శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించే భవనాల వివరాలను ఖచ్చతంగా అప్ లోడ్ చేయాలని సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ వారి సమావేశ మందిరంలో జిల్లాల పునర్విభజనపై అధికారులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా స్థాయి,, డివిజన్, మండల స్థాయిలలో కార్యాలయాలు నిర్వహిస్తున్న స్వంత భవనాల వివరాలను, అద్దె భవనాల వివరాలను, వేకెంట్ ల్యాండ్ కలిగి వున్న స్వంతభవనాల వివరాలను అప్ లోడ్ చేయాలని తెలిపారు. మోడ్యూల్ సాఫ్ట్ వేర్ రూపొందించడం జరిగిందని, ఇందులో ప్రతీ అంశాన్నీ క్షుణ్ణంగా అప్ లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వ శాఖ వేకెంట్ ల్యాండ్ యొక్క సర్వే నెంబరును అప్ లోడ్ చేసిన అనంతరం సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వేకెంట్ స్థలాన్ని పరిశీలించి ధృవీకరించాలన్నారు. ప్రభుత్వ శాఖలకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ లను ఇవ్వడం జరిగిందని ఇ.డి.ఎం. ఇంద్రశేఖర్ ను ఫోను నెం.833989277 ను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, నగరపాలక సంస్ధ కమీషనరు పి.నల్లనయ్య, జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా ఖజానాధికారి నిర్మలమ్మ , ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కాకినాడ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ), రంగరాయ వైద్యకళాశాల (ఆర్ఎంసీ)లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను వీలైనంత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి పేర్కాన్నారు. మొత్తం 14 కోర్సులు లేదా ట్రేడ్ల విద్యార్థులున్న ఐటీఐని ఎక్కడికీ తరలించకుండానే ఆర్ఎంసీని విస్తరించాల్సిన అవసరముందన్నారు. రెండు సంస్థల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల ద్వారా గరిష్ట ప్రయోజనం చేకూరేలా నివేదికలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, ఆర్డీవో ఏజీ చిన్నకృష్ణలతో కలిసి కలెక్టర్.. ఐటీఐ, ఆర్ఎంసీలను సందర్శించారు. తొలుత ఐటీఐ ప్రాంగణంలోని వెల్డర్, మోటార్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్; రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర ల్యాబ్లను నిశితంగా పరిశీలించారు. మొత్తం 15.76 ఎకరాల స్థలంలో ఉన్న నిర్మాణాల గురించి ఐటీఐ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాల స్కెచ్లను పరిశీలించారు. ఖాళీ స్థలాల గురించి ఆరా తీశారు. ప్రాంగణంలో ప్రభుత్వ ఐటీఐతో పాటు జిల్లా ఉపాధి కార్యాలయం, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం, 200 పడకల సామర్థ్యంగల ఎస్టీ వసతిగృహం, 33కేవీఏ సబ్స్టేషన్ ఉన్నట్లు ఐటీఐ అధికారులు కలెక్టర్కు వివరించారు. ఆరెకరాల విస్తీర్ణంలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ విభాగాల శిక్షణకు ఉపయోగపడే డ్రైవింగ్ ట్రాక్ ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా కోట్ల విలువైన ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉందన్నారు. 1947లో ఏర్పాటైన ఐటీఐ నుంచి ఏటా దాదాపు వెయ్యిమంది విద్యార్థులు శిక్షణ పూర్తిచేసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం కలెక్టర్.. రంగరాయ వైద్యకళాశాలలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను కూడా పరిశీలించారు. వైద్యకళాశాల విస్తరణకు సంబంధించి బోధన, అనుబంధ ఆసుపత్రి నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలిచ్చారు. కలెక్టర్ వెంట ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.బాబ్జీ, ఐటీఐ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఈజే మోహన్రావు, సూపరింటెండెంట్ డి.సత్యనారాయణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఇ.వసంతలక్ష్మితదితరులు ఉన్నారు.
