1 ENS Live Breaking News

బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్ష‌

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై టిటిడి విజిలెన్స్‌, పోలీసు అధికారులు క‌లిసి స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌ల‌లోని పిఏసి-4లో గ‌ల క‌మాండ్ కంట్రోల్ రూమ్ స‌మావేశ మందిరంలో ఈ స‌మీక్ష జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల తొలిరోజైన సెప్టెంబ‌రు 27న ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రివర్యులు గౌ. శ్రీ. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప‌ర్య‌ట‌న కోసం బందోబ‌స్తు, వాహ‌న‌సేవ‌ల‌కు విచ్చేసే భ‌క్తులకు పార్కింగ్ ఏర్పాట్లు, దొంగ‌త‌నాలు జ‌రుగ‌కుండా చ‌ర్య‌లు, క్యూలైన్ల‌లో తోపులాట లేకుండా ఏర్పాట్లు, ఘాట్ రోడ్ల‌లో కూంబింగ్‌, రాత్రి గ‌స్తీ విధులు, అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌తా ప‌రిక‌రాలు తెప్పించుకోవ‌డం, క్యూలైన్లు, బ్యారీకేడ్ల ఏర్పాటు, వ‌స‌తి స‌ముదాయాల వ‌ద్ద పోగ‌యిన వ్య‌ర్థాల తొల‌గింపు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు.

          అద‌న‌పు ఎస్పీ  మునిరామ‌య్య, విజివో  బాలిరెడ్డి, ఇఇ  జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ  వేణుగోపాల్‌, సిఐలు  జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి,  చంద్ర‌శేఖ‌ర్‌, ఎవిఎస్వోలు  సురేంద్ర‌,  సాయిగిరిధ‌ర్‌,  మ‌నోహ‌ర్‌,  శివ‌య్య ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-08-30 11:39:51

జిల్లాప్ర‌జ‌ల‌ను గ‌ణ‌నాథుడు చ‌ల్ల‌గాచూడాలి

స‌క‌ల విఘ్నాల‌ను తొల‌గించి,  ప్ర‌జ‌ల‌ను ఆ విఘ్నేశ్వ‌రుడు చ‌ల్ల‌గా చూడాల‌ని విజయ నగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. ఆ గ‌ణ‌నాథుడి ద‌య‌తో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది చెందాల‌ని ఆకాంక్షించారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా జిల్లా ప్ర‌జ‌ల‌కు ఆమె ఒక ప్ర‌క‌ట‌న ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. బుద్దికి, జ్ఞానానికి ప్ర‌తీక‌గా ఆ గ‌ణ‌నాథుడిని ఆరాధిస్తార‌ని చెప్పారు. జ్ఞానం, ల‌క్ష్య సాధ‌న‌, నైతిక విలువ‌లు, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ వంటి ఎన్నో సుగుణాల‌ను ఈ పండుగ మ‌న‌కు నేర్పుతుంద‌ని పేర్కొన్నారు. హిందువుల తొలి పండుగ అయిన ఈ గ‌ణేష్ చ‌తుర్ధిని ప్ర‌జ‌లంతా భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో నిర్వ‌హించుకోవాల‌ని కోరారు. పందిళ్ల‌లో, మంట‌పాల్లో వినాయ‌క ఉత్స‌వాల‌ను నిర్వ‌హించే చోట‌, త‌గిన ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని, నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ, ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగ‌కుండా వేడుక‌ల‌ను నిర్వ‌హించుకోవాల‌ని తెలిపారు. ముఖ్యంగా వినాయ‌క నిమ‌జ్జ‌నాలు చేసేట‌ప్పుడు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

