క్రిష్ణాజిల్లా ఉయ్యూరులోని ఆంధ్రాబ్యాంక్ కార్యాలయం ముందు పారిశుద్ధ్య సిబ్బంది రుణాలు ఇవ్వలేదన్న కోపంతో చెత్తవేయడంపట్ల కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరు కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టరు ఇంతియాజ్ బ్యాంకు అధికారులతో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ వై.యస్.ఆర్. చేయూత, జగనన్నతోడు పధకాల క్రింద ఉయ్యూరు ఆంధ్రాబ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారని కలెక్టరు చెప్పారు. ఈచర్యపట్ల తాను తీవ్రంగా బాధపడుతున్నానని బ్యాంకు అధికారులకు కలెక్టరు చెప్పారు. జిల్లాలో బ్యాంకులు, అధికారులు కలిసి ప్రజలకు మేలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని చెప్పారు. జిల్లాలో రుణాలు కల్పించడంలో బ్యాంకులు జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కలెక్టరు కోరారు. బ్యాంకుల సమన్వయకర్తలు, బ్యాంకు మేనేజర్లు, బ్యాంకుల సిబ్బంది అందరూ పేదలకు రుణాలు ఇవ్వడంలో తమ వంతు తోడ్పాటు అందించాలని కలెక్టరు కోరారు. ఇకపై ఇలాంటి చర్యలు పునరావృతం కావని కలెక్టరు బ్యాంకర్లకు చెప్పారు.
నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కోసం కృష్ణాజిల్లాలో 3,33,136 మంది లబ్దిదారులను గుర్తించామని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ అన్నారు. కలెక్టరు క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం పాత్రికేయుల సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ కృష్ణౌజిల్లాలో శుక్రవారం వేడుకగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల పరిధిలో చేపడుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇళ్లపట్టాలు కోసం 2 లక్షల 73 వేల 940 మంది లబ్దిదారులను గుర్తించామన్నారు. టిడ్కో లబ్దిదారులు 26 వేల 960 మంది, జియస్డబ్ల్యుయస్ లబ్దిదారులు 2192 మందిని గుర్తించామన్నారు. ఇళ్లపట్టాల స్ధలాలకోసం 6051.37 ఎ కరాల స్ధలాన్ని సేకరించామని, ఇందులో ప్రభుత్వ భూమి 1864.50 ఎ కరాలు, పట్టాభూమి 4186.87 ఎ కరాలు ఉందన్నారు. ప్రభుత్వ భూమిలో 897, పట్టాభూముల్లో 610 లేఅవుట్లను సిద్ధం చేశామన్నారు.
ఇబ్రహీంపట్నంలో జరిగే కార్యక్రమంలో మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, తాను, జాయింట్ కలెక్టరు పాల్గొనడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఒక పెద్ద వేడుకగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.అర్హత ఉన్న లబ్దిదారులందరికీ ఇళ్లు, ఇళ్ల స్ధలాలు మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆదిశలో అడుగులు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈవిలేఖరుల సమావేశంలో జాయింట్ కలెక్టరు డా. కె. మాధవిలత, సబ్ కలెక్టరు హెచ్.యం. థ్యానచంద్ర, డిఆర్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో డిసెంబరు 25 వతేదీ నుంచి జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ పండగ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. జిల్లాలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ఇళ్ల పట్టాల పంపిణీ పండగ కార్యక్రమం గురించి గురువారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ లో జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 25 నుంచీ జనవరి 7 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 2,19,552 మంది లబ్ధిదారులుండగా, అందులో 1045 లేఔట్లలో 1,23,961 ప్లాట్లకుగాను 1,23,961 లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలు, టిడ్కో కింద మరో 15,525 పట్టాలు, ఇప్పటికే సొంత స్థలం ఉన్నవారికి అందజేసే పొజిషన్ సర్టిఫికెట్లను 79,860 మంది లబ్ధిదారులకు, రిజిస్టర్ అండర్ జీవో ఎంఎస్ నెంబర్ 463 కింద 194 మంది, రిజిస్టర్ అండర్ 11 ఆఫ్ 2019 కింద 12 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. అయితే 5471 పట్టాలకు సంబంధించి కోర్టు స్టే ఇచ్చినందువల్ల ఈనెల 25వ తేదీన శుక్రవారం మిగిలిన 2,14,081 మందికి పట్టాల పంపిణీ చేయనున్నామన్నారు.
అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 94,114 మంది లబ్ధిదారులు అర్హులుగా ఉండగా, ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో 28,053 మంది, పెనుగొండ నియోజకవర్గం పరిధిలో 39,104 మంది, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలో 28,602 మంది, కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో 29,679 మంది లబ్ధిదారులతో కలుపుకొని మొత్తం జిల్లాలో 2,19,552 మంది లబ్ధిదారులు అర్హులుగా ఉన్నారన్నారు. అందులో 5471 మంది లబ్ధిదారులకు సంబంధించి కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని, జిల్లాలో మిగిలిన 2,14,081 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
అందులో అనంతపురం నియోజకవర్గ పరిధిలో మొత్తం 28,504 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే సింగనమల నియోజకవర్గ పరిధిలో 13,408 మందికి, తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో 13,929 మందికి, గుంతకల్ పరిధిలో 18,741 మందికి, ఉరవకొండ పరిధిలో 13,033 మందికి, కళ్యాణదుర్గం పరిధిలో 12,343 మందికి, రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో 14,268 మందికి, పెనుకొండ పరిధిలో 13,117 మందికి, హిందూపురం పరిధిలో 12,911 మందికి, మడకశిర పరిధిలో 12,937 మందికి, ధర్మవరం పరిధిలో 17,666 మందికి, రాప్తాడు పరిధిలో13,653 మందికి, కదిరి పరిధిలో 11,398 మందికి, పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలో 18,173 మంది అర్హులైన లబ్ధిదారులను కలుపుకొని జిల్లాలో మొత్తం 2,14,081 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో పేదలందరికీ ఇల్లు కింద ఇంటి పట్టాల పంపిణీ కోసం 2894.59 ఎకరాల భూమిని సిద్ధం చేయగా, అందులో 2029.67 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, మిగిలిన 865 ఎకరాలకు పైగా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇంటి స్థలాల పంపిణీ కోసం 150.26 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంటి పట్టాల కోసం సిద్ధం చేసిన లేఔట్ లలో బుస్ క్లియరెన్స్, మొక్కలు నాటడం, రాళ్లు పాతడం, అంతర్గత రోడ్ల నిర్మాణం తదితర అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టి 100 శాతం లేఔట్ లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు కేటాయించడం జరిగిందని తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలకు, ఆశయాలకు రూపునిచ్చే విధంగా కులాలు, మతాల విభజనను చెరిపేస్తూ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ లేఔట్లలో పేదలకు ప్లాట్లను అందిస్తున్నామన్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ప్లాట్ల స్థలాల మార్పులు, చేర్పులకు అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించమన్నారు. ప్లాట్లను తెలిసినవారితో, తెలియని వారితో ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు ఉండవన్నారు. ప్రతి లేఔట్ వద్దా లబ్ధిదారులతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పారదర్శకత తీసుకొస్తామన్నారు. విశాలమైన రోడ్లు, పచ్చదనం నిండేలా మొక్కలతో ఆహ్లాదకరమైన లేఔట్లను ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. హౌసింగ్, డ్వామా మరియు మునిసిపల్ నిధులు ఉపయోగించి భూముల అభివృద్ధి చేశామన్నారు.
