మహా విశాఖ నగర పరిధిలో మంజూరు చేయబోతున్న టిడ్కో గృహాల పట్టాల రిజిస్ట్రేషన్లు, ఎల్.పి.సి.లు పంపిణీ కార్యక్రమం రిజిస్ట్రేషన్లకు సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆయా శాఖల అధికారులను కోరారు. కార్పోరేషన్ సమావేశ మందిరంలో ఆమె, విశాఖపట్నం ఆర్.డి.ఓ విశాఖ జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ డిప్యూటీ ఇన్స్ స్పెక్టర్ జనరల్, జోనల్ కమిషనర్లు, ఏ.పి.డి.లు, పి.డి. (యు.సి.డి.), తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లతో కలసి పట్టాల పంపిణీ కార్యక్రమం సవ్యంగా నిర్వహించడానికి గాను సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, కార్పోరేషన్ పరిధిలో 24,192 టిడ్కో గృహాల మంజూరు మరియు రిజిస్ట్రేషన్లు ఈ నెల 25వ తేది నుంచి నిర్వహించవలసి ఉన్నందున వివిధ శాఖలు అధికార్లు, పని విభజన చేసుకొని సమన్వయంతో పనిచేసి, కార్యక్రమానికి ఎటువంటి అవరోధాలు ఏర్పడకుండా పనులు పూర్తిచేయాలని కోరారు. లబ్ది దారులు ఎంపిక లాటరీ ద్వారా పూర్తీచేసి, 20వ తేది నాటికి జోన్ల కమిషనర్లకు అందజేయాలని పి.డి.(యు.సి.డి.)ని ఆదేశించారు. జోనల్ స్థాయిలో, బృందాలను ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ నిమిత్తం డాక్యుమెంటేషన్ పనులు 21వ తేది నుండి 23వ తేది వరకు జోనల్ కమిషనర్లు నిర్వహించాలని ఆదేశించారు. సంబందిత లబ్దిదారులు, గృహాలు నిర్మించిన పరిధిలో గల తహశీల్దారుల వద్ద 25వ తేదీ నుండి రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని తహశీల్దారులను కోరారు.
రిజిస్ట్రేషన్లు చేసేవిధానం, తహశీల్దారులకు క్రొత్త గావున, రిజిస్ట్రేషన్ చేసే విధానంపై తహశీల్దారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని రిజిస్ట్రేషన్లు శాఖ డి.ఐ.జి. గారిని కోరారు. ముఖ్యంగా తహశీల్దార్లు రిజిస్ట్రేషన్ చేయబోతున్న భూమి వివరాలు 22A క్రింద ఉన్నాయా లేదా అని పరిశీలించమన్నారు. నగర పరిధిలో గల సుమారు 8వేల ఎల్.పి.సి.లు కూడ ఇవ్వడానికి తగు చర్యలు చేపట్టాలని తహశీల్దారును కోరారు. 300 అడుగులు గల టిడ్కో గృహాలను ఒక్క రూపాయ విలువతో రిజిస్ట్రేషన్ త్వరితగతిన చేపట్టాలని ముఖ్యంగా ఈ సంఖ్య ఎక్కువగా గల అనకాపల్లి, గాజువాక సంబందిత జోనల్ కమిషనర్లు, తహశీల్దార్లు మరింత శ్రద్ద వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాస రావు, ఆర్.డి.ఓ. కె.పి.కిషోర్, డి.ఐ.జి. (రిజిస్ట్రేషన్ శాఖ) నాగలక్ష్మి, అందరు జోనల్ కమిషనర్లు, ఏ.పి.డి.లు, తహశీల్దార్లు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, టిడ్కో హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లర్లతో ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని, రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, ఇది రైతు ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణీ విధానాన్ని త్వరలో ప్రారంభించబోతున్నామని, దానికి తగ్గట్టుగా మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు. - రైతుల కోసం కొంత నష్టపోయినా సరే సహాయం చేసే గుణం మిల్లర్లు అలవరచుకోవాలన్నారు. మిల్లర్ల సమస్యలు తెలుసునని, ప్రభుత్వానికి వాటి గురించి తెలియ జేస్తామని చెప్పారు. మిల్లర్లు రైతులకు అండగా ఉండాలన్నారు. రైతులకు లాభం కలిగించే విధంగా ధాన్యం సేకరణకు సహకరించాలన్నారు. ధాన్యం సేకరణ త్వరిత గతిన చేపట్టాలన్నారు. రైతులకు సాయమందిద్దామని అన్నారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ, జిల్లాలో ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయుటకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. గత ఏడాది వచ్చిన సమస్యలు ధాన్యం సేకరణకు ముందుగానే అధిగమించుటకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో కొత్తగా 44 మిల్లులు వచ్చాయన్నారు. 