Vizianagaram

2022-08-30 11:25:00

విఘ్నాలు తొల‌గిపోయేలా పండుగ చేసుకోవాలి

తెలుగువారి తొలి పండుగ వినాయ‌క చ‌వితిని జిల్లా ప్ర‌జ‌లంతా భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో జ‌రుపుకోవాల‌ని, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కోరారు. గ‌ణేష్ చ‌తుర్ధి సంద‌ర్భంగా జిల్లా ప్ర‌జ‌లంతా మట్టిగణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఆ గ‌ణ‌నాధుని చ‌ల్ల‌ని చూపుతో, ప్ర‌జ‌లంతా సుఖఃసంతోషాల‌తో ఉండాల‌ని, మ‌న‌ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్దిలో దూసుకుపోతూ విఘ్నాలు తొల‌గిపోవాల‌ని కోరారు. వినాయ‌క‌చ‌వితి జ‌రుపుకొనే విష‌యంలో ప్ర‌భుత్వం కొత్త‌గా ఎటువంటి నిబంధ‌న‌లు పెట్ట‌లేద‌ని, ఇదంతా ప్ర‌తిప‌క్షాల దుష్ప్ర‌చార‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప‌ర్యావ‌ర‌ణ హితంగా పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని, మ‌ట్టి విగ్రాహాల‌ను వినియోగించడం ద్వారా మరికొందరికి ఆదర్శంగా నిలవచ్చునన్నారు. 

Vizianagaram

2022-08-30 11:03:44

ఖాతాలు తెరిచినవెంటనే గృహనిర్మాణాలు

గృహనిర్మాణ లబ్ధిదారులంతా ఐసీఐసీఐ బ్యాంకులో వేగంగా ఖాతాలు తెరిచి నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా అగ్రిమెంట్లపైసంతకాలు చేస్తే ఇంటి నిర్మాణాలు ప్రారంభమ వుతాయని కార్పొరేషన్‌ కమిషనర్‌ కె.రమేష్‌ చెప్పారు. స్థానిక పేర్రాజుపేటలోని 5వ డివిజన్‌  సచివాలయంలో మంగళవారం బ్యాంకు ఖాతాల తెరిచే ప్రక్రియను కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13500 మంది గృహనిర్మాణ లబ్ధిదారులకు గాను ఇప్పటికే 10వేల మంది బ్యాంకు ఖాతాలను తెరిచారన్నారు. మిగిలిన 3,500 ఖాతాలను కూడా త్వరగా తెరిపించి వీరంతా వేగంగా అగ్రిమెంట్లపై సంతకాలు చేసి ఇచ్చేలా పనులు వేగవంతం చేయాలని ఆయన సంబంధిత ఉద్యోగులను ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిఅయితే డిసెంబర్‌ నాటికల్లా ఇళ్ళ నిర్మాణాలను ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

 సందర్భంగా బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేసేందుకు వచ్చిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీపీఆర్వో కృష్ణమోహన్, ఐదవ డివిజన్‌ కార్పొరేటర్‌నల్లబెల్లి సుజాత, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.

Kakinada

2022-08-30 10:25:38

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారాసీజనల్‌వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు వహించాలని కాకినాడ నగరపాలకసంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ ప్రజలకు సూచించారు. గురువారం ఆయన కరణంగారి జంక్షన్, కృష్ణానగర్‌ బ్యాంక్‌ కాలనీ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. వర్షాకాలం దృష్ట్యా డెంగీ వంటి వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా వర్షపునీరు, స్వచ్ఛమైన నీటిలో డెంగీ దోమ వృద్ధి చెంది వాటి ద్వారా ప్రజలు అనారోగ్యాలపాలయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థ చేపట్టే ప్రత్యేక పారిశుద్ధ్యకార్యక్రమాలతోపాటు ప్రజలు కూడా తమతమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వనీటిని తొలగించుకోవడంపై దృష్టిసారించాలన్నారు.

 ముఖ్యంగా పూలకుండీలు, వాడిపడేసిన కొబ్బరి బొండాలు,టైర్లలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని వ్యాధులు ప్రభలకుండా చూసుకోవాలని కమిషనర్‌ కోరారు. అలాగే పారిశుద్ధ్య పనులను కూడా ఆయన తనిఖీ చేశారు. ప్రజలు తడిపొడి చెత్తను వేర్వేరుగా ఇచ్చి పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట కార్పొరేషన్ ఆరోగ్య అధికారి డాక్టర్ పృద్విచరణ్ తదితరులు ఉన్నారు.

