తూర్పుగోదావరి జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నూతనంగా భాద్యతలు స్వీవకరించిన జివి. సత్యవాణి మంగళవారం ఉదయం కలెక్టర్ కారాల్యయంలో కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్లు జి లక్ష్మీశ , కీర్తి చేకూరి, జి రాజకుమారి లను మర్యాదపూర్వకంగా కలిసారు.జివి సత్యవాణి డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉపాధి, శిక్షణ సొసైటీ - ఏలూరు , పశ్చిమ గోదావరి ( SETWEL) చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వివిధ పదవుల్లో పని చేయడంతో జిల్లా పై పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ అనుభవంతో ఐసీడీఎస్ ద్వారా మరిన్ని సేవలను అందించి, జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు క్రుషి చేస్తానని అన్నారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుస్ఫగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు.
వినియోగదారుడు తమ హక్కులపై అవగాహన కలిగివుండాలని, నేడు మనం జరుపుకుంటున్న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ముఖ్యవుద్దేశ్యమని జిల్లా పౌరసరఫరాల అధికారి శివరామ్ ప్రసాద్ సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక సి.ఎల్.ఆర్.సి.భవనంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని పౌరసరఫరాలు , తూనికలు కొలతలు, ఫుడ్ సేఫ్టీ శాఖలు నేడు సంయుక్తం వినియోగదారులకు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిధిగా జిల్లా వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షులు రాజారెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు. జిల్లా వినియోగదారుల ఫోరమ్, అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ అమెరికాలో వినియోగదారునికి అన్యాయం జరిగితే అతని నిరసన పోరాటంతో అక్కడ చట్టాలుగా 1962 లో రూపుదిద్దుకోవడం, వినియోగదారుని ప్రాముఖ్యత, అవసరాలు గుర్తించి ప్రపంచవాప్తంగా యు.ఎన్.ఓ. 1968 నుండి మార్చి 15 నుండి అమలుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. మనదేశం 1986 లో డిసెంబర్ 24 చట్టం తెచ్చి హక్కులను కాపాడటం జరుగుతున్నదని అన్నారు. వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన వస్తువు నాణ్యత లోపిస్తే, పోరంను ఆశ్రయించి 30 రోజుల్లో పరిష్కారం చేసుకోవచ్చని రూ.5 లక్షల విలువ వరకు ఫీజు కూడా లేదని, కోటి రూపాయల విలువ అయితే జిల్లానుండే కేసు నమోదు చేయవచ్చని అవగాహన కలిగియుండాలని అన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శివరామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఉచితంగా వచ్చే వస్తువులు తప్ప కొనుగోలు చేసిన వస్తువులు అది ప్రభుత్వం అయినా ప్రవేటు కంపెనీలయైనా హక్కులకోసం ఆశ్రయించ వచ్చని తెలిపారు. నేడు ప్రధానంగా అవగాహనతో పాటు ప్లాస్టిక్ వల్ల జరిగే అనార్థాలు, చట్టాలు చేసినా మనం మారాల్సివుందని, ఆరోగ్యమే లక్ష్యంగా వుత్పత్తులు వుండాలని అన్నారు. తూనికలు, కొలతల అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ వివరిస్తూ తూనికల్లో మోసాలు జరిగితే తెలుపవచ్చని, శాఖ పరంగా తరచూ దుకాణాల్లో దాడులు చేసి కేసులు నమోదు చేసి వినియోగదారుడు నష్టపోకుండా చూస్తున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన లీగల్ మెట్రాలజీ సాదారణ , ఎలక్ట్రానిక్ తూనికలు , త్రాసులు, లీటర్లు వంటీవి హాజరయిన వినియోగదారులకు మోసపోకుండా వుండే విధానం వివరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారిని హరిత మాట్లాడుతూ తినే ప్రతి వస్తువుకు ఒక నిర్దేశిత కాలం వుంటుందని అది మీరుకొనే వస్తువుల పాకింగ్ పై నమోదు చేసివుంటుందని వినియోగదారుడు గమనించి కొనుగోలు చేయాలని, హోటల్ ఫుడ్ విషయంలో జాగ్రత్త వహించాలని, అక్కడ సరిలేకుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అప్పుడే వారికీ జరిమానా, శిక్షలు పడే అవకాశం కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమలో సహాయ పౌర సరఫరాల అధికారులు తిరుపతి ఝాణ్శీ లక్ష్మి స్వాగతోపన్యాసం చేసి ప్లాస్టిక్ అనార్థాలను వివరించగా, చిత్తూరు వెంకట్రామ్, సి.ఎస్.డి.టి.లు చంద్రిక, సురేంద్ర అధికారులు పాల్గొన్నారు.
