1 ENS Live Breaking News

ఈ - క్రాప్ లో ఉంటేనే ధాన్యం కొనుగోలు

ఈ-క్రాప్ లో నమోదు ఉంటేనే ధాన్యం కొనుగోలు జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న ఖరీఫ్ 2022-23 సీజనకు సంబంధించి జిల్లాలో ధాన్యము పంట ప్రక్రియ ప్రారంభమైందని, నిబంధనల ప్రకారం ఇ పంట నమోదు చేసుకున్న రైతుల వద్ద నుండి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.  వ్యవసాయ శాఖ ఇప్పటికే ఇ పంట నమోదు ప్రక్రియను ప్రారంభించిందని చెప్పారు.  రైతుల సౌకర్యార్ధం దిగుబడికి అనుగుణంగా జిల్లాలో మొత్తం 306 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చెయ్యడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు.  రైతులు తమ పేర్లు ఈ పంటలో నమోదు అయింది లేనిదీ  సరిచూసుకొని దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో వెంటనే నమోదును చేసుకోవాలని కోరారు. ఈ-పంట లో పేర్లు నమోదు కాకపోతే మండల వ్యవసాయాధికారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.  రైతులందరూ ఇ-పంట నమోదును వెంటనే పూర్తిచేసుకుని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందుటకు ఇప్పటి నుండే శ్రద్ద వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Parvathipuram

2022-08-26 16:38:23

కెఎస్ఈజెడ్ కి భూములు అప్పగించాలి

కాకినాడ ప్ర‌త్యేక ఆర్థిక మండ‌లి (కెఎస్ఈజెడ్‌) భూములకు సంబంధించి రెవెన్యూ, సర్వే; రోడ్లు, భవనాలు, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు వేగంగా భూములు అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ కలెక్టరు కార్యాలయంలో కలెక్టరు కృతికా శుక్లా.. ఎస్ఈజెడ్‌, రెవెన్యూ; రోడ్లు, భవనాలు; ఇరిగేషన్, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులతో కెఎస్ఈజెడ్‌ భూముల సర్వే, రిజిస్ట్రేషన్, అన్నవరం నుంచి కోనా రైల్వే లైన్ పనులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఎస్ఈజెడ్ భూములకు సంబంధించి ఏవీ నగరం, కె.పెనుమల్లపురం, కోదాడ గ్రామాలలో 360 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 194 ఎకరాల భూమి సర్వే, రిజిస్ట్రేషన్ పనులను పూర్తిచేసి రైతులకు అప్పగించడం జరిగిందన్నారు. అదేవిధంగా తొండంగి, యూ.కొత్తపల్లి మండలాల‌కు సంబంధించి భూముల సర్వే, రిజిస్ట్రేషన్ పనులను వేగవంతం చేసి, రైతులకు భూమిని అప్పగించే విధంగా చూడాలన్నారు. 

ఇందుకు కెఎస్ఈజెడ్, రెవెన్యూ, సర్వే, రోడ్లు, భ‌వనాలు, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో కెఎస్ఈజెడ్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌త్యేకంగా దృష్టిసారించినందున వారం వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. సమావేశంలో కెఎస్ఈజెడ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కె.మనోరమ, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు బీవీ రమణ, జె.సీతారామారావు; రోడ్లు, భవనాలు; ఇరిగేషన్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, అరబిందో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సీఆర్ఎం నాయుడు, ప్రతినిధులు వి.దుర్గాప్రసాద్, పీవీఎస్ రాజు, జె.భాస్కర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-26 16:20:20

డిగ్రీ విద్యార్థులకు 2 నెలలు నైపుణ్య శిక్షణ

డిగ్రీ విద్యార్థుల ఉద్యోగ నైపుణ్య శిక్షణకు సంబంధించి కాకినాడ జిల్లాలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న11,622 మంది విద్యార్థులను ఈ నెల 31 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తిచేయాల‌ని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ కలెక్టరు కార్యాలయంలో విద్యార్థుల ఇంట‌ర్న్‌షిప్‌, అప్రెంటీస్‌షిప్‌పై కలెక్టరు డా. కృతికా శుక్లా.. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, పరిశ్రమలు, వికాస సంస్థ ప్రతినిధులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఇంట‌ర్న్‌షిప్‌, అప్రెంటీస్‌షిప్‌ల ద్వారా జిల్లాలో ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 15 వరకు రెండు నెలలు పాటు అనుసంధానం చేసిన శాఖల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రెండు నెలలు ఇంట‌ర్న్‌షిప్ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టరు అధికారులకు సూచించారు. సమావేశంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ టి.అశోక్, డీన్ పి.సురేష్ వర్మ, రిజిస్ట్రార్ టి.అశోక్, పరిశ్రమల శాఖ ఏడీ కె.కృష్ణార్జునరావు, ఏపీఐఐసీ జెడ్.ఎం.లక్ష్మి ఆండాళ్, వికాస పీడీ కె.లచ్చారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-26 16:17:56