Kakinada

2022-08-30 10:23:32

డీవార్మింగ్ డేను విజయవంతం చేయాలి

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వచ్చే నెల 8న ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలో జరగనున్న డీ – వార్మింగ్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం డిఎంహెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో పి.హెచ్.సి.,సి.హెచ్.సి వైద్యాధికారులతో డీ-వార్మింగ్ డే మరియు ఫీవర్ సర్వే, వైద్యాధికారుల సేవలు తదితర అంశాలపై ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 8న జరగనున్న డీ – వార్మింగ్ డేను జిల్లాలో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. డీ-వార్మింగ్ మాత్రలు ముందుగానే ప్రతి గ్రామ సచివాలయానికి సంబంధిత ఏఎన్ఎంల ద్వారా చేరవేసి, ప్రతి పిల్లవాడితో పాటు  19 ఏళ్ల వయస్సులోపు గల వారందరికీ అందేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. 

పి.హెచ్.సిలకు కేటాయించిన లక్ష్యాలను సాధించని కొరిగాం, నిమ్మాడ. తాడివలస, గుప్పిడిపేట. సైరిగాం, జి.సిగడాం వైద్యాధికారులు ఇకపై వెనుకంజలో ఉండరాదని, వెనుకంజలో ఉన్నవారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పి.హెచ్.సి వైద్యాధికారులు తమకు అప్పగించిన లక్ష్యాలను తూ.చ తప్పకుండా శతశాతం సాధించాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రతి రోజూ ఉదయం 09.00గం.ల నుండి సాయంత్రం 04.00గం.ల వరకు పి.హెచ్.సి వైద్యాధికారులు అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. 

బయోమెట్రిక్ తప్పనిసరి అని, లేనివారిపై  చర్యలు తీసుకుంటామని ఉద్భోదించారు. ప్రతి బిడ్డకు, గర్భిణీ స్త్రీలకు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అందేటట్లుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఆశావర్కర్, ఏఎన్ఎం ఖచ్చితంగా ఫీవర్ సర్వే చేయాలని, సర్వేలో జ్వరం లేదా టి.బి కేసులు ఉన్నట్లయితే వారికి దగ్గరలోని ప్రాథమిక లేదా సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు. విలేజ్ క్లినిక్ లో పనిచేస్తున్నఎం.సి.హెచ్.పిలు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషిచేయాలన్నారు. ప్రతి పి.హెచ్.సిలో ఎల్.టిలు క్షయ వ్యాధి కేసులను గుర్తించి, వారికి  కెల్ల పరీక్షలు నిర్వహించి నిర్ధారించిన పిదప వారిని క్షయవ్యాధి నివారణ కేంద్రానికి తరలించాలని సూచించారు. ప్రతి పి.హెచ్.సిలో అన్నిరకాల మందులు నిల్వ ఉండేటట్లు చూసుకోవాలని, మందుల కోసం సంబంధిత ప్రోగ్రామ్ అధికారుల ద్వారా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుండి పొందాలని తెలిపారు. 

మందుల అవసరాలను బట్టి ఎప్పటికపుడు మందులు తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని, డి.ఐ.ఓ విభాగం నుండి సిరంజీలు, కాటన్ పొందాలన్నారు. గర్భిణీ స్త్రీల నుండి పుట్టబోయే బిడ్డ వరకు ప్రభుత్వం అందిస్తున్నపథకాలను అందించాలని, అలాగే వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రంలో సేవలు పొందుతున్న గర్భిణీలు, పిల్లలకు తప్పనిసరిగా గుర్తింపు నెంబరును కేటాయించాలని, పొగాకు, గుట్కా వంటి వాటిని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఏ.ఎన్.ఎంలకు ట్యాబులు వచ్చాయని, వాటిని సెప్టెంబర్ 12,13వ తేదీల్లో పంపిణీచేయనున్నట్లు చెప్పారు. వాటి సహాయంతో ప్రతి ఏఎన్ఎం అభయ ఐ.డిని కేటాయించాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా.ఎన్.అనూరాధ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఆర్.వి.ఎస్.కుమార్, పి.ఓ.డి.టి జె.కృష్ణమోహన్, పరిపాలన అధికారి సువర్ణ, డి.ఎం.ఓ సత్యనారాయణ, డి.పి.ఎం.ఓ వి.వి.అప్పలనాయుడు, జిల్లా మాస్ మీడియా అధికారి పి.వెంకటరమణ, పి.హెచ్.సి, సి.హెచ్.సిల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2022-08-30 10:19:33