వేసవిలో గ్రామంలో త్రాగునీటి సమస్యలు ఏర్పడకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా పంచాయితీ అధికారి పి.సాయిబాబు అన్నారు. సోమవారం జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిపివో మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో 981 గ్రామ పంచాయితీలు ఉన్నాయని 455 మంచినీటి చెరువులు ఉన్నాయని వేసవిలో త్రాగునీటి సమస్య ఏర్పడకుండా అవన్ని ముందుగా త్రాగునీటితో నింపాలని ఆయా గ్రామ కార్యదర్శులు, ఎంపిడివోలను ఆదేశించినట్లు తెలిపారు. ఇరిగేషన్ డిపార్టుమెంట్ ప్రకాశం బ్యారేజీ నుండి కెఇబి కెనాల్, బందరు కెనాల్, ఏలూరు కెనాల్, రైవస్ కెనాల్ 4 ఇరిగేషన్ కెనాల్స్ ద్వారా రబి సీజన్ మరియు త్రాగునీటి అవసరాలకు 3521 క్యూసెక్కుల నీటిని ప్రతి ఏడాది విడుదల చేస్తుంటారని, ఈ విధంగా విడుదల చేసిన వాటర్ తో గ్రామాల్లో చెరువులు నింపాలని త్రాగునీటి పధకాల మోటార్లు రన్నింగ్ కండిషన్లో ఉంచాలని, చెరువుల్లో నీటి నిల్వ సామర్ద్యం పెంపునకు పూడికలు తీయించాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. వచ్చే నెల 22 వరకు నీటిని విడుదల చేస్తారని అన్నారు. గ్రామాల్లో ఎక్కడైన త్రాగునీటి సమస్య ఏర్పడితే జిల్లా పంచాయితీ అధికారి సెల్ 9849903225 నెంబరుకు ఫోన్ చేయాలని వెంటనే స్పందించి సమస్య పరిష్కరానికి కృషి చేస్తామని డిపివో అన్నారు.
సగటు పౌరుడిగా.. వినియోగదారుడిగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సంయుక్త కలెక్టర్ జి.సి. కిశోర్ కుమార్ పేర్కొన్నారు. "ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం" అని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వి.టి.అగ్రహారంలోని మహిళా ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి వినియోదారుడు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు. తద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయగలమని పేర్కొన్నారు. రోజువారీ వినియోగంలో భాగంగా వివిధ వస్తువులు కొంటుంటామని, మోసాలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఒక మంచి పని అనేది మన నుంచే ప్రారంభం కావాలి.. దానికి ఈ రోజు నుంచే కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటంలో భాగస్వాములవ్వాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్వో ఎం. పాపారావు, డిప్యూటీ డీఎం&హెచ్వో ఎస్. రమణారావు, లీగల్ మెట్రాలజీ విభాగ డిప్యూటీ కంట్రోలర్ ఎన్. జనార్ధన్, ఫుడ్ సేప్టీ ఆఫీసర్ ఈశ్వరి, విజయనగరం తహశీల్దార్ ప్రభాకర్, సివిల్ సప్లై డీటీ జగన్, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఇన్ఛార్జి చదలవాడ ప్రసాద్, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేముందు అది తప్పా ఒప్పా అని పలుమార్లు యోచిస్తామని తమ అంతరాత్మే ఇక ప్రధాన ప్రతిపక్షమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో విలేకరులతో మంత్రి పేర్ని నాని విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, మీకు ఇక ప్రతిపక్షమే లేకుండా పోయిందని ఒక విలేకరి చమత్కరించగా, ఈ విజయం మా పార్టీ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని సూచిస్తుందని, ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పని చేయడానికి, అన్ని డివిజన్లలో సమస్యల పరిష్కారం పట్ల బాధ్యతను మరింతగా పెంచిందని ఇకపై తమ అంతరాత్మే ప్రతిపక్షమని, పాత్రికేయులు సైతం ఏదైనా వార్త రాసే ముందు అది తప్పా ఒప్పా అని పలుమార్లు ఆలోచించాలని ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని సూచించారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంపై మంత్రి పేర్ని నాని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వైస్సార్సీపీ పట్ల రాష్ట్రప్రజలు చూపిన విశేష ఆదరణకు ఇది ఒక కొలబద్దని తెలిపారు ప్రజా సంక్షేమమే ద్యేయంగా ముఖ్యమంత్రిగా జగన్ సుపరిపాలనకు ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వానికి ఈ గొప్ప విజయం ప్రజలు ఇచ్చిన అపురూప బహుమతని వినమ్రంగా పేర్కొన్నారు.
