రెడ్ క్రాస్ సంస్థ బాదితులకు ఎల్లప్పుడూ అండగా వుంటుందని మరోసారి నిరూపించుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం, డి.మత్స్యలేశం పంచాయతీ, కొత్త దిబ్బలపాలెం గ్రామంలో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదంలో 7 పురిల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ విషయం గ్రామ రెడ్ క్రాస్ వాలంటీర్ ద్వారా తెలిసిన వెంటనే జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ .పి.జగన్మోహన్ రావు స్పందించి రెడ్ క్రాస్ బృందాన్ని ఎమర్జెన్సీ రిలీఫ్ కిట్లతో పంపించారు. బకెట్స్, చీరలు, పంచెలు, దుప్పట్లు, తువ్వాళ్ళు, ,వంట సామాగ్రి కిట్, దోమ తెర, టార్పాన్లు , బెడ్ షీట్స్ వి.ఆర్.ఓ బి.అప్పారావు , గ్రామ పెద్దలు బాధితులకు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ అందించిన సహాయం మరువలేమని బాధితులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సిబ్బంది జి.విజయబాబు, బి.శ్రీధర్, ఎన్.కోటేశ్వరరావు, జి.పవన్,శ్యామ్ గ్రామ పెద్దలు శ్రీరాములు, విశాలమ్మ, రామారావు గ్రామ యువత పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తూ దుబాయిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విశాఖ వాసి దూబ కృష్ణ కుటుంబ సభ్యులను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కృష్ణ మృతదేహం స్వస్థలానికి రప్పించేలా ప్రయత్నం చేస్తానని హామీఇచ్చారు. ఇదే విషయమై విదేశీ మంత్రిత్వ శాఖ మంత్రి తో పాటు, దుబాయి లో భారత రాయబార కార్యాలయంలోని అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సాధ్య మైనంత త్వరగా మృతదేహం వచ్చే ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఎవరై అదైర్య పడవద్దని, ఇలాంటి కష్టకాలంలో ఏం చేసినా మీబాధ తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖవాసుల కష్టాలను తీర్చడంలో తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇలాంటి సమయంలో గుండె దిటవు చేసుకొని దైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.
శ్రీకాకుళంతలోని భైరి సింగుపురం యూనియన్ బ్యాంకు శాఖలో ఆధార్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు మంగళ వారం ప్రారంభించారు. ప్రస్తుతం ఆధార్ అత్యంత అవసరమైన డాక్యుమెంటని ప్రసాద రావు అన్నారు. ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డుగా కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. సింగుపురం ప్రాంత వాసులు ఆధార్ కార్డుకు బ్యాంకు శాఖలో ఏర్పాటు చేసిన కేంద్రం నుండి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కొత్త కార్డులను ఉచితంగా నమోదు చేస్తారని, పాత కార్డులలో చేర్పులు మార్పులకు రూ.50 వసూలు చేస్తారని వివరించారు. ఆధార్ కేంద్రం సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఆధార్ కార్డు లేనివారు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ మరియు జిల్లా బ్యాంకర్ల కమిటి కన్వీనర్ పి.కృష్ణయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ జి.వి.బి.డి.హరిప్రసాద్, యూనియన్ బ్యాంకు నోడల్ అధికారి మరియు బ్రాంచి మేనేజర్ ఎస్.కె.సాహూ తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసీలో అధికారుల నుంచి వార్డు సచివాలయ సిబ్బంది వరకూ ప్రజారోగ్యం, సేవలకే అధిక సమయం కేటాయించాలని కమిషనర్ డా.స్రిజన సూచించారు. మంగళవారం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో కార్పోరేషన్ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న వార్డు శానిటరీ కార్యదర్శులు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, మలేరియా విభాగపు సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కార్పోరేషన్ పరిధిలో, ఇంటి నుండి చెత్తను తీసుకొని వెళ్ళే పద్దతిని ఓ.