2024నాటికి ప్రతీ ఇంటికీ సురక్షిత మంచినీరు

ప్ర‌తి గ్రామంలో 2024 నాటికి అన్ని ఇళ్లకు సుర‌క్షిత మంచినీటి కుళాయిని అందుబాటులోకి తెచ్చే ల‌క్ష్యంతో అమ‌ల‌వుతున్న జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు గ్రామ‌స్థాయి నీరు, పారిశుద్ధ్య క‌మిటీలు కీల‌క‌పాత్ర పోషించాల్సి ఉంటుంద‌ని జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం కాకినాడ జెడ్‌పీ స‌మావేశ మందిరంలో జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌పై ఇంప్లిమెంటేష‌న్ స‌పోర్ట్ ఏజెన్సీ (ఐఎస్ఏ) ప్ర‌తినిధుల‌కు వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌తి ఇంటికీ సుర‌క్షిత తాగునీటిని అందించి.. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర‌చ‌డం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించి, వారికి అవ‌గాహ‌న క‌ల్పించి భాగ‌స్వాముల‌ను చేసి మిష‌న్ విజ‌య‌వంతానికి మ‌ద్ద‌తు సంస్థ‌లు, అధికారులు స‌మ‌న్వ‌యంలో ప‌నిచేయాల‌ని సూచించారు. 

వివిధ ప‌థ‌కాల‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా ఎప్పుడూ ముందుంటోంద‌ని.. జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కార్య‌క్ర‌మం అమ‌ల్లోనూ జిల్లా ముందుండేలా కృషిచేయాల‌ని సీఈవో సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ నీటి స‌ర‌ఫ‌రా ప‌థకం కోసం గ్రామీణ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక (వీఏపీ)ను రూపొందించ‌డం, నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డం, యాజ‌మాన్యీక‌రించ‌డం, అమ‌లు చేయ‌డం వంటి వాటిలో గ్రామ నీరు, పారిశుద్ధ్య క‌మిటీలు కీల‌క‌పాత్ర పోషించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. గ్రామ అవ‌స‌రాలు, వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌, ప్ర‌జా భాగ‌స్వామ్యం, హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ గ్రామాలుగా ప్ర‌క‌ట‌న త‌దిత‌ర విష‌యాల‌పై స‌పోర్ట్ ఏజెన్సీలు అవ‌గాహ‌న పెంపొందించుకోవాల‌న్నారు. ఇంప్లిమెంటేష‌న్ స‌పోర్ట్ ఏజెన్సీ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త వీరాస్వామి.. వ‌ర్క్‌షాప్‌లో మిష‌న్ ల‌క్ష్యాలు, గ్రామ నీరు, పారిశుద్ధ్య క‌మిటీల కూర్పు, బాధ్య‌తలు; గ్రామస్థాయి ప్ర‌ణాళిక‌లు, నీటి నాణ్య‌త ప‌రీక్ష‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప్రజా భాగ‌స్వామ్యం త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఈఈ వి.గిరి, ఇత‌ర ఇంజ‌నీరింగ్ అధికారులు, ఎన్‌జీవోల ప్ర‌తినిధులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-08-30 09:59:57

మ్రుతులకు రూ.40లక్షలు ప్రభుత్వ ఉద్యోగం

వాకలపూడి పారిశ్రామికవాడలో సోమవారం ప్యారీ షుగర్స్ రిఫైనరీ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఇరువురు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ  60 లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలియజేశారు. ప్యారీ షుగర్స్ సంస్థ యాజమాన్యంతో కాకినాడ  ఆర్డిఓ, కాకినాడ డిఎస్పి, ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కార్మిక సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో  సోమవారం రాత్రి జరిపిన చర్చలలో మృతుల కుటుంబాలకు ఒక్కక్కరికీ రూ.40 లక్షల పరిహారం, ఉద్యోగుల కాంట్రీబ్యూషన్ ద్వారా మరో 5 లక్షలు సొమ్మును చెల్లించేందుకు సదరు సంస్థ ఒప్పంద అంగీకారం సమర్పించిందన్నారు.  ఈ మేరకు  ఈ దుర్ఘటనలో మరణించిన రాగం ప్రసాద్ (37సం.), తండ్రి రాగం రాంబాబు, రంగప్పచెరువు, గొల్లప్రోలు మండలం, మరోక వ్యక్తి పేరూరి సుబ్రమణ్యేశ్వరరావు (33 సం.), తండ్రి సత్యన్నారాయణ, వట్రపూడి, కె.గంగవరం మండలం కుటుంబాలకు  ఒక్కక్కరికీ కంపెనీ అందించే 45 లక్షల పరిహారం, వర్క్సుమెన్ కాంపేషేషన్ చట్టం క్రింద 10 లక్షలు, వై.ఎస్.ఆర్.భీమా పధకం క్రింద 5 లక్షలు వెరసి మొత్తం 60 లక్షలు పరిహారం అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అలాగే నిబంధన మేరకు మృతుల కుటుంబాల్లోని ఒకరికి కంపెనీలో శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు సంస్థ అంగీకరించిందన్నారు.

