1 ENS Live Breaking News

రబీలో నీటిఎద్దడి లేకుండా చూడాలి..

రబీలో వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీటిపారుదల, వ్యవసాయ,  అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జలవనరులు, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయ సమావేశం జిల్లా  కలెక్టర్ అధ్యక్షతన  జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీలో వ్యవసాయ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ రబీలో వ్యవసాయ పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని, పశుదాహార్తిని తీర్చాలని పేర్కొన్నారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ (23ఆర్ డిస్ట్రిబ్యూటరీ ) ద్వారా హిరమండలం, సారవకోట, జలుమూరు మండలాల్లోని సుమారు 2,500 ఎకరాలకు రబీలో ఆరుతడి పంటలకు నీటిని అందించే అవకాశముందని కలెక్టర్  పేర్కొన్నారు. రానున్న సంక్రాంతి, వేసవిని  దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం, పశుదాహార్తి నిమిత్తం వంశధార కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  అలాగే రెండవ పంటకు గొట్టా బేరేజీ ద్వారా నీటి నిల్వలు బట్టి దిగువకు విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైన కారణంగా రిజర్వాయరులో తగినంత నీటి నిల్వ లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని  రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని చెప్పారు.  రబీలో 400 క్యూసెక్కుల నీటిని  మాత్రమే విడుదల చేసే అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని రైతులు గమనించాలని కలెక్టర్ కోరారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఈ విషయాలను వివరించాలని,  నీటిని విడిచిపెట్టేముందు పొలాల్లో ధాన్యం నిల్వలు లేకుండా రైతులకు ముందుగానే సమాచారాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కాలువలకు మరమ్మతు పనులను  యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో పర్యవేక్షక ఇంజినీర్లు డోల తిరుమల రావు, ఎస్.సి.రమణరావు, నరసన్నపేట, టెక్కలి , హిరమండలం, ఆమదాలవలస ఉపకార్య నిర్వాహకఇంజినీర్లు,  కార్యనిర్వాహక ఇంజినీర్లు, నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ డి.శ్రీనివాస్, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు రామచంద్రరావు, శ్రీకాంత్, రామకృష్ణ , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-23 20:18:54

ఎంఎస్ఎంఈలకు అధిక ప్రోత్సాహం..

తూర్పుగోదావరి జిల్లాలో సూక్ష్మ ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహ‌క కార్య‌క్ర‌మం (ఎంఈపీపీ) ద్వారా జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను గుర్తించి, ప్రోత్స‌హిస్తున్న‌ట్లు జెసి (సంక్షేమం) జి.రాజ‌కుమారి తెలిపారు. భార‌తీయ ల‌ఘు ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) స‌హ‌కారంతో చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహ‌క‌, అభివృద్ధి సంస్థ (మెప్డా) ద్వారా ఈ కార్య‌క్ర‌మం అమ‌ల‌వుతున్న‌ట్లు వివ‌రించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటుచేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌.. మూడు యూనిట్ల‌కు సంబంధించి న‌లుగురు మ‌హిళా  ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు రూ.40 ల‌క్ష‌ల చెక్కుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఈ మ‌హిళ‌లు బేక‌రీ ఉత్ప‌త్తులు, శానిట‌రీ న్యాప్‌కిన్స్, ఫోం క్లాత్ బెడ్స్ త‌‌యారీ యూనిట్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. బేక‌రీ ఉత్ప‌త్తుల యూనిట్‌కు రూ.25 ల‌క్ష‌లు, శానిట‌రీ న్యాప్‌కిన్స్ యూనిట్‌కు రూ.5 ల‌క్ష‌లు, ఫోం క్లాత్ బెడ్స్ యూనిట్‌కు రూ.10 ల‌క్ష‌లు అందించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ యూనిట్ల ద్వారా 75 మందికి ఉపాధి ల‌భిస్తుంద‌న్నారు. కెన‌రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా బ్యాంకులు రుణ స‌హాయం అందించిన‌ట్లు జాయింట్ తెలిపారు. స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి సూక్ష్మ ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహ‌క కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా జేసీ జి.రాజ‌కుమారి అధికారుల‌కు సూచించారు. కార్య‌క్ర‌మంలో సిడ్బీ ఏజీఎం (న్యూఢిల్లీ) దినేష్ ప్ర‌సాద్‌, మెప్డా సీఎండీ, సీఈవో ఎస్‌.జ‌గ‌న్నాథ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2020-12-23 19:58:30

నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలే..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆదేశించారు. దీనికోసం రెండు రోజుల్లో స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని ఆయ‌న సూచించారు. సాగునీటి ప్రాజెక్టు ప‌నుల‌పై ఆయ‌న క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో బుధ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ మాట్లాడుతూ, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, మైన‌ర్ ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, భూసేక‌ర‌ణ‌, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమ‌లు త‌దిత‌ర అంశాల‌ను ఆయా ప్రాజెక్టుల వారీగా వివ‌రించారు. విజ‌య‌న‌గ‌రం లాంటి జిల్లాకు సాగునీరు, వ్య‌వ‌సాయం అత్యంత ప్రాధాన్య‌తాంశాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డానికి మంత్రి బొత్స సంపూర్ణ స‌హ‌కారాన్ని అందిస్తున్నార‌ని చెప్పారు.           మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర‌మైన జాప్యం జ‌రుగుతోంద‌ని, ఇరిగేష‌న్ అధికారుల‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం ఎంతో సానుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ, ప్రాజెక్టులు ఏమాత్రం ముందుకు సాగ‌డం లేద‌ని అన్నారు. తోట‌ప‌ల్లి ప్రాజెక్టుకు సంబంధించి గ‌తంలో త‌న హ‌యాంలోనే సుమారు 80శాతం ప‌నులు పూర్తి అయ్యాయ‌ని, గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌రో 12 శాతం ప‌నులు జ‌రిగాయ‌ని, మిగిలిన ప‌నుల‌ను ఎప్ప‌టికి పూర్తి చేస్తార‌ని ప్ర‌శ్నించారు. తార‌క‌రామ తీర్ధ‌సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో కూడా అధికారులు నిర్లిప్త‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని అన్నారు. జిల్లాలో మేజ‌ర్‌, మైన‌ర్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు సంబంధించి ఏమైనా స‌మ‌స్య‌లుంటే, జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న‌ ముఖ్య‌మంత్రి దృష్టిలో పెట్టి ప‌రిష్క‌రించుకొనేందుకు  రెండు రోజుల్లో స‌మ‌గ్ర నివేదిక త‌యారు చేయాల‌ని మంత్రి ఆదేశించారు.            ఈ స‌మావేశంలో ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎంఎల్ఏ బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ ఖ‌రే, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, వైఎస్ఆర్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్లు, వివిధ ప్రాజెక్టుల ఎస్ఇలు, ఇఇ లు, డిఇలు పాల్గొన్నారు. 

Vizianagaram

2020-12-23 19:55:15

కరోనా నుంచి కోలుకున్న 30 మంది డిశ్చార్జ్..

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో  ప్రత్యేక కేంద్రాల నుంచి  30 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో  కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు బుధవారం 30 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని  సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లోఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు నిర్ధేశించిన మందులు, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కాచిచల్లార్చిన నీరు త్రాగడం, ఆకుకూరలు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిని జాగ్రత్తగా చూడాలన్న కలెక్టర్ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు, తరువాత సబ్బుతో 30 సెకెండ్లపాటు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. లేదంటే నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని కలెక్టర్ గంధం చంద్రడు సూచించారు.

Anantapur

2020-12-23 19:43:44

2రోజుల్లో జగనన్నతోడు పూర్తికావాలి..