2.41 లక్షల టన్నుల గిడ్డంగి సౌకర్యం ప్రస్తుతం ఎఫ్.సి.ఐ వద్ద సిద్ధంగా ఉందన్నారు. 3.25 లక్షల టన్నుల గిడ్డంగి సౌకర్యం జిల్లాలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో 29 శాతం తక్కువ వర్షపాతం జిల్లాలో నమోదు అయిన జిల్లా శ్రీకాకుళం జిల్లా అని, కనీసం 10 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించే అవకాశం వుందని చెప్పారు. రైతులకు సాయమందించే దిశగా ప్రభుత్వం ఉచిత పంటల బీమా అందించిందన్నారు. 1075 విత్తనం జిల్లాలో దాదాపు వేయలేదన్నారు. డిడిలు సమర్పించిన వారు ధాన్యం సేకరణ ప్రారంభించాలని తెలిపారు. అత్యధికంగా రైతుల రిజిస్ట్రేషన్ జరిగినది మన జిల్లాలోనేనని, త్వరితగతిన ధాన్యం సేకరణ చేసి పూర్తి సహకారాన్ని అందించాలన్నారు.
మిల్లర్లు మంచి పేరు తెచ్చుకోవాలని, రైతులకు మంచి ధర ఇవ్వాలని, రైతుల నమోదు ప్రక్రియలో 1.37 లక్షలు మన జిల్లాలో జరిగిందన్నారు. .తేమ శాతాన్ని ప్రామాణిక యంత్రం ద్వారా పరీక్షిస్తున్నామన్నారు. మిల్లర్లకు సహకారం అందిస్తున్నామని, రైతులకు మిల్లర్లు లబ్ది కలిగించాలని కోరారు. మిల్లర్ల సంఘం అధ్యక్షులు వాసు మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని, ఇ - క్రాప్ ను అనుసంధానం చేయాలని కోరారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఏ.కృష్ణా రావు, జిల్లా సరఫరాల అధికారి కె.వి.రమణ, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, డిసిసిబి సిఇఓ డి.సత్యనారాయణ, మార్కెటింగ్ ఎడి బి.శ్రీనివాసరావు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉద్దాన ప్రాంతంలోని పలాస, ఇచ్చాపురం నియోజవర్గ పరిధిలోని 807 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇంటింటికి శుద్ధ జలాలు అందించే వైయస్సార్ సుజలధార బృహత్తర పథకం పనులకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర పశుసంవర్ధక , పాల ఉత్పత్తి, మత్స్యశాఖ మంత్రి డా, సీదిరి అప్పలరాజు అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలం బెండి కొండపై ఎస్.డి. పి, ఎస్ డి ఎస్ నిధులు అంచనా వ్యయం రూ.700 కోట్లతో నిర్మించనున్న ఉద్ధానం సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం 150 కే ఎల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులకు రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం బెండి జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి డా, సీదిరి రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు కింద గిరిజన గ్రామాల తో పాటు ఇంటింటికి పైప్ లైన్ ద్వారా శుద్ధ జలాలు అందించి శాశ్వత పరిష్కారం చూపించనున్నామన్నారు. అందులో భాగంగా హిరమండలం రిజర్వాయర్ ద్వారా మిగులు జలాలను వినియోగించుకొని నియోజకవర్గాల్లోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలకు అనుసంధానం చేసి గ్రామాలకు తాగునీరు అందించను న్నామని తెలిపారు.