అలాగే సోమవారం జరిగిన ప్రమాదం నేపద్యంలో ప్యారీ షుగర్  రిఫైనరీ సంస్థలో ప్రమాణిక రక్షణ చర్యలు పాటించకుండా ఆపరేషన్స్ కొనసాగించడం వల్ల కార్మికుల భద్రతకు ముప్పు ఉన్నందున, ఫ్యాక్టరీస్ చట్టం-1948, ఏపి ఫ్యాకరీస్ రూల్స్-1950 లోని సెక్షన్ 40(2) ప్రకారం ధర్డ్ పార్టీ పరిశీలన ద్వారా సంస్థలోని భద్రతా వ్యవస్థ అమలును దృవీకరించి, తదుపరి ఉత్తర్వులు జారీ చేసి వరకూ పారీ షుగర్స్ సంస్థలో ఆపరేషన్స్ అన్నిటినీ నిలిపి వేస్తూ ఫ్యాకరీస్ శాఖ ద్వారా పొహిబిటరీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.

Kakinada

2022-08-30 09:52:24

రాజరాజ నరేంద్రుని కోసం అందరికీ తెలియాలి

రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన శ్రీ రాజారాజా నరేంద్రుడు పాలనను భవిష్యత్తు తరాలకు అందించే వారు చేసిన శాసనాలను ఫోటో ఫ్రేమ్ చెయ్యడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో ట్రైనింగ్ కళాశాల ప్రొఫెసర్ డా ఆర్ వి వి రాజా గోపాలా చార్యులు కలెక్టరేట్ లో ప్రదర్శనగా ఉంచేందుకు కలెక్టర్ కు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత ప్రొఫెసర్ గోపాలచార్యులు మన దేశ, మన ప్రాంత చారిత్రక ఆధారాలను సేకరించి ఒకే ఫ్రేమ్ గా రూపొందించి, వాటిని అందచెయ్యడం పట్ల కృషి చేసిన తీరు ఎందరికో ఆదర్శం అన్నారు. వెయ్య సంవత్సరకాలం నాటి చారిత్రక ఆధారాలు సేకరించడం ఒక ఎత్తైతే వాటిని ఒకటి గా రూపొందించడం జరిగిందన్నారు. ఈ ఫ్రేమ్ ను కలెక్టరేట్ లో ప్రజల సందర్శన కోసం ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 

ఈ సందర్భంగా సంబందించిన వివరాలు డా.ఆర్.వి.వి.రాజా గోపాలాచార్యులు తెలియచేస్తూ, 1912 వ సంవత్సరం లో జయంతి రామయ్య గారు ఆనాడు  శ్రీ రాజారాజా నరేంద్రుడు పాలనకు చెందిన చారిత్రక ఆధారాలతో ఒక ప్రచురణ చెయ్యడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరాన్ని తూర్పు గోదావరి జిల్లా కి ప్రధాన కార్యస్థానంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కలెక్టరేట్ కి బహూకరించడం జరిగిందన్నారు. ఇందులో ఆనాటి రాజ్యాభిషేకం సందర్భంగా శిలా శాసనం లో పేర్కొన్న సంగతులతో ఫోటో ప్రేమ్ తన స్వంత అభిలాష తో తయారు చేసి అందజేసినట్లు తెలిపారు. ఈ శాసన రాగి పత్రాలలో  ఆనాటి చారిత్రక ఆధారాలు పొందుపరిచామని పేర్కొన్నారు.