అనంతపురం జిల్లాలో రెండు రోజుల్లోగా జగనన్న తోడు, వైయస్సార్ బీమా, పిఎం స్వానిధి పథకాల కింద పెండింగ్లో ఉన్న లబ్ధిదారుల దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి వెంటనే వారికి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం డిఆర్డిఎ పిడి నరసింహారెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ కామమూర్తి, జిల్లాలోని ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ లతో జగనన్న తోడు, వైయస్సార్ బీమా, పిఎం స్వానిధి తదితర పథకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా జగనన్న తోడు, వైయస్సార్ బీమా, పిఎం స్వానిధి తదితర పథకాలను ప్రారంభించిందన్నారు.  ఆయా ప్రభుత్వ పథకాల కింద ఎవరికైతే రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందో వారికి ఖచ్చితంగా రుణాలు ఇవ్వగలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో వైయస్సార్ బీమా కు సంబంధించి ప్రభుత్వం ఎంతో బాధ్యతగా ప్రీమియం, బీమా సౌకర్యం కల్పించేందుకు, జగనన్న తోడు కింద అర్హులైన వారికి రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోగా, బ్యాంకర్లు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్పందించడం లేదని, దీని ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్నారు.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 70 బ్రాంచ్ లలో 30కి పైగా బ్రాంచ్ లలో ఇప్పటివరకూ ఒకరికి కూడా రుణాలు మంజూరు చేయలేదని, మొత్తం 12 వేల దరఖాస్తులలో 8 వేల వరకు దరఖాస్తులు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే రెండు రోజుల్లోగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయా బ్యాంకు మేనేజర్ల పై ఉందన్నారు. కొన్ని బ్రాంచ్ లలో లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసినా వాటిని జగనన్న తోడు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లేదని, వెంటనే అప్లోడ్ చేసేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, రాయదుర్గం ఎస్బిఐ బ్రాంచ్ లలో ఎక్కువగా పెండింగ్లో దరఖాస్తులు ఉన్నాయని వెంటనే దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అలాగే లబ్ధిదారులకు సంబంధించి లోన్ అకౌంట్ క్రియేట్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టడం లేదని,  అధికారులు ప్రత్యేక దృష్టి సారించి లోన్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నారు. అలాగే పిఎం స్వానిధి పథకం కింద అర్హులైన చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Anantapur

2020-12-23 19:40:53

ప్రజాసేవలో అనంతజిల్లా ముందుండాలి..

ప్రజలకు సేవలు అందించడంలో ఆనంతపురాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపే విధంగా పంచాయితీ విస్తరణ అధికారులు, మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు పని చేయాలని  జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కోరారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో పంచాయతీ విస్తరణ అధికారులు, మేజర్ గ్రామ పంచాయితీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. వచ్చే మార్చిలోగా ఇంటి పన్నుల బకాయిల వసూలు పూర్తి చేసి సత్తా చాటాలని  ఉద్యోగులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ కాలనీల పేర్లు మార్పుకు సంబంధించి కాలనీ వాసులు అభిప్రాయ వ్యక్తీకరణకు చర్యలు తీసుకోవాలని అదేశించారు. మంచి నీటి సరఫరా, ఈ- సర్వీసులు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  ఉద్యోగులు అలసత్వాన్ని దరిచేయనీయకుండా పనిచేయాలని విజ్ఞప్తి చేసారు. పై అధికారుల పర్యవేక్షణతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలు అందించడం అలవర్చుకోవాలన్నారు. జీరో పెండెన్సీ లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని పంచాయతీ విస్తరణ అధికారులు, మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులను డీపీవో పార్వతమ్మ కోరారు. 

Anantapur

2020-12-23 19:38:00

ఇళ్లపట్టాల కార్యక్రమం విజయవంతం కావాలి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్  చంద్ అధికారులను కోరారు. బుధవారం నాడు ఆయన ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం పై నియోజకవర్గం ప్రత్యేక అధికారులు, తాహశీల్దారులతో వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి జనవరి 7వ తేదీ వరకు మండలాలు, గ్రామాల వారీగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని షెడ్యూలు చేసుకోవాలని తెలిపారు. శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అన్ని లేఅవుట్ లలో లెవలింగ్ పనులు, అంతర్గత రోడ్ల ఏర్పాటు సక్రమంగా వుండేలా చూసుకోవాలని  తెలిపారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వారి సంబంధిత నియోజకవర్గంలోని తాహశీల్దారులతో  కార్యక్రమ నిర్వహణ పై  ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ సమస్యలను పరిష్కరించాలని కోరారు.  వి.ఆర్.ఒ.లు, వి.ఆర్.ఎ.లు., గ్రామ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు అందరినీ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములను చేయాలని కోరారు. అన్ని లేఅవుట్ ల వద్ద బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, లబ్దిదారుల జాబితాను, అనర్హుల జాబితాను  సిద్థంగా వుంచుకోవాలని తెలిపారు.  డిసెంబరు 15వ తేదీ వరకు వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన వారందరికి ఇళ్లపట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, వచ్చిన ప్రతి దరఖాస్తును 90 రోజులలోగా  పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను ఇస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు యం.వేణుగోపాల్ రెడ్డి,  పి.అరుణ్ బాబు, డి.ఆర్.ఒ.ప్రసాద్, డ్వామా పి.డి.సందీప్, హౌసింగ్ పి.డి. శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-23 19:09:00

ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్..

వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయకు చేరుకున్నారు. బుధవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఇడుపులపాయకు చేరుకున్నారు. కడప ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కి డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ , ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి , ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి , విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు , ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి , రఘురామి రెడ్డి , మేడా మలికార్జున రెడ్డి, సుధీర్‌ రెడ్డి , కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి , ఎమ్మెల్సీ జకియా , కత్తి నరసింహ రెడ్డి , మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి , స్థానిక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

Kadapa Airport

2020-12-23 19:03:54

ఇక హార్టికల్చర్ 2ఏళ్ల డిప్లమా కోర్సు..

విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లో హార్టికల్చర్ ఒక సంవత్సరం డిప్లొమా కోర్సును విద్యార్థుల అభ్యర్ధన మేరకు వీసీ ఆచార్య టివి కట్టిమని ఆదేశాల మేరకు డిప్లొమాకోర్సుగా మార్పుచేసినట్లు  యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్, ఇంచార్జి రిజిస్ట్రార్ ప్రోఫెసర్ హనుమంతు లజిపతిరాయి తెలియజేశారు. బుధవారం విద్యార్థుల అభ్యర్ధన మేరకు వీసీ ప్రోఫ్రీసర్ టివి కట్టిమని ఆదేశాల ఆదేశానుసారం కోర్సుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డ్ ఆఫ్ స్టడీస్  మెంబెర్లు  ఏపీ హార్టికల్చర్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ బి ప్రసన్నకుమార్, ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ బి పడాల్, విజయనగరం జిల్లా డైరెక్టర్ ఆర్ శ్రీనివాసరావు సమావేశమై రెండవ సంవత్సరం సిలబస్ రూపొందించారు. ఈ కోర్సు చదివే విద్యార్థులకు జీవనోపాధి, ఉద్యోగావకాశాలు లభించే విధంగా కోర్సును రూపొందించినట్లు చెప్పారు. సమావేశంలో యూనివర్సిటీ అడ్మిన్ ఆఫీసర్ డాక్టర్ ఎన్వివిసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-12-23 19:01:14

పోలీసుకుటుంబానికి నష్టపరిహారం అందజేత..

పోలీసుల కుటంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుంటుందని  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా ఎస్పీ భాస్కరభూషణ్ అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధినిర్వహణలో అనారోగ్యంతో మ్రుతిచెందిన హోంగార్డు  లక్ష్మణ్ కుటుంబానికి రూ.4,12,510 నష్టపరిహారం చెక్కును  అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు జాగ్రత్తతోనే వుంటుందన్నారు. అయినప్పటికీ లక్ష్మణ్ అనారోగ్యంతో మ్రుతిచెందడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి పోలీసుశాఖ తోడు వుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తమను కలవాల్సిందిగా ఎస్పీ బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Nellore

2020-12-23 18:50:42

జాతీయ కమిషన్ సభ్యుల పర్యటన..