డబ్ల్యూ.ఎం.ఎస్. విధానం ద్వారా మదించగా కార్పోరేషన్ పరిధిలో 84% వరకు సఫలీకృతం అయ్యామన్నారు. అదే సమయంలో కొన్ని వార్డులలో సిబ్బంది నూటికి నూరు శాతం చెత్తను సేకరిస్తుండగా, మరికొందరు తక్కువ శాతం చూపించడం వలన ప్రస్తుతం 84% వరకు మాత్రమే నమోదవుతుందన్నారు. రాబోయే వారం రోజులలో వీరు కూడా ముందంజ వేసి నూటికి నూరు శాతం ఇండ్ల నుండి చెత్తసేకరణ ఓ.డబ్ల్యూ.ఎం.ఎస్. విధానం ద్వారా నమోదు కావాలని అందరికి సూచించారు. నగర పరిధిలో డిశంబర్-1 తేదీ నాటికి చెత్తను ఇంటి నుండి నేరుగా సేకరించి డంపర్ బిన్లను పూర్తిగా తొలగించడానికి గాను, తగు ప్రణాళికలు చేసి వచ్చే సోమవారం నాటికి అందించాలని కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్), సి.ఎం.ఓ.హెచ్, ఏ.ఎం.ఓ.హెచ్. లను ఆదేశించారు. నగరంలోని వీధులలో ప్రజా ప్రయోగార్ధం ఏర్పరిచిన డంపర్ బిన్లలో వ్యాపార సంస్థలు, హోటల్స్ నుండి వస్తున్న చెత్తను వెయ్యకుండా చూడాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. అన్ని డంపర్ బిన్లలో గల చెత్తను ప్రతీ రోజూ ఉదయం 10.30గంటల లోపు డంపింగుయార్డుకు తరలించే పనిని రోజు వారీ తప్పనిసరిగా పరిశీలించాలని కార్యనిర్వాహక ఇంజినీరు(మెఖానికల్)ని ఆదేశించారు. ఇండ్ల నుండి భూగర్భ డ్రైనేజి కి కలపవలసిన కనక్షనుల సర్వేను వచ్చే సమావేశం లోపు పూర్తీ చేసి వివరాలు అందించాలని అందరి శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. డిశంబర్-1 వ తేదీ నాటికల్లా ట్రేడ్ లైసెన్స్ ఫీజు కొత్త వాటికి వేయాలని, వీటిపై 5% పెరుగుదల ఉండేలా చర్యలు చేపట్టాలని ఏ.ఎం.ఓ.హెచ్.లను, శానిటరీ సూపర్వైజర్లను, శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. నగర ప్రతిష్ట, పరిశుభ్రతను పెంపొందించడానికి గాను ప్రజలలో బాధ్యతా పెరగడానికి గాను బహిరంగంగా మల మూత్ర విసర్జన చేసిన వారినుంచి బహిరంగంగా ఉమ్మిన వారి నుంచి, ప్లాస్టిక్ సామగ్రి అమ్మకం దారుల నుండి ఖాళీ జాగాలలో నీటి నిల్వలు చేసి దోమల వృద్ధికి కారణమైన వారి నుండి జరిమానాలు విధించాలని ఆదేశించారు. ప్రతీ రోజు పది వేల రూపాయల పైన జరిమానా విధించిన వార్డు కార్యదర్శులను సభా ముఖంగా కమిషనర్ అభినందించారు. ప్రతీ ఇంటి నుండి చెత్త సేకరణ చేస్తున్నందుకుగాను వినియోగ దారునీ వద్ద నుండి చెత్త సేకరణ నిమిత్తం రూ. 50/- యూజర్ చార్జీలు వసూలు చేయాలని తెలిపారు. రాబోయే స్వచ్ఛ సర్వేక్షణ్-2021 లో మెరుగైన ర్యాంకును సాధించేందుకు ప్రజా భాగస్వామ్య విభాగం ద్వారా రావలసిన మార్కులను శతశాతం రాబట్టేందుకు కృషి చేయాలని కమిషనర్ అందర్నీ కోరారు. అదనపు కమిషనర్ డాక్టరు వి. సన్యాసి రావు మాట్లాడుతూ స్వచ్చతా యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతీ నెల రెండు వేల ఫిర్యాదులు నమోదు చేసి వాటిని పరిష్కరించి ప్రజల వద్ద నుండి ఫీడ్ బ్యాక్ నమోదు చేయించాలని సూచించారు. సామాజిక మాధ్యములైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రం మొదలగు వాటి ద్వారా సిటిజన్ ఫీడ్ బ్యాక్ పెంచి స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ఉత్తమ ర్యాంకు సాధించడానికి కృషి చేయాలని కోరుతూ వచ్చే వారం సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అంశాలపై రివ్యూ చేపడతామని దానికి అనుగుణంగా సిద్దమై రావాలని అందరికీ సూచించారు. ఈ సమావేశంలో ఇంకనూ సిఎం.ఓ.హెచ్ డా. కె.ఎస్.ఎల్.జి శాస్త్రీ, అసిస్టెంట్ మెడికల్ అఫీసర్లు డా. జయరాం, రాజేష్, కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు శంకరరావు, బయాలజిస్ట్ పైడి రాజు, అసిస్టెంట్ ఇంజినీర్లు(మెఖానికల్), శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గోన్నారు.