రాబోయే రెండేళ్లలో మచిలీపట్నంలో 70 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఏప్రిల్ మాసాంతంలో వైద్య కళాశాల శంఖుస్థాపనకు ముఖ్యనంత్రి జగన్మోహనరెడ్డి మచిలీపట్నం రానున్నట్లు తెలిపారు. దీనితో పాటు 100 సీట్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు పక్కా భవనం నిర్మిస్తామని చెప్పారు. వచ్చే జూలై మాసం నుండి మచిలీపట్నం నగరపాలకసంస్థ పరిధిలో విద్యుత్ కు అంతరాయం కల్గించకుండా ప్రతిరోజు త్రాగునీరు అందించనున్నట్లు ఇందుకోసం 45 కోట్ల రూ.లు ముఖ్యమంత్రి సూచనప్రాయంగా అంగీకరించారని ఎన్నికల కోడ్ను ముగిశాక ఆ నిధులు విడుదల అయిన వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు. మచిలీపట్నం జోన్లుగా విభజించి ప్రతిరోజు త్రాగునీరు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.కుల,మత,పార్టీలకతీతంగా అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రభుత్వం ఇదేనన్నారు.
మచిలీపట్నం-విజయవాడ మచిలీపట్నం-గుడివాడ,మచిలీపట్నం-విశాఖపట్నం ల మధ్య నిలిపివేసిన గత సంవత్సరంగా నిలిపివేసిన పాసింజర్ రైళ్లను వెంటనే పునరిద్దరించి మచిలీపట్నం రైల్వే స్టేషన్ కన్సల్టెటివ్ సభ్యుడు,సీనియర్ పాత్రికేయుడు చలాది పూర్ణచంద్ర రావు రైల్వే శాఖ ఉన్నత అధికారులకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దానిని సోమవారం మీడియాకి విడుదల చేశారు. ఈ పాసింజర్ రైళ్ల ద్వారా పేద ప్రయాణీకులు,ఉద్యోగులు,విద్యార్థులు,ఇతర చిరు వ్యాపారులకు ఎంతో సౌక్యర్యంగా ఉండేవని పేర్కొన్నారు. నిలిపివేసిన తరువాత నేటికీ వాటిని పునరుద్దరించలేదన్నారు. ఒకప్రక్క ఆర్టీసీ బస్సులు, దూర ప్రయాణీకుల రైళ్లు ఇతర ప్రైవేట్ రవాణా వాహనాలు యధా విధిగా నడుస్తుండగా ఇంకా పాసింజర్ రైళ్లు నడపకపోవటంతో ప్రయాణ సౌకర్యం లేకపోవడం వలన నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్థులు,చిరు వ్యాపారులు,ఉద్యోగులు పేద మధ్యతరగతి ప్రయాణీకుల మీద ఆర్థికభారం పడుతున్నదన్నారు. అన్ని రకాల వాహనాలు, స్కూళ్ళు,కార్యాలయములు యధావిధిగా నడుస్తుంటే ఇంకా పాసింజర్ రైళ్లు నడపకపోవటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. అలాగే మచిలీపట్నం -తిరుపతి ఎక్స్ప్రెస్ రైలుని కూడా పునరిద్దరించాలని పూర్ణచంద్ర రావు ఆ ప్రకటనలో అధికారులను కోరారు.
