అనంతపురం జిల్లాలో కరోనా నుంచి కోలుకోవడంతో 97 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు గురువారం 97 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో భాగంగా ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. ఇప్పటి వరకూ అందించిన సహకారమే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేంత వరకూ అందించాలని ఆయన కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశ ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. నాణ్యమైన సానిటైజర్లు వినియోగించాలనీ, సానిటైజర్లు లేనివారు ఏ సబ్బుతోనైనా తరచుగా 20 సెకెండ్లపాటు పరిశుభ్రం చేసుకోవాలన్నారు. పౌష్టికాహరం, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఎవరికైనా అనుమానం వున్నా, కరనా లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
విజయనగరం జిల్లాలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల ఎంపిడిఓల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మరుగుదొడ్ల వినియోగం ఆవశ్యకత, ప్రజారోగ్య పరిరక్షణలో వాటి పాత్ర తదితర అంశాలను వివరిస్తూ అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. జియ్యమ్మవలస మండలంలోని బి.జె.పేట, కె.పి.డి.వలస, బిట్రపాడు తదితర గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో గ్రామీణ నీటిసరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ పి.రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.ఇ. మాట్లాడుతూ వాతావరణ కాలుష్య నివారణకు సుస్థిర పారిశుద్ధ్యం అనే అంశంపై ఈ ఏడాది ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని జరుపుతున్నట్లు పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సురక్షిత మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజంలోని మరుగుదొడ్లకు దూరంగా ఉన్న వర్గాల వారికి ఈ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశ్యంతో వారు నివసించే ప్రాంతాల్లో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరుగుదొడ్డి ఆత్మగౌరవ చిహ్నంగా భావించాల్సి ఉందని, ఇది ప్రాణాలను కాపాడటంతోపాటు ఆరోగ్యపరమైన రక్షణ కూడా కల్పిస్తుందన్నారు. గిరిజన ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురం మండలంలోనూ పలు గ్రామాల్లో మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీలు నిర్వహించారు. బలిజిపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. దత్తిరాజేరు, బొబ్బిలి, రామభద్రపురం, భోగాపురం, బొండపల్లి, గుర్ల తదితర మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాల ఎంపిడిఓలు, గ్రామీణ నీటిసరఫరా ఇంజనీర్లు, స్వచ్ఛభారత్ మిషన్ కన్సల్టెంట్లు పాల్గొన్నారు.
అనంతపురం నగర పాలక సంస్థకు సంబంధించి ప్రసన్నాయనపల్లి, చిన్మయనగర్ లో టిడ్కో ద్వారా నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం అనంత నగర పాలక సంస్థ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి, ఆర్డీఓ గుణ భూషణ్ రెడ్డి లతో కలిసి వివిధ దశలలో నిర్మితమవుతున్న గృహ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అక్కడి నిర్మాణాలు పరిశీలించి, టిడ్కో అధికారుల ద్వారా ఇది వరకే వివిధ దశలలో జరిగిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనులపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. గృహ నిర్మాణాలపై ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఆదేశాలు అందిన వెంటనే గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని టిడ్కో అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడ్కో డిఈ రంగారావు,ఈఈ శ్యామ్ సుందర్,డిఎస్ మాక్స్ ఏజెన్సీకి చెందిన ఇంజినీరింగ్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వరంలో డిసెంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు ఇండియన్ జియోటెక్నికల్ కాన్ఫరెన్స్ 2020 ని ఆన్లైన్లో నిర్వహించనున్నారు. సదస్సు వివరాలతో కూడిన పోస్టర్ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఈ రోజు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కోవిడ్ నేపధ్యంలో సదస్సును ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సదస్సును 14 విశిష్ట అంశాలపై జరుపుతున్నారు. సదస్సులో ఐఎస్ఎస్ఎంజిఇ ఉపాద్యక్షులు ఆచార్య చార్లెస్ ఎన్జి, కాన్సాస్ యూనివర్సిటీ ఆచార్యులు జి హాన్, ఓటావా వర్సిటీ ఆచార్యులు సాయి వానపల్లి, ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ అద్యక్షులు ఆచార్య జి.