1
విధినిర్వహణలో ఎంత కర్కశంగా ఉంటారో..మానవత్వం చాటడంలోనూ అంతే దాద్రుత్వాన్ని చాటుకున్నా విశాఖజిల్లా కలెక్టర్.. కలెక్టర్ చొరవతో రెవిన్యూలో అపస్మారక స్తితిలోకి వెళ్లిన ఉద్యోగికి మంచి వైద్యం అందుతోంది. జిల్లాకలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్న విషయం తెలియడంతో రెవిన్యూ ఉద్యోగులు కూడా తమవంతు సహకారం అందించారు. వివరాలు తెలుసుకుంటే రెవిన్యూ శాఖలో రాంబిల్లి రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నకే. విజయ్ భాస్కర్ కు ఇటీవల ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన షీలానగర్లోని కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసారు. ఆపస్మరక స్థితిలోకి వెళ్లిన ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స కు స్పందిస్తున్నారని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ ఉద్యోగులు అండగా నిలబడి ఒక లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు సమీకరించి విశాఖపట్నం జిల్లా రెవిన్యూ అధికారి ఆశపు ప్రసాద్ ద్వారా విజయ్ భాస్కర్ సతీమణి శ్రీదేవికి అందించారు. విజయ్ భాస్కర్ కు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ వి వినయచంద్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. అంతేకాకుండా ఉద్యోగిని అన్ని విధాలా ఆదుకోంటామని, అధైర్య పడవలసిన అవసరం లేదని కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులతో పాటు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కోశాధికారి బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఇంకా మిత్రులు, శ్రేయోభిలాషులు ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి రవికుమార్, కార్యదర్శి వై శ్యామ్ కుమార్, ఉపాధ్యక్షులు బంటు రమణ, ఎమ్ వి సుబ్బారావు, కోశాధికారి ఎస్ సురేష్, జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి శ్రీ రామ్మోహన్ రావు మరియు గ్రామ రెవిన్యూ అధికారి ఎమ్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు. కష్ట కాలంలో తమకు అండగా నిలిచిన రెవెన్యూ ఉద్యోగులకు, జిల్లా అధికారులకు విజయ్ భాస్కర్ భార్య శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు. ఆపద కాలంలో తోటి ఉద్యోగికి బాసటగా నిలిచిన రెవిన్యూ ఉద్యోగులను, ముందుండి కార్యక్రమాన్ని నడిపించినందుకు సంఘం కార్యవర్గ సభ్యులను జిల్లా రెవిన్యూ అధికారి అభినందించారు.
నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ స్ధలాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయము నుంచి జిల్లా, డివిజన్, మండల స్ధాయి అధికారులతో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళ స్ధలాల పంపిణీ, జగనన్న భూ హక్కు, భూరక్ష పధకం , ధాన్యం కొనుగోలు,సంబంధిత సమస్యలు , బియ్యం కార్డుల మ్యాపింగ్, కోవిడ్ -19 చేపట్టిన 50 రోజుల అవగాహన కార్యక్రమాలు, వ్యర్ధ పదార్ధాల పై పోరు, మహిళా సాధికారత చట్టాల పై 100 రోజుల అవగాహన కార్యక్రమాలు, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనులు , వైయస్ఆర్ బీమా, జగనన్న తోడు, చేయూత, గొర్రెలు-మేకల పంపిణీ, మొబైల్ ట్రక్స్ లబ్దిదారుల ఎంపిక, తదితర అంశాలపై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఈ నెలలోనే ప్రభుత్వ పరంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయన్నారు. 10వ తేదీన గొర్రెల-మేకల యూనిట్ల పంపిణీ, 15వ తేదీన 2019 సంవత్సరంలో రైతులకు పెండింగ్ లో ఉన్న క్రాప్ ఇన్సురెన్స్ విడుదల, 21న భూహక్కు, భూరక్షా పధకాల ప్రారంభం, 25వ తేదీన ఇళ్ళ పట్టాల పంపిణీ జరుగనున్నందున అధికారులు ఆయా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలక్టర్ తెలిపారు. జిల్లా లో తొలి దశలో భాగంగా 1.48 లక్షల మందికి ఇళ్ళ పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఇళ్ళ స్ధలాల కోసం సిద్ధం చేసిన లేఅవుట్స్ కు దగ్గర ఉన్నఇసుక స్టాక్ పాయింట్లను మేపింగ్ చేయాలన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 25న జిల్లాలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నందున అధికారులు ఈ కార్యక్రమం పై ప్రధానంగా దృష్టిపెట్టాలన్నారు. ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన ఇసుకను రవాణా ఖర్చుల మినహా, ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జియో ట్యాగింగ్, మేపింగ్, లబ్దిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలు వెంటనే పూర్తి చేయాలని కలక్టర్ తెలిపారు.
