నాడు - నేడు పాఠశాలల్లో సామగ్రి త్వరితగతిన సమకూర్చాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. జిల్లాలో నాడు - నేడు క్రింద పనులు చేస్తున్న పాఠశాలల్లో ఫర్నీచర్, పెయింటింగ్ సరఫరా అంశాలపై సంబంధిత కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. ప్రధాన ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలని, ఎంత పరిమాణంలో పెయింటింగ్, ఫర్నీచర్ కావాలో అంచనా వేసి ఇండెంట్ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఫర్నీచర్ ను బిగించుటకు మండలానికి రెండు బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. తద్వారా త్వరగా పని పూర్తి జరుగుతుందని పేర్కొన్నారు. మండల వారీ బృందాల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. అల్మరాలు తక్కువగా వచ్చాయని కలెక్టర్ అన్నారు. నీటి శుద్ది యంత్రాలను అమర్చుటకు కనీసం 10 బృందాలు ఏర్పాటు చేయాలని లివ్ ప్యూర్ ప్రతినిధిని ఆదేశించారు. పెయింటింగ్ పూర్తి చేయుటకు ఎక్కువ బృందాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. డ్రాయింగ్ ఉపాధ్యాయులు తమ మండల స్థాయిలో కమర్షియల్ పెయింటింగ్ చేయగల వ్యక్తులను గుర్తించాలని ఆదేశించారు. పాఠశాలల గోడలపై పెయింటింగ్, బొమ్మలకు సరైన స్థలాన్ని గుర్తించి పక్కాగా వేయాలని సూచించారు. పాఠశాలలకు ఏ ఫర్నీచర్ సరఫరా చేయాలి, ఎంత పరిమాణంలో సరఫరా చేయాలో పక్కాగా ఆర్డర్ ఇవ్వాలని తద్వారా సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఫర్నీచర్ సరఫరాదారులు కోరారు. 15 బృందాలను జిల్లాలో ఏర్పాటు చేసి ఫర్నీచర్ ను బిగిస్తున్నామని మేథాడెక్స్ ఫర్నీచర్ కంపెనీ ప్రతినిధి కృష్ణంరాజు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ, ఉప విద్యా శాఖ అధికారి జి.పగడాలమ్మ, సమగ్ర శిక్షా అభియాన్ ఇఇ వి.వెంకట కృష్ణయ్య, ఏపిఇడబ్ల్యుఐడిసి ఇఇ కె.భాస్కరరావు, జెఇ కిరణ్ కుమార్, బెర్జర్, ఏసియన్ పెయింటింగ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ డి ఈ ఓ, ఎం ఈ ఓలు, ప్రధానోపాధ్యాయులు లు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంపొందించుటకు కృషి చేయాలన్నారు. జిల్లాలో నాలుగు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో 82.50 శాతం ఓటింగ్ నమోదైందని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదయ్యేలా చూడాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని, ఓటు హక్కు ఉన్న వారి ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తీసుకువచ్చి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఎక్కువ శాతం పోలింగ్ కేంద్రాలు ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేశారని, ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లు కచ్చితంగా ఓటు వేసేలా చూడాలన్నారు. ఆయా పాఠశాలల పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో విద్యార్థుల ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి అందరూ ఓటింగ్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా పాఠశాలల విద్యార్థులు తమ ఇంటిలో 18 ఏళ్లు నిండి ఓటుహక్కు ఉన్నవారు ఓటు వేసేలా వారికి తెలియజేయాలని, విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో పాటు వారి చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎన్నికల ప్రక్రియ, ఓటు ప్రాధాన్యత గురించి తెలియజేయాలని, దీని ద్వారా ఓటింగ్ శాతం పెంచడానికి వీలు కలుగుతుందన్నారు. ఏ పాఠశాల పరిధిలో అయితే ఎక్కువ శాతం పోలింగ్ శాతం నమోదు అవుతుందో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులను పిలిపించి వారిని సన్మానిస్తామన్నారు. ఒక ఛాలెంజ్ గా తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు చేసేందుకు కృషి చేయాలన్నారు.
