ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు నవరత్నాలులో భాగంగా పేదలందరికీ ఇళ్లు పధకంలో పంపిణీ చేయనున్న ఇళ్ల పట్టాలు, లే-అవుట్ లు సిద్దం చేయాలని జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరు కార్యాలయం సమావేశమందిరంలో అధికారులతో ఈ విషయం పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన సమీక్షిస్తూ మండలాల వారీగా లేఅవుట్ లు, పట్టాల వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు ఇండ్లస్థలాలు, పట్టాలు పంపిణీ చేస్తారని తెలిపారు. డిశంబరు 25 తేదీ నుండి జనవరి 7 వ తేదీ వరకు ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని, 7 వ తేదీ లోపు పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి లే అవుట్ దగ్గర లేఅవుట్ మ్యాప్, లబ్ది దారుల జాబితా ప్రదర్శించాలని అన్నారు. ఇంటి స్థల పంపిణీ పూర్తయిన వెంటనే ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమం పర్యవేక్షణకు గాను ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. ప్రత్యేకాధికారులు లే-అవుట్ తయారీ, పట్టాలు తయారీ, పంపిణీ తదితర పనులు పర్యవేక్షించి కార్యక్రమం సజావుగా పూర్తి చేయాలన్నారు. నవంబరు 25 తేదీనాటికి గల లబ్దిదారులు, 90రోజులలో పరిష్కరించవలసిన ధరఖాస్తుల లబ్దిదారులు, డిశంబరు 15 లోగా సచివాలయాలకు వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి లబ్దిదారుల జాబితా తయారు చేయాలన్నారు. అర్హతగలిగిన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చాలని తెలిపారు. లబ్దిదారుల వివరాలను సచివాలయాలలో ప్రదర్శించాలని తెలిపారు. డి ఫారం పట్టారికార్డు మొత్తం రెవిన్యూ డివిజను కార్యాలయాలలో భద్రపరచాలన్నారు.
లేఅవుట్ వద్దనే పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని, పట్టాలలో పట్టాదారుని పేరు, ప్లాటు నంబరు, సరిహద్దులు తదితర వివరాలు నమోదు చేయాలన్నారు. ఇంటి స్థల పంపిణీలో అవకతవకలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదుచేసి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు కేసులకు సంబంధించి స్టే ఉన్న చోట్ల వెకెషన్ పిటిషన్లు వేయాలని, కౌంటరులో పేరావైజ్ రిమార్క్స్ నోట్ చేయాలని తెలిపారు. కొత్త లేఅవుట్ లో భూమి చదును, రోడ్లు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయవలసినదిగా పి.డి. డుమా, హౌసింగు అదికారులను ఆదేశించారు. అందుకుగాను తహశీల్దారులు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
టిడ్కో ఇంటికి సంబందించి 300 చ.అ. గల ఇంటికి రూ.1/-, 365 చ.అ. ఇంటికి రూ.25,000/-, 430 చ.అ. ఇంటికి రూ.50,000/- ప్రకారం లబ్దిదారుని షేరు కట్టించుకొని రిజిస్ట్రేషను చేయాలన్నారు. జాయింటు కలెక్టరు వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ లే అవుట్లలో అప్రోచ్ రోడ్లు, అంతర్గతరోడ్లు, సరిహద్దురాళ్ల ఏర్పాటు మొదలైన పనులను 20వ తేదీ లోగా పూర్తిచేయాలన్నారు. ప్రతి నియోజక వర్గంలో 25 వ తేదీన స్థానిక శాసనసభ్యులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. జనవరి 7 వ తేదీలోగా ప్రణాళిక ప్రకారం పంపిణీ పూర్తిచేయాలన్నారు. సరిహద్దురాళ్లపై ప్లాటు నంబర్లు వేయాలని తెలిపారు. పంపిణీ కార్యక్రమలో గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని, పట్టాలపై తప్పులు, దిద్దుబాట్లు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జి.వి.యం.సి. కమీషనరు, జి.సృజన, ఐ.టి.డి.ఎ. పిఒ వెంకటేశ్వర్లు, నర్సీపట్నం సబ్ కలక్టరు ఎన్. మౌర్య, రెవిన్యూ డివిజనల్ అధికార్లు కె. పెంచల కిషోర్, జె.సీతారామారావు, ఎల్.శివజ్యోతి, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, డి.ఆర్.ఒ. ఎ.ప్రసాదు, పరిపాలనాధికారి రామ్మెహనరావు,హౌసింగు, డుమా అదికార్లు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