రైతులను ఆదుకోవడంలో అధికులు చొరవ చూపాలి- జేసి లక్ష్మిశః
జిల్లాలో వర్షాలు, తుఫానుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అధికారులు చొరవ చూపాలని జాయింట్ కలక్టర్ (రెవెన్యూ) జి.లక్ష్మిశ తెలిపారు. రంగు మారిన ధాన్యం కొనేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, దీనికి సంబంధించి జిల్లా స్ధాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫోన్ లను ఆయా మండలాలకు పంపడం జరుగుతుందని, వాటిన వెంటనే పరిష్కరించాలని ఆయన తెలిపారు. ఈ నెల 21వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న భూ హక్కు, భూ రక్షా పధకాలు ప్రారంభించనున్నందున అధికారులు భూ సర్వే పై దృష్టి పెట్టాలన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామంలో జరిగే రీ సర్వే పై ప్రజలకు అవగాహన కలిగించే విధంగా కరపత్రాలు , అవగాహనా సదస్సలు నిర్వహించాలని జేసి అధికారులకు సూచించారు. ఈ-క్రాప్ బుకింగ్ లో కౌలు రైతుల వివరాలు నమోదుకు అవకాశం కల్పించినందున దీని పై కౌలు రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించి వారి వివరాలు నమోదు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న బియ్యం కార్డుల మేపింగ్ వెంటనే పరిష్కరించాలన్నారు. ఇళ్ళ పట్టాలకు సంబంధించి పట్టాల ముద్రణకు లబ్దిదారుల వివరాలు పంపించాలని జేసి తెలిపారు.
అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – కీర్తీ చేకూరి.
కోవిడ్-19కు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 50 రోజుల
అవగాహనా కార్యక్రమాలు సక్రంమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జాయింట్ కలక్టర్(అభివృధ్ధి) కీర్తీ చేకూరి అధికారులను ఆదేశించారు. 50 రోజులకు రోజు వారీ ఏ కార్యక్రమాలు అమలు చేయాలో ప్రణాళిక లో నిర్దేశించిన ప్రకారం అన్ని ప్రాంతాల్లో అమలయ్యేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఈ ,కార్యక్రమాలకు సంబంధించి వాలంటీర్లను భాగస్వాములను చేయాలన్నారు. ఈ 50 రోజుల అవగాహన కార్యక్రమంలో ప్రధానంగా పారిశుధ్యంతో పాటు కోవిడ్ పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా వ్యర్ధాల పై పోరు, మనం- మన పరిశుభ్రత కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యే విధేంగా చూడాలని జేసి తెలిపారు. గ్రామ స్ధాయిలో ఖాళీలుగా ఉన్న ప్రాంతాలలో గ్రీన్ అంబాసిడర్ లను నియమించాలన్నారు. గ్రామ స్ధాయిలో పారిశుధ్యం పై పంచాయతీ సెక్రటరీలు ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. మహిళా సాధికారతా, హక్కులు, చట్టాల పై మహిళలకు అవగాహన కల్పించు నిమిత్తం 100 రోజులు నిర్వహించే కార్యక్రమాలు జిల్లా స్ధాయి నుండి గ్రామ స్ధాయి వరకు అమలయ్యే విధంగా చూడాలన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో మహిళల సమస్యల పరిష్కారం నిమిత్తం అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్ధులతో ర్యాలీలు నిర్వహణ, స్వయం సహాయక సంఘాల మహిళలతో అవగాహనా సదస్సులు నిర్వహించాలన్నారు. వైయస్ఆర్ బీమాకు సంబంధించి బ్యాంకర్ల లాగిన్ లో ఉన్న దరఖాస్తులను ఎంపిడిఓలు ఆమోదించాలని జేసి కీర్తీ చేకూరి తెలిపారు.
ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనులను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలి- జి.రాజకుమారిః
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను అధికారులు సమన్వయంతో పని చేసి నిర్మాణ పనుల్లో పురోగతి చూపించాలని జాయింట్ కలక్టర్ (డబ్ల్యూ) జి.రాజకుమారి అన్నారు. మంజూరు చేసిన పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. వైయస్ఆర్ చేయూత పధకంలో భాగంగా 10వ తేదీన లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేయనున్నందున బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆమె తెలిపారు. జిల్లాలో మనీ ట్రక్ ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ఆమె తెలిపారు. నిత్యావసర సరుకులు ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమం 2021 జనవరి 1 నుండి ప్రారంభించనున్నందున లబ్దిదారుల జాబితాను సిధ్ధం చేయాలని జేసి రాజకుమారి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్ధాయి అధికారులు, డివిజన్ , మండల స్ధాయి అధికారులు పాల్గొన్నారు.
విశాఖ దక్షిణ నియోజవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వాలంటీరు ప్రియాంక కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన ఆమెను కెజిహెచ్ లో చేర్పించారు. పరిస్తితి కాస్త ఇబ్బంది కరంగా ఉండటంతో రంగంలోకి దిగి ఎమ్మెల్యే వాసుపల్లి ఈ విషయాన్ని వెంటనే కెజిహెచ్ సూపరింటెండెంట్ తో చర్చించారు. దీంతో తక్షణమే మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను సెవెన్ హిల్స్ ఆసుపత్రికి మార్చారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి ప్రియాంకను ఎమ్మెల్యే పరామర్శించి దైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. అంతేకాకుంగా ఈమెకు వైద్యం అందిస్తున్న వైద్యులతోనూ మాట్లాడి ఆమెను ఎలాగైనా క్షేమంగా ఇంటికి చేర్చేవిధంగా మెరుగైన వైద్యసహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం, ముస్లిం మైనారిటీ నాయకుడు సాధిక్, మహిళా ప్రెసిడెంట్ మాధురి, భాదితరాలు కుటుంబ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నాడు ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన దివంగత మహానేత వైయస్ఆర్ అయితే ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేడు అనేక సంక్షేమ పథకాలతో ముస్లిం సోదరుల ఉన్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్నివెంకట్రామయ్య ( నాని ) కొనియాడారు. మంగళవారం ఉదయం 7 గంటలకు ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తొలుత మచిలీపట్నం టెక్యా ప్రాంతానికి చెందిన కొందరు ముస్లిం మహిళలు మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. తమ పిల్లలకు విద్యా దీవెన డబ్బులు రావడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, మీ పిల్లల చదువుల వివరాలు నాకు తెలియచేయండి. తాను తప్పక విచారణ చేస్తానని హామీ ఇచ్చారు. 