అనంతపురం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ భవనాలను తక్షణం గ్రౌండింగ్ చేయాలని, బుధవారం లోపు పూర్తి స్థాయిలో అన్ని భవనాలను గ్రౌండింగ్ చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం నగరంలోని సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి పంచాయతీ రాజ్ ఎస్ఈ మహేశ్వరయ్య, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరే రామ్ నాయక్, జిల్లా పరిషత్ సీఈఓ శోభ స్వరూపరాణి, డీఈవో శామ్యూల్, తహసీల్దార్ లు, ఎంపీడీవోలు, మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ భవనాల గ్రౌండింగ్ ను ఒక ఛాలెంజ్ గా తీసుకొని బుధవారం లోపు అన్ని భవన నిర్మాణాలు గ్రౌండింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ఆయా భవనాలకు సంబంధించి జిల్లాలో స్థలం సమస్య ఉందనే మాట ఎక్కడా రాకూడదని, ఎక్కడ గ్రౌండింగ్ చేయకపోతే ఆయా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడమన్నారు. ఆయా భవనాల గ్రౌండింగ్ విషయమై క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని, ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్క గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ భవనాల గ్రౌండింగై ఉండాలని, గ్రౌండింగ్ చేయకుండా ఏదైనా సాకులు చెప్పినా వినేది లేదన్నారు. అనేక పర్యాయాలు చెప్పినా సీరియస్ గా తీసుకోకుండా, తప్పుడు లెక్కలు చూపించారని, గ్రౌండింగ్ విషయమై ఒక ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా గ్రౌండ్ చేయాల్సినవి ఉన్నాయని, నాలుగు గుంతలు తీసి గ్రౌండింగ్ చేశామని చూపిస్తున్నారని, ఇది ఒప్పుకోమన్నారు. తప్పనిసరిగా వెంటనే అన్ని భవనాలకు సంబంధించి గ్రౌండింగ్ పనులు చేపట్టాలని, ఇందుకు సంబంధించి అవసరమైన మెటీరియల్ సిద్ధం చేసుకుని పనులు చేపట్టాలన్నారు. ఆయా భవనాలకు సంబంధించి పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వో, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్ ఇలా ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి పనులు చేపట్టేలా చూడాలన్నారు.
జిల్లాలో గ్రామ సచివాలయ భవనాలకు సంబంధించి 14 చోట్ల ఇంకా గ్రౌండింగ్ చేయలేదని, 28 రైతు భరోసా కేంద్రాల భవనాలు, 32 వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ సంబంధించి ఇంకా గ్రౌండింగ్ చేయాల్సి ఉందని, 6 నెలల నుంచి చెబుతున్నా ఇంకా ఆయా భవనాలకు సంబంధించి గ్రౌండింగ్ పనులు చేపట్టక నిద్రపోతున్నారా అంటూ కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అన్ని చోట్ల గ్రౌండింగ్ చేపట్టి పనులు చేట్టాలన్నారు. ఆయా భవనాలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే జిల్లాపరిషత్ సిఇఓ, డిపిఓ, ఎంపీడీవో, పంచాయతీ సెక్రెటరీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, పంచాయతీ సెక్రటరీ లు ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకుని పనులు చేపట్టాలన్నారు. ఆయా భవనాలకు సంబంధించి స్థలం సమస్య ఉంటే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పని చేసి సమస్యను పరిష్కరించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఆయా భవనాలను పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేపట్టాలన్నారు. గ్రౌండింగ్ అంటే గుంత తీసి వదిలేయడం కాదని, పునాదులు వేయడం, పిల్లర్లు ఏర్పాటు చేయడం లాంటి పనులు జరిగేలా చూడాలన్నారు. బుధవారం లోపు వచ్చే 24 గంటల్లో ఎంత మేరకు అయితే అంతమేరకు పనులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని సోమలదొడ్డి గ్రామంలో రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ కి సంబంధించి స్థలం అప్పగించకుండా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని సంబంధిత తహసీల్దార్ ను కలెక్టర్ ప్రశ్నించారు. బుధవారం లోపు స్థలం సమస్య పరిష్కరించి ఆయా భవనాలకు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సింగనమల మండలంలోని ఉలికల్లు గ్రామంకు సంబంధించి ఉలికంటిపల్లి గ్రామంలోనైనా స్థలం చూపించి ఆయా భవనాలను గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసీల్దార్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చెన్నేకొత్తపల్లి మండలం లోని మేడాపురం గ్రామంలో గ్రామ సచివాలయం భవన నిర్మాణానికి సంబంధించి 8 నెలల నుంచి చెబుతున్న ఎందుకు గ్రౌండింగ్ చేయలేదని ఎంపీడీవో ని జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి స్థలం ఎందుకు చూపించలేదని తహసీల్దార్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే గ్రౌండింగ్ చేపట్టి పనులు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