ఇంటిగ్రేటెడ్ లేఔట్లు ఎలా ఉండనున్నాయో కలెక్టర్ వివరించారు. లేఔట్ ఫ్లెక్సీలో అర్హుల వివరాలను వర్గాల వారీగా రంగుల్లో తెలపనున్నామన్నారు. లేఔట్ ఫ్లెక్సీలలో జనరల్ అర్హులకు రాణీ రంగు, బీసీలకు ఆకుపచ్చ రంగు, ఎస్సీలకు నీలం రంగు లేఔట్లు, ఎస్టీలకు పసుపు పచ్చ రంగులు కేటాయించామన్నారు. ఎరుపు రంగులో ప్రభుత్వ అభివృద్ధి పనులకు కేటాయించిన భూమి కనిపిస్తుందన్నారు. ఫ్లెక్సీలు చూస్తే అన్ని రంగులూ కలిసిపోయి ఉంటాయనీ.. ఆ రకంగా కులమతాల హద్దులు చేరిపేయనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
నియోజక వర్గం వారీగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలతో పాటూ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పట్టాల పంపిణీ పండగ నిర్వహిస్తామన్నారు. అవినీతికీ, మధ్యవర్తులకూ తావు లేకుండా అర్హులందరికీ స్థానిక ప్రజాప్రతినిథి చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేయనున్నామన్నారు. ఈ డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. శుక్రవారం రోజు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల చేత కార్యక్రమం ప్రారంభమవుతుందని, ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్న కార్యక్రమం అనంతరం ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఒక నియోజకవర్గానికి ఒక స్పెషల్ అధికారి నియమించామని వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో తృతీయ సంత్సర విద్యార్థి చుక్కల పార్థసారథి రాష్ట్ర స్థాయి ఉత్తమ జాతీయ సేవా పథకం (NSS) వాలంటీర్ అవార్డు కు ఎంపికయ్యాడు. సుమారు 2 లక్షల యాభైవేల మంది వాలంటీర్లు వున్న ఆంధ్ర రాష్ట్రంలో 9 మంది లో ఒకరుగా ఎంపిక అవ్వటం ఒక గొప్ప విషయం అని యూనివర్శిటీ ఉప కులపతి ఆచార్య ఆర్.సుదర్శన రావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పార్థసారధిని అయన అభినందించారు. రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ, నిబద్దతతో కష్టపడే వారి కష్టానికి గుర్తింపు ఉంటుందని.. అందుకు పార్థసారథి చక్కని నిదర్శనమన్నారు. కోవిడ్ వుధృతంగా ప్రబలుతున్న సమయం లో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపట్టాడని అన్నారు. ఈ సందర్భముగా చుక్కల పార్థసారధిని రెక్టార్ ఆచార్య యం.చంద్రయ్య రిజిస్ట్రార్ డా.యల్ విజయ కృష్ణా రెడ్డి, NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం కృష్ణ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం పి కృష్ణారెడ్డి , పి. చంద్ర శేఖర్ రెడ్డిలు అభినందించారు.
విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ దేవుడి మీద ప్రమాణం చేస్తానని సవాల్ విసిరినట్టుగా మీడియాలో చూశాను. రామకృష్ణ తామంతా కలిసి చంపేసిన వంగవీటి మీద అయినా ప్రమాణం చేయగలడు, చంద్రబాబు వల్ల మరణించిన ఎన్టీఆర్ మీద అయినా ప్రమాణం చేయగలడు, తన భార్య మీద అయినా ప్రమాణం చేయగలడు, తన పిల్లల మీద అయినా ప్రమాణం చేయగలడు అంటూ ఘాటుగా స్పందించారు. ఎందుకంటే, దేవుడు అంటే నమ్మకం లేదు, పాప భీతి లేదు కాబట్టే, వంగవీటి హత్య తర్వాత విశాఖకు పారిపోయి వచ్చాడని విమర్శించారు. విశాఖ వచ్చిన వెలగపూడి ఏం చేశాడంటే.. భూములు మేశాడు, పీకలు కోశాడు అని అనేక మంది చెబుతున్నారు అంటూ మండి పడ్డారు. ఈయనకు బినామీ భూములు లేవని ప్రమాణం చేస్తాడా..?, బినామీ భూములు లేకపోతే ఎందుకు ఉలికిపాటుకు గురి అవుతున్నాడు, ఎందుకు తన ఆస్తులన్నీ పోయినట్టు బాధపడుతున్నాడు?. తనకు ఒక్క అంగుళం భూమి కూడా లేకపోతే బదులు తీర్చుకుంటానని ఎందుకు ప్రగల్భాలు పలుకుతున్నాడు?. ఈ విషయాలన్నింటికీ అతనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణను ఎవరైనా ధర్మాత్ముడు అనుకుంటారా లేక ఒక గూండా, రౌడీ ఎలిమెంటుగా భావిస్తున్నారా.. ?. రాక్షసత్వం నిండిన వ్యక్తి దేవుడి మీద ప్రమాణం చేయటం ఏమిటి? వినటానికి కూడా వెగటుగా ఉంది అంటూ అసహనం వ్యక్తం చేశారు..