Rajamahendravaram

2022-08-30 08:39:07

తెలుగు భాషకే గొప్పదనం గిడుగు

గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషాగా తీసుకుని వొచ్చిన సంస్కర్తల్లో అగ్రగణ్యులు గిడుగు రామ్మూర్తి అని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో వాడుక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఇంఛార్జి డీఆర్వో ఎస్. మల్లిబాబు, జిల్లా అధికారులు ఆయన చిత్రపటానికి పూల మాలలంవేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వ్యవహారిక వాడుకభాష ఉద్యమానికి ఆద్యులైన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి జరుపుకుని ఆయన సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యం అన్నారు. తెలుగు భాషను వాడుక  భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన చేసిన సంస్కరణలు బహుముఖ ప్రజ్ఞాశాలి గా గుర్తించాయన్నారు. 

ఈరోజు ఆ మహనీయుని జయంతి కార్యక్రమాన్ని తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆయనకు ఇవ్వడం తెలుగు వారికి ఎంతో గర్వకారణం అన్నారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఇకపై కలెక్టరేట్ నందు ప్రతి రోజూ  "రోజుకో ఒక తెలుగు పదం " వ్యాఖ్య వ్రాయడం కోసం ప్రదర్శన పలక ముందు భాగంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అందులో ప్రతి రోజూ ఒక తెలుగు వాక్యాన్ని  తప్పనిసరిగా రాయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

సవర భాష కోసం శ్రీకాకుళం వెళ్లి ఆ భాషకు లిపిని తీసుకుని వచ్చి వాడుక భాష ఔనిత్యాన్ని చాటిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహేచ్. శ్రీధర్ పేర్కొన్నారు. తెలుగు భాషను మన పిల్లలకు నేర్పించడం ద్వారా వారిలోని సృజనాత్మకతను పెంపొందించడం సులభసాధ్యం అవుతుందని ఆయన అన్నారు.

Rajamahendravaram

2022-08-29 15:32:25

గ్రుహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

కాకినాడ జిల్లాలో న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల ప‌థ‌కం కింద చేపట్టిన గృహ నిర్మాణాల వేగవంతానికి చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్‌లో హౌసింగ్ నిర్మాణ పనులు, సిమెంట్ సరఫరా, స్టేజ్ కన్వర్షన్, అప్రోచ్ రోడ్లు, క‌ల్వ‌ర్టుల నిర్మాణ పనులు తదితర అంశాలపై హౌసింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి సమీక్షించారు. తుని, సామర్లకోట, గొల్లప్రోలు, పెద్దాపురం, పిఠాపురం, ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్లు, కాకినాడ అర్బన్ కొమరగిరి లేఅవుట్‌కి  సంబంధించి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఇతర అధికారులు గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతం చేయాలన్నారు. గృహ నిర్మాణ పట్టా పొందిన ప్రతి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం ప్రారంభించి స్టేజ్ కన్వర్షన్ చేసే విధంగా చూడాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన యాప్‌లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు స్టేజ్ కన్వర్షన్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ స‌మావేశంలో కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ కె.రమేష్, పెద్దాపురం ఆర్‌డీవో జే.సీతారామరావు, హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, ఏలేశ్వరం మున్సిపాలిటీల కమిషనర్లు, కాకినాడ గ్రామీణ మండలాల అధికారులు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-29 14:05:06

అమ్మ లాంటి తెలుగు బాషని మరవద్దు

అమ్మలాంటి తెలుగు భాషని మరువరాదని నగర మేయర్ గొలగాని వారి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె తెలుగు భాషా దినోత్సవం, తెలుగు భాష కొరకు విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి 159 వ జయంతి సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ తో కలిసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ తెలుగు భాషా నిర్మాతలలో ముఖ్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని అన్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో జన్మించారని, జీవిత కాలం తెలుగు భాష కొరకు, తెలుగు భాష ఔన్నత్యం కొరకు పాటుపడ్డారని గుర్తు చేశారు. అమ్మ లాంటి తెలుగు వాడుక భాష కొరకు అనేక ఉద్యమాలు చేశారన్నారు. 