అలాగే ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నామని, ఓటర్ స్లిప్పులు అందరికీ అందాయా లేదా అనేది విద్యార్థులు చూడాలన్నారు. వృద్ధులు ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే వెళ్లి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే తెలియజేశామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. అన్ని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలను రప్పించి ఓటింగ్లో పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని, అలాగే మున్సిపల్ ఎన్నికలలో కూడా వలస కూలీల లో వెనక్కి తీసుకు వచ్చి వారు పోలింగ్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగిన వారందరూ కచ్చితంగా ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఎక్కువ శాతం పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే మున్సిపల్ కమిషనర్ల ద్వారా ఓటర్ల వివరాలు ముందస్తుగా సేకరించుకుని ప్రణాళిక బద్ధంగా కార్యచరణ చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య, డీఈవో శామ్యూల్, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ పివిఎన్ఎన్ మూర్తి, సమగ్ర శిక్ష ఏపీసీ తిలక్ విద్యాసాగర్, ఎంఈ ఓ లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తారకరామా తీర్ధ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమగు ఇసుక కోసం సంయుక్త కలెక్టర్ జి.సి.కిషోర్ కుమార్ దృష్టి పెట్టారు. గురువారం ఆయన డెంకాడ మండలం చొల్లంగి పేట వద్ద నున్న ఇసుక రీచ్ ను పరిశీలించారు. ఈ రీచ్ నుండి ఇసుకను ప్రాజెక్ట్ కోసం తరలించడం లో సాధ్యాల పై చర్చించి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం డెంకా డ ఆనకట్ట వద్ద డీ సిల్టింగ్ చేయడానికి పరిశీలించారు. ప్రతి వారం ఇరిగేషన్ ప్రాజెక్టుల పై ప్రభుత్వం సమీక్షిస్తోందని, ప్రోజెక్టుల పూర్తికి కావలసిన భూ సేకరణ ఇప్పటికే పూర్తయిందని, మిగిలిన ఏర్పాట్లన్నీ త్వరలో పూర్తి చేసి వేగంగా ప్రాజెక్టులు అయ్యేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని జె.సి అన్నారు. జె.సి వెంట ఇరిగేషన్ ఈఈ పరమేశ్వర రావు, డి ఈ రమణ, గనుల శాఖ ఏ.డి, తసీల్దార్ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్కు మైక్రో అబ్జర్వర్లే కళ్లూ చెవులు లాంటివారని జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు కాంతిలాల్ దండే అన్నారు. సూక్ష్మ పరిశీలకులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంతిలాల్ దండే మాట్లాడుతూ నిభందనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించాల్సిన బాధ్యత మైక్రో అబ్జర్వర్లపైనే ఉందన్నారు. సమస్యాత్మక, సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లో వీరంతా విధులను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతీ అంశాన్నీ క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని సూచించారు. పోలింగ్ ముందురోజు ఉదయం 8 గంటలు నుంచీ, పోలింగ్ రోజు ఉదయం 6 గంటలు నుంచే విధులను ప్రారంభించాలన్నారు. నిభందనల ఉల్లంఘనపైనా, అవాంఛిత సంఘటనలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సూక్ష్మ పరిశీలకులపై ఉందని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, జిల్లా ఎన్నికల పరిశీలకుల ఆధీనంలో, సూక్ష్మ పరిశీలకులంతా పనిచేయాల్సి ఉంటుందన్నారు. పంచాయితీ ఎన్నికలకు భిన్నంగా, పార్టీల గుర్తులతో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని, అందువల్ల ప్రతీఒక్కరూ మరింత అప్రమత్తంగా విధులను నిర్వహించాలని కోరారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓట్ల శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, ఎలక్షన్ ట్రైనింగ్ ఆఫీసర్ ఎస్.అప్పలనాయుడు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ డా.ఎం. హరి జవహర్ లాల్ కు ఓటరు స్లిప్పులు అందాయి విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్, 46వ డివిజన్ పరిధిలో కలెక్టర్ బంగ్లా వుంది. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో కలెక్టర్ కుటుంబం ఓటు వేసేందుకు అనువుగా ఆ ప్రాంత బూత్ లెవెల్ అధికారులు కలెక్టర్ బంగ్లాకు వెళ్లి, కలెక్టర్ గారితో పాటు ఆయన సతీమణి శైలజాభాయి కూడా ఓటరు స్లిప్పులను అందజేసారు. యూత్ హాస్టల్ లో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల్సివుంటుందని బిఎల్ఓలు సూచించారు.
మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంత కార్డుదారులకు మార్చి నెల రేషన్ల పంపిణీ ప్రక్రియ 6వ తేదీ శనివారం నుండి ప్రారంభమౌతుందని జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫిబ్రవరి నెల రేషన్ పంపిణీ గురువారం సాయంత్రంతో ముగించి, మిగిలి పోయిన కార్డుదారులకు మరల ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకూ పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పట్టన ప్రాంతాల్లో మార్చి నెల రేషన్ పంపిణి ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందన్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ ను ఏ కారణం చేతనైనా తీసుకోని గ్రామీణ, పట్టన ప్రాంతాల కార్డుదారులు, ఫిబ్రవరి, మార్చి రెండు నెలల రేషన్ లను కార్డుదారు ఒకేసారి వేలిముద్ర వేయటం ద్వారా పొందే అవకాశాన్ని ఈ నెల 10వ తేదీ వరకూ కల్పిస్తున్నామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టన ప్రాంత కార్డుదారులు ఈ నెల 5వ తేదీ నుండి, గ్రామీణ ప్రాంత కార్డుదారులు ఈ నెల 6వ తేదీ నుండి వినియోగించుకోవచ్చునని, నెలవారీగా, సరుకు వారీగా కార్డుదారులకు రశీదు ఇస్తారని ఆయన తెలిపారు.
విశాఖ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం జివిఎంసి సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న పొరపాటు కూడా లేకుండా ఏర్పాట్లన్నీ పక్కాగా చేయాలన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ పెట్టెలు మొదలైనవన్నీ సిద్ధం చేసి జోనల్ కార్యాలయాలకు అందజేయాలన్నారు. జోనల్ కమిషనర్లు పోలింగ్ స్టేషన్ల వారీగా విభజన చేయాలన్నారు. సెక్టార్, రూట్ అధికారులు తాము చేయబోయే పనులకు సిద్ధం కావాలన్నారు. ఓటర్ల జాబితాలు, మార్కుడు కాపీలు సిద్ధం చేసుకోవాలని ఫోటో వోటర్ స్లిప్పులు పంపిణీ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాలను మరోసారి తనిఖీ చేసి తాగునీరు, వాడుక నీరుతో సహా అన్ని మౌలిక వసతులు పరిశీలించాలన్నారు.వారికి కేటాయించిన మార్గాల ద్వారా రవాణా ఏర్పాట్లు పోలింగ్ అధికారులు సిబ్బంది సూక్ష్మ పరిశీలకులు వీడియోగ్రఫీ వెబ్ కాస్టింగ్ లను బట్టి అవసరమగు వాహనాల సంఖ్య సరి చూసుకోవాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టేటజిక్ సర్వెలన్స్ టీమ్ లు వేగంగా స్పందించాలన్నారు. 8వ తేదీ సాయంత్రం గం.5-00ల నుండి మద్యం విక్రయాలను ఆపివేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లను సిద్ధం చేయాలన్నారు. రేపటి నుంచి 9వ తేదీ సాయంకాలం వరకూ జోనల్ కమిషనర్ల పరిధిలో ఏర్పాట్లను పూర్తి చేయవలసి ఉంటుందన్నారు.