జాతీయ బి.సి కమిషన్ గౌరవ సభ్యులు ఆచారి తల్లోజు ఈ నెల 24,25 వ తేదిలలో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త చెప్పారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేషనల్ బి.సి కమిషన్ గౌరవ మెంబర్ ఈ నెల 24 వ తేది గురువారం ఉ. 11.05 ని.లకు తిరుపతి అతిధి గృహo చేరుకుని మ. 12 గం.లకు వివిధ పిటిషన్ లపైన జిల్లా కలెక్టర్, ఎస్.పి, ఆర్.డి.ఓ, బి.సి.వెల్ఫేర్ డిస్పార్ట్మెంట్ మరియు ఇతర సంబందిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తిరుపతిలోని National Sanskrit University వైస్ చాన్సలర్, రిజిష్ట్రార్ మరియు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మ 2.30 గంటలకు ఎస్.వి యూనివర్సిటి లోని కాన్ఫరెన్స్ హాల్ చేరుకొని ఆంధ్రప్రదేశ్ బి.సి.వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్, యూనివర్శిటి బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో సమీక్షా సమావేశం, తదుపరి అదే సమావేశ మందిరం నందు సా.3.30 గంటలకు ఎస్.వి.యూనివర్శిటి వైస్ ఛాన్సలర్, రిజిష్ట్రార్ మరియు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గం. తిరుమల చేరుకొని రాత్రి బస చేస్తారు. 25 వ తేది శుక్రవారం ఉ. 5 గంటలకు శ్రీవారిని దర్శించుకొని తిరుపతి అతిథి గృహం చేరుకుని ఉ. 8గం.లకు టిటిడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఉ.9.30 గం.లకు తిరుపతి అతిథి గృహం నుండి బయలుదేరి ఉ.11.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అవుతారని జిల్లా కలెక్టర్  తెలిపారు. 

Chittoor

2020-12-23 18:34:18

ఆర్ఆర్ఆర్ పథకం జాబితా సిద్ధం చేయాలి..

అనంతపురం జిల్లాలో  జనవరి 5వ తేదీ లోపు జిల్లాలోని అన్ని చెరువులను  ఆర్.ఆర్.ఆర్ పథకం కింద అమలయ్యే విధంగా  జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు.  బుధవారం స్థానిక కలెక్టరేట్లోని  మినీ కాన్ఫరెన్స్ హాల్ లో  ఆర్.ఆర్ ఆర్  పథకం  అమలుపై  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన  డి ఎల్ సి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  మైనర్ ఇరిగేషన S.E సుధాకర్,  DWMA పి డి  వేణుగోపాల్,  సంబంధిత ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలోని అన్ని చెరువులను  ఆర్ ఆర్ ఆర్ పథకం కింద  అమలయ్యే విధంగా  జాబితా  సిద్ధం చేయాలని అందుకు  డివిజన్ మైనర్ ఇరిగేషన్  ఇంజనీర్లు. మరియు  గ్రౌండ్ వాటర్,  dwma, ఆర్డబ్ల్యూఎస్,  అధికారుల  సంయుక్త  పర్యవేక్షణలో  కార్యక్రమాలను చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. అన్ని నియోజకవర్గంలోని చెరువులను కూడా  గుర్తించాలని తెలిపారు. 5  హెక్టార్ల నీటితో నింపబడిన భూమి కలిగిన చెరువును గుర్తించాలని తెలిపారు.   చెరువుల నీటి సామర్థ్యం తదితర వివరాలన్నీ  సేకరించి వలెనని కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ఈ పథకంపై  అమలుకు  ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు  తెలిపారు.  జిల్లాలోని చెరువుల సమగ్రాభివృద్ధి కొరకు  ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆర్ఆర్ పథకం కింద జిల్లా ఆమోదం పొంది.   ఆమోదంపొందిన తర్వాత స్టేట్ లెవెల్ కమిటీ కి  సిఫార్సు   చేయడంజరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకం అమలుపై సంబంధిత  ఇంజనీర్లతో  టెలికాం  కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.    ఈ కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ అధికారి తిప్పేస్వామి, మైనర్ ఇరిగేషన్ డిప్యూటీ S.E. రామకృష్ణయ్య, డివిజన్ మైనర్ ఇరిగేషన్  ఇంజనీర్లు  నారాయణ నాయక్, హరినాథ్, వెంకట రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2020-12-23 18:32:38

విజిలెన్స్ ఏఎస్పీగా జి.స్వరూపారాణి..