నల్లచెరువు కు సంబంధించి ఇప్పటివరకు ఏజెన్సీని ఫైనలైజ్ చేయకపోవడం తగదని, వెంటనే స్థలం సమస్య పరిష్కరించాలని సంబంధిత తహసీల్దార్ కు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక ఛాలెంజ్ గా తీసుకుని గుంతలు తీయడం, ఇతర పనులు చేపట్టడం చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలకు సంబంధించి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆయా భవన నిర్మాణ పనులను మంగళవారం రాత్రి, బుధవారం పగలు, రాత్రి చేపట్టాలన్నారు. ఆయా భవన నిర్మాణాలకు సంబంధించి ఆర్ డి వో లు, సబ్ కలెక్టర్ వారి డివిజన్ పరిధిలో మానిటర్ చేస్తూ అన్ని పనులు గ్రౌండింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాలు ఎలా పనిచేస్తున్నాయి అనే దానిపై జిల్లా పరిషత్ సీఈఓ, డి పి వో లు ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా సచివాలయం పరిధిలో సేవలు సక్రమంగా అందేలా చూడాలన్నారు. నాడు - నేడు పనులను పూర్తి చేయాలి: జిల్లావ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న నాడు-నేడు పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నాడు నేడు పనులపై డీఈఓ, ఎం ఈ ఓలు ప్రత్యేక దృష్టి సారించి పనులు చేపట్టాలని, వెంటనే నాలుగు నుండి పనులపై సమీక్ష నిర్వహించి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలకు వచ్చే విద్య 9, 10వ తరగతి విద్యార్థులు వారికి కేటాయించిన యూనిఫామ్ లోనే పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.
వాహనదారులపై భారీగా జరిమానాలు విధించే జివో నెంబరు 21ను తక్షణమే రద్దుచేయాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి యమ.జగ్గు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జిఓ నెంబరు 21 రద్దుకై నవంబర్ 26న సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం జగదాంబలోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికేట్, వాహనాల కొనుగోలు, బదిలీ, ఫైనాన్స్ ఎండార్స్మెంట్ చలానా రేట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచి భారాలు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చివరికి థర్డ్పార్టీ ఇన్సూరెన్సు రేట్లు, టోల్గేట్ల జరిమానాలను సైతం వదల్లేదని ఎద్దేవాచేశారు. ఇప్పటికే కరోనా వల్ల 8 నెలల నుండి రవాణారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదురుకుంటున్న నేపధ్యంలో ఆటో, క్యాబ్స్, లారీ, వ్యాన్, బస్, తదితర ట్రాన్స్పోర్టు కార్మికులు పెద్ద ఎత్తున ఆర్ధికంగా చితికిపోయారని తెలిపారు. విపత్తు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఆర్ధికంగా ఆదుకోవాల్సింది పోయి భారాలు మోపడం సరైనది కాదని విమర్శించారు. ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10000 చొప్పున వాహనమిత్ర పథకం ద్వారా ఆదుకుంటోందనే సంతోషాన్ని కూడా ఎంతోకాలం మిగిల్చకుండా జరిమానాలు పేర లాక్కోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వాహనదారులకు తలకుమించిన భారంగా ఉందన్నారు. కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నా ఆదాయాలు మాత్రం పెరగడం లేదన్నారు. మరోవైపున కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికచట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చడం, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వంటి చర్యలకు పూనుకుందన్నారు. మోడీ, జగన్మోహన్రెడ్డిలు అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా మోటార్ కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు కుమార్, కార్యదర్శి బి.జగన్, ఆటో కార్మిక సంఘం నగర ప్రధాన కార్యదర్శి డి.అప్పలరాజు, అధ్యక్షులు పి.రాజ్కుమార్, గౌరవాధ్యక్షులు కె.సత్యన్నారాయణ, మోటార్ ట్రాన్స్పోర్ట్ జిల్లా కార్యదర్శి జి.అప్పలరాజు పాల్గొని మాట్లాడారు. క్యాబ్ యూనియన్ అధ్యక్షులు శ్రీరారాములు, ఎపిఎస్ ఆర్టీసి హైర్బస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.జె.రావు, శివ, ఎర్రినాయుడు, తాతబ్బాయి, వై.దేముడుబాబు, కే.వి.రమణ, బి.శ్రీనివాస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శిలు పాల్గొన్నారు.