జాతీయ న్యాయసేవాధికార దినోత్సవాన్ని ఈ నెల 9న ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్ధ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ తెలిపారు. జాతీయ న్యాయసేవాధికార దినోత్సవంపై గురు వారం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి వివరాలు ప్రకటించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. సామాన్యుడికి కూడా సమ న్యాయం అందాలని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే న్యాయసేవాధికార సంస్ధలను ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయ సహాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్.సి, ఎస్.టి, మహిళలు, చిన్నారులు, కార్మికులు, దివ్యాంగులు, విపత్తుల వలన ఇబ్బందులకు గురి అయ్యేవారు, మానసిక ఆరోగ్యం లేని వారు, వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు లోపు ఉన్నవారికి రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం సమ న్యాయం అందాల్సిందేనని ఆయన స్పష్టం చేస్తూ లోక్ అదాలత్ లో కోర్టు ఫీజు మినహాయింపు ఉంటుందని, న్యాయవాది ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. వ్యాజ్యాలు న్యాయస్ధానికి వచ్చేటప్పుడు న్యాయవాదుల ఫీజులు, కోర్టు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆర్ధిక స్ధోమత లేని వారికి ఇది కష్టతరమని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 39 – ఏ ప్రకారం పేదలకు ఉచిత న్యాయం అందించుటకు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని సూచిస్తూ న్యాయసేవాధికార సంస్ధలను నెలకొల్పడం జరిగిందని ఆయన వివరిచారు. ఈ మేరకు జాతీయ న్యాయసేవాధికార దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా ప్రజలకు న్యాయ విజ్ఞానాన్ని అందించుటకు శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి న్యాయాధికారి న్యాయవిజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నారని, ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారని చెప్పారు. మెగా వర్చువల్ లోక్ అదాలత్ ను సైతం నవంబరు 9వ తేదీన నిర్వహించాలని, అయితే రెగ్యులర్ కోర్టు పనిచేస్తుండటంతో 7వ తేదీన నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఆర్జీలను రాయుటకు రిటైనర్ లాయర్ కోర్టులలో ఉంటారని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. న్యాయసేవాధికార సంస్ధల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లాలో ప్రతి కోర్టులో న్యాయసేవాధికార సంస్ధ విభాగం ఉంటుందని చెప్పారు. ఏ ఒక్కరూ దుర్వినియోగం చేసుకోరాదని, దుర్వినియోగం చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.అన్నపూర్ణ, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి టి.వెంకటేశ్వర్లు, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మెగా వర్చువల్ లోక్ అదాలత్ ను ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్ధ అధ్యక్షులు , జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. మెగా వర్చువల్ లోక్ అదాలత్ పై గురు వారం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి వివరాలను ప్రకటించారు. మెగా వర్చువల్ లోక్ అదాలత్ లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 320 క్రింద రాజీపడదగ్గ కేసులు, నెగోషియబుల్ ఇన్స్టుమెంటు చట్టం సెక్షన్ 138 క్రింద చెక్ బౌన్సు కేసులు, అన్ని