నరేగా లో చేపట్టే పనులు పది కాలల పాటు ప్రజా ఉపయోగంలో వుండాలని పంచాయత్ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. గురువారం ఉదయం శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం సావేరి సమావేశ మందిరంలో రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా ఉపాధి హామీ అధికారులు, సిబ్బందితో ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిధులుగా ఉప ముఖ్యమంత్రి , పంచాయితీరాజ్ శాఖ మంత్రి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ నేను 27 సంవత్సరాలు సమితి అధ్యక్షులుగా పనిచేశానని ఇంత నిధులు, అభివృద్ధి, కుటుంబాలకు ఆర్థిక సహయం ఎప్పుడూ చూడలేదని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమలు చేస్తున్న విదానం అబివృద్ది నేడు చూస్తున్నానని అన్నారు. జిల్లాలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన చెరువు ఆక్రమణలకు గురై, కాలువలు పూడిపోయాయని వాటిని దృష్టి పెట్టి నీరు నిల్వ ఉండే చర్యలు చేపట్టాలని కోరగా పంచాయితీరాజ్ శాఖ మంత్రి స్పందించి ఏప్రిల్ నుండి ప్రారంభించాలని ఇప్పుడు నీళ్ళు ఉన్నాయని అధికారులకు సూచించారు.
పంచాయితీ రాజ్ శాఖ మంత్రి మాట్లాడుతూ నరేగా పనులలో యంత్రాలు ఉపయోగించరాదని అలా చేస్తే చర్యలు తప్పవని నరేగా పూర్తిగా పేదలకు ఉపాధి కల్పన అని గుర్తించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో గ్రామాలలో రూపురేఖలు మారుతున్న విషయం తెలిసిందేనని, నరేగా అనుసంధానంతో మెటీరియల్ కాంపొనెంట్ ఎక్కువ వాడితే పదికాలాల పాటు శాశ్వత భవనాలు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, పాల కేంద్రాలు వంటివి చేపట్టి అనుకున్న మేరకు మార్చి 2021 కు పూర్తి కావాలని సూచించారు. తాలూకాలు వున్న సమయంలో పనులకోసం 100 కి.మీ. లు ప్రయాణించే వాళ్ళమని ఆ తర్వాత ఎన్.టీ.ఆర్ మండల వ్యవస్థతో దూరం తగ్గడం, నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో గ్రామాల్లోనే ప్రజలు తమ పథకాలు, పనులు పూర్తి చేసుకునే విధంగా సచివాలయాలు వచ్చాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా నరేగా నిధుల ఖర్చుతో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతుంటాయని, మనం మొదటి మూడు స్థానాలలో ఉండాలని కష్టపడితే మొదటి స్థానం రావచ్చని తెలిపారు. జల జీవన్ మిషన్ తో గ్రామాలకు త్రాగు నీరు కార్యక్రమం కోసం కేంద్రం నిధులు ఇచ్చిందని వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు.
నరేగా డైరెక్టర్ చినతాతయ్య, కమీషనర్ గిరిజా శంకర్ లు, నరేగా కౌన్సిల్ సభ్యులు విశ్వనాథ్ ఐదు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించి చేపట్టాల్సిన అత్యవసర పనులను సూచించారు.
ఈ సమీక్షలో మహిళా విశ్వవిద్యాలయ విసి జమున యూనివర్సిటీ లో బయటి డ్రైనేజీ వల్ల ఇబ్బందులు ఉన్నాయని మంత్రికి విన్నవించగా తక్షణమే 1.5 కిమి డ్రైన్ వ్యవస్థ మార్పుకు మంత్రి ఆదేశాలు సంబంధిత అధికారుల కు ఆదేశాలిచ్చారు.