ప్రాణం విలువ తెలిసన ప్రభుత్వం మనది అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డా.వై.యస్.ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా 2,434 వైద్య ప్రక్రియలకు ఉచితంగా చికిత్సలు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటిన దాదాపు అన్ని చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. 2,434 చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చాయని చెప్పారు. వార్షిక ఆదాయ పరిమితి రూ.5 లక్షలు ఉన్న వారందరూ దీని పరిధిలోకి వస్తున్నారని, దాదాపు 95 శాతం కటుంబాలు ఆరోగ్య శ్రీ పరిధికి వస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 6 జిల్లాల్లో అమలు చేస్తున్న 2,434 వైద్య ప్రక్రియలను మిగిలిన 7 జిల్లాల్లో కూడా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2059 చికిత్సలతో ప్రయోగాత్మకంగా ప్రారంభించి, ఇతర జిల్లాల్లో 1059 చికిత్సల నుండి 1313 కు పెంపు చేశామని, ప్రస్తుతం 2,434కు పెంపుదల చేసామని పేర్కొన్నారు. పోస్ట్ కోవిడ్ చికిత్సలు కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని తెలిపారు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి నెలకు రూ. 5 వేల వరకు ఆరోగ్య ఆసరా క్రింద అందిస్తున్నామని, అన్ని రకాల కేన్సర్ లను, బోన్ మారో చికిత్సను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవడం జరిగిందని వివరించారు. గతంలో ఉన్న రూ.680 కోట్లు బకాయిలను ఆసుపత్రులకు చెల్లించామని చెప్పారు. అధికారులు ఆరోగ్య శ్రీ అమలును చక్కగా అమలు చేస్తూ ప్రతి ఒక్కరూ లబ్ది పొందుటకు సహకరించాలని తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రలు ఉండాలని స్పష్టం చేసారు. ఆరోగ్య శ్రీ అమలును జాయింట్ కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు. చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా విధిగా అందాలని అన్నారు.
శ్రీకాకుళం జెమ్స్ నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 2434 వ్యాధులకు చికిత్స ప్రారంభించడం ముదావహం అన్నారు. జిల్లాలో 2018 నుండి 72,570 మంది చికిత్సలు జరిగాయని, ఇందుకు రూ.179 కోట్లు ఖర్చు జరిగిందని వివరించారు. ఆరోగ్య ఆసరా క్రింద 2019 డిశంబరు నుండి ఇప్పటి వరకు 12,701 మంది లబ్దిపొందారని, వారికి రూ.7.90 కోట్లు చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. డా.వై.యస్.ఆర్ ఆరోగ్య శ్రీ క్రింద లబ్దిపొందిన జలుమూరు మండలం కరకవలసకు చెందిన మీసాల కృష్ణ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల తన కుమార్తై సంజన ఆడుతూ పడిపోయిందని, ఎడమ కాలు వాపు వచ్చిందని అన్నారు. వివిధ ఆసుపత్రులకు తీసుకువెళ్లామన్నారు. పూర్తి చికిత్సకు రూ.50 వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో తాపి మేస్త్రీగా పనిచేస్తున్న నేను ఏమి చేయాలో తెలియక మనస్ధాపం చెందామని అన్నారు. అయితే తమ గ్రామ వాలంటీరు ఆరోగ్య శ్రీ క్రింద చికిత్స పొందవచ్చని సూచించడంతో జెమ్స్ ఆసుపత్రిలో చేరామని చెప్పారు. పది రోజులుగా చికిత్సను అందిస్తున్నారని, ప్రస్తుతం ఆరోగ్య మెరుగుపడుతుందని తెలిపారు. జగనన్న ముఖ్య మంత్రిగా అనేక పథకాలు అందిస్తున్నారని అందులో తన కుమారునికి అమ్మ ఒడి అందిందని, తండ్రికి పింఛను అందుతుందని అన్నారు. జగనన్న ముఖ్య మంత్రిగా ఉండటం పేద ప్రజల పాలిటి అదృష్టమని కొనియాడారు. నీ పేరు చెప్పుకుని చక్కని ఆరోగ్యంతో ఆనందంగా ఉండగలమని కృష్ణ అన్నారు. ఆమదాలవలసకు చెందిన పిల్లా చిన్నారావు మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ ప్రజల పాలిట వరమన్నారు. డా.