2004 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన తరువాత ముస్లిం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ద్రోహద పడేలా రిజర్వేషన్ కల్పించడం అత్యవసరమని భావించి 4% రిజర్వేషన్ ఏర్పరచెరన్నారు. ఆ రిజర్వేషన్ ఫలితంగా ముస్లిం సమాజము విద్య ,ఉపాధి రంగాలలో గణనీయమైన ప్రాధాన్యత పొందడం ఎంతో అభినందనీయమన్నారు. స్థానిక పేర్ని కృష్ణమూర్తి కాలనీకు చెందిన కొల్లేరు విజయలక్ష్మి తనకు అయిదు నెలలుగా పింఛన్ రావడం లేదని బియ్యం కార్డు నిలిచిపోతుందని మంత్రి కి తెలిపింది. తనకు ఆధార్ కార్డు ,రేషన్ కార్డు తదితర వివరాలు ఎందుకు తీసుకోని రాలేదమ్మా అని ఆమెని అడిగి అవి వెంటనే అందచేయాలని మంత్రి పేర్ని నాని అడిగారు. స్థానిక హుస్సేనుపాలెం యానాదుల కాలనీకి సమీపంలో నివసిస్తున్న మందా రాజేష్ అనే దివ్యంగుడు మూడు చక్రాల సైకిల్ పై భార్యతో సహా వచ్చి మంత్రిని కలిశారు. కొద్ది సంవత్సరాల క్రితం లారీ తనను ఢీ కొట్టిందని తనకు రెండు కాళ్ళు తొలగించారని తెలిపారు ఆర్ధిక ఇబ్బందులతో ఎంతో ఇబ్బందులు పడుతున్నానని తనకు ఇంటి స్థలం లేదన్నారు. రాజేష్ దుస్థితికి జాలిపడిన మంత్రి తప్పకుండా నీకు నివేశన స్థలం ఇస్తానని , కానీ ఆ స్థలం నీ భార్య పేరిట ఉంటుందని తెలిపారు. బందరు మండలం పెద కొత్తపూడి గ్రామానికి చెందిన మాదిరెడ్డి ఏసు అనే రైతు మంత్రిని కలిశారు. తనకు రైతు భరోసా డబ్బులు రాలేదని, దస్తావేజులు లేకపోవడంతో ఆ డబ్బు రాదనీ అధికారులు చెడుతున్నారని పేర్కొన్నాడు.
నూతన ఆవిష్కరణ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా క్లిష్టమైన అంశమని, ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక రంగం సమన్వయంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక ప్రతిభావంతులను ప్రోత్సహించడంతో పాటు, మార్గదర్శనం చేయాలని సూచించారు. మంగళవారం విశాఖపట్నం నుంచి అంతర్జాల మాధ్యమం ద్వారా టి.ఐ.ఈ. గ్లోబల్ సమ్మిట్ -2020 ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. యువతలో ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని, ప్రతిభను ప్రోత్సహించేందుకు, పెంపొందించేందుకు ఇంకుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయాలకు సూచించిన ఆయన, ఆయా విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు నిధులు సమకూర్చాలని కార్పొరేట్ రంగానికి సూచించారు.
ద ఇండస్ (IndUS) ఎంటర్ప్రెన్యూర్స్ (టి.ఐ.ఈ) సంస్థ సిలికాన్ వ్యాలీ ఆధారిత లాభాపేక్ష లేని సంస్థ. ఇది నెట్వర్కింగ్ ద్వారా అంకుర సంస్థలకు (స్టార్టప్స్) సహకారం అందిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ సమ్మేళనం – 2020 ద్వారా భారతదేశంలోకి పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. భారతదేశ జనాభాలో 65 శాతం మంది యువత ఉన్నారని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ప్రతిభావంతులైన యువత శక్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగార్థులుగా గాక, ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఆలోచనల్లో మార్పు రావాలని ఆకాంక్షించిన ఆయన, మహిళల ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్య ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మెంటరింగ్ ద్వారా 50వేల మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను టి.ఐ.ఈ. ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద అంకుర సంస్థల నిలయంగా భారతదేశాన్ని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ఇటీవలి నాస్కామ్ (ఎన్.ఏ.ఎస్.ఎస్.సీ.ఓ.ఎమ్) నివేదికను ఉటంకించారు.
టెక్ స్టార్టప్ లలో 50శాతం మంది కరోనాకు ముందు ఉన్న పరిస్థితుల దిశగా త్వరలోనే పుంజుకుంటారన్న నివేదికలోని అంశాలు ఆనందదాయకమన్న ఆయన, భవిష్యత్తులో కచ్చితంగా అన్ని భారతీయ అంకుర సంస్థలు మంచి విజయాలు, ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ అధ్యయనాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రపంచంలోని చాలా ఔత్సాహిక పారిశ్రామిక దేశాలు సుసంపన్నంగా ఉన్నాయని.. తద్వారా ఔత్సాహిక పారిశ్రామిక ప్రోత్సాహంతోపాటు ప్రజలకు సౌకర్యం, ఆనందం లభిస్తుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించడం లాభాల కోసమే కాదన్న ఉపరాష్ట్రపతి, విద్య, ఆరోగ్య సంరక్షణ, కనీస సౌకర్యాల కల్పన ద్వారా ప్రజల జీవన విధానాన్ని మెరుగు పరిచేందుకు కూడా ఇది మరింత కీలకమైనదని తెలిపారు. ఇందులో పోటీ మాత్రమే కాకుండా, ప్రజల ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నారు. కరోనా విసిరిన సవాళ్ల గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రస్తుత కాలాన్ని ప్రతికూల పరిస్థితులను అవకాశాలు ఒడిసిపట్టే సమయంగా అభివర్ణించారు.
నానాటికీ పెరుగుతున్న నూతన సవాళ్ళను ఎదుర్కునేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆయన, అలాంటి ఆలోచనల ద్వారా ముందుకు వచ్చే ఔత్సాహిక, ఆశాజనక అంకుర సంస్థలకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్థిక వృద్ధి మరియు ఉపాధి కల్పనలో వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తుందన్న ఉపరాష్ట్రపతి, ‘స్టార్టప్ ఇండియా’ ద్వారా అంకుర సంస్థలకు సానుకూల వాతావరణాన్ని కల్పించిన భారత ప్రభుత్వాన్ని అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహిచడం అంటే సరైన ఆర్థిక విధానాన్ని రూపొందించడం, ఉత్తమ విద్యా పాఠ్యప్రణాళికను అభివృద్ధి చేయడం మాత్రమే కాదని.. దీనిద్వారా ఆవిష్కరణలు, ఆలోచనలు ఏకకాలంలో వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల విజయాలు సృష్టించే ఆర్థిక అవకాశాలు భారతదేశం కోసం మాత్రమే గాక యావత్ ప్రపంచానికి ఉపయోగపడతాయన్నారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5కోట్ల కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయన్న ఉపరాష్ట్రపతి, అభివృద్ధి సాధించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. తర్వాతి తరాలకు మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత ఉందని టి.ఐ.ఈ. వంటి సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొదలైన సంస్థలకు పిలుపునిచ్చారు.
వారి అనుభవాలను, విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలతో పంచుకోవాలని, అదే విధంగా విశ్వవిద్యాలయాలు సైతం విద్య పూర్తయ్యే సమయానికే విద్యార్థుల్లో పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా పరిశోధనలు, ఇంటర్న్షిప్ల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతిభావంతుల నుంచి చక్కటి ఔత్సాహిక పారిశ్రామిక ఆలోచనలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయని అభిప్రాయపడిన ఉపరాష్ట్రపతి, వారు సిలికాన్వ్యాలీ లాంటి చోట్ల మాత్రమే కాకుండా హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రతిభావంతులున్న ఇతర ప్రదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక రంగం సానుకూల మార్గంలో ముందుకు సాగేందుకు ప్రైవేటు రంగం, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. వ్యాపారాన్ని ఆరంభించడం చాలా క్లిష్టమైన పనిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనుభవం ఉన్న మార్గదర్శకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు.