10 వ తేదీన సెలవు
జిల్లాలో జివిఎంసి ఎలమంచిలి మునిసిపాలిటీల్లో ఉన్నందున ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ సెలవు దినాన్ని ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జివియంసి కమిషనర్ నాగమణి, జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాలరెడ్డి, ఆర్.గోవిందరావు, అడిషనల్ కమిషనర్లు ఆశాజ్యోతి, రమణి, సన్యాసిరావు, ఆర్డీవోలు పెంచల కిషోర్, సీతారామారావు తదితరులు పాల్గొనగా నర్సీపట్నం సబ్-కలెక్టరు ఎన్.మౌర్య, ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
జీవిఎంసీ ఎన్నికల అనంతరం కౌంటింగ్ కు చేస్తున్న ఏర్పాట్లలో ఏ విధమైన లోపాలు ఉండరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధారిటీ వి వినయ్ జివిఎంసి అధికారులను ఆదేశించారు. మహా విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను జివిఎంసి కమిషనర్ నాగలక్ష్మి తో కలసి ఆంధ్రా యూనివర్సిటీలోని వివిధ భవనాలను ఆయన గురువారం పరిశీలించారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగుకు అవసరమైన మెటీరియల్ అక్కడే పంపిణీ చేస్తారని, వచ్చే వాహనాలకు సరిపడ పార్కింగ్, పోలింగు సిబ్బందికి అవసరమైన వసతులపై ఆయన జివిఎంసి అధికారులతో చర్చించారు. కౌంటింగ్ కేంద్రాలు వద్ద తాగునీరు, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పర్యటనలో విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, జివిఎంసి చీఫ్ ఇంజనీరు వెంకటేశ్వరరావు, ఎస్. ఇ. వేణుగోపాల్ రావు రవాణా శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్క బియ్యం కార్డుకు రేషన్ అందుతుందని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి నెల రేషన్ పంపిణీ కొద్దిగా ఆలస్యంగా ప్రారంభించడంతో దాదాపు 6 శాతం మంది విడిపించుకోలేకపోయారని, రేషన్ రాదని ఆందోళన చెందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జెసి చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేషన్ విడిపించుకోని అర్హులైన అందరికి అందుతుందని స్పష్టం చేసారు. రేషన్ సరుకుల పంపిణీపై గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్ధ క్రింద ఫిబ్రవరి నెలకు ఇచ్చే రేషన్ పంపిణీ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మార్చి గురు వారం నాటికి పంపిణీ కార్యక్రమం పూర్తి అవుతుందని అన్నారు. అయితే రేషన్ అందని వారికి మార్చి నెల రేషన్ తోపాటు అందించడం జరుగుతుందని వివరించారు. ఈ రేషన్ ను మార్చి 10వ తేదీ లోగా విడిపించుకోవాలని ఆయన కోరారు. ఈ అవకాశం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వర్తిస్తుందని, పట్టణ ప్రాంతాలలో మార్చి 5 నుండి 10వ తేదీ వరకు, గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 6 నుండి 10వ తేదీ వరకు రేషన్ విడిపించకోవాలని సూచించారు. మార్చి నెల రేషన్ గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 6వ తేదీన ప్రారంభం అవుతుందని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో మార్చి నెల రేషన్ 1వ తేదీ నుండి ప్రారంభం అయిందని యధావిధిగా పంపిణీ జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే 27 శాతం పంపిణీ జరిగిందని చెప్పారు. బియ్యం కార్డును ఇపాస్ లో నమోదు చేసిన వెంటనే రేషన్ విడిపించని కార్డుదారుల వివరాలు వస్తాయని వారికి రెండు నెలల రేషన్ ను సింగిల్ అథెంటికేషన్ తో పంపిణీ చేస్తామని అన్నారు. నెలల వారీగా తీసుకున్న వివరాలు వేరు వేరుగా ప్రింటింగు అవుతాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో శుక్ర వారం ఎటువంటి పంపిణీ ఉండదని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. రేషన్ పంపిణీ సాఫీగా జరుగుతోందని, ఎదురౌతున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని జెసి వివరించారు. పట్టణ రేషన్ పంపిణీ వాహనదారులకు వేతనం జమ జరిగిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల వాహనాలకు రెండు, మూడు రోజుల్లో జమ అవుతుందని పేర్కొన్నారు.
విజయనగరం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం, ఏకగ్రీవాలు మినహా 473 మంది బరిలో నిలిచారు. బొబ్బిలిలో 80 మంది, సాలూరులో 73 మంది, నెల్లిమర్లలో 50 మంది, పార్వతీపురంలో 82 మంది, అత్యధికంగా విజయనగరం కార్పొరేషన్ నుంచి 189 మంది పోటీ చేస్తున్నారు. పార్వతీపురంలో 6, బొబ్బిలిలో ఒకటి, మొత్తం 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. నెల్లిమర్ల నగర పంచాయితీ ః నెల్లిమర్లలోని 20 వార్డులకు గానూ మొత్తం 50 మంది పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి 20 మంది, టిడిపి నుంచి 20, కాంగ్రెస్ నుంచి 4, జనసేన నుంచి 1, బిజెపి నుంచి 1, స్వతంత్రులు 4గురు పోటీ చేస్తున్నారు.