ఈ కార్యశాలలో ఐదు జిల్లాల పి.డి లు చంద్రశేఖర్, శివ ప్రసాద్, తిరుపతయ్య, వేణుగోపాల్ రావు, ఎ.పి.డి లు, సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయ బద్దమైన సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తుందని జాతీయ బి.సి. కమిషన్ గౌరవ సభ్యులు ఆచారి తల్లోజు పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లోని సెనేట్ హాల్ నందు జాతీయ బి.సి. కమిషన్ సభ్యులు యూనివర్సిటీ లోని భోదన మరియు భోధనేతర సిబ్బంది, విద్యార్దులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హాజరైన జాతీయ బి.సి. కమిషన్ గౌరవ సభ్యులు మాట్లాడుతూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బి.సి. కమిషన్ కు రాజ్యాంగ బద్రత కల్పించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బి.సి. లకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నదని తెలిపారు. బి.సి. లకు అన్యాయం జరిగినప్పుడు కమిషన్ అండగా ఉంటుందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీసులతో నేడు ఎస్వి యూనివర్సిటీ కి రావడం జరిగిందన్నారు. బి.సి. విద్యార్దులకు ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం న్యాయం జరుగుతుందా అనే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఎస్వి యూనివర్సిటీ లో బి.సి. విద్యార్దుల సమస్యలను తెలుసుకోవడం కోసమే ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా కమిషన్ ద్రుష్టి కి తీసుకోని రావాలన్నారు. ఎస్వి యూనివర్సిటీ లో బి.సి ల సంక్షేమం కోసం ఒక సెల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మారుమూల ప్రాంతాలలోని బి.సి. లకు కూడా కమిషన్ వున్నదనే విషయాన్ని తెలియజేయాలన్నారు. ఎస్వి యూనివర్సిటీ లో గల లోపాలు ఇతరితర విషయాలు గురించి నా ద్రుష్టి కి తీసుకొస్తే యూనివర్సిటీ వి.సి. ద్రుష్టి కి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి ఒక్కరికి అందాలన్నారు. యూనివర్సిటీ లోని అన్ని విభాగాలలో 27 శాతం బి.సి. లకు రేజేర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. దేశం లోని అన్ని యూనివర్సిటీ ల స్థితి గతులపై అద్వాయణం జరుగుతోందన్నారు.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్వి యూనివర్సిటీ లో 565 సాంక్షన్ పోస్టులు ఉన్నాయని, బి.సి. కులానికి చెందిన 53 మంది అధ్యాపకులు ఉన్నారని అలాగే రెగ్యులర్ వి.సి. కుడా ఉన్నారని, ఎస్వి యూనివర్సిటీ లో రోస్టర్ పాయింట్ కవర్ అవుతూ ఉన్నాదని తెలిపారు. హిస్టరీ డిపార్టుమెంటు లో పి.జి. చేస్తున్న నారాయణ గౌడ్ మాట్లాడుతూ కమిషన్ గౌరవ సభ్యులు మా యూనివర్సిటీ కి రావడం చాల ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బి.సి. ల పక్ష పాతిగా ఉందని తెలిపారు. నాన్ టీచింగ్ లో అధ్యాపకులకు, విద్యార్దులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానన్నారు. బి. సి. ల సమస్యలను కొంత వరకు ఎస్వి యూనివర్సిటీ పరిష్కరిస్తూ ఉందని తెలిపారు. ఎస్వి యూనివర్సిటీ విద్యార్ది డాక్టర్ పొత్తూరి శ్రీకాంత్ మాట్లాడుతూ అందరికి నడక నేర్పించి వ్యక్తి జాతీయ బి.సి. కమిషన్ గౌరవ సభ్యులు ఆచారి తల్లోజు అన్నారు. తిరుపతి పట్టణం ఒక సరస్వతి నిలయం అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న చోట ఎస్వి యూనివర్సిటీ ఉందని తెలిపారు. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఖుస్భు కొఠారి, శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ విద్యార్దులు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయంతో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్) అవగాహన ఒప్పందం చేసుకుంది. గురువారం సాయంత్రం ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్కాయిస్ సంచాలకులు డాక్టర్ టి.శ్రీనివాస కుమార్లు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఆదాయ వనరుగా తీర ప్రాంతం నిలుస్తుందన్నారు. మత్స్యకారులకు ఉపయుక్తంగా పరిశోధనలు జరపడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. విద్యార్థులను, పరిశోధకులను భాగం చేస్తూ నూతన పరిశోధనలు జరపాలని సూచించారు. సామాజిక ప్రయోజన, వాణిజ్య ఉపయుక్తంగా పరిశోధనలు జరపే దిశగా ఆంధ్రవిశ్వవిద్యాలయం పరంగా పూర్తి సహకారాన్ని అందించడం జరుగుతుందన్నారు.