కార్పొరేట్ కు ధీటుగా ఎస్సీ గురుకులాలు

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మంత్రి నాగార్జున మేఘాద్రిగడ్డ లోని బి. ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ గురుకులాలు, హాస్టళ్ల రూపురేఖలు మార్చే విధంగా వాటిని నాడు- నేడు లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేర్చారని, ఒక్క సంతకంతో ఎస్సీ పిల్లల భవిష్యత్తు కు బంగారు బాటలు వేశారని కితాబిచ్చారు. పిల్లలకు మంచి పోషకాహారం తో పాటు వారికి కావాల్సిన సకల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం విద్య ద్వారా సమాజంలో వారు ఉన్నత స్థానాలకు చేరుకునే మార్గాన్ని నిర్మించారని అభిప్రాయ పడ్డారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు చెప్పారు. 

 ఎస్సీ గురుకులాలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడం లో భాగంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నామని నాగార్జున వెల్లడించారు. పిల్లలకు వివిధ సబ్జెక్టులు బోధించే టీచర్లు తమ సబ్జెక్టుల్లో పిల్లలు 100% ఫలితాలు సాధించేలా చూసుకోవాలని, ఆ బాధ్యత టీచర్లదేనని స్పష్టం చేశారు. పిల్లలు వెనుకబడిన సబ్జెక్టుల్లో వారికి ట్యూషన్లు చెప్పించాలని ఆదేశించారు. 100% ఫలితాల సాధన కోసం ఎస్సీ గురుకులాల్లో బోధనా పద్ధతులను కూడా సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించామని వివరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి కూడా పాల్గొన్నారు.

Madhurawada

2022-08-26 14:35:13

1.18లక్షల టన్నుల బియ్యం సేకరించాలి

పశ్చిమగోదావరి జిల్లాలో  మొత్తం 1.18 లక్షల టన్నుల బియ్యాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోపు సేకరించాలని జాయింట్ కలెక్టర్ జెవి.మురళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ సంబంధించిన అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జెసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2021-22 రబీలో సేకరించిన ధాన్యం నుంచి పౌరసరఫరాల సంస్థ 3.06 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించినట్టు పేర్కొన్నారు. అలా ఎఫ్ సి ఐ 1.50 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించాల్సి ఉండగా 32 వేల టన్నులు మాత్రమే సేకరించారు. మిగిలిన బియ్యాన్ని గడువులోగా సేకరించాలన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ డివిజనల్ మేనేజర్ కులదీప్ సింగ్ ,జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ టి .శివరామ ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని ఎన్ .సరోజ, సహాయ మేనేజర్ గణనాథ, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జయరాజు, కోశాధికారి కొత్త వెంకట శ్రీమన్నారాయణ, ఆకివీడు మండల అధ్యక్షులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-08-26 14:29:17

ఈ-క్రాప్ నమోదు గడువులోగా పూర్తిచేయాలి..

పశ్చిమగోదావరి జిల్లాలో ఈక్రాప్ నమోదు నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్   జెవి మురళి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్ లో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 5వ తేదీ లోగా ఈ క్రాప్ నమోదు పూర్తి చేయాలని ఆయన అన్నారు.  సి సి ఆర్ సి కార్డులు అర్హులైన కౌలు రైతులందరికీ నిర్నిత గడువులోగా ఇప్పించాలని,  పిఎం కిసాన్ లో అర్హులైన రైతులకు అందరికీ ఈ కేవైసీ చేయించాలని ఆయన ఆదేశించారు . విత్తనాలు ఎరువులు,  పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేసి నమూనాలు సేకరించి కల్తీ లేని నాణ్యమైన ఇన్పుట్స్ రైతులకు అందించాలని ఆయన ఆదేశించారు.  ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు జిల్లాలోని వ్యవసాయ సహాయ సంచాలకులు జిల్లాలో మండల వ్యవసాయ అధికారులు. అనంతరం  వ్యవసాయ సంచాలకుల గుంటూరు వారి కార్యాలయం నుండి వచ్చిన సంయుక్త వ్యవసాయ సంచాలకులు వి డి వి కృపా దాస్ సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం పై జిల్లా వ్యవసాయ అధికారులకు శిక్షణ కార్యక్రమం వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్వహించారు.