బొబ్బిలి మున్సిపాల్టీ ః బొబ్బిలిలో 31 వార్డులు ఉన్నాయి. వీటిలో 11వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాహూ వెంకట మురళీకృష్ణారావు దాఖలు చేసిన నామినేషన్ మాత్రమే మిగిలి ఉండటంతో, ఈ వార్డు ఏకగ్రీవం అయ్యింది. మిగిలిన 30 వార్డుల్లో 79 మంది పోటీ పడుతున్నారు. వైకాపా నుంచి 30 మంది, టిడిపి నుంచి 28, జనసేన నుంచి 6, కాంగ్రెస్ నుంచి 2, సిపిఎం నుంచి 1, సిపిఐ నుంచి 2, బిజెపి నుంచి 1, స్వతంత్రులు 9 మంది పోటీ చేస్తున్నారు. సాలూరు మున్సిపాల్టీ ః సాలూరులో 29 వార్డులకు మొత్తం 73 మంది బరిలో నిలిచారు. వైకాపా నుంచి 28 మంది, టిడిపి నుంచి 27, బిజెపి నుంచి 4, సిపిఎం నుంచి 2, కాంగ్రెస్ నుంచి 1, స్వతంత్రులు 11 మంది పోటీ చేస్తున్నారు.
పార్వతీపురం మున్సిపాల్టీ ః పార్వతీపురం మున్సిపాల్టీలో మొత్తం 30 వార్డులకు 88 మంది పోటీ చేస్తున్నారు. వీటిలో 6 వార్డుల్లో ఒకేఒక నామినేషన్ మిగిలడంతో ఏకగ్రీవం అయ్యాయి. 10 వార్డు నుంచి జలుమూరి దివ్య, 15 వార్డు నుంచి చీటి అనురాధ, 19 వార్డు నుంచి తెలుగు బోదయ్య, 26వ వార్డు నుంచి బెలగాన కరుణ, 27 వార్డు నుంచి ఇందుకూరి గుణ్ణేశ్వర్రావు, 29 వార్డు నుంచి యడ్ల త్రినాధ ఏకగ్రీవంగా గెలుపొందారు. మిగిలిన 24 వార్డులకు 82 మంది పోటీ చేస్తున్నారు. విజయనగరం కార్పొరేషన్ ః విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్ల నుంచి మొత్తం 189 మంది పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్-50 మంది, టిడిపి-50 , బిజెపి-18 , కాంగ్రెస్-16 , జనసేన-12 , సిపిఎం-1 , బిఎస్పి-4 , స్వతంత్రులు- 38 మంది పోటీ చేస్తున్నారు.
వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకులను ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు,సొడిశెట్టి దుర్గారావులు తెలిపారు. గురువారం డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్క్లబ్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కార్యవర్గం చర్చించి, అనంతరం కమిటీ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళా జర్నలిస్టులను,ప్రజాపిత బ్రహ్మకుమారీస్ను కూడా సత్కరించనున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం ప్రెస్క్లబ్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, ప్రముఖలతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను జర్నలిస్టు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్,టి.నానాజీ.జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్,కార్యవర్గ సభ్యులు శేఖర్మంత్రి తదితరులు పాల్గొన్నారు.
మొదటి దశలో ప్రారంబించిన నాడు-నేడు పనులన్నిటిని ఈ నెలాఖరునాటికి పూర్తి చేసుకోవాలని ప్రాధమిక విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు. రెండవ దశ పనులు సుమారు 4 వేల 400 కోట్ల తో ఏప్రిల్ నెల నుండి ప్రారంభించనున్నామని అయన తెలిపారు. బుధవారం కలక్టరేట్ సమావేశ మందిరం లో నాడు –నేడు పనుల పై ఇంజినీర్లు, మండల విద్యా శాఖాధికారులతో సమీక్షించారు. నాడు –నేడు పనులతో పాఠశాలలు దేవాలయాలుగా మారనున్నాయని, ఈ పనులు నాణ్యమైనవిగా, పది కాలాలు శాశ్వతంగా నిలిచేలా ఉండాలని అన్నారు. పిల్లలకు ప్రశాంత వాతావరణం లో విద్యాభాసం జరిగేలా, 5వ తరగతి వరకు ఆహ్లాదాన్ని అందించేలా, 10వ తరగతి వరకు పిల్లలకు నాలెడ్జ్ కలిగేలా తీర్చి దిద్దాలని అన్నారు. నాడు బ్లాక్ బోర్డ్ లు ఉండేవని, అవన్నీ నేడు గ్రీన్ బోర్డ్ లుగా మారిపోయాయని, భవిష్యతు లో వైట్ బోర్డు లుగా మారాలని అన్నారు. క్షేత్ర పర్యటన లో సందర్శించిన కొన్ని పాఠ శాలలు అద్భుతంగా ఉన్నాయని, వాటిని మోడల్ గా తీసుకోవాలని అన్నారు.