ఇన్కాయిస్ సంచాలకులు డాక్టర్ టి.శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ కోస్టల్ మానిటరింగ్, పరిశోధన భాగస్వామ్యం జరిపే దిశగా ఆంధ్రవిశ్వవిద్యాలయం తగిన సహకారం అందించాలని సూచించారు. సంయుక్త భాగస్వామ్యంలో పరిశోధనలు బలోపేతం చేయడం, సమాజ ఉపయుక్తంగా పరిశోధనలు జరపడం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీనివాస రావు,అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంటర రావు, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, ఆచార్య ఆర్.శివ ప్రసాద్, ఆచార్య క్రిష్ణమంజరి పవార్, ఏయూ సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ బే ఆఫ్ బెంగాల్ గౌరవ సంచాలకులు ఆచార్య పి.రామారావు, ఏయూ పూర్వ రెక్టార్ ఆచార్య ఏ.రాజేంద్ర ప్రాసద్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకంకు రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి. రాష్ట్ర స్థాయిలో అందించే అవార్డులలో మూడు విభాగాలో నాలుగు అవార్డులు లభించాయి.ఈ సందర్భంగా అవార్డులు సాధించిన వారికి ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అభినందించారు. గురువారం ఏయూ సెనేట్ మందిరంలో అవార్డులు సాధించిన వారిని అభినందించారు. ఉత్తమ పోగ్రాం కోఆర్డినేటర్గా డాక్టర్ ఎస్.హరనాథ్, ఉత్తమ పోగ్రాం అధికారుల విభాగంలో డాక్టర్ కె.మానిక్య కుమారి, వలంటీర్ల విభాగంలో సి.హెచ్ శివ శంకర్, కె.నిర్మల హైమలకు అవార్డులు లభించాయి. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ల విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక్కరినే ఎంపిక చేయగా ఈ అవార్డును ఏయూ పోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.హరనాథ్కు లభించింది. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఎన్ఎస్ఎస్ రాష్ట్ర ఇటిఐ కేంద్రం సంచాలకులు డాక్టర్ పి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
జలజీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికి కొళాయి పనులను సత్వరమే ప్రారంభించాలని గ్రామీణ నీటి పారుదల శాఖ ఇంజనీర్లకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి కేంద్ర ప్రభుత్వ జాతీయ జలజీవన్ మిషన్ కార్యక్రమం అమలుపై గ్రామీణాభివృద్ది శాఖ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. రూ 5లక్షల కంటే తక్కువ అంచనా విలువగల 1768 పనులను రూ 46.62 కోట్ల వ్యయంతో చేపట్ట నున్నట్లు తెలిపారు. ఈ పనులకు అవసరమైన మెటీరియల్ ను తక్షణమే ప్రోక్యూర్ చేయాలని, బిల్లులను ఐ ఎం ఐ ఎస్ లో అప్ లోడ్ చేయాలని తెలిపారు . అందుకు అవసరమైన గ్రామ పంచాయితీ తీర్మానాలను రేపటి లోగా అందజేయాలని స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు.
ప్రధాన మంత్రి ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న వీడియో కాన్పరెన్స్ లో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొంటారని అందువలన 28వ తేదీలోగా రూ 30 కోట్ల వ్యయాన్ని ఐ ఎం ఐ ఎస్ లో అప్ లోడ్ చేయాలని కోరారు.
జిల్లాలోని ఏజెన్సీ పరిధిలో అత్యధికంగా 1565 పనులు చేపట్ట నున్నందున ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి నిరంతర పర్యవేక్షించి లక్ష్యాలను చేరడానికి కృషి చేయాలని తెలిపారు. గ్రామీణ నీటి పారుదల శాఖ ఎస్ ఇ తో నిరంతరం సమన్వయం చేసుకొంటూ కార్యక్రమం అమలును పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా ) ను కోరారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి , డి ఎల్ డి ఓ లు , డి ఎల్ పి ఓ లు, ఇ ఓ ఆర్ డి లు , ఎం పి డి ఓ లు, ఆర్ డబ్ల్యు