విద్యార్థులు బహుముఖంగా రాణిస్తూ తమ నైపుణ్యాలను ప్రస్పుటం చేయాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఏయూ ఇంజీనింగ్ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న జనరల్ ఇంట్రెస్ట్ టాపిక్స్ అవెన్యూ (గీతా) పోస్టర్ను ఆయన సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సాంకేతికతను లాభదాయకంగా నిలుపుకుంటూ వర్చువల్ విధానంలో కార్యక్రమాలను నిర్వహించడం పట్ల విద్యార్థులను అభినందిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు టెక్ టాక్స్ను నిర్వహిస్తారు. కార్యక్రమంలో విద్యార్థి కన్వీనర్ ఏ.వినీల్ జడ్సన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ,సహకార,ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం కాకినాడ బొట్ క్లబ్ దగ్గర్లో ఉన్న కృషి భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం సర్వసభ్య సమావేశానికి మంత్రి కన్నబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన ప్రారంభించిన నాటి నుంచి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తూ, వ్యవసాయ రంగంలో అనేక నూతన వ్యవస్థకు నాంది పలికిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖల లో గతంలో ఏ ప్రభుత్వం భర్తీ చేయలేనని ఉద్యోగాలు ప్రస్తుత ప్రభుత్వం భర్తీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. గ్రామ స్థాయి లో రైతుకు అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను తీసుకు రావడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మత్స్య శాఖకు సంబంధించి మత్స్య ప్రాసెసింగ్ సెంటర్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని పట్టుదలతో,ఉత్తమ ఫలితాలు అందించే విధంగా కృషి చేయాలన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారుల పదోన్నతులకు సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని,నూతనంగా ఎన్నికైన రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం సభ్యులందరూ వ్యవసాయరంగ ఉన్నతికి కృషి చేయాలని మంత్రి కన్నబాబు సుచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఏపీఎన్జీవో అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసు రావు, నూతనంగా ఎన్నికైన రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం అధ్యక్షులు డి.వేణుమాధవ రావు, 13 జిల్లాల విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యతను మెరుగు పరిచే ప్రక్రియలో భాగంగా సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ జిల్లాల వారీగా వరుస శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం విజయ నగరం జిల్లా జర్నలిస్టులకు వర్చువల్ ఆన్ లైన్ విధానంలో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ ఉపన్యాస కార్యక్రమంలో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ ప్రారంభ ఉపన్యాసం చేసారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్లాల్,ఐఎఎస్, ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్ లు పాల్గొని సమాజంలో జర్నలిస్టుల ప్రాధాన్యత, వారి వృత్తి నిబధ్ధతపై ప్రసంగించారు. ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర తిలక్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆన్ లైన్ శిక్షణలో భాగంగా సీనియర్ పాత్రికేయులు కె.స్రవంతి చంద్ర, శశాంక్ మోహన్లు వివిధ అంశాలపై విజయనగరం జిల్లా జర్నలిస్టులతో వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి సమన్వయకర్తగా విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణారెడ్డి వ్యవహారించారు.
ఈ సంధర్బంగా రాష్ట్ర పురపాలకశాఖ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా వుండేలా జర్నలిస్టుల కమిటీలను ఏర్పాటు చేసి ఈ వృత్తిలో కొనసాగుతున్న వారికి వేతనాల స్థిరీకరణ,ఉద్యోగ భద్రతను కల్పించే దిశగా అంతా కలసి ముందుకు సాగాలంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. పాత్రికేయులు రాసే వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా లేకుండా ప్రజలకు మేలు కలిగే వార్తలపై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. జర్నలిస్టులకు ఆన్ లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న ప్రెస్ అకాడమీని ఇందులో పాల్గొన్న జర్నలిస్టులను అభినందించారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్లాల్,ఐఎఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనతో పాటు ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ మెరుగైన సమాజం కోసం పాటు పడుతున్న జర్నలిస్టుల కృషిని కొనియాడారు. ఎప్పుడు ఒకేలా కాకుండా కాలనుగుణంగా ఎప్పటికప్పుడు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం వుందని, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవటానికి దోహదపడతాయని ఆయన అన్నారు.
ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని, మీడియా వ్యాపార,రాజకీయ,కుల, వర్గ ప్రయోజనాలకు సంబంధం లేకుండా మీడియా రంగం అభివృధ్ది చెందాల్సిన అవసరం వుందన్నారు. నైతిక విలువల్ని కోల్పోవాల్సిన పరిస్థితి రాకుండా జర్నలిస్టులు వ్యవహారించాలని కోరారు.