మొదటి దశ లో కొన్ని చోట్ల కాంట్రాక్టర్లతో పని చేయించారని, అయతే రెండవ దశ లో మాత్రం పూర్తిగా ప్రజల భాగస్వామ్యం తోనే జరగాలని సూచించారు. స్థానిక ప్రజల భాగస్వామ్యం వలన వారికీ స్వంతం అనే భావన కలుగుతుందని, అందువల్ల ఉత్తమ నాణ్యత ప్రమాణాలే కాకుండా నిర్వహణా బాధ్యతను కుడా వారే తీసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేసారు. మొదటి దశ లోని ఉత్తమ అభ్యాసాలను, అనుభవాలను జోడించి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ను తయారు చేసి అమలు జరపడం ద్వారా మంచి ఫలితాలను సాధించాలని అన్నారు. మొదటి దశ పనులకు సంబంధించిన మెటీరియల్ అంతా సెంట్రల్ ప్రోక్యుర్మేంట్ ద్వారా కంపెనీల నుంచి నేరుగా తీసుకోవడం వలన తక్కువ ధరకే నాణ్యమైన మెటీరియల్ ను వారంటీ తో తీసుకోవడం జరిగిందని అన్నారు. వారంటీ లోపల ఎలాంటి మరమ్మతులైన, నిర్వహణ పరమైన ఖర్చులైనా కంపెనీలే భరిస్తాయని స్పష్టం చేసారు.
విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, గోరు ముద్ద తదితర పధకాల తో పాటు పిల్లలకు నాణ్యమైన బూట్లు, యునిఫారాలు, పుస్తకాలు ఉచితంగా అందిస్తోందని అన్నారు. విద్య కోసం ఖర్చు చేసే నిధులను ఖర్చు గా ప్రభుత్వం భావించడం లేదని, పెట్టుబడి గా భావిస్తోందని అన్నారు. అప్పుడే మంచి ఫలితాలను చూడగలమని, అందుకు తగ్గట్టుగానే విద్యా వ్యవస్థ లో అనేక సంస్కరణలను తేవడం జరిగిందని అన్నారు. విద్యార్ధులు పాఠ శాల ఆవరణ లో , తరగతి గదుల్లో సౌఖ్యంగా ఉండేలా చూడాలని అన్నారు. టాయిలెట్లు నాడు- నేడు డిజైన్ ప్రకారంగానే నిర్మించాలని, గాలి, వెలుతురూ, నీరు ఉండాలని అన్నారు. నేడు లో ప్రతి పాఠశాలకు ఒక స్టోర్ రూమ్ ఉండాలని, పాత మెటీరియల్ అంత అందులో పడేసి, నేడు అనేది స్పష్టంగా కనపడేలా పాఠశాలలు రూపు రేఖల్ని మార్చాలని అన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతి లాల్ దండె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న నాడు-డు పనులు, నిధులు పై అరా తీసారు. గిరిజన పాఠ శాలను కుడా ఆహ్లాదంగా తీర్చి దిద్దాలని, ప్రత్యెక సదుపాయాలను కల్పించాలని అన్నారు. ప్రాధమిక విద్యా సలహాదారు మురళి మాట్లాడుతూ నాడు- నేడు పనులలో ఎక్కువగా వచ్చే సాంకేతిక సమస్యలు, చెల్లింపులు పై వివరించారు. రెండవ దశ పనుల్లో సచివాలయాల ఇంజినీరింగ్ సహాయకులు ప్రముఖ పాత్ర వహించేలా ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. ఎం. బుక్ తప్పని సరిగా రాయాలని, ఈ నెలాఖరు నాటికీ మొదటి దశ పనులు, నిధులు, ఎం.బుక్ తదితర పనులను పూర్తి చేయాలనీ అన్నారు.