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. మార్చి 16న అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురష్కరించుకొని ఈ ఉత్సవాలను జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జారీచేసిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, ఉత్సవాలను నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.
ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 65 వినతులు అందాయి. వీటి లో ఎక్కువగా భూ సమస్యలు, వికలాంగ ధ్రువ పత్రాల కోసం, పించన్ల మంజూరు కోరుతూ వచ్చాయి. ఈ స్పందన వినతులను జిల్లా కలెక్టర్ డా. ఎం.హరి జవహర్ లాల్, సంయుక్త కలెక్టర్ జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, విపత్తుల శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మావతి స్వీకరించారు. ఈ దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు పంపుతూ త్వరగా పరిష్కరం అయ్యేలా చూడాలని అన్నారు. స్పందన అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో పలు ఫ్లాగ్ షిప్ కార్యక్రమాల పై సమీక్షించారు. పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం క్రింద మంజూరైన స్థలాలను వంటనే పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. 90 రోజుల్లో పరిష్కరించవలసిన ఇళ్ళ స్థలాల దరఖాస్తులను కూడా త్వరగా పూర్తి చెయ్యాలన్నారు. నాడు –నేడు పనులను, కన్వర్జెన్స్ పనులను త్వరగా పూర్తిచేసి పురోగతిలో ఉండేలా చూడాలన్నారు. వై.ఎస్.ఆర్ బీమా, తోడు,చేయూత, ఆసరా పధకాల లో అబివృది కనపడలన్నారు. ఆయా అధికారులంత ఇక పై ఈ పధకాల పైనే దృష్టి సారించాలన్నారు. డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా మంజూరైన ఉద్యోగుల హెల్త్ కార్డులను జిల్లా కలెక్టర్ డా. ఎం.హరి జవహర్ లాల్ సోమవారం ప్రారంభించారు. జిల్లాకు సంబంధించి 34 శాఖలకు చెందిన ఉద్యోగులకు 47,676 కార్డులు మంజురైనాయని వీటిని వెంటనే ఆయా శాఖల ఉద్యోగులకు అందజేయాలని కలెక్టర్ ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయధికారి డా. అప్పల రాజుకు సూచించారు. కలెక్టర్ సూచనల మేరకు వెంటనే అన్ని శాఖల ఉద్యోగులకు కార్డులను పంపిణీ చేసారు.
శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో డయల్ యువర్ ఫోన్ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా బూర్జ మండలం తోటవాడ నుండి బి.శ్రీనివాసరావు ఫోన్ చేసి మాట్లాడుతూ తమ గ్రామంలో డప్పు కళాకారుల పింఛనుతో పాటు వృద్ధాప్య పింఛనును కూడా కొందరు పొందుతున్నారని, కావున దానిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. సంతకవిటి మండలం మామిడిపల్లి నుండి కె.గోపాలరావు మాట్లాడుతూ మడ్డువలస రిజర్వాయర్ నుండి 10 శాతం నీటిని మాత్రమే విడుదల చేయాల్సి ఉండగా , ఎక్కువగా నీటిని విడుదల చేస్తున్నారని, దానివలన అవసరమైనపుడు నీటి నిల్వలు ఉండబోవని ఫిర్యాదు చేసారు. మెళియాపుట్టి మండలం దుబ్బలాపురం నుండి జి.తిరుపతిరావు ఫోన్ చేస్తూ తన వద్ద 130 ధాన్యం బస్తాలు ఉన్నాయని, మిల్లర్లు వాటిని కొనుగోలు చేసి డబ్బులు మంజూరుచేయాలని కోరారు. వీరఘట్టం మండలం హుస్సేన్ పురం నుండి దాలినాయుడు మాట్లాడుతూ తన భూమిని సబ్ డివిజన్ చేసి భూమి ఇప్పించాలని కోరారు. వజ్రపు కొత్తూరు మండలం పాత టెక్కలి నుండి బి. రామారావు ఫోన్ చేస్తూ తనకు రేషన్ మంజూరుకావడం లేదని, కావున దానిని మరల పునరుద్దిరించాలని కోరారు. జలుమూరు మండలం సైరిగాం నుండి పి. రామారావు మాట్లాడుతూ తన 4 ఎకరాల భూమికి చెందిన మ్యూటేషన్ మంజూరుచేయాలని కోరారు. పాలకొండ నుండి బి.