ఈ ప్రాంత ప్రజలకు శుద్ధ జలాలు అందించి కిడ్నీ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజల గుండెచప్పుడు విన్నారని అందులో భాగంగానే పలాస లో 200 పడకల కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి ని మంజూరు చేశారని అన్నారు. అలాగే పలాస డయాలసిస్ సెంటర్ లో పడక ల సంఖ్య పెంపు, హరిపురం లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి రూ.2.50 కోట్లతో ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 15 వేలు పింఛను అందిస్తున్నారన్నారు. నాడు నేడు క్రింద అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నామని చెప్పారు. మత్స్యకారులు కోరికమేరకు మండలంలోని మంచినీళ్లు పేట జట్టీ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రెండు నెలల్లోగా భావనపాడు పోర్టు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదగా పనులను ప్రారంభించి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వలసల నివారణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిసిఎమ్ సి చైర్మన్ పిరీయా సాయిరాజ్, పలాస ఏ ఎమ్ సి అధ్యక్షులు పి.వి.సతీష్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ అందాల శేషగిరి, పలాస , వజ్రపుకొత్తూరు పిఎ సిఎస్ అధ్యక్షులు మాధవరావు, దువ్వాడ మధు కేశ్వర రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ టి.శ్రీనివాస రావు, ప్రాజెక్ట్ మేనేజర్ లు శాంతి కుమార్, వెంకటేశ్వరరావు, డీ ఈ ఈ లు ఆశాలత, రజాక్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం పట్టణంలోని వయోజన విద్య ఉప సంచాలకుల వారి కార్యాలయం రిమ్స్ ఆసుపత్రి రోడ్ నుండి అఫీషియల్ కాలనీలో గల ఎ5 భవనంకు తరలించబడిందని ఆ శాఖ ఉప సంచాలకులు ముద్దాడ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు తమ కార్యాలయాన్ని ఈ నెల 15న అఫీషియల్ కాలనీలో ఎ5 భవనం ( గతంలో శరణ్య మనోవితాస కేంద్రం భవనం), పోస్ట్ ఆఫీస్ ప్రక్కనకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. కావున జిల్లా అధికారులు, ప్రజలు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు. ఇకపై కార్యాలయపు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కొత్త కార్యాలయం నుండి జరుపబడుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.
పాఠశాల స్థాయిలో విజ్ఞాన శాస్త్ర బోధన ప్రభావవంతంగా, ఆసక్తిదాయకంగా సాగాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. తన కార్యాలయంలో ఏయూ ఐఏఎస్ఇ ఆచార్యులు టి.షారోన్ రాజు, సిక్కిం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆర్.ఎస్.ఎస్ నెహ్రూ సంయుక్తంగా రచించిన ‘ పెడగాగి ఆఫ్ బయలాజికల్ సైన్స్(ప్రిన్సిపల్స్ అండ్ పెరాడియమ్స్)’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్య ప్రతీ వ్యక్తి జీవితాన్ని ఎంతో ప్రభావింతం చేస్తుందన్నారు. దీని ప్రాధాన్యతను గుర్తించి తదనుగుణంగా విద్యార్థులకు శాస్త్రీయ అంశాలపై ఆసక్తి కలిగించే దిశగా బోధన జరపాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి అధ్యాపకులు ప్రత్యేక నైపుణ్యాలను, బోధన పద్దతులను అవలంభించాలని సూచించారు.
ఉపాధ్యాయ వృత్తిలో అడుగిడే వారికి ఉపయుక్తంగా పుస్తక రచన జరిపిన ఆచార్య షారోన్ రాజు, నెహ్రూలను అభినందించారు. నూతన విద్యా విధానం విద్యార్థి కేంద్రంగా బోధన, అభ్యసనాలు ఆసక్తిదాయకంగా ఉండే విధంగా ప్రోత్సహిస్తోందన్నారు. దీనిని ఆధారంగా చేసుకుని మరిన్ని పుస్తకాలను తీసుకురావాలని రచయితలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పాఠశాల విద్యను అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తోందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేయడం, ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం, నాను-నేడు పథకంతో పాఠశాల స్వరూపాన్ని పూర్తి మార్చివేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగే దిశగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రతిభను కనబరుస్తూ రాష్ట్ర విద్య,సర్వతోముఖాభివృద్దికి ఉపయుక్తంగా నిలుస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి దార్శినికంగా చేపడుతున్న పథకాలు, నిర్ణయాలు రాష్ట్ర విద్యా వ్యవస్థను కొత్త శక్తిని అందిస్తోందన్నారు.