రీజనల్ విజిలెన్స్ ఇంచార్జ్ అడిషల్ ఎస్పిగా జి.స్వరూపరాణిని ప్రభుత్వం నియమించింది. ఈమేరకు విశాఖలోని ఎంవీపీకాలనీలోని కార్యలయంలో ఆమె బుదవారం బాధ్యతలు స్వీకరించారు. 2012 బ్యాచ్ కు చెందిన ఆమే శ్రీకాకుళం, పాలకొండ , హైదరాబాద్ , గుంటూరు తదితర జిల్లాల్లో డిఎస్పి గా విధులు నిర్వహించారు. అనంతరం 2019 లో విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ ఏసిపి గా పనిచేశారు. ముఖ్యంగా మహిళలకు చట్టాలపై అవగహన కల్పించటం, మహిళల ఫిర్యాదులపై తక్షణం స్పందించడం, తదితర వాటిలో కీలకంగా వ్యవహరించేవారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సేవలు పక్కదారి పట్టినా, నాణ్యత లోపించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటించని హొటళ్లు, రెస్టారెంట్లు, మిల్లర్లుపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు చైతన్యవంతంగా ఉండి తప్పులను దైర్యంగా పోలీసులకు చెప్పేలా తయారు కావాలన్నారు. ఈమేరకు బాద్యతలు స్వీకరించి ఆమేకు విజిలెన్స్ అదికారులు పుష్ప గుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా కలిసిఅభినందనలు తెలియజేసారు. 

ఎంవిపీ కోలనీ

2020-12-23 18:04:49

ఆరోగ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం..