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరుకుంటుందని అన్నారు. నకిలీ జర్నలిస్టులను పూర్తి స్థాయిలో గుర్తిస్తే అసలైన జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పధకాలను సమర్ధవంతంగా అందించే అవకాశం వుంటుందని, ఇందు కోసం జర్నలిస్టుల యూనియన్ లు దృష్టి పెట్టాలని కోరారు. జర్నలిజంలో మెళకువలు తెలియచేసే క్రమంలో ప్రెస్ అకాడమీ గ్రామీణ జర్నలిస్టులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తుందని అన్నారు. కరోనా నేపధ్యంలో ఏపీలో అన్ని జిల్లాల వారీగా ఆన్ లైన్ ద్వారా ఈ శిక్షణ తరగుతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వృత్తి జర్నలిస్ట్ లు నైపుణ్యాన్ని పెంపొందించు కునే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టి పుస్తకాలను రూపొందించామని వాటిని ప్రస్తుతం పిడిఎఫ్ ఫైల్స్ వృత్తి జర్నలిస్ట్ లకు ఆన్ లైన్ లో అందుబాటు లో ఉంచడం జరిగిందన్నారు. దీనితో పాటు ప్రెస్ అకాడమీ రూపకల్పన చేస్తున్న వెబ్ సైట్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ శిక్షణలో భాగంగా సీనియర్ పాత్రికేయులు కె.స్రవంతి చంద్ర 'క్షేత్ర సందర్శనే విలేకరి బలం - వాట్సాప్ జర్నలిజం నష్టం” అంశాపై మాట్లడారు. మరో సీనియర్ పాత్రికేయులు శశాంక్ మోహన్లు 'వివిధ రకాల వార్తలు రాసే పధ్ధతులు : (వ్యవసాయ, విద్య, రాజకీయ, అభివృద్ధి, ప్రమాద, క్రైం)” అంశంపై విజయనగరం జిల్లా జర్నలిస్టులతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కాన్ఫెరెన్సు లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు దున్న రమేష్, జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ విజయనగరం జిల్లా పాత్రికేయులకు ఆన్లైన్ శిక్షణ తరగతులను నిర్వహించింది. ఈ సందర్భంగా విలేఖరులకు సమాచార శాఖ వేపాడ మండలం బొద్దాం లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రెస్ అకాడెమీ ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా మరింత క్రియా శీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయ పడ్డారు. తప్పులని తప్పుగా ఎత్తి చూపించినప్పుడే వాటిని సరిదిద్దుకునే అవకాశం నాయకులకు కలుగుతుందన్నారు.
ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత్రికేయులకు శిక్షణ కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఇదో చక్కని వేదికని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని, అణగారిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపి బెళ్ళాన చంద్రశేఖర్ ని, ఎమ్మెల్యే శ్రీనివాసరావు నీ సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు డి.రమేశ్ నీ సీనియర్ పాత్రికేయులు ఎలిసెట్టి సురేష్ నీ, మయూరి హోటల్ యజమాని సాంబశివరావు నీ పాత్రికేయులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. సీనియర్ పాత్రికేయుడు బూరాడ శ్రీనివాసరావు పర్యవేక్షణ లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయనగరం పట్టణానికి చెందిన పలువురు జర్నలిస్టులు , సమాచార శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భూముల సమగ్ర సర్వే ద్వారా యజమానుల భూములకు రక్షణ లభిస్తుందని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు ప్రభాకర రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వంద సంవత్సరాల అవంతరం రాష్ట్ర ప్రభుత్వం ఒక మహా యజ్ఞంలా సమగ్ర భూ సర్వేను రాష్ర్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్నదని సదరు ప్రకటనలో వినరించారు. వై.యస్.ఆర్.జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పధకం ద్వారా చేయపడుతున్న కార్యక్రమమే మీ భూమి మా హమీ కార్యక్రమమని సర్వే సహయ సంచాలకులు ప్రభాకర రావు అన్నారు. భూముల రికార్డులు భూమి స్ధితికి ప్రతిబింబించేలా లేకపోవటం వలన భూముల అమ్మకానికి, కొనుగోలు చేయటానికి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగ వలసిన పరిస్థితికి స్వస్తి చెప్పడం జరుగుతుందన్నారు. దీని వలన భూముల కొనుగోలు, అమ్మకాలలో ఇబ్బందులు తొలగి పోతాయని, టైటిల్ రిజిస్ట్రేషన్ అమలులోకి రావటం వల్ల ఈ సమస్యలన్నీ సమసిపోతాయని చెప్పారు.
ఆస్తి యజమానుల శ్రేయస్సు కోసం శాశ్వత హక్కు నిర్దారించడం, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ 2019 ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. భూమి మరియు రెవిన్యూ రికార్డులను అనుసంధానించడం కోసం సమగ్ర భూ సర్వే కార్యక్రమం వై.యస్.ఆర్.జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పధకం ఈ నెల 21 న ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. మన జిల్లాలో డిసెంబర్ 14 నుండి 19 తేది వరకు మెుదటి విడతలో భూ సర్వే కార్యక్రమం 645 గ్రామలలో జరుగుతుందన్నారు. ఇందు నిమిత్తం ఏర్పాటు చేయు గ్రామ సభలలో పాల్గొనవలసినదిగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అర్జీలు పెట్టకపోయినా కూడా అన్ని భూములను సంపూర్ణమైన సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. తద్వారా యాజమాన్యపు హక్కు నిర్దారణ రికార్డులలో నిక్కచ్చి నమోదు జరుగుతుందని అయన తెలిపారు.