Bhimavaram

2022-08-26 14:23:48

వ్యవసాయ సమస్యలు పరిష్కారానికి చర్యలు

గ్రామస్ధాయిలో వ్యవసాయ సమస్యలు పరిష్కరించడం కోసమే వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించడం ముఖ్య ఉద్దేశ్యమని జాయింట్ కలెక్టర్ ల్పనా కుమారి అన్నారు. అనకాపల్లి కలెక్టరేట్  సమావేశ మందిరంలో శుక్రవారం  జిల్లాస్ధాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ,  గ్రామస్ధాయిలో రైతు భరోసా కేంద్రాల వివిధ సేవలు గ్రామస్ధాయిలోనే అందించడం జరుగుతుందన్నారు.  ఈ-క్రాప్ నమోదును  త్వరగ  పూర్తిచేయాలన్నారు.  పంట విక్రయంలో ఈ-క్రాప్ నమోదు ఎంతో కీలకమో ఆమె స్పష్టం చేశారు.  జిల్లాలో ఆయిల్ ఫామ్ మొక్కలకు సంబంధించి క్వారంటైన్ సర్టిఫికేషన్ అయిన పిదప  మొక్కలు పంపిణీ జరుగుతుందన్నారు.  అవసరమైన రైతులు తమ సమీప రైతు భరోసా కేంద్రంలో నిర్ధిష్ట ధరఖాస్తు, ఇతర డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.  ఏమైనా సమాచారం అవసరమైతే ఉధ్యానశాఖ అధికారి లేదా రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు.  మైక్రో ఇరిగేషన్స్ మంజూరుకు సంబంధించి అవసరమైన ప్రక్రియ జరుగుతున్నదన్నారు.  

రిజిస్ట్రేషన్ చేయించుకొనే రైతులు తమ పొలాలను సర్వేచేయించుకొని వాటికి చెల్లించవలసిన రైతు వాటా చెల్లించినట్లయితే మంజూరు చేసి ఆయా కంపెనీలు ద్వారా ఇన్సులేషన్ చేయించడం జరుగుతుందన్నారు. 1962 ఎమర్జెన్సీ వాహనం ద్వార పశువులకి అత్యవసర పరిస్థితిలో చికిత్స చేయడం జరుగుతుం దని , దీని గురించి రైతులకి అవగాహన కల్పించాలని ఆమె పశుసంవర్ధక అధికారిని ఆదేశించారు. ఈ- క్రాప్ బుకింగ్ పర్యవేక్షణ జాగ్రత్తగా చేయాలి. ఇందులో  నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.  ఈ సమావేశంలో గ్రామ, మండలస్ధాయిలో జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో వచ్చిన అంశాలపై సమీక్షించారు.  సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, వ్యవసాయ అధికారి లీలావతి, ,పశుసంవర్ధక అధికారి ప్రసాద్‌రావు, మత్స్యశాఖ లక్ష్మణరావు , పౌర సరఫరాల సంస్ధ డియం కె శ్రీలక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.  