 విద్య‌, వైద్యం ప్ర‌భుత్వానికి రెండు క‌ళ్లులాంటివ‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఆరోగ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థాప‌నే మ‌ఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ల‌క్ష్య‌మ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. గ‌జ‌ప‌తిన‌గ‌రంలో ఎపి వైద్య విధాన‌ప‌రిషత్, ఎపిఎంఎస్ఐడిసి ఆధ్వర్యంలో స‌మారు రూ.17కోట్ల‌తో నిర్మితం కానున్న 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రికి బుధ‌వారం మంత్రి శంకుస్థాప‌న చేశారు.  ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ వైద్య రంగానికి ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్య‌తనిస్తోంద‌ని అన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో సుమారు రూ.653కోట్ల‌తో వివిధ ఆసుప‌త్రులు నిర్మాణం, అభివృద్ది జ‌ర‌గ‌నుంద‌ని తెలిపారు. గ‌జ‌ప‌తిన‌గ‌రంలో 30 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిని 100 ప‌డ‌క‌ల‌కు పెంచుతున్న‌ట్లు చెప్పారు. అదేవిదంగా ఈ ఆసుప‌త్రిలో 5గురు డాక్ట‌ర్లు, ఆరుగురు సిబ్బంది ఉండేవార‌ని, ప్ర‌స్తుతం 16 మంది డాక్ట‌ర్ల‌ను, 24 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి నిర్మాణం పూర్త‌యితే, మ‌రో ఐదుగురు సివిల్ స‌ర్జ‌న్లు, ఒక ఆర్ఎం, ఒక మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, డిప్యూటీ స‌ర్జ‌న్ వ‌స్తార‌ని చెప్పారు. సాలూరులో  ప్ర‌స్తుత‌మున్న ‌30 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిని రూ17కోట్ల‌తో 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి స్థాయికి పెంచుతామ‌ని, అలాగే ఎస్‌.కోట ఆసుప‌త్రిని రూ.12.6కోట్ల‌తో 50 నుంచి 100 ప‌డ‌క‌ల‌కు, కురుపాంలో 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు, బాడంగిలో 30 ప‌డ‌క‌లు నుంచి 50 ప‌డ‌క‌ల‌కు, భ‌ద్ర‌గిరిలో 30 నుంచి 50 ప‌డ‌క‌లకు, రూ.9కోట్లు చొప్పున వెచ్చించి ఆయా ఆసుప‌త్రుల స్థాయిని పెంచ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా పార్వ‌తీపురంలో 100 నుంచి 150 ప‌డ‌క‌ల‌కు పెంచి,  సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిగా అభివృద్ది చేస్తామ‌ని, నెల్లిమ‌ర్ల‌, భోగాపురం, బొబ్బిలి ఆసుప‌త్రుల‌ను కూడా అభివృద్ది చేయ‌నున్నామ‌ని మంత్రి చెప్పారు.                 ప్ర‌తీ పార్ల‌మెంటు స్థానంలో ఒక సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి ఉండాల‌న్ని ప్ర‌భుత్వ నిర్ణ‌య‌మ‌న్నారు. విజ‌య‌న‌గ‌రంలో సుమారు రూ.500 కోట్ల‌తో నిర్మించ‌నున్న‌ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌కు త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న చేయ‌నున్నార‌ని తెలిపారు. పార్వ‌తీపురం, భ‌ద్ర‌గిరిలో శిశు ఆరోగ్య కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నామ‌ని, విజ‌య‌న‌గ‌రంలో రూ.1.96 కోట్ల‌తో సెంట్ర‌ల్ డ్ర‌గ్‌స్టోర్‌ను అభివృద్ది చేయ‌నున్నామ‌ని తెలిపారు. అదేవిధంగా అన్ని ర‌కాల మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించి, మున్సిప‌ల్ ప్రాంతాల్లో 355 అర్బ‌న్ క్లీనిక్స్‌ను కొత్త‌గా నిర్మించ‌నున్నామ‌ని చెప్పారు. మ‌రో 205 ఆసుప‌త్రుల‌ను అభివృద్ది చేసి, రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 560 అర్బ‌న్ క్లీనిక్స్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు మంత్రి వెళ్ల‌డించారు. ప్ర‌జా సంక్షేమం ప‌ట్ల చిత్త‌శుద్ది, అంకిత‌భావం, ప‌ట్టుద‌ల ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డికి ఉన్నాయ‌ని, ప్ర‌జ‌ల‌కు ఆరోగ్యాన్ని అందించ‌డ‌మే ప్ర‌భుత్వ బాధ్య‌త‌గా ఆయ‌న కృత‌నిశ్చ‌యంతో ఉన్నార‌ని మంత్రి బొత్స పేర్కొన్నారు.                  విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి త‌న పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌న్నీ అతికొద్ది కాలంలోనే నెర‌వేర్చార‌ని అన్నారు. గ్రామ స‌చివాల‌యాలు, వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసి, ప‌రిపాల‌న‌లో కొత్త సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌లికార‌ని కొనియాడారు.                   గ‌జ‌ప‌తిన‌గ‌రం శాస‌న‌స‌భ్యులు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు ఏది చెప్పినా, చేసి తీరుతార‌ని స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి,  తాను  పాద‌యాత్ర‌చేస్తూ గ‌జ‌ప‌తిన‌గ‌రం వ‌చ్చినప్పుడు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్దానం ప్ర‌కారం, వంద ప‌డ‌క‌ల ఆసుప‌త్రికి శంకుస్థాప‌న జ‌రిగింద‌ని, ఏడాదిలోగా దీని నిర్మాణం పూర్తి అవుతుంద‌ని చెప్పారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో కూడా ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కింద‌న్నారు.                   ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్, ఎంఎల్‌సి పెనుమ‌త్స సురేష్‌బాబు, ఎంఎల్ఏలు పీడిక రాజ‌న్న‌దొర‌, క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ఆరుణాదేవి, ఎపిఎంఎస్ఐడిసి ఇఇ స‌త్య‌ప్ర‌భాక‌ర్‌, తాశీల్దార్ ఎం.అరుణ‌కుమారి, ఎంపిడిఓ కె.కిశోర్‌కుమార్‌, ఇత‌ర అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

2020-12-23 17:18:54

పక్కా కొలతలతో నిత్యవసర సరుకులు..

