జివిఎంసికి చెల్లించవలసిన పన్నులు శతశాతం వసూలు చేయాలని జివిఎంసి కమిషనర్ అదనపు కమిషనర్ ఎ.జ్యోతి అధికారులను ఆదేశించారు. బుదవారం, జివియం సి సమావేశమందిరంలో జోనల్ కమిషనర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. 2020 - 21 ఆర్ధిక సంవత్సరమునకు సంబందించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను, నీటి చార్జీలు, కళ్యాణమండపాలు, షాపులు, మార్కెట్ల నుండి రావలసిన లీజు బకాయిలు పూర్తిగా వసూలు చేయాలని ఆదేశించారు. అదాయం సకాలంలో వసూలు చేయకపోతే ప్రజలకు అందించవలసిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయన్నారు. పన్ను వసూళ్ళలో వెనుకబడ్డ రెవెన్యూ ఆఫీసర్లను, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లును తీవ్రంగా హెచ్చరించారు. నూతనంగా కట్టిన భవనాలకు, వినియోగ మార్పిడి జరిగిన భవనాలు, పన్ను పరిధిలోకి రాని ఖాళీ స్థలాలను, అసంపూర్ణంగా కట్టి వదిలేసిన అపార్ట్మెంట్లను గుర్తించి, వెంటనే పన్నులు విధించాలని ఆదేశించారు. ఒకే డోర్ నెంబర్లతో రెండు అసెస్మెంట్లు కొన్ని చోట్ల ఉన్నాయని అటువంటి వాటిని వార్డు ఎమినిటీ కార్యదర్శుల సాయంతో గుర్తించి డోర్ నెంబరు మార్పులు చేర్పులు చేయాలన్నారు. కొత్తగా కట్టిన భవనములు, ఇళ్ళు, దుకాణములు వార్డు ఎమినిటీ కార్యదర్శుల సాయంతో గుర్తించి వాటికి పన్నులు వేయాలన్నారు. ఆస్తి పన్నులతో పాటే నీటి చార్జీలు డిమాండ్ నోటీసులు పంపి నీటి రుసుములు కూడా వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు, డి.సి.(రెవెన్యూ) ఎ. రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని చినముషిడివాడలోని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని రాష్ట్ర పర్యాటశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణలు పేర్కొన్నారు. బుధవారం స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగా మంత్రి, ఎంపీలు పెందుర్తి శారధా పీఠం ప్రాంగణంలోని శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీజిని కలిసి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా మంత్రి స్వరూపానంద్రేంద్ర సరస్వతికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి అవంతి మాట్లాడుతూ, స్వామీజీ వలన ఈ ప్రాంతానికే ఆధ్యాత్మిక శోభ నిత్యం కలుగుతుందన్నారు. ఆయన తరువాత ఆయన కుమారులు సాత్వానంత సరస్వతి కూడా ఈ ప్రాంతానికి వరంగా ఇక్కడే ఉండటం అభినందనీయమన్నారు. స్వామీజి విజయనగరం ఎంపీ బి. చంద్రశేఖర్ గారు, విశాఖ రురల్ జిల్లా అధ్యక్షులు చిన్నప్పల నాయుడు, ఆడిటర్ జివి ఇతర నాయకులు పాల్గొన్నారు.
గ్రామసచివాలయాల ద్వారా ఎన్ని సేవలు అందుతున్నాయో వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు సిబ్బందిని ఆదేశించారు. నెల్లిమర్ల నగర పంచాయితీ పరిధిలోని 7వ నెంబరు వార్డు సచివాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రజలు అర్జీ చేసుకున్న ఏ సమస్యనైనా పరిష్కరించేలా సిబ్బంది అవగాహన పెంచుకోవాలన్నారు. సచివాలయం నుంచి జిల్లా కేంద్రానికి సమస్యలు రాకుండా చూడాలన్నారు. అనంతరం సచివాలయంలోని రికార్డులను, సిబ్బంది హాజరును పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డుల పంపిణీపై ప్రశ్నించారు. ఇ-రిక్వెస్టులు పెండింగ్పై ఆరా తీశారు. వైఎస్ఆర్ జలకళ, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలకు వచ్చిన దరఖాస్తులపై వాకబు చేశారు. పరిపాలన క్షేత్రస్థాయికి తీసుకురావాలని, ఇంటిముంగిటే ప్రభుత్వ సేవలను అందించాలన్న గొప్ప ఆశయంతో, ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని, ఆ లక్ష్యాలను సాధించే దిశగా సిబ్బంది కృషి చేయాలని జెసి వెంకటరావు కోరారు.