రాంబాబు ఫోన్ చేసి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలలో తాను ఏర్పాటుచేసిన షామియానాల బిల్లు ఇంతవరకు మంజూరు కాలేదని, దానిపై తగు చర్యలు తీసుకొని బిల్లును మంజూరుచేయాలని ఫిర్యాదు చేసారు. మెళియాపుట్టి మండలం కొసమాల నుండి ఎ.చిట్టిబాబు మాట్లాడుతూ తనకు చెందిన భూమిలో గ్రామ సచివాలయం బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారని, కావున దానిని నిలుపుదల చేయాలని ఫిర్యాదు చేసారు. పొందూరు మండలం వల్లపేట నుండి యం.వెంకటరావు మాట్లాడుతూ తన గ్రామంలో రహదారి ఆక్రమణకు గురైందని, కావున బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. నరసన్నపేట నుండి జి.మన్మథరావు ఫోన్ చేస్తూ ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రైవేటు పాఠశాలలకు ఒంటిపూట నిర్వహించాలని కోరారు. ఎచ్చెర్ల మండలం ధర్మవరం నుండి వై.నారాయణమ్మ మాట్లాడుతూ తనకు 2018లో రావలసిన గృహనిర్మాణపు బిల్లు ఇంతవరకు మంజూరుకాలేదని, కావున మంజూరుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమాజాభివృద్దిలో భూగర్భ జలాలు, జలగణనశాఖ పాత్ర ఎంతో కీలకపాత్ర పోషిస్తోందని ఆ శాఖ డిప్యుటీ డైరెక్టర్ కెఎస్ శాస్త్రి పేర్కొన్నారు. ఈ శాఖ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ ఏడాది స్వర్ణోత్సవ సంవత్సరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 16వ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 1970వ దశాబ్దానికి పూర్వం ప్రజలు ఎక్కువగా వ్యవసాయం కోసం వర్షాలపైనే ఆధారపడేవారని తెలిపారు. అక్కడక్కడా ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించడంతోపాటుగా, రైతులు బావులు తవ్వుకుని వ్యవసాయం చేసేవారన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలను ఒక క్రమపద్దతిలో అన్వేషించి, వాటిని వెలికితీసి రైతాంగానికి మేలు చేయాలన్న లక్ష్యంతో 1971 మార్చిలో ప్రభుత్వం భూగర్భ జలశాఖను ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు సమృద్దిగా ఉన్న ప్రాంతాలను, యాక్విఫర్స్ను గుర్తించడం, ఎప్పటికప్పుడు జలవనరులను అంచనా వేయడం, భూగర్భ జలాల పరిరక్షణ, నియంత్రణకు తగిన సలహాలను, సూచనలను చేయడం, పరిశీలక బావులను ఏర్పాటు చేయడం,భూగర్భ జలాలను రీఛార్జి చేయాల్సిన ప్రాంతాలను గుర్తించడం, నీటి నాణ్యతను నిర్ధారించడం, సముద్రపు నీరు భూమిలోకి చొచ్చుకురాకుండా తగిన రక్షణ చర్యలను చేపట్టడం తదితర కార్యక్రమాల ద్వారా ఈ 50 ఏళ్ల కాలంలో వ్యవసాయాభివృద్దికి తమ శాఖ ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. అదేవిధంగా జీవనధార, జెఆర్వై, మిలియన్ వెల్స్ ప్రోగ్రామ్, సన్నచిన్నకార రైతులకు బోరుపాయింట్ సర్వే, వివిధ సంక్షేమ శాఖల పధకాల్లో భాగంగా బోరు పాయింట్లు గుర్తించడం, చెక్డ్యాములు, ఊట చెరువుల నిర్మాణానికి సర్వే చేయడం మొదలగు సమాజాభివృద్ది కార్యక్రమాలను నిర్వహించిందని తెలిపారు. స్వర్ణోత్సవాల నేపథ్యంలో భూగర్భ జలాల సంరక్షణ, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు మంగళవారం నుంచి వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, వాటిని విజయవంతం చేయాలని శాస్త్రి కోరారు.