సమగ్ర భూసర్వే కార్యక్రమం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ముఖ్యంగా ప్రజలు చూపించిన హద్దులలో వారి సమక్షంలోనే ఖచ్చితమైన కొలతలతో సర్వే చేయడం జరుగుతుందన్నారు. భూములుపై శాశ్వత హక్కు లభిస్తుందని, ప్రతీ కమతానికి మ్యాపింగా చేయడం జరుగుతుంది యు.ఐ.డి. నెంబరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో జగనన్న అమ్మ ఒడి వివరాలను ఈ నెల 14 వ తేదీ లోగా విద్యార్ధుల తల్లి తండ్రులు లేదా సంరక్షకులు సంబంధిత పాఠశాలలలో అందించాలని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా లబ్ది పొందిన తల్లులు కాని సంరక్షకులు కాని వారి వార్షిక ఆర్ధిక సాయం చెల్లింపు విధానాన్ని మరియు పర్యవేక్షణ విధానాన్ని ఆన్ లైన్ ద్వారా చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా అర్హులైన తల్లి/తండ్రి/సంరక్షకులు సంబంధిత పాఠశాలలలో ఆధార్, బ్యాంక్ అక్కౌంట్, ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్, రైస్ కార్డు తదితర వివరాలను ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గం.ల లోపు అందించాలని తెలిపారు. సదరు వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరి చూసి అమ్మ ఒడి పోర్టల్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అమ్మ ఒడి పోర్టల్ నందు వున్న వివరాలను గ్రామ/వార్డు సచివాలయాలలో డిశంబరు 16వ తేదీన విడుదల చేస్తారని చెప్పారు.
ఇందులో నమోదైన వివరాలను డిశంబరు 17 నుండి 19వ తేదీలోగా సంబంధిత సచివాలయాలలో తల్లితండ్రులు లేదా సంరక్షకులు సరిచూసుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తప్పొప్పుల వివరాలను తెలపలసి వుంటుందని సదరు ప్రకటనలో వివరించారు. సదరు అనర్హత పట్ల అభ్యంతరాలను సచివాలయాలలో విడుదల చేసిన స్టాండర్డు ఆపరేటింగ్ పధ్ధతి ద్వారా సంయుక్త కలెక్టర్ వారికి సమర్పించనున్నట్లు తెలిపారు. సరిచేసిన వివరాలను సచివాలయాలో ఈ నెల 20 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు నోటీసు బోర్డునందు ప్రకటించడం జరుగుతుందని, మరలా తల్లి/తండ్రి/సంరక్షకులు వాటిని సరిచూసుకునే సౌలభ్యం కలిగించడం జరుగుతుందని చెప్పారు. మరలా సరిచేసిన తప్పొప్పులను డిశంబరు 26వ తేదీన అమ్మ ఒడి పోర్టల్ నందు ప్రకటించడం జరుగుతుందని, తుది జాబితా గ్రామ సభ ద్వారా ఆమోదించడం జరుగుతుందని చెప్పారు. ఈ విధంగా ఆమోదించబడిన తుది జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి డిశంబరు 30 వ తేదీన జిల్లా కలెక్టరుకు సమర్పించడం జరుగుతుందని, కావున అమ్మ ఒడి లబ్దిదారులు వారి వివరాలను సరి చూసుకనే అవకాశాన్ని వినియోగించుకోవాలని సంయుక్త కలెక్టర్ సదరు ప్రకటనలో కోరారు.
చేనేత కార్మికులకు చేయూత నందించడానికి చర్యలు తీసుకోనున్నట్లు హాండ్లూమ్స్ డైరక్టర్ , ఆప్కో మేనేజింగ్ డైరక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఐ.ఎ.ఎస్. తెలిపారు. ఆదివారం ఆయన జిల్లాలో పర్యటించారు. ఆప్కో షో రూమ్స్, హాండ్లూమ్స్ కార్యాలయం, చేనేత షాపింగ్ కాంప్లెక్స్, డివిజనల్ మార్కెటింగ్ కార్యాలయాలను సందర్శించారు. చేనేత కార్మికులతో మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం పొందూరు, రాజాం చేనేత సహకార సంఘాలను, షోరూమ్ లను సందర్శించి అక్కడి చేనేత కార్మికులతో మాట్లాడారు. అక్కడ నిల్వ వున్న స్టాక్, చేనేత మగ్గాలను స్వయంగా పరిశీలించారు. చేనేత కార్మికులకు చేయూత నిచ్చి వారి స్థితిగతులను మెరుగుపరచనున్నామని వారికి తెలిపారు. ఇందు నిమిత్తం వారు నేసిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేస్తామని, వారికి ముద్ర రుణాలను అందించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి సహాయ సంచాలకులు డా.వి.పద్మ, ఆప్కో జెనరల్ మేనేజర్ రమేష్ బాబు, డివిజనల్ మార్కెటింగ్ అధికారి ఉమాశంకర్, హాండ్లూమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 1 పరీక్షలు జరగనున్నాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కోవిడ్ నిబంధనలను తూ. చ తప్పకుండా పాటించాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను దరిస్తూ చేతులను సానిటైజ్ చేసుకోవాలని చెప్పారు. ఎచ్చెర్లలోని శ్రీశివానీ ఇంజినీరింగ్, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలల్లో జరగనున్న ఈ పరీక్షలకు 312 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారని తెలిపారు. ప్రతీ రోజూ ఉదయం 10.00గం.ల నుండి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. సకాలంలో రాని అభర్థులను లోనికి అనుమతించరని అన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థుల కొరకు ఆర్.టి.సి బస్సులను ఏర్పాటుచేసిందని తెలిపారు. అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు ప్రతి, కలం, ట్రాన్స్ ప్రెరెంట్ వాటర్ బాటిల్ తెచ్చుకోవాలని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆధార్ లో ఇంటి పేరు మారిన అభ్యర్థులు ప్రూఫ్ తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఏదైనా సమస్యలు తలెత్తితే ఏ.పి.పి.యస్.సి సెక్షన్ ఆఫీసర్ పైడి ఢిల్లీశ్వరరావు,సెల్ 90145 50915 నెంబరును సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని డి.ఆర్.ఓ ఆ ప్రకటనలో వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్ రాత పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. గండేపల్లి మండలంలోని సూరంపాలెంలో గల ఆదిత్యా ఇంజనీరింగ్ కాలేజీ; ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్షా కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.