కొంతమంది ప్రాచీన భాష సంస్కృతం లో విద్యాబోధన జరగాలని వాదించే వారిని, కానీ ఆయన  తెలుగు భాష స్వచ్ఛతంగా రాయడం చదవడం కొరకు పాటుపడే వారిని, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి తెలుగు కమ్మదనాన్ని విద్యార్థులకు చూపించడమే కాకుండా ఎన్నో రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచేవారిని తెలిపారు. రామ్మూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా మేయర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు, ప్రధాన ఇంజనీర్, పట్టణ ప్రణాళిక అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-29 14:01:18

ఘనంగా గిడుగు జయంతి ఉత్సవం

వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి పురస్కరించి సోమవారం ఉదయం కలెక్టరేట్ స్పందన హాలులో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ముఖ్య అతిధిగా హాజరై, జిల్లా అధికారులు, తెలుగు భాషాభిమానులతో కలిసి  గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూల మాలలు అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ  గ్రాంధిక శైలిలో సాగుతున్న తెలుగు భాషా రచన, బోధనలను అందరికీ అర్థమయ్యే వాడుక భాషలోనికి తెచ్చేందుకు గిడుగు వెంకట రామమూర్తి వ్యవహారిక భాషాఉద్యమాన్ని నిర్వహించారని, ఆయన కృషికి  వల్లే నేడు విద్య, విజ్ఞానం, సాహిత్యం ప్రజలందరికీ అందుబాటులో వచ్చాయన్నారు.  అంతేకాక తన వంటి తెలుగేతర మాతృభాష కలిగిన వ్యక్తులు కూడా సులువుగా తెలుగు భాషను నేర్చుకునేందుకు వాడుక భాష దోహదం చేస్తోందన్నారు.

 మన పూర్వ కవులు, భాషావేత్తలు  మధురమైన తెలుగు భాషను సుసంపన్నం చేసి వారసత్వ సంపదగా మనకు అందించారని, భాషా పరిరక్షణతో పాటు, భాషా ప్రచుర్యానికి, విస్తృతికి కృషి చేయాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు.  ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు భాష గొప్పదనాన్ని, సౌందర్యాన్ని, మాధుర్యాన్ని వివరించి మాతృభాష పట్ల మక్కువ పెంపొందించాలని,  కుటుంబాలలో తప్పని సరిగా తెలుగు భాషను పిల్లలకు నేర్పాలని కలెక్టర్ కోరారు.   జీవన అవసరాల కోసం ఎన్ని ఇతర భాషలు నేర్చినా, తల్లి భాష తెలుగును నిర్లక్ష్యం చేయవద్దన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఉన్నారని, వారందరూ తెలుగు భాష ప్రాచుర్యానికి కృషి చేయడం ముదావహమన్నారు.  తెలుగు భాషలో రచనా అనురక్తిని నేటి తరం యువత పెంపొందించుకోవాలని, ఇందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రోత్సాహం అందించామని తెలిపారు.  అలాగే ప్రజలతో జరిపే  ఉత్తర ప్రత్యురాలను అధికారులు వ్యవహారిక తెలుగు భాషలోనే సాగించాలని, పాలనా ఫలాలు ప్రజలకు సమగ్రంగా చేరేందుకు ఇది దోహదం చేయగలదన్నారు. 

కార్యక్రమంలో తెలుగు భాషా దినోత్సవం పురస్కరించి జిల్లాలో  తెలుగు భాషా ప్రాచుర్యానికి విశేష సేవలు అందింస్తున్న కవులు, భాషా వేత్తలను జిల్లా కలెక్టర్ సత్కరించారు.  ఇందులో భాగంగా  శతావధాని, విశ్రాంత తెలుగు పండితులు పోచినపెద్ది సుబ్రమణ్యం, కవి, భాషా,సాహిత్య ప్రచారకలు కొరుప్రోలు గౌరినాయుడు, కవయిత్రి, సాహితీ విమర్శకులు డా. కాళ్లకూరి శైలజ లను ఆమె దుస్సాలువాలతో సత్కరించారు.  ఈ సందర్భంగా తెలుగు భాషకు గిడుగు వెంకట రామమూర్తి చేసిన సేవలను కొరిప్రోలు గౌరినాయుడు, తెలుగు భాషా ప్రశస్తి, మాధుర్యాలను పోచిన పెద్ది సుబ్రమణ్య కవి, ఆధునిక విజ్ఞానం, సాంకేతి పరిజ్ఞానాలను కూడా వాడుక తెలుగు భాషలో భోదించాల్సిన అవసరాన్ని కవయిత్రి డా.కాళ్లకూరి శైలజ వివరించారు.  
కార్యక్రమానికి జడ్పి సిఈఓ ఎన్.వి.వి.సత్యన్నారాయణ స్వాగతం పలుకగా, జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధరరెడ్డి, బిసి కార్పొరేషన్ ఈఢి ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.  అనంతరం మద్యాహ్నం కలెక్టరేట్ కు విచ్చేసిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగాగీతా విశ్వనాథ్ తెలుగు భాషా దినోత్సవం పురస్కరించి గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి, తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు ఘనంగా నివాళులు అర్పించారు. 