వై.యస్.ఆర్ శ్రీకారం చుట్టిన ఈ పథకానికి మరిన్ని వ్యాధులను జోడించి ప్రజల ప్రాణాలను నిలబెడుతున్నావని అన్నారు. తనకు ముక్కుకు సంబంధించిన ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని, అయితే పేదరికంలో ఉన్న నాకు వాలంటీరు సహాయంతో ఆరోగ్య శ్రీ క్రింద చికిత్స పొందానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, డిఎంహెచ్ఓ డా.కె.సి.చంద్ర నాయక్, ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్ రవి కిషోర్, జెమ్స్ కోవిడ్ సూపరింటెండెంట్ డా.హేమంత్, డా.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, డిఎంహెచ్ఓ డా.కె.సి.చంద్ర నాయక్, ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్ రవి కిషోర్, జెమ్స్ కోవిడ్ సూపరింటెండెంట్ డా.హేమంత్, డా.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పిల్లల దత్తత కౌన్సిలింగ్ డెస్క్ జిల్లా బాలల రక్షణ విభాగం పథక సంచాలకుల కార్యాలయంలో ప్రారంభం కానున్నట్లు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డా.జి.జయదేవి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. అంతర్జాతీయ దత్తత మాసోత్సవాల్లో భాగంగా నవంబర్ 11న పిల్లలను దత్తత, సమస్యల పరిష్కారంపై కౌన్సిలింగ్ డెస్క్ ఐ.సి.పి.ఎస్ కార్యాలయంలో ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ కౌన్సిలింగ్ డెస్క్ వద్ద ప్రొఫెషనల్ కౌన్సిలర్ తో సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పిల్లలను దత్తత తీసుకునే తల్లితండ్రులు, ఇదివరకు దత్తత తీసుకొని సమస్యలతో బాధపడుతున్న తల్లితండ్రులు ఈ కౌన్సిలింగ్ డెస్క్ వద్ద సేవలను ఉచితంగా పొందవచ్చని ఆమె సూచించారు. సంతానం కలగక మనోవేదన పడుతున్న తల్లితండ్రులకు దత్తత ఒక సువర్ణావకాశమని, మాతృత్వం ఒక వరం – దత్తత దానికి మరో మార్గం అని ఆమె చెప్పారు. దత్తత కోరు తల్లితండ్రులకు కారా నిబంధనలు ప్రకారం అర్హతలు ఉంటే పిల్లలను దత్తత ఇవ్వడం జరుగుతుందని ఆమె స్పష్టం చేసారు. కావున పిల్లలను దత్తత కోరు తల్లితండ్రులు ఈ కౌన్సిలింగ్ డెస్క్ ప్రారంభోత్సవానికి హాజరై, దత్తత ప్రక్రియ గురించి పూర్తిగా అవగాహన చేసుకొని పిల్లలను దత్తత పొందాలని ఆమె కోరారు. కౌన్సిలింగ్ డెస్క్ కు హాజరయ్యే తల్లితండ్రులు 08942 – 240630, 240616 ఫోన్ నెంబర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో వివరించారు.
జాతీయ ప్రతిభా పరీక్ష - 2019 ( ఎన్.ఎం.ఎం.ఎస్ )కు ఎంపికకాబడిన విద్యార్ధుల హాల్ టికెట్స్ నందు తప్పులు ఉంటే సవరించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. 2019 జాతీయ ప్రతిభా పరీక్షకు హాజరై ఎంపిక కాబడిన విద్యార్ధుల హాల్ టికెట్లలో ఆధార్, విద్యార్ధి పేరు, పుట్టిన తేది, బ్యాంకు అకౌంట్ వివరాలు జతకానట్లయితే వాటిని జిల్లాలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపధ్యాయులు సవరించాలని ఆదేశించారు. విద్యార్ధుల హాల్ టికెట్ తో మ్యాచింగ్ కాని వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేసి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి తక్షణమే సమర్పించాలని ఆమె కోరారు. ఈ విషయమై ఎటువంటి సందేహాలు ఉన్న ఎడల జూనియర్ సహాయకులు 84639 03273 సెల్ నెంబరుకు సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని ఆమె ఆ ప్రకటనలో వివరించారు.