అలాగే పరీక్ష నిర్వహణపై నోడల్ అధికారిగా వ్యవహిరిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు అధ్యక్షతన శుక్రవారం రాత్రి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతినిధులు, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లుతో పాటు రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రికల్, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన అధికారులు హాజరైనట్లు ఆయన తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు తగిన సూచనలిచ్చినట్లు పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం కాకినాడ, రాజమహేంద్రవరం, తుని, ఏలేశ్వరం, జగ్గంపేట, అమలాపురం వయా కాకినాడ మీదుగా బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులను డిఆర్ఓ సత్తిబాబు కోరారు.
అభ్యర్థులకు సూచనలు:
- హాల్ టికెట్లో ఇచ్చిన సూచనలను తు.చ. తప్పకుండా పాటించాలి.
- పరీక్షా కేంద్రానికి ఉదయం 9.30 గంటలకు ముందే చేరుకోవాలి.
- పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులు తీసుకెళ్లకూడదు.
- అభ్యర్థులు సమాధాన పత్రాల్లో గుర్తింపు సూచికలు రాయకూడదు.
- బ్లూ లేదా బ్లాక్ పెన్నులను మాత్రమే ఉపయోగించాలి. రంగు స్కెచ్ పెన్నులు ఉపయోగించకూడదు.
- అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటించాలి. తప్పనిసరిగా మాస్కు ధరించాలి.
కరోనా వైరస్ పట్ల అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ (గ్రామ /వార్డు సచివాలయాలు,అభివృద్ధి) డాక్టర్. ఏ .సిరి తెలిపారు .శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి తో కలిసి ఆమె పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ .ఏ. సిరి మాట్లాడుతూ, పశ్చిమ దేశాల్లో కరోనా రెండవ దశ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలు ఎవరు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ 19 నియంత్రణలో భాగంగా జిల్లాలో డిసెంబర్ 1 నుంచి జనవరి 19 వరకు 50 రోజుల పాటు వివిధ శాఖల భాగస్వామ్యంతో ముమ్మురంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, జాగ్రత్తలు పాటిస్తే, మన ఆరోగ్యం - మన చేతుల్లో ఉంటుందన్న విషయాలపై జిల్లాలోని ప్రజలకు 50 రోజులపాటు అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నామన్నారు.
జిల్లాలో కరోనా కేసులు తగ్గాయని ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని, మాస్కు ధరిస్తూ భౌతిక దూరం పాటించడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. కరోనా వైరస్ ప్రబలినప్పుడు ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారో అదే జాగ్రత్తలను ఇప్పుడు కూడా తీసుకోవాలన్నారు. "మాస్క్ సరిగా పెట్టు... కరోనా ఆటకట్టు", "ఆరు అడుగుల దూరం... కరోనా మీకు దూరం", చేతులశుభ్రం... ఆరోగ్యం భద్రం/ మన ఆరోగ్యం - మన చేతుల్లో" అనే అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకునేలా ఇప్పటివరకు జిల్లా మరియు63మండల స్థాయి అధికారులు,స్వచ్ఛంధ సంస్థలు,విద్యాశాఖ, రవాణాశాఖ,స్కిల్ డెవలప్మెంట్, జిల్లా మైనారిటీ సంక్షేమం, పంచాయతీరాజ్ ,గ్రామీణ అభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,డి ఆర్ డి ఎ,మెప్మా శాఖల ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిచడం జరిగిందన్నారు.