విజయనగరం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు అద్భంతంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్దిశాఖ ప్రతినిధి, జెఎస్ఎస్ కన్సల్టెన్సీ సిఇఓ డాక్టర్ బసవరాజు ప్రశంసించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతినిధిగా ఆయన ఈ నెల 12న జిల్లాకు విచ్చేసి, సుమారు వారంరోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రతీ గ్రామంలో కనీసం పదిమంది లబ్దిదారులతో భేటీ అయ్యారు. పలు ప్రభుత్వ పథకాలను, పనులను పరిశీలించారు. గ్రామ సచివాలయాలను సైతం సందర్శించారు. ఆయన ముఖ్యంగా గ్రామీణ ఉపాధిహామీ పనులు, సామాజిక పెన్షన్లు, గ్రామీణ నీటి సరఫరా, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ కార్యక్రమాల అమలు, సర్వే రికార్డుల కంప్యూటీకరణ తదితర పనులను పరిశీలించారు. విస్తృత క్షేత్ర పర్యటనలు అనంతరం ఆయన బుధవారం స్థానిక డిఆర్డిఏ సమావేశమందిరంలో, జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు ఆధ్వర్యంలో వివిధ జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో కేంద్రప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అమలవుతున్నాయని, మంచి ఫలితాలు సిద్దిస్తున్నాయని అన్నారు. అధికారులు తనకు అందజేసిన నివేదికలకు, క్షేత్రస్థాయిలోని అంశాలకు ఏమాత్రం తేడా లేదని అభినందించారు. జిల్లాలో సచివాలయ వ్యవస్థ అమలు తీరును ప్రశంసించారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలోనే ఆరోగ్య కార్యకర్త, సంక్షేమ సహాయకులు, గ్రామ పోలీసును నియమించడం గొప్పవిషయమని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు జరుగుతున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపించనున్నట్లు బసవరాజు తెలిపారు. నివేదిక ప్రతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్కు కూడా అందజేశారు. ఈ సమావేశంలో జెసి వెంకటరావుతోపాటు, డిఆర్డిఏ పిడి కె.సుబ్బారావు, డుమా పిడి ఏ.నాగేశ్వర్రావు, డిపిఓ కె.సునీల్రాజ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ పి.రవి, డిఆర్డిఏ ఎపిడి ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో క్షయ నివారణ కార్యాలయం టి.బి.యూనిట్లలో ఏడాది కాలానికి పనిచేయుటకు ఎంపికైన అభ్యర్ధుల తుది జాబితా ( మెరిట్ లిస్ట్ ) ను www.srikakulam.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచడం జరిగిందని జిల్లా క్షయ నివారణ అధికారి డా. యన్.అనూరాధ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా క్షయ నివారణ కార్యాలయం టి.బి.యూనిట్లలో ల్యాబ్ టెక్నిషియన్, టి.బి.హెల్త్ విజిటర్, టి.బి.ల్యాబ్ సూపర్ వైజర్, సీనియర్ టి.బి.ల్యాబ్ సూపర్ వైజర్, సీనియర్ ట్రీట్ మెంట్ సూపర్ వైజర్, ఒక డాట్ ప్లస్ – హెచ్ఐబీ సూపర్ వైజర్ పోస్టులకు ఏడాది కాలానికి పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరిన సంగతి విదితమే. ఈ పోస్టులకు 811 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా అభ్యర్ధుల నుండి వచ్చిన గ్రీవెన్స్ లను పరిశీలించిన పిదప రెండు ల్యాబ్ టెక్నిషియన్లు, ఇద్దరు టి.బి.హెల్త్ విజిటర్లు, రెండు సీనియర్ టి.బి.ల్యాబ్ సూపర్ వైజర్లు, ఒక సీనియర్ ట్రీట్ మెంట్ సూపర్ వైజర్, ఒక డాట్ ప్లస్ – హెచ్ఐబీ సూపర్ వైజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధుల తుది జాబితాను ఆన్ లైన్ లో, టి.బి.కార్యాలయం మరియు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి రూమ్ నెం.18 నందు పొందుపరచడం జరిగిందని ఆమె వివరించారు.
ప్రభుత్వ అభివృద్ధి పథకాల అమలు పై ప్రత్యేక దృష్టిపెట్టి యుధ్ధ ప్రాతిపదికన నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హౌసింగ్ కు సంబంధించి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, గ్రౌండింగ్, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పనులకు సంబంధించి గ్రామ సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాలు , వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులు, చిరు వ్యాపారులకు జగనన్న తోడు, నాడు- నేడు పథకం కింద పాఠశాలలు, అంగన్వాడీ భవనాలలో మౌలిక వసతులు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు, కోవిడ్-19, ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్, రబీ ప్రిపేర్డ్నేస్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల రెడ్డి , పిఅరుణ్ బాబు, ఆర్ గోవిందరావు, ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్, జీవీఎంసీ కమిషనర్ జి సృజన, జిల్లా అధికారులు హాజరయ్యారు.