సివిల్ కేసులు, మోటారు వాహన చట్టం క్రింద కేసులు, బీమా, చిల్లర కేసులు తదితర కేసులను ఇందులో పరిష్కరించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు రాజీపడదగ్గ 368 క్రిమినల్ కేసులు గుర్తించడం జరిగిందని, వెయ్యి సివిల్ కేసులు గుర్తించామని చెప్పారు. ఇందుకు జిల్లా కేంద్రంలో 4 కోర్టు బెంచులు ఏర్పాటు చేసామని, అందులో రెండు బెంచ్ లకు సీనియర్ సివిల్ జడ్జిలు, రెండు బెంచ్ లకు జూనియర్ సివిల్ జడ్జిలు నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి కోర్టులో న్యాయసేవాధికార సంస్ధ అధ్యక్షులుగా ఉన్న న్యాయమూర్తులు కోర్టు బెంచులను నిర్వహిస్తారని చెప్పారు. క్షణికావేశాలతో కొన్ని సమయాల్లో కోట్లాటలు జరిగి ఉండే అవకాశం ఉందని, కొద్ది రోజుల అనంతరం పరివర్తన వచ్చినప్పటికి మానసిక ఘర్షణతో రాజీ చేసుకునే పరిస్ధితి ఉండదని ఆయన అన్నారు. అటువంటి వారికి లోక్ అదాలత్ మంచి వేదిక అన్నారు. లోక్ అదాలత్ లో సత్వర పరిష్కారం లభించడమే కాకుండా లోక్ అదాలత్ లో ఇచ్చిన తీర్పు తుది తీర్పుగా ఉంటుందని, అప్పీలు చేసుకునే అవకాశం లేదని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. పేద ప్రజలు అధికంగా ఉన్న శ్రీకాకుళం వంటి జిల్లాలో కోర్టు వివాదాల్లో చిక్కుకుని కోర్టులకు హాజరు కావడానికి ప్రయాణపు ఖర్చులు, ఇతర ఖర్చులు భరించుకోవడం, కూలి చేసుకునే రోజును వదులుకోవడంతోపాటు వ్యయప్రసాయసలకు లోను కావడం జరుగుతుందని అన్నారు. అనవసరపు ఖర్చులతో పాటు అశాంతి, మానసిక ప్రశాంతత లోపించడం జరుగుతుందని పేర్కొంటూ ఆమోదయోగ్యమైన రాజీ వలన ఉభయులకు సమన్యాయం చేకూరుతుందని వివరించారు. సత్వరం కేసులు పరిష్కారం జరుగుటకు లోక్ అదాలత్ అత్యంత ఉత్తమ మార్గమని చెప్పారు. రాజీపడదగ్గ 18 వేల పెండింగు కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. వీటన్నింటిని ఉభయులు రాజీ చేసుకునే అకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. లోక్ అదాలత్ లో సత్వర పరిష్కారాన్ని ప్రోత్సహించుటకు కోట్ల విలువగల సివిల్ కేసులు కూడా పరిష్కరించుకునే అవకాశంతోపాటు, కోర్టు ఫీజుగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వాపసు ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు స్వయంగా వచ్చి కేసులను రాజీ చేసుకోవచ్చని, లేదా ఆన్ లైన్ ద్వారా జరిగే వర్చువల్ లోక్ అదాలత్ లో పాల్గొనవచ్చని ఆయన పేర్కొంటూ దీనిని సద్వినియోగం చేసుకుని ఇరువర్గాలు మానసిక ప్రశాంతత పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.అన్నపూర్ణ, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి టి.వెంకటేశ్వర్లు, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సచివాలయాల ద్వారా మెరుగైన, సత్వర సేవలందించడం ద్వారా గ్రామాల్లోనే తమకు ప్రభుత్వ సేవలు అందుతాయనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు సచివాలయ సిబ్బందికి సూచించారు. ఎల్.కోట మండలం బీమాలి సచివాలయాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని సచివాలయంలో గోడలపై ప్రదర్శించినదీ లేనిదీ పరిశీలించారు. సంక్షేమ పథకాల కోసం అందే వినతుల పరిష్కారంపై చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇ-రిక్వెస్టుల పరిష్కారంపై ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగుల హాజరు పట్టీలను పరిశీలించి సిబ్బంది అంతా ప్రతిరోజు విధులకు హాజరవుతున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయాలకు మంచి పేరు తీసుకురావడమనేది సిబ్బంది చేతుల్లోనే ఉందని, సిబ్బంది ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిత్యం కృషిచేయాలని సూచించారు.