తొలుత జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ జిల్లాలో చేపడుతున్న నాడు – నేడు పనులపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు. విద్యల నగరంగా విజయనగరాన్ని మార్చడానికి అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు.
కలెక్టర్ కు ప్రత్యెక అభినందనలు:
విజయనగరం జిల్లాకు సంవత్సరం క్రితం వచ్చానని, నాటికీ నేటికి ఎంతో తేడా కనపడుతోందని, కలెక్టర్ హరి జవహర్ లాల్ మార్క్ స్పష్టంగా చూశానని రాజశేఖర్ అన్నారు. ఎక్కడ చుసినా పచ్చదనంతో , నగరం లో సుందరీకరణ ఎంతో మారిపోయిందని అన్నారు. అనేక పాఠ శాలలు కుడా నూతన రూపాన్ని సంతరించుకొని అందంగా ఉన్నాయని, మంచి నాయకుడు ఉంటె అద్భుతాలను చేయవచ్చని రుజువు చేసారన్నారు. కలెక్టర్ కృషికి ప్రత్యేక అభినలను తెలిపారు.
ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్, ఐ.టి.డి.ఎ పి.ఓ ఆర్. కూర్మనాద్, , సబ్ కల క్టర్ విధే ఖరే, సర్వ శిక్ష అభియాన్ రాష్ట్ర అధికారులు, జిల్లా విద్య శాఖాధికారి నాగమణి, ఎస్.ఎస్.ఎ పి.ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ వి.వినయ్ చంద్ వివరించారు. బుధవారం ఉదయం కలెక్టరు ఆంధ్రాయూనివర్సిటీ భవనంలో ఓట్లు లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లను జి.వి.ఎం.సి కమిషనరు నాగలక్ష్మి తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు జి.వి.ఎం .సి, రెవెన్యూ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కౌంటింగు ప్రక్రియలో సిబ్బందికి ఎటువంటి సమస్య రాకుండా తగు ఏర్పాట్లు గావించాలన్నారు. తదుపరి కలెక్టరు మాట్లాడుతూ జి.వి.ఎం.సి ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ ప్రోక్యూర్ మెంటు నుండి కౌంటింగు ప్రక్రియ వరకు 21 యాక్టివిటీస్ ఉంటాయని, వీటి కోసం నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబందించి అధికారులకు సిబ్బందికి శిక్షణ యివ్వడం జరిగిందన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగు ఈ రోజు నుండి జరుగుతుందన్నారు. 14వ తేదిన కౌంటింగుకు ఆంధ్రా యూనివర్సిటీలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 98 వార్డులకు కౌంటింగు ఒకే చోట జరగడం వల్ల సౌకర్యంగా ఉంటుందన్నారు. మిగిలిన మునిసి పాలిటీలలో కూడా ఒకే చోట కౌంటింగు కు ఏర్పాట్లు గావిస్తున్నారన్నారు. జిల్లాలో 440 సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్టంగా బందోబస్తు ఏర్పాట్లు గావించడం జరుగుతోందన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు గావిస్తున్నామని స్పష్టం చేశారు. పోలింగు స్టేషన్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు.
ఓటర్లకు విజ్ఞప్తి :
ఓటర్లందరూ వారి ఓటు ఎక్కడవేయాలో తెలుసుకుని తప్పక ఓటు వేయాలన్నారు. ఓటర్లందరికి ఓటింగ్ సమయం, తేదీలను బల్క్ ఎస్ ఎం ఎస్ ల ద్వారా తెలియ జేస్తున్నామన్నారు. 11000 మంది ప్రభుత్వ అధికారులు సిబ్బంది, 3- 4 వేల పోలీసు సిబ్బంది ఎన్నికల విధులలో పాల్గొంటారన్నారు. కోవిడ్ టీకా వేసుకున్న వారు 30 ని. ల విశ్రాంతి తీసుకున్న తదుపరి ఓటింగు కు వెళ్ల వచ్చని తెలిపారు.