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబరు 24వ తేదీ తిరుచానూరు, తిరుమల పర్యటనకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన సమీక్షలో రాష్ట్రపతి తిరుచానూరు అమ్మవారి ఆలయం, తిరుమలలో శ్రీ వరాహస్వామి ఆలయం, శ్రీవారి ఆలయంలో దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర పతి దర్శనానికి వచ్చిన సమయంలో ప్రొటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లు, కోవిడ్-19 నిబంధనల గురించి చర్చించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, అదనపు ఈఓ ధర్మారెడ్డి, జెఈఓలు బసంత్ కుమార్, సదా భార్గవి, జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలోని వివిధ పత్రికలు, టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో పని చేస్తున్న జర్నలిస్టుల హెల్త్ కార్డుల పునరుద్ధరణకు సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సమాచార పౌరసంబంధాల శాఖ, సహాయ సంచాలకులు డి.రమేశ్ తెలిపారు. అక్రెడిటేషన్ ఉండి అర్హత కలిగిన జర్నలిస్టులు ఈ నెల 30వ తారీఖులోగా ఆన్లైన్లో చలానా కట్టడం ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పారు. cfms.ap.gov.in వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి హెడ్ ఆఫ్ అకౌంట్- 8342-00-120-01-03-001-001, డీడీవో కోడ్: 2703-0802-003 నంబర్ పై రూ.1250 చెల్లించాలని పేర్కొన్నారు. నగదు చెల్లించిన అనంతరం సంబంధిత చలానాను సమాచార పౌరసంబంధాల శాఖ, విజయనగరం కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇదివరకు కార్డుల కలిగినవారు పాత కార్డులను తిరిగి ఇవ్వాలని, తాజాగా అప్లై చేసుకొనేవారు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, నిర్ణీత దరఖాస్తు, అక్రెడిటేషన్ కార్డు నకలు సమాచార పౌరసంబంధాల శాఖ, కార్యాలయంలో విధిగా సమర్పించాలని వివరించారు.
భారత దేశములో సుస్థిర, భాద్యతాయుతమైన మత్స్య అబివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.20050 కోట్లతో 2020-21 సం. నుంచి 2024-25 సం. వరకు 5 సంవత్సరాలలో అమలు పరిచేవిధంగా “ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన” పధకము ప్రవేశపెట్టారని మత్స్య శాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలా కుమారి తెలిపారు. బుధారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ పధకములో లబ్దిదారుల కేంద్రంగా పధకాల అమలు నిమిత్తము జిల్లాకు రూ. 4.54 కోట్లను ప్రస్తుత సంవత్సరానికి కేటాయించడమైందన్నారు. ఈ పధకంలోని యూనిట్ ఖరీదులో ఇతర లబ్దిదారులందరకి 40% రాయతీ, షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగలు మరియి మహిళా లబ్దిదారులకు సంబందించిన పధకాలలో 60% రాయతీగానూ, లబ్దిదారులు వాటా 40% గాను ఉంటుందని, ఈ పధకం కేంద్ర ప్రయోజక పధకమైనందున రాయతీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుందన్నారు. దరఖాస్తుదారులు ఆక్వా, మత్స్య రంగమునకు చెందినవారై ఉండాలని, తగు శిక్షణ పొంది, మంచి నైపుణ్యం కలిగిన వారై ఉండాలన్నారు. యూనిట్ల మంజూరు కోసం దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఎపిసిఎఫ్ఎస్ఎస్ నవశకం వెబ్ సైట్ నందు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్ లైన్ లో దాఖలు చేసుకోవాలన్నారు. ఫొటోతో కూడిన దరఖాస్తుతో పాటు, వారు కోరు పథకంలోని లబ్ధిదారుల వాటా సొమ్ముకు సంబంధించి బ్యాంకు రుణ మంజూరు పత్రం లేదా బ్యాంకు ఖాతా నందు లబ్ధిదారుని వాటాకు సరిపడు సొమ్ము కలిగియున్న పాసు పుస్తకము, ఇతర అనుమతులు, అవసరమైన పత్రాలు, ప్రాజెక్టు రిపోర్టులు ఆన్ లైనులో అప్ లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. ఈ విధముగా అప్ లోడ్ చేయబడిన దరఖాస్తులు వివరములను జిల్లా స్థాయి కమిటీ వారు పరిశీలించి ఎంపిక చేస్తారన్నారు. తగిన పత్రాలు అప్ లోడ్ చేయనిచో దరఖాస్తు వెంటనే తిరస్కరించబడునని, దరఖాస్తుదారులుపైన సూచించిన విధముగా 2020 నవంబరు 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవలసినదిగా కోరడమైనది. జిల్లా స్థాయి కమిటీలో ఎంపిక కాబడిన వెంటనే దరఖాస్తుదారులకు జిల్లా మత్స్య శాఖ ఉప సంచాలకులు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తారన్నారు. రూ. 50.00 లక్షలుకు పైబడిన యూనిట్ల మంజూరుకు రాష్ట్ర స్థాయి కమిటీ వారి ఆమోదం పొందవలసి యుంటుందన్నారు. ఈ పధకాలు అన్ని మార్చి 31, 2021 లోపు అమలు కావలసియున్నదని, మరిన్ని వివరాలకు గ్రామ సచివాలయాలును సంప్రదించాలన్నారు.