Anakapalle

2022-08-26 14:09:45

అధిక ప్రయోజనాలకే సచివాలయ నిధులు

ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చే ప‌నుల‌కే, స‌చివాల‌య నిధుల‌ను కేటాయించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ప్ర‌తీ స‌చివాల‌యానికి ప్ర‌భుత్వం రూ.20ల‌క్ష‌లు కేటాయించింద‌ని, ఆ నిధుల‌తో, గ‌రిష్ట ల‌బ్ది చేకూర్చే ప్ర‌జోప‌యోగ ప‌నులను చేప‌ట్టాల‌ని సూచించారు. జిల్లా అధికారులు, ఆర్‌డిఓలు, మండ‌ల ప్ర‌త్యేకాధికారులు, ఎంపిడిఓలు, తాశీల్దార్లు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంఎల్ఓలు ఇత‌ర మండ‌ల స్థాయి అధికారుల‌తో, శుక్ర‌వారం సాయంత్రం ఆన్‌లైన్ కాన్ఫ‌రెన్స్ ద్వారా, వివిధ అభివృద్ది కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంపై ఆరా తీశారు.  స‌చివాల‌యాల‌కు వ‌చ్చిన నిధుల‌ను, వ్య‌క్తిగ‌త ప‌నుల‌కు కాకుండా, సామాజిక అవ‌స‌రాల‌కు వినియోగించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎంపిడిఓలు వ‌లంటీర్ల అటెండెన్స్‌పై దృష్టి పెట్టాల‌ని సూచించారు. జిల్లా అంత‌టా వ‌లంటీర్లు హాజ‌రు 50శాతం దాట‌క‌పోవ‌డంపై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. హాజ‌రుశాతం పెంచేందుకు త‌గిన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని ఆదేశించారు. పాఠ‌శాల‌ల ప‌రిస్థితిపై ఆరా తీశారు. ఐఆర్‌సిటిసి రిజిష్ట్రేష‌న్ల‌ను ప‌రిశీలించారు. త‌క్ష‌ణ‌మే రైల్వే టిక్కెట్ల బుకింగ్‌ను ప్రారంభించాల‌న్నారు. ఓటిఎస్ న‌గ‌దు వ‌సూళ్ల‌పై ప్ర‌శ్నించారు. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని ప్ర‌తిరోజూ త‌నిఖీ చేయాల‌ని ఆదేశించారు. జిల్లాలో 1783 పాఠ‌శాల‌లు ఉన్నాయ‌ని, జిల్లావ్యాప్తంగా ఉన్న 597 వెల్ఫేర్, ఎడ్యుకేష‌న‌ల్ అసిస్టెంట్లు ప్ర‌తిరోజూ పాఠ‌శాల‌ల‌కు వెళ్లి, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని ప‌రిశీలించాల‌ని సూచించారు. 

గృహ‌నిర్మాణ ప్ర‌గ‌తిలో ఈ వారం విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ వెనుక‌బ‌డి ఉంద‌న్నారు. నిర్మాణ సామ‌గ్రి, నిధుల కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు. గృహ‌నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని కోరారు.  జిల్లాలో గ‌త రెండుమూడు రోజులుగా స‌చివాల‌యాలు, ఆర్‌బికెలు, వెల్‌నెస్ సెంట‌ర్ల భ‌వ‌నాల నిర్మాణం ఎక్కువ సంఖ్య‌లో ప్రారంభించినందుకు అభినందించారు. డిజిట‌ల్ లైబ్ర‌రీల నిర్మాణంపైనా దృష్టి పెట్టాల‌ని సూచించారు. ఎంపిడిఓలు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌ల‌కు ముమ్మ‌రం చేసినందుకు అభినందించారు. చిట్టిగురువులు కార్య‌క్ర‌మంలో ప్ర‌తీఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని, ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మంపై సంతృప్తిని వ్య‌క్తం చేశారు. లేఅవుట్ల‌లో 5 శాతం స్థ‌లాన్నిప్ర‌భుత్వానికి కేటాయించాల్సి ఉంద‌ని, ఈ స్థ‌లంలో ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం క్రింద పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను మంజూరు చేయాల‌ని ఆదేశించారు. ప్లాస్టిక్ నిషేదాన్ని సంపూర్ణంగా అమ‌లు చేసేందుకు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ కోరారు. ఈ కాన్ఫ‌రెన్స్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-26 14:01:44

ప్రణాళికా బద్ధంగా ఈ-క్రాప్ నమోదు జరగాలి

ప్రభుత్వ విధి విధానాలను అనుగుణంగా ఈ క్రాప్  నమోదు చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం అభ్యంతరకరమైన భూములను నమోదు చేయకూడదని అన్నారు.   ఈ విషయం పై తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కలిగించాలన్నారు.  కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చైర్మన్ మాట్లాడుతూ  వెబ్ ల్యాండ్ లో ఉన్న భూమికి ముందుగా ఈ క్రాప్ నమోదు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకానికి అనుసంధానం చేయనున్న దృష్ట్యా సెప్టెంబర్ లోగా ఈ క్రాప్ నమోదు, ఈ.కె.వై.సి లను పూర్తి చేయాలన్నారు.  ఎరువులకు సంబంధించి డి.ఏ.పి సరఫరా తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని,  రైతుకు తగు సలహాలను   అందిస్తూ సహకరించాలని జిల్లా వ్యవసాయాధికారి తారక రామారావు కు  సూచించారు.  వరి, మొక్క జొన్న పంటల స్థానంలో అరటి సాగు పై అవగాహన పెంచి రైతులకు ప్రోత్సహించాలని చైర్మన్ సూచించారు. అరటి సాగు కోసం   సాయిల్ టెస్ట్ చేసి, భూగర్భ నీటిని పరీక్షించి మండలం వారీగా డాటా సిద్ధం చేయాలన్నారు. 