అనంతపురం జిల్లాలో హిందూపురంలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హిందూపురం లోని మున్సిపల్ కార్యాలయాన్ని, మున్సిపల్ కార్యాలయంలోని సచివాలయాన్ని, పాలశీతలీకరణ కేంద్రాన్ని, డ్వామ ఏపీడి కార్యాలయాన్ని, ఆర్టిఓ కార్యాలయాన్ని, పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు వారి కార్యాలయంను, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తితో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లో భవనాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంతకుముందు జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో హిందూపురం లో వివిధ ప్రభుత్వ శాఖల భవనాలు పాతబడ్డాయని ప్రజాప్రతినిధులు తెలిపిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖల భవనాల పరిస్థితి ఎలా ఉందో జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దీపావళి పండుగ సంధర్బంగా తమిళనాడు ప్రభుత్వం చేనేత సహకార సంస్థ కో –ఆప్టెక్స్ వస్త్రాల పై ప్రత్యేక తగ్గింపు పధకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, వి.మణిరామ్ కోరారు. గురువారం సూర్యబాగ్ షోరూంలో నిర్వహించిన ప్రత్యేక ఆఫర్ పథకాన్ని ఆయన ముఖ్యఅతిధిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీపావళి పండుగను పురస్కరించుకొని కో – ఆప్టెక్స్ ప్రత్యేక తగ్గింపు పథకాన్ని అందజేస్తున్నారని చెప్పారు. దీనిలో భాగంగా అన్ని చేనేత వస్త్రాలపై 30 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారని, నాణ్యతగల చేనేత వస్త్రాలను ధరించడం వలన హోదాతో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. ఈ షోరూం లో కాటన్, సిల్క్, కంచి, అరణి, కోయంబత్తూర్ వస్త్రాలతో పాటు అన్నిరకముల దుప్పట్లు, దివాన్ సెట్లు, లుంగీలు, ఆర్గానిక్ పట్టు చీరలు, ఆర్గానిక్ కాటన్ చీరలు, ఆర్గానిక్ టవల్స్, చుడిదార్ డ్రస్ మెటీరియల్ మరియు రెడీమేడ్ షర్ట్స్ లభ్యం అవుతాయని చెప్పారు. ఈ ప్రత్యేక రాయితీ ధరతో అన్నిరకాల డిజైన్ లలో చీరలు, డ్రస్ మెటీరియల్స్ అందుబాటు ధరలో అందజేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ రీజనల్ మేనేజరు టి.రాధాకృష్ణన్ మాట్లాడుతూ, చేనేత కళాకారులకు వినియోగదారులకు మధ్య అవగాహన పెంపొందించేందుకు ప్రతి చేనేత వస్త్రాలపై చేనేత కళాకారుని ఫోటోను ముద్రించడం జరుగుతుందన్నారు. అన్ని చేనేత వస్త్రాలు ఈ తగ్గింపు పధకంపై వినియోగదారులకు అందించనున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో జలవనరుల ప్రాజక్టుల భూసేకరణ వేగవంతం చెయ్యాలని భూసేకరణ అధికారులను సంయుక్త కలక్టరు డా. జి.సి. కిషోర్ కుమార్ ఆదేశించారు. గురువారం కలక్టరేట్ ఆడిటోరియంలో తోటపల్లి, తారకరామ తీర్ధసాగర్, జంజావతి, గుమ్మడిగెడ్డ, ఆడారి గెడ్డ, కంచర గెడ్డ, పావురాయి గెడ్డి తదితర భారీ, మధ్యతరహా చిన్ననీటి ప్రాజక్టుల భూసేకరణ పనులపై, జాతీయ రహదారుల భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల భూసేకరణ ఆలస్యం కావడంపై కారణాలను అడుగగా సర్వేయర్లు శిక్షణకు వెళ్లినందున పనులు ఆలస్యం అవుతున్నాయని భూసేకరణ అధికారులు జెసి దృష్టికి తీసుకువచ్చారు. సర్వేయర్లపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యాలని సర్వే శాఖ సహాయ సంచాలకులు పోలరాజును ఆదేశించారు. భూసేకరణ పూర్తయిన చోట అవార్డుల విచారణ చేసి వెంటనే అవార్డు జారీ చెయ్యాలన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించుటకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు చెల్లించవలసిన పరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డిఓ భవానిశంకర్, భూసేకరణ ఉప కలక్టర్లు జయరామ్, బాలా త్రిపుర సుందరి, సాల్మన్ రాజ్, వెంకటేశ్వరరావు, జాతీయ రహదారుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో కార్పొరేట్ హాస్పటళ్లకు ధీటుగా కె జీ హెచ్ ను తీర్చిదిద్దుతామని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. డాక్టర్ల వినతిమేరకు పార్లమెంట్ నియోజక వర్గ అభివృద్ధి నిధులు రూ.23.56 లక్షల విలువైన 25 సీటర్ బస్సును కెజిహెచ్ కి అందించారు. గురువారం ఆసుపత్రిలో బస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. త్వరలో ప్రత్యేక కాన్సర్ విభాగం ఏర్పాటుకు కసరత్తు చేస్తామనిచెప్పారు .ఈ విషయంపై వైద్య విభాగ ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడామన్ని ఎంపీ వివరించారు. పరిపాలనా రాజధానిగా అవతరించిన విశాఖ లో వనరుల కొరత లేదన్నారు. విద్య, వైద్యం నిరుపేదలకు మరింత చేరువ చేస్తామని అన్నారు. విశాఖ వై ఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో ప్రపంచ గుర్తింపు స్థాయిగా నగరంగా వెలుగొందడం తధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణనియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, కెజిహెచ్ ను అభివ్రుద్ధి చేయడం ద్వారా సుమారు ఐదు జిల్లాల ప్రజలకే కాకుండా పక్కరాష్ట్రాలకు ప్రజలకు కూడా వైద్యసేవలు అందుతాయన్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యసేవలు అందించడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే కొరగా వున్న స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీజరిగిందన్నారు. ఈకార్యక్రమంలో కె జీ హెచ్ సూపరింటెండెంట్ మైథిలి,పెద్దసంఖ్యలో డాక్టర్లు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో ఈనెల 20 కల్లా వరిపంట రైతుల చేతికి వస్తుందని భావిస్తున్నామని అప్పటికీ మిల్లర్లు ధాన్యం సేకరణ కోసం సిద్ధంగా ఉండాలని సంయుక్త కలక్టరు డా. జి.సి. కిషోర్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఖరీఫ్ నకు 5 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. మిల్లర్లంతా బ్యాంక్ గ్యారంటీలను ఈనెల 15 లోగా సమర్పించాలని, వారికి దగ్గరగా ఉన్న ధాన్యం సేకరణ కేంద్రాలకు వారిని ట్యాగ్ చేయడం జరుగు తుందని తెలిపారు. గురువారం ఆయన చాంబరులో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. గత ఏడాది సేకరణలో గన్ని సంచుల వివరాలను 26 మంది మిల్లర్లు ఇంకనూ రీకన్స్ లేషన్ చేయలేదని, వెంటనే రికన్సలేషన్ చెయ్యాలన్నారు. పౌర సరఫరాల సంస్ద ప్రస్తుతం గన్ని బ్యాగ్లు సరఫరా చేసే పరిస్ధితి లేదని, పాత బేగ్ లనే వినియోగించాలని తెలిపారు. గత ఏడాది మిగిలిపోయిన గన్ని బేగ్లను వెంటనే గొట్లాం, సుంకి గోడౌన్లకు అప్పగించాలన్నారు. బిల్లుల చెల్లింపుల కోసం వెంటనే క్లైయిమ్ లు పెట్టాలని, బిల్లుల చెల్లింపు విషయంలో పారదర్శకంగా ఉండాలన్నారు. ధాన్యంను నిల్వవుంచేందుకు సరిపడేలా రైస్ మిల్లుల సమీపంలో గోడౌన్ల సంఖ్యను పెంచాలని పౌర సరఫరాల సంస్ద జిల్లా మేనేజర్ వరకుమార్ కు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ. పాపారావు, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు నంద్, రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులు కొండపల్లి కొండలరావు, గుణాన శ్రీరామమూర్తి, కె. సాయి శ్రీనివాస్, జి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జోరందుకుంది. జిల్లా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ అధ్యక్షతన మూడు రోజుల క్రితం జరిగిన సమావేశంలో సంయుక్త కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులను చైర్మన్లు గా నియమిస్తూ నాలుగు సబ్ కమిటీలను ప్రకటించిన సంగతి విధితమే. ఈ మేరకు ఆయా కమిటీల సభ్యులతో చైర్మన్లు గురువారం మొదటి విడత సమావేశాలు నిర్వహించారు. జనాభా, సరిహద్దులు, భూ సంబంధిత, న్యాయపరమైన అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. వివరాల సేకరణలో అవలంభించాల్సిన విధానాలపై పలు మార్గ నిర్దేశకాలు చేశారు. వివరాల సేకరణలో, పొందుపరచటం లో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. జేసీ కిషోర్ కుమార్, జేసీ మహేష్ కుమార్, జేసీ వెంకటరావుల అధ్యక్షతన గురువారం వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో చర్చించారు. పార్లమెంట్ స్థానాల వారీగా జనాభా వివరాలు పక్కాగా సేకరించాలని సబ్ కమిటీ -1 చైర్మన్, జేసీ కిషోర్ కుమార్ సూచించారు. ప్రాంతాలు, మండలాలు, రెవెన్యూ గ్రామాల వారీగా సేకరణ ఉండాలని చెప్పారు. పురుషులు, మహిళలు, పిల్లలు, వయోవృద్ధులు వివరాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల వారీగా వివరాలు సేకరించి సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. కులాల వారీగా వర్గీకరణ చేసుకొని ప్రక్రియను సులభతరంగా నిర్వహించాలని హితవు పలికారు. జామి మండలంలో కొంత భాగం కొత్తవలస నియోజకవర్గ పరిధిలోకి, మరికొంత భాగం గజపతి నగరం పరిధిలోకి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వివరాలు సేకరించాలని సూచించారు. ఇలాంటి ప్రాంతాలు ఉన్న చోట మిగతా శాఖల అధికారులతో సమన్వయంగా వ్యవరించి తప్పులు దొర్లకుండా చూసుకోవాలి చెప్పారు. అంతేకాకుండా జిల్లాలోని ఉన్న వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగుల వివరాలను సహేతుకంగా పొందుపరచాలని సబ్ కమిటీ -2 చైర్మన్, జేసీ మహేష్ కుమార్ ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సాధ్యమైనంత మేరకు సాంకేతికతను వినియోగించాలని చెప్పారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ భూముల వివరాలను త్వరితగతిన సేకరించి పొందు పరచాలని సబ్ కమిటీ -3 చైర్మన్, జేసీ వెంకటరావు సూచించారు. కలెక్టరేట్ లోని వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. అరుకు, పార్వతీపురం, విజయనగరం పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని సూచించారు. సేకరించిన వివరాలను సాంకేతికత సాయంతో సరిగ్గా అప్లోడ్ చేయాలని చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న కార్యాలయాల్లో ఎన్ని ప్రభుత్వానికి చెందినవి, ఎన్ని ప్రైవేట్ యాజమాన్యాలకు చెందినవి స్పష్టంగా పేర్కొంటూ వివరాలు పొందుపరచాలన్నారు. ఆయా సమావేశాల్లో సబ్ కమిటీల సభ్యులైన డీఆర్వో ఎం.గణపతి రావు, జిల్లాపరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, సి.పి.వో. జె.విజయలక్ష్మి, డి.ఎల్.ఎస్. ఎ. సెక్రెటరీ వి. లక్ష్మీ రాజ్యం, లాండ్ అండ్ సర్వే విభాగ ఎ.డి. జి.పోలరాజు, పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ కె.అపర్ణ, ఓ ఎస్ డి ఎం.పూర్ణ చంద్రరావు, ఖజానా శాఖ డి.డి. ఆర్.ఎస్.కె.వి. ప్రసాద్, కలెక్టరేట్ల లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సచివాలయానికి వచ్చే సర్వీసులను గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం హిందూపురం లోని రహ్మత్ పురం (16వ వార్డులోని 1వ) సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని, ఒక్క సర్వీసును కూడా పెండింగ్ లో ఉంచరాదన్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు అవసరమైన సమాచారాన్ని వెంటనే అందించాలని, ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ సేవల కోసం సచివాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సచివాలయ సేవలు ఎలా అందుతున్నాయో అరా తీశారు. అనంతరం సచివాలయానికి ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను సచివాలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల పోస్టర్ లను, లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి, తహసీల్దార్ శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మారుమూల నివసిస్తున్న వారికి మెరుగైన సేవలు అందించే నిమిత్తం గ్రామ సచివాయాలను ఏర్పాటు చేసి వినూత్న మైన మార్పులు తీసుకు వచ్చిందని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అధికారి గురువారం తన పర్యటనలో సాలూరు మండలం జిగిరాం, మామిడిపల్లి గ్రామాలలో చేపడుతున్న నాడు - నేడు పనులు, గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనుల పై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని అన్నారు, భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. అనంతరం మామిడిపల్లి గ్రామ సచివాలయంలో, రైతు భరోసా కేంద్రాలలో చేపడుతున్న పనులను పరిశీలించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా ఆను సరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ విధిగా సమయానికి విధులకు హాజరు కావాలని సమయపాలన పాటించాలని అన్నారు. పిర్యాదుల సేకరణలో పరిష్కారంలో ఆలసత్వం ప్రదర్శించ వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హజరుపట్టి, ప్రగతి నివేదికల పట్టి పరిశీలించారు. వాలంటరీ వ్యవస్థను సక్రమంగా వినియోగించుకోవాలని హితవు పలికారు. అలాగే మామిడిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఆత్యదిక ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు, నాడు నేడు పనులు వేగవంతం చేయాలన్నారు, పాఠశాలకు వచ్చిన సామాగ్రిని పరిశీలించారు, పాఠశాల తరగతులకు హాజరైన విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది కోవీడ్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు, ప్రతీ ఒక్కరూ తప్పక మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడుతూ తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలి, మాస్క్ ధరించి త దూరం పాటించాలన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించడం వలన ఆరోగ్యవంతంగా ఉంటామని ఆరోగ్యంగా ఉన్న నాడు మంచి విద్యను పొందగలమని హితవు పలికారు. ఈ పర్యటనలో పంచాయతీ రాజ్ డిఇ కె.నాగేశ్వర రావు, ఇంజనీరింగ్ ఆసిస్టెంట్లు. పాఠశాల ప్రధనోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైతన్నల ప్రగతికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని నగరి శాసనసభ్యురాలు ఆర్.కే.రోజా అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం అమలు చేశారన్నారు. నగరి మండలం నగరి మార్కెట్ యార్డ్ లోనగరి, నిండ్ర విజయపురం మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, రైతుల కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతీ గ్రామసచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన ఎరువులను మందులను, ఇతర సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండువేల మంది ప్రజలు ఉన్న చోట ఒక అగ్రికల్చర్ సహాయకులను ఏర్పాటు చేసి రైతులకు పూర్తిస్థాయిలో సస్యరక్షణ చర్యలను తెలియజేస్తుందన్నారు. గతంలో మాదిరి రైతులు వ్యవసాయంలో ఏ విషయంలో నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం కొత్తగా ఏర్పాటైన మార్కెట్ కమిటీ చైర్మన్లను రోజా అభినందించారు. ఈ కార్యక్రమంలో నగిరి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.