నవోదయ విద్యాలయంలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల సమర్పణకు గడువును పొడిగించడం జరిగిందని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ బి.గోవింద రావు తెలిపారు. ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ 6వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 29వ తేదీ వరకు, 9వ తేదీలో ప్రవేశానికి ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచడం జరిగిందన్నారు. ఇప్పటికే 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు తమ దరఖాస్తులో తప్పుల సవరణకు ఈ నెల 30,31 తేదీలలో అవకాశం కల్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తులను www.navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా సమర్పించవచ్చని చెప్పారు. సంశయాలు, వివరాలకు నవోదయ విద్యాలయాల ప్రిన్సిపాల్ ను సంప్రదించవచ్చని సూచించారు.
6వ తరగతిలో ప్రవేశానికి వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన, 9వ తరగతికి వచ్చే ఫిబ్రవరి 13వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. నవోదయ విద్యాలయంలో 2021 -22 విద్యా సంవత్సరానికి 6, 9వ తరగతులలో ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానించడం జరిగిందన్నారు. 2020 – 21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్ధులు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. నవోదయ విద్యాలయాల్లో బాలురు, బాలికలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం, ఉచిత భోజన, వసతులు కల్పించడం జరుగుతుందని, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్.సి.సి,ఎన్.ఎస్.ఎస్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
జెఇఇ మెయిన్స్ వంటి పరీక్షలలో నవోదయ విద్యార్ధులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధిస్తున్న సంగతి విదితమేనని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు జిల్లాలోగల నవోదయ విద్యాలయంలో చేరుటకు అర్హులని ఆయన వివరించారు. ప్రామాణిక విద్యను పొందుటకు నవోదయ విద్యాలయాలు ప్రత్యేక వేదికగా నిలుస్తాయని, ఈ అవకాశాన్ని ఆసక్తిగల విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
సమాచార హక్కు చట్టం క్రింద ఆర్టిఐ కమిషన్కు దాఖలైన అప్పీళ్లను ఆర్టిఐ రాష్ట్ర కమిషనర్ ఆర్.శ్రీనివాసరావు విచారించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండురోజులపాటు ఈ విచారణ జరిగింది. సోమవారం 18 శాఖలకు చెందిన అధికారులతో సమావేశాన్ని నిర్వహించి, అప్పీళ్లను విచారించి, తగు ఉత్తర్వులను జారీ చేశారు. రెండోరోజు మంగళవారం 22 శాఖలకు చెందిన అప్పీళ్లను విచారించి, ఆదేశాలను జారీ చేశారు. కొన్ని శాఖలనుంచి దరఖాస్తు దారులకు ఇచ్చిన సామాచారం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి, అటువంటి కేసులను కొట్టివేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని సమాచార అధికారులు (పిఐఓలు), మొదటి అప్పీల్ అధికారులు, జిల్లా అధికారులతో, ఆర్టీఐ అమలుపై బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరుగుతుంది.