 జిల్లా కలెక్టర్ సూర్య కుమారి మాట్లాడుతూ అదనపు ఎరువుల కోసం డి.ఓ లేఖ రాయాలని మార్కుఫెడ్ డి.ఎం కు సూచించారు. ఎరువుల లభ్యత, ఈ క్రాప్ నమోదు నిబంధనలు ఆర్.బి.కె వరకూ చేరాలని , జిల్లా స్థాయి నుండి వ్యవసాయాధికారి పర్యవేక్షించాలని తెలిపారు. ఎరువులు, సి.హెచ్.సి రుణాల పై ఆడిట్ జరగాలని సూచించారు. ఈ సమావేశం జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగింది సమావేశంలో ఎం.ఎల్.సి రఘురాజు, శాసన సభ్యులు కంబాల జోగులు, జె.సి మయూర్ అశోక్, డి.సి.ఎం.ఎస్ చైర్పర్సన్ డా.భావన, కమిటీ  సభ్యులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

11వ వ్యవసాయ గణన కు జిల్లా కమిటీ ఏర్పాటు..
వ్యవసాయం లో వస్తున్న మార్పులను,  భూ కమతాల వివరాలను, విస్తీర్ణం, పంటల సాగు, మహిళా రైతులు, కౌలు రైతులు, పంటల విధానం, రైతులు వాడే ఎరువులు, విత్తనాలు,  రుణాల పద్ధతి తదితర  వివరాలను వ్యవసాయ గణన లో భాగంగా  సేకరించడం జరుగుతుందని సి.పి.ఓ బాలాజీ వివరించారు.  ఇందుకోసం జిల్లా స్థాయి  కమిటీ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే ఈ కమిటీ లో వ్యవసాయ, అనుబంధ శాఖలు, రెవిన్యూ శాఖల అధికారులు సభ్యులుగా  ఉన్నారని తెలిపారు. త్వరలో వ్యవసాయ   గణన కార్యక్రమం జరుగుతుందన్నారు.

Vizianagaram

2022-08-26 13:37:26

సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు

వ్యవసాయ, ఆక్వా రంగాలలో సమస్యలపై శాశ్వత పరిష్కారానికి  ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశం మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి  సమావేశం జిల్లా అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఉపాధ్యక్షులు శ్రీమతి పి ప్రశాంతి మాట్లాడుతూ గ్రామ, మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకుని జిల్లా స్థాయిలో చర్చించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు.  ప్రతి సంవత్సరం ఖరీఫ్, రభీ పంటకాలాల్లో తప్పనిసరిగా ఈ క్రాప్ ద్వారా రైతులు తమ పంటలను నమోదు చేసుకోవాలన్నారు.  పకృతి  వైపరీత్యాలు,  దాన్యం కొనుగోలు, రాయతీపై విత్తనాలు, సున్నా వడ్డీ పంటల రుణాలు, పంటల బీమా, ఎరువులు, పురుగు మందుల సబ్సిడీ ఈ క్రాప్ డేటా ద్వారానే రైతులు పొందగలరన్నారు.  ఇదే విధానం ఆక్వా, ఉద్యానవన పంటలకు కూడా అమలు జరుగుతుందన్నారు. ఈ క్రాపు నమోదులో  వ్యవసాయ అధికారులతో పాటు రైతులు కూడా అంతే బాధ్యత ఉండాలన్నారు. ఈ కాప్ నమోదుకు సెప్టెంబర్ 5ను  చివరి తేదీగా ప్రకటించడం జరిగిందన్నారు.  