ఎల్ శివకుమార్ బాబు తదితరులు ప్రసంగిస్తారన్నారు. సదస్సుకు 327 సాంకేతిక పరిశోధన పత్రాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఐజిఎస్ విశాఖ చాప్టర్ చైర్మన్ ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి, విభాగాధిపతి టి.వి ప్రవీణ్, ఆచార్య పి.వి.వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మహిళల గౌరవం, హక్కుల పరిక్షణకు అత్యధిక ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఏయూ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం నిర్వహించిన హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ మెజర్స్ సదస్సును ఆయన ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు వినియోగ వస్తువు కాదన్నారు. వారికి పూర్తి బధ్రత, రక్షణ కల్పించడం మన బాధ్యతగా నిలుస్తుందన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఈ దిశగా తొలి అడుగు వేస్తూ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి పి.ఎం నాయర్ మాట్లాడుతూ సామాజిక సమస్యలను పరిష్కారాలు చూపడంలో యువత ముఖ్య భూమిక పోసించాలన్నారు. కార్యక్రమానికి ఏపి మహిళా కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పాల్గొని తమ సంఘీభావం వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, ఐజెఎం డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ మెర్లిన్ ఫ్రిడా, ఏపి మహిళా కమీషన్ సంచాలకులు రావూరి సూయిజ్, స్టెల్లా మేరీస్ కళాశాల సోషల్ వర్క్ విభాగాధిపతి సిస్టర్ సహర మేరీ, న్యాయవాది రెహమున్నీసా బేగం, సరస్వతి అయ్యర్, బి. రాము, కేంద్రం సంచాలకులు డాక్టర్ పి.ఉష తదితరులు ప్రసంగించారు.
యువతలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పిస్తూ, రహదారి ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో నేడు నగరంలో స్టాప్ స్పీడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాదుకు చెందిన శ్రీ హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు హిమబిందు రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె ఆహ్వానించారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎంపీ వి.విజయసాయి రెడ్డి వస్తున్నారని తెలిపారు. నిర్వాహకురాలు హిమబిందు రెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు శ్రీహర్ష రెడ్డి 2015లో బైక్ ప్రమాదంలో చనిపోవడం జరిగిందని, దేశంలో ఎక్కడా యువత రహదారి ప్రమాదాలలో మరణించరాదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. గతంలో హైదరాబాదులో రెండు పర్యాయాలు, బెంగళూరుల్లో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు కాళీమాత ఆలయం వద్ద నుంచి తెన్నేటి పార్కు వరకు బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా 500 హెల్మెట్లు, 10 వీల్చెయిర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతీ వ్యక్తి సురక్షితంగా ప్రయాణం చేయాలని, దీనిపై అవగాహన కల్పించడం ర్యాలీ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ యువత ప్రాణాలు రహదారి ప్రమాదాలలో కోల్పోవడం కుటుంబానికి, సమాజానికి తీవ్ర నష్టమన్నారు. రహదారి బధ్రతా నియమావళిని అనుసరిస్తూ యువత నడచుకోవాలని సూచించారు. యువత దేశ మేధో సంపదగా నిలుస్తారన్నారు. తన బిడ్డను కోల్పోయినప్పటికీ ఇటువంటి కష్టం మరెవ్వరికీ రాకూడదనే మంచి ఉద్దేశంతో హిమబిందు రెడ్డి చేస్తున్న ఈ కార్యక్రమం హర్షణీమన్నారు. కుటుంబంలో తల్లి దండ్రులు తమ పిల్లలకు రహదారి బధ్రత, వాహన వేగ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. కుటుంబం నుంచి ఈ మార్పును తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