విజయనగరం జిల్లాలో 256 ధాన్యం సేకరణ కేంద్రాలలో మంగళ వారం నుండి సేకరణ మొదలైందని, ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో పండగలా జరపాలని సంయుక్త కలెక్టర్ డా. జి.సి. కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం డెంకాడ సచివాలయాన్ని, ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసారు. ఈ సందర్భంగా జే.సి మట్లాడుతూ జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, లక్ష్యాలను సాధించడం లో మండల స్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయం తో పని చేయాలనీ అన్నారు. ప్రతి కేంద్రం ఆన్లైన్లో ఉండాలని, అదే విధంగా ఫిసజికల్ గా కూడా ఓపెన్ చేసి ఉంచాలని అన్నారు. తాసిల్దార్లు నిత్యం పర్యవేక్షించాలని, ప్రతి రోజూ సేకరణ పై నిర్దేశిత ప్రోఫార్మ లో నివేదకలు ఇవ్వాలని సూచించారు. ప్రతి రోజూ ఎంత మంది రైతులు ఈ క్రాప్ లో నమోదు అవుతున్నారు , ఎంత మందికి సేకరణ కూపన్ లు ఇచ్చారు, ఎన్ని ఎకరాల్లో పంట దెబ్బ తిన్నది, రంగు మారిన ధాన్యం వివరాలు సమర్పించాలన్నారు. గన్నీ సంచులు సరిపడా అందినది లేనిది తెలిఅజేయలన్నారు. బ్యాంకుల నుండి గ్యారంటీ లు ఎన్ని మిల్లులకు అందినది, ఇంకను అందవలసినవి ఎన్ని , ట్యాగ్ అయిన మిల్లుల వివరాలను అందజేయలన్నారు. ప్రతి రోజు ఎంత మొత్తం లో సేకరణ జరిగింది ఏ రోజుకారోజు సమాచారాన్ని అందజేయలన్నారు.
జిల్లాలో 2 లక్షల మంది రైతులు ఈ క్రాప్ లో నమోదు కావలసి ఉండగా ఇంతవరకు 53 వేల మందిని మాత్రమే నమోదు చేసారని, ఇంకను 1.5 లక్షల మందిని నమోదు చేసుకోవలసి ఉందని, ఈ నమోదు పై మండల వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రభుత్వ పథకాల పర్యవేక్షణలో భాగంగా పలు బ్యాంకు శాఖలను జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగరం విటి అగ్రహారంలోని కెనరా బ్యాంకు శాఖను, డెంకాడ మండలం చింతవలసలోని ఎపి గ్రామీణ వికాశ్ బ్యాంకును, కెనరా బ్యాంకు శాఖను సందర్శించారు. జగనన్న తోడు దరఖాస్తుల పెండింగ్పై ఆరా తీశారు. అలాగే వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. ఆయా బ్యాంకుల మేనేజర్లు, ఫీల్డు ఆఫీసర్లతో చర్చించారు. ఇచ్చిన లక్ష్యాల మేరకు జగనన్న తోడు యూనిట్లకు వెంటనే రుణాన్ని మంజూరు చేసి, అవి స్థాపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పర్యటనలో ఆయా సచివాలయాల పరిధిలోని వెల్ఫేర్ అసిస్టెంట్లు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
వై.ఎస్.ఆర్ ఉచిత పంటల బీమా పథకం క్రింద జిల్లాలో 3346 మంది రైతులకు 2.96 కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో మంగళవారం రాష్ట్ర మ్యుఖ్యమంత్రి జమ చేసారు. వెలగపూడి నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 1252 కోట్ల రూపాయలను 9.48 లక్షల మందికి ఒక్క బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 పంటలను బీమా క్రింద నోటిఫై చేయగా విజయనగరం నుండి వరి, వేరుసెనగ, చెరకు, అరటి పంటలకు బీమా వర్తింప చేసారు. రైతు ఒక్క రూపాయి చెల్లిస్తే, మిగిలిన ప్రీమియం ను ప్రభుత్వమే చెల్లించి ప్రతి అడుగులో రైతుకు తోడుగా నిలుస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. విజయనగరం నుండి పాల్గొన్న శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ , సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ తదితరులు రైతులకు బీమా పరిహారపు చెక్కును అందజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆశా దేవి, డి.డి నందు, ఉద్యాన శాఖ డి డి శ్రీనివాస రావు , రైతులు పాల్గొన్నారు.