విద్యాశాఖ ద్వారా జిల్లాలోని 621 పాఠశాలలో, 4473 మంది టీచర్లు, 25,611మంది విద్యార్థులకు, ప్రజా రవాణా శాఖ ద్వారా 11 బస్సు డిపోలల్లో, జిల్లాలోని ఆరు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ల ద్వారా 160 మందికి అవగాహన కల్పించామన్నారు. అలాగే జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా మార్కెట్ యార్డ్ చైర్మన్, ప్రభుత్వ ఖాజీలు,పాస్టర్లు ,ఇతర మత పెద్దలతో సమావేశాన్ని నిర్వహించి మసీదులు ,చర్చిలలో ప్రార్ధనా సమయంలో భౌతిక దూరాన్ని పాటించాలని, కరోనా నివారణపై చర్యలు చేపట్టాలని ,మాస్కులు ధరించాలని , చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించడం జరిగిందన్నారు .జిల్లా పంచాయతీ శాఖ ద్వారా 1044 పంచాయతీలలో సమావేశాలు నిర్వహించి, మైకుల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ, కరోనా వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ, వాటిపై రూపొందించిన మూడు రకాల పోస్టర్లను1044 గ్రామ పంచాయతీల్లో 3132 పోస్టర్లను ప్రదర్శించడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో, 345 వార్డులలో మైకుల ద్వారా ప్రచారం, 165 హోర్డింగులఏర్పాటు, చేతులు పరిశుభ్రంగా ఉంచడం పై 516 సమావేశాలు నిర్వహించడమే కాకుండా కళాజాతాల ద్వారా కూడా అవగాహన కల్పించారన్నారు .డీఆర్డీఏ ద్వారా జిల్లా సమాఖ్య, 63 మండల సమాఖ్యలు, 2880 గ్రామ సంఘాలలో సమావేశాలు నిర్వహించి 4,27,682మందికి మాస్క్ కవచం, ఆరు అడుగుల దూరం, చేతులు శుభ్రం లపై అవగాహన కల్పించామన్నారు.ఇదే అంశాలపై మెప్మా ద్వారా 12 మున్సిపాలిటీలలో 2480 అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, 17 ర్యాలీలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో62000 మంది సభ్యులు పాల్గొన్నారన్నారు. ఏఎన్ఎం, ఆశ, మరియు వాలంటీర్లతో 1500 టీములు ఏర్పాటుచేసి 2350 మంది గ్రామ సెక్రటరీలు, వాలంటీర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించామన్నారు.1980 పోస్టర్లను ప్రదర్శించడం జరిగిందని 2500 నివాసాలలో మైకుల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో అధికారుల సమిష్టి కృషితో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు .తద్వారా జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిందన్నారు. అయినప్పటికీ ప్రజలు అజాగ్రత్తగా ఉండకుండా ,ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈనెల,2021,జనవరి మాసాలలో క్రిస్మస్ ,జనవరి 01, భోగి,సంక్రాంతి,కనుమ పండుగలు వస్తున్నందున ప్రజలు ప్రార్థనలు ,పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలు, తదితర కార్యక్రమాల్లోఅధికసంఖ్యలో పాల్గొంటారనన్నారు.ఈ పండుగ సందర్భంగా ప్రజలెవ్వరూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని మీడియాద్వారా తెలియజేస్తున్నామన్నారు.
డిఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 రోజుల పాటు కరోనా నివారణ- తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి వివిధ శాఖల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డెమో ఇంచార్జ్ ఉమాపతి, డిప్యూటీ హెచ్ ఓ గంగాధర్,హెల్త్ ఎడ్యుకేటర్లు చంద్రశేఖర్రెడ్డి ,రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా ఈ నెల 14 నుంచి 20 వరకు లెండి కాలేజ్ లో జరగనున్న గ్రూప్-1 మెయిన్ పరీక్షకు ఏర్పాట్లన్నీ పక్కాగా చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి గణపతి రావు అధికారులకు ఆదేశించారు. శనివారం ఆయన ఛాంబర్ లో ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు. ఈ పరీక్ష ఉదయం 10 నుండి 1 గంట వరకు జరుగుతుందని, 217 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థులను 8.45 గంటల నుండి 9.45 వరకు కేంద్దం లోనికి అనుమతిస్తారని అన్నారు. హాల్ టికెట్ తో పాటు ఏదయినా గుర్తింపు కార్డ్ ను తమతో తీసుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. మొట్ట మొదటి సారి ప్రశ్నాపత్రం టాబ్ ఆధారితంగా ఉంటుందని, అదనంగా టాబ్ లను ఏర్పాటు చేసుకోవాలని కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ కు సూచించారు. కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, మాస్క్, సానిటైజర్ తో అందరూ హాజరు కావాలని అన్నారు. కోవిడ్ పేషెంటు ల కోసం ఒక ఐసోలాషన్ రూమ్ ను ఏర్పాటు చేయాలన్నారు. వైద్య శాఖ వారు థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖ గట్టి బందోబస్త ను ఏర్పాటు చేయాలని సూచించారు. సీటింగ్ ఏర్పాట్లు, ఇన్విజిలేటర్లను, టాబ్ కనెక్షన్స్ కు విద్యుత్, జనరేటర్ ను కాలేజీ యాజమాన్యం ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ పరిశీలకులు శంకర రావు, ఈశ్వరి, కలెక్టరేట్ ఏ ఓ దేవ్ ప్రసాద్, బి సెక్షన్ సుపరింటెండ్ మహేశ్వర రావు, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలోని సంబంధిత అన్ని వర్గాల వారి సహకారంతో జాతీయ లోక్ అదాలత్ను శనివారం జిల్లాలోని న్యాయస్థానాల్లో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తల గోపి అన్నారు. జిల్లావ్యాప్తంగా కక్షిదారులు, పోలీసులు, ప్రజల సహకారంతో లోక్ అదాలత్ లో రాజీమార్గం ద్వారా పలు సివిల్, క్రిమినల్ రాజీపడదగ్గ పలు కేసులను శాశ్వత పరిష్కారం చేయగలిగామని పేర్కొన్నారు. ఈజాతీయ లోక్ అదాలత్ లో 878 కేసులు రాజీమార్గంలో పరిష్కరించామని, దీనివల్ల 3,000 మంది లబ్దిపొందారని తెలిపారు. కేసుల పరిష్కారం ద్వారా రూ.2,26,53,262 కోట్ల మొత్తాన్ని కక్షిదారులకు చెల్లించడం జరిగిందన్నారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, బ్యాంకు కేసులు, పలు సివిల్ క్రిమినల్ కేసులను, చెక్ బౌన్సు కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. లాక్ డౌన్ కాలంలో నమోదైన కోవిడ్-19, పలు రకాల కేసులకు అపరాధ రుసుము విధించి ఆ కేసులను జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ లోక్ అదాలత్ను పెద్ద ఎత్తున కక్షిదారులు వినియోగించుకొని లబ్దిపొందారని పేర్కొన్నారు.