ఎలుకల నివారణకు రైతులు భాగస్వామ్యంతో చర్యలు చేపట్టినట్టు తెలిపారు.  ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటివరకు 92 శాతం నగదు జమచేయడం జరిగిందని, ఒక వారం లోపుగా మిగిలిన  రూ.80  కోట్లను రైతులు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. డ్రైయిన్ లలో  పూడికతీత పనులు చేపట్టడం జరిగిందన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు  ప్రభుత్వ చీఫ్ విప్ సహకారంతో డ్రెయిన్లుపై  అక్రమణలను తొలగించడం జరిగిందన్నారు.  ప్రస్తుతం ఆక్వాజోన్ ప్రకారం సర్వే నంబర్లు రీకన్సిలేషన్ చేయడం జరుగుతుందన్నారు.  ఆక్వా జోన్ పరిధిలో లేని చెరువుల గుర్తింపుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, నిబంధనలకు అనునుగుణంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు కైగాల శ్రీనివాసరావు మాట్లాడుతూ 2922 జూలై  నెలలో కురిసిన అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీపై 1,518 క్వింటాళ్ల వరి విత్తనాలను అందజేయడం జరిగిందన్నారు.  ధాన్యం కొనుగోలు నిమిత్తం 68,604 మంది రైతులకు రూ.1,212 కోట్లును వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు.  సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం ఆగస్టు 27న (నేడు) చేపట్టడం జరిగిందని రైతులందరూ సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ వరద ముంపు నివారణకు అత్యవసరంగా స్లూయిజ్, డ్రైన్స్ రిపేర్లు చేయించాల్సి ఉందన్నారు. ఎక్కడెక్కడ ఏయే పనులు చేపట్టాలో గుర్తించి  ప్రస్తుతం తాత్కాలిక పనులను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు.  ఇంకా డ్రైన్ల పై ఆక్రమణలను గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి సూచించారు.  కాళీపట్నంలో అన్ సెటిల్డ్ భూములు, దర్భరేవులోని ప్రభుత్వ భూములలో పదివేల ఎకరాల్లో చెరువుల సాగుఅవుతున్నాయని, ఆక్వా జోన్ పరిధిలో లేనందున కరెంటు సబ్సిడీ కోల్పోతున్నారని తెలిపారు. వీటిని క్రమబద్ధీకరించినందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కోరారు.

పలువురు వ్యవసాయ సలహా మండలి సభ్యులు మాట్లాడుతూ చిన్న చిన్న రైతులు అందరూ కలిసి ఒకే చెరువుగా సాగు చేయడం వలన  విద్యుత్ సబ్సిడీని కోల్పోతున్నరని, రైతు ఎన్ టైటిల్మెంట్  చూసి విద్యుత్ అధికారులు నమోదు చేస్తే ఇబ్బంది తొలగుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత రైతు ఎన్ టైటిల్మెంట్ ప్రకారం నమోదు చేయాలని విద్యుత్ అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యవసాయ సలహా మండల సమావేశంలో సభ్యులు సంఘాని వడ్డికాసులు,  కొట్టి కుటుంబరావు, పి.డి ప్రసాద్ రాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి కె.ఎస్.వి నాగలింగాచార్యులు, జిల్లా వాటర్ రిసోర్స్ అధికారి పి.నాగార్జున రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ టి. శివరామ ప్రసాద్, డీఎస్ఓ ఎం. సరోజ, భీమవరం డిటిసి జి. రామలింగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-08-26 13:34:27

కొండ శిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం

కొండ శిఖర , మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారుల నిర్మాణం చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరు మండలం నందా - పగులుచిన్నూరు రోడ్ నుంచి చోర గ్రామం మీదుగా కొదమ వరకు అర్.సి.పి.ఎల్.డబ్ల్యు.ఇ నిధులు అంచనా వ్యయం రూ.11.36 కోట్లతో సుమారు 10.8 కిలోమీటర్ల మేర బిటి రోడ్ నిర్మాణానికి జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమక్షంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర శుక్ర వారం శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైదానం ప్రాంతం వలే కొండ శిఖర, మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారులు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గిరిజనులు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి అమితమైన ప్రేమ అని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులు ఎక్కడా జాప్యం లేకుండా చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. యువకులు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. కొండ ప్రాంతంలో గ్రామ సచివాలయాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు. 

కొన్ని రహదారి పనులు ఫారెస్ట్ అనుమతుల కోసం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే వాటిని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన గిరిజనులకు అటవిహక్కు భూపట్టాలను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. వైద్యం, విద్య సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తుద్ధితో పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. గ్రామానికి రహదారులు కల్పించాలన్న  ఎన్నో దశాబ్దాల గిరిజనుల కల సాకారం అవుతోందని పేర్కొన్నారు.  జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ మారు మూల ప్రాంతాల అభివృద్ధిని ప్రభుత్వం ఆకాక్షిస్తుందన్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడాలని తద్వారా అభివృద్ధి కానవస్తుంది చెప్పారు. జిల్లా పరిషత్ నుండి తాగు నీరు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పనకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పేదలకు అండగా ఉండే ప్రభుత్వ పాలన సాగుతోందని ఆయన చెప్పారు. 