డిశంబర్-25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లును రాష్ట్రంలోగల వివిధ కార్పోరేషన్, పురపాలక సంఘాల కమిషనర్లతో పట్టణ పరిపాలక శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ ఆ శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు తో కలసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గన్న కళలను సఫలీకృతం చేస్తూ, ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం గావించడానికి పలు సూచనలను మంత్రివర్యులు అందరి కమిషనర్లకు సూచించారు. కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ, వివిచ కార్పోరేషన్లో మరియు పురపాలక సంఘాలలో పట్టాల పంపిణీ, ఇండ్ల రిజిస్ట్రేషన్, బ్యాంకు రుణాలు, లబ్ది దారులకు అందించడం వంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుచున్నాయో కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు.
జివిఎంసి తరుపున కమిషనర్ డా.జి. సృజన బదులిస్తూ నగరంలో ఈ పదకం క్రింద చేపట్టబోయే 24వేలు పైబడిన టిడ్కో గృహాల మంజూరు, ఎనిమిది వేల మందికి పొసెషణ్ సర్టిఫికెట్లు, ఇంకా సుమారు 1.77లక్షల మందికి స్థల పట్టాలు మంజూరుకు తగు ఏర్పాట్లు చేపట్టామని, సంబందిత శాఖలు / బ్యాంకుల అధికారులుతో కూడా సమన్వయం చేసుకొని పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నగర పరిధిలో జయప్రదం చేయడానికి తగుచర్యలు చేపట్టామన్నారు.
విశాఖ నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దే బాధ్యత నగర ప్రజలపై ఉందని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన పేర్కొన్నారు. పరిశుభ్రత పాటించకుండా బహిరంగ ప్రదేశాలల్లో మలమూత్ర విసర్జన చేసేవారికి జరిమానా తప్పదని జివిఎంసి కమిషనర్ హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ఉత్తమ ర్యాంకు సాధించడానికి చేపడుతున్న పలు పనులు పురోగతిని మంగళవారం, వి.ఎం.ఆర్.డి.ఏ. చిల్ద్రెన్ ఎరేనా థియేటర్ లో అదనపు కమిషనరు, సి.ఎం.ఓ.హెచ్., ఏ.ఎం.ఓ.హెచ్.లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ స్పెక్టర్లు, వార్డు శానిటరీ కార్యదర్శులతో కూడుకొని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ఉత్తమ ర్యాంకు సాధనకు నగర ప్రజలతో పాటూ, అధికారులు, చిరు ఉద్యోగులు కూడా కృషి చేయాలన్నారు. నగరంలో బహిరంగ మల మూత్ర విసర్జన నిషేదమని, ఆరుబయట ఎవ్వరైనా మల మూత్ర విసర్జన చేస్తే అపరాధ రుసుం వసూలు చేయాలని శానిటరీ ఇన్స్ స్పెక్టర్లను, వార్డు శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రజా మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, వాటికి కావలసిన పరికరాలు, బ్లీచింగు, ఫినాయల్ వంటివి అందుబాటులో ఉంచాలన్నారు. కాలువలలో చెత్త వేయరాదని, కాలువలలో చెత్త వేసిన వారికి కూడా జరిమానా విధించాలన్నారు.
పెద్ద కాలువలలో పూడికలు తీసే చర్యలు చేపట్టి, ప్లాస్టిక్ వంటివి పారకుండా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, కాలువలపై చెత్త వేయరాదని బోర్డులు పెట్టాలన్నారు. ప్రతీ రోజూ వార్డు శానిటరీ కార్యదర్శులు ఉదయం 6.00గంటల నుండే వీధులను తనిఖీ చేయాలని, ఎక్కడా చెత్త లేకుండా దగ్గరుండి చెత్తను తరలించాలని ఆదేశించారు. ప్రతీ ఇంటి నుండి చెత్త నేరుగా సేకరించి, వాహనాల ద్వారా డంపింగు యార్డుకు తరలించాలన్నారు. ఇంటి నుండి సేకరించిన చెత్తను వేయకుండా వాహనాలకు అందించే ఏర్పాట్లు చేసుకొని ఆయా ప్రాంతాలలో ఉన్న డంపర్ బిన్సు ను తొలగించాలన్నారు. విధి నిర్వహణలో అంతరాయం ఏర్పడితే వార్డులో కొంత మంది శానిటరీ సిబ్బందిని, మినీ వాహనాన్ని రిజర్వులో ఉంచాలని సూచించారు. నిషేదిత ప్లాస్టిక్ సామగ్రిని అమ్మే వర్తకులపైన, ప్లాస్టిక్ బ్యాగులు వినియోగదారుల వద్ద నుండి ఎక్కువ మొత్తంలో జరిమానా విధించాలని ఆదేశించారు. డబ్ల్యూ+ క్రింద నగరం గుర్తింపునకు గాను రాబోయే స్వచ్ఛ సర్వేక్షణ్ లో దరఖాస్తు చేయబోతున్నందువలన, ఆయా అనుబంద ప్రమాణాలను అనుసరించి, ఇంటి నుండి యు.జి.డి. కనక్షనులు ఏర్పాట్లు చేయడం, సెప్టిక్ ట్యాంకులు, క్లీనింగ్ చేయడం వంటి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని నీటి సరఫరా విభాగపు పర్యవేక్షక ఇంజినీరును ఆదేశించారు.