ఎస్ ఇంజనీర్లు, శ్రద్ద వహించి పనులను సత్వరమే ప్రారంభించాలని తెలిపారు. అలాగే అంగన్ వాడీలు , పాఠశాలలలో పనులను కూడా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు, గ్రామీణ నీటి సరఫరా పథకం ఎస్ ఇ రవికుమార్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలలయానికి స్వాతి ప్రమోటర్స్ సంస్థ ఎండి మేడపాటి రమేష్ రెడ్డి వైరస్లను వినోధించే సాంకేతిక ఉపకరణాలు షైకోకాన్లను బహూకరించారు. గురువారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని కార్యాలయంలో కలసి రెండు షైకోకాన్లను అందజేశారు. వీటి వలన ఉపరితలంపై ఉండే వైరస్లను నాశనం చేయడం సాధ్యపడుతుందన్నారు. కార్యాలయాలలో ఉపయక్తంగా ఇవి నిలుస్తాయని వివరించారు. వర్సిటీకి ఉపయుక్తంగా ఉపకరణాలు అందించిన రమేష్ రెడ్డిని ఏయూ వీసీ అభినందించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 3 రోజుల పర్యటన కోసం కృష్ణాజిల్లాకు రానున్నారని విజయవాడ సబ్ కలెక్టరు హెచ్. యం. ధ్యానచంద్ర పేర్కొన్నారు. గురువారం గన్నవరం విమానాశ్రయం, ఆత్కూరు, సూరంపల్లి గ్రామాలలో ఉపరాష్ట్రపతి పర్యటన కోసం ముందస్తు భద్రతా ఏర్పాట్లను ఉన్నతస్ధాయి అధికారులతో కలిసి సబ్ కలెక్టరు పర్యవేక్షించారు. ఈసందర్భంగా సబ్ కలెక్టరు హెచ్.యం. థ్యానచంద్ర అధికారులతో సమీక్షిస్తూ కరోనా నేపథ్యంలో పర్యటనా ఏర్పాట్లను అత్యంత కట్టుదిట్టంగా చేపట్టాలన్నారు. పరిమిత సంఖ్యలోనే గౌరవ ఉపరాష్ట్రపతి పర్యటనలో అనుమతించాలన్నారు. డిశంబరు 27 ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉపరాష్ట్రపతి సాయంత్రం 4.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ ప్రముఖులతో ఆహ్వాన భేటీ అనంతరం సాయంత్రం 5.10 గంటలకు ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టు చేరుకుని రాత్రి బస చేస్తారు. డిశంబరు 28వ తేదీ సోమవారం ఉదయం 10.20 గంటలకు ఆత్కూరు నుండి బయలుదేరి 10.50 గంటలకు సూరంపల్లి సిపెట్ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు.
ఉదయం 11.00 గంటల నుంచి 12.00 గంటల వరకు సిపెట్ కేంద్రాన్ని పరిశీలించి విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టు చేరుకుంటారు. సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకూ జరిగే కార్యక్రమంలో స్వర్ణభారతి ట్రస్టులో శిక్షణ పొందే విద్యార్ధులకు ధృవపత్రాలు అందజేస్తారు. మంగళవారం డిశంబరు 29న ఉదయం 8.40 గంటలకు గౌ. ఉపరాష్ట్రపతి ఆత్కూరు నుండి బయలుదేరి ఉదయం 8.55 గంటలకు విజయవాడ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో బెంగుళూరు బయలుదేరి వెళతారని సబ్ కలెక్టరు హెచ్.యం. థ్యానచంద్ర తెలియజేసారు. ఈపర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలు, ప్రొటోకాల్, తదితర అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు.
ఈకార్యక్రమంలో అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) టి. సర్కారు, అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిహెచ్. లక్ష్మీపతి, ఇన్స్పెక్టర్ జనరల్ అధికారిణి యం. దేవి, డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనరు ఆఫ్ పోలీస్లు అంకయ్య, విజయపాల్, రంగాముని, వైద్య ఆరోగ్య అధికారి డా. మోతిబాబు, సి.యస్.ఓ. కె. శ్రీనివాస్, రహదారులు భవనాలు శాఖ అసిస్టెంట్ ఇంజినీరు నరేంద్రరెడ్డి, ఎ లక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజినీరు ఏ.వి. దుర్గాప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టరు ప్రొటోకాల్ యం. వాణి, గన్నవరం విమానాశ్రయం డైరెక్టరు జి.యం.యస్. రావు, తదితరులు పాల్గొన్నారు.