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 
మాట్లాడుతూ కొదమ రహదారికి అనుసంధానం చేస్తూ 22 గ్రామాలకు రహదారులు నిర్మించుటకు చర్యలు చేపడుతున్నామన్నారు. తద్వారా రెండు వేల జనాభాకు చక్కని రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రూ.180 కోట్లతో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలకు రహదారుల సౌకర్యానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆయన వివరించారు. రహదారుల నిర్మాణం వలన సామాజిక, ఆర్థిక అభివృద్ధి వస్తుందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెడ్డి పద్మావతి, మక్కువ జెడ్ పిటిసి డి. శ్రీనివాస రావు, కొదమ ఎంపిటిసి, సర్పంచ్ లు కూనేటి గిందే, తాడంగి సుసుమ,  పంచాయితి రాజ్ ఈ ఈ డా,ఎమ్.వి.జె. కృష్ణాజి,  గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ ఈ ఓ.ప్రభాకర రావు, డ్వామా పథక సంచాలకులు కె.రామచంద్ర రావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి జె.శాంతిశ్వర రావు, తాసిల్దార్ రామ స్వామి, ఎమ్ పి డి ఓ పి.పార్వతీ, తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-08-26 13:19:25

మంత్రి మెరుగు నాగార్జున జిల్లాకు రాక

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మెరుగు నాగార్జున ఈ నెల 27వ తేదీ శనివారం మధ్యాహ్నం జిల్లాకు వస్తున్నారు. ఆరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు నగరంలోని జెడ్పీ అతిథి గృహానికి చేరుకొని మధ్యాహ్నం 4.00 గంటలకు డి.ఎస్.డబ్ల్యు.ఓ., ఇ.డి., ఎస్.సి.కార్పొరేషన్, జిల్లా అంబేడ్కర్ గురుకులాల సమన్వయ అధికారులతో జెడ్పీ అతిథి గృహంలో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 7 వరకు నగరంలోని ఎస్.సి.లబ్దిదారులకు మంజూరు చేసిన యూనిట్లను, వారికి కేటాయించిన షాపింగ్ కాంప్లెక్స్ లను, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ను పరిశీలిస్తారు. సాయంత్రం 7 గంటలకు విశాఖ బయలుదేరి వెళ్లనున్నారు.

Vizianagaram

2022-08-26 13:14:27

ఆర్.బి.కే స్థాయిలో సమావేశాలు జరగాలి

రైతు భరోసా కేంద్రాల స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశం విధిగా జరగాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వాకాడ నాగేశ్వర రావు అన్నారు. జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. నెలలో మొదటి శుక్ర వారం ఆర్.బి.కె స్థాయిలో, రెండవ శుక్ర వారం మండల స్థాయిలో జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ కు బిందు సేద్యం అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ పంట మార్పిడి విధానంపై రైతులను చైతన్య పరచాలని చెప్పారు. వన్ ధన్ కేంద్రాల ద్వారా పంటలకు కొంత సహాయ సహకారాలు అందించుటకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ ఏడాది ధాన్యం సేకరణలో సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఎరువుల విక్రయంలో అవకతవలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఏనుగుల వలన కలుగుతున్న పంట నష్టానికి తగిన పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ, మండల స్థాయిలో సలహా మండలి సమావేశం పక్కాగా జరగాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో అన్ని గ్రామాలకు సబ్సిడీ ఒకే విధంగా ఉండాలని ఆమె కోరారు. ధాన్యం సేకరణలో సమస్యలు లేకుండా చూడాలని ఆమె అన్నారు. రైతులకు సెరీకల్చర్ దిశగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. 

జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్ మాట్లాడుతూ జిల్లాలో ఇ పంట నమోదు 56 వేల ఎకరాలలో జరిగిందన్నారు. సెప్టెంబరు 10 వరకు నమోదుకు గడువు ఉందని చెప్పారు. రోజుకు 50 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. జిల్లాలో 2,31,324 లక్షల ఎకరాల  వ్యవసాయ భూమి, 99,905 ఎకరాల ఉద్యాన పంటల భూమి వెరసి 3,31,226 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,87,784 ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉందన్నారు. ఖరీఫ్ సీజన్ లో 22,759 క్వింటాళ్ల వరి, 1902 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ జరుగుతుందని తెలిపారు. 48,700 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేయుట లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 36,915 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఎరువులు అక్రమంగా విక్రయించే వారిపైన, ఎక్కువ ధరలకు విక్రయించే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. అక్రమాలపై వచ్చే పిర్యాధులపై విచారణ చేస్తామని ఆయన చెప్పారు. కిసాన్ డ్రోన్లను మండలానికి మూడు చొప్పున మంజూరు అయ్యాయని, ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హత కలిగిన అభ్యర్థులు పైలట్ శిక్షణకు దరఖాస్తు చేయవచ్చని ఆయన వివరించారు. 