ఈ లోక్ అదాలత్లో ఎస్.సి., ఎస్.టి. కోర్టు ప్రత్యేక 4వ జిల్లా న్యాయమూర్తి ఎస్.శారదాదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.లక్ష్మీరాజ్యం, మొదటి శ్రేణి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ బి.శ్రావణి, సీనియర్ న్యాయవాదులు కె.శ్రీనివాసరావు, పి.ధనుంజయరావు, జి.సత్యం, ఎం.భాస్కరరావు, జి.హెచ్.హిమబిందు, ఏ.వి.ఎల్.పద్మజ, పోలీసు, వైద్య శాఖ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
చారిత్రాత్మకమైన వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పధకం క్రింద జరిపే రీ సర్వే కార్యక్రమానికి సర్వేయర్లంతా సన్నద్ధం కావాలని సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ ఆదేశించారు. భూముల సమగ్ర రీ సర్వే పధకం పై తసిల్దార్ లు, రెవిన్యూ అధికారు లు, సర్వేయర్ల తో శనివారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. రీ సర్వే పై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. ఎలాంటి సందేహాలున్న వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ముందుగా రీ సర్వే కు అవసరమగు రికార్డులను, మెటీరియల్ ను ,టెక్నాలజీ ను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమానికి నిర్దిష్ట కాల పరిమితిని విధించడం జరిగిందని అన్నారు. కాలం తో పాటు పరిగెడితేనే ముందుకు వెళ్ళగలమని , ఏ దశ లో ఆగినా వెనకబడి పోవడం ఖాయమని గుర్తించాలని అన్నారు. రెవిన్యూ చట్టాల పైన పూర్తీ స్థాయి లో అవగాహన పెంచుకోవాలని అన్నారు. రీ సర్వే పధకం క్రింద భూముల స్వచ్చీకరణ, రీ సర్వే , భూమి సెటిల్మెంట్ ను ఒకేసారి చేయవలసి ఉంటుందని అన్నారు. రాష్ట్రమంతటా ఒకే సారి టైం బౌండ్ లో జరిగే కార్యక్రమం కావున పోటీ పడి పని చెయ్యాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే సర్వేయర్లకు శిక్షణలు పూర్తి చేయడం జరిగిందని మనసా వాచా పని చేసి తమ సమర్ధతల్ని నిరూపించుకోవాలని హితవు పలికారు. .
ఈ నెల 14 నుండి 19 వరకు గ్రామ సభలు నిర్వహించాలని, ఈ సభలలో సర్వే ప్రక్రియ, దాని లాభాలను ప్రజలకు వివరింఛి, వారికి కలిగే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. 21 నుండి ప్రారంభించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎటువంటి అర్జీ పెట్టకపోయినా సంపూర్ణ మైన సర్వే నిర్వహణ, యాజమాన్యపు హక్కు నిర్ధారణ, రికార్డులలో నమోదు అవుతాయని వివరించలన్నారు. మొదటి విడత లో జిల్లాలో 499 గ్రామాల్లో సర్వే జరుగుతుందని, గ్రామ సరిహద్దులను ముందుగా నిర్ధారించాలని తెలిపారు. భూ యజమాని సమక్షం లోనే ఖచితమైన కొలతలు వేసి సర్వే చేయాలనీ, హద్దు రాళ్ళను ఉచితంగా వేయాలని తెలిపారు. ప్రతీ కమతానికి మ్యాప్, అదార్ మాదిరి విశిష్ట సంఖ్య నివ్వడం జరుగుతుందన్నారు. శాశ్వత హక్కుల కల్పనకు ఖచ్చితమైన భూ, రెవెన్యూ రికార్డుల నమోదు చేయడమే కాకుండా అభ్యంతరాల పరిష్కారానికి మొబైల్ టీం లను కూడా వేయడం జరుగుతుందని తెలిపారు. తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఉపయోగ పడుతుందని, చరిత్ర లో నిలిచిపోయే ఇలాంటి కార్యక్రమం లో పనిచేయడం గొప్పగా భావించి ప్రతి ఒక్కరు చిత్త శుద్ధితో పని చేయాలనీ కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సహాయ కలెక్టర్ సింహాచలం, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, ఆర్.డి.ఓ. భవానిశంకర్, సర్వే శాఖ అధికారులు, కే.ఆర్.ఆర్.సి ఉప కలెక్టర్ బాలా త్రిపుర సుందరి తదితరులు హాజరైనారు.