విశాఖకి చెందిన ప్రముఖ వైద్యులు క్రిష్ణ ఐవిఎఫ్ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ జి.ఏ రామరాజుకు ఇటలీకి చెందిన మెడికల్ ఎడ్యుకేషన్ అకాడమీ విశిష్ట గుర్తింపును లభించింది. ఇటీవల ఆన్లైన్ విధానంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ రామరాజు ‘ఎఫెక్ట్ ఇఫ్ ఎల్హెచ్సిజిఆర్ జిని పోలిమార్ఫిజమ్ ఆన్ ఎల్హెచ్ సప్లిమెంటేషన్ ప్రోటోకాల్ అవుట్కమ్స్ ఇన్ సెకండ్ ఐవిఎఫ్ సైకిల్స్- ఏ రిట్రోస్పెక్టివ్ స్టడీ’ అంశంపై ఆయన జరిపిన పరిశోధన పత్రంకు బెస్ట్ అబ్స్ట్రాక్ట్గా గుర్తింపు లభించింది. డాక్టర్ జి. ఏ రామరాజు ఏయూ హ్యూమన్ జెనిటిక్స్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా ఉన్నారు. ది లూటిన్జింగ్ హార్మోన్ వరల్డ్ కాన్షరెన్స్ 2020ని ఇటలీకి చెందిన మెడికల్ ఎడ్యుకేషన్ అకాడమీ నిర్వహించింది. ఈ అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ రామరాజు అబ్స్ట్రాక్ట్కు విశిష్ట గుర్తింపు లభించింది. గత మూడు దశాబ్ధాలుగా రామరాజు ఈ రంగంలో విశిష్ట పరిశోధనలు నిర్వహిస్తూ, నూతన ఆవిష్కరణలు జరుపుతున్నారు.
పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద డిసెంబర్ 25 న నిర్వహించే పట్టాల పంపిణీ కార్యక్రమానికి రెవిన్యూ అధికారులంతా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ఆదేశించారు. అదే రోజున జిల్లాలో సుమారు 35 వేల గృహ నిర్మణాలను కుడా గ్రౌన్దింగ్ చేసేందుకు తగు ఏర్పాట్లను గావించాలన్నారు. మున్సిపల్ కమీషనర్ లు, మండల స్థాయి అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ ఇళ్ళ స్థలాల పంపిణి, పలు ప్రభుత్వ పధకాల కోసం అవసరమగు భవనాలకు స్థలాల గుర్తింపు, వై.ఎస్.ఆర్ జల కళ , ఓటర్ల నమోదు తదితర అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మండల వారీగా సమీక్షించారు. ఇళ్ళ పట్టాల కోసం స్పందన లో అందిన దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులైన వారిని జాబితాలలో చేర్చాలని అన్నారు. ఇప్పటికి లాటరి తీయని వారు వెంటనే లాటరి తీసి స్థలాలను కేటాయించాలని, ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలనీ ఆదేశించారు. జగనన్న పచ్చ తోరణం క్రింద లే అవుట్లలో మొక్కలను వేయాలని అన్నారు. కోర్ట్ కేసులు ఉన్న చోట ప్రత్యామ్నాయ స్థలాలను చూడాలని సూచించారు. ఇళ్ళ స్థలాలకు సంబంధించి జిల్లాలో 92 కోర్ట్ కేసులున్నాయని, వాటిలో 59 పరిష్కారమైపోయాయని, మిగిలిన 33 కేసులకు కౌంటర్లు వేయాలని, యుద్ధ ప్రాతిపదికన పరిష్కారమయ్యేలా జి.పి లతో మాట్లాడుకోవాలని సూచించారు. అదే విధంగా పెండింగ్ కేసులకు సంబంధించి ప్రత్యామ్నాయ స్థలాలను కూడా సిద్ధం చేసుకోవాలని అన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలలైన సచివాలయాలు, వెల్నెస్ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాలకు అవసరమగు స్థలాలను గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు అప్పగించాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలను వై.ఎస్.ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చారని, వాటి కోసం మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న స్థలాలను, వినియోగం లో లేని భవనాలను గుర్తించాలని, అదే విధంగా రైతు బజార్ల కోసం కేటాయించి ఏర్పాటు చేయకుండా ఉన్న స్థలాలను కూడా వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కమీషనర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమూల్ కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకొని, పాడి రైతులకు లాభం చేకూర్చే ఆలోచన చేసిందని, అందు కోసం బల్క మిల్క్ చిల్లింగ్ కేంద్రాల కోసం రైతు భరోసా కేంద్రానికి దగ్గరగా లేదా పాల సేకరణకు అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. మొదటి దశ లో 17 క్లస్టర్స్ లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఆయా తసిల్దార్లు వెంటనే స్థలం ఇచ్చే పని లో ఉండాలని ఆదేశించారు. డుమా పి.డి , పంచాయత్ రాజ్ ఎస్.ఈ దీని పై దృష్టి పెట్టాలని, సంయుక్త కలెక్టర్ సంక్షేమం దీనిని పర్యవేక్షించాలని అదేసించారు.
సంయుక్త కలెక్టర్ డా. జి.సి కిషోర్ కుమార్ మాట్లాడుతూ టిడ్కో గృహాలను కూడా డిసెంబర్ 15 నాటికీ టెండర్ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. వాలంటీర్ లు టిడ్కో లబ్దిదారుల గృహాలకు వెళ్లి ప్రభుత్వం మంజూరి చేసిన లేఖలను అందజేయలన్నారు. డిసెంబర్ 10 నాటికీ జియో టాగింగ్ జరగాలని, లబ్దిదారు ఫోటో కూడా మాపింగ్ జరగాలని అన్నారు. సచివాలయాల సిబ్బంది ఈ కార్యక్రమాలను చేయాలన్నారు.
సంయుక్త కలెక్టర్ జే.వెంకట రావు మాట్లాడుతూ జిల్లాలో వై.ఎస్.ఆర్ జల కళ క్రింద 44 వేల దరఖా స్తులు అందాయని, వాటిని పరిశీలించి అర్హులైన వారికి బోర్లు, మోటర్లు అందజేయటానికి సిద్ధం చేయాలన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు మాట్లాడుతూ స్పెషల్ సమ్మరీ రివిజన్ క్రింద జనవరి 1, 2021 నాటికీ 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటర్లుగ నమోదు చేయాలని అన్నారు. క్లెయిమ్స్ అభ్యంతరాలను కూడా పరిష్కరించాలని, జనవరి 15 న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని అన్నారు. బి.ఎల్.ఓ ల ఖాళీలను పూరించాలని, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అవసరాలను వెంటనే తెలియజేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డుమా , డి. ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ లు నాగేశ్వర రావు, సుబ్బా రావు, ఉప కలెక్టర్ లు బాలా త్రిపుర సుందరి, సోల్మన్ రాజు, ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ కాకినాడ జి.చాముండేశ్వరి పీహెచ్డీ డిగ్రీ ప్రధానం చేసింది. ‘‘ఎక్స్టెండింగ్ క్లస్టరింగ్ టెక్నిక్స్ యూజింగ్ న్యూరల్ నెట్వర్కస్’’ జెఎన్టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. సిద్ధాంత వ్యాసాన్ని కాకినాడలోని జెఎన్టియుకె యూనివర్శిటీ రిజిస్ట్రార్ డా.సిహెచ్.సత్యనారాయణ, గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ డా.జి.పి.సారధి వర్మ ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు.పరిశీలకుల బృందం సిఫార్సు మేరకు ఈమెకు పిహెచ్డి ‘డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ’ అవార్డు కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగంలో లభించినది. ఈమెకు పీహెచ్డీ రావడం పట్ల సహచరులు హర్షం వ్యక్తం చేశారు.
జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ కాకినాడ పి.లలిత కుమారికి పీహెచ్డీ డిగ్రీ ప్రధానం చేసింది. ‘‘నోవల్ అప్రోచస్ ఫర్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్యాటర్న్ డిస్కవరీ మోడల్’’ జెఎన్టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. ఈమె తన సిద్ధాంత వ్యాసాన్ని కాకినాడలోని జెఎన్టియుకె యూనివర్శిటీ రిజిస్ట్రార్ డా.సిహెచ్.సత్యనారాయణ గారి ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు. పరిశీలకుల బృందం సిఫార్సు మేరకు పి.లలిత కుమారి సిద్ధాంత వ్యాసాన్ని పిహెచ్డి సిఫారసు చేయడంతో ఆమెకు ‘డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ’ అవార్డు ని కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగంలో అందించారు. ఈమెకు పీహెచ్డీ రావడం పట్ల సహచరులు హర్షం వ్యక్తం చేశారు.
జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ కాకినాడ పి.అరుణకు మారికి పీహెచ్డీ డిగ్రీ ప్రధానం చేసింది. ‘‘డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎఫీషియంట్ ఫీచర్ సెలెక్షన్ మెకానిజమ్స్ ఎట్ ఫీచర్ లెవెల్ ఫ్యూజన్ ఇన్ మల్టీమోడల్ బయోమెట్రిక్ సిస్టమ్స్ ఫర్ పెర్సన్ ఐడెంటిఫికేషన్’’ జెఎన్టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. పి.అరుణ కుమారి తన సిద్ధాంత వ్యాసాన్ని విజయనగరంలోని జెఎన్టియుకె యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం (యుసిఇవి) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాధిపతి డా.జి.జయసుమ ఆధ్వర్య పర్యవేక్షణలో సిద్ధాంత వ్యాసం సమర్పించారు. పరిశీలకుల బృందం సిఫార్సు మేరకు ఈమెకు పిహెచ్డి ‘డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ’ అవార్డు కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగంలో లభించినది. పి.అరుణ కుమారి ప్రస్తుతం విజయనగరంలోని జెఎన్టియుకె యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం (యుసిఇవి) సిఎస్ఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి గురువారం తిరుమలలోని తమ కార్యాలయంలో స్పీకింగ్ బుక్స్ అయిన భగవద్గీత, సంపూర్ణ హనుమాన్ ఛాలిసా పుస్తకాలను ఆవిష్కరించారు. చూపు లేని వారితో పాటు చదువురాని వారు, వయసు పైబడిన వారు సులభంగా ఇందులోని విషయాలను తెలుసుకునే అవకాశముంది. ఈ పుస్తకాలతోపాటు సెల్ఫోన్ లాంటి ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఉంటుంది. ఈ పరికరాన్ని ఈ పుస్తకాల్లోని పేజీల్లో గల అక్షరాలపై పెడితే ఆడియో రూపంలో శ్లోకాలు, తాత్పర్యాలు వినిపిస్తాయి. భగవద్గీత హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంలో ఉండగా, సంపూర్ణ హనుమాన్ ఛాలిసా పుస్తకం తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అస్సామీ, నేపాలీ, తమిళం, మలయాళం భాషల్లో ఆడియో వినిపిస్తుంది. నచ్చిన భాషను ఎంపిక చేసుకుని ఆ భాషలో ఈ పుస్తకాల్లోని విషయాలను తెలుసుకోవచ్చు. న్యూఢిల్లీకి చెందిన హయోమా సంస్థ ఈ పుస్తకాలను రూపొందించగా, సేఫ్ షాప్ ఆన్లైన్ సంస్థ వీటిని మార్కెటింగ్ చేస్తోంది. ఇలాంటి స్పీకింగ్ బుక్స్ రూపొందించడం ప్రపంచంలోనే మొదటిసారి అని సేఫ్ షాప్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సేఫ్ షాప్ సంస్థ ప్రతినిధులు మురళీ, రాకేష్, లహరి, సాయి పాల్గొన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు 29 వ వార్డు మాజీ అధ్యక్షులు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మన్యాల శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం ఆశీల్ మెట్ట వాసుపల్లి కార్యాలయంలో సుమారు 200 మంది కార్యకర్తలతో ఎమ్మెల్యేను కలిసి తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలకు ఆకర్షితుడనై తాను వైసీపీలో జాయిన్ అయినట్టు చెప్పారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి వెంటే తాము ఎల్లప్పుడూ ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు బొట్ట మల్లి, బొట్ట రాము, వీరుబాబు తదితరులు పాల్గొన్నారు.
పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి భవిష్యత్తును పొందాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. గురువారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిగ్రీ అనంతరం పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని యువతకు పిలుపునిచ్చారు. ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, గ్రూప్ 1, 2 వంటి పోటీ పరీక్షలకు కాంపిటీటివ్ పుస్తకాలు దోహద పడతాయని తెలిపారు. కళాశాలలో శని, ఆదివారాలలో మూడు గంటల పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలని తెలిపారు. ఇది ఒక బేసిక్ ప్రిపరేషన్ గా వుపయోగపడుతుందని చెప్పారు. లైబ్రరీ పుస్తకాలను చదువుకుని మరింత విజ్ఞానాన్ని పెంచుకోవాలని తెలిపారు. కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరు అయిన వారంతా సెక్రటేరియట్ పోస్టులకు సెలక్టయినవారే నని తెలిపారు. ఆర్ధిక స్వావలంబతో చదువుకు సార్థకత చేకూరుతుందన్నారు. మహిళలకు నిబధ్ధత, క్రమశిక్షణ వుంటాయని, కరోనా నేపథ్యంలో వైద్య సేవలందించిన వారు 70 శాతం మహిళలేనని తెలిపారు. అమ్మాయిలు ఏదో ఒక రంగంలో ఉద్యోగం చేయాలన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి అవకాశాలు వున్నాయని తెలిపారు. జిల్లాకు అనేక ప్రత్యేకలు వున్నాయని, ఒక యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించాలని సూచించారు. జిల్లాకు సంబంధించిన యూ ట్యూబ్ ఛానల్ నిర్వహించడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి కావలసిన సలహాలను ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరాములు మాట్లాడుతూ, ఈ రోజు జాతీయ సమైక్యతా దినోత్సవమని, ఝాన్సీ లక్ష్మీభాయ్, ఇందిరా గాంధీల జన్మదినం గుర్తు చేసారు. కాళాశాలలో కెరీర్ గైడెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యువజన సర్వీసులు శాఖ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, యువజన సర్వీసుల శాఖ ద్వారా ప్రతిరోజు ఉదయం 6 నుండి 7.30 నిమిషముల వరకు ఆన్లైన్ ఉచిత యోగ క్లాసులు మరియు ప్రతి మంగళవారం ప్రతి గురువారం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు మరియు ప్రతి శనివారము పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించబడుచున్నది, దీనికి సంబంధించి న జూమ్ లింక్ https://www.youtube.com/APYouthServices/live అని తెలిపారు. యువజన సర్వీసులు మరియు ఉపాధి కల్పన శాఖలు అందించిన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పరీక్షల పుస్తకాలను జిల్లా కలెక్టర్ అందచేసారు. చలి కాలంలో మరింత అప్రమత్తతతో వుండాలని , కరోనా నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ సెకెండ్ వేవ్ వున్నదని, చలి కాలంలో వైరస్ త్వరితగతిన ప్రబలుతుందని, కావున మరింత అప్రమత్తతతో వుండాలని తెలిపారు. మాస్కులు ధరించడం, సానిటైజర్ ఉపయోగించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి చర్యలను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వై.సీతాలక్ష్మి, ఛీఫ్ కోచ్ శ్రీనివాస్ కుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, లెక్చరర్లు సి.హెచ్.కృష్ణారావు, డా.మురళీమోహన్ విద్యార్ధినులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా నుంచి కోలుకోవడంతో 97 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు బుధవారం 97 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో భాగంగా ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. ఇప్పటి వరకూ అందించిన సహకారమే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేంత వరకూ అందించాలని ఆయన కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశ ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. నాణ్యమైన సానిటైజర్లు వినియోగించాలనీ, సానిటైజర్లు లేనివారు ఏ సబ్బుతోనైనా తరచుగా 20 సెకెండ్లపాటు పరిశుభ్రం చేసుకోవాలన్నారు. పౌష్టికాహరం, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఎవరికైనా అనుమానం వున్నా, కరనా లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.