అంతర్జాతీయ టి.ఐ.ఈ. కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు దిశా నిర్దేశం చేసేందుకు 300 మందికి పైగా మెంటర్స్ అందుబాటులో ఉండడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి ఉన్నత కార్యక్రమాలు ఆలోచనలు, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకునేందుకు ఒక మంచి వేదికను అందించడమే గాక, వివిధ ఆలోచనల మధ్య చక్కని వంతెన నిర్మించడంలో సహాయపడతాయన్న ఉపరాష్ట్రపతి, ఇందుకోసం చొరవ తీసుకున్న టి.ఐ.ఈ.ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, టీఐఈ గ్లోబల్ అధ్యక్షుడు శ్రీ మహవీర్ శర్మ, టీఐఈ హైదరాబాద్ విభాగం బాధ్యుడు, కంట్రోల్ ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ పిన్నపురెడ్డి శ్రీధర్ రెడ్డి, భారతదేశంతోపాటు వివిధ దేశాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు, వివిధ రంగాల ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో రౌడీయిజాన్ని సహించేది లేదని, తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్షార్హులే నని రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రౌడీ మూకలను సహించేది లేదని, ఎక్కడికక్కడ రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలని, రౌడీ మూకలను, బ్లేడ్ బ్యాచ్ లను గుర్తించి నగర బహిష్కరణ చేయాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రౌడీయిజాన్నే సహించలేమని మొత్తుకుంటుంటే ఇక వర్గాలకు తావెక్కడుంటుందని ఎంపీ భరత్ రామ్ ప్రశ్నించారు. స్థానిక ఐదు బళ్ల మార్కెట్ వద్ద జరిగిన దాడి ఘటనపై పోలీసులు త్వరితగతిన విచారణ జరిపి సత్వరం నిందితులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ఎంపీ భరత్ రామ్ పోలీసు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. రాజమహేంద్రవరం నగరంలో ప్రశాంతతకు భంగం కల్గిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నగరాభివృద్ధి పై దృష్టి పెట్టి చారిత్రాత్మకమైనరాజమహేంద్రవరం నగరాన్ని హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. ఏదేమైనప్పటికీ నగరంలో రౌడీయిజం పై చర్యలు తీసుకోవాలని, జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా నిష్పక్ష పా తంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
స్వచ్చ సర్వేక్షణ్ ఏర్పాట్లలో భాగంగా డ్రై రీసోర్సు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మూడవ జోన్ లోగల ఎం.ఎస్.ఎఫ్. కేంద్రంలో ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేశారు. అనంతరం ఎం.ఎస్.ఎఫ్. - 3లో మెకానికల్ ఇంజినీరింగు వారు ప్రతిపాదిత కెమెరాల ఏర్పాటు, వేయింగు బ్రిడ్జి ఏర్పాట్లు మెకానికల్ విభాగం పర్యవేక్షక ఇంజినీరుతో చర్చించారు. భూ గర్భ డ్రైనేజి పనులు నిర్వహణకు గాను కొనుగోలు చేసిన, 6000 కిలోల హై ప్రెసర్ జేట్టింగు మిషిన్, హైడ్రాలిక్ ఆపెరేటర్ గ్రాబ్ బకెట్ ల పని తీరును మూడవ జోన్ పరిధిలో గల ఇందిరా గాంధి స్టేడియం వద్ద గల యు.జి.డి. హొల్స్ ను ప్రయోగాత్మకంగా నిర్వహించి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా నిబంధనల మేరకు మేన్ హోల్ ను మిషన్ హోల్ గా మార్పుచేసే నిమిత్తం జివిఎంసి స్వయంగా ఈ రెండు మిషన్లను సమకూర్చుకున్నదన్నారు. నగరంలో సుమారు 780 కి.మీ. పరిధిలోగల 38,700 భూ గర్భ డ్రైనేజి హోల్స్ ను మానవ రహిత నిర్వాహణ కొరకు ఈ రెండు మిషన్లు వినియోగించడం వలన, స్వచ్ఛ సర్వేక్షణ్ లో మెరుగైన ర్యాంకు సాధనకు తోడ్పడుతుందని కమిషనర్ ఆశాభావాన్నివ్యక్తీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, పర్యవేక్షక ఇంజినీర్లు శ్యాంసన్ రాజు, వేణుగోపాల్, చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, సిటీ ప్లానర్ ప్రభాకర్, మూడవ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ అమ్మాజీ, కార్యనిర్వాహక ఇంజినీరు(నీటి సరఫరా) శ్రీనివాస్, డి.ఇ. మహేష్, మెకానికల్, నీటి సరఫరా విభాగపు ఇంజినీరింగు అధికారులు తదితరులు పాల్గోన్నారు.