రోనా నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మన ప్రియతమ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనా ప్రపంచాన్ని గడ గడ లాడించిన తరుణంలో మన రాష్ట్రంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. అత్యధికంగా కరోనా పరీక్షల నిర్వహించిన రాష్ట్రం మనదేనన్నారు. మన జిల్లాలో ముఖ్యమంత్రి ఆదేశాలతో పాటు మన జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో యంత్రాంగం మంచి సేవలను అందించిందని తెలిపారు. ఆ చర్యల ఫలితంగా కరోనా తగ్గుదలలో సఫలీకృతులం అయ్యామని తెలిపారు. మన జిల్లాలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ప్రజలను నిరంతరం అప్రమత్తత చేయడం జరిగిందని తెలిపారు. వలస కార్మికుల రాక వలన కరోనా వ్యాధి ప్రబలినా, వైద్య ఆరోగ్య శాఖ, రెవిన్యూ శాఖ, పోలీసు శాఖ, తదితర ప్రభుత్వ యంత్రాంగం అందించిన నిరంతర సేవల ఫలితంగా డిశంబరు నాటికి తగ్గుదల వచ్చిందన్నారు. అనేక దేశాలలో సెకెండ్ వేవ్ ప్రారంభమైనందున మనం ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలను కొనసాగించవలసిన అవసరం వుందన్నారు. ఇందు నిమిత్తం ప్రభుత్వం, డిశంబరు ఒకటవ తేదీ నుండి జనవలి 19వ తేదీ వరకు 50 రోజులు కేంపెయిన్ నిర్వహిస్తున్నదని తెలిపారు. కరోనా ప్రబలకుండా మనమంతా కలసికట్టుగా పని చేయాలని కోరారు. ముఖ్యంగా మనది వ్యవసాయాధారిత జిల్లా కావున సంక్రాంతి పండుగను ఘనంగా జరిపించుకోవడం జరుగుతుందని, బంధు మిత్రులతో పండుగను జరుపుకోవడం ఆనవాయితీ అని తెలిపారు. గ్రామాల నుండి పట్టణాలకు షాపింగుల కోసం రావడం జరుగుతుందని చెప్పారు. ఈ నేపధ్యంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రబలకుండా మరింత అప్రమత్తత అవసరమన్నారు. వాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా వుండాలని కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు.
రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, కరోనాను పూర్తిగా నిర్మూలన చేయడానికి ప్రభుత్వం 50 రోజులు పోజిటివ్ వార్ ప్రకటించిందన్నారు. కోవిడ్ నుండి పూర్తి రక్షణ కోసం ప్రభుత్వం 50 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదన్నారు. రైతుల పండుగ సంక్రాంతి, కుటుంబ సమేతంగా చేసుకునే ఆంధ్రుల పండుగ అని, మనందరం జాగ్రత్తలు పాటించాలని అన్నారు. మార్చి నుండి నేటి వరకు జిల్లా యంత్రాంగం ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ కరోనా కట్టడికి శక్తి వంచన లేకుండా అవిశ్రాంతంగా పని చేసారని తెలిపారు. ప్రపంచం మొత్తంలో కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపించిన సమయంలో మనం కూడా కొంత కరోనాకు గురి కావడం జరిగిందన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మన జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఇందుకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్, వైద్య సిబ్బంది, వాలంటీర్లతో సహా అందరూ మంచి సేవలను అందించారని తెలిపారు. ప్రభుత్వం కరోనా సెకెండ్ వేవ్ ప్రబలకుండా అడ్డుకోవడానికి 50 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో ప్రభుత్వ శాఖలన్నీ పాల్గొంటాయని తెలిపారు. ప్రింట్ ఎండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ కరోనాతో యుధ్ధం అనే ఉద్యమంలో పాల్గొని తమ వంతు సహకారం అందించాలసి కోరారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై పోరాటానికి 50 రోజులు ప్రణాళికను రూపొందించడం జరుగిందన్నారు. వాలంటీర్లు ఈ 50 రోజుల పాటు ఇంటింటికీ వెళ్ళి మాస్కు వుపయోగించటం, సానిటైజరు వుపయోగించుకునే విధానం, సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత తదితర విషయాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించడం జరుగుతున్నదన్నారు. ఈ నెల 1వ తేదీన కార్యక్రమం ప్రారంభమైనదని, 2020 జనవరి 19 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రెవిన్యూ, ఇండస్ట్రీస్, సివిల్ సప్లైస్, ఎగ్రికల్చర్, లేబల్ డిపార్టు మెంటు, ఎండోమెంట్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, స్వయంశక్తి సంఘాలు, ఆటో వారు, ఉపాధిహామీ పని వారు, స్వఛ్ఛంద సంస్థలతో విస్తృతంగా సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సెకెండ్ వేవ్ ప్రబల కుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ కరోనా పూర్తి నివారణకు సహకారం అందించాలన్నారు.