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం (పీఎం ఎఫ్ఎంఈ) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ఆహార శుద్ధి విధానం (2020-25) కింద జిల్లాలో సూక్ష్మ ఆహార శుద్ధి రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జిల్లాస్థాయి కమిటీ ఛైర్మన్ డి.మురళీధర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అసంఘటిత విభాగంలోని వ్యక్తిగత సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థల పోటీతత్వం పెంచడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పథకం, కార్యక్రమాల లక్ష్యమని వెల్లడించారు. అదే విధంగా ఇప్పటికే ఉన్న, కొత్త సంస్థలను అధికారిక చట్రం కిందకు తెచ్చేందుకు కూడా ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. అర్హత కలిగిన ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం వరకు రూ.10 లక్షల గరిష్ట పరిమితితో రుణ అనుసంధాన క్యాపిటల్ రాయితీ లభిస్తుందని తెలిపారు. బ్రాండ్ బిల్డింగ్, మార్కెటింగ్ మద్దతు కోసం 50 శాతం వరకు (రూ.10 లక్షల వరకు), మౌలిక వసతుల అభివృద్ధి సహాయం కింద 35 శాతం వరకు (రూ.10 లక్షల వరకు) సహాయం అందుతున్నారు. మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు ఏ వర్గానికి చెందిన మహిళా పారిశ్రామికవేత్తలకైనా ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఔత్సాహికులు https://pmfme.mofpi.gov.in ద్వారా ఈ నెల 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు రెవెన్యూ డివిజన్ స్థాయిలోని అధికారిని సంప్రదించొచ్చన్నారు. అమలాపురం (95733 24062), కాకినాడ (90144 72669), పెద్దాపురం (91103 53491), రామచంద్రపురం (80743 48855), రాజమహేంద్రవరం (93816 90044), రంపచోడవరం, ఎటపాక (95738 47315, 93905 20249), జిల్లాస్థాయి కార్యాలయం (0884-2368199) నంబర్లలో సంపద్రించొచ్చని కలెక్టర్ తెలిపారు.
వినియోగదారుల్లో చైతన్యం వచ్చినప్పుడే నాణ్యమైన వస్తువుల అమ్మకాల సంఖ్య పెరుగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆస్రా సంస్థ, స్టార్ వాకర్స్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఆర్ఒ ఎల్.రమేష్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే నాణ్యమైన వస్తువు కొనుగోలు చేసుకోవచ్చునని, నాసిరకం వస్తువులు అమ్మకాలు జరిగినా దానిపై ఫోరంను ఆశ్రయించవచ్చునన్నారు. సిటిజన్ఫోరం అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది వై.మురళీమోహన్రావు మాట్లాడుతూ చట్టాలపై అవగాహన లేకపోవడం వల్లనే వినియోగదారులు మోనపోతున్నారని, చట్టాలు గురించి తెలునుకున్నప్పుడు అందరికీ మేలు జరుగుతుందన్నారు. వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ జిలా, రాష్ట్ర జాతీయ స్థాయిలో వినియోగదారుల ఫోరమ్స్ ఉన్నాయని, ఇవి న్యాయవ్యవస్థ అధీనంలోనే పనిచేస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందన్నారు. ఏపిడబ్బుజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, (ప్రెస్క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ ఎటువంటి రుసుం చెల్లించకుండా, న్యాయవాదితో ప్రమేయం లేకుండా వినియోగదారుల ఫోరంలో కేసు వేసుకొనే అవకాశం ఉందని, వీటిని సద్వినియోగం చేసుకొనేవారి సంఖ్య పెరిగినప్పుడు నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎలక్ష్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలపై పలు విద్యా సంస్థల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఆస్రా రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ గంజి ఎజ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించేందుకు చైతన్యరథాలు జిల్లాకు రానున్నాయని, న్యాయవాదులు, విద్యావంతులు అవగాహనా సదస్సులు విజయవంతం చేసేందుకు సహకరించాలన్నారు. వాకర్స్క్లబ్ అధ్యక్షుడు చలపాక సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిఎస్డిఒ శ్రీనివాస్కుమార్, జిల్లా బిసి సంఘాల అధ్యక్షుడు పి.చంద్రపతిరావు, అమిరుల్తాబేగ్, వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ కూన వెంకటరమణ, బి.వి.రవిశంకర్, ఆనందరావు, జ్యోతిర్మయి తదితరులు ప్రసంగించారు. వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పిస్తున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆస్రా, స్టార్ వాకర్స్క్లబ్ ప్రతినిధులు సత్కరించారు.