క్రిష్ణాజిల్లాలో కురుసిన భారీ వర్షాలకు, వరదలకు 664 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. అందులో ప్రధానంగా పండ్ల తోటలకు రూ. 290 కోట్లు, వ్యవసాయానికి రూ. 138 కోట్లు,ఆర్ అండ్ బీకి రహదారులకు రూ.197 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.143కోట్లు రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పంటలు, రహదారులు, ఇతర నష్టాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ వరద నష్టంపై అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృంద సభ్యులు జాయింట్ సెక్రటరీ సౌరవ్ రాయ్ కు పూర్తి స్థాయిలో వివరించారు. ఈ బృందంలో జాయింట్ సెక్రటరీ సౌరవ్ రాయ్ తో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి అసిస్టెంట్ కమీషనర్ ఆయుష్ పునియ, నేషనల్ హైవేస్ స్పెషల్ కమీషనర్ శ్రవణ్ కుమార్ సింగ్ లు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాల వల్ల 93 రోజుల పాటు నిరంతరం ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు అధిక స్థాయిలో వచ్చి చేరిందన్నారు. ప్రకాశం బ్యారేజ్ ద్వారా సుమారు 1005 టీఎంసీల నీటిని సముద్రంలో వదిలామన్నారు.
కృష్ణానదికి అధికంగా 8 లక్షల క్యూ సెక్కుల వరద నీరు చేరిందన్నారు. రెండవ ప్రమాద హెచ్చరికకు 6 లక్షల క్యూసెక్కులుగా ఉన్నప్పటికీ 8 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ఆందోళన చెందామన్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వున్న 18 మండలాలతో పాటు జిల్లాలోని మరో 15 మండలాలు కూడా భారీవర్షాలకు నష్టపోయాయన్నారు. ఈ వరదల్లో ఇళ్లు కూలి ఒకరు, నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మరొకరు మరణించారన్నారు. జిల్లాలో పంట నష్టాల పై వివరిస్తూ వరి, ప్రత్తి, కంది, మినుములు, పెసర వంటి పప్పుధాన్యాలతో పాటు మొక్కజొన్న, వేర శెనగ వంటి మెట్ట ప్రాంతాల్లో కూడా సుమారు 11 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ కూడా మంజూరు చేసిందన్నారు. అలాగే పండ్ల తోటల్లోని పొలాల్లో నీరు వారం రోజులపాటు నిలబడి పోవడంతో వాణిజ్య పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. జిల్లాలో అరటి, బొప్పాయి సాగు చేసే వాణిజ్య పంటలకు ఎక్కువ మొత్తంలో నష్టం జరిగిందని, పొలాలకు 3.51 కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. వీటితో పాటుగా అక్టోబర్ నెలలో సంభవించిన వరద నష్టానికి సుమారు 20 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో మత్స్యశాఖలో జరిగిన నష్టాలను వివరిస్తూ జిల్లాలో 475 ముత్స్యకార బోట్లు, వలలు నష్టపోయాయన్నారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లు కూడా గోతులు పడ్డాయని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో రూ.264 లక్షల రూపాయలతో తాత్కాలికంగా రిపేర్లు చేయవచ్చని అలాగే 50 కోట్ల రూపాయలతో శాశ్వతంగా మరమ్మతులు చేయడానికి అవకాశం ఉందని అంచనాకు వచ్చానని బృందానికి వివరించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. ఇరిగేషన్ శాఖ కూడా 30 కోట్ల రూపాయలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాల్సి ఉందన్న అంచనా విడుదల చేశారన్నారు. ప్రస్తుత వరదలు వచ్చిన సందర్భంలో 10 వేల మంది నిరాశ్రయలను ఆదుకున్నామని, వారికి రిలీఫ్ క్యాంపులు పెట్టి ఉచిత భోజన సదుపాయాలు కూడా కల్పించానున్నారు.