స్వచ్చతా యాప్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేయుటకుగాను అనువుగా, ప్రజలకు అర్ధమయ్యేటట్లు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలలో తగు అవగాహన కార్యకమాలు చేపట్టాలని సూచించారు. ఆయా వార్డులనుండి చెత్తను తీసుకుపోయే వాహనాలు గాని, ట్రై సైకిళ్ళకు గాని రిపేర్లు ఎదురైతే, వెంటనే చేయించాలని చెత్తను తీసుకుపోవడానికి ఎటువంటి వాహన అవరోధం కాకుండా చూడాలని కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్) వారిని ఆదేశించారు. ఆయా వార్డుల్లో ఇంటి నుండి చెత్తను నేరుగా సేకరించడానికి ఏర్పాటు చేసిన ప్రైవేటు వాహనములు సరిగా వినియోగించుకునే బాధ్యతా, ఆయా వార్డుల శానిటరీ ఇన్స్ స్పెక్తర్లు, ఏ.ఎం.ఓ.హెచ్.లదే అన్నారు. విధి నిర్వహణలో నిర్లిప్తత కనబరిచిన సిబ్బందిపై తగుచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జోనల్ కమిషనర్లు నుండి అసిస్టెంట్ మెడికల్ అధికార్లు, మెకానికల్ విభాగపు ఇంజినీర్లు, శానిటరీ ఇన్స్ స్పెక్తర్లు, శానిటరీ కార్యదర్శులు అందరూ శత శాతం దృష్టి సారించి పారిశుద్ధ్య విభాగపు పనులు క్రమ పద్దతిలో చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో అధనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, పర్యవేక్షక ఇంజినీరు(నీటి విభాగం) వేణుగోపాల్, అందరు జోనల్ కమిషనర్లు, ఏ.ఎం.ఓ.హెచ్.లు, కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్), శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ స్పెక్తర్లు, శానిటరీ కార్యదర్శులు, మెకానికల్ ఇంజినీరింగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉద్యోగులు తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవాలని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ అకడమిక్ స్టాఫ్ కళాశాలలో ఏయూ ఉన్నతాధికారులు, సిబ్బందికి అందిస్తున్న వారం రోజుల నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ క్రిష్ణమోహన్ మాట్లాడుతూ ఉద్యోగులు పనితీరుపై సంస్థ పనితీరు, ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. వ్యక్తి ప్రయోజనాలకంటే వ్యవస్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సాంకేతికతను లాభదాయకంగా నిలుపుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. కేంద్రం సంచాలకులు ఆచార్య పి.విశ్వనాథం మాట్లాడుతూ వర్సిటీ డిఆర్, ఏఆర్, సూపరిండెంట్ స్థాయి బోధనేతర సిబ్బందికి ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారం రోజుల శిక్షణలో భాగంగా సిబ్బందికి అవసరమైన విభిన్న నైపుణ్యాలను వృద్ధిచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేంద్రం సహాయ సంచాలకులు ఆచార్య ఎన్.ఏ.డి పాల్ తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల శిక్షణ కార్యక్రమంలో 40మంది వివిధ స్థాయి బోధనేతర ఉద్యోగులు పాల్గొన్నారు.