అనంతపురం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చిన్మయీ దేవిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ముదిగుబ్బ, నల్లమాడ, ఓడి చెరువు, అమడగూరు మండలాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా చేయడంలో మెనూను పాటించడం లేదన్న ఆరోపణలపై విచారణ విషయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సరైన విధంగా స్పందించకుండా అలసత్వం వహించడం, అంగన్వాడీ పోస్టుల నియామకాలకు సంబంధించి నిబంధనల ప్రకారం ఖాళీలను చూపకుండా తప్పుల తడకలతో నోటిఫికేషన్ జారీ చేయడం, అంతేకాక జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఈ నెల 16 వ తేదీ నుండి 15 రోజుల పాటు సెలవులో వెళ్లడంతో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ చిన్మయీ దేవిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐసిడిఎస్ పిడి స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరికి ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2020-21 ఆర్ధిక సంవత్సరానికి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో యం.యస్ నెం. 122, తేది: 01.10.2020న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్లు కలిగి (1 అక్టోబరు నెల నుంచి డిసెంబర్ 31 2020) వరకు రెన్యూవల్ చేయించుకున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఈ పథకం క్రింద నవంబరు 30వ తేది లోపు ప్రీమియం మొత్తం రూ. 1250/- చెల్లించాలి. www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా క్రింద తెలిపిన పద్దుకు ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. ప్రస్తుతం రెన్యువల్ చేసుకున్న వారు, కొత్తగా చెల్లించిన వారికి 2021 మార్చి 31 వరకు పథకం వర్తిస్తుంది. ఈ పద్దు ద్వారా Head of Account: 8342-00-120-01-03-001-001,DDO Code: 2703-0802-003 ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, రెన్యూవల్ చేసుకున్న అక్రిడిటేషన్ జిరాక్సు కాపీలను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమర్పించాల్సి వుంటుందని డిడి తెలియజేశారు..
జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ కాకినాడ ఎస్.సునీతా దేవికి మ్యాథమెటిక్స్ విభాగంలో పీహెచ్డీ ప్రధానం చేసింది. ‘‘ఏ స్టడీ ఆన్ ఏ క్లాస్ ఆఫ్ ఆల్మోస్ట్ పారాకాంటాక్ట్ మెట్రిక్ మానిఫోల్డస్’’ జెఎన్టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. ఎస్.సునీతా దేవి తన సిద్ధాంత వ్యాసాన్ని కాకినాడలోని జెఎన్టియుకె యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ (యుసిఇకె) మ్యాథమెటిక్స్ విభాగాధిపతి డా.జి.వి.ఎస్.ఆర్.దీక్షితులు, విశాఖపట్నంలోని జి.వి.పి. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ మ్యాథమెటిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.కె.ఎల్.సాయి ప్రసాద్ ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు. సునీతా దేవికి పీహెచ్డీ లభించడం పట్ల సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.
జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ కాకినాడ జి.భారతికి మేనేజ్మెంట్ స్టడీస్ విభాగంలో పీహెచ్డీ డిగ్రీని ప్రధానం చేసింది. ‘‘ఏ స్టడీ ఆన్ కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సిఎస్ఆర్) ప్రాక్టీసెస్ ఇన్ ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ), హైదరాబాద్ రీజియన్’’ జెఎన్టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. జి.భారతి తన సిద్ధాంత వ్యాసాన్ని రాజమండ్రిలోని ఆదికవి నన్నయ యూనివర్శిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డా.టేకి సూరయ్య ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు. భారతికి పీహెచ్డీ అవార్డు రావడం పట్ల సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.
జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ కాకినాడ ప్రి.త్రిపుర కు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని ప్రధానం చేసింది. ‘ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ ఏసి జనరేటర్స్ ఫర్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్’’ జెఎన్టియుకె అధికారులు ఆమోద ముద్ర వేశారు. ఈమె తన సిద్ధాంత వ్యాసాన్ని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని జెఎన్టియుహెచ్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ (యుసిఇహెచ్) ఈఈఈ విభాగం ప్రొఫెసర్ డా.జి.తులసీ రాందాస్ ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు. త్రిపురకు పీహెచ్డీ అవార్డు రావడం పట్ల సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.