మావేశంలో డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు, ఏపీడీలు సావిత్రి, జ‌య‌శ్రీ, డీపీఎం మార్టిన్‌, బంగార‌మ్మ‌, ప‌లువురు ఏసీలు, ఏపీఎంలు, పశుసంవ‌ర్ధ‌క శాఖ అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-03-19 16:53:40

పుట్టినరోజు గుర్తుగా మొక్కలు నాటాలి..

విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లో ప్రతీ విద్యార్థి తన పుట్టినరోజు న మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం చెప్పట్టారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్. హనుమంతు లజిపతి రాయ్ గారు యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి పుట్టిన రోజున మొక్కను నాటి తదుపరి పుట్టిన రోజు వరకు దాని సంరక్షణ బాధ్యత  ను చేపట్టాలని సూచించారు. యూనివర్సిటీ లో చేరిన విద్యార్థులు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ వ్యవధిలో ప్రతి సంవత్సరం మొక్కలు నాటి వాటి పెరుగుదలను వీక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ లో BBA కోర్స్ చదువుతున్న విద్యార్ధిని భావన చేత మొక్కను నాటి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు ఎస్. ప్రభాకర రావు ,  ఎన్.వి. సూర్యనారాయణ గారు మరియు విద్యార్థులు పాల్గున్నారు.

Vizianagaram

2021-03-19 16:45:15

పంటలకు నీటి నాణ్యత అవసరం..

పంటలకు నీటి నాణ్యత పరిశీలించడం అవసరమని భూగర్భ జలం, జల గణన శాఖ ఉపసంచాలకులు సి.ఎస్.రావు అన్నారు. భూగర్భ జలం, జల గణన శాఖ స్వర్ణోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం ఉప సంచాలకుల కార్యాలయంలో శుక్ర వారం అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పంట భూములకు నీరు అవసరమని, అదే సమయంలో నీటి నాణ్యత కూడా అంతే అవసరం అన్నారు. నాణ్యత తక్కువగా ఉన్న నీటిని వాడటం వలన నేల పైభాగంలో లవణాలు చేరి పంట దిగుబడులు తగ్గుతాయని ఆయన సూచించారు. పంట భూమి క్రమంగా చవిటి భూమిగా మారిపోతుందని తెలిపారు. సాగునీటి నాణ్యత నాలుగు అంశాలపై ఆధారపడి వుంటుందని పేర్కొంటూ - నీటిలో కరిగివుండే మొత్తం లవణాల పరిమాణం, నీటిలో గల సోడియం ధాతువుకు, ఇతర ధాతువులతో గల నిష్పత్తి, నీటిలో గల జక్కొక్క ధాతువు ఆధిక్యత, కాల్షియం, మెగ్నీషియం ధాతువులతో కలసిపోగా మిగిలిన సోడియం కార్బొనేట్ పరిమాణం పరిశీలించాలని వివరించారు. సాగు చేస్తున్న నేల భౌతిక రసాయన లక్షణాలు, వేయదలచిన పైర్లను కూడ దృష్టిలో పెట్టుకొని నీటి వినియోగాన్ని నిర్ణయించాలని ఆయన సూచించారు. లవణ పరిమాణం ఎక్కువగా వున్న నీటిని వాడితే నేలలు పాలచౌడుగా మారుతాయని చెప్పారు. ప్రత్తి, ఆవాలు, ఉల్లి మొదలగు పంటలు లవణాలను తట్టుకుంటాయని., వరి, చెరకు, పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న ఇతర సాధారణ పంటలు ఒక మాదిరిగా తట్టుకుంటాయని., అపరాలు, వేరుశెనగ పంటలు, నిమ్మజాతి ఫలవృక్షాలు లవణాలను తట్టుకోలేవని వివరించారు. సోడియం ధాతువుకు కాల్షియం, మెగ్నీషియం ధాతువుల మధ్య గల నిష్పత్తి అధికంగా ఉండే నీటిని, సోడియం కార్బొనేట్ అధికంగా వుండే నీటిని వాడినపుడు నేలలు కారు చౌడుగా మారుతాయని, ఈ నీటిని వినియోగించునపుడు జిప్పం కట్టిన బస్తాలు వేసి ఉంచాలని తద్వారా అందులోని కాల్షియం నెమ్మదిగా కరుగుతుందని చెప్పారు. నీటిలో కాల్షియం ఆధిక్యత పెరుగుతుందని, హానికరమైన సోడియం లవజాల ఉధృతి తగ్గుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పండించే పంటలకు సాధారణంగా వేసే ఎరువుల కన్నా 25 శాతం ఎక్కువ వేయాలని, సేంద్రియ ఎరువులు అధికంగా వాడాలని సూచించారు. ప్రతి సంవత్సరం సాగు నీటిని, నేలను పరీక్షకు పంపి సలహాలు పొందాలని, పరి, ఎనుముగడ్డిలాంటి పైర్లు కారుచౌడును తట్టుకుంటాయని తెలిపారు. భూగర్భ జలాల నాణ్యతను పరిశీలించటానికి హైడ్రాలజీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో వాటర్ క్వాలిటీ లేబరేటరీలను నూతనంగా ఏర్పాటు చేయటం లేదా వున్నవాటిని ఆధునీకరించటం జరిగిందని అన్నారు. పరిశీలక బావులు, హైడ్రాలజీ ప్రాజెక్టు ద్వారా నిర్మించబడిన పీజోమీటర్ల నుండి సేకరించిన నీటి నమూనాలను ఈ లేబరేటరీల ద్వారా విశ్లేషించి వ్యవసాయ నిమిత్తం భూగర్భ జల నాణ్యతను పరిశీలించటం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన 1254 పీజో మీటర్ల నుండి ప్రతి సంవత్సరం వేసవిలోను, వర్షాల అనంతరం నీటి నమూనాలను సేకరించి, వాటి సాగునీటి యోగ్యతను నిర్ధారించటం జరుగుతుందని తెలిపారు. ఈ నమూనాలను అధ్యయనం చేయటం ద్వారా కోస్తా తీరం వెంబడి వున్న మండలాలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో భూగర్భ జలం సాగు యోగ్యంగా వున్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు.  కోస్తా ప్రాంతంలో కొన్ని మండలాలలో భూగర్భ జలంలో లవణశాతం ఎక్కువగా వుండటంతో అవి సాగుకు అంత యోగ్యంగా లేనట్లు తెలుస్తోందని చెప్పారు. వరి పంట కొంత వరకు లవణ శాతం ఎక్కువగా ఉన్న నీటిని కూడా తట్టుకోగలుగుతుందని మిగిలిన ప్రాంతమంతా స్థానికంగా నీటిలో లవణీయత వున్నప్పటికీ, సాధారణంగా భూగర్భ జలం సాగుయోగ్యంగా వున్నట్లు తెలుస్తోందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డి.లక్ష్మణ రావు, ఏపిడి ఏ.లక్ష్మణరావు, ఏ.హెచ్.జి జి.రామారావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-03-19 15:20:26