మీకు ఎన్నిసార్లు చెప్పినా మార్పు రావడం లేదు..ఇంకెప్పుడు విధినిర్వహణ సక్రమంగా చేస్తారంటూ జివిఎంసీ కమిషనర్ డా.స్రిజిన శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జోన్-1 పరిధిలోని బింద్రానగర్ ప్రాంతంలో జివిఎంసి కమిషనర్ పర్యటించి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆ ప్రాంతాలలో వాహనం ద్వారా చెత్తను గృహాల నుంచి సేకరించిడం ప్రత్యక్షంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో భాగంగా ఆప్రాంత వాసులను గృహాల నుండి చెత్తను తీసుకొని వెళ్ళుటకు ప్రతీ రోజూ సిబ్బంది మరియు వాహనం వస్తుందీ లేనిదని, చెత్తను వేరుచేసి ఇవ్వాలని సిబ్బంది అడుగుతున్నారా లేదా అని అడిగితెలుసుకున్నారు. చెత్తను వేరు చేయకుండా ఇస్తున్నామని అక్కడ ప్రజలు చెప్పగా, వేరుచేసి ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజలకు చెత్త వేరు చేయడంపై సంపూర్ణ అవగాహన కల్పించకుండా అలసత్వం ప్రదర్శించిన ఐదవ వార్డు శానిటరీ ఇన్ స్పెక్టరు , ఆ ప్రాంత శానిటరీ కార్యదర్శి జీతాల నిలుపుదల చేయాలని సహాయ మెడికల్ ఆఫీసరును ఆదేశించారు. ఆ ప్రాంతంలో రోడ్డును తుడిచి చెత్తను ఎత్తకుండా రోడ్డు ప్రక్కనే పోగు పెట్టడం గమనించి, కార్మీకురాలు వద్ద డబ్బా వంటిది లేక పోవడం గమనించి, ఆమెను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినందుకు ఆమెకు ఒక రోజు వేతనం నిలపాలని ఆదేశించారు. అపార్ట్మెంట్స్ నుండి ఖాళీ స్థలాలలో చెత్త వేయడం గమనించి వారి వద్ద నుండి జరీమనాలు విధించాలని ప్రజా ఫిర్యాదు మేరకు బింద్రానగర్ పరిసర ప్రాంతాలలో కాలువలు నుండి చెత్తను తొలగించి సాయంత్రంలోగా నివేదిక పంపాలని శానిటరీ ఇన్ స్పెక్టర్ ను ఆదేశించారు. ఖాళీస్థలాలలో చెత్త, తుప్పలను తొలగించని స్థల యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఏ.ఎం.ఓ.హెచ్.ను ఆదేశించారు. బింద్రానగర్ ప్రాంతంలో ఇండ్ల వద్ద ఎరువును(హోమ్ కంపోస్టు) తయారు చేసి, స్వయంగా వారి అవసరాల కొరకు ఉపయోగించడాన్ని, స్థానికంగా గృహాలకు వెళ్లి పరిశీలించి, సేంద్రీయ ఎరువు వినియోగాన్ని మహిళలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఐదవ వార్డులో డ్రైనేజి ఏర్పాటుకుగాను కావలసిన ప్రైవేటు స్థలాల్ని, నాల్గవ వార్డులో రోడ్డు ఏర్పాటుకు కావలసిన ప్రైవేట్ స్థలాన్ని ఇంజినీరింగు మరియు పట్టణ ప్రణాళిక అధికారులతో కలసి పరిశీలించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రాము, పర్యవేక్షక ఇంజినీరు శివ ప్రసాదరాజు, ఏ.ఎం.ఓ.హెచ్. జయరాం, ఏ.సి.పి., కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయక ఇంజినీరు(మెకానికల్), సహాయక ఇంజినీరు(నీటిసరఫరా), శానిటరీ ఇన్ స్పెక్టరు, శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గోన్నారు.
శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరయం మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మంగళవారం స్ధానిక అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా మంచి సౌకర్యాలతో ఆడిటోరియాన్ని రూపొందించాలని ఇండనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణాలు జరిగిన తరువాత క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేపట్టాలన్నారు. ఎక్కడ తేడా వచ్చినా సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇ.డబ్ల్యు.ఐ.డి.సి. కార్యనిర్వాహక ఇంజనీరు కె.భాస్కర రావు, సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.