లబ్ధిదారుల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని కొందరు మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికే అమ్ముతున్నారని ఒక్కప్పుడు 30శాతం మాత్రమే ఉన్న రీసైక్లింగ్‌ వ్యాపారులు నేడు రెట్టింపైనట్లు అందుకే వాటి నివారణకు పౌర సరఫరాల విభాగంలో నూతన విధానం మొదలు కానుందని పేద ప్రజలకు అందాల్సిన నిత్యావపర సరుకుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం ఇకపై జాగ్రత్త వహించనుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. బుధవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్ద వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి స్వయంగా అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని తక్షణ పరిష్కారం సూచించారు. తొలుత మచిలీపట్నం పరాసుపేటకు చెందిన ఫిరాజున్నిసా అనే మహిళ మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పుకొంది. తాము బ్యాంకు నుండి గృహ సంబంధిత రుణం తీసుకొనేందుకు ఐ టి రిటర్న్స్ దాఖలు చేశామని, ఇప్పుడు తమకు అమ్మఒడి డబ్బులు రావడం లేదని, తమ పాప విద్యా దీవెన డబ్బులు రావడం లేదని అలాగే స్థలాలకు దరఖాస్తు చేసుకొన్నా అవి దక్కలేదని తమకు కనీసం రేషన్ కార్డు సైతం మంజూరు కాలేదని ఆ మహిళ వాపోయింది. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నవశకం పేరుతో గ్రామాల్లో వలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించిందని ఆమెకు గుర్తు చేశారు. ఇంటింటికీ వెళ్లి తెల్ల రేషన్‌ కార్డులు ఉన్న లబ్ధిదారుల సమగ్ర సమాచారాన్ని సేకరించారన్నారు . నాలుగు చక్రాల వాహనం ఉన్నా..ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, ఐదు ఎకరాల భూమి ఉన్నా, ఆదాయ పన్ను ( ఐ టి ) కడుతున్న తెల్ల రేషన్‌ కార్డుదారులందరినీ ఆ సర్వేలో గుర్తించి వారి జాబితాను పౌర సరఫరాల శాఖకు అందించారని తెలిపారు. గతంలో రేషన్‌షాపుల నుంచే బియ్యాన్ని దారి మళ్లించగా, ఇప్పుడు వ్యాపారులు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారని ఆ సేకరించిన బియ్యాన్ని రైస్‌మిల్లులకు తరలించి రీసైక్లింగ్‌ చేసి సన్నబియ్యంగా అమ్మకాలు సాగిస్తున్నారు. వాహనాల్లో తరలిస్తుండటంతో రేషన్‌ బియ్యం పోలీసులకు తరుచూ పట్టుబడుతున్నాయి.గ్రామాల్లో కొందరు లబ్ధిదారులు దొడ్డుగా ఉన్న రేషన్‌ బియ్యం తినలేక చిన్న వ్యాపారులకు కిలోకు రూ.6 నుంచి రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. వారు ఆయా ప్రాంతాల్లో బియ్యం దందా చేసే పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గంలో మహారాష్ట్ర, హైదరాబాద్‌ పరిసరాల్లోని కోళ్లఫారాలకు సైతం తరలిస్తున్నారాని చెప్పారు. అక్కడ మిల్లర్లకు కిలోకు రూ.22కు విక్రయిస్తున్నారు. అంటే దళారులు కిలోకు రూ.16 నుంచి రూ.12 వరకు లాభం పొందుతున్నారు. అయితే గ్రామాల్లో నుంచి మిలర్ల వద్దకు తరలించేందుకు వ్యాపారులు కొత్త మార్గాలనే అనుసరిస్తున్నారు. ఈ దందాలో రోజువారీ కూలీల నుంచి బడా వ్యాపారుల వరకు ఉన్నారు. రెండు మూడు క్వింటాళ్లు సేకరించి బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నారు. రేషన్‌ బియ్యం అనేది గుర్తుపట్టకుండా ప్రముఖ బ్రాండెడ్‌ బ్యాగుల్లో నింపి రవాణా చేస్తున్నట్లు వివరించారు. ఈ తరహా మోసాలను నివారించేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాలను ఇకపై పటిష్టంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారునికి రేషన్ ఇచ్చిన సమయంలో లబ్ధిదారు మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వలంటీర్లు ట్యాబ్ లో ఎంటర్ చేస్తే సరుకులు డెలివరీ ఇచ్చినట్లు లెక్క అని మంత్రి పేర్ని నాని వివరించారు. ప్రభుత్వం నూతన ఏడాది నుంచి రేషన్ సరుకుల డోర్ డెలివరీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులకు సబ్సిడీపై ప్రభుత్వం వాహనాలను మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Machilipatnam

2020-12-23 17:17:09