సలహా మండలి సభ్యులు పారి నాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏనుగుల వ్యవహారాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని, వాటి వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇతర సభ్యులు మాట్లాడుతూ పాలకొండలో గతంలో సొసైటీకి వెళ్లి ఎరువులు తీసుకునే వారమని, అదే విధానం కొనసాగితే మంచిదని కోరారు. ఈ సలహా మండలి సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య, ఇపిడిసిఎల్ డిఇ కె. వెంకట రత్నం, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి. నాయక్, జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-26 13:11:13

మందస ఎం.ఇ.ఓ కి షోకాజ్ నోటీస్ జారీ

కన్సిస్టెంట్  రిధం పనులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి, పనుల నిర్వహణపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అని జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లాలో నిర్వహిస్తున్న కన్సిస్టెంట్  రిధం పనుల పురోగతిపై నందిగాం, సంతబొమ్మాళి, మందస, సోంపేట , రణస్థలం మండలం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎ.ఎన్.ఎం, మహిళా పోలీసులు తమ పరిధిలో ఉన్న పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన పరిశీలించి కన్సిస్టెంట్  రిధం యాప్లో అప్లోడ్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అందు నిమిత్తం పాఠశాల నిధుల నుండి గాని గ్రామ పంచాయతీ నిధుల నుండి పరిష్కరించాలని. మీ స్థాయిలో పరిష్కారం కానీ పనుల పరిష్కారానికి పై అధికారులకు పంపించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తే ఫలితాలు ఉంటాయన్నారు. నేటికీ చేట్టిన పనులపై పాఠశాలల వారీగా నివేదికలు చూపించాలని అదేశించారు. పనుల నిర్వహణపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు. అలాగే పనుల నిర్వహణలో అత్యధిక పెండెన్సి శ్రీకాకుళం జిల్లా ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణలో పురోగతి చూపని మందస ఎం.ఇ.ఓ కి షోకాజ్ నోటీస్ జారీ చేయమని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా పరిషత్ సి.ఇ ఓ వెంకటరమణ, నందిగాం, సంతబొమ్మాళి, మందస, సోంపేట, రణస్థలం, హిరమండలం మండలాల ఎం.పి డి.ఓ లు, మండల విద్యాశాఖాధికారులు హాజరయ్యారు.

Srikakulam

2022-08-26 12:49:44

నిస్వార్ధ సేవకు ప్రతిరూపం మదర్ థెరిస్సా

నిస్వార్ధ సేవకు, మానవత్వపు విలువలకు ప్రతిరూపంగా మదర్ థెరిస్సా నిలుస్తారని జిల్లా ఫారెస్ట్ అధికారి నరేంధ్రన్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో కొలువుదీరిన మదర్ థెరిస్సా 112వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మదర్ థెరిస్సా విగ్రహానికి డిఎఫ్ఓ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జీవితాన్ని అనాధలు, చిన్నారులు సేవకు అంకితమిచ్చిన మహనీయురాలు మదర్ థెరిస్సా అన్నారు. విదేశాల్లో జన్మించి భారతదేశంలో ఆపన్నుల సేవకు తపించిన మానవతామూర్తిగా ఆమె పేరుగాంచారని డిఎఫ్ ఓ తెలిపారు. ప్రేమ, దయ, సేవ మనిషి జీవిన విధానంగా మలుచుకోవడమే నిజమైన నివాళి అని నరేంధ్రన్ అన్నారు. భావితరాలకు సేవ, మానవత్వం
పెంపొందించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని గాంధీ మందిరం నిర్వాహకులు నటుకుల మోహన్ డిఎఫఓ కు వివరించారు. అనంతరం శ్రీకాకుళం నగరంలోని మదర్ థెరిస్సా హోమ్ ఆశ్రయం పొందుతున్నవారి కోసం రూ.15 వేలు విలువచేసే నిత్యావసర సరుకులను డిఎఫ్ ఓ తన తరపున అందజేశారు. గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు డిఎఫ్ ఓ ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జామి భీమశంకర్, నటుకుల మోహన్, పొన్నాడ రవికుమార్, బాఠాన దేవభూషణ్, జీఎన్ జ్యూయలరీ అధినేత గుడ్ల శ్యామ్, మెట్ట అనంతంభట్లు, నక్క శంకరరావు, నక్క గౌరీశంకరరావు, గుత్తు చిన్నారావు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2022-08-26 06:35:19