అనంతపురం జిల్లాలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడతామని జాయింట్ కలెక్టర్ (అసరా, సంక్షేమం) గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారులను జాగృతం చేసే దిశగా ఈ సంవత్సరం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం వాటి సమస్యల పరిష్కా రం అనే అంశంపై కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ ప్రకటించిన నేపథ్యంలో వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణ వాతావరణం పై ఎక్కువ ప్రభావం, త్రీవ నష్టాలు ఎదుర్కొనవలసి వస్తోందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మానవులలో కూడా ఆరోగ్య మార్పు అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవన విధాన శైలిని పెంపొందించుకొని మంచి ఆరోగ్యవంత జీవితాన్ని కొనసాగించుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం కోసం ఒక ఉద్యమ స్ఫూర్తితో కార్యక్రమాలను ప్రారంభించుకోవాలన్నారు. ప్లాస్టిక్ కాలుష్యా సమస్యలను పరిష్కరించడానికి వినియోగదారుల సంఘాలు, కార్యకర్తలు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదని, అందువల్ల ప్రజలు కూడా ప్లాస్టిక్ నిరోధించడానికి సహకరించాలన్నారు. వస్తువులు కొన్న ప్రతి సారి తప్పనిసరిగా బిల్లు తీసుకురావాలని, తూనికలు కొలతలలో మోసపోయినట్లు భావించిన ఎడల లీగల్ మెట్రాలజీ శాఖను సంప్రదించాలని, తద్వారా నష్టపరిహారం పొందుటకు రిజిస్టర్ కాబడిన వినియోగదారుల సంఘాలను లేదా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చునని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ నిరోధించడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సభ్యుల సూచనల మేరకు అవసరమైన చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల స్పందన కూడా ఎంతో అవసరమన్నారు. ప్రస్తుతం ప్రజలకు చేరువగా విస్తృతంగా సేవలు అందించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో వార్డు సెక్రటరీ ల ద్వారా అనేక సమస్య లు పరిష్కరించబడుతున్నట్లు తెలిపారు. స్పందన లో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించుటకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో పలు విషయాలపై జాయింట్ కలెక్టర్ చర్చించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఆహార కమిటీలు పునరుద్ధరించాలని, అలాగే జిల్లా వినియోగదారుల రక్షణ మండలి, ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని సంఘాల ప్రతినిధులు జెసి దృష్టికి విన్నవించారు. దీనిపై జిల్లా కలెక్టర్ మాట్లాడి అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటామని బదులు జవాబిచ్చారు.
సమావేశంలో కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ క్యాలెండర్ ను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రఘురామిరెడ్డి , ఆహార భద్రత అధికారి శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ స్వామి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కొండయ్య, రాష్ట్ర వినియోగ దారుల రక్షణ మండలి సభ్యులు షేక్ నబి రసూల్, జిల్లా వినియోగదారుల సంఘం నాయకులు రవీంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.