జగనన్న తోడు కార్యక్రమం లో జి.వి.ఎం .సి పరిధిలోని చిరువ్యాపారులకు రుణాలు మంజూరు లక్ష్యాలను చేరుకోవడానికి జోనల్ కమిషనర్లు శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అన్నారు. గురువారం విశాఖ కలెక్టర్ కార్యాలయంలో జగనన్న తోడు కార్యక్రమం పై జి.వి.ఎం .సి అధికారులు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనాథ్, డి ఆర్ డి ఎ పి డి విశ్వేశ్వరరావు ల తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిరువ్యాపారులకు ఆర్థిక వెసులు బాటు ఇచ్చేందుకు జగనన్న తోడు కార్యక్రమం అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు కార్యక్రమ లక్ష్యాలను పూర్తి చేయడానికి నిర్థిష్ట కార్యచరణ ప్రణాళిక ప్రకారం పని చేయాలని బ్యాంకర్లకు స్పష్టం చేసిందని తెలిపారు. పెండింగ్ లో నున్న ధరఖాస్తులను సత్వరమే బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించడానికి జోనల్ కమిషనర్లు శ్రద్ద వహించాలని కోరారు. జోనల్ కమిషనర్లు వారి పరిధిలోని అన్ని బ్యాంకుల అధికారులతో పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులపై సంప్రదించాలని కోరారు. జి.వి.ఎం .సి పరిధిలోని 8 జోన్లలో పెండింగ్ లో ఉన్న 14,000 ధరఖాస్తుదారులకు సత్వరమే రుణాలు మంజూరు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.
అలాగే వై ఎస్ ఆర్ భీమా పథకంలో ధరఖాస్తు దారుల తరుపున ప్రభుత్వం భీమా ప్రీమియం ను చెల్లించిందని , ధరఖాస్తులను ప్రాసెస్ చేయించి ఆయా వ్యక్తులకు ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ లను అందించడానికి జోనల్ కమిషనర్లు భాద్యత తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జి.వి.ఎం .సి కమిషనర్ జి.సృజన , జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డి ఆర్ డి ఎ పి డి విశ్వేశ్వరరావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనాథ్ జోనల్ కమిషనర్లు, యు సి డి పిడి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం ఉదయం స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో మహిళా సాధికారత, బాలికా విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నామని, విద్యార్థుల ఆత్మ రక్షణ చర్యలను, గత కొద్ది రోజుల క్రితం బాలికే భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, పాఠశాల నుండి కళాశాల స్థాయి వరకు చట్టాలపై అవగాహన సదస్సులు, బాల్యవివాహాల నిర్మూలన చర్యలు, జోగిని, బసివిని వ్యవస్థ పై అవగాహన కార్యక్రమాలు మరియు వారి ఆర్థిక అభివృద్ధి కొరకు చైతన్య కార్యక్రమాల నిర్వహణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ స్పందిస్తూ జిల్లాలో "బాలికా భవిష్యత్తు చేపట్టిన కార్యక్రమం" కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, సిడబ్ల్యుసి చైర్మన్ నల్లాని రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
రెడ్ క్రాస్ సొసైటీ అందించే సేవల్లో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని సంయుక్త కలెక్టర్ జె.వెంకటరావు పిలుపునిచ్చారు. సేవా దృక్పథం, సామాజిక స్పృహ కలిగిన యువతరానికి రెడ్ క్రాస్ సొసైటీ ఒక చక్కని వేదిక అని పేర్కొన్నారు. జూనియర్ రెడ్ క్రాస్ మరియు యూత్ రెడ్ క్రాస్ సొసైటీల జిల్లా కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతరం సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సమాజంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. చిన్నప్పటి నుంచే సేవల వైపు దృష్టి సారించాలని, తద్వారా నైతిక బాధ్యతను నెరవేర్చాలని హితవు పలికారు. అలాగే జిల్లాలో ఉన్న విద్యార్థులను, యువతను ప్రోత్సహించి రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేయాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు సూచించారు. జిల్లాలో 369 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 114 జూనియర్, 75 డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, వాటిల్లో ఉన్న విద్యార్థులను సొసైటీలో సభ్యులుగా చేర్చే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. మండల స్థాయి కమిటీలను నియమించి రెడ్ క్రాస్ సేవలను విస్తృత పరచాలని హితవు పలికారు. రెడ్ క్రాస్ అంటే ఒక్క రక్త దానానికే కాదని, అన్ని సేవలకు చిరునామాగా నిలవాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం బ్రాంచ్ చైర్మన్ కె.ఆర్.డి. ప్రసాదరావు, డి.ఎం.& హెచ్.వో. రమణ కుమారి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు జోగా చంద్రశేఖర్ రావు, జి.ప్రభాకర్, మంత్రి రామ్మోహన్ రావు, సుబ్రహ్మణ్యం, బాలాజీ, శ్యామల, జయవర్ధన్, సురేఖ తదితరులు పాల్గొన్నారు.