Kakinada

2022-08-29 13:49:57

ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు

కాకినాడ కలెక్టరేట్ లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత, జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా.. డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డిల‌తో కలిసి కారుణ్య నియామకం కింద ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. యార్లగడ్డ శ్రీనివాసరావు గ్రేడ్-2 వీఆర్వోగా వక్కలంక సచివాలయం, అంబాజీపేట మండలంలో పనిచేస్తూ అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన భార్య ఉందుర్తి దుర్గా పార్వతిని డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియ‌మించారు.  గంటా రామకృష్ణ, గ్రేడ్-2 వీఆర్వోగా వాకతిప్ప గ్రామం, యు.కొత్తపల్లి మండలంలో పనిచేస్తూ మరణించగా ఆయన భార్య పితాని మహాలక్ష్మిని కాకినాడ డివిజన్‌లో ఆఫీస్ సబార్డినేట్‌గా నియ‌మించారు.  మాదిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ గ్రేడ్-2 వీఆర్వోగా రామవరంగ్రామం, జగ్గంపేట మండలంలో ప‌నిచేస్తూ రోడ్డు ప్రమాదం కారణంగా మృతి చెందగా ఆయన కుమారుడు మాదిరెడ్డి రాజా మురళీకృష్ణను పెద్దాపురం మండలం, పులిమేరులో గ్రామ రెవెన్యూ అధికారిగా నియమించారు. 

Kakinada

2022-08-29 13:46:13

స్పందన పరిష్కారంలో నాణ్యత ఉండాలి

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం స్పంద‌న‌కు వ‌చ్చే ప్ర‌తి అర్జీని నిర్ణీత స‌మ‌యంలో, నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం జిల్లాస్థాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ స్పందన హలులో నిర్వహించారు. కార్యక్రమంలో క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్‌వీఎస్ సుబ్బ‌ల‌క్ష్మిల‌తో క‌లిసి  ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో 353 అర్జీలు స్వీకరించారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల మంజూరు, రెవెన్యూ సేవలు, సర్వే, పెన్షన్ తదితరాలపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఆక్ర‌మ‌ణ‌లు త‌దిత‌రాల అర్జీల ప‌రిష్కారానికి సంబంధించి ఫొటోల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. రెవెన్యూ అర్జీల ప‌రిష్కారానికి సంబంధించి అధికారులు, సిబ్బంది క్షేత్ర‌స్థాయి సంద‌ర్శ‌న ఫొటోల‌ను ప‌రిష్కార నివేదిక‌కు జ‌త‌చేయాల‌ని ఆదేశించారు. స్పంద‌న అర్జీల ప‌రిష్కార నాణ్య‌తా ప్ర‌మాణాల త‌నిఖీలో భాగంగా క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటుచేసే ప్ర‌త్యేక కాల్ సెంట‌ర్ ద్వారా అర్జీదారుల‌కు ఫోన్ చేసి, ప‌రిష్కారంపై అభిప్రాయాలు తీసుకోనున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. అంత‌కుముందు స్పంద‌న కార్య‌క్ర‌మంలో అర్జీలు ఇచ్చేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చే అర్జీదారుల కోసం క‌లెక్ట‌రేట్‌లో చేసిన ఏర్పాట్ల‌ను క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా తో పాటు, స్పంద‌న హాల్‌లో జ‌రిగిన జిల్లాస్థాయి స్పంద‌న కార్య‌క్ర‌మంలో కాకినాడ ఎంపీ వంగా గీత పాల్గొని.. కొంతసేపు అర్జీల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు.

ఎస్సీ, ఎస్టీ ప్ర‌త్యేక స్పంద‌న‌కు 32 అర్జీలు:
మధ్యాహ్నం కలెక్టరేట్ స్పందన హలులో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో డీఆర్‌వో కె.శ్రీధ‌ర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులోగా పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మొత్తం 32 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-29 13:42:51