జిల్లాలో మొత్తం 45 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామని, సుమారు 3 వేల మందికి 500 రూపాయల చొప్పున పరిహారం కూడా అందజేశామన్నారు. జిల్లాలో 24,075 మంది వరద బాధితులకు 25 కేజీల ఉచితంగా బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లి, బంగాళదుంపలు, ఒక లీటరు పామోలిన్ ఆయిల్ కూడా ఇచ్చామన్నారు. జిల్లాలో పశుసంవర్థకశాఖ, సెరీ కల్చర్, గృహాలు తదితర శాఖలకు సంబంధించి కూడా నష్టాలు వాటిల్లినాయని కలెక్టర్ కేంద్ర బందానికి వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా. కె.మాధవీలత, శివశంకర్ మోహన్ కుమార్ డిఆర్వో వెంకటేశ్వర్లు, ముఖ్య ప్రణాళికాధికారిశర్మ, వ్యవసాయశాఖ జేడి మోహన్ రావు, మత్స్యశాఖ జేడి లాల్ మహ్మద్, పశుసంవర్ధకశాఖ జేడి, హార్టీకల్చర్ డీడీ, పంచాయతీరాజ్ ఎస్ఇ ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో గజపతినగరం మండలం మరుపిల్లి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తనిఖీ చేశారు. కాపునేస్తం జాబితాను ప్రదర్శనకు ఉంచకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు పారదర్శకంగా, మరింత మెరుగైన సేవలను అందించడానికి ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చిందని చెప్పారు. ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా లక్షల మంది సచివాలయ ఉద్యోగులను నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. సచివాలయంలో చేయాల్సిన ప్రధాన విధులను విస్మరించడం తగదన్నారు. ప్రతీ సచివాలయంలో తప్పనిసరిగా లబ్దిదారుల జాబితాలను ప్రదర్శించడం, ఎవరు ఏ పథకానికి అర్హులో సవివరంగా తెలియజేయడం, అలాగే ఆయా పథకాలు పొందేందుకు దరఖాస్తు చేసే విధానాన్ని కూడా సమగ్రంగా వివరించడం సచివాలయ ప్రధాన విధులని తెలిపారు. ప్రతీ సచివాలయ ఉద్యోగి తప్పనిసరిగా తాము పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. సిబ్బంది ప్రజలతో మమేకం అయి, వారి బాగోగులను పట్టించుకోవాలని సూచించారు. ఐఏఎస్ అధికారులు సైతం వారంలో 7 రోజులూ ప్రజల్లో ఉండాలని, ఆఫీసులకే పరిమితం కావడం సరికాదని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు. అనంతరం గజపతినగరంలోని శ్రీకృష్ణ, హర్షవర్థన ప్రయివేటు పాఠశాలలను పరిశీలించారు. గజపతినగరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సైతం తనిఖీ చేశారు. అనంతరం అక్కడి బిఎస్ఆర్ ఆసుపత్రిని పరిశీలించి, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలమధ్య తేడాలను గమనించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్కుమార్, జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, పార్వతీపురం సబ్కలెక్టర్ విదేహ్ ఖరే, ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్, విజయనగరం ఆర్డిఓ బిహెచ్.భవానీశంకర్, జెడ్పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, డ్వామా పిడి ఏ.రాజగోపాల్, డిఇఓ జి.నాగమణి, పిఆర్ ఎస్ఇ జిఎస్ఆర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన పై సత్వరం పరిష్కారం చూపించాలని సిబ్బందిని అడిషనల్ ఎస్సీ సుప్రజ ఆదేశించారు. సోమవారం యస్.పి ఏ.రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు స్పందనలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, ఈరోజు స్పందనలో జిల్లా యస్.పి కార్యాలయానికి 45 ఫిర్యాదులు వచ్చాయన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని ప్రజలు నేరుగా వచ్చి కలిసి తమ యొక్క సమస్యల తెలియజేశారన్నారు. వారి యొక్క సమస్యలకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరిని కేసు విషయాలు అడిగి తెలుసుకొని సంబందిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్టు వివరించారు. అంతేకాకుండా ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకార విచారణ జరిపి, నిర్దేశించిన గడువు లోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు వారికి సమాచారం కూడా అందిస్తామన్నారు. ముఖ్య సమస్యలపై పోలీసు అధికారులను కూడా యస్.పి స్పందన కార్యక్రమానికి పిలిపించి ఇక్కడే స